jantar mantar suicide
-
ఇంతకీ ఈ కేసు ఎవరు దర్యాప్తు చేయాలి?
న్యూఢిల్లీ: దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు 'మీరంటే మీరు కారణం' అంటూ ఓ పక్క రాజకీయ పార్టీలు కొట్టుకు చస్తుంటే మరోపక్క కేసును ఎవరు దర్యాప్తు చేయాలి ? ఎవరిదా అధికారం ? అన్న అంశంలో జిల్లా మేజిస్ట్రేట్, ఢిల్లీ పోలీసు అధికారులు సంఘర్షణ పడుతున్నారు. ఒకవేళ జిల్లా మేజిస్ట్రేటే దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తే అది పోలీసు అధికారుల దర్యాప్తులో వెలువడిన అంశాలకు భిన్నంగా ఉంటే అనవసర గందరగోళానికి దారితీస్తుందని, పైగా కోర్టు ముందు అభాసుపాలు కావాల్సి వస్తుందని సీనియర్ ఐపీఎస్ అధికారులు, మాజీ పోలీసు కమిషనర్లు వాదిస్తున్నారు. ఇప్పటికే కేసుపై జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. ఈ కేసు మీ పరిధిలోకి రాదంటూ ఢిల్లీ పోలీసు అధికారులు జిల్లా మేజిస్ట్రేట్కు తెలియజేయడంతో వివాదం మొదలైంది. కేసు దర్యాప్తును ఇప్పటికే చేపట్టిన జిల్లా మేజిస్ట్రేట్ సంఘటనకు సంబంధించిన ఆధారాలు, సమాచారం ఏదైనా ఉంటే తనకు సమర్పించాల్సిందిగా ప్రజలను కోరారు. అలాగే టీవీ ఫుటేజ్లు సమర్పించాల్సిందిగా టీవీ చానళ్లను ఆదేశించారు. అంతేకాకుండా శుక్రవారంలోగా ప్రాథమిక దర్యాప్తు వివరాలను సమర్పించాల్సిందిగా ఢిల్లీ పోలీసు అధికారులను కూడా ఆదేశించారు. తన ఆదేశాలను ధిక్కరిస్తే న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటానని వారిని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తు తమ పరిధిలోకి వస్తుందని వాదిస్తున్న ఢిల్లీ పోలీసు అధికారులు మేజిస్ట్రేట్ ఆదేశాలను ఖాతరు చేయలేదు. వారికిచ్చిన గడువుకు కూడా తీరిపోవడంతో న్యాయపరంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఓపక్క కేసును మేజిస్ట్రేట్ దర్యాప్తు చేస్తుంటే అది తమ దర్యాప్తుకేమీ అడ్డంకాదని, అయితే పరస్పర భిన్నంగా దర్యాప్తు నివేదిలుంటేనే గందరగోళం అవుతుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్ క్రైమ్బ్రాంచి అధికారి మీడియాకు తెలిపారు. 2014లో ఢిల్లీ నగరంలో 7,545 అసహజ మరణాలు సంభవించాయని, ఇందులో వేటిలోనూ జిల్లా మేజిస్ట్రేట్ స్వయంగా దర్యాప్తునకు ఆదేశించలేదని ఆయన తెలిపారు. అలాంటిది ఈ కేసులో మాత్రం ఎందుకు అంతగట్టిగా పంతం పడుతున్నరన్నది అర్థం కావడం లేదన్నది ఆయన ఆవేదన.పెళ్లైన ఏడేళ్లలోపు మహిళలెవరైనా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తేనే జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తు అవసరమవుతుందని సీనియర్ పోలీసు అధికారులు వాదిస్తున్నారు. ఇలాంటి కే సుల విచారణలో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, గోప్యత అవసరమని, చట్టాల ప్రకారమే అన్ని విభాగాలు పనిచేయాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. ప్రాథమిక పోస్టుమార్టమ్ నివేదిక ప్రకారం ఉరివేసుకోవడం వల్లనే గజేంద్ర సింగ్ చనిపోయినట్టు తెలుస్తోందని ఆయన చెప్పారు. భారతీయ శిక్షాస్మృతిలోని 174(1), 176(1) సెక్షన్ల ప్రకారం ఏ కేసులోనైనా జిల్లా మేజిస్ట్రేట్ జోక్యం చేసుకోవచ్చని, ఏ అధికారినైనా పిలిపించి దర్యాప్తునకు ఆదేశించవచ్చని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల వాదన ఎలా ఉన్నా, ప్రస్తుత కేసులో సంఘర్శణకు కారణం ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ పోలీసులు కేంద్రం పరిధిలో పని చేస్తుండడం, జిల్లా మేజిస్ట్రేట్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తుండడం తెల్సిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, రాష్ట్రంలో ఆప్ అధికారులో ఉండడం వల్ల అటు రాజకీయంగా మొదలైన రగడ ఇటు ప్రభుత్వ విభాగాల మధ్య సంఘర్షణకు కూడా దారితీసింది. -
క్లింటన్కే తలపాగా చుట్టిన గజేంద్రుడు!
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆత్మహత్య చేసుకున్న రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి. దీంతో గజేంద్ర సింగ్ ఎవరు? నిజంగా రైతేనా, అకాలవర్షాల కారణంగా ఆయన పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడా? అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా?....ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునేందుకు జాతీయ మీడియా యావత్తు రాజస్థాన్లోని దౌసా గ్రామానికి దౌడ్ తీసింది. సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కే తలపాగా చుట్టిన చరిత్ర గజేంద్రసింగ్కు ఉంది. దీంతోపాటు.. ఆయన స్వగ్రామంలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యపానానికి, వరకట్నానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్న గజేంద్ర సింగ్కు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. బీజేపీతో మొదలైన ఆయన రాజకీయాలు, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మీదుగా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరుకున్నాయి. ఇప్పుడు ఆ పార్టీలే ఆ రైతు ఆత్మహత్య పట్ల పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. దౌసా గ్రామస్థుల కథనం ప్రకారం: గజేంద్ర సింగ్ 2003లో బీజేపీలో చేరారు. తహసిల్లో జరిగిన పలు పార్టీ సభలూ, సమావేశాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ టెక్కెట్ ఆశించి భంగపడ్డాడు. దాంతో సమాజ్వాదీ పార్టీ టెక్కెట్పై అసెంబ్లీకి పోటీచేశాడు. బీజేపీ అభ్యర్థి అల్కాసింగ్ చేతుల్లో ఓడిపోయాడు. 2013 వరకు ఆయన ఆ పార్టీలోనే కొనసాగి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర సమితి క్రియాశీలక సభ్యుడిగా కొనసాగాడు. తర్వాత అసెంబ్లీ టిక్కెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ పార్టీలో టిక్కెట్ రాకపోవడంతో చివరకు ఆమ్ ఆద్మీని ఆశ్రయించాడు. గజేంద్ర సింగ్ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. ఆయనది విశాలమైన పక్కా భవంతి. దాదాపు 8 ఎకరాల వ్యవసాయ భూమి. జామ, ఉసిరి తోట ఉంది. ఇంటి ఎదురుగానే టేకు వనం ఉంది. ఇటీవలి అకాల వర్షాల వల్ల గోధుమ, ఆవాల పంట నాశనం అయింది. ఆ పంట నష్టం కూడా 25 శాతానికి మించి ఉండదని జిల్లా అధికారులు తెలిపారు. గజేంద్రకు 12వ తరగతి చదువుతున్న ఒ ఆడపిల్ల, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆత్మహత్య చేసుకునేంత మనోదౌర్బల్యం కూడా లేదు. పది మందికీ సహాయం చేసే మంచి గుణం కూడా ఉంది. ఆయన వ్యవసాయాన్ని కూడా అంతగా పట్టించుకునేవాడు కాదట. జైపూర్లో పర్యాటకులకు రాజస్థాన్ సంప్రదాయ తలపాగా చుట్టడమే పనిగా పెట్టుకొని అలా వచ్చే డబ్బులతో అక్కడే ఎక్కువకాలం జీవించేవాడు. కేవలం 20 సెకడ్లలో తలపాగా చుట్టే నేర్పరిగా పేరు తెచ్చుకున్న గజేంద్ర రాజస్థాన్ సాంస్కృతిక శాఖ నుంచి 'మిస్టర్ డిసర్ట్' అనే టైటిల్ కూడా అందుకున్నారు. బిల్ క్లింటన్ 2000 సంవత్సరంలో రాజస్థాన్లో పర్యటించినప్పుడు ఆయనకు తలపాగా చుట్టారు. ఇంకా పలువురు విదేశీ నేతలకు తలపాగా చుట్టిన ఆయన గతంలో వాజపేయి, ఇటీవల కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు కూడా తలపాగా చుట్టిన ఫొటోలను ఆయన మిత్రులు చూపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా కృషిచేస్తానని ఢిల్లీ వెళ్లేముందు గ్రామస్థులకు మాట ఇచ్చాడట. కేజ్రీవాల్ను స్వయంగా కలుసుకునేందుకు మూడు రోజులు ముందుగానే ఢిల్లీ వెళుతున్నానని చెప్పాడని ఆయన మేనల్లుడు అమిత్ సింగ్ తెలిపాడు. జంతర్ మంతర్ వద్ద చెట్టెక్కి టీవీలను ఆకర్షించినప్పుడు 'చూస్కో నేను టీవీలో కనిపిస్తున్నాను' అని తనకు ఫోన్చేసి చెప్పాడని ఆయన తమ్ముడు విజేంద్ర సింగ్ తెలిపాడు. ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా కుటుంబ సమస్యలు ఉన్నాయని, పలుసార్లు ఇల్లు విడిచి వెళ్లి పోవాలనుకున్నాడని కొంత మంది గ్రామస్థులు తెలిపారు. ఏదేమైనా ఆత్మహత్య చేసుకునే బలహీనుడు మాత్రం గజేంద్రసింగ్ కాడని గ్రామస్థులు ఏకమాటగా చెప్పారు. దీంతో ప్రమాదవశాత్తు ఆయన చెట్టుమీది నుంచి జారిపడ్డాడా? అనే కొత్త ప్రశ్న పుట్టుకొచ్చింది. ఈ దిశగా కూడా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.