breaking news
Khammam Corporation elections
-
మున్సి‘పోరు’: టీఆర్ఎస్ సరికొత్త రాజకీయం
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా, సోమవారం పరిశీలన కూడా పూర్తయింది. అయితే సిద్దిపేట మున్సిపాలిటీ మినహా ఎన్నికలు జరుగుతున్న రెండు కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. కానీ డివిజన్లు, వార్డుల్లో టికెట్లు ఆశిస్తూ పెద్ద సంఖ్యలో ఆశావహులు పార్టీ పక్షాన నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్న టీఆర్ఎస్.. అభ్యర్థుల ప్రకటనలో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఈ నెల 22న ఉపసంహరణ ప్రక్రియ ముగియనుండగా.. డివిజన్లు, వార్డులవారీగా ఏకాభిప్రాయ సాధన తర్వాతే చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించి, బీ ఫామ్లు అందజేయాలని నిర్ణయించింది. కొన్నిచోట్ల అభ్యర్థులు ఎవరనే అంశంపై ఇప్పటికే స్పష్టత ఉన్నా, పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ నామినేషన్లు వేసిన ఇతరులు ఉపసంహరించుకున్న తర్వాతే బీ ఫామ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈలోపు అంతర్గత ప్రచారం నిర్వహించుకోవాల్సిందిగా సూచించింది. వలసలు నివారించేందుకే.. నామినేషన్ల దాఖలు గడువుకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తే అవకాశం దక్కని ఆశావహులు ఇతర పార్టీల్లో చేరి ప్రత్యర్థులుగా నిలిచే అవకాశముందని టీఆర్ఎస్ భావించింది. కొందరు రెబల్స్గా మారి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగినా నష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు మాత్రమే బలమైన అభ్యర్థులకు బీ ఫామ్లు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. వలసలకు, రెబల్స్కు తావులేకుండా అన్ని అస్త్రాలు ప్రయోగించడం ద్వారా ఏకాభిప్రాయ సాధన కోసం కసరత్తు జరుగుతోంది. ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరైనా బరిలో ఉంటే వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించింది. సిద్దిపేటలో కొందరు అభ్యర్థులు ఖరారు ఆర్థిక మంత్రి హరీష్రావు ప్రాతినిథ్యం వహిçస్తున్న సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో 43 వార్డులు ఉండగా, నామినేషన్ల దాఖలు గడువులోగా 18 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సోమవారం మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. మిగతా వార్డుల్లోనూ ఏకాభిప్రాయం సాధించి విడతల వారీగా జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. ఖరారైన అభ్యర్థులకు గురువారం బీ ఫామ్లు జారీ చేస్తామని ప్రకటించారు. ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు ఖమ్మం కార్పొరేషన్లో మంత్రి పువ్వాడ అజయ్. సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీష్రావు, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అయితే వరంగల్ కార్పొరేషన్తో పాటు అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరులో మాత్రం సంబంధిత జిల్లా మంత్రుల పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థుల జాబితాను వడపోస్తున్నారు. ఒక్కో వార్డు నుంచి సగటున ముగ్గురు చొప్పున టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించేందుకు సమయం పడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఖమ్మం ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లు
హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల పనితీరుకు సంబంధించి పలు అనుమానాలు, ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపధ్యంలో ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ప్రయోగాత్మకంగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో 35 డివిజన్లలో ప్రింటర్లతో కూడిన ఏవీఎంల ద్వారా ఓటింగ్ అమలు చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఈవీఎంలలో ఓటర్లు ఓటు వేయగానే రశీదులు వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. -
ఖమ్మం ఎన్నికలంటేనే ప్రభుత్వానికి వణుకు
♦ ప్రజాసమస్యలు పక్కనపెట్టి ఫిరాయింపులకు ప్రోత్సాహం ♦ ఓటమి భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో తిష్ట ♦ కార్పొరేషన్లో కాంగ్రెస్ విజయంతో కేసీఆర్ కళ్లు తెరవాలి ♦ విలేకరుల సమావేశంలో గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ ఖమ్మం: ‘ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు అంటేనే సీఎం కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీకి వణుకు పుడుతోంది. ప్రజలను బలవంతపెట్టి, భయపెట్టి..లొంగదీసుకోవడమే టీఆర్ఎస్ నాయకుల పనిగా మారింది..’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్, ఆయన మంత్రి వర్గానికి ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్ఎస్ను ఓడించేందుకు ఖమ్మం ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. ఓటమి భయంతోనే ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఖమ్మంలో తిష్టవేశారన్నారు. పోటీలో ఉన్న ఇతర పార్టీల నాయకుల ఇళ్లకు వెళ్లి రాత్రిళ్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బెదిరిస్తే పార్టీలోకి వచ్చిన వారు ఎంతకాలం ఉంటారని ప్రశ్నించారు. ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దిగజారుడు రాజకీయాలు చేయడం కేసీఆర్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో కూడా అభ్యర్థులను బెదిరించి, నామినేషన్ ఉపసంహరించుకుంటే రూ. 25 లక్షలు ఇస్తామని ఆశపెట్టారని ఆరోపించారు. నిరంకుశ పోకడల నుంచి కేసీఆర్ కు కనువిప్పు కలగాలంటే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఖమ్మం నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొల్లు పద్మ, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.