Maneuverable warships
-
ఆకాశంలో ట్రాఫిక్ జామ్!
-
ఆకాశంలో ట్రాఫిక్ జామ్!
* విశాఖలో ఫ్లీట్ రివ్యూ ప్రభావం * ల్యాండింగ్కు అనుమతి లేక విమానాల చక్కర్లు * ఆ క్రమంలో ఎదురుపడిన మూడు విమానాలు గోపాలపట్నం (విశాఖపట్నం): రోడ్డు మీదే కాదు.. ఆకాశంలోనూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రమాదాలు జరిగే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా..? మన విశాఖలోనే. దీనికి కారణం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ ప్రభావమేనని తెలుస్తోంది. ఫ్లీట్ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయానికి వచ్చే విమానాలను ఇప్పటికే నియంత్రించారు. అలాగే విన్యాసాల రిహార్సల్స్ జరుగుతున్న సమయాల్లో కొన్ని విమానాల రాకపోకలు నిలిపివేయడం.. మరికొన్నింటిని దారి మళ్లించడం చేస్తున్నా విమానాల ల్యాండింగ్ సమయంలో ఉత్కంఠ నెలకొం టోంది. ఈ క్రమంలో గురువారం మూడు విమానాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఆందోళన చెందారు. పరిస్థితి అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. నేవీ విన్యాసాల దృష్ట్యా విశాఖ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకూ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగింది. దీంతో సాయంత్రం 5 గంటలకు విశాఖకు రావలసిన ఎయిరిండియా విమానం రాత్రి 7 గంటలకు రన్వేపై ల్యాండైంది. అంతకుముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు రాకపోవడంతో ఈ విమానం ఎస్.కోట మీదుగా చక్కర్లు కొట్టింది. అలాగే సాయంత్రం 4.20కి హైదరాబాద్ నుంచి విశాఖకు రావాల్సిన ఇండిగో విమానం రాత్రి 7.05కి చేరింది. ఈ విమానం కూడా యలమంచిలి వైపు సుమారు నలభై నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. మరోవైపు హైదరాబాద్ నుంచి రాత్రి 7.10కి విశాఖకు చేరిన మరో ఇండిగో విమానం కూడా అరగంట సేపు చక్కర్లు కొట్టింది. ఇలా చక్కర్లు కొట్టే క్రమంలో ఈ మూడు విమానాలూ ఒకదానికొకటి ఎదురుపడ్డాయని సమాచారం. అధికారులు బయటకు ఏమీ చెప్పకపోయినా.. దీనిపై చర్చించుకున్నట్లు తెలిసింది. విమానాలు ఎదురెదురుగా రావడంపై వారొక ఊహా చిత్రం కూడా రూపొం దించారని తెలిసింది. ఇక ముందు ఈ పరిస్థితి రాకుండా చేపట్టాల్సిన రక్షణచర్యలపై విమానాశ్రయ అధికారులు చర్చిస్తున్నారు. సాగర తీరంలో గగుర్పొడిచే విన్యాసాలు విశాఖపట్నం: ఇటీవలే భారత నావికా దళంలోకి చేరిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి మిగ్ 29కే యుద్ధ విమానాలు.. మరోవైపు సీ హారియర్స్ ముందుకు దూసుకువచ్చే సన్నివేశాలు విశాఖ సాగరతీరంలో నగర వాసులకు గగుర్పాటు కల్పించాయి. సముద్రంలో కొలువు తీరిన యుద్ధ నౌకల నుంచి గగనతలంలోకి బాంబులు ఒకదాని వెంట మరొకటిగా లక్ష్యాన్ని ఛేదించడం.. ల్యాండింగ్ డాక్ ప్లాట్ఫాం నుంచి సైనికులు తీరప్రాంతంలోకి దూసుకువచ్చి శత్రుస్థావరాలపై దాడి చేసే సన్నివేశాలు కనువిందు చేస్తున్నాయి. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్కు సన్నాహకంగా బుధవారం ప్రారంభించిన రిహార్సల్స్ గురువారం సాయంత్రం కూడా కొనసాగించారు. పలు యుద్ధ నౌకలు, సీ హారియర్స్ వంటి యుద్ధ విమానాలకు తోడు యుద్ధ ట్యాంకులు, కమెండోలు, పారాట్రూపర్స్ ఈ ఆపరేషన్ డెమోలో పాల్గొని తమ ప్రతిభ చాటుతున్నారు. యుద్ధం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించారు. శుక్రవారం కూడా రిహార్సల్స్ జరగనున్నాయి. -
అన్ని దారులూ సాగరతీరం వైపే...
విశాఖపట్నం : యుద్ధ నౌకల విన్యాసాలు తిలకించేందుకు విశాఖ వాసులు సాగరతీరం బాట పట్టారు. తీరం వెంట ప్రజలు ఆశక్తిగా రెండో రోజు యుద్ధ నౌకల విన్యాసాల్ని వీక్షించారు. గగనతలంలోంచి అతి సమీపానికి వస్తున్న యుద్ధ విమాన విన్యాసాల్ని ఆసక్తిగా తిలకించారు. గురువారం జరిగిన రిహార్సల్స్లో భాగంగా దాడి నుంచి తప్పించుకునేందుకు యుద్ధ విమానాలు ఒక్కసారిగా తలక్రిందులౌతున్న సన్నివేశాలు గగుర్పాటును కలిగించాయి. దేశీయ యుద్ధ నౌకలతో పాటు అంతర్జాతీయ యుద్ధనౌకలు సయితం సాగరంలో కొలువుతీరాయి. యుద్ధ విమానాలు బాంబులు జారవిడుస్తున్న సన్నివేశాలు, యుద్ధ నౌకల నుంచి గగనతలంలోకి నిర్ధేశిత లక్ష్యాల నుద్ధేశించి ప్రయోగించిన మిస్సైల్స్ సాగరతీరం నుంచే వీక్షిస్తున్న ప్రజలను అబ్బురపరిచాయి. ఇతర ప్రాంతాల నుంచి లగ్జరీ కార్లు మర్రిపాలెం: ఇంటర్నేషల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనే దేశీయ, విదేశీ ప్రముఖులకు లగ్జరీ కార్లను ఇతర ప్రాంతాల నుంచి సమకూర్చుతున్నారు. మెర్స్డెజ్ బెంజ్, ఆడి, బిఎమ్డబ్ల్యూ, రేంజ్ రోవర్, తదితర లగ్జరీ కార్లను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖనగరంలో ఖరీదైన కార్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడానికి నిమగ్నమయ్యారు. లగ్జరీ కార్లను సమకూర్చే బాధ్యతలు డిఫెన్స్ అధికారులు చూస్తున్నారు. ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కోల్కతా, తదితర ప్రాంతాలలోని ప్రముఖ ట్రావెల్స్కు చెందిన కార్లను రప్పిస్తున్నట్టు తెలిసింది. దేశం నలుమూలల నుంచి కార్లను తీసుకురానున్నారు. దాదాపు వంద కార్లు అవసరంగా అధికారులు గుర్తించినట్టు సమాచారం. విమానాశ్రయం నుంచి ప్రముఖుల రాకపోకలు, విడిది, పాల్గొనే ప్రాంతాలకు తగ్గట్టుగా వాహనాల ఏర్పాటుకు సిద్ధపడుతున్నారు. కమిషనరేట్లో టాక్సీలు అల్లిపురం : ఐఎఫ్ఆర్ 16కు నగరానికి విచ్చేసే అతిథులకు టాక్సీలు సిద్ధంగా ఉన్నాయి. ఫ్లీట్ రివ్యూలో సుమారు 3వేల వరకు టాక్సీలను ప్రభుత్వం వినియోగిస్తుంది. విశాఖ జిల్లా, నగరంలో 15 వందల వరకు టాక్సీలు ఫిట్ అయినవి ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన టాక్సీలు విజయవాడ, కాకినాడ, ముంబయి ప్రాంతాల నుండి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేశారు. ఫ్లీట్ రివ్యూ దగ్గర పడుతుండడంతో నగరానికి వివిధ ప్రాంతాల నుండి టాక్సీలు వచ్చి నగర పోలీస్ కమిషనరేట్లో పార్క్ చేశారు.