తెలంగాణ ఆగదు
తూప్రాన్, న్యూస్లైన్: సీమాంధ్ర నేతలు ఎన్ని అవాంతరాలు సృష్టించినా తెలంగాణను అడ్డుకోజాలరని టీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ పోరాటం, అమర వీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. శనివారం తూప్రాన్ మండలం పోతరాజుపల్లిలోని జేపీఆర్ గార్డెన్లో నిర్వహించిన టీఆర్ఎస్ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడారు. 70ఏళ్ల ఆకాంక్ష, 14సంవత్సరాల పోరాటం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రణాళిక ముందుకు సాగుతుందన్నారు.
పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని 28 రాష్ట్రాలకున్న సంపూర్ణ హక్కులే తెలంగాణకూ కల్పించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత నాయకుల ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఆంక్షలు విధిం చడం సరికాదన్నారు. సీమాంధ్రులకు భద్రతలేదనే పుకార్లను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్పై అధికారాన్ని గవర్నర్ చేతిలో పెట్టడం తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా సీమాం ధ్రులు ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల్లోనూ ఆంక్షలు విధిస్తే తెలంగాణలోని విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుం దని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం పునరాలోచించాలని ఆయన కోరారు.
ఉమ్మడి రాజధానిలో ఆంధ్రులకు ఎలాంటి రక్షణ కావాలన్న తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని, అయితే వారికోసం కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలావుంటే శిక్షణ తరగతుల సందర్భంగా కార్యకర్తలకు టీఆర్ఎస్ ఎజెండాను వివరించారు. అమరవీరుల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించడం, ఉద్యమకారులకు స్వాతంత్య్ర సమరయోధుల మాదిరిగా బస్పాస్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. అంతకుముందు స్వామిగౌడ్ను పలువురు శాలువాతో సన్మానించారు. సదస్సులో టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఎలక్షన్రెడ్డి, మండల కన్వీనర్ ర్యాకల శేఖర్గౌడ్, నాయకులు మాదాసు శ్రీనివాస్, చంద్రారెడ్డి, శ్రీశైలంగౌడ్, సురేశ్గౌడ్, సురేశ్కుమార్, మన్నె నాగరాజు, జక్కుల శ్రీనివాస్, మన్నె శ్రీనివాస్, యాసిన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.