వైఎస్ఆర్ సేవలను స్మరించుకున్న ఎన్నారైలు
యూకేలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి
లండన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి బ్రిటన్లో ఘనంగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే అండ్ యూరప్ వింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 10న మిల్టన్ కేన్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి 150కిపైగా ఎన్నారైలు హాజరై దివంగత మహానేత వైఎస్ఆర్కు నివాళులర్పించారు.
వైఎస్ఆర్ చిత్రపటాన్ని పూలతో అలకరించి.. ఈ సందర్భంగా కేక్ను కట్ చేశారు. అనంతరం లక్షలాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన డాక్టర్ వైఎస్ఆర్ జీవిత ప్రస్థానం.. ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆడియో, వీడియో దృశ్యాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా లైవ్లో వైఎస్ఆర్సీపీ ఎన్నారై కన్వీనర్ వెంకట్ మేడపాటి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. ఆయన జీవితమంతా ప్రజలకోసమే కృషి చేశారని, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సమాజంలోని అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్ది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పార్టీ యూకే అండ్ యూరప్ వింగ్ను, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలను ఆయన అభినందించారు. ఇతర నేతలు, ఆహూతులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ప్రమ, ఆదరాభిమానాలను చూరగొన్న వైఎస్ఆర్ సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైఎఆర్సీపీ యూకే అండ్ యూరప్ వింగ్ కు చెందిన శివకుమార్ చింతం, కొఠారి అబ్బయ్య చౌదరి, సందీప్రెడ్డి వంగల, కిరణ్ పప్పు, పూర్ణచందర్రావు కొడే, జనార్దన్ రెడ్డి, సతీష్ నర్రెడ్డి, ఎన్ఆర్ రెడ్డి, మనోహర్ నక్కా, సతీష్ వనహారం, అమర్నాథ్ కొల్లాం తదితరులు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించడానికి వైఎస్ఆర్సీపీకి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలువాల్సిన అవసరముందని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుర్తించిన మండలాల్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, వారికి శిక్షణ ఇవ్వడానికి సాయపడాలని ఈ సందర్భంగా తీర్మానించారు.