breaking news
no fere
-
భయం లేకే కోవిడ్ వ్యాప్తి
న్యూఢిల్లీ: కోవిడ్ వైరస్ సోకుతుందన్న భయం లేకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికలు, పెళ్లిళ్ల సీజన్ వెరసి మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం ఆదివారం తెలిపింది. కోవిడ్ కేసుల పెరుగుదలను పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల బృందం గతవారంలో రాష్ట్రంలో పర్యటించింది. చాలా అంశాలున్నాయి.. కోవిడ్ వ్యాప్తికి నిర్ణీత కారణాన్ని చెప్పలేమని, కేసుల పెరుగుదల చాలా అంశాల మిళితం వల్ల జరుగుతోందని చెప్పారు. వాటిలో రోగం పట్ల భయం లేకపోవడం, మహమ్మారి పట్ల ఉదాసీనత, సూపర్ స్ప్రెడర్లను గుర్తించలేకపోవడం, ఎన్నికల్లో సరైన కోవిడ్ నిబంధనలు పాటించలేకపోవడం, పెళ్లిళ్ల సీజన్ కావడం, పాఠశాలలు తెరవడం, గుంపులు గుంపులుగా ప్రయాణాలు చేయడం వంటి కారణాల వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని కేంద్రం నివేదిక ద్వారా వెల్లడించింది. ప్రస్తుత కేసుల్లో చాలా వరకు లక్షణాలు లేని రోగులే ఉంటున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించడంలో విఫలం కావడం కూడా కారణమని చెప్పింది. ఇప్పటికైనా మేలుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. డాక్టర్లలోనూ ఉదాసీనత.. డాక్టర్లలో ప్రత్యేకించి ప్రైవేటు డాక్లర్లు కొన్ని కేసులను కేవలం ఫ్లూగా కొట్టిపారేస్తూ టెస్టుల వరకూ వెళ్లనివ్వట్లేదని.. కోవిడ్ రోగులను జూనియర్ డాక్టర్లకు వదిలేస్తున్నారని దీంతో కోవిడ్ తీవ్రత పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. కోవిడ్ నియంత్రణ కోసం కంటితుడుపు చర్యలు తీసుకోకుండా పని చేయాలని, ప్రత్యేకించి రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో పని చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఉంటాయని తెలిపింది. ఎంత మందికి వ్యాక్సినేషన్ చేస్తామన్నారో, ఎందరికి వ్యాక్సిన్ వేశారో చెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరిందని మహారాష్ట్రలో పర్యటించిన బృందం తెలిపింది. కేంద్రం స్థాయిలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ఈ వివరాలు తెలుస్తాయని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పింది. -
17నిమిషాల ఆడియోతో కానిచ్చేశారు
మోరెనా(మధ్యప్రదేశ్): పెళ్లిళ్ల అనవసర ఖర్చులను నియంత్రించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకురానున్న నేపథ్యంలో తక్కువ ఖర్చులు, హంగులు ఆర్భాటాలకు పోకుండా వివాహాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఓ జంట పెద్దగా ఆడంబరాలకు పోకుండా కేవలం 17 నిమిషాల వ్యవధితో ఉన్న మంత్రాల ఆడియో సహాయంతో పెళ్లితంతును కానిచ్చేశారు. 200మంది ఆహ్వానితుల మధ్య మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమం జరిపించేందుకు పంతులును కూడా పిలిపించలేదు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని మోరెనా ప్రాంతంలో జారా అనే గ్రామానికి చెందిన వధువుకు బ్రిజేశ్ దాస్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. అయితే, తొలుత భారీగా వీరి వివాహం జరిపించాలని భావించుకున్నప్పటికీ అనవసరపు వ్యయం అవసరమా అని భావించిన వారు రాంపాల్ మహారాజ్ అనే సెయింట్ మాట విని సాధారణ వివాహానికి అంగీకరించారు. ఇరు వర్గాల అంగీకారంతో కనీసం డీజే, అలంకరణ కూడా లేకుండా మాములుగా వివాహం చేసుకున్నారు. 17నిమిషాల మంత్రాల ఆడియో అయిపోగానే వివాహం అయిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇతర వివాహాల్లో మాదిరిగానే బంధువులకు విందుభోజనాలు వడ్డించి పంపించారు.