ntr canteens
-
పేదల గూడు కూల్చి ‘అన్న’o పెడతారా?
సాక్షి, అమరావతి: ‘‘పేదలకు, కార్మికులకు ఒక రూపాయికే టిఫిన్..రూ.5కే భోజనం సరఫరా నిమిత్తం ‘అన్న ఎన్టీఆర్ క్యాంటిన్లు’ నిర్మిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు ఆ ఊసే ఎత్తకుండా.. 2019 ఎన్నికలు సమీపిస్తుండడంతో..హడావుడిగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు విమర్శల పాలవుతున్నాయి. ఇందుకోసం నిరుపేదలను నిరాశ్రయులను చేసి అన్న ఎన్టీఆర్ క్యాంటిన్ల నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు బాహటంగా వినపడుతున్నాయి. గతంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలు, నివాసం ఉంటున్న స్థలాలను ఖాళీ చేయించి క్యాంటిన్లు నిర్మించే ప్రయత్నాల్లో అధికారులున్నారు. ప్రభుత్వ స్థలాలు లభించకపోవడంతో ప్రైవేట్ స్థలాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు స్థలాల అన్వేషణ బాధ్యతలను అప్పగించింది. గతంలో నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన స్థలాలు, వారు నివాసం ఉంటున్న స్థలాలను రాత్రికి రాత్రి ఖాళీ చేయిస్తున్నారు. పోలీస్ యంత్రాంగంతో వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రూ.400 కోట్లు కేటాయించినా ... గత ఏడాది 203 క్యాంటిన్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఆ మేరకు బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు.స్థలాలు లభించకపోవడంతో, నాలుగు క్యాంటిన్ల నిర్మాణాలే పూర్తయ్యాయి. ఈ ఏడాది మరో రూ.200 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. అయితే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిర్దేశించిన కొలతల్లో వీటిని నిర్మించాలనే నిబంధన పెద్ద ప్రతిబంధకంగా మారింది. కోర్టుకెళ్లమన్నారు.. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను సాధించేందుకు విశాఖపట్నం జిల్లా భీమిలి మున్సిపల్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. చిట్టివలస జ్యూట్మిల్లు యాజమాన్యానికి చెందిన స్థలంలో అక్కడి అధికారులు అన్న క్యాంటిన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆ మిల్లు కార్మికులు నిర్మాణ పనులు నిలిపివేయాలని పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. అయితే వివాదాన్ని పరిష్కరించకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఆ జూట్మిల్లు కార్మిక సంఘం నాయకులకు పోలీసులు సూచించారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేకుండాపోయింది. ఇదే అదునుగా చేసుకుని అధికారులు అన్న క్యాంటిన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. ప్రకాశంలోనూ దందా.. కందుకూరు పట్టణంలోని పాతచేపల మార్కెట్ సెంటరులో 50 ఏళ్లకుపైగా 20 కుటుంబాలు నివాసం ఉంటూ చిన్నచిన్న బంకులు పెట్టుకుని చిరువ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు. అయితేరాత్రికి రాత్రి పొక్లెయిన్ల సహాయంతో వాటిని తొలగించి చిరు వ్యాపారులను నిరాశ్రయులను చేశారు. ఇప్పుడు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి పోలీస్ కాపలా ఉంచారు. వక్ఫ్భూములను సైతం.. గుంటూరు నగరంలోని మంగళదాస్ నగర్లో వక్ప్భూముల్లో నివాసం ఉంటున్న కొందరి నిరుపేదల జాబితాలను అక్కడి మున్సిపల్ అధికారులు సేకరించారు. వారిని అక్కడి నుంచి తొలగించి అన్న క్యాంటిన్ నిర్మాణం చేపట్టే యత్నంలో ఉన్నారని ఉద్యోగ వర్గాల కథనం. -
‘అన్న క్యాంటీన్లు’ డౌటే !
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టాలనే యోచనతో ప్రకటించిన అన్న క్యాంటీన్ల ఏర్పాటు అనుమానంగా మారింది. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఏడాది కిందట చెప్పారు. 2014 అక్టోబర్ నుంచి తొలివిడతగా అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లా కేంద్రాల్లో 35 సెంటర్లను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5కే సాంబారు అన్నం, రూ.3కు పెరుగన్నం, రూపాయికే ఇడ్లీ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఏర్పాటుపై ప్రభుత్వంలో కదలిక కనిపించడంలేదు. క్యాంటీన్లు ప్రారంభించకుండానే వాటిని ఏర్పాటు చేస్తే అందులో భోజనం చేస్తారా అనే సందేహం ప్రభుత్వం వైపునుంచి వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో క్యాంటీన్ల ఏర్పాటుపై ఇప్పట్లో ఆలోచించే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరిట ప్రకటించిన పథకాన్నే పట్టించుకోవడం లేదు. తమిళనాడులో ‘అమ్మ క్యాంటీన్ల’ పేరిట ఆ ప్రభుత్వం ఈ పథకాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తోంది. అంతేగాకుండా తెలంగాణలోని హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, ఇస్కాన్ సంయుక్తంగా ఇలాంటి పథకాన్నే జయప్రదంగా నిర్వహిస్తున్నాయి. అన్న క్యాంటీన్ల ఏర్పాటుకోసం పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో కూడిన మంత్రుల బృందం తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లపై రెండుసార్లు అధ్యయనం చేసి వచ్చింది. తమిళనాడులో మాదిరి ఇక్కడ ఆశించిన మేరకు స్పందన కనిపించకపోతే క్యాంటీన్లు ఏర్పాటుచేసినా ప్రయోజనం ఉండదనే రీతిలో పాలకులు ఆలోచిస్తుండటంతో ఆ పథకానికి ఇక మంగళం పాడినట్లేనన్న ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు చెప్పినట్లు అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లోనైనా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి సునీత ప్రస్తావించగా.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుందామని అధికారులు చెప్పినట్లు సమాచారం. అన్న క్యాంటీన్లను ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని రిక్షా కార్మికులు, చిరు వ్యాపారాలు ఆశగా చూస్తున్నారు.