తిరుచానూరు రథసప్తమి వేడుకల్లో అపశృతి
రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వాహనసేవలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై పద్మావతీ అమ్మవారు ఊరేగుతుండగా... ఉత్తర మాడవీధిలో వాహనంపై ఉన్న అమ్మవారి విగ్రహం ఒక్కసారిగా కుడివైపు ఒరిగింది. గమనించిన అర్చకులు వెంటనే అమ్మవారి విగ్రహాన్ని పట్టుకున్నారు.
తిరిగి సరిగా కూర్చోబెట్టడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో విగ్రహాన్ని అలా పట్టుకునే వాహన సేవను నిర్వహించారు. విగ్రహాన్ని సరిగా కూర్చోబెట్టకపోవడం వల్లే అలా జరిగినట్టు డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి వివరించారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా పద్మావతీ అమ్మవారు సోమవారం మొత్తం ఏడు వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.