breaking news
Palaniswami govt
-
రైతులకు భారీ ఊరట: రుణ మాఫీ
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రైతులు భారీ ఊరట కల్పించింది. పెద్ద మొత్తంలో వ్యవసాయ రుణాలను రద్దు చేస్తూ రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి శుక్రవారం దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. రూ .12,110 కోట్ల వ్యవసాయ రుణ మాఫీని ప్రకటించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16.43 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 2వ వారంలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తోందన్న అంచనాల నడుమ సీఎం ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సహకార బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న సుమారు రూ .12,110 కోట్ల రుణాలను మాఫీ చేయనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా అకాలవర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు రూ.1,117 కోట్ల పరిహారాన్ని సీఎం ఇంతకుముందే ప్రకటించారు. దీంతో సుమారు 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. తమిళనాడులో ఎడతెరిపి లేని వర్షాలతో భారీగా పంట నష్టానికి దారితీసింది. గతేడాది సాధారణ స్థాయిలతో పోలిస్తే రాష్ట్రంలో 708 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పంటకోత దశలో ఉండగా కురిపిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. -
పన్నీరుపై వేటుకు చాన్సే లేదు
సాక్షి, చెన్నై: పన్నీరు సెల్వంతో పాటు 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి అవకాశం లేదని, ఈ విషయంలో అసలు స్పీకర్కు ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టుకు లేదని సీఎం పళనిస్వామి తరఫున హైకోర్టులో బుధవారం వాదనలు వినిపించారు. దినకరన్ మద్దతు ఎమ్మెల్యే అనర్హత వేటును గుర్తు చేస్తూ, పన్నీరు బృందం మీద వేటు ఎందుకు వేయరంటూ వాదనలు వాడి వేడిగా సాగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగి సీఎం పళనిస్వామి బల పరీక్ష సమయంలో పన్నీరు సెల్వంతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే విప్నకు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. అయితే, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోని స్పీకర్ ధనపాల్, అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ మద్దతు ఎమ్మెల్యేల మీద మాత్రం ఇటీవల చర్యలు తీసుకోవడం చర్చకు దారి తీసింది. దినకరన్ మద్దతు ఎమ్మెల్యే అనర్హత వేటును పరిగణలోకి తీసుకుని , ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పన్నీరుసెల్వంతో పాటు 11 మంది మీద సైతం వేటు పడాల్సిందేనన్న నినాదాన్ని డీఎంకే అందుకుంది. డీఎంకే విప్ చక్రపాణి దాఖలు చేసిన పిటిషన్ విచారణ బుధవారం వాడివేడిగా సాగింది. స్పీకర్కే అధికారం పన్నీరుతో పాటు 11 మంది ఎమ్మెల్యేలపై వేటుకు అవకాశం లేనే లేదని సీఎం పళనిస్వామి తరఫున కోర్టుకు వాదనలు చేరాయి. ప్రధాన న్యాయమూర్తి ఇందిరాబెనర్జీ, న్యాయమూర్తి అబ్దుల్ కుదుష్ నేతృత్వంలోని బెంచ్ ముందు ఉదయం వాదనలు సాగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్సిబాల్, అమరేంద్ర సింగ్ హాజరయ్యారు. సీఎం పళనిస్వామి, అసెంబ్లీ స్పీకర్ తరఫున న్యాయవాది వైద్యనాథన్ హాజరై వాదనలు వినిపించారు. అసెంబ్లీలో సాగే వ్యవహారాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఒక్క స్పీకర్కు మాత్రమే ఉందన్నారు. ఆయన నిర్ణయానికి కట్టుబడాల్సిన అవసరం ఉందని, అయితే, స్పీకర్కు ఆదేశాలు ఇచ్చే అధికారం ఎవ్వరికీ లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ నియమ నిబంధనల మేరకు స్పీకర్ చర్యలు ఉంటాయని, ఆయన తీసుకునే నిర్ణయం సుప్రీం అని వ్యాఖ్యానించారు. అనర్హత వేటు విషయంగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టుకు లేదన్నారు. దీంతో పిటిషనర్ చక్రపాణి తరఫున కపిల్సిబాల్ వాదన వినిపించారు. స్పీకర్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ప్రజా స్వామ్య విరుద్ధంగా రాష్ట్రంలోపాలన సాగుతున్నదని, ఈ ప్రభుత్వ కొనసాగేందుకు వీలు లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయవాది వైద్యనాథన్ జోక్యం చేసుకుని సుప్రీంకోర్టులో ఇలాం టి కేసు పెండింగ్లో ఉందని, ఈ దృష్ట్యా, ఎలాంటి ఆదేశాలు ఇవ్వ వద్దు అని, అలాగే, పన్నీరు, అండ్ ఎమ్మెల్యే తరఫున అదనపు పిటిషన్ దాఖలుకు అవకాశం ఇవ్వాలని కోరారు. చివరకు స్పీకర్ ధనపాల్ను వివరణ కోరుతూ, అదనపు పిటిషన్ల దాఖలకు అవకాశం కల్పిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు. అదనపు పిటిషన్లు ఫిబ్రవరి ఐదో తేదీలోపు వేయాలని ఆదేశించారు. ఢిల్లీకి పన్నీరు ఓ వైపు తమ మీద దాఖలైన పిటిషన్ల విచారణ వాడివేడిగా సాగుతుంటే, మరో వైపు డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం ఢిల్లీ చెక్కేశారు. ప్రధాని నరేంద్రమోదీతో భేటీకి ఈ పయనం అని పాలకుల్లో చర్చ. ఎంజీయార్ శతజయంతి ఉత్సవాలకు స్వయంగా ఆహ్వానించేందుకు నిర్ణయించిన దృష్ట్యా, ఇందుకు తగ్గ ఆహ్వానాలు ఢిల్లీలో గురువారం సాగే అవకాశాలు ఉన్నాయి. అలాగే, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు పలువురు మంత్రులతో భేటీలకు పన్నీరు అపాయింట్ మెంట్లు సిద్ధం చేసుకుని వెళ్లడం గమనార్హం. ఢిల్లీలో జరిగే ఆర్థిక శాక సమావేశానికి సైతం హాజరు కాబోతున్నారు. -
మార్చి16న ఆ ప్రభుత్వ తొలి బడ్జెట్
జయలలిత మరణం అనంతరం ఏర్పడిన రాజకీయ పరిణామాలతో అట్టుడికిన తమిళనాడులో ఇటీవలే ఓ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కొత్తగా పదవిలోకి వచ్చిన ఈ ప్రభుత్వం మార్చి 16న తమ తొలి బడ్జెట్ తో అసెంబ్లీ ముందుకు రాబోతుంది. మార్చి 16న పళనిస్వామి ప్రభుత్వం తొలి బడ్జెట్ తమిళనాడు అసెంబ్లీ ముందుకు రాబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి16న 10.30 గంటలకు సమావేశమవ్వాలని లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ ధనపాల్ సమన్లు పంపారు. ఆర్థికమంత్రి డీ జయకుమార్ పళనిస్వామి ప్రభుత్వంలో తన తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గత నెల 18న అసెంబ్లీలో చోటుచేసుకున్న తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో పళనిస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాస పరీక్షను ప్రతిపక్షం డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పళనిస్వామి ప్రభుత్వాన్ని ఎలాగైనా పదవిలో నుంచి దింపేందుకు బడ్జెట్ సమావేశాలను ఓ పావుగా వాడుకునేందుకు సిద్ధమవుతోంది.