వాళ్లకి స్మార్ట్ఫోన్లు అమ్మొద్దు..
వాషింగ్టన్: టీనేజికి రాని పిల్లలు స్మార్ట్ఫోన్లకు బానిసవ్వడం పొగాకు ఉత్పత్తులకు, మద్యానికి బానిసవ్వడం కంటే ప్రమాదకరమని అమెరికాలోని ఒక స్వచ్ఛంద సంస్థ పరిశోధనలో తేలింది. వారికి స్మార్ట్ఫోన్లు విక్రయించవద్దని ఆ సంస్థ కోరుతోంది. అమెరికాలోని కొలరాడోలో ఐదుగురు పిల్లలు ఉన్న టిమ్ ఫస్రనుమ్కి వచ్చిన ఆలోచనే ఈ సంస్థ ఏర్పాటుకు నాంది అయ్యింది. ఆయన పిల్లల్లో ఇద్దరు కొడుకులు స్మార్ట్ఫోన్లకు బానిస కావడంతో తట్టుకోలేక ఈ సమస్యపై పోరాడటానికి ‘పేరెంట్స్ అగైనెస్ట్ అండర్ ఏజ్ స్మార్ట్ఫోన్స్’ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాడు.
పిల్లలు స్మార్ట్ఫోన్లకు బానిస కాకుండా ఉండాలంటే 13 ఏళ్లలోపు పిల్లలకు వాటిని విక్రయించడంపై నిషేధం విధించాలని ఆయన కోరుతున్నాడు. 13 ఏళ్ల లోపు పిల్లలకు స్మార్ట్ఫోన్లను అమ్మితే ఆ షాపుల వారికి జరిమానాలు వేయాలని ప్రతిపాదించారు. అంతేకాదు తన ప్రతిపాదనకు మద్దతుగా వచ్చే ఏడాది నవంబర్లోగా 3 లక్షల సంతకాలు సేకరించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు.