PoK residents
-
పుట్టింది పీవోకేలో...పెళ్లి మాజీ మిలిటెంట్లతో!
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో జన్మించిన ఇద్దరు మహిళలు జమ్మూ కశ్మీర్ పంచాయతీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. మాజీ మిలిటెంట్లను పెళ్లి చేసుకుని కశ్మీర్కు వచ్చిన ఈ మహిళలు ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. మిలిటెంట్ల హెచ్చరికల మధ్య ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో చాలా తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఇలాంటి ఎన్నికల్లో పీవోకే నుంచి వచ్చిన దిల్షాదా బేగం, ఆరిఫాబేగం గెలుపొందడం అసాధారణమైనదిగా అక్కడి వారు పరిగణిస్తున్నారు. రావల్పిండి నుంచి కశ్మీర్కు... పీవోకే రాజధాని ముజఫరాబాద్లో పుట్టిన దిల్షాదా, పాకిస్తాన్ పంజాబ్ రావల్పిండిలో పెరిగారు. 1990లలో ఆయుధాల ప్రయోగంలో శిక్షణ కోసం భట్ కశ్మీర్ సరిహద్దులు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించారు. ఏడేళ్ల పాటు రావల్పిండిలోనే స్థిరపడి కొత్త జీవితాన్ని ప్రారంభించినా మళ్లీ కశ్మీర్కు వెళ్లాలని గట్టిగా కోరుకున్నారు. 2004 జూన్లో మహ్మద్ యూసుఫ్ భట్ను దిల్షాదా పెళ్లాడారు. 2012లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని కశ్మీర్ ప్రభుత్వం మిలిటెంట్ల పునరావాస పథకాన్ని ప్రకటించడంతో భట్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. 1990లలో సరిహద్దులు దాటిన మిలిటెంట్లు కశ్మీర్లోని తమ సొంత ఇళ్లకు చేరుకున్నారు. 2012 జూన్లో ముగ్గురు పిల్లలతో కలిసి దిల్షాదా మొదటిసారిగా భర్త భట్ స్వగ్రామం ప్రింగ్రూకు వచ్చాక మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులకు అలవాటుపడ్డాక కశ్మీర్కు వచ్చినందుకు సంతోషంగా ఉన్నట్టుగా ఆమె వెల్లడించారు. ఈ ఊర్లోనే భట్ చిన్న కిరాణాషాపును నిర్వహిస్తున్నాడు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు ప్రకటించడంతో భారత పౌరురాలుగా (కశ్మీరీలను పెళ్లాడిన వారికి భారత పౌరసత్వం లభిస్తుంది) మారిన దిల్షాదాను పోటీచేయాల్సిందిగా ఇరుగుపొరుగు ఒత్తిడి తెచ్చారు. ప్రస్తుతం ఐదుగురు పిల్లలకు తల్లి అయిన ఆమె పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరిఫాదీ అదే బాట.. పీవోకే రాజధాని ముజఫరాబాద్కు చెందిన 35 ఏళ్ల ఆరిఫాది కూడా దాదాపుగా దిల్షాదా లాంటి కథే. కశ్మీర్ సరిహద్దులు దాటి పాకిస్తాన్కు వెళ్లిన గులాం మహ్మద్ మీర్ను ఆరిఫా పెళ్లాడారు. 2010లో కశ్మీర్కు తిరిగొచ్చిన ఈ జంట మీర్ సొంత గ్రామం ఖుమ్రియల్ (కుప్వారా జిల్లా)లో స్థిరపడ్డారు. ప్రస్తుతం మీర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు, పంచాయతీ ఎన్నికల్లో ఆరిఫా బీజేపీ టికెట్పై పంచ్ స్థానానికి, ఖుమ్రియల్–బీలోని సర్పంచ్వార్డుకు పోటీచేశారు. ఆమెపై పోటీచేసేందుకు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో రెండుస్థానాలకూ ఆరిఫా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో కుప్వారా జిల్లాలోని 40 సర్పంచ్ స్థానాలు, 669 పంచ్ వార్డులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ
-
పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించబోమని, తమ భూభాగంలో ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదులే లేరంటూ బుకాయిస్తూ వస్తున్న ఆ దేశానికి నోట్లో వెలగపండు ఇరికినట్లయింది. తమ ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలను వెంటనే ఖాళీ చేయించాలని, వాటి వల్ల తమ జీవితాలు నరకంలా మారాయని, వారి దుశ్చేష్టలు ఇక ఏమాత్రం సహించబోమంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ పౌరులు ఎదురు తిరిగారు. ఇస్లామాబాద్ వ్యతిరేక నినాదాలతో, పెద్దపెద్ద ప్లకార్డులతో ఆందోళన బాటపట్టారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్, కోట్లి, చినారి, మిర్పూర్, గిల్గిట్, దియామిర్, నీలం వ్యాలీ ప్రజలంతా గురువారం వీధుల్లోకి వచ్చి పాక్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అంతర్జాతీయ వేదికలపైనే, భారత్ తో గొడవలు జరుగుతున్న ప్రతిసారి తమ వద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరాలు లేవని పాక్ చెబుతూ వస్తుందని, అదంతా బూటకం అని, ఉగ్రవాద శిబిరాల వల్లే తమ జీవితాలు నరకంలో ఉన్నట్లుగా మారాయని వారంతా నినదించారు. 'ఉగ్రవాద సంస్థలను, ఉగ్రవాద శిక్షణ శిబిరాలను నిషేధించండి. మాకు భోజనం పెట్టండి, ఆహార పదార్థాలు అందించండి. మేం ఈ పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం' అంటూ వారంతా ఓ టీవీ చానెల్ కు తమ బాధను వెల్లబోసుకున్నారు. తాలిబన్ టెర్రర్ క్యాంపులు కూడా తమ వద్ద ఉన్నాయని, వాటిని నివారించకుంటే పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అన్నారు. 'ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడాన్ని ఆపనంతకాలం ఉగ్రవాదాన్ని అంతమొందించడం సాధ్యం కాదు' అంటూ ఆ ప్రాంత వాసులు కుండబద్ధలు కొట్టారు.