మాజీ కార్పొరేటర్ నివాసంలో రూ.40 కోట్లు
బెంగళూరు : బెంగళూరులో ఓ మాజీ కార్పొరేటర్ నివాసంలో పెద్ద ఎత్తున దొరికిన పాతనోట్లను చూసి పోలీసులే అవాక్కు అయ్యారు. వివరాల్లోకి వెళితే.... మాజీ కార్పొరేటర్ వి నాగరాజ్ నివాసంలో శుక్రవారం పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.40 కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అంతకు ముందు తాళం వేసి ఉన్న ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు లాక్ పగలగొట్టి లోనికి వెళ్లగా, అక్కడ గదుల్లో పెద్ద ఎత్తున నగదు గుట్టలుగా పడి ఉండటాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.
అనంతరం ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ రాష్ట్రవ్యాప్తంగా అప్పటి నుంచి దాడులు చేపట్టి పెద్ద మొత్తంలో నల్లధనాన్ని స్వాధీనం చేసుకుంది.