Sells baby
-
ఒకరు అదృశ్యం.. మరొకరు అమ్మకానికి!
డిండి: కళ్లు తెరిచి నెలరోజులు గడిచిందో లేదో.. అప్పుడే అమ్మఒడి నుంచి ఓ ఆడశిశువు అదృశ్యమైంది.. దీనిపై తల్లిదండ్రులు నోరువిప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోఘటనలో ఏడురోజుల పసిగుడ్డును అమ్మకానికి పెట్టారు ఓ పేద తల్లిదండ్రులు. ఇదేమిటని ప్రశ్నించిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ రెండు ఘటనలు ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వివరాలు... డిండి మండలం కుందేలుబాయితండా గ్రామ పంచాయతీ పరిధిలోని శ్యామలబాయితండాకు చెందిన జర్పుల çరమేశ్, సంగీత దంపతులు. వీరికి జూన్ 28న రెండో సంతానంగా ఆడశిశువు జన్మించింది. కాన్పు అనంతరం కాటికబండతండాలోని తల్లిగారింటికి వెళ్లిన సంగీత వారం క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చింది. అయితే శిశువు పేరు రిజిస్టర్లో నమోదు చేయడానికి వెళ్లిన అంగన్వాడీ టీచర్కు ఆ శిశువు కనిపించలేదు. శిశువు గురించి అడిగితే తల్లిదండ్రుల్లో ఉలుకూపలుకూలేదు. అదే శ్యామలబాయి తండాకు చెందిన ఇస్లావత్ సక్రూ భార్య అమృత గతనెల 24న మూడో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పాపను ఇతరులకు అమ్ముకుంటున్నారని చైల్డ్ హెల్ప్లైన్ ఫోన్ నంబర్ 1098కు ఓ కాల్ వచ్చింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు, డిండి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు గతనెల 30, 31 తేదీల్లో ఆ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. శిశువులు తల్లిదండ్రుల వద్దే ఉండాలని, లేనిపక్షంలో ఐసీడీఎస్ గృహానికి అప్పగించాలని, అక్రమంగా దత్తత ఇవ్వకూడదని సూచించారు. అయినా తమ బిడ్డను అమ్ముకుంటామని వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీలేక ఆ ఇద్దరు శిశువుల వివరాలు సేకరించాలని కోరుతూ అంగన్వాడీ సూపర్వైజర్ రేణుకారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాలుడు కిడ్నాప్ కేసు సుఖాంతం
-
రవిప్రకాష్ అరెస్ట్
ఏలూరు(సెంట్రల్) : శిశువును విక్రయిస్తు పోలీసుల స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయిన సెల్ఫ్ హెల్ఫ్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకుడు మాల్పూరి రవిప్రకాష్( ఫాదర్ తంబి)ను ఏలూరు రూరల్ పోలీసులు ఆదివారం అరెస్ట్చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. స్థానిక వెంకటాపురం పంచాయతీ గణేష్ కాలనీలో ఈ సొసైటీ తరఫున అనాథ ఆశ్రమం నిర్వహిస్తున్నారు. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు శనివారం చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో నిర్వాహకుడు రవిప్రకాష్ చిన్నారిని విక్రయిస్తూ పట్టుడడ్డాడు. శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని రూరల్ ఎస్సై కిషోర్బాబు,హెడ్కానిస్టేబుల్ బండారు నాని విచారణ ప్రారంభించారు. రవిప్రకాష్ గతంలో పిల్లలను విక్రయించలేదని వారి విచారణలో తేలింది. బిడ్డ తల్లిదండ్రులే ఏవరికైనా దత్తకు ఇవ్వమని చెప్పడంతోనే బిడ్డను వారికి ఇచ్చేందుకు ఒప్పకున్నానని రవిప్రకాష్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో బిడ్డ తండ్రిని కూడా నిందితుడిగా చేర్చుతున్నట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆదివారం రాత్రి రవిప్రకాష్ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచాగా 17రోజులు రిమాండ్ విధించారు. అతడిని సబ్జైలుకు తరలించారు. స్టేషన్కు వచ్చిన బిడ్డ తల్లిదండ్రులు రవిప్రకాష్ నుండి బిడ్డకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. కామవరపుకోట మండలం కొత్తఊరుకు చెందిన దగ్గుమల్లి మోహన్, జ్యోతిలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారై,ఇద్దరు కుమారులు ఉన్నారు. మోహన్ వంట పనులు చేస్తుంటాడు. బిడ్డ పెంపకం భారం కావడంతో తమకు గతంలో పరిచయం ఉన్న రవిప్రకాష్కు శనివారం మధ్యాహ్నం 3గంటలకు బిడ్డను అప్పగించానని. ఉదయం పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చినట్టు బిడ్డ తల్లి జ్యోతి తెలిపింది. బిడ్డను శనివారం రాత్రే చెల్డ్లైన్కు అప్పగించారు.