పబ్లిక్ ఫిగర్ల ప్రభావం తక్కువే!
సర్వే
అధునాతన టెక్నాలజీతో అందివచ్చిన సదుపాయాలను ఆస్వాదిస్తున్న తొలితరం నాడిని పట్టడానికి ప్రయత్నించింది ‘టైటాన్’ సంస్థ. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ సహా వివిధ రకాల వస్తువుల, సేవల విషయంలో 21 యేళ్ల నుంచి 35 యేళ్ల మధ్య వయసున్న వాళ్ల అభిప్రాయాలను, వారు ప్రభావితం అవుతున్న అంశాల గురించి తెలుసుకోవడానికి ఆ సంస్థ ప్రయత్నించింది. ఈ మేరకు ‘ది మిల్లెన్నియల్ పారడాక్స్ వేవ్’ పేరిట ఒక సర్వేను విడుదల చేసింది టైటాన్ కంపెనీ. ఆ సర్వే వివరాలు...
వాడే స్మార్ట్ఫోన్స్ విషయంలోనైనా, ఇతర గ్యాడ్జెట్ల విషయంలో తమ అభిమాన హీరోల, ఇతర పబ్లిక్ ఫిగర్ల చేత తాము ప్రభావితం కావడం లేదని 69 శాతం మంది చెబుతున్నారు! అయితే యువతులపై మాత్రం బ్రాండ్ అంబాసిడర్లుగా వచ్చే సినీ తారల ప్రభావం ఎక్కువగా ఉంది.
అన్ని వయసుల వారినీ పరిగణనలోకి తీసుకొంటే 80 శాతం మంది తమ వ్యక్తిగత విషయాలను సోషల్ నెట్వర్కింగ్ ద్వారా షేర్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అయితే యువతులు మాత్రం ఆ సంగతుల్ని సోషల్ నెట్వర్క్లో పంచుకుంటున్నారు. దాదాపు 67 శాతం మంది తమ వ్యక్తిగత విషయాలను సోషల్ సైట్ల ద్వారా షేర్ చేసుకొంటున్నట్లు సర్వేలో తేలింది.
అయితే, గమ్మత్తేమిటంటే, నెట్వర్కింగ్ సైట్లలో ఖాతా ఉన్నప్పటికీ 41 శాతం మంది మహిళలు తమ వృత్తిగత సమాచారాన్ని మాత్రం పంచుకోవడం లేదు.