somaraju suseela
-
పండుగ స్పెషలు
రేపు మా స్కూల్లో వ్యాస రచన పోటీలట. ఫస్టు సెకెండు థర్డు ఫారం పిల్లలం ‘ఎ’ గ్రూపు. హైస్కూలు పిల్లలు ‘బి’ గ్రూపు. సాయంత్రం నాలుగు నించీ అయిదు దాకా. దేని మీద రాయాలో అప్పటికప్పుడే చెప్తారట. ముందుగా తెలిస్తే నాన్నల చేత రాయించేసుకుంటాం కదా! అందులో ఎలాగైనా ప్రైజు తెచ్చుకోవాలని నా ఆశ. దేనిమీదడుగుతారబ్బా! వార్తా పత్రికలు, గ్రంథాలయములు, విహార యాత్రలు, కత్తి గొప్పదా? కలం గొప్పదా? స్త్రీకి విద్య అవసరమా? ఇలాటివేగా! వాళ్లేదడిగినా కొన్ని వాక్యాలూ సామెతలూ రాసుకునుంచుకుంటే అప్పటికప్పుడు గబుక్కున వాడేసుకోవచ్చు. తల్లిదండ్రులను పూజింపవలెను, గురువే దైవము, విద్యలేనివాడు వింత పశువు... ఈవేళాదివారం కదా! ఉప్మా పెసరట్లు శుబ్బరంగా మెక్కి చిన్నారీ ఇందూ బుజ్జీ నాన్నా కోవటి దివాళా ఆడుకుంటున్నారు. నేనేవో స్కూలు పాఠాలు చదువుకుంటున్నాననుకుని అమ్మ వచ్చి ‘‘అచ్చ బంగారాలే! ఇన్నోటి చదువులే!’’ అంటూ నా తలమీద తడిచేత్తో వూరికే అలా రాసేస్తూ జుట్టంతా రేపేసింది. అసలెప్పుడోగానీ అమ్మ నన్ను ముట్టుకోదు. ఇంత గారాం ఎందుకు చేస్తోందబ్బా! ఏమోలే సవిత్తల్లి గాదుగా! మొన్న అలా అడిగానని కళ్లు ఎర్రబడేలా ఏడ్చింది కూడా! ‘‘అదయిపోయాక ఓసారి నడవలోకి రా! మంచిమాట చెప్తా’’ అంది. ‘‘ఏవిటి? బొబ్బట్లు చేస్తున్నావా?’’ ‘‘అస్తమానం తిండి రంధేనా! ఆడ పిల్లలలా వుండకూడదు’’ అంటూ వెళ్లిపోయింది. ఎంచక్కా చదువులాంటిది చేద్దామని కూచుంటే ఈవిడగారొచ్చి రహస్యం చెప్తా రా అంటే ఇంక నాకు కాలేం నిలబడుతుంది. సందులో హాయిగా మడత మంచం వాల్చుకుని మోచెయ్యి అనించుకుని వత్తిగిలి పడుకుని నాకోసం గుమ్మంకేసి చూస్తోంది. ఈవేళ ఉప్మాపెసరట్టాదివారం కదా! అమ్మకి మధ్యాహ్నం పెద్ద వంట పనుండదు. అన్నం ఒక్కటే చేస్తుంది. అందరూ ఆవకాయ పెరుగు తినాల్సిందే ఏ రెండింటికో! ‘‘నాని బంగారాలూ! మనం సినిమాకెళ్లి ఎన్నాళ్లయిందే?’’ ‘‘అదా సంగతి నా తల్లీ! దొరికావు. ఎందుకా వున్నట్టుండి నన్ను పిలిచావనుకున్నా. కిందటాదివారం కాక ఆ ముందటి వారం’’ అన్నా. ‘‘కాదు పిచ్చీ! మధ్యలో రెండాదివారాలు వెళ్లి పోయాయి. నువ్వేమో కొత్త క్లాసు హడావిడిలో మర్చేపోయావు. మహాబాగు అన్నట్లు నాన్న ఆ విషయమే ఎత్తట్లేదు!’’ ‘‘అవును నిజమేనే. మనందరం సినిమాకెళ్లి చాలా రోజులయింది. కానీ నాన్నతో నువ్వు మాట్లాడేందుకు నా రికమెండేషను కావాలా? నా పేరెందుకు బయటికి రావాలి? నీకు వెళ్లాలనుంటే నువ్వే అడుక్కో. నేనసలే వ్యాసరచన పోటీకి తయారవాలి కదా!’’ ‘‘నీకు బోల్డు సూక్తులు సామెతలు నిమిషంలో నే చెప్తాగా! నేను గానీ సినిమా కెడదావంటే నాన్న ఇంగ్లీషు సినిమా అంటారు. దేవదాసు చూడాలనుందంటే అసలు వినరు. అది ఏడుపు సినిమాట.’’ ‘‘అయినా ఏడుపు సినిమా చూడాలని నీకు సరదా ఎందుకు?’’ ‘‘ఆ సినిమా బాగుంటుందే! నాన్న నొప్పించే పూచీ నీది. రాత్రి బోయినాలలోకి పాయసం చేసే పూచీ నాది. సరేనా?’’ వెంటనే బయలుదేరా. ‘‘నాన్నా! మాకిచ్చిన మాటలన్నీ మర్చిపోయి ఏవిటా పేకాట అసయ్యంగా!’’ ‘‘అమ్మ చెప్పిందేవిటే నీకు? అలా మాట్లాడాలని?’’ ‘‘నాకు రాదేవిటి ఎలా మాట్లాడాలో! పోనీమని మంచి నాన్నవి కదాని గొడవపెట్టకుండా వుంటే మూడాదివారాలు వెళ్లిపోయినా సినిమా పేరెత్తరు.’’ ‘‘ఆల్రైట్రా బాబా. నీమాటే కానిద్దాం. ఏ సినిమా అయినా సరే దేవదాసు తప్ప!’’ ‘‘మనకదే వీలు నాన్నా. మావయ్యగారి చేత ఫోను చేయిస్తే టికెట్లుంచుతారు. రిక్షా ఖర్చుండదు. పైగా అమ్మకి అదే చూడాలనుందిట.’’ సరేనని నాన్నని ఒప్పించాను. ఇంక పాపం అమ్మ మేం అన్నాలు తినడం అవగానే పాయసం చేసి నాకు చూపించి మరీ అలమార్లో పెట్టింది, ఆ గిన్నె కింద నీళ్ల కంచం పెట్టి. నాలుగవగానే ఒక్కొక్కళ్లమే జడలేసుకుని తయారవుతున్నాం. ఇంతట్లో చందర్రావొచ్చాడు సైకిలు తొక్కుకుంటూ యములాడిలా! ‘‘ఏం నాయనా అదివారం అయిదింటికి రొప్పుకుంటూ మరీ వచ్చావు. ఏదైనా సినిమాకు అఘోరించకపోయావా?’’ ‘‘పాపమ్మ గోరూ! సిమెంటు లారీలొత్తాయని నన్నక్కడ కూకోబెట్టేశారు కదా! విజీవాడ్నించి రెండు లోడ్లొచ్చేసినాయ్. సెప్దారని వచ్చినా.’’ నే వెనక్కి తిరిగి చూసేటప్పటికే నాన్న పాంటు షర్టు మార్చేసుకుని, ‘‘చంద్రరావూ! సైకిలు నాకిచ్చేసి నువ్వు నడిచి రారా’’ అని ఇప్పుడే వచ్చేస్తానని, రయ్య్మని వెళ్లిపోయారు. ఇంకేవుంది! సినిమా టయం అయిపోయినా పత్తాలేరు. దేవదాసు కొండెక్కాడు. మేం సినిమా కెళ్లాక ఆ లారీలు తగలడితే ఈ వెధవ మా కోసం సినిమాహాళ్లన్నీ వెతికేవాడా! కోపంగా వెళ్లి వీధిగది కిటికీలో కూచున్నా. ‘‘అనుకోకుండా పని పడితే నాన్న మాత్రం ఏం చేస్తారే పాపం! మళ్లీ ఆదివారం వెడదాంలే. నీ వ్యాసరచన పోటీలున్నాయన్నావుగా. పాయింట్లు రాసుకో నే చెప్తా’’ అమ్మ సర్దబోయింది. ‘‘ఏం అక్కర్లా. నేనెప్పటికీ అస్సలు సినిమాలే చూడను. మీతో కలిసి అస్సలు చూడను. వార్తలు వినాలి పార్కుకెడుతున్న. నాన్నొచ్చాక కనపడమను.’’ ‘‘ఎంత పొగరే నీకు? నాన్న నీకు కనబడాలా? అక్కడే పండు. నే రమ్మనే దాకా రాకు.’’ పరిగెత్తుకుంటూ పార్కుకెళ్లా. అప్పటికే వార్త లొచ్చేస్తున్నాయి రేడియో గొట్టంలో. నేనసలు వార్తలు వినను. అవి వింటూ తలెత్తి గొట్టంకేసి చూస్తూ నిలబడుంటారే పెద్దవాళ్లంతా వాళ్లని చూడ్డం నాకు సరదా. ఎవరైనా వార్తలు మొఖంతో వింటారా, మెడలు నొప్పెట్టేలా? అయినా నాకెందుకులే ఎవరి వీలు వాళ్లది. చీకటి పడిపోయింది. పిల్లలందరూ ఇళ్లకెళ్లిపోయారు. ఒక్కదాన్నే బెంచీమీద కూచున్నా. ఇంకాసేపు కూచుంటే భయం కూడా వేస్తుంది. అమ్మేమో ఇక్కడే పడుండమందిగా. నేనెళ్లిపోతే ఎంత పరువు తక్కువ. అమ్మయ్య! ప్రభువు చల్లగా చూసినట్లున్నాడు. చందర్రావొచ్చాడు. ‘‘అయగారు తమర్నింటికి తీసుకురామ్మని అంపేరండి.’’ ‘‘ఆయన్నే రమ్మను. నన్నమ్మిక్కడే పడుండమంది.’’ పది నిమిషాల్లో నాన్న వచ్చారు. ‘‘ఏంట్రా నానీ. ఈ అల్లరి. మిగతావాళ్లంతా నీలా పేచీ పెడుతున్నారా? మళ్లీ ఆదివారం వెడదాంగా!’’ ‘‘అందరి బదులూ పేచీలు పెట్టేదాన్నని పేరు తెచ్చుకునేందుకు నేనున్నాగా నాన్నా. ఆదివారం నాడు నేననుకున్నది జరగకపోతే వారం అంతా నాకలాగే ఉంటుంది. రేపు వ్యాసరచన పోటీలో ప్రైజేరాదు. రెండో ఆట టికెట్లు తెప్పిస్తేనే ఇంటికొస్తా.’’ నాన్నతో అయితే ఏదైనా చెప్పేయ్యచ్చు. పెద్ద ప్లానెయ్యక్కర్లా. ‘‘నీకన్నీ అమ్మ బుద్ధులేనే. ఒరే చంద్రరావ్, రెండో ఆటకి అయిదు కుర్చీ టికెట్లు తీసుకురా!’’ నాన్న డబ్బులిచ్చాక అప్పుడు లేచా. ‘‘నాన్నా మీరిద్దరూ ఎవరికి వాళ్లు తిన్నగా తిట్టుకోండి. అంతేగానీ అన్నీ నాన్న బుద్ధులే అని అమ్మా, అన్నీ అమ్మ బుద్ధులే అని మీరు అంటే నే పడేది లేదు. అసలే పెద్దదాన్ని కూడా అవుతున్నా!’’ నేనూ నాన్నా ఇంటికెళ్లేటప్పటికి అమ్మ అప్పుడే వంటిల్లు కడిగేసి వంటంతా మధ్య గదిలో పెట్టింది. మంచాలు పక్కలు రెడీగా వున్నాయి. చివరికి నాన్న మంచం కింద మంచినీళ్ల చెంబు కూడా పెట్టుంచింది. తాళం కప్పా చెవీ వీధి గుమ్మానికి తగిలించింది. నే సాధించుకొస్తానని ఈవిడకి తెలియదంటే ఎవరు నమ్ముతారు? - డా. సోమరాజు సుశీల -
స్వాతంత్య్రోద్యమ వీర సావర్కర్
భారత స్వాతంత్య్రోద్యమం తొలినాళ్లలో సుభాష్ చంద్రబోస్, లెనిన్లతో పరిచయమున్న వీర సావర్కర్ అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేశారు. కానీ హిందూ జాతిని మనస్ఫూర్తిగా ప్రేమించారు. 1857వ సంవత్సరంలో జరిగిన ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం ఓడి పోయి ఉండవచ్చు కానీ అది రగిలించిన స్వాతంత్య్ర సము పార్జన కాంక్ష ఎన్నో పోరాటా లకు నాంది పలికింది. లోక మాన్య తిలక్, సుభాష్ చంద్ర బోస్, మోహన్దాస్ గాంధీ వంటి నాయకుల ఆవిర్భావానికి కారణమైంది. గాంధీ నాయకత్వం సత్యం-అహింస మార్గాలనవలంబిస్తే వీర సావర్కర్, భగత్సింగ్, మదన్లాల్ ధింగ్రా, రాజగురు వంటి వారు క్రాంతికారులైనారు. వారు చేసిన బలిదా నాల వల్లనే చివరకు శాంతి, సంప్రదింపులు, సర్దుబాట్ల బాటలో మనం స్వతంత్రులైనాము. సావర్కర్ అనగానే మనకు విప్లవ వీరుడే గుర్తుకు వస్తాడు. కానీ ఆయన వ్యక్తిత్వం, రాజనీతిజ్ఞత, బహుముఖ ప్రజ్ఞ, దార్శనికత, సాహిత్య కృషి, హిందూ సమాజానికి చేసిన సేవలు బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే క్రాం తికారుల బలిదానాల విలువను గుర్తించడం అరుదు. 1883, మే 10వ తేదీన మహారాష్ట్ర, నాసిక్ జిల్లా లోని భాగూర్ గ్రామంలో దామోదర పంత్ - రాధా బాయి సావర్కర్ దంపతులకు రెండవ కుమారునిగా జన్మించి, 1966, ఫిబ్రవరి 26వ తేదీన మహా నిర్యాణం చెందిన వినాయక్రావు సావర్కర్ జీవితం మన స్వాతం త్య్ర పోరాటంలో ఒక ముఖ్యమైన పార్శ్వం. అతిచిన్న వయస్సులో సావర్కర్ సోదరులు తమ కుల దేవతయైన భవానీ మాత చెంత భారతమాత స్వాతంత్య్రానికై తమ సర్వస్వమూ త్యాగం చేస్తామని ప్రతిన పూనారు. కొంత మంది స్నేహితులను కలుపుకొని మిత్రమేళా అనే పేరుతో విప్లవకారుల బృందాన్ని తయారు చేశారు. నాలుగైదు సంవత్సరాలలో ఆ బృందం ‘అభినవ భారత్’గా అవతరించి అనేక రూపాలలో పశ్చిమ మధ్య భారత్, ఐరోపా, కెనడా, ఇంగ్లండ్, జపాన్ దేశాలలో భారత స్వాతంత్య్ర సాధనకై పనిచేసింది. నాసిక్లో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాక పుణే లోని పెర్గూసన్ కళాశాలలో చదువుకునే రోజులలో లోకమాన్యతిలక్తో ఆయన పరిచయం బార్-ఎట్-లా పట్టా కోసం లండన్ ప్రయాణానికి దారితీసింది. లండన్లో ఐరోపా దేశాలలోని అనేక విప్లవ బృందాలతో పరిచయాలు ఏర్ప రచుకున్నారు. ఇండియా హౌస్లో నెల కొల్పిన విప్లవ బృందం భారతదేశానికి ఆయుధాలు, విప్లవ సాహిత్యం పంప డం వంటి పనులు చేసేవారు. ఆ సమ యంలోనే సావర్కర్కు సుభాష్ చంద్రబోస్, లెనిన్లతో పరిచయాలయ్యాయి. 1910, మార్చి 13న విప్లవ కార్య క్రమాలలో పాల్గొంటున్నందుకుగాను ఆయనను అరెస్టు చేసి భారత్కు పంపబోయారు. సముద్రంలోకి దూకి తప్పించుకో ప్రయత్నం చేసిన సావర్కర్ను మళ్లీ అరెస్టు చేసి బొంబాయిలో విచారణ జరిపి యాభై సంవత్స రాల కఠినశిక్ష విధించి అండమాన్ దీవులకు తరలిం చారు. ఆయన ఆస్తి మొత్తం జప్తు చేశారు. మనకు స్వా తంత్య్రం వచ్చాక కూడా ఆయన ఆస్తి తిరిగి ఇవ్వలేదు. ఏ పరిస్థితుల్లో తానున్నా లక్ష్యాన్ని మరువకపోవ డం సావర్కర్లోని విశేషం. అండమాన్ జైలు గోడల మీద అనేక గీతాలు రచించి, విడుదల కాబోయే ఖైదీలకు నేర్పి, వారి ద్వారా మహారాష్ట్రలో ప్రచారం చేసేవారు. ఆ జైలులో ఉన్నప్పుడే కమల, సప్తఋషి, విరోచ్వాసి అనే గీతాలు, కాలాపానీ, మోప్లాంచిబంద్ అనే నవలలు, మాజీ జన్మఠేప్ అనే స్వీయ చరిత్ర, సన్యస్థ ఖడ్గ, ఉషాప్, ఉత్తర క్రియ అనే నాటకాలు రచించారు. భారత దేశంలో ఆయన విడుదలకై జరిగిన పోరాటాల వల్ల పదకొండు సంవత్సరాల తర్వాత భారతదేశంలోని జైలుకు మార్చా రు. చివరకు ఐదు సంవత్సరాలు రాజకీయాలలో పాల్గొ నకూడదనే ఆంక్షలతో 1924లో ఆయనను జైలు నుంచి విడుదల చేశారు. ఆ 5 సంవత్సరాల కాలాన్ని ఆయన హిందువులను సంఘటితం చేసేందుకు, అంటరాని తనం నిర్మూలనకు ఉపయోగించుకున్నారు. రత్నగిరి జైలులో ఉండగా ఆయన రచించిన ‘హిందుత్వ’ అనే పుస్తకం హిందూ నిర్వచనానికి ఉపనిషత్తుల వంటిది. ఆయనపై విధించిన ఆంక్షలన్నీ తొలిగాక 1937 నుంచి హిందూ మహాసభ అధ్యక్షునిగా ప్రత్యక్ష రాజకీ యాలలో చాలా కృషి చేశారు. సావర్కర్కు ఏ మతం పైనా ద్వేషంలేదు. ఆయన అన్ని మత గ్రంథాలను అధ్య యనం చేశారు. కానీ హిందూ జాతిని మనస్ఫూర్తిగా ప్రేమించారు. ఆ జాతి సర్వాంగీణ ఉన్నతికై నిరంతరం శ్రమించారు. మతోన్మాదం చాలా ప్రమాదకారి యని మానవచరిత్రలో దేవుని పేరుతో జరిగినంత మారణ హోమం ధనపిపాస వల్ల జరగలేదనే వారు. వేదాంత గ్రంథాలు చదివే బదు లు విజ్ఞానశాస్త్రం, రాజకీయశాస్త్రం, సాంఘికశాస్త్రం, ఆర్థికశాస్త్రం చదివి యోగ్యతతో జీవించి గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వర్తించాలని చెప్పేవారు. 1937లో అహమ్మదాబాద్లో జరి గిన అఖిల భారత హిందూ మహాసభ లకు అధ్యక్షోపన్యాసం చూస్తూ ‘భారత రాజ్యాన్ని పూర్తి భారతీయంగానే ఉండ నివ్వండి. ఎన్నికల హక్కులలోగాని, ఉద్యోగాలలోగాని, పదవులలోగాని, పన్నుల విధానాలలోగాని, హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య భేదాలు చూపవద్దు. భారత రాజ్యంలోని ప్రతి వ్యక్తినీ వ్యక్తిత్వం ఆధారంగా నిలబడ నివ్వండి. ఒక వ్యక్తికి ఒక ఓటు అనే దానిని సర్వజనీన సిద్ధాంతంగా ఉంచండి’ అని అన్నారు. సావర్కర్ గొప్ప రాజకీయ దార్శనికుడు. దేశ విభజన జరిగి ఒక ముస్లిం దేశం ఏర్పడగలదని 1937లోనే అన్నారు. 1963లో భార తదేశంపై చైనా యుద్ధం ప్రకటించినప్పుడు ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన కళ్లల్లో నీళ్లు మొదటిసారి చూశానని ఆయన కుమారుడు తెలిపాడు. 1966లో తనకు తీరవలసిన కోర్కెలేమీలేవని, తన ధ్యేయసాధన పూర్తయింది కాబట్టి స్వసంకల్పంతోనే తమ దేహాన్ని త్యజిస్తానని ప్రకటించి, క్రమంగా ప్రపం చంతో సంబంధాలను తెంచుకుని దేహత్యాగానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఆహారం, మం దులు నిరాకరించి 22 దినాలు కొద్ది నీటితో మాత్రం జీవించి ఫిబ్రవరి 26వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు దేహత్యాగం చేశారు. మన దేశానికి స్వాతం త్య్రం సిద్ధించాక ఆ మనీషి రెండు దశాబ్దాలు జీవించిన ప్పటికీ ఆయన సేవలను మన జాతి పూర్తిగా ఉపయో గించుకోలేకపోవడం విషాదకరం. ఆయన చరిత్రను నేటి తరానికి పరిచయం చేయడం ఎంతైనా అవసరం. సోమరాజు సుశీల (ఫిబ్రవరి 26న సావర్కర్ 48వ వర్ధంతి) (వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి) suseelasomaraju@gmail.com