వర్షాల కోసం మద్దిలో వరుణ జపం
జంగారెడ్డిగూడెం రూరల్ : వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో శుక్రవారం వరుణ జప పూజలు నిర్వహించారు. ఈ నెల 28 వరకు మూడు రోజుల పాటు వరుణ సూక్త పారాయణం, వారణానువాక జపం, రుద్రహోమాలు, సహస్ర ఘటాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు పాల్గొన్నారు.