అమ్మకాల ఒత్తిడితో నష్టపోయిన మార్కెట్లు
ముంబై: సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరికి స్వల్పనష్టాలతో ముగిసాయి. సెన్సెక్స 48.74 పాయింట్ల నష్టంతో 28,003, నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 8,636.55 దగ్గర ముగిసింది. లాభాల స్వీకరణ,ఆయిల్ ధరల్లో క్షీణతనుమార్కెట్లను నష్టాల్లోకి తీసుకెళ్లాయి. అమ్మకాల ఒత్తిడి, తక్కువ ముడి చమురు ధరలు, రెండు రాబోయే ప్రపంచ సంఘటనల పై మార్కెట్ నెగిటివ్ గా స్పందించింది. దీంతో సోమవారం భారత ఈక్విటీ మార్కెట్ లోని కీలక సూచీలు నష్టాల్లో ముగిసాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ లో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
ప్రారంభంలో అన్ని వైపులనుంచీ పెరిగిన కొనుగోళ్లతో ప్రామాణిక సూచీ సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ చేసింది. వెరసి గరిష్టంగా 28,285కు చేరింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ కూడా 8,700ను అధిగమించింది. ఇది 15 నెలల గరిష్టంకాగా, మిడ్సెషన్ నుంచీ ట్రేడర్లు లాభాల స్వీకరణకు ఉపక్రమించడంతో మార్కెట్లు వెనకడుగు వేశాయి.
బ్యాంకు షేర్లు బేర్.. ఆదుకున్న ఐటీ
ప్రధానంగా బ్యాంకు షేర్లలో అమ్మకాలు మార్కెట్లను దెబ్బకొట్టాయి. ప్రయివేట్, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే ఐటీ కౌంటర్లకు డిమాండ్ పుట్టడంతో ఈ రంగం 2 శాతంపైగా ఎగసింది. ఈ బాటలో మెటల్స్, మీడియా, ఆటో రంగాలు 1.5-0.6 శాతం మధ్య పురోగమించాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టాటా స్టీల్, హిందాల్కో, గ్రాసిమ్, మారుతీ, ఇండస్ఇండ్, విప్రో, టాటా మోటార్స్, బజాజ్ ఆటో 3.5-1.5 శాతం మధ్య జంప్చేశాయి. మరోవైపు ఐసీఐసీఐ 5 శాతం, ఎల్అండ్టీ 4 శాతం చొప్పున పతనమై మార్కెట్లను వెనక్కిలాగాయి. క్యూ1 ఫలితాలు నిరాశపరచడం దీనికి కారణమైంది. మిగిలిన దిగ్గజాలలో భెల్, బీవోబీ, అదానీ పోర్ట్స్, బాష్, కొటక్ బ్యాంక్, ఐడియా, లుపిన్, స్టేట్బ్యాంక్ 2.7-0.7 శాతం మధ్య నీరసించాయి.