success speaks
-
సక్సెస్ స్పీక్స్
‘ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక.. దాని సాధనకు కృషిచేయాలే తప్ప.. ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే చివరకు మిగిలేది మానసిక ఆందోళనే! మానసిక సై్థర్యంతో ముందుకు సాగితే, కచ్చితంగా విజయం లభిస్తుంది. ఒకవేళ ప్రతికూల ఫలితం వచ్చినా,కొత్త విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో ఉన్నత స్థానాలకుచేరుకునేందుకు ఉపయోగపడుతుంది’ అంటున్నారు సివిల్స్ఙ-2015లో 84వ ర్యాంకు సాధించిన చిట్టూరి రామకృష్ణ. ఆయన సక్సెస్ స్పీక్స్... -
గేట్లో మెరిసిన తెలుగుతేజం
సక్సెస్ స్పీక్స్ అందరూ నడిచే దారిలో నడకసాగించటం సాధారణం. కొత్త మార్గానికి బాటలు వేయాలనుకోవడం సాహసం. అదే తన విజయరహస్యం అంటున్నాడు మన తెలుగు తేజం గేట్ టాపర్ గోపు భరత్రెడ్డి. ఇటీవల ప్రకటించిన గ్రాడ్యూయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2014లో మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటిర్యాంకు సాధించాడు. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిష్టాత్మక పోటీ పరీక్ష గేట్లోటాప్ ర్యాంకు సాధించటంపై స్పందిస్తూ.. తన విజయ రహస్యాలను సాక్షితో పంచుకున్నారు. ఊహించని ర్యాంకు మంచిర్యాంకు వస్తుందనుకున్నా. టాప్ ర్యాంక్ రావటం చాలా సంతోషంగా ఉంది. ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్, సబ్జెక్టులపై పూర్తిస్థాయి పట్టుతో దీన్ని సాధించగలిగా. ఈ ర్యాంకు కెరీర్లో మరింత దూసుకెళ్లేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం ఇస్తుందని భావిస్తున్నా. చదువులో నేను మొదట్నుంచీ బెస్ట్స్టూడెంట్నే. పేరెంట్స్.. బెస్ట్ ఫ్రెండ్స్ మాది కరీంనగర్ పట్టణంలోని రాంనగర్. నాన్న ఇంద్రసేనారెడ్డి బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్. అమ్మ లక్ష్మి గృహిణి. తమ్ముడు భార్గవ ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు. నేను పదో తరగతి వరకూ కరీంనగర్లోనే చదివా. ఇంటర్కు హైదరాబాద్ వచ్చా. ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనలియర్ జార్ఖండ్లో చేస్తున్నా. ఫెయిల్యూర్.. సక్సెస్లలో అమ్మానాన్న ఇచ్చే మద్దతు చాలా ముఖ్యం. మా ఇంట్లో అమ్మానాన్న ఇచ్చిన ప్రోత్సాహమే మమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. మాది మధ్య తరగతి కుటుంబం. అందుకే సంపదకన్నా చదువే విలువైనదనే భావన పెంచారు. పదోతరగతిలో 552/600, ఇంటర్ 946/1000 మార్కులు వచ్చాయి. జేఈఈలో 5,900 ర్యాంకుతో జార్ఖండ్ ఐఐటీలో సీటొచ్చింది. మొదట్నుంచి ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఉండేది. అందుకే మైనింగ్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో చేరా. కోచింగ్ తీసుకోలేదు మొదటి సంవత్సరం నుంచే సబ్జెక్టులపై పట్టుసాధించేందుకు కృషి చేశా. ఏ రోజు సిలబస్ను ఆ రోజే పూర్తిచేసేవాణ్ని. వాయిదా వేయటం మరింత బద్దకాన్ని పెంచుతుందనేది నా నమ్మకం. అదే గేట్లో మంచిస్కోరు చేసేందుకు ఉపకరించింది. గేట్ కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. గతేడాది జాతీయస్థాయిలో 6వ ర్యాంకు సాధించిన నా సీనియర్ లీలాకృష్ణ సూచనలు ఉపకరించాయి.పరీక్షలో అధికశాతం ప్రశ్నలు మైనింగ్ సబ్జెక్టు నుంచే ఇచ్చారు. ఎక్స్ప్లోజివ్స్, కోల్డ్మైనింగ్, సేఫ్టీ, రాక్మెకానిజం వంటి అంశాల నుంచి ఇచ్చారు. జెమిన్, రతన్ తాటియా రాసిన బుక్స్ చదివా. ప్రాక్టీసు చేయాలి పోటీ పరీక్షల ప్రిపరేషన్ ఎప్పుడూ ఎగ్జామ్ ఓరియెంటెడ్గా ఉండాలి. సబ్జెక్టుపై కమాండింగ్తోనే మార్కులు సాధించాలనుకోవద్దు. థియరీపై అవగాహన పెంచుకుంటూ ప్రాబ్లమ్స్ను ఎక్కువ ప్రాక్టీసు చేయాలి. వీటన్నింటినీ మించి పాజిటివ్ థింకింగ్ ఎప్పుడూ కొత్త ఎనర్జీని అందిస్తుంది. ఫెయిల్యూర్స్ ఎదురైనపుడు ఆత్మవిశ్వాసాన్ని చెక్కుచెదరనీయకుండా చూసుకోవాలి. మైనింగ్తో కెరీర్ అద్భుతం దేశ, విదేశాల్లో పుష్కలమైన అవకాశాలున్న కోర్సు.. మైనింగ్ ఇంజనీరింగ్. మా సీనియర్లు చాలామంది ఉన్నత సంస్థల్లో మంచి హోదాలో పనిచేస్తున్నారు. పారిశ్రామిక రంగంలో కూడా కెరీర్ను ఉన్నతంగా మలచుకునే వీలున్న కోర్సు ఇది. గేట్ ర్యాంకుతో పీజీ, ఖరగ్పూర్ ఐఐటీలో చేరాలనుంది. ఎన్ ఎంబీసీ, జిందాల్, బిర్లా, కోల్ ఇండియా వంటి సంస్థలు మైనింగ్ కోర్సు పూర్తికాగానే జాబ్ ఆఫర్స్ ఇస్తున్నాయి. పోటీ పరీక్షలకు చదువుతూ వాటిల్లో విజయం సాధించి కెరీర్లో ఉన్నతంగా స్ధిరపడాలన్నదే నా లక్ష్యం! -
పల్లె ప్రతిభకు తార్కాణం.. మంజునాథ
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను సానపడితే.. అద్భుతాలు సృష్టించగలరు అనే ఆశయంతో ప్రారంభమైనవే.. ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలు.. ఇప్పుడు ఆ కలలను నిజం చేస్తూ.. ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు.. అటువంటి విద్యార్థుల్లో ఒకరు.. మోపిరెడ్డిగారి మంజునాథ రెడ్డి. వై.ఎస్.ఆర్. కడపజిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతూ.. ఇటీవలి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎఫ్ఎంసీలో రూ. 5.2 లక్షల వార్షిక వేతనంతో కొలువు సాధించాడు. మంజునాథ విజయ గాథ అతని మాటల్లోనే.. కుటుంబ నేపథ్యం: అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరు మా స్వస్థలం. వ్యవసాయ కుటుంబం. నాన్న మోపిరెడ్డిగారి బైపరెడ్డి. అమ్మ అనసూయ. తమ్ముడు మణికంఠ రెడ్డి చిత్తూరులో బీటెక్ (మెకానికల్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అమ్మానాన్నకు చదువు విలువ తెలుసు. దాంతో మా ఇద్దర్నీ ఉన్నతంగా చదివించాలని సంకల్పించారు. మేం కూడా వారి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో శ్రమిస్తున్నాం. నవోదయ టు ట్రిపుల్ ఐటీ: నవోదయ పరీక్షలో అర్హత సాధించడంతో ఆరు నుంచి పదో తరగతి వరకు లేపాక్షి జవహర్ నవోదయ పాఠశాలలో చదివాను. పదోతరగతిలో 464/500 మార్కులు రావటంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో అడ్మిషన్ లభించింది. ఇందులో మొదటి రెండేళ్లు పీయూసీ ఉంటుంది. తర్వాత నాలుగేళ్లు ఇంజనీరింగ్ బోధిస్తారు. ఇంజనీరింగ్లో మెకానికల్ బ్రాంచ్ను ఎంచుకున్నా. నూతన విధానంలో టెక్నాలజీని ఉపయోగించుకుని వీడియో ద్వారా పాఠాలను బోధించడం వంటివి అంశాలు ఉత్సాహాన్ని కలిగించేవి. నేర్చుకోవాలనే తపనను పెంపొందించేవి. ప్రణాళిక ప్రకారంగా ఉండే ప్రయోగశాలలు, లైబ్రరీ కార్యకలాపాలు క్రమశిక్షణను అలవాటు చేశాయి. ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు ఎంతో స్ఫూర్తి నిచ్చాయి. తద్వారా అనుకున్నది సాధించగలమనే విశ్వాసం ఏర్పడింది. ముఖ్యంగా ఐఐటీ ప్రొఫెసర్ జె.ఎస్. రావు మెకానికల్ ఇంజనీరింగ్లో వస్తున్న మార్పులను వీడియో ద్వారా వివరించడం ఎంతో ప్రభావితం చేసింది. భవిష్యత్లో ఏదైనా పరికరాన్ని కనుక్కోవాలన్న ఆలోచనకు బీజం వేసింది. క్షేత్ర స్థాయి అవగాహనకు: తరగతి గదిలో నేర్చుకున్న దానికంటే ఇంటర్న్షిప్, ప్రాజెక్టు వర్కు వంటి అంశాలు ప్రాక్టికల్గా నాలెడ్జ్ను పెంచుకోవడానికి దోహదం చేశాయి. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఎనిమిది వారాలపాటు ఇంటర్న్షిప్ చేశాను. క్షేత్ర స్థాయిలోని అంశాలపై అవగాహనకు ఇంటర్న్షిప్ ఎంతగానో ఉపయోగపడింది. నానో టెక్నాలజీలో రాగి వినియోగంపై రూపొందించిన ప్రాజెక్టు వర్క్ మంచి గుర్తింపునిచ్చింది. ప్రిపరేషన్ ఇలా: ఇంజనీరింగ్లో సాధించిన మార్కులు క్యాంపస్ ప్లేస్మెంట్కు అర్హత కల్పిస్తాయి. ఆ తర్వాత వ్యక్తిగత సామర్థ్యం, నైపుణ్యాలే ఉద్యోగ సాధనలో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలలో వునం ఇచ్చే రెజ్యుమె కీలక పాత్రను పోషిస్తుంది. రెజ్యుమెలో పేర్కొన్న ప్రతి అంశంపై పట్టుండాలి. ప్లేస్మెంట్ కోసం నెల రోజుల పాటు శిక్షణనిచ్చారు. ఇది ఎంతగానో ఉపయోగపడింది. అంతేకాకుండా నైట్స్టడీస్లో స్నేహితులందరూ రోజూ అర గంట మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్ వంటి వాటిని ప్రాక్టీస్ చేసే వాళ్లం. దాంతో కమ్యూనికేషన్స్కిల్స్, ఇంటర్వ్యూ అంటే భయం పోయింది. ఇవన్నీ ప్లేస్మెంట్లో విజయం సాధించేందుకు ఉపకరించాయి. విధులు: మెకానికల్ ఇంజనీరింగ్లో డిజైనింగ్ నాకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్. 3-డి ప్రింటింగ్కు సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ చేశా ను. జాబ్ ఆఫర్ ఇచ్చిన ఎఫ్ఎంసీ కూడా అదే విభాగంలో అవకాశం ఇచ్చింది. సముద్రంలో ఉన్న గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు అవసరమైన మెషిన్స్ను డిజైన్ చేయటం, వాటిని సముద్రగర్భంలోకి తీసుకెళ్లి రోబోటిక్స్ సాయంతో అమర్చడం వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. రైతుల కష్టాలు తీరుస్తా: అనంతపురం జిల్లా అంటే కరువు గుర్త్తుకొస్తుంది. వర్షాధారంగా పండే పంటలే ఇక్కడి రైతులకు ఆధారం. చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తు పెరిగా. బీటెక్లో చేరాక వాటర్ మేనేజ్మెంట్ ప్రక్రియ గురించి తెలిసింది. కొన్ని దేశాల్లో కొద్దిపాటి వర్షపు నీటితో పదిరెట్లు అధికంగా దిగుబడి సాధిస్తున్నారు. అలాంటి టెక్నాలజీని రూపొందించి కరువు జిల్లాల్లో రైతుల కష్టాలు తీర్చాలనేది నా లక్ష్యం.