నమ్మాలి... ఉచితంగా ఉల్లి
వినడానికి కొత్తగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‘ఉల్లి లొల్లి’ అంతా ఇంతాకాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లి తల్లిని ఉచితంగా ఇస్తున్నారంటే ఎవరా ధర్మాత్ములు అంటారు. ఉల్లిపాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రభుత్వం రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయల కౌంటర్లు తెరిచింది. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా వరుసలో నిలుచున్నా సరుకు దొరకని పరిస్థితి.
‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయద’న్న సామెతను గుర్తెరిగారో యేమో.. అమీర్పేట్ లీలానగర్లో గల సన్షైన్ ప్రి స్కూల్ యాజమాన్యం స్కూల్లో ప్రత్యేక ఉల్లి శిబిరాలను ఏర్పాటు చేసింది. రెండు రోజులపాటు పిల్లలకు తలో కిలో చొప్పున మొత్తం 154 కిలోలు ఉల్లిపాయలు పంపిణీ చేశారు.
స్థానికంగా ఉన్న చిన్నారులు తమ తల్లిదండ్రులతో వచ్చి వీటిని తీసుకున్నారు. ఉచిత వైద్య శిబిరాలు గురించి తెలుసు.. ఉచిత రక్తదాన శిబిరాల గురించి విన్నాం. ఇప్పుడు ఉచిత ఉల్లి శిబిరాల వంతు వచ్చింది.
- సనత్నగర్