ఆలిండియా చెస్ విజేత దివేశ్
రన్నరప్ తులసీరామ్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఫిడే రేటింగ్ (1800 లోపు) చెస్ టోర్నీలో మహారాష్ట్రకు చెందిన బ్రహ్మేచ దివేశ్ విజేతగా నిలిచాడు. యునిక్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో రామంతాపూర్లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి. తొమ్మిది రౌండ్లుగా జరిగిన ఈ పోటీల్లో 14 ఏళ్ల దివేశ్ 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.
హైదరాబాద్ ఆటగాడు తులసీరామ్ కుమార్ 7.5 పాయింట్లతో రెండో స్థానం పొందాడు. శుక్రవారం జరిగిన ఫైనల్ రౌండ్లో దివేశ్.. విజయవాడకు చెందిన ఎం.తేజ సురేష్పై విజయం సాధించాడు. ఏడో రౌండ్ ముగిసేటప్పటికి ముందంజలో ఉన్న తులసీరామ్ చివరి రెండు రౌండ్లలో వెనకబడ్డాడు. ఇక విశ్వనాథ్ వివేక్ (వరంగల్), సాహు దాశరథి (ఒడిశా)లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. మొత్తం 220 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో విజేతలకు సినీ హీరో టి.గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.