డబ్బులివ్వందే పని చేయరట!
రెవెన్యూ అధికారుల తీరుపై బాధితురాలి ఆవేదన
సైదాపూర్: తహసీల్దార్ కార్యాలయంలో డబ్బులివ్వందే పనిచేయడం లేదని బాధితురాలు దొనికెన లలిత మంగళవారం తన గోడు వెళ్లబోసుకున్నారు. మూడేళ్ల క్రితం ఎలబోతారం శివారులో మూడెకరాల భూమిని కొన్నామని, జమాబందీ పాస్బుక్లో ఖాతా నెంబర్ 791 నమోదు కాగా, కంప్యూటర్ ఆన్లైన్లో 1019 అని తప్పుగా నమోదు చేశారని తెలిపారు.
దీని సవరణ కోసం మూడు సంవత్సరాలుగా తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, డబ్బులివ్వందే పని కాదంటూ కంప్యూటర్ ఆపరేటర్ తేల్చిచెప్పాడని ఆరోపించారు. తప్పు చేసింది తహసీల్ కార్యాలయ సిబ్బందేనని, తిరిగి సవరణ చేయమంటే ఇంత గోసపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఎకరంన్నర భూమికొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, జమాబందీ అమలుకు గతేడాది నవంబర్ 21న దరఖాస్తు చేస్తే, అదెక్కడో పోయిందంటే తిరిగి 23న మరోసారి దరఖాస్తు చేశానని పేర్కొన్నారు. ఇప్పటివరకు పనిచేయలేదని, ఈ విషయమై అధికారులను అడుగుతే చివరకు ఫైలే లేదు, అసలు దరఖాస్తు పెట్టుకోలేదని అంటున్నారని తెలిపారు.