కాలువల మూసివేత సాధ్యమేనా? | - | Sakshi
Sakshi News home page

కాలువల మూసివేత సాధ్యమేనా?

Apr 15 2025 12:13 AM | Updated on Apr 15 2025 12:13 AM

కాలువ

కాలువల మూసివేత సాధ్యమేనా?

నేడు మూసివేయడానికి సన్నాహాలు

ఇప్పటికీ శివారు పొలాలకు

సాగు నీటి అవసరం

మరో ఐదు రోజులు పెంచాలని

కోరుతున్న వ్యవసాయ శాఖ

తాగునీటి ప్రాజెక్టుల కోసం కూడా

గడువు పెంచాల్సిందే..

రబీలో ఇప్పటి వరకూ

111 టీఎంసీల వినియోగం

అయినా శివారుల్లో

కీలక సమయంలో సాగునీటి ఎద్దడి

నీటి యాజమాన్యంలో అట్టర్‌ ఫ్లాప్‌

సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా పంట కాలువల మూసివేతకు సాగునీటి పారుదల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం అర్ధరాత్రి నుంచి మూడు ప్రధాన పంట కాలువలకు నీటి విడుదల నిలిపివేయాల్సి ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద హెడ్‌ స్లూయిజ్‌ గేట్లు మూసివేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అయితే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రబీ వరి సాగుకు మరో ఐదు రోజుల పాటు నీరందించాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీ వరకూ గడువు పెంచే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు.

నీటి యాజమాన్యంలో సమన్వయ లోపం

గోదావరి మూడు డెల్టాల పరిధిలో సుమారు 8.86 లక్షల ఎకరాల్లో వరి, ఇతర వ్యవసాయ పంటలు సాగవుతున్నాయి. ఈ సీజన్‌లో సాగుకు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కలిపి మొత్తం 90 టీఎంసీలు ఉంటే సరిపోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలో 4.80 లక్షల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉంది. దీనిలో సుమారు 4.20 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరిగిందని అంచనా. పంట కాలువలు, చానల్స్‌ అధ్వానంగా ఉన్నాయి. ఈ ఏడాది రబీ సాగు ఆరంభంలో షార్ట్‌ క్లోజర్‌ పనులు చేస్తామని చెప్పారు. కానీ పూడిక తీత, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేయలేదు. ఇది సాగునీటి సరఫరాకు ప్రధాన అవరోధంగా మారింది. దీనికితోడు నీటి యాజమాన్య విషయంలో అధికారుల మధ్య సమన్వయం కొరవడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

డెల్టాకు 111 టీఎంసీలు

గోదావరి డెల్టాలో డిసెంబర్‌ 7వ తేదీన మొదలైన రబీ షెడ్యూలులో ఈ నెల 15 వరకూ 111.355 టీఎంసీల నీటిని పంట కాలువలకు విడుదల చేయాలని నిర్ణయించారు. దీనిలో తూర్పు డెల్టాకు 34.293, మధ్యడెల్టాకు 20.291, పశ్చిమ డెల్టాకు 56.478 టీఎంసీల చొప్పున అందించారు. రబీ సాగు, ఇతర అవసరాలకు వాస్తవంగా 90 టీఎంసీలయితే సరిపోతుంది. కానీ అంతకన్నా అధికంగా నీరు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. అయినా డెల్టా శివారులు, మెరక ప్రాంతాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తూర్పు డెల్టా, పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌, మధ్య డెల్టా అనే తేడా లేదు. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని ఇంచుమించు అన్ని మండలాల్లోనూ ఏదో ఒక సందర్భంలో రైతులు నీరందక ఇబ్బంది పడ్డారు. తూర్పు డెల్టాలో కరప, కాజులూరు, తాళ్లరేవు, కె.గంగవరం, పీబీసీలో కొత్తపల్లి, మధ్య డెల్టా పరిధిలో ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం మండలాల్లో చేలు నెర్రెలు తీసిన విషయం తెలిసిందే.

వంట కాలువలకు విడుదల చేసిన నీటితో పాటు డెల్టాలో పలుచోట్ల వ్యవసాయ విద్యుత్‌ మోటార్లతో చేలకు పెద్ద ఎత్తున నీరందించారు. ఇలా కనీసం ఒకటిన్నర టీఎంసీ, మురుగునీటి కాలువలపై క్రాస్‌బండ్లు వేసి కూడా నీటిని చేలకు మళ్లించడం ద్వారా మరో ఐదు టీఎంసీల వరకూ నీటిని చేలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. ఇలా చూస్తే మొత్తం 117.50 టీఎంసీల నీటిని రబీ కాలంలో అందించినట్టు. అయినప్పటికీ తూర్పు, మధ్య డెల్టాలోని ఏకంగా 11 శివారు మండలాల్లో సాగుకు నీటి ఎద్దడి ఏర్పడిందంటే అది ముమ్మాటికీ నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యమేనని రైతులు చెబుతున్నారు. నీటి ఎద్దడి ప్రభావంతో రైతులు పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పంట బోదెలు, చానల్స్‌ నుంచి, డ్రెయిన్ల నుంచి మోటార్లతో నీరు తోడకం వల్ల ఎకరాకు అదనంగా రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకూ పెట్టుబడి అయ్యింది. ఎద్దడికి గురైన ప్రాంతంలో దిగుబడి పడిపోవడంతో.. లాభాలు రావడం మాట అటుంచి పెట్టుబడులు వస్తే గొప్ప అన్నట్టుగా పరిస్థితి మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

నేడు నిర్ణయం

డెల్టాలో రబీ సాగుకు మరో ఐదు రోజుల పాటు గడువు పెంచే అవకాశముంది. దీనిపై మంగళవారం ధవళేశ్వరంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తరువాత బ్యారేజీ గేట్లు మూసివేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కోనసీమ జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు అభ్యర్థించడంతో ఇరిగేషన్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ గోపీనాఽథ్‌, గోదావరి డెల్టా సిస్టమ్‌ చీఫ్‌ ఇంజినీరు (సీఈ) దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయ శాఖతో పాటు తాగునీటి చెరువులు పూర్తిస్థాయిలో నింపాల్సి ఉన్నందున ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కూడా గడువు పెంచాల్సిందిగా కోరుతున్నారు. ఈ కారణంగా కాలువల మూసివేత గడువును ఈ నెల 20 వరకూ పెంచే అవకాశముందని సమాచారం.

డెల్టా ప్రధాన పంట కాలువలకు

డిసెంబర్‌ 7 నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ నీటి విడుదల (టీఎంసీలలో..)

తూర్పు డెల్టా : 34.293

మధ్య డెల్టా : 20.291

పశ్చిమ డెల్టా : 56.478

కాలువల మూసివేత సాధ్యమేనా? 1
1/1

కాలువల మూసివేత సాధ్యమేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement