హన్మకొండ చౌరస్తా: తెల్లారితే అడ్డా మీద పనికోసం వెదుకులాట.. కూలీ దొరికితేనే కుటుంబం గడిచేది.. లేదంటే పస్తులే. ఇలా దినదిన గండంగా బతుకులీడుస్తున్న అడ్డా కూలీలకు సర్కారు నుంచి భరోసా కరువైంది. కార్మిక సంక్షేమ శాఖ నుంచి అందాల్సిన సాయం వారి దరి చేరడం లేదు. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వ సాయం అందక అవస్థలు పడుతున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక కార్మికశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం కార్మిక సంక్షేమ శాఖ ద్వారా నిర్మాణ రంగ కార్మికులకు పలు ప్రయోజనాలను అందజేస్తోంది. అందుకోసం భవనం, ఇతర నిర్మాణ రంగ కార్మికులు ఏటా రూ.110 చెల్లించి కార్మిక శాఖలో పేరు నమోదు చేసుకోవాలి. అనంతరం కార్మికులకు కార్మిక శాఖ నుంచి గుర్తింపు కార్డు అందజేస్తారు. అప్పటి నుంచి కార్మిక సంక్షేమ శాఖ ద్వారా ప్రయోజనాలు వర్తిస్తాయి.
పెండింగ్లో 8 వేల దరఖాస్తులు..
వివిధ కేటగిరీల్లో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా కార్మిక కుటుంబాలకు నిరాశే మిగిలింది. 2023 జనవరి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8వేల పై చిలుకు నిర్మాణ రంగ కార్మిక కుటుంబాలు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నాయి.
కార్మికులకు అందించే సంక్షేమ ఫలాలు..
● కార్మిక సంక్షేమ శాఖ ద్వారా గుర్తింపు కార్డు కలిగిన నిర్మాణ రంగ కార్మికులకు వివిధ కేటగిరీల్లో లబ్ధి చేకూర్చుతుంది.
● భవన నిర్మాణ కార్మికుడి కూతురు వివాహానికి రూ. 30వేలు సాయం.
● కార్మికుడి భార్య లేదా కార్మికురాలు ప్రసూతి సాయానికి రూ.30 వేలు.
● నిర్మాణ కార్మికుడు మృతి చెందితే దహన సంస్కారాలకు రూ.30 వేలు.
● నిర్మాణ కార్మికుడు సహజ మరణం పొందితే రూ.లక్ష.
● ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం రోజుకు రూ.300 చొప్పున రూ.4,500 వరకు చెల్లింపు.
● నిర్మాణ రంగ నైపుణ్యత శిక్షణకు రోజుకు రూ.300 ఇస్తారు.
● పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు అంగవైకల్యం పొందితే రూ.4 నుంచి రూ.5లక్షలు
● ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 6లక్షల సాయం ఇస్తారు.
●
భవన నిర్మాణ కార్మికులకు అందని ఆర్థిక సాయం
పెండింగ్లో 8వేల పైచిలుకు దరఖాస్తులు
ఏడాదిన్నరగా ఎదురుచూపులు
Comments
Please login to add a commentAdd a comment