ఖానాపురం: పాకాల.. పక్షుల కిలకిలరావాలు.. అటవీ జంతువులు అరుపులు, సేలయేటి చప్పుళ్లు, పచ్చని ప్రకృతికి నెలవు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం అశోక్నగర్ శివారులో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఈ సరస్సుకు వరంగల్తోపాటు ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వేసవితోపాటు సరస్సు నిండుకుండలా ఉన్న సమయంలో పర్యాటకుల సంఖ్య కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో సరస్సులో బోటింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. గతంలో పెద్ద బోట్, స్పీడ్ బోట్తో పాటు జెట్టిబోట్ (చిన్న ఫంక్షన్లు చేసుకునే విధంగా) నడిచేవి. బోటింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పర్యాటక అభివృద్ధికి వినియోగంచుకోవడానికి అవకాశం ఉండేది. కానీ నాలుగు సంవత్సరాల క్రితం పర్యాటక, అటవీశాఖల సమన్వయ లోపంతో పాకాల సరస్సులో ఉన్న బోట్లు తరలిపోయాయి. దీంతో ఇక్కడ బోటింగ్ కలగానే మిగిలిపోయింది. బోట్లు తరలిపోయిన తర్వాత పర్యాటకుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. వచ్చిన వారు కూడా బోటింగ్ లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ తిరుగుప్రయణామవుతున్నారు.
ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో శ్రీకారం..
పాకాలలో బోటింగ్ ఏర్పాటుకు టూరిజం, ఫారెస్ట్ అధికారుల మధ్య సయోధ్య కుదరడంలేదు. అయితే పర్యాటకులు మాత్రం బోటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు ప్రైవేట్ సంస్థ ద్వారా బోటింగ్ సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మూడు రోజుల క్రితం ఓ ప్రైవేట్ సంస్థ బాధ్యులను తీసుకొచ్చి బోటింగ్ సౌకర్యంపై పరిశీలన చేసినట్లు సమాచారం. బోటింగ్ నిర్వహణ చేపట్టే సంస్థలతో ఏకకాల ఒప్పందం లేదా వచ్చే ఆదాయంలో పంపకం చేసుకుని నిర్వహణ చేయించేలా చర్యలు చేపడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఓ ప్రైవేట్ సంస్థ బాధ్యులు త్వరలోనే బోటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా, అటవీశాఖ ఆధ్వర్యంలో బోటింగ్ సౌకర్యం కల్పిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
పాకాలలో బోటింగ్?
ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో చర్యలు
ప్రైవేట్ సంస్థల ద్వారా ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment