నారాయణపేట రూరల్: పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు రెగ్యులర్ స్వీపర్లు లేక కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడానికి తాత్కాలిక పద్దతిలో సిబ్బందిని నియమించుకునే వారు. అయితే గత ప్రభుత్వం రెండేళ్ల కింద ఇచ్చిన ఆదేశాలతో పాఠశాలలు సహా అంగన్వాడీ కేంద్రాలు, బస్సు ప్రాంగణాలు, రేషన్ దుకాణాలు, వైద్యశాలలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీలకే బాధ్యతను అప్పగించింది. దీంతో పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లను తొలగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 2022 ఆగస్ట్ 31 నుంచే ఆదేశాలు వర్తింపచేయడంతో చాలీచాలని పంచాయతీ సిబ్బంది పాఠశాల శుభ్రత విషయంలో నామమాత్రంగా పనిచేస్తున్నారు. దీంతో విద్యాలయాల ప్రాంగణాలు, గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారాయి. చేసేదిలేక ఉపాధ్యాయులే చీపుర్లు పట్టి శుభ్రం చేసుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరైతే ఇంతకి పాఠశాల్లో స్వచ్ఛత సాధ్యపడుతుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లా వ్యాప్తంగా 533 ప్రభుత్వ పాఠశాలల్లో 58,800 విద్యార్థులు ఉన్నారు. వీరికి 538మంది స్కావెంజర్లు రెండేళ్ళ కింది వరకు పనిచేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో వీరిని తొలగించారు. వెయ్యి మంది చిన్నారులు ఉన్న చోట కూడా ఒక్క స్కావెంజర్ మాత్రమే ఉండి విధులు నిర్వహించగా, తాజా పరిస్థితులతో ఆ ఒక్కరు సైతం లేకపోతే కలిగే ఇబ్బందులపై హెచ్ఎంలు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో ప్రతి రోజు మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రం చేయాల్సిన మూత్రశాలలు, మరుగుదొడ్ల పరిస్థితి గోరంగా తయారవుతూ ఉంటుంది. జిల్లాలో 280 గ్రామపంచాయతీల్లో సుమారు 5లక్షల మంది జనాభ ఉంది. వీరికే చాలీచాలని విధంగా 700మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. గ్రామాల్లో పని చేయడానికే చాలడం లేదు అంటే వీరికే పాఠశాలల బాధ్యత అప్పగిస్తే ఎలా పనిచేస్తారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment