ఖలీల్వాడి: బొగ్గు గనుల ప్రైవేటీకరణను మానుకొని సింగరేణికి గనులను కేటాయించాలని సీపీఎం అఖిల భారత కమిటీ నాయకులు బి వెంకట్ డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సింగరేణిని నష్టాల బాటలోకి నెట్టడానికి సింగరేణికి బొగ్గు గనులను కేటాయించడం లేదన్నారు. ఓపెన్ టెండర్లలో సింగరేణి కూడా పాల్గొనాలని చెప్పడం అంటే ఉద్దేశపూర్వకంగా ప్రైవేటీకరణ వైపు ఆలోచించటమే అవుతుందన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికై న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి తేవాల్సిందిపోయి కార్పొరేట్ కంపెనీలకు సహజ వనరులను కట్టబెట్టడం సరైంది కాదన్నారు. వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు రావడం, విద్యుత్ కొరత లేకపోవడానికి సింగరేణి లాంటి బొగ్గు గనులే కారణమన్నారు. సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం ఆదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందని ఆరోపించారు. దీని మూలంగా వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్ట పెట్టాల్సి వచ్చిందన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ వేలాన్ని నిరసిస్తూ 28, 29 తేదీల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చినట్లు తెలిపారు. ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment