మాక్లూర్: మాక్లూర్ వ్యవసాయ పరపతి సంఘంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరగడంతో సోమవారం అసిస్టెంట్ రిజిస్ట్రార్, బాల్కొండ క్లస్టర్ అధికారి రమావతి కొత్తూర్ విచారణ చేపట్టారు. సాక్షి దినపత్రికలో ఈ నెల 2న ‘రూ. 70 లక్షల ఎరువులు మింగేశారు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు విచారణ అధికారిణిని నియమించారు. ఆమె సోమవా రం మాక్లూర్ సొసైటీలో విచారణ నిర్వహించారు. ఎరువులకు సంబంధించి రూ. 70.50 లక్షల్లో ఇప్పటికే రూ. 10 లక్షల వరకు వసూలు చేశామని.. మిగతా సొమ్ము కూడా అతిత్వరలో రాబడతామని కార్యదర్శి సంతోష్ తెలిపారు. ఇదిలా ఉండగా మాదాపూర్, బొంకన్పల్లి గోదాంలు నిర్మించకుండానే నిర్మించినట్లు పుస్తకాల్లో రాసి రూ. 45 లక్షలు డ్రాచేసిన వైనాన్ని చూసి విచారణ అధికారిణి ఆశ్చర్యపోయారు. అంతే కాకుండా ఒక్క పంట సీజన్ ఖర్చు రూ. 43 లక్షలుగా రాశారు. బంగారం పెట్టు కుని రైతులకు రుణాలు ఇచ్చినట్లు ఉన్నా.. అక్కడ బంగారం లేదు. ప్రాథమికంగా చూస్తేనే ఇంత భారీఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. లోతుగా విచారిస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ మరింత పకడ్బందీగా నిర్వహించామని విచారణాధికారిణి తెలిపారు.
కల్లెడి గ్రామానికి చెందిన మేడిపల్లి సుధాకర్ అనే రైతు హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఏప్రిల్లో రూ. 83 వేలు, నవంబర్లో 83 వేలు తిరిగి చెల్లించాడు. కానీ కార్యదర్శి సంతోష్ వాటిని జమ చేసినట్లు చూపించలేదు. ఇలాంటి అక్రమాలు సైతం సొసైటీలో జరిగినట్లు విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment