
రాజుపాలెం: నేతి వెంకన్న స్వామిగా ప్రసిద్ధికెక్కిన మండలంలోని దేవరంపాడుకొండపై మత్స్యరూపంలో వెలసిన వేంకటేశ్వరుని తిరునాళ్ల సందర్భంగా తొలి శనివారం వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర జలనవరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్.శివశంకర్ తదితరులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. వీరికి వేదపండితులు మేళతాళాలు, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. సమీప ప్రాంతాల నుంచే కాక సూదూర ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. గోవిందనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. భక్తులు స్వామివారికి పొంగళ్లు పొంగించి నెయ్యి, బెల్లం, పప్పు వగైరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో దేవదాయశాఖ నుంచి ఆలయంలో మండపం నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేశామని అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వారి వెంట డీఎఫ్ఓ రామచంద్రరావు, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి, సహాయ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, మండల కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు, ఎంపీపీ తేలుకుట్ల రాజేశ్వరి చంద్రమౌళి, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ మర్రి సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సునీత, మాజీ ఎంపీపీ బాసు లింగారెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ అంబటి బ్రహ్మయ్య, సర్పంచ్ పత్తిపాటి దీనమ్మ కోటేశ్వరరావు, ఈఓ గుర్రం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకువస్తున్న మంత్రులు కొట్టు, అంబటి, ఎంపీ లావు
Comments
Please login to add a commentAdd a comment