సైక్లింగ్‌ సుబ్బయ్య.. 57ఏళ్ల వయస్సులో వెయ్యి సెంచరీలు | - | Sakshi
Sakshi News home page

సైక్లింగ్‌ సుబ్బయ్య.. 57ఏళ్ల వయస్సులో వెయ్యి సెంచరీలు

Jul 23 2024 3:30 AM | Updated on Jul 23 2024 12:35 PM

-

వెట‘రన్‌’ క్రీడాకారుడి ప్రతిభ 57ఏళ్ల వయస్సులో వెయ్యి సెంచరీలు

సైకిల్‌ ఎక్కాక దిగకుండా వంద కిలోమీటర్లు తొక్కితే ఒక సెంచరీ

1.35 లక్షల కి.మీ. సైక్లింగ్‌ చేసిన క్రీడా యోధుడు

యోగా, స్విమ్మింగ్‌లోనూ సత్తాచాటుతున్న వైనం

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనత సాధించిన ఏకై క వ్యక్తి

గుంటూరు వెస్ట్‌ ( క్రీడలు) : వయసు పెరుగుతున్నా సెంచరీలు కొట్టే వయసు నాది అంటూ సైక్లింగ్‌లో సత్తాచాటుతున్నారు గుంటూరుకు చెందిన వెటరన్‌ క్రీడాకారుడు బండ్లమూడి సుబ్బయ్య. కఠోర సాధనతో సైక్లింగ్‌లో వెయ్యి సెంచరీలు(వంద కిలోమీటర్లు ఓ సెంచరీ) పూర్తిచేసి అందరినీ ఔరా అనిపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారభమయ్యే ఆయన సైకిల్‌ ప్రయాణం దాదాపుగా 8.30 గంటలకు పూర్తవుతుంది. సైక్లింగ్‌తోపాటు యోగా, స్విమ్మింగ్‌ల్లోనూ రాణిస్తున్నారు.

సరదాగా ప్రారంభమై..
తొలి నాళ్లలో స్విమ్మింగ్‌ సాధన చేసిన సుబ్బయ్యకు కరోనా సమయంలో సైక్లింగ్‌పై మక్కువ పెరిగింది. స్నేహితులతో ప్రారంభమైన సైకిల్‌ సవారీ ఇప్పుడు ఆయనను లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ దిశగా తీసుకెళుతుంది. ఈయన నగరంలోని కొందరు వైద్యులతో కలిసి సైక్లింగ్‌ క్లబ్స్‌ ప్రారంభించారు. ప్రజలను సైక్లింగ్‌ చేసేలా ప్రోత్సహిస్తున్నారు.

మల్టీ ట్యాలెంట్‌
జాతీయ స్థాయిలో స్ట్రావా అనే యాప్‌ ఉంది. సైక్లిస్ట్‌లు దాన్లో తమ వివరాలు నమోదు చేసుకుంటే వారు సైక్లింగ్‌ చేసే స్పీడ్‌తోపాటు ఎన్ని కిలోమీటర్లు ఎంత సమయంలో పూర్తి చేశారనే వివరాలు నమోదు చేస్తుంది. సుబ్బయ్య ఇటీవల 1,000 సెంచరీలతోపాటు సుమారు 1.35 లక్షల కిలోమీటర్లు దూరం పూర్తి చేశారు. రోజూ ఉదయం 100 కి.మీ. నాన్‌ స్టాప్‌గా సైకిల్‌ తొక్కుతారు. ఇదొక రికార్డనే చెప్పాలి. జాతీయ స్థాయిలో జరిగే సైక్లింగ్‌ చాలెంజ్‌ పోటీల్లో సుబ్బయ్య విజయాలు సాధించారు. సుబ్బయ్య స్విమ్మింగ్‌లో మాస్టర్స్‌ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 30కుపైగా కాంస్య, రజత, బంగారు పతకాలతోపాటు మరో 3 జాతీయ స్థాయి పతకాలు సాధించారు. కృష్ణా నదిలో 1.5 కి.మీ.లను నాలుగుసార్లు ఈది బహుమతులు సాధించారు. యోగాసనాలతో మంత్రముగ్దుల్ని చేస్తారు. సుబ్బయ్యకు 57 సంవత్సరాలు. ఇటీవల ఆయన కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 3,700 కిలోమీటర్లు సైక్లింగ్‌ను స్నేహితులతో కలిసి పూర్తి చేశారు.

ఆరోగ్యం కోసం ఏదైనా చేయండి
సంపాదనలో పడి చాలా మంది ఆరోగ్యంపై కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అందుకే కరోనా సమయంలో విపరీతమైన ప్రాణనష్టం జరిగింది. ఆ సమయంలో నా సన్నిహితులనూ కోల్పోయాను. ప్రజలకు అవగాహన కలి్పంచాలంటే ముందుగా నేను ఆచరించాలి.  అందుకే సైక్లింగ్, స్విమ్మింగ్, యోగాల్లో ప్రావీణ్యం పొందాను. ఎవరికి నచ్చిన క్రీడలో వారు సాధన చేస్తే మంచిది.  రానున్న నవంబర్‌లో గోల్డెన్‌ క్వార్డిలేటర్‌ చెన్నై– కోల్‌కతా–ఢిల్లీ–ముంబై ఈ నాలుగు ప్రధాన నగరాలను కలుపుకుంటూ సుమారు 6,000 కి.మీ. మేర సైక్లింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను.           
 – బండ్లమూడి సుబ్బయ్య, సైక్లిస్ట్, గుంటూరు  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement