
ఆత్మకూరు హెచ్ఎం సస్పెన్షన్
అనంతపురం ఎడ్యుకేషన్: ఆత్మకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెండ్ శ్రీనివాసప్రసాద్పై సస్పెన్షన్ వేటు పడింది. గత నెల 29న ఆత్మకూరు పరీక్ష కేంద్రంలో కేజీబీవీ విద్యార్థిని అప్పటికే తనకు తెలిసిన ప్రశ్నలన్నింటికీ జవాబులు రాసి కూర్చుంది. ఆ సమయంలో ప్రశ్నపత్రం కిందకు పడిపోయి గాలికి వెనుక వైపు బెంచీవద్దకు వెళ్లింది. అదే సమయంలో చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసప్రసాద్ ఆ గదిలో చేరుకుని పరిశీలిస్తున్న క్రమంలో ఆ విద్యార్థిని వద్దకు వెళ్లాడు. ఆన్షర్ షీటు మాత్రం కనిపించడంతో ప్రశ్నపత్రం ఎక్కడ? అని అడిగాడు. హఠాత్పరిణామంతో ఆ విద్యార్థిని తీవ్ర కంగారుకు గురైంది. ఇక్కడే ఉందంటూ ఆందోళన చెంది వెతుకుతుండగా ఒక్కసారిగా కర్రతో ఆ విద్యార్థినిని చితకబాదాడు. దాడిలో భుజపుటెముక విరిగింది. దీంతో తర్వాత రోజు పరీక్ష రాయలేని పరిస్థితి. ఈ పరిణామంపై ‘సాక్షి’లో ‘శ్రీనివాసా...ఇదెక్కడి ‘కర్ర’ పెత్తనం శీర్షికతో కథనం వెలువడింది. దీనిపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. స్వయంగా పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు ఈ ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినిది ఏమాత్రం తప్పు లేదని హెచ్ఎం ఓవర్గా రియాక్ట్ అయ్యాడంటూ జిల్లా అధికారులు వివరించడంతో సదరు హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో హెచ్ఎం శ్రీనివాసప్రసాద్ను సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు.