తాంబరం – తిరువనంతపురం రైలు నెల పొడిగింపు
తిరువొత్తియూరు: దక్షిణ జిల్లాల్లో నడుస్తున్న రైళ్లను ప్రయాణికుల కోరిక మేరకు రైలు సేవలు పొడిగింపు చేయడం జరుగుతుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. తాంబరం–తిరువనంతపురం నార్త్ ప్రత్యేక రైలు చెంగల్పట్టు, మేల్మరువత్తూరు, విల్లుపురం, విరుదాచలం, అరియలూరు, శ్రీరంగం, తిరుచ్చి, దిండుక్కల్, మదురై, విరుదునగర్, శివకాశి, శ్రీవిల్లిపుత్తూరు, రాజపాళ్యం మీదుగా నడుస్తుంది. నందపురం (కొచ్చువేలి)తాంబరం–తిరువనంతపురం నార్త్ ప్రత్యేక రైలు సేవ (నెం.06035) సేవ శుక్రవారం 4వ తేదీతో పూర్తయింది. దీంతో ఈ రైలు సర్వీసును మరో నెలపాటు పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించారు. దీని ప్రకారం ఈ రైలు సర్వీసును ఈనెల 11వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు పొడిగించనున్నారు. అవతలి వైపు నుంచి తిరువనంతపురం–తాంబరం వారాంతపు ప్రత్యేక రైలు (నెం.06036) సర్వీసు ఆదివారం 6వ తేదీతో పూర్తవుతుంది. దక్షిణ రైల్వే ఈ రైలు సర్వీసును ఈ నెల 13 నుంచి మే 4 వరకు పొడిగించింది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రతి శుక్రవారం తాంబరం నుంచి ప్రతి ఆదివారం తిరువనంతపురం నుంచి బయలుదేరుతాయి. రెండు మార్గాల్లో రైళ్ల సర్వీసులను మరో నెల రోజులు పొడిగించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కస్టమ్స్లో బదిలీ చర్చ
●పది మంది అధికారులపై వేటు
సాక్షి, చైన్నె : చైన్నె విమానాశ్రయం కస్టమ్స్ విభాగంలో శనివారం బదిలీల పర్వం చర్చ జోరందుకుంది. ఒకే రోజు పది మంది అధికారులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇందులో కస్టమ్స్ ప్రధాన కమిషనర్ రామ్ వత్ శ్రీనివాస నాయక్ పేరు కూడా ఉండటం గమనార్హం. చైన్నె విమానాశ్రయంలోని కస్టమ్స్ విభాగం నిత్యం వార్తలలో ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ విభాగంలోకి అధికారులపై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రధాన కమిషనర్ సహా పదిమందిపై బదిలీ వేటు వేశారు. కస్టమ్స్ చీఫ్ కమిషనర్గా రామ్ వత్ శ్రీనివాస నాయక్ 2023లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను హఠాత్తుగా ఇక్కడి నుంచి బదిలీ చేశారు. ఆయన స్థానంలో పదోన్నతిపై తమిళ్వలవన్ను నియమించారు. శ్రీనివాస నాయక్ను జీఎస్టీ విభాగానికి మార్చారు. అలాగే అదననపు కమిషనర్లు శరవణన్ , అశ్వత్ బాజ్, బాబుకుమార్ జే బాగ్, అజయ్ పీటర్, సుధాకర్తో సహా అధికారులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించారు. అలాగే చైన్నె సెంట్రల్ రెవెన్యూ విభాగం అసిస్టెంట్ కమిషనర్ పూనమ్ను నాగ్పూర్కు, మరో అధికారి గౌరి శంకర్ జీఎస్టీ విభాగానికి బదిలీ చేశారు. ఒకే రోజు ఇంత పెద్దసంఖ్యలో విమానాశ్రయం కస్టమ్స్ విభాగంలో బదిలీలు జరగడం చర్చకు దారి తీసింది.
క్రీడా నగరం కసరత్తు
చైన్నె శివారులో గ్లోబల్ స్పోర్ట్స్ సిటీ( ప్రపంచ స్థాయి క్రీడా నగరం) ఏర్పాటుకు సీఎం స్టాలిన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కసరత్తులపై డిప్యూటీ సీఎం, క్రీడల మంత్రి ఉదయ నిధి స్టాలిన్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా శనివారం సచివాలయంలో మంత్రి టీఆర్బీ రాజ, సీఎస్ మురుగానందం, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ, సభ్య కార్యదర్శి జె. మేఘనాథరెడ్డితో పాటూ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
– సాక్షి, చైన్నె
రేపు రథోత్సవం
తిరువొత్తియూరు: తిరువారూర్లో వెలిసిన శ్రీత్యాగరాజస్వామి ఆలయంలో పంగుణి ఉత్తరం ఉత్సవాలలో భాగంగా సోమవారం ఘనంగా రథోత్సవం నిర్వహించనున్నారు. తిరువారూరులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శ్రీత్యాగరాజ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శైవమతం ప్రధానంగా ఉంది. ఈ ఆలయ రథాన్ని ఆసియా ఖండంలోనే అతిపెద్ద రథంగా పిలుస్తారు. ఈ ఆలయ ఉత్సవాల్లో పంగుణి ఉత్తరం ఉత్సవాలు ప్రత్యేకత కలిగి ఉంది. ఈ ఆలయంలో మహా రథోత్సవం సోమవారం(7వ తేదీ) జరగనుంది. రథానికి కొయ్య గుర్రాలను అలంకరించే పనులు, కొబ్బరి చెట్టుకు అమర్చే పనులు, చెక్క వస్తువులను తయారు చేసే పనులు ముమ్మరంగా జరిగాయి. ఈ పనులు శుక్రవారంతో పూర్తయ్యాయి. రథంలో చెక్క గుర్రాలు అమర్చబడి రథోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. తిరువారూరులో రథోత్సవం సందర్భంగా స్థానికంగా సెలవు ప్రకటించారు.
తాంబరం – తిరువనంతపురం రైలు నెల పొడిగింపు


