వేలూరు: జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అవసరమైన బందోబస్తును పెంచాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆదేశించారు. వేలూరు జిల్లా తందై పెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్కు ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో విరుదంబట్టు, సేనూరు, జంగాలపల్లి, తారాపడవేడు, సేర్కాడు, పొన్నై మొదలైన వాటిని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని, ఆ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే అధికారులతో చర్చించామన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని, వృద్ధులు, వికలాంగులు క్యూలైన్లతో పనిలేకుండా నేరుగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్లు తదితర కనీస వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశించామన్నారు. అనంతరం వేలూరు కలెక్టరేట్లోని ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో ఈవీఎంలను నియోజక వర్గాలకు తరలించడం, అలాగే జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్కు ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ సెంటర్ల పరిశీలన ఇత్యాది వాటిపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్తో పాటు ఎస్పీ శివరామన్, జిల్లాలోని ఎన్నికల అఽధికారులు పాల్గొన్నారు.


