– కమిషనర్ ప్రేమానంద్ సిన్హా
తిరువళ్లూరు: ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు కల్పించాలని ఆవడి కమిషనర్ ప్రేమానంద్సిన్హా ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని, పాత నేరస్తులను గుర్తించి బైండోవర్కు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు. అనంతరం సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, ఇతర విషయాలపై దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో పలువురు డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు, ఇనెస్పెక్టర్లు పాల్గొన్నారు.


