సాక్షి, చైన్నె : కోయంబత్తూరులోని ప్రసిద్ధ గంగా హాస్పిటల్, ప్లాస్టిక్ సర్జరీ, హ్యాండ్ అండ్ మైక్రోసర్జరీ, బర్న్స్ విభాగం నేతృత్వంలో గ్లోబల్ సర్జికల్ ట్రైనింగ్సెంటర్ కొత్త రికార్డును నమోదు చేసింది. దేశంలో 166 నగరాల నుండి 3,534 మంది సర్జన్లకు శిక్షణ ఇచ్చి, అత్యధిక మంది సందర్శించే గ్లోబల్ సర్జికల్ ట్రైనింగ్ సెంటర్లలో ఒకటిగా జాబితాలోకి ఎక్కింది. ఈ వివరాలను మంగళవారం గంగా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎస్. రాజ సబాపతి , డాక్టర్ హరి వెంకట్రమిణి మరియు డాక్టర్ రాజ షణ్ముగకృష్ణన్ వంటి నిపుణులు ప్రకటించారు. 1990లలో స్వల్ప సంఖ్యలో ప్రారంభమైన శిక్షకుల సంఖ్య ప్రస్తుతం ఏటా 150గా నమోదు అవుతూ, తాజాగా 182 మంది సర్జున్లు శిక్షన పొందినట్టు పేర్కొన్నారు. వైద్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న దేశాల నుండి కూడా సర్జన్లు ఇక్కడికి వస్తున్నారన్నారు. అత్యధికంగా బ్రిటన్ (272), అమెరికా (139) దేశాల నుండి సర్జన్లు గంగా హాస్పిటల్ను సందర్శించారని వివరించారు. ఇక్కడ నిర్వహించే వారం రోజుల మైక్రోసర్జరీ లేబొరేటరీ కోర్సు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తింపు పొందిందన్నారు. ఇప్పటివరకు సుమారు 2,000 మంది సర్జన్లు ఈ కోర్సును పూర్తి చేశారన్నారు. శ్రీప్రపంచవ్యాప్త సర్జన్లకు ఒక ఇష్టమైన శిక్షణ కేంద్రంగా మారడం గర్వకారణంగా పేర్కొన్నా. హ్యాండ్ సర్జరీ, డయాబెటిక్ ఫుట్ సర్జరీ, వంటి విభాగాల్లో నిరంతరం అభివృద్ధి చెందుతూ, భవిష్యత్తులో ప్రపంచ వైద్య రంగానికి దిశానిర్దేశం ఈ సెంటర్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


