సాక్షి, చైన్నె: వారంటీ, గ్యారంటీ లేని కూటమి అన్నాడీఎంకే–బీజేపీవి అని డిప్యూటీ సీఎం, డీఎంకే యువజ న ప్రధాన కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. దిండుగల్లో మంగళవారం జరిగిన పార్టీ యు వజన విభాగం సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆయన వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ ఈసందర్భంగా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం గమనార్హం. ఈ సమావేశంలో ఉదయ నిధి మాట్లాడుతూ, గత పది ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తున్న పళనిస్వామి, ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అడ్రస్సును గల్లంతు చేసుకోవడం ఖాయం అన్నారు. ఆయన ఒంటరిగా మిగిలిపోయే సమయం ఆసన్నమైందన్నారు. గత రెండు రోజులుగా పళనిస్వామి తన సొంత పార్టీ కార్యాలయానికి వెళ్లడమే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతోంది. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఢిల్లీలోని అమిత్ షా కార్యాలయం చుట్టూ తిరుగుతూ, చైన్నెలోని తన కార్యాలయాన్నే మర్చిపోయారని విమర్శించారు.
వారంటీ లేని కూటమి
అన్నాడీఎంకే కూటమికి గ్యారెంటీ లేదు, వారంటీ కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తన మాయాజాలం, కుతంత్రాలతో ఉత్తరాదిలో గెలవచ్చేమో కానీ, తమిళనాడులో నలుపు–ఎరుపు (డీఎంకే జెండా) కండువా కప్పిన చివరి కార్యకర్త ఉన్నంత వరకు ఆ పార్టీ అడుగు పెట్టలేదని ఉదయనిధి స్పష్టం చేశారు. బీజేపీ నేరుగా వచ్చినా, లేదా వారి బీ–టీమ్, సీ–టీమ్ వెనుక ఉండి నడిపించినా గెలిచేది మాత్రం డీఎంకే కూటమేనని ధీమా వ్యక్తం చేశారు.
యువజన విభాగానికి దిశానిర్దేశం
ఎన్నికలకు ఇంకా 29 రోజులు మాత్రమే సమయం ఉందని గుర్తు చేస్తూ, కార్యకర్తలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా చాలా పార్టీలకు బూత్ కమిటీల్లో మనుషులు లేక ఇబ్బంది పడుతుంటే, తమిళనాడులో ప్రతి బూత్ వద్ద డీఎంకే యువజన సైన్యం సిద్ధంగా ఉందని కొనియాడారు ప్రతి ఓటరును కనీసం రెండుసార్లు కలవాలని, తమ తమ ఇంటి నుంచే ఈ ప్రచారం ప్రారంభం కావాల ని, ఆపై బంధువులు, స్నేహితుల ఓట్లన్నీ డీఎంకేకే పడేలా చూడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఐ.పెరియసామి, చక్రపాణి, ఎమ్మెల్యేలు గాంధీరాజన్, మహారాజన్, దిండుగల్ ఇళమది తదితరులు పాల్గొన్నారు.


