పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ, మధ్య, పరిసర వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర–వాయవ్య దిశగా కదులుతూ కళింగపట్నంకు తూర్పున 280 కిలోమీటర్ల దూరంలోని గోపాలపూర్ వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా పశ్చిమ తీరం వైపు కదులుతూ బలపడి సోమవారం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆ తర్వాత పశి్చమ – వాయవ్య దిశగా కదులుతూ ఒడిశా, పశి్చమ బెంగాల్ తీరాన్ని పూరి– దిఘా మధ్యలో సోమవారం రాత్రికల్లా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉత్తర ప్రాంత జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం
నైరుతి సీజన్లో ఇప్పటివరకు 62.31 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఆదివారం నాటికి 88.45 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 42 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లు రాష్ట్ర ప్రణాళిక విభాగం గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్, సిద్దిపేట, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాలు అత్యధిక వర్షపాతం నమోదైన జాబితాలో ఉన్నాయి.
ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా మిగిలిన జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 4 వరకు రాష్ట్రంలో సగటు వర్షపాతం కంటే 325 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, వర్షాలతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే 5 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment