మాజీ సీఎం జగన్‌ భద్రతపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం జగన్‌ భద్రతపై ఆందోళన

Published Fri, Feb 21 2025 8:04 AM | Last Updated on Fri, Feb 21 2025 8:04 AM

-

సాక్షి, విశాఖపట్నం: గుంటూరు పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జెడ్‌ సెక్యూరిటీని ఎందుకు తొలగించారని వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖ విమానాశ్రయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఆయన కడుపు మంటను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కనీస సెక్యూరిటీ ఇవ్వకుండా రాక్షస ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్‌ జగన్‌ జనం మనిషి అని, ఆయన్ని అడ్డుకోవడం మీ వల్ల కాదన్నారు. కనీస మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ వెళ్లేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఆయన రైతులను పరామర్శిస్తే.. చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. పైగా రైతులను పరామర్శించినందుకు వెళ్లిన జగన్‌పైనే కేసులు పెట్టి, చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల నిబంధనలు ఉన్నాయని కేసులు పెడితే.. మరి మీరు నిర్వహించిన మ్యూజికల్‌ నైట్‌కు ఎన్నికలు నిబంధనలు అడ్డురాలేదా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ భద్రతపై తామంతా ఆందోళన చెందుతున్నామని, యథావిధిగా ఆయన భద్రత కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర కో–ఆర్డినేటర్‌

కురసాల కన్నబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement