Visakhapatnam District News
-
సింహగిరిపై రంగుల కేళి
సింహాచలం: సింహగిరి గురువారం రంగులమయమైంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా 6వ రోజైన గురువారం ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, చక్రస్నానం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలతో పాటు చక్రపెరుమాళ్లు, ఆళ్వారులను కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించి, పసుపు కొమ్ములను దంచుతూ కొట్నాల సేవను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. వసంతాలను ఉత్సవమూర్తుల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆ వసంతాలతో అర్చకులు వేదమంత్రోచ్చారణలు, నాదస్వర వాయిద్యాల మధ్య ఆలయ బేడ ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలోని స్వామివారి మూలవిరాట్టుకు, ఆలయంలో కొలువుదీరిన ఇతర దేవతా మూర్తులకు వసంతాలను సమర్పించారు.అనంతరం ఆ వసంతాలను అర్చకులు భక్తులపై చల్లగా.. సిబ్బంది, భక్తులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ సందడి చేశారు. తర్వాత ఉత్సవమూర్తులను ఒక పల్లకీ లో, చక్రపెరుమాళ్లు, ఆళ్వారులను మరొక పల్లకీలో ఉంచి గంగధార వద్దకు తిరువీధిగా తీసుకెళ్లారు. అక్కడ గంగధార జలాలు, పంచామృతాలతో పంచ కలశ స్నపనాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నాన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. చక్రపెరుమాళ్లను గంగధార నీటి ప్రవాహం వద్ద ఉంచి, ఆ జలాలు భక్తులపై పడేలా చేశారు. ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఉత్సవమూర్తులను అలంకరించి ఆలయంలోకి తీసుకెళ్లారు. అంతకుముందు యాగశాలలో పూర్ణా హుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవో జె.వెంకటరావు దంపతులు ఉత్సవంలో పాల్గొనగా, ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అప్పన్న ఉంగరం చోరీ: గురువారం రాత్రి మృగయోత్సవం(దొంగలదోపు) వేడుకను వైభవంగా నిర్వహించారు. పురాణ గాథ ప్రకారం.. భాగవతోత్తములకు తదియారాధన చేయడం కోసం దొంగగా మారిన నీలుడు(తిరుమంగై ఆళ్వార్), అటవీ మార్గంలో విహారయాత్రకు వెళ్తున్న స్వామి వారిని, అమ్మవార్లను అడ్డగించి దోచుకునే ఘట్టాన్ని అర్చకులు రక్తికట్టించారు. అనంతరం నీలుడి భక్తికి మెచ్చిన స్వామి వారు, అతనికి ఆళ్వారుగా మోక్షం ప్రసాదించారు. ఈ ఉత్సవంలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని అశ్వవాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పల్లకీలో ఉంచి మాడ వీధుల్లో తిరువీధి నిర్వహించారు. ఈ దారి దోపిడీ క్రమంలో స్వామి ఉంగరం పోవడంతో, ఆగ్రహించిన అమ్మవారు ఆయనను ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. పోయిన ఉంగరాన్ని వెతుక్కునే వినోదోత్సవం వేడుకను ఏడో రోజైన శుక్రవారం ఉదయం ఆసక్తికరంగా నిర్వహించనున్నారు. -
ఏయూలో దోపిడే
మా బిడ్డల భ విష్యత్ ?విశాఖ సిటీ : ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలువు దోపిడీకి నిలయంగా మారుతోంది. చదువుల తల్లి ఒడిలో క్రమశిక్షణ నేర్పాల్సిన గురువులే.. వసూళ్ల బాట పట్టారు. కంప్యూటర్ సైన్స్ విభాగం వేదికగా సాగుతున్న ఈ ‘వసూళ్ల పర్వం’ ఇప్పుడు యూనివర్సిటీ ప్రతిష్టను బజారున పడేస్తోంది. ‘డిపార్ట్మెంట్ డే’ పేరుతో విద్యార్థుల జేబులకు చిల్లు పెడుతున్న వైనం అటు అకాడమిక్ వర్గాల్లో, ఇటు తల్లిదండ్రుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘డిపార్ట్మెంట్ డే’ పేరుతో వడ్డన! ఈ నెల 4వ తేదీన డిపార్ట్మెంట్ డే నిర్వహించాలని ఏయూ సైన్స్ విభాగం ప్రొఫెసర్లు నిర్ణయించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.1600, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.1400, మూడో సంవత్సరం చదువుతున్న వారికి రూ.1300 చొప్పున టారిఫ్ ఖరారు చేసినట్లు సమాచారం. సుమారు 2800 మంది విద్యార్థులు ఉన్న ఈ విభాగంలో ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే రూ.20 లక్షలకు పైగా సేకరించినట్లు తెలుస్తోంది. నెల రోజుల కిందే రూ.9.5 లక్షలు వసూలు నిజానికి ఇలాంటి వసూళ్లు ఈ విభాగానికి కొత్తేమీ కాదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా నెల రోజుల క్రితమే ‘ఎథ్నిక్ డే’ పేరుతో ప్రతి విద్యార్థి నుంచి రూ.1000 చొప్పున వసూలు చేశారు. అలా సేకరించిన సుమారు రూ.9.5 లక్షల మొత్తానికి ఇప్పటివరకు సరైన లెక్కలు చూపలేదని సమాచారం. విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం ఎలాంటి వసూళ్లు చేసినా అధికారిక రసీదులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవేవీ లేకుండానే రూ.లక్షలు చేతులు మారుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. బెదిరింపులతో బలవంతపు వసూళ్లు డబ్బులు చెల్లించలేమని మొరపెట్టుకుంటున్న పేద విద్యార్థులపై కొందరు అధ్యాపకులు కర్కశంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘డబ్బులు కట్టకపోతే ఇంటర్నల్ మార్కుల్లో ఫెయిల్ చేస్తాం’ అంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. గత ఐదు రోజులుగా క్లాసుల వద్ద నిలబడి, డబ్బులు కట్టని వారి జాబితాలు పట్టుకుని ఒత్తిడి తెస్తున్నారనే అంశం యూనివర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రొఫెసర్ స్థాయి వారు ఇలా వసూళ్లకు దిగడం ఇంజనీరింగ్ కళాశాల చరిత్రలో ఇదే తొలిసారి అని చర్చించుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆందోళన ఈ పరిణామాలు విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపుతాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగలు తరగతులు సక్రమంగా జరగడం లేదని, రాత్రివేళల్లో ఈవెంట్ల పేరుతో ఆలస్యంగా విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల భద్రతతో పాటు క్రమశిక్షణ కూడా దెబ్బతింటోందని వాపోతున్నారు. చదువుకోవాల్సిన సమయంలో విద్యార్థులను ఇలాంటి ఈవెంట్ల నిర్వహణకు, వసూళ్లకు వాడుకోవడం విచారకరమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. వీసీ గారూ.. చర్యలేవి? వర్సిటీ గౌరవాన్ని గంగలో కలుపుతున్న ఇలాంటి చర్యలపై వీసీ తక్షణమే దృష్టి సారించాలి. కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ వి.వల్లికుమారి ఈ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించి, విద్యార్థుల నుంచి వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇప్పించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఈ సంస్కృతి ఇతర విభాగాలకు కూడా పాకే ప్రమాదం ఉంది. కొండా రాజీవ్గాంధీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్సీపీ పరిశోధకులపైనా పంజా కేవలం యూజీ, పీజీ విద్యార్థులే కాకుండా, పీహెచ్డీ చేస్తున్న పరిశోధక విద్యార్థులు కూడా ఈ వసూళ్ల బాధితులుగా మారారు. ప్రీ–టాక్ పరీక్షల సమయంలో ‘స్నాక్స్ ఏర్పాట్లు’ చేయాలంటూ ఒక్కో పరిశోధకుని నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పీహెచ్డీ వైవా వోస్ పరీక్షల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించినట్లు సమాచారం. గైడ్ల ఒత్తిడికి తలొగ్గి, తమ డిగ్రీల కోసం అప్పులు చేసి మరీ ఈ మొత్తాలను ముట్టజెబుతున్నామని పరిశోధకులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
సమస్యల తిష్ట
గురుకులంలోసింహాచలం: ఒకప్పుడు ఆ పాఠశాల రాష్ట్రానికే తలమానికం. అక్కడ చదివిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు కొట్టారు.. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ నేడు అదే అడవివరంలోని మహాత్మా జ్యోతీబాపూలే ఏపీ బీసీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాల సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. 1200 మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు శిథిలావస్థకు చేరిన భవనాలు, భయం నీడన కొట్టుమిట్టాడుతోంది. డార్మెటరీల ‘దుస్థితి’ పాఠశాలలో వసతి సౌకర్యాలు అధ్వానంగా మారాయి. 5, 7 తరగతుల విద్యార్థులు ఉండాల్సిన ‘గోదావరి’ డార్మెటరీ నాలుగేళ్ల క్రితమే ప్రమాదకరంగా మారి మూతపడింది. దీనికి ప్రత్యామ్నాయం చూపకపోవడంతో, చిన్నారులు తాము చదువుకునే క్లాస్ రూముల్లోనే బెంచీల మధ్యే నిద్రించాల్సిన దయనీయ స్థితి నెలకొంది. మరోవైపు, 8, 9 తరగతుల విద్యార్థులు ఉంటున్న ‘కృష్ణా’ డార్మెటరీ పరిస్థితి వర్ణనాతీతం. పైకప్పు పెచ్చులు ఊడి తలల మీద పడుతున్నాయి. ఎప్పుడు కూలుతుందో తెలియని భవనంలో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. వణుకు పుట్టిస్తున్న ఎలుకల బెడద చదువుకోవాల్సిన విద్యార్థులు ఇప్పుడు ఎలుకలతో ‘యుద్ధం’ చేస్తున్నారు. కృష్ణా డార్మెటరీలో ఎలుకల బెడద ఎంతలా ఉందంటే.. గత నెలలో పది మందిని, ఈ నెల ఒకటో తేదీన మరికొంతమంది విద్యార్థులను కరిచాయి. రక్తం ఓడుతున్న గాయాలతో చిన్నారులు ఆస్పత్రులకు పరుగులు తీయడం చూస్తుంటే ఇక్కడ పర్యవేక్షణ ఎంత ‘ఘనం’గా ఉందో అర్థమవుతోంది. రాత్రి వేళల్లో విద్యార్థులు భయంతో నిద్రపోలేని పరిస్థితి నెలకొంది. మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలు పాఠశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న భారీ డార్మెటరీ భవనం, ఉపాధ్యాయుల క్వార్టర్స్ పనులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నాం పనులు నిలిచిపోవడంతో విద్యార్థుల కష్టాలు మరింత పెరిగాయి. ఆహారంపై కూడా అసంతృప్తి ఈ ఏడాది జనవరి 5న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయప్రతాపరెడ్డి పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులు తమ గోడును స్వయంగా వెల్లడించారు. మాంసాహారం సరిపడా ఇవ్వడం లేదని, వంటలు రుచికరంగా లేవని వారు ఫిర్యాదు చేశారు. వైద్య సదుపాయాల్లో లోపాలు పాఠశాలలో డాక్టర్, స్టాఫ్ నర్స్ ఉన్నప్పటికీ, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఫ్రిజ్ పాడవడంతో మందులు నిల్వ చేయలేకపోతున్నారు. దీంతో విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది. స్పందించకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకం ప్రభుత్వం తక్షణమే స్పందించి కొత్త డార్మెటరీల నిర్మాణాన్ని పూర్తి చేయడం, శిథిల భవనాలను తొలగించడం, పరిశుభ్రత, ఆహార నాణ్యత మెరుగుపరచడం, వైద్య సదుపాయాలను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతేం ఈ గురుకులంలో చదువుతున్న వందలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. కిటికీ, తలుపు పరిస్థితి ఇదీ -
ఏడు నెలలైనా పట్టించుకోరా..
బీచ్రోడ్డు : ప్రభుత్వ చర్యలతో ఏడు నెలల క్రితం రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫుడ్ కోర్ట్ వ్యాపారులు గురువారం ‘వంటా–వార్పు’ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొని నడిరోడ్డుపై కూర్చొని భోజనం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సెంట్రల్ పార్క్ ఫుడ్ ట్రక్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన చిరు వ్యాపారుల రిలే నిరాహార దీక్షలు గురువారానికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీకాంత్ మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 19న మహిళా కళాశాల ఎదురుగా ఉన్న నైట్ ఫుడ్ కోర్టును జీవీఎంసీ అధికారులు తొలగించడంతో తమతో పాటు అనేక మంది స్ట్రీట్ వెండర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇప్పటికే ముగ్గురు ఫుడ్ కోర్ట్ వ్యాపారులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ ఫుడ్ కోర్టును తిరిగి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా, నెలలు గడిచినా అమలు కాలేదని విమర్శించారు. తొలగించిన షాపులను యథాస్థానంలోనే తిరిగి ఏర్పాటు చేసి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో అసోసియేషన్ మరో అధ్యక్షుడు ఎం. ప్రసాద్, కార్యదర్శి ఎం. లలిత కుమారి, సభ్యులు దుంగ శ్రీను, బొగ్గు శ్యామ్, లక్ష్మి తదితరులు, పెద్ద సంఖ్యలో ఫుడ్ కోర్ట్ వ్యాపారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. -
కై లాసగిరి పర్యాటకులకు వీఎంఆర్డీఏ షాక్
ఆరిలోవ: ప్రముఖ పర్యాటక కేంద్రమైన కై లాసగిరిని సందర్శించే పర్యాటకులకు వీఎంఆర్డీఏ ఊహించని షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండానే పర్యాటకులపై చంద్రబాబు ప్రభుత్వం అదనపు టికెట్ల భారాన్ని మోపింది. గురువారం నుంచే ఈ కొత్త నిబంధనలు అమలులోకి రావడంతో సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఇప్పటివరకు కై లాసగిరి టోల్ ప్లాజా వద్ద కేవలం వాహనాలకు మాత్రమే నిర్ణీత రుసుం వసూలు చేసేవారు. నడిచి వెళ్లే వారికి మాత్రమే రూ.10 టికెట్ ఉండేది. కానీ, గురువారం నుంచి వాహనాల టికెట్తో పాటు అందులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తలా రూ.10 అదనంగా చెల్లించాలని సిబ్బంది పట్టుబట్టారు. ఈ మార్పు తెలియని పర్యాటకులు పాత పద్ధతిలోనే వాహనం టికెట్ తీసి వెళ్లబోగా, లోపల ఉన్న ప్రయాణికులకు కూడా విడివిడిగా టికెట్లు తీసుకోవాలని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద పర్యాటకులు, సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, గందరగోళం నెలకొంది. అదనపు భారం ఇలా.. : నిన్నటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ద్విచక్ర వాహనాలకు రూ.20, నాలుగు సీట్ల కార్లకు రూ.50, ఏడు సీట్ల కార్లకు రూ.70 చొప్పున టోల్ రుసుం ఉండేది. అలాగే టాటా మ్యాజిక్ వాహనాలకు రూ.70, మినీ బస్సులకు రూ.150, పెద్ద బస్సులకు రూ.300 వసూలు చేసేవారు. అయితే కొత్త విధానం ప్రకారం ఈ వాహన ధరలతో సంబంధం లేకుండా, అందులో ఎంతమంది ప్రయాణిస్తే అంతమందికీ తలా రూ.10 చొప్పున అదనంగా టికెట్ తీసుకోవాల్సిందే. ఉదాహరణకు, బైక్పై ఇద్దరు వెళ్తే బైక్ టికెట్ రూ.20తో పాటు మరో రూ.20 అదనంగా చెల్లించాలి. అలాగే 40 మంది ప్రయాణికులతో వచ్చే బస్సు గతంలో రూ.300 చెల్లిస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు బస్సు టికెట్తో పాటు మరో రూ.400 కలిపి మొత్తం రూ.700 చెల్లించాల్సి వస్తోంది. ముందస్తు ప్రకటనలు లేకుండా ఇలా అదనపు వసూళ్లకు దిగడం దారుణమని, వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు వాహనదారులు ఆగ్రహంతో సిబ్బందిని తోసుకుంటూ పైకి వెళ్లిపోగా, మరికొందరు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వీఎంఆర్డీఏ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. -
ఐఐఎం విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–విశాఖపట్నం(ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా పనిచేసే బిజినెస్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి ఐదేళ్ల కాలానికి గాను ఐఐఎంవీ అక్రిడిటేషన్ను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విద్యలో నాణ్యత, సామాజిక ప్రభావాన్ని గుర్తించే ఈ అక్రిడిటేషన్ను పొందిన దేశంలోని అతికొద్ది సంస్థల్లో ఐఐఎంవీ ఒకటిగా నిలవడం విశేషం. ఈ సందర్భంగా ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ గుర్తింపు అంతర్జాతీయ ప్రమాణాల పట్ల తమకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, బాధ్యతాయుతమైన నిర్వహణ, నిరంతర అభివృద్ధి అనేవి తమ సంస్థ మూల విలువలని, ఈ అక్రిడిటేషన్ వాటిని మరింత ప్రతిబింబిస్తోందన్నారు. ఈ గుర్తింపుతో గ్లోబల్ స్థాయిలో ఐఐఎంవీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని, తద్వారా విదేశీ భాగస్వామ్యాలు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, అంతర్జాతీయ పరిశోధనలకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
సమస్యలకు త్వరితగతిన పరిష్కారం
మహారాణిపేట: జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం.అభిషిక్త్ కిశోర్ గురువారం కలెక్టరేట్లోని పలు విభాగాలను సందర్శించారు. ప్రతి సెక్షన్కు వెళ్లి రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. 24/7 కంట్రోల్ రూమ్ను సందర్శించి, ప్రజల నుంచి వచ్చే ఫోన్ల వివరాలు, ఫిర్యాదుల నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, ప్రజలకు సులభంగా కనిపించేలా బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం డీఎస్వో కార్యాలయం, కొత్తగా నిర్మిస్తున్న హడ్కో భవనాన్ని, స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్కు వచ్చిన వృద్ధులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీదారులను ఎక్కువ సేపు నిరీక్షించకుండా, త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అందరూ బాధ్యతగా వ్యవహరించి, ఉత్తమ పనితీరు కనబరచాలని సూచించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇన్చార్జి ఆర్డీవో శేషశైలజ, కలెక్టరేట్ ఏవో బీవీ రాణి తదితరులు ఉన్నారు. కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ -
ప్పం ట్టాల్సిందే..!
తట్టెడు మట్టికీ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : తట్టెడు మట్టికీ తలవంచాల్సిందే.. పిక్కెడు రాయికీ పిండుకోవాల్సిందే.. ఉమ్మడి విశాఖ జిల్లాలో ’రాయల్టీ’ పేరిట ఏఎంఆర్ సంస్థ సాగిస్తున్న అక్రమ వసూళ్లు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. సొంత పొలంలో మట్టి తీసినా, సొంత ఇంటికి రాయి తెచ్చినా.. ఎక్కడ చిన్న ఇసుక కుప్ప కనిపించినా.. ప్రైవేటు సంస్థ ప్రతినిధులు స్కానర్లు పట్టుకుని వాలిపోతున్నారు. లోడును బట్టి వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. మైనింగ్ శాఖ అండతో గ్రామగ్రామాన చెక్పోస్టులు పెట్టి సాగిస్తున్న ఈ ’దోపిడీ’ పర్వంపై జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. చెక్పోస్టులు.. ఫ్లైయింగ్ స్క్వాడ్ల దందా వాస్తవానికి గతంలో రాయల్టీ వసూలు బాధ్యతను మైనింగ్ శాఖే నిర్వహించేది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బాధ్యతను జిల్లాల వారీగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. ఇందుకోసం మైనింగ్ శాఖ టెండర్లను ఆహ్వానించగా.. విశాఖ జిల్లాలో ఈ టెండర్ను ఏఎంఆర్ సంస్థ దక్కించుకుంది. టెండర్ పొందినప్పటి నుంచి సంస్థ ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వాహనాలతో ఫ్లైయింగ్ స్క్వాడ్ పేరుతో గ్రామాల్లో తిరుగుతోంది. ఎక్కడైనా చిన్న ట్రాక్టర్లో మట్టి కనిపించినా, ఎర్రపిక్క కనిపించినా రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తోంది. తమ సొంత పొలంలో నుంచి మట్టిని తీసుకెళుతున్నా ఎందుకు డబ్బులు ఇవ్వాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక వసూలు చేసే మొత్తాన్ని స్కానర్ ద్వారా సేకరిస్తున్నప్పటికీ, ఆ వివరాలను మైనింగ్ శాఖకు క్రమం తప్పకుండా సమర్పిస్తున్నారా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదనే విమర్శలు ఉన్నాయి. వసూలైన డబ్బులు కంపెనీ ఖాతాలోకే వెళుతున్నాయా, లేక సొంత ఖాతాలకు మళ్లుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, వసూలు చేస్తున్న రాయల్టీకి సరైన బిల్లులు ఇస్తున్నారా అనే అంశాన్ని కూడా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద మైనింగ్ శాఖ మౌనంతో ఏఎంఆర్ సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయల్టీ పేరుతో ఏఎంఆర్ రుబాబు ఇంటి నిర్మాణం కోసం పిక్కకు రొక్కం లెక్క ఉమ్మడి జిల్లాలో ఇష్టారాజ్యంగా చెక్పోస్టుల ఏర్పాటు ఫ్లైయింగ్ స్క్వాడ్లతో గ్రామాల్లో వేట ట్రాక్టర్ కనిపిస్తే స్కానర్ ఓపెన్ రూ.వందల నుంచి రూ.వేల వరకూ వసూళ్లు సొంత పొలం మట్టికీ రాయల్టీ తప్పదా..? మైనింగ్శాఖ మౌనంతో విమర్శలకు తావు రాయల్టీ వసూలు పేరుతో.. రాయల్టీ వసూలు బాధ్యతను దక్కించుకున్న ఏఎంఆర్ సంస్థ ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసుకుంది. చెక్పోస్టుల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. అక్కడ పనిచేసే సిబ్బంది క్వారీల నుంచి వచ్చే వాహనాల లోడ్ను గమనిస్తూ, అదనపు లోడు ఉంటే అదనపు రాయల్టీని ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ‘ఫ్లైయింగ్ స్క్వాడ్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ, ఎక్కడైనా ఇంటి అవసరాల కోసం మట్టిని తరలిస్తున్నా రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ వాలిపోతున్నారు. ఇంటి నిర్మాణం కోసం కొద్దిపాటి పిక్క తీసుకున్నా వందల్లో రాయల్టీ చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రైతులు తమ సొంత పొలంలో నుంచి మట్టిని తవ్వుకుని ఇంటి నిర్మాణం కోసం తరలిస్తున్నా అక్కడికక్కడే సిబ్బంది చేరుతున్నారు. రాయల్టీ కట్టాల్సిందేనంటూ చెబుతూ, ఎంత మొత్తం చెల్లించాలనే విషయాన్ని స్కానర్ ద్వారా చూపించి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ‘మాకు సంబంధం లేదు’ అంటూ తప్పుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రైల్వే స్టేషన్లో భద్రత కట్టుదిట్టం
అల్లిపురం: విశాఖ రైల్వే స్టేషన్ ద్వారా జరుగుతున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడంతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశించారు. గురువారం తన చాంబర్లో ఆర్పీఎఫ్, జీఆర్పీ, నగర పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలోని రైల్వే ఆస్తుల వద్ద భద్రతా చర్యలు, గంజాయి అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. స్టేషన్ పరిసరాల్లో దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీసు గస్తీని పటిష్టం చేయాలని సూచించారు. స్టేషన్ ప్రవేశ మార్గాల వద్ద అత్యాధునిక స్కానింగ్ మిషన్ల ఏర్పాటు, సీసీ టీవీ కెమెరాల పెంపు, తగినంత వెలుతురు ఉండేలా లైటింగ్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి అంశాలపై కార్యాచరణ రూపొందించారు. అలాగే స్టేషన్ పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉన్న పొదలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు, ఆర్పీఎఫ్, జీఆర్పీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులతో సీపీ సమీక్ష -
ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్
మహారాణిపేట: రాష్ట్రంలో నిరుపేదల ప్రాణాలకు రక్షణగా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలకు గురువారం కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి రావాల్సిన వందల కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో, బుధవారం నుంచే పలు నెట్వర్కు ఆస్పత్రులు వైద్య సేవలను నిలిపివేశాయి. ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు కార్పొరేట్, నెట్వర్కు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. పేదల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంపై మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన భారీ బకాయిలను పెండింగ్లో పెట్టడంతోనే ఈ దుస్థితి దాపురించింది. ఎన్నికల ముందు సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తామని హామీలిచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు నిధుల కొరత సాకుతో ఉన్న పథకాలను నీరుగారుస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్.. ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యశ్రీ అనగానే పేదలకు గుర్తుకు వచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి. ఈ పథకం లక్షలాది మందికి కార్పొరేట్ స్థాయి చికిత్సను అందించింది. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని మరింత విస్తరించి 3,257 వ్యాధులకు చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉచిత వైద్యం అందిస్తూ, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు బీమా వర్తించేలా చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆ సేవలు నీలి నీడల కింద చిక్కుకున్నాయి. విశాఖలో నిలిచిన సేవలు.. జిల్లావ్యాప్తంగా పలు నెట్వర్క్ ఆస్పత్రుల్లో సమ్మె రెండో రోజుకు చేరుకుంది. విశాఖలోని కేర్ ఆస్పత్రి, వీఆర్ఐడీఏ, ఇండస్, జీజే ఆస్పత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఓపీ, ఐపీ సేవలతో పాటు ముందుగా నిర్ణయించిన శస్త్రచికిత్సలను కూడా ఆపేయడంతో పేద రోగులు దిక్కుతోచని స్థితిలో ఇంటి ముఖం పడుతున్నారు. కేవలం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మాత్రమే అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్టుల ఆరోగ్య సేవలకు కూడా బకాయిల సెగ తగిలింది. దీనిపై జిల్లా ఆరోగ్య సమన్వయకర్త డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ.. నెట్వర్కు ఆస్పత్రుల సమ్మె దృష్ట్యా రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రోగులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమను సంప్రదించాలని ఆయన కోరారు. -
ట్రాన్స్జెండర్ల ఉపాధికి పోలీసుల అండ
రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్జెండర్స్ క్యాంటీన్ ప్రారంభం పీఎంపాలెం: సమాజంలో ట్రాన్స్జెండర్ల పట్ల వివక్ష చూపడం తగదని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. గురువారం ఆయన ఎండాడలోని మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ట్రాన్స్జెండర్ల నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ను ప్రారంభించి, వారి ఉపాధికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా సుమారు 400 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా అందరూ సహకరించాలని కోరారు. అదే సమయంలో ట్రాన్స్జెండర్లు కూడా సమాజం పట్ల బాధ్యతగా, మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్ల ఉపాధి కోసం నగర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ను నెలకొల్పినట్లు తెలిపారు. కమిషనర్ స్వయంగా క్యాంటీన్ ప్రారంభించడం పట్ల ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీపీ క్యాంటీన్లో టిఫిన్ చేసి రుచిని ఆస్వాదించారు. విశాఖ నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ ఎస్.అప్పలరాజు, మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ అంబేడ్కర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
సముద్ర తీరాన సరికొత్త చరిత్ర
విశాఖ సిటీ : విశాఖ పోర్టు అథారిటీ సరికొత్త రికార్డు లిఖించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో చరిత్ర సృష్టించింది. 91.17 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) సరుకును చేరవేసి, దేశంలోని ప్రధాన ఓడరేవుల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. 2024–25లో 82.62 ఎంఎంటీ సరుకు రవాణా నమోదు కాగా.. ఈసారి ఏకంగా 10.35 శాతం వృద్ధిని సాధించడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా రవాణా రంగంలో సవాళ్లు ఎదురవుతున్నా.. విశాఖ పోర్టు తన పట్టును మరోసారి చాటుకుంది. ముఖ్యంగా చమురు, ఇనుప ఖనిజం, ఎరువుల రవాణాలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో 13 శాతం, ఇనుప ఖనిజంలో 15 శాతం వృద్ధిని సాధించింది. ఎరువుల దిగుమతులు ఏకంగా 42 శాతం పెరగడం ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణమైంది. సమర్థతే విజయరహస్యం ఈ ఘనత వెనుక పోర్టు యంత్రాంగం అనుసరించిన ఆధునిక పద్ధతులు ఉన్నాయి. నౌకలు ఓడరేవుకు వచ్చినప్పుడు అవి వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించారు. బెర్త్ల నిర్వహణలో వేగం పెరగడం వల్ల నౌకల కదలికలు సులభతరం అయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 24 నౌకల కదలికలను విజయవంతంగా నిర్వహించి పోర్టు తన ఆపరేషనల్ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఒకే రోజులో 5,50,198 మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. పోర్టులోని 32 బెర్త్లలో 28 బెర్త్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం వల్ల ఆదాయం కూడా మెరుగుపడింది. అత్యాధునిక మౌలిక వసతులు విశాఖ పోర్టు కేవలం సముద్ర మార్గంలోనే కాకుండా, భూమార్గంలో కూడా పటిష్టమైన అనుసంధానాన్ని కలిగి ఉంది. 176 కిలోమీటర్ల మేర విస్తరించిన సొంత రైల్వే నెట్వర్క్, 40కి పైగా సైడింగ్లు సరుకును వేగంగా తరలించేందుకు దోహదపడుతున్నాయి. 2 లక్షల టన్నుల బరువున్న కేప్సైజ్ నౌకలు కూడా సులభంగా బెర్త్లకు వచ్చేలా 16 నుండి 21 మీటర్ల లోతును నిర్వహించడం విశాఖ పోర్టు ప్రత్యేకం. అడ్వాన్స్డ్ నావిగేషన్ వ్యవస్థలైన వీటీఎంఎస్, ఏఐఎస్ ద్వారా నౌకల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మూలపేటపై వీపీఏ ఆసక్తి మూలపేట పోర్టును నిర్వహించేందుకు విశాఖ పోర్ట్ అథారిటీ ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా విశాఖ నగరంలో కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో, ధూళి వెలువడే బొగ్గు వంటి సరుకు రవాణాను భవిష్యత్తులో మూలపేట పోర్టుకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి తోడు దుగ్గరాజపట్నం పోర్టు, షిప్బిల్డింగ్ యూనిట్ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయడం ఒక కీలక పరిణామం. అత్యాధునిక ‘జెమినీ ఆపరేషన్స్’ ద్వారా భారీ యంత్రాలను సైతం సునాయాసంగా రవాణా చేసే వెసులుబాటు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఎస్పీఎం ద్వారా తొలిసారి క్రూడ్ ఆయిల్ లోడింగ్ చేపట్టడం పోర్ట్ సాంకేతిక ప్రగతికి అద్దం పడుతోంది. 100 ఎంఎంటీ భవిష్యత్ లక్ష్యం పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు ఈ విజయాన్ని సిబ్బంది, స్టేక్హోల్డర్ల సమిష్టి కృషిగా అభివర్ణించారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లక్ష్యం 100 ఎంఎంటీలను అధిగమించడమేనని స్పష్టం చేశారు. కేవలం పరిమాణం మాత్రమే కాకుండా, పర్యావరణ హితమైన రవాణాకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. -
పల్లెల్లో ‘ప్రత్యేక’ పాలన
మహారాణిపేట: జిల్లాలోని గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు గురువారంతో ముగిసింది. దీంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఈ నెల 2వ తేదీతో సర్పంచుల పదవీ కాలం పూర్తి కావడంతో, గురువారం రోజే పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు. రేఖవానిపాలెం మినహా.. జిల్లాలో మొత్తం 79 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో భీమిలి మండలం రేఖవానిపాలెం మినహా మిగిలిన 78 పంచాయతీల గడువు ముగిసింది. రేఖవానిపాలెం పాలకవర్గానికి ఇంకా ఏడాది కాలం గడువు ఉండటంతో అక్కడ పాత పాలనే కొనసాగనుంది. గడువు ముగిసిన వాటిలో ఆనందపురం మండలంలో 26, పద్మనాభంలో 22, పెందుర్తిలో 15, భీమిలిలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే 78 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. బాధ్యతల్లో గెజిటెడ్ అధికారులు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, పీఆర్ఈడీలు ఇతర శాఖల గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ గత కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ ప్రత్యేక అధికారుల పాలన పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. కాగా.. పదవీ కాలం ముగియడంతో జిల్లాలోని 78 మంది సర్పంచులు గురువారం నుంచి మాజీలయ్యారు. అప్పటివరకు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సర్పంచులు, వార్డు సభ్యులు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇకపై పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ అంతా ప్రత్యేక అధికారుల చేతుల్లోనే ఉండనుంది. -
గీతం ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య
ప్రాజెక్టు విఫలమైందని మనస్తాపం బీచ్రోడ్డు: తాను రూపొందించిన ప్రాజెక్టు విఫలమైందన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని సీబీఎం కాంపౌండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న తరుణ్ శ్రీసాయి కిరణ్ రెడ్డి (23) గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయంలో ఎంటెక్ చదువుతున్నాడు. తాను ఎంతో కష్టపడి రూపొందించిన ప్రాజెక్ట్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు ఉన్న విద్యార్థి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
యువకుల బీభత్సం
గంజాయి మత్తులో పెందుర్తి: విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి కారణంగా ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. పూటుగా గంజాయిని సేవించిన ఇద్దరు యువకులు పెందుర్తి మండలం రాంపురం వద్ద జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించారు. ఆటోలో వచ్చి ఓ లారీ డ్రైవర్(ఓనర్)పై దారి దోపిడీకి పాల్పడ్డారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన అతడిపై నిర్ధాక్షిణ్యంగా దాడికి తెగబడ్డారు. రాళ్లు, చాకుతో ఇష్టానుసారం దాడి చేసి అతడ్ని తీవ్రంగా గాయపరిచారు. అదే ఊపులో ఆటోలో వెళ్లి రాంపురం వంతెన వద్ద ఓ ఆర్టీసీ బస్ను ఢీకొన్నారు. డ్రైవర్, కండక్టర్తో వాగ్వాదానికి దిగి ఆటో పాడైంది డబ్బులు ఇవ్వాలని తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. మొత్తానికి గంజాయి మత్తులో ఇద్దరు యువకులు భీతవహ వాతావరణాన్ని సృష్టించారు. వివరాలివి.. చినముషిడివాడకు చెందిన బంటు త్రినాథరావు సొంత లారీ నడుపుకుంటున్నాడు. మంగళవారం రాజాం నుంచి మొక్కజొన్న లోడుతో అనకాపల్లి వద్ద ఉన్న కోడూరుకు తరలించాడు. అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో డీజీల్ అయిపోవడంతో రాంపురం సమీపంలోని ఆనందపురం–అనకాపల్లి బైపాస్ పక్కన లారీ నిలుపుదల చేశాడు. డబ్బాలో డీజిల్ తెచ్చుకునేందుకు సమీపంలోని బంక్కు వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ఆటోలో వచ్చి అతడ్ని ఆపారు. రూ.50 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో డబ్బులు ఇస్తున్న క్రమంలో త్రినాథరావు వద్ద ఉన్న కొంత నగదుతో పాటు సెల్ఫోన్, ఏటీఎం కార్డు లాక్కున్నారు. ఈ క్రమంలో ఏటీఎం పిన్ చెప్పాలని అడిగారు. దానికి బాధితుడు నిరాకరించడంతో నడిరోడ్డుపైనే రాళ్లు, కత్తితో అతడిపై తీవ్రస్థాయిలో దాడికి తెగబడ్డారు. ఏదోలా వారి నుంచి తప్పించుకున్న త్రినాథరావు తీవ్ర గాయాలతోనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ సమీపంలోని బంక్లోకి వెళ్లాడు. అయితే బంక్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాలని బాధితుడ్ని పంపేశారు. అలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సమీపంలోని దాబాలోకి వెళ్లడంతో దాబా నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాధితుడ్ని పెందుర్తిలో ఆసుపత్రికి తరలించారు. అయినా ఆగలేదు.. తీవ్ర గాయాలపాలైన బాధితుడు త్రినాథరావు బంక్లోకి వెళ్లినప్పుడు వెంబడించిన దుండగులు కాసేపు అతడి కోసం అక్కడే మాటు వేశారు. అయితే బాధితుడు చాకచక్యంగా తప్పించుకుని దాబాలోకి వెళ్లిపోవడంతో వారు రాంగ్ రూట్లో పెందుర్తి వైపు వెళ్లి రాంపురం కూడలి వద్ద ఆర్టీసీ బస్ను ఢీకొన్నారు. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఆటో పాడైంది రూ.25 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ ఇద్దరు యువకులు ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ లోపు పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మత్తులో దారి దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు యువకులు పెందుర్తిలోని నల్లక్వారి ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. పెందుర్తి క్రైం విభాగం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దారి దోపిడీ జరిగిన రాంపురం సమీపంలోని ప్రాంతం, (ఇన్సెట్) గాయపడిన బంటు త్రినాథరావు -
మా కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమకు కష్టానికి తగిన ప్రతిఫలం వేతనం రూపంలో లభించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఏయూ పరిపాలన భవనం వద్ద వారు తమ సమస్యలను వెల్లడించారు. యూనివర్సిటీలో 10 సంవత్సరాలకుపైగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, తమకు చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. వెంటనే వేతనాలను పెంచాలని, అలాగే మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని అధికారులను కోరారు. విశాఖపట్నంలో జీవన వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, తమ వేతనాలు మాత్రం పెరగడం లేదని వారు వాపోయారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతుండటంతో, తక్కువ జీతాలతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. తమ పిల్లలకు మంచి విద్య అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వేతనాల్లో ఎటువంటి పెంపు జరగలేదని తెలిపారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు 28 రోజుల విధానం, టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను గుర్తించి న్యాయం చేయాలని ఉద్యోగులు కోరారు. ఈ కార్యక్రమంలో డి.కిరణ్ ప్రభు, ఏ.వి.ఎస్.ప్రసాద్, ఎం.పోలినాయుడు, ఎస్.తేజ, ఓ.ఆర్.రాజి, మదీనా వల్లి తదితరులు పాల్గొన్నారు. -
మధుర కలయిక
మురళీనగర్ : నావల్ డాక్యార్డు అప్రెంటీస్ స్కూల్ పూర్వ విద్యార్థులు తమ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను మురళీనగర్ వైశాఖి స్పోర్ట్సు పార్కులో బుధవారం నిర్వహించారు. 1976 బ్యాచ్కి చెందిన 100 మంది పూర్వ విద్యార్థులు ఒక చోట చేరి పాఠశాలలో గడిపిన క్షణాలను, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వివిధ హోదాల్లో రిటైర్ అయిన వీరు పకలరింపులతో పులకించిపోయారు. కమాండర్ తరుణయ్య, ఎన్ఎస్ ప్రకాశరావు, మెడికల్ ఆఫీసరుగా సేవలందించిన రవిబాబు పాల్గొన్నారు. వీరిని పూర్వ విద్యార్థులందరూ ఘనంగా సత్కరించారు. గోల్డెన్ జూబ్లీ మెమోంటోలను అందరికి అందించారు. మల్ల రామకృష్ణ ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. ఏవీఎన్ పట్నాయక్, జి.పండయ్య, బ్రూస్లీ ప్రసాద్ పాల్గొని కార్యక్రమం నిర్వహణకు సహకరించారు. -
ద్రోణంరాజు ఇంట్లో ఆత్మీయ కలయిక
ద్రోణంరాజు కుటుంబ సభ్యులతో మాజీ మంత్రి అంబటి, పార్టీ నేతలు బీచ్రోడ్డు: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ ఇంటికి మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం విచ్చేసి, ఆయన కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్ కుమార్, అన్నంరెడ్డి అదీప్ రాజ్, చింతలపూడి వెంకటరామయ్య, మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి శ్రీనివాస్, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి తదితరులతో కలసి అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. దివంగత నేతలు ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాసరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శ్రీవత్సవ కూడా ఎల్లవేళలా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ల తాత, నాన్న రాజకీయ వారసత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. శ్రీవత్సవ మాట్లాడుతూ.. పార్టీ పెద్దలు తనను ఒక కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అందరితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, ద్రోణంరాజు అభిమానులు పాల్గొన్నారు. -
మహనీయులను తలచుకోవడం జన్మ రుణం తీర్చుకోవడమే..
విశాఖ సిటీ : దేశాన్ని అంటరానితనం, అమానవీయతల నుంచి బయటపడేసి మనుషులంతా ఒకటేనని చాటి చెప్పిన మహనీయులను తలచుకోవడం జన్మ రుణం తీర్చుకోవటం లాంటిదేనని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు, మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.వి.చలం పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంతంలో మహాత్మా జ్యోతిబాపూలే గౌతు లచ్చన్నల విగ్రహాల వద్ద ‘బడుగు యోధుల మహనీయుల మాసం‘ గోడ పత్రికను తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ సభ్యుడు నరసింహ చారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మం, జ్యోతిబాపూలే, అంబేడ్కర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పి.శివశంకర్, గౌతు లచ్చన్న వంటి బహుజన యోధుల శోభాయాత్రలు ప్రతీ పట్టణంలో నిర్వహించాలని సూచించారు. ఇంతవరకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళల వాటా తేల్చాలన్నారు. దీనికోసం బీసీలు ఏకమై పోరాడాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, బహుజన ఉద్యమ కవి జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ ఉన్నత మానవీయ సమాజం కోసం తపించి జాతిని జాగృతం చేసిన యోధులు జన్మించిన ఏప్రిల్ మాసాన్ని బడుగు యోధుల మహనీయుల మాసంగా జరుపుకోవడం స్ఫూర్తిదాయకమైందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ సభ్యులు నరసింహాచారి మాట్లాడుతూ విశాఖ నగరంలో భారీగా పోతులూరి వీరబ్రహ్మం శోభాయాత్ర జరుపుతామని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ అంబేడ్కర్ భవన్ అధ్యక్షుడు వి.కల్యాణరావ్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్ పాల్గొన్నారు. -
టాప్గేర్లో విశాఖ ఉక్కు
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి, అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. 2024–25లో హాట్ మెటల్ 3.91 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగా.. 2025–26లో 52 శాతం వృద్ధితో 5.95 మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 3.75 మి.ట ద్రవపు ఉక్కు ఉత్పత్తి చేయగా గత ఆర్థిక సంవత్సరంలో 5.69 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి 52 శాతం వృద్ధి నమోదు చేసింది. క్రూడ్ స్టీల్ కూడా 51 శాతం వృద్ధితో 5.43 మిలియన్టన్నులకు చేరింది. అమ్మకాలు విషయానికి వస్తే 2024–25లో 3.49 మిలియన్ టన్నులతో రూ.18,288 కోట్లు చేయగా 2025–26లో 4.42 మి.టన్నులతో రూ. 22,311 కోట్లు అమ్మకాలు చేసి పరిణామంలో 27 శాతం, అమ్మకాల్లో 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఉత్పత్తి, అమ్మకాల వృద్ధిలో ఉద్యోగుల నిరంతర కృషి ప్రతిబింబింస్తుందని యాజమాన్యం తెలిపింది. ఉత్పాదకత, వ్యయ నియంత్రణ, వినియోగదారుల సంతృప్తిపై సంస్థ దృష్టి పెట్టిందని పేర్కొంది. హాట్మెటల్ ఉత్పత్తిలో రికార్డు విశాఖ స్టీల్ప్లాంట్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. స్టీల్ప్లాంట్ ప్రారంభం నుంచి మూడు బ్లాస్ట్ఫర్నేస్లు కలిపి 2021–22లో ఉత్పత్తి చేసిన 57,73,6500 టన్నుల హాట్ మెటల్ ఇప్పటి వరకూ రికార్డుగా ఉంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 59,55,156 టన్నులు ఉత్పత్తి చేసి సరి కొత్త రికార్డు సాధించింది.విభాగం ఉన్నతాధికారులు ఉద్యోగులను అభినందించారు. -
వైజాగ్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తా
మహారాణిపేట: విశాఖ జిల్లా పాలనా పగ్గాలను ఎం.అభిషిక్త్ కిషోర్ బుధవారం అధికారికంగా చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అభివృద్ధిపై తనకున్న విజన్ను ఈ సందర్భంగా మీడియాతో పంచుకున్నారు. విశాఖపట్నం కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశానికే కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక కేంద్రం అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నగరాన్ని ఐటీ, డేటా సెంటర్లు, టూరిజం రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం, పోర్టు ఆధారిత అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ ద్వారా జిల్లా రూపురేఖలు మార్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఉద్ఘాటించారు. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమతుల్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ప్రజల వద్దకే పాలన ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ‘నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను. ప్రజల సమస్యలను నేరుగా విని, అక్కడికక్కడే పరిష్కార మార్గాలను వెతుకుతాను’ అని హామీ ఇచ్చారు. పారదర్శకతతో కూడిన పరిపాలనను అందిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని సమర్థంగా నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. విశాఖను రాష్ట్రానికే మార్గదర్శకంగా తీర్చిదిద్దే ఈ ప్రయాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పిలుపునిచ్చారు. సొంత గడ్డపై సేవ తన నేపథ్యాన్ని గురించి మాట్లాడుతూ.. ‘నేను ఆంధ్రావాడినే. నెల్లూరు నా స్వస్థలం. నా తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఆ క్రమశిక్షణే నన్ను ఇక్కడి వరకు తెచ్చింది’ అని గర్వంగా చెప్పుకొచ్చారు. గతంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్గా, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో సబ్ కలెక్టర్గా, ఐటీడీఏ పీవో, మున్సిపల్ కమిషనర్, ఫైనాన్స్, కమర్షియల్ ట్యాక్స్ వంటి రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం విశాఖ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. నూతన కలెక్టర్కు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. అప్పన్న సేవలో కొత్త కలెక్టర్ సింహాచలం: విశాఖ జిల్లా కలెక్టర్గా పనిచేయడం ప్రతి ఐఏఎస్ అధికారికి ఒక సువర్ణావకాశమని నూతన కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన తన సతీమణితో కలిసి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు తీర్చుకున్న అనంతరం, బేడా మండపంలో ప్రదక్షిణలు చేశారు. అంతరాలయంలో కలెక్టర్ దంపతుల పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించి, వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని దేవస్థానం ఈవో జె.వెంకటరావు వారికి బహూకరించారు. -
కోసం వలన చేత
విద్యా కుసుమాల నిలయం, దేశానికే గర్వకారణమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేడు ప్రైవేటు శక్తుల చేతిలో పతనం.. రాష్ట్రపతి ప్రారంభించిన రక్షణ కేంద్రానికి గ్రహణం.. ఆదాయం ఇచ్చే అక్షయ పాత్రను.. అప్పనంగా చిత్తుకాగితం చేసిన వైనం.. ’చేతికొచ్చిన బంగారాన్ని చెరువులో పారేసినట్టు’.. సొంత ప్రతిష్టను బలిపీఠం ఎక్కిస్తున్న పాలకులు.. ప్రశ్న ఒకటే.. ఏయూ భవితవ్యం.. ప్రైవేటు శక్తుల బతుకుదెరువా? ● ఏయూ డిఫెన్స్ స్టడీస్ సెంటర్కు మంగళం ● ప్రైవేటు వర్సిటికీ లబ్ధి చేకూర్చడమే పాలకవర్గం లక్ష్యం? ● ఏకపక్ష నిర్ణయాలతో అభాసుపాలుఇదీ ఏయూలో పాలన ప్రైవేటు హితం కోసం.. వర్సిటీకి రిక్తంసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ గడ్డపై విద్యా వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. నేడు ప్రైవేటు శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ‘గీతం వలన.. గీతం కోసం.. గీతం చేత..’ అన్న చందంగా సాగుతున్న ప్రస్తుత పాలన, వర్సిటీ గౌరవాన్ని గంగలో కలిపేస్తోంది. సాక్షాత్తూ భారత రాష్ట్రపతి ప్రారంభించిన రక్షణ అధ్యయన కేంద్రానికే మంగళం పాడి, రూ.15 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే అక్షయపాత్రను చిత్తుకాగితంలా పారేసిన వైనంపై మేధావుల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతోంది. అగ్నివీరులకు మార్గదర్శిగా, దేశ రక్షణ దళాలకు విద్యా గనిగా పేరుగాంచిన ఏయూని కుప్పకూల్చి.. ఆ శిథిలాల మీద ప్రైవేటు సామ్రాజ్యానికి రెడ్ కార్పెట్ వేస్తున్న పాలకుల తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రపతి ప్రారంభించిన కేంద్రానికి గ్రహణం ఏయూ రక్షణ అధ్యయన కేంద్రాన్ని 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సెంటర్ అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు, అధికారులు తమ విధుల్లో ఉంటూనే.. ఉన్నత చదువులు అభ్యసించడానికి, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన ఉపాధి పొందేందుకు ఈ కేంద్రం వారధిలా నిలిచింది. భారత వైమానిక, నౌకా, భూసేనలతో పాటు ఐఎన్ఎస్ సంస్థలు, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ ఫేర్ వంటి అత్యున్నత రక్షణ విభాగాలతో ఏయూ బలమైన ఒప్పందాలు చేసుకుంది. దీనివల్ల వేలాది మంది రక్షణ సిబ్బంది పీహెచ్డీలు, డిగ్రీలు పూర్తి చేసి వర్సిటీ ప్రతిష్టను పెంచడమే కాకుండా, వర్సిటీ ఖజానాకు సుమారు రూ.15 కోట్ల ఆదాయాన్ని కూడా సమకూర్చారు. అగ్నివీర్లకు మార్గదర్శి.. నేడు అగమ్యగోచరం దేశంలో అగ్నివీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికై న మొదటి విశ్వవిద్యాలయంగా ఏయూ రికార్డు సృష్టించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 7 వేల మందికి పైగా సైనికులు ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యాక్ గుర్తింపులో ఈ కేంద్రం ప్రదర్శించిన ‘బెస్ట్ ప్రాక్టీసెస్’కు 400 కి 400 మార్కులు రావడం విశేషం. ఇంతటి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న కేంద్రాన్ని, 2023లో సెనేట్ ఆమోదంతో పూర్తిస్థాయి స్కూల్గా మార్చాలని నిర్ణయించారు. అయితే, కొత్త పాలన వచ్చిన తర్వాత పరిస్థితి తలకిందులైంది. ఏయే కారణాలతో ఈ కేంద్రాన్ని మూసివేశారో అర్థం కాక విద్యార్థులు, నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిణామాల వల్లే సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిరంజన్ తన పదవికి రాజీనామా చేయగా, సమన్వయకర్తగా ఉన్న ఉజ్వల్ వంటి నిపుణులు వర్సిటీని వీడాల్సి వచ్చింది. -
వాల్తేరులో సరికొత్త మైలు రాళ్లు
సాక్షి, విశాఖపట్నం : భారతీయ రైల్వేలో వాల్తేరు విభాగం మునుపెన్నడూ లేని విధంగా చరిత్రాత్మక విజయాలను నమోదు చేస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతోందని డీఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. వాల్తేరు డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో వాల్తేరు ప్రగతి వివరాలను వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన ఈ విభాగం, దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం గడించిన విభాగాల్లో ఐదో స్థానాన్ని కై వసం చేసుకుని తన ప్రత్యేకతను చాటుకుందని తెలిపారు. ప్రధానంగా సరుకు రవాణాలో 85.1 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, మునుపటి ఏడాదితో పోలిస్తే 17.25 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించామన్నారు. వాల్తేరు డీఆర్ఎం ఇంకా ఏం చెప్పారంటే.. ఆర్థిక రికార్డులు.. కార్యకలాపాల జోరు వాల్తేరు విభాగం ఈ ఏడాది మొత్తం రూ.11,598 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గతేడాదితో పోలిస్తే 17 శాతం అధికం. ముఖ్యంగా సరుకు రవాణా, రవాణా నిర్వహణలో 150 మిలియన్ టన్నుల మైలురాయిని దాటి అగ్రగామిగా నిలిచింది. ప్రయాణికుల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి. సుమారు 3.34 కోట్ల మంది ప్రయాణికులు వాల్తేరు రైల్వే సేవలను వినియోగించుకోగా, గత 21 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల విభాగం ద్వారా రూ.881.37 కోట్ల ఆదాయం సమకూరింది. క్యాటరింగ్, పార్కింగ్, ప్రకటనలు, టికెట్ తనిఖీల ద్వారా కూడా భారీగా ఆదాయం ఆర్జించాం. శరవేగంగా స్టేషన్ల నవీకరణ పనులు వాల్తేరు డివిజన్ పరిధిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 15 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు ఎంపిక చేశాం. విశాఖపట్నం ప్రాంతంలో రైలు ఫ్లైఓవర్లు, అదనపు లైన్ల నిర్మాణం, స్టేషన్ల నవీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం విశాఖపట్నం స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్, విశాఖలో 220, విజయనగరంలో 24 డిజిటల్ స్క్రీన్లు, అత్యాధునిక వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాం. పండగలు, సెలవుల రద్దీని తట్టుకునేందుకు 300కు పైగా ప్రత్యేక రైళ్లు, 400 అదనపు కోచ్లను నడిపాం. విశాఖపట్నం నుంచి తిరుపతి, చర్లపల్లి వెళ్లే ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరించారు. అరకు, కొరాపుట్ కాఫీ బ్రాండ్లను ప్రోత్సహించడానికి ఆయా స్టేషన్లలో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్లాటినం రేటింగ్ కలిగిన హరిత రైల్వే స్టేషన్గా విశాఖపట్నం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదు వాల్తేరు విభాగం సాంకేతికత వినియోగంలోనూ ముందుంది. భద్రత, నిఘా కోసం విశాఖ స్టేషన్లో ‘ఆర్క్ అర్జున్’ అనే కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోను ప్రవేశపెట్టాం. ఇది నేరస్తులను గుర్తించడంలో, ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భద్రతా పరంగా అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బందికి ప్రత్యేక అవార్డులు అందజేయడమే కాకుండా, సిబ్బంది నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. మౌలిక వసతుల విస్తరణ రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు మౌలిక సదుపాయాల విస్తరణపై విభాగం దృష్టి సారించాం. ఈ ఏడాది జనవరి నాటికి 380 కిలోమీటర్లకు పైగా డబుల్ లైన్ పనులను పూర్తి చేసి ప్రారంభించడం ఒక పెద్ద విజయం. దీనివల్ల రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గడమే కాకుండా, సరుకు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుంది. పార్లమెంట్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించినట్లుగా.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ త్వరలో రాబోతుందని డీఆర్ఎం స్పష్టం చేశారు. -
ఆరోగ్యశ్రీకి కూటమి ఉరి
గీతంకు రెడ్ కార్పెట్.. ఏయూకి ఉరితాడు ఏయూలో రక్షణ కోర్సులను రద్దు చేయడం వెనుక గీతం యూనివర్సిటీకి మేలు చేకూర్చాలనే ఉద్దేశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏయూ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థ ఈ కోర్సులను నిలిపివేస్తే, ఆ అడ్మిషన్లన్నీ సహజంగానే గీతం వంటి ప్రైవేటు సంస్థలకు మళ్లుతాయని పాలకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏయూని వీడి వెళ్లిన నిపుణులు గీతంలో కన్సల్టెంట్లుగా చేరుతుండటం, రక్షణ శాఖలు ఏయూని తమ భాగస్వామ్య జాబితా నుంచి తొలగించి ఇతర ప్రైవేటు సంస్థల వైపు చూడటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు కంటే ఒక ప్రైవేటు సంస్థ లాభాలే ముఖ్యమన్నట్టుగా వర్సిటీ నిర్ణయాలు ఉండటం శోచనీయం. మహారాణిపేట: నిరుపేదల ప్రాణ సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకం నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిలిచిపోయింది. రెండు దశాబ్దాలుగా పేద రోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచితంగా అందుతున్న ఆధునాతన వైద్య సేవలకు బకాయిల గ్రహణం పట్టింది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా కోట్లాది రూపాయల మేర పేరుకుపోయిన బకాయిలను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో.. జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు నిలిపివేయాలని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం ప్రధానంగా ఆస్పత్రుల్లో సేవలు బంద్ చేశారు. కేర్, వీఆర్ఐడీఏ, ఇండస్, జి.జె. తదితర ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. జిల్లాలోని 65 నెట్వర్క్ ఆస్పత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవల(ఆరోగ్యశ్రీ) కోసం ప్రతి రోజూ వెయ్యి మందికి పైగా అవుట్ పేషెంట్లు వస్తుంటారని అంచనా. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు మూడు, నాలుగు సర్జరీలు జరుగుతుంటాయి. సమ్మె మొదటి రోజైన బుధవారం జిల్లావ్యాప్తంగా ఓపీ, ఐపీ సేవలు నిలిచిపోయాయి. అత్యవసర శస్త్రచికిత్సలు మినహా మిగిలిన సర్జరీలు కూడా ఆగిపోయాయి. ఉచిత వైద్య సేవలు నిలిపివేయడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. సేవల్లో తీవ్ర అంతరాయం ఆషా పిలుపు మేరకు బుధవారం ఆరోగ్యశ్రీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి బకాయిలు రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీని ప్రభావం కేవలం పేద రోగుల పైనే కాకుండా.. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కింద చికిత్స పొందే ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టులపైనా పడింది. బకాయిలు విడుదల చేసి సేవలు పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు. వర్సిటీలో పరిణామాలు ఆందోళనకరం వర్సిటీలో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం విద్యాపరమైనవే కాకుండా, పరిపాలనాపరంగా కూడా వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల జరిగిన 91, 92వ కాన్వకేషన్ కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ మాజీ వీసీ కోనేరు రామకృష్ణారావు అల్లుడు పూర్ణచంద్రరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించడం పెద్ద దుమారం రేపింది. కనీసం పాలక మండలి దృష్టికి తీసుకువెళ్లకుండా, వారి అనుమతి లేకుండా వీసీ ఏకపక్షంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వర్సిటీని ప్రైవేటు వ్యక్తుల ఇలాకాగా మార్చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.15 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే సెంటర్ను మూసివేసి, వర్సిటీని ఆర్థికంగా దెబ్బతీయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో పాలకులు చెప్పాల్సిన అవసరం ఉందని వర్సిటీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏయూ ఉనికికే ముప్పు మేధావుల ఆవేదన.. విశాఖకు గర్వకారణంగా ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం తన ఉనికిని, గౌరవాన్ని కాపాడుకోవాలంటే ప్రస్తుత ధోరణి మారాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. రక్షణ రంగ నిపుణులను దూరం చేసుకోవడం వల్ల వర్సిటీ జాతీయ స్థాయి ర్యాంకింగ్ల్లో వెనుకబడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. కేవలం ఒక ప్రైవేటు యూనివర్సిటీకి లబ్ధి చేకూర్చేందుకు ఏయూ మూలాలను దెబ్బతీయడం సరికాదని మేధావులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే రక్షణ అధ్యయన కేంద్రాన్ని పునరుద్ధరించి, వర్సిటీ ప్రతిష్టను కాపాడాలని ఉత్తరాంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
స్టీల్ప్లాంట్ తల్లీ.. ఇక సెలవు
ఓ కార్మికుడి వీడ్కోలుఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారం రుణం తీర్చుకోలేనిదని స్టీల్ప్లాంట్ కార్మికుడు గొందేశి అప్పలరాజు అన్నారు. స్టీల్ప్లాంట్ రోల్షాప్ అండ్ రిపేర్ షాప్ విభాగానికి చెందిన జనరల్ ఫోర్మెన్ అప్పలరాజు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా మంగళవారం పదవీ విరమణ చేశారు. విభాగంలో సహోద్యోగుల మధ్య జరిగిన కార్యక్రమాల అనంతరం ఆయన ఇంటికి బయల్దేరారు. స్టీల్ప్లాంట్ నుంచి బయటకు వచ్చిన అప్పలరాజు ఉద్వేగానికి లోనయ్యారు. స్టీల్ప్లాంట్ మెయిన్ గేటుకు నమస్కారం చేసి కన్నీటి పర్యంతమయ్యారు. 35 ఏళ్ల తన సేవలను పూర్తి చేసుకుని వెళ్లడం బాధగా ఉందన్నారు. తన కన్న తల్లి తర్వాత తల్లి లాంటి స్టీల్ప్లాంట్ తనకు మంచి జీవితం, కుటుంబాన్ని ఇచ్చిందన్నారు. స్టీల్ప్లాంట్ రుణం తీరుకోలేనిదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సహోద్యోగులు ఆయనను ఓదార్చి ఇంటికి పంపించారు. -
మంచి మనసు.. విలువలకు చిరునామా
మహారాణిపేట: తన మృదు స్వభావంతో, అద్భుతమైన పనితీరుతో జిల్లా ప్రజల మనసు గెలుచుకున్న కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ విలువలకి, సేవా భావానికి చిరునామా అని అధికారులు కొనియాడారు. జిల్లా కలెక్టర్గా దాదాపు 20 నెలల పాటు సేవలందించి, బదిలీపై వెళ్తున్న ఆయనకు మంగళవారం నగరంలోని ఒక హోటల్లో అధికారులు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. కలెక్టర్ దంపతులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. విశాఖతో మరిచిపోలేని బంధం: ఈ సందర్భంగా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘విశాఖ జిల్లాలో పని చేసిన ఈ 20 నెలల కాలం నా జీవితంలో మరిచిపోలేనిది. ఇక్కడి ప్రజలతో, అధికారులతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. భయపెట్టి పని చేయించడం నా నైజం కాదు.. అందరి మద్దతు, సహకారంతోనే లక్ష్యాలను సాధించవచ్చని నేను నమ్ముతాను. జిల్లాలో చేపట్టిన ప్రతి కార్యక్రమం మీ అందరి కృషి వల్లే విజయవంతమైంది. యోగాంధ్ర నిర్వహణలో అధికారుల సహకారం మరువలేనిది.’అని అన్నారు. పరిపాలనాపరంగా తనకు సహకరించిన ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ.. కలెక్టర్ హరేందిర ప్రసాద్ నుంచి తాము ఎన్నో విషయాలు నేర్చుకున్నామని, ఆయన పరిపాలనా దక్షత తమకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఏయూ వీసీ ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. యోగాంధ్ర వంటి కార్యక్రమాల్లో కలెక్టర్ చూపిన చొరవ, నాయకత్వ పటిమ అద్భుతమని కొనియాడారు. కలెక్టర్ సతీమణి దివ్య ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఆయన ఎప్పు డూ చిరాకు పడరు. ఎవరిపై కోప్పడరు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఓపిగ్గా వింటారు. మీరందరూ ఇచ్చి న మద్దతు వల్లే ఆయన ఇంతటి ఉత్తమ పనితీరును ప్రదర్శించగలిగారు’ అని అన్నారు. అంతకుముందు సింహాచలం దేవస్థానం వేద పండితులు కలెక్టర్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. అధికారులు, రెవెన్యూ, ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించారు. కలెక్టర్ వీడ్కోలు సభలో జిల్లా అధికారులు -
పరుగు పోటీల్లో కండక్టర్ సత్తా
పద్మనాభం: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో అనంతవరం గ్రామానికి చెందిన కొండిమాని రాంబాబు అద్భుత ప్రతిభ కనబరిచారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఈ క్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. విశాఖ జిల్లా తరపున 35, 45 సంవత్సరాల పురుషుల విభాగాల్లో రాంబాబు పాల్గొన్నారు. 100 మీటర్ల పరుగు పందెం, 4x100 మీటర్ల రిలే పరుగు పందెంలో బంగారు పతకాలను సాధించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కండక్టర్గా విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తిని పలువురు అభినందించారు. -
నిందితుడు రవీంద్రను ఉరి తీయాలి
మౌనిక తండ్రి వేణుగోపాల్ మహారాణిపేట: ‘నా బిడ్డను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు’ అంటూ మౌనిక తండ్రి పొలిపల్లి వేణుగోపాల్ కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద తన కుమార్తె మృతదేహాన్ని చూసి ఆయన బోరున విలపించారు. తన కుమార్తెను హత్య చేసిన చింతాడ రవీంద్రను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన సమయంలో మౌనిక ఒంటిపై ఉన్న సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని వేణుగోపాల్ తెలిపారు. ఈ కేసుపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి, తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు. -
భారత్ను సైబర్ నిపుణుల కేంద్రంగా మారుద్దాం
బీచ్రోడ్డు: జాతీయ స్థాయిలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించేందుకు సిటిజన్ ఫోర్స్, టెమా, సీఎంఏఐ, సీఎస్ఏఐ సంస్థల మధ్య కీలకమైన ఎంవోయూ కుదిరింది. దేశవ్యాప్తంగా సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, యువతకు శిక్షణ, భవిష్యత్తు డిజిటల్ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా మంగళవారం నగరంలోని ఒక హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్.కె. గోయల్ మాట్లాడుతూ.. ‘భారత్ వేగంగా డిజిటల్ శక్తిగా ఎదుగుతోంది. అయితే డిజిటల్ సేవలు విస్తరించడంతో పాటు సైబర్ ముప్పులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామ స్థాయి వరకు సైబర్ అవగాహనను తీసుకెళ్లడమే మా లక్ష్యం. ఈ ఎంవోయూ ద్వారా లక్షకు పైగా యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ ఇస్తాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్సులు రూపొందిస్తాం. తద్వారా భారత్ను ప్రపంచానికి సైబర్ నిపుణులను అందించే కేంద్రంగా తీర్చిదిద్దుతాం’ అని వివరించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు నిత్యకృత్యమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. యువత సోషల్ మీడియా వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ భద్రతపై చేపట్టే శిక్షణ కార్యక్రమాలకు పోలీసు శాఖ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ సీఎండీ పి.రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లో విస్తృతంగా సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నేషనల్ లా యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వై.సత్యనారాయణ, సిటిజెన్ ఫోర్స్ ఫౌండర్ డైరెక్టర్ పి.ఉమామహేశ్వరి, శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ కె.ధర్మరాజు, లెండి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పి.మధుసూదనరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె.శివరామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ ఎన్.కె. గోయల్ -
కలెక్టర్ హరేందిర ప్రసాద్ సేవలు మరువలేనివి
మహారాణిపేట: విశాఖ జిల్లా కలెక్టర్గా ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అందించిన సేవలు ప్రశంసనీయమని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి కొనియాడారు. కలెక్టర్ బదిలీ నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యేలు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 20 నెలల కాలంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రజలకు విశేష సేవలందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలను కలెక్టర్ సమన్వయంతో విజయవంతం చేశారని కితాబిచ్చారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ.. తన విధి నిర్వహణలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ కమిషనర్లు కేతన్ గార్గ్, తేజ్ భరత్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు పాల్గొన్నారు. ఇన్చార్జి మంత్రి డోలా -
కందిపప్పు కలేనా.. రాగులు గతమేనా?
మహారాణిపేట: పేదల ఆహార భద్రతకు అండగా ఉండాల్సిన రేషన్ దుకాణాలు ఇప్పుడు అరకొర సరఫరాలతోనే సరిపెట్టుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలలు దాటినా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో నిత్యావసరాలు అందకపోవడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఎన్నికల ముందు రేషన్ ద్వారా విభిన్న నిత్యావసరాలు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం బియ్యం, పంచదారకే పరిమితమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కందిపప్పు, రాగులు పంపిణీ చేస్తూ ‘మూన్నాళ్ల ముచ్చట’గా మార్చేసిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. పిండితో సరిపెడుతున్న సర్కార్ బియ్యం, పంచదార తప్ప మరేమీ ఇవ్వకుండానే కాలం గడిపేస్తున్న చంద్రబాబు సర్కార్, తాజాగా పట్టణ ప్రాంతాల్లో రూ. 20లకే గోధుమ పిండి ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. అయితే, గ్రామీణ ప్రజలకు ఈ సౌకర్యం లేకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోషకాహారం పేరిట చేస్తున్న ఈ హడావుడి, క్షేత్రస్థాయిలో కేవలం కొందరికి మాత్రమే అందుతోంది. జిల్లాలో పరిస్థితి ఇలా... డీఎస్ఓ పరిధిలో మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి ప్రాంతాలు ఉండగా, జిల్లాలో 5.12 లక్షల తెలుపు కార్డులు, 600కు పైగా చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అయినప్పటికీ సరఫరా లోపాలు సరిచేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఆశలు... ఇంకా నిరీక్షణలోనే.. గడప గడపకు రేషన్ అని చెప్పిన పాలకులు, ఇప్పుడు రేషన్ షాపుల్లో సరుకులకే కత్తెర వేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరల నేపథ్యంలో, రేషన్ దుకాణాలపై ఆధారపడే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కందిపప్పు, రాగులు వంటి అవసరమైన వస్తువులు అందకపోవడంతో పేదల భోజనంలో పోషకాహారం తగ్గిపోతోంది. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కందిపప్పు, వంటనూనె వంటి నిత్యావసరాలను పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.రాగులకు ఇండెంట్ లేదు రాగులు మూడు కిలోలు ఇస్తామని చెప్పి చివరకు ఒక కిలోకే పరిమితం చేయడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచింది. అంతేకాకుండా రాగులు ఇచ్చినప్పుడు బియ్యం కోటాలో కోత విధించడం మరో సమస్యగా మారింది. అది కూడా జనవరి నెల వరకే ఇచ్చారు. ఈనెల రాగులకు ఇండెంట్ పెట్టలేదు. అంటే ఈ నెల ఒక్క కిలో పంపిణీ చేసే అవకాశం లేదు.రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల కోసం ఎదురు చూసే కార్డుదారులకు నిరాశే మిగులుతోంది. ఎన్నికల హామీల్లో చెప్పిన కందిపప్పు, రాగులు ఇప్పుడు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోగా, నెలల తరబడి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో అమాంతం పెరిగిన ధరల మధ్య రేషన్పై ఆధారపడే పేదలు కందిపప్పు, రాగుల కోసం కళ్లప్పగించి ఎదురుచూస్తుండటం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. కందిపప్పు కోసం కళ్లప్పగింత గత ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారుడికి నెలకు ఒక కిలో కందిపప్పు అందించేవారు. ప్రస్తుతం అది గతస్మృతిగా మారింది. ఏప్రిల్లో కూడా కందిపప్పు పంపిణీ చేసే సూచనలు కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి ఇండెంట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. మార్కెట్లో కందిపప్పు ధరలు రూ.150 నుంచి రూ.180 వరకు పెరగడంతో, సాధారణ ప్రజలకు కొనుగోలు భారంగా మారింది. దీంతో రేషన్ ద్వారా తక్కువ ధరకు లభించే కందిపప్పుపైనే అనేక కుటుంబాలు ఆధారపడుతున్నాయి. -
నైట్ ఫుడ్ కోర్టును తక్షణమే పునరుద్ధరించాలి
న్యాయం చేయకుంటే జీవీఎంసీ ముట్టడి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుసాక్షి, విశాఖపట్నం: నగరంలో నైట్ ఫుడ్ కోర్టును తక్షణమే పునరుద్ధరించి, బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. సెంట్రల్ పార్క్ వద్ద నైట్ ఫుడ్ కోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు మంగళవారం ఆయన సంఘీభావం తెలిపారు. చిరు వ్యాపారులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. విశాఖకు వచ్చే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు, స్థానిక సంప్రదాయ ఆహార సంస్కృతిని ప్రోత్సహించడంలో నైట్ ఫుడ్ కోర్టు కీలకంగా ఉండేదన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన చిరు వ్యాపారులకు ఇది జీవనాధారంగా మారిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా నైట్ ఫుడ్కోర్టును ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వ్యాపారులకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఫుడ్ కోర్టులోని దుకాణాలను తొలగించడం దుర్మార్గమని విమర్శించారు. గత ఆరు నెలలుగా వందలాది మంది సిబ్బంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. అప్పటికీ స్పందన రాకపోతే జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామ ని కేకేరాజు హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, నియోజకవర్గ పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, పేడాడ రమణికుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా దుర్గారావు, నా యకులు చెన్నా సునీల్, ఎం.సునీల్, బొండా ఉమామహేశ్వరరావు, పీలా ప్రేమ కిరణ్, దేవరకొండ మార్కండేయులు, గోవింద్, చొల్లింగ్ నాగేశ్వర రావు, రమణ్ రెడ్డి, డోప్ప శ్రీను, మువ్వల సంతోష్, హరికృష్ణ, కొట్యాడ సూర్య, పోలిరెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
షాడో
పశ్చిమలోరాజ్యంఅక్కడ చట్టం చుట్టమైపోయింది.. నిబంధనలు నీరుగారిపోయాయి. అక్కడ వినిపించేది ప్రజా ప్రతినిధి గొంతు కాదు.. ఆయన వెనకాల ఉండే ‘షాడో’ ఎమ్మెల్యేల హుకుం. ఐదుగురు పీఏలు.. ఐదు విభాగాలు.. వెరసి విశాఖ పశ్చిమ నియోజక వర్గం అక్రమ వసూళ్ల అడ్డాగా మారిపోయింది. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ కంటే ముందు పీఏల ‘పర్మిషన్’ ఉండాల్సిందే. గెడ్డల ఆక్రమణలకు పచ్చజెండా ఊపే ఈ ‘కలెక్షన్ కిం గ్స్’.. పేదవాడి సెట్బ్యాక్ దగ్గర మాత్రం సింహాల్లా గర్జిస్తున్నారు. అంతస్తుకో రేటు.. సంతకానికో నోటు.. ఇదీ ప్రస్తుతం విశాఖ పశ్చిమలో సాగు తున్న నగ్న సత్యం. అధికారులను పావులుగా వాడుకుంటూ, నిబంధనలను అస్త్రంగా చేసుకుని సాగుతున్న ఈ ‘వసూళ్ల పర్వం’పై గ్రౌండ్ రిపోర్ట్. విశాఖ సిటీ: ఆ నియోజకవర్గంలో ఐదుగురు ఎమ్మెల్యేలు. రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్.. ఇలా ఒక్కో విభాగాన్ని ఒక్కొక్కరుగా పంచేసుకున్నారు. ఆయా విభాగాల్లో ఎవరికి ఎటువంటి పనులు జరగాలన్నా ముందుగా వీరిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. బదిలీల నుంచి పోస్టింగ్ల వరకు.. అన్నింటికీ మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. ఇక నియోజకవర్గంలో చిన్న ఇంటి నుంచి భారీ భవనాల నిర్మాణం వరకు వీరి కనుసన్నల్లో జరగాల్సిందే. వారికి ముందుగా తాంబూలం సమర్పించాల్సిందే. లేదంటే నిబంధనల పేరుతో నోటీసులు.. వెనువెంటనే కూల్చివేతలు జరిగిపోతాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యే పేరుతో పీఏలు వసూళ్ల పర్వానికి తెరపారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో విభాగంలో ఒక్కొక్కరు పెత్తనం చెలాయిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో పీఏల పేరుతో ఐదుగురు షాడో ఎమ్మెల్యేలుగా చలామని అవుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఏ చిన్న పని కోసం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లినా ముందుగా వీరిని సంతృప్తి పరచాల్సిందే అన్నది బహిరంగ రహస్యం. చివరకు ఒక సామాన్యుడు తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలన్నా సదరు పీఏల ‘కృపాకటాక్షాలు’ ఉండాల్సిందేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పేరుతో చలామణి అవుతున్న ఈ ‘షాడో’ ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుని అక్రమ వసూళ్లకు తెరలేపారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంతస్తుకో రేటు.. అక్రమాలకు పచ్చజెండా నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అయితే ఇవి కేవలం పీఏల సిఫార్సు ఉంటేనే సాధ్యమవుతున్నాయి. బీపీఎస్ నిబంధనలను తుంగలో తొక్కి, అదనపు అంతస్తులు వేసుకోవడానికి పీఏ వర్గం ఒక ‘రేట్ కార్డు’నే సిద్ధం చేసింది. ఒక్కో అంతస్తుకు కనిష్టంగా రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇస్తే అక్రమ నిర్మాణం సక్రమమైపోతుంటే.. ఇవ్వలేని వారి నిర్మాణాలకు మాత్రం నిబంధనల పేరుతో నోటీసులు, వెనువెంటనే కూల్చివేతలు జరిగిపోతుండడం నిత్యకృత్యమైంది. జీవీఎంసీ పరిధిలోని పశ్చిమ ప్రాంతంలో గెడ్డల ఆక్రమణలు, రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నా కన్నెత్తి చూడని అధికారులు.. చిన్న చిన్న ఇళ్ల నిర్మాణాలకు సెట్బ్యాక్ల పేరుతో బెదిరింపులకు దిగుతుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనల అస్త్రం.. నోటీసుల పర్వం ఎవరైనా ఇల్లు కడుతున్నారని తెలియగానే, సచివాలయ ఉద్యోగులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. ప్లాన్లో ఏ చిన్నపాటి తేడా ఉన్నా వెంటనే కొలతలు వేసి నోటీసులు జారీ చేస్తున్నారు. చిన్న చిన్న నిర్మాణాల విషయంలోను నిబంధనల పేరుతో వేధింపులకు గురి చేస్తుండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘మాకేం సంబంధం లేదు, ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫిర్యాదు వచ్చింది.. వెళ్లి అక్కడ మాట్లాడుకోండి‘ అంటూ ఉచిత సలహాలు ఇస్తుండటం గమనార్హం. వసూళ్ల దందా కోసం అధికారులను సైతం పావులుగా వాడుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే పీఏల వసూళ్ల పర్వం? ఒక్కో విభాగానికి ఒక్కో పీఏ సామాన్యుడి సొంతింటి కలపై ‘పీఏ’ల ఉచ్చు నిబంధనల పేరుతో బెదిరింపులు రూ.లక్షల్లో వసూళ్లు.. మాట వినకపోతే కూల్చివేతలు అధికారులను పావులుగా వాడుకుంటూ దర్జాగా అక్రమ దందా అధికారుల పోస్టింగ్లోనూ హస్తంకేవలం నిర్మాణ రంగమే కాకుండా, నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారుల బదిలీలు, పోస్టింగ్ల్లో కూడా పీఏల జోక్యం మితిమీరిపోయినట్లు తెలుస్తోంది. బదిలీ, పోస్టింగ్, శాఖ, విభాగాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేసి సిఫార్సు లేఖలు తయారు చేసే బాధ్యతలు తీసుకుంటున్నారన్న టాక్ ఉంది. ఉన్నతాధికారులకు సైతం ఫోన్లు చేస్తూ.. వారి పనులు చేయాలంటూ హుకుం జారీ చేస్తూ షాడో ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారన్న వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. -
రూ.3 కోట్ల ప్రభుత్వ భూమికి స్కెచ్?
మధురవాడ: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అక్రమార్కులు తెగబడుతున్నారు. మధురవాడ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూమిని కొట్టేయడానికి నియోజకవర్గ ముఖ్య నేత పేరును వాడుకుంటూ దర్జాగా పనులు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. రూ.3 కోట్లు విలువ చేసే భూమి విశాఖ రూరల్ మండలం, మధురవాడ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 388 పరిసరాల్లో ఈ దందా సాగుతోంది. మధురవాడ హైవే నుంచి ఐటీ సెజ్కు వెళ్లే మార్గంలో, వికలాంగుల కాలనీ వద్ద అదానీ డేటా సెంటర్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమారు 500 గజాల ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం ధర బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.60 వేల వరకు పలుకుతోంది. అంటే సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ భూమిని హస్తగతం చేసుకునేందుకు పక్కా పథకం రచించారు. గతంలో అక్రమంగా నిర్మించిన షెడ్లకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలోని తుప్పలను తొలగించి, కొండ భూమిని చదును చేసే పనులు మొదలుపెట్టారు. ఇంత దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమణకు తెరలేపడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణ పనుల్లో జీవీఎంసీ వాహనం ఈ కబ్జా పర్వంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూ ఆక్రమణను అడ్డుకునేందుకు వచ్చిన గ్రేడ్–2 వీఆర్వో, అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేయించారు. భూమిని చదును చేస్తున్న పొక్లెయిన్ను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించేందుకు ప్రయత్నించగా.. అది జీవీఎంసీ శానిటేషన్ విభాగానికి చెందిన వాహనమని తేలడంతో విస్తుపోయారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత నుంచి ‘సదరు వ్యక్తులు మనవారే.. వదిలేయండి’అంటూ హుకుం జారీ కావడంతో అధికారి వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ఏకంగా ప్రభుత్వ వాహనాన్నే వాడటం చూస్తుంటే, ఈ వ్యవహారం ఎంతటి స్థాయి వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతుందో అర్థమవుతోంది. అసలు సూత్రధారులు ఎవరు? అసలు అక్రమార్కుల పనులకు జీవీఎంసీ వాహనాన్ని పంపిన అధికారులు ఎవరు? ఈ కబ్జా వెనుక జీవీఎంసీలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా.. లేక ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
● ఈపీడీసీఎల్లో వినూత్న కార్యక్రమం ● డయల్ యువర్ సీఎండీకి వినతులు ● ఫోన్ కాల్స్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: ఒక ఫోన్ నంబర్.. 8 వారాలు.. 11 జిల్లాలు.. 11 సర్కిళ్లు.. 345 ఫిర్యాదులు.. వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. మొత్తంగా వినూత్నంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రారంభించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి స్వయంగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత విభాగాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 345 ఫిర్యాదులు.. 35 పెండింగ్ ఇప్పటివరకు 8 వారాల పాటు డయల్యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు 345 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 310 ఫిర్యాదులను ఈపీడీసీఎల్ అధికారులు పరిష్కరించారు. ఫోన్లో ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఆ గ్రామానికి రావడంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా లోవోల్టేజీ సమస్యపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు 76 వరకూ లోవోల్టేజీ ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్ పర్యవేక్షిస్తూ.. పరిష్కరిస్తున్నారు. 76 ఫిర్యాదుల్లో 62 పరిష్కరించారు. లోవోల్టేజీని అధిగమించేందుకు... 43 ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు మార్చారు. లోవోల్టేజ్ ఉన్న ప్రాంతంలో 7.5 కి.మీ మేర పాత కండక్టర్లు మార్చడం విశేషం. మిస్డ్ కాల్స్పైనా దృష్టి పెడుతున్నాం.. ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ ఫిర్యాదులు తీసుకుంటున్నాం. ఒక ఫిర్యాదు తీసుకున్న సమయంలో ఏవైనా మిస్డ్ కాల్స్ ఉంటే.. 11.30 గంటల తర్వాత ఆ నంబర్లకు ఫోన్ చేసి.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. ప్రతి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు, కొత్త సర్వీస్ కనెక్షన్ జాప్యం, విద్యుత్ పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి వంటి అంశాలను నేరుగా నా దృష్టికి తీసుకురావొచ్చు. –పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ -
సురక్షిత విశాఖే లక్ష్యంగా పనిచేద్దాం
అల్లిపురం: నగర ప్రజల భద్రతను మెరుగుపరచడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు భాగస్వాములు కావాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కోరారు. పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరానికి చెందిన సుమారు 35 మంది ఇన్ఫ్లూయెన్సర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ, సోషల్ మీడియా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుత్సాహంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ధైర్యం నింపడం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, చిట్ఫండ్ మోసాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించడం, హెల్మెట్ ధారణ ఆవశ్యకత, రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడం, పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన స్పీడ్ లేజర్ గన్స్ పనితీరుపై సమాచారం అందించడం తదితర అంశాలపై వీడియోలు, సందేశాల రూపంలో విస్తృత ప్రచారం కల్పించాలని సీపీ కోరారు. అనంతరం ఇన్ఫ్లూయెన్సర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్ఫ్లూయెన్సర్లకు సీపీ శంఖబ్రత బాగ్చి పిలుపు -
వైభవంగా పండిత సదస్సు
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు నాలుగో రోజైన మంగళవారం వైభవంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళ నిర్వహించిన పండిత సదస్సు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా అప్పన్న ఉత్సవమూర్తి అయిన గోవిందరాజ స్వామిని వేణుగోపాల స్వామి అలంకారంలో ముస్తాబు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామిని కల్యాణ మండప వేదికపై వేంచేపు చేసి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. వేద పండితుల పాండిత్య గోష్టి రాష్ట్రంలోని వివిధ దేవస్థానాల నుంచి వచ్చిన వేద పండితులు తమ పాండిత్యంతో స్వామి వైభవాన్ని కీర్తించారు. చతుర్వేద పారాయణంతో కొలిచారు. అనంతరం దేవస్థానం తరపున ఈవో జె. వెంకటరావు పండితులను ఘనంగా సత్కరించారు. ఈ సదస్సులో తిరుపతి వేదిక్ యూనివర్సిటీకి చెందిన దువ్వూరు ఫణియజ్ఞేశ్వర యాజులుతో పాటు ముష్టి వెంకటేశ్వర ఘనాపాటి, గొల్లపల్లి దత్తాత్రేయ ఘనాపాటి, హనుమజ్ఞుల అమరేశ్వర అవధాని, రతనగంటి కృష్ణమూర్తి, చావలి లక్ష్మీనారాయణ, శివ సుబ్రహ్మణ్య ఘనాపాటి పాల్గొన్నారు. విజయవాడ దేవస్థానం రుగ్వేద పండితులు శ్యావాస మహర్షి ఘనాపాటి, సింహాచలం దేవస్థానం పండితులు సురేష్ ఘనాపాటి, జగన్మోహన్ శర్మ తదితరులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు. అంతకుముందు ఉదయం 7 గంటలకు కల్యాణ మండపంలో వైదిక సదస్సును నిర్వహించారు. స్వర్ణకవచ అలంకారంలో అప్పన్న కల్యాణోత్సవాల సందర్భంగా మంగళవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి స్వర్ణకవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాధారణంగా ప్రతి గురువారం మాత్రమే లభించే ఈ స్వర్ణకవచ దర్శనాన్ని, వార్షిక కల్యాణోత్సవాల్లో పండిత సదస్సు రోజున కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ అద్భుత రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు పర్యవేక్షించారు. -
విశాఖ అభివృద్ధికి పెద్దపీట
మహారాణిపేట: రాష్ట్ర బడ్జెట్ విశేషాలు, రంగాల వారీ కేటాయింపులను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఐఏఎస్ అధికారిని నియమించి, వారి ద్వారా బడ్జెట్పై అవగాహన శిబిరాలు ఏర్పాటు చే యాలని మంత్రి సూచించారు. నియోజకవర్గాల వారీ కేటాయింపులపై ప్రత్యేక పీపీటీలు, బుక్లెట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులు, నిధుల వివరాలను ప్రజలకు చెప్పాలన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్(వీఈఆర్) అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి.. ఇటీవల ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థకు శంకుస్థాపన జరిగిందని, త్వరలోనే గూగుల్ సంస్థకు కూడా శంకుస్థాపన జరుగుతుందని వెల్లడించారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో విశాఖ జిల్లాకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. వీఈఆర్ రీజియన్ కోసం రూపొందించిన 49 ప్రాజెక్టుల్లో 17 ప్రాజెక్టులు విశాఖలోనే రాబోతున్నాయని తెలిపారు. సాస్కి నిధులతో జిల్లాలో మూ డు వర్కింగ్ వుమెన్ హాస్టళ్లను నిర్మిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ తమ అభిప్రాయాలను వెల్లడించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చి, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ కమిషనర్లు కేతన్ గార్గ్, తేజ్ భరత్, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో సంగీత్ మాధుర్, తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా ప్రజల నుంచి వచ్చే వినతులకు సకాలంలో, నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆమె పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా.. ప్రజల నుంచి మొత్తం 294 వినతులు అందాయి. ఇందులో అత్యధికంగా జీవీఎంసీకి సంబంధించి 69, రెవెన్యూ విభాగానికి 50, పోలీస్ శాఖకు 30 వినతులు రాగా, ఇతర అన్ని శాఖలకు కలిపి మరో 145 దరఖాస్తులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్తో పాటు డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులకు బదలాయించారు. -
మూలపేట పోర్టు పనులు వేగవంతం చేయాలి
మహారాణిపేట: శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం చలో మూలపేట’ కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. మద్దిలపాలెం కృష్ణ కాలేజ్ రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కే.కే.రాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా, పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్తో మూలపేటకు తరలివెళ్లాయి. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ తీర ప్రాంత అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పునాదులు వేశారని, భోగాపురం ఎయిర్పోర్టు వంటి ప్రాజెక్టుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతోందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా రూ.4,361.91 కోట్లతో 2023లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారని రాజు గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిని విస్మరించి, ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆరోపించారు. మూలపేట పోర్టు జగనన్న సంకల్పమని, మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. నౌపడ మూడు రోడ్ల జంక్షన్ సమీపంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సమన్వయకర్తలు మళ్ల విజయ ప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శోభా హైమవతి, ముఖ్యనేతలు కట్టమూరి సతీష్, కోలా గురువులు, పేడాడ రమణి కుమారి, కొండా రాజీవ్ గాంధీ, తాడి జగన్నాథ రెడ్డి తదితర భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. చలో మూలపేటతో వైఎస్సార్సీపీ గర్జన -
గ్యాస్ మంట
శ్రీకాంత్నగర్ రోడ్డులో ఇండేన్ గ్యాస్ కోసం మండుటెండలో బారులుదీరిన వినియోగదారులు, ఆదర్శనగర్లో ఎదురుచూపులుఆరిలోవ: నగరంలో వంట గ్యాస్ కోసం సామాన్యుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారుతున్నాయి. గత నెల రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆదర్శనగర్లోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సిలిండర్ల కోసం ఎన్ని రోజులు నిరీక్షించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు ఏజెన్సీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎండలో గంటల తరబడి నిరీక్షణ నగరంలోని ఆరిలోవ, ఆదర్శనగర్, రవీంద్రనగర్, విశాలాక్షినగర్ తదితర ప్రాంతాల్లో నెల రోజులుగా గ్యాస్ కొరత వేధిస్తోంది. హెచ్పీ, ఇండేన్, భారత్ గ్యాస్ ఏజెన్సీల్లో బుకింగ్ చేసుకుని 15 రోజులు గడుస్తున్నా డెలివరీ కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన జనం ఖాళీ సిలిండర్లతో నేరుగా ఏజెన్సీల వద్దకు చేరుకుని క్యూ కడుతున్నారు. మండుటెండలో గంటల తరబడి వేచి చూస్తే తప్ప గ్యాస్ లభించని పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ కార్యాలయాల వద్దకు వెళ్తే.. సిబ్బంది బుకింగ్ మెసేజ్లను చూసి, ఒక నిర్దిష్ట తేదీతో కూడిన స్లిప్పులను ఇస్తున్నారు. ఆ తేదీన స్టాక్ పాయింట్ వద్దకు ఖాళీ సిలిండర్లతో వెళ్తేనే గ్యాస్ ఇస్తామని చెబుతుండటంతో వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. గ్యాస్ కోసం కొందరు తమ ఉద్యోగాలకు సైతం సెలవు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. సిబ్బందితో వాగ్వాదం : సోమవారం ఆదర్శనగర్లోని హెచ్పీ, ఇండేన్ ఏజెన్సీల వద్ద పరిస్థితి గందరగోళంగా మారింది. బుక్ చేసి పక్షం రోజులు దాటినా సిలిండర్లు ఎందుకు పంపడం లేదని వినియోగదారులు సిబ్బందిని నిలదీశారు. వాగ్వాదం పెరగడంతో విషయం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు అక్కడికి చేరుకుని వినియోగదారులకు సర్దిచెప్పడంతో శాంతించారు. కట్టెల పొయ్యే దిక్కు గ్యాస్ కష్టాలతో వ్యాపారాలు విలవిల జిల్లాలో గత కొద్ది రోజులుగా నెలకొన్న కమర్షియల్ గ్యాస్ కొరత వ్యాపార రంగంపై, ముఖ్యంగా ఆహార పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు నడపడం యజమానులకు పెనుభారంగా మారింది. సిలిండర్లు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో అనేక మంది వ్యాపారులు తమ హోటళ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధునిక కాలంలో గ్యాస్ పొయ్యిలపై వేగంగా వంటలు చేయాల్సిన చోట, గత్యంతరం లేక మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సి వస్తోంది. పొగ సెగలను భరిస్తూ, వంటలు సిద్ధం చేయడం హోటల్ కార్మికులకు కష్టతరంగా మారుతోంది. ఒకవైపు పెరుగుతున్న ఖర్చులు, మరోవైపు గ్యాస్ దొరకని కారణంతో హోటల్ యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ కొరత ఇలాగే కొనసాగితే జిల్లాలో మరిన్ని హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని, తక్షణమే అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి. -
అనంత జ్ఞాన వాహిని ఆంధ్ర విశ్వవిద్యాలయం
మద్దిలపాలెం: ఆంధ్రవిశ్వవిద్యాలయం అనంత జ్ఞాన వాహిని అని, ఈ వర్సిటీ శతాబ్ది ప్రస్థానం ఒక జ్ఞాన ప్రవాహమని పలువురు ఉపకులపతులు కొనియాడారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో వీసీల ప్యానల్ డిస్కషన్(మేధోమథనం) నిర్వహించారు. గడిచిన వందేళ్లలో ఏయూ నుంచి వివిధ విశ్వవిద్యాలయాలకు వీసీలుగా సేవలందించిన వారిని ఒకే వేదికపైకి ఆహ్వానించారు. ‘ఏయూ ఎట్ 100–ఫ్రం లెగసీ టు గ్లోబల్ ఇంపాక్ట్’థీమ్తో ఈ సదస్సును నిర్వహించారు. తొలి ప్యానెల్లో ‘యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబల్ నాలెడ్జ్ ఎకోసిస్టమ్–ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్’అంశంపై జరిగిన చర్చకు ఏయూ మాజీ వీసీ ఆచార్య జీఎస్ఎన్ రాజు మోడరేటర్గా వ్యవహరించారు. ఆచార్య వీఎస్ఆర్కే ప్రసాద్, జీవీఆర్ శ్రీనివాసరావు, ఎస్.రామకృష్ణారావు, జి.నాగేశ్వరరావు, వై.సత్యనారాయణ, వి.కేశవరావు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రెండో ప్యానెల్లో ‘స్టేట్ పబ్లిక్ వర్సిటీస్–కీ చాలెంజెస్ అండ్ ద వే ఫార్వర్డ్’అంశంపై జరిగిన చర్చకు ఆచార్య నాగార్జున వర్సిటీ మాజీ వీసీ ఆచార్య వి.బాలమోహన్దాస్ మోడరేటర్గా వ్యవహరించారు. ఇందులో ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్, సి.వి.రాఘవులు, ఎ.వి.ప్రసాదరావు, ఎస్.వి.సుధాకర్, ఎం.జగన్నాథరావు, కె.ఆర్.రజని, కె.నిరుపమ రాణి, ఆర్.సుదర్శనరావు పాల్గొన్నారు. ఇది ప్రపంచ రికార్డు : ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూలో పనిచేసిన 50 మంది ఆచార్యులు విభిన్న వర్సిటీలకు వీసీలుగా సేవలందించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, ప్రపంచ వేదికపై సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఏయూ మాజీ వీసీ, సెంచూరియన్ వర్సిటీ చాన్సలర్ ఆచార్య జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ సర్ సి.ఆర్.రెడ్డి దార్శనికత, సర్వేపల్లి రాధాకృష్ణన్ మార్గదర్శనంలో ఏయూ విరాజిల్లిందన్నారు. అత్యుత్తమ బోధన, విశిష్ట పరిశోధనలు, నవ్య ఆవిష్కరణలతో పాటు పరిశ్రమల అనుసంధానంతో ఉత్పత్తుల రూపకల్పన జరగాలని సూచించారు. ఆచార్య నాగార్జున వర్సిటీ మాజీ వీసీ ఆచార్య వి.బాలమోహన్ దాస్ మాట్లాడుతూ ఒకే విశ్వవిద్యాలయం నుంచి 50 మంది ఆచార్యులు వీసీలుగా ఎదగడం ప్రపంచ రికార్డు అని అన్నారు. ఏయూ తొలి ముగ్గురు వీసీలు 30 ఏళ్లకు పైగా పరిపాలన చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పూర్వ వీసీలు రచించిన 100 పుస్తకాలను ఏయూకు బహూకరించారు. వివిధ విశ్వవిద్యాలయాలకు వీసీలుగా సేవలందించిన ఆచార్యులు ఆర్.మాధవి, ఎల్.వేణుగోపాలరెడ్డి, బీల సత్యనారాయణ, జె.వి.ప్రభాకరరావు, డి.సూర్యప్రకాశరావు, పి.జార్జి విక్టర్, ఎ.రామారావు, జి.సుబ్రహ్మణ్యం, నిమ్మ వెంకటరావు, జి.జ్ఞానమణి తదితరులను ఈ సందర్భంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. రెక్టార్ ఆచార్య పి.కింగ్, డీన్లు ఆచార్య కె.రమాసుధ, పి.శ్యామల, సాలమన్ బెన్నీ, నాగ హనుమాన్ పాల్గొన్నారు. ప్యానెల్ చర్చల ముఖ్యాంశాలతో కూడిన నివేదికను వర్సిటీకి సమర్పించనున్నారు. -
గ్యాస్ మంట
ఆదర్శనగర్లో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లతో వినియోగదారుల క్యూ బొగ్గుల పొయ్యే దిక్కు నేను ఇండేన్ గ్యాస్ కోసం రెండు వారాల కిందట బుక్ చేశాను. ఇంకా రాలేదు. ఏజెన్సీకి వెళ్తే 30వ తేదీన రమ్మని స్లిప్ ఇచ్చారు. దీంతో ఈ రోజు ఉదయమే ఇక్కడికి వచ్చాను. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో గత కొన్ని రోజులుగా బొగ్గుల పొయ్యిపైనే వంట చేసుకుంటున్నాం. – అప్పన్న, వినియోగదారుడు, ఆరిలోవ -
సర్పంచులకు చెక్
మహారాణిపేట: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగియడానికి ముందే కూటమి ప్రభుత్వం వారి అధికారాలపై ఆంక్షలు విధించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచుల గడువు ముగియనుండగా, నిధుల వినియోగంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఇప్పటివరకు స్వేచ్ఛగా చెక్కులు జారీ చేసిన సర్పంచులు, ఇప్పుడు వాటిని నేరుగా వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. చెక్కుల మంజూరు అధికారాన్ని డివిజన్ లెవల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల (డీఎల్డీవో) చేతుల్లోకి మార్చింది. డీఎల్డీవోల చేతుల్లోకి ఆర్థిక పగ్గాలు : ఇప్పటివరకు గ్రామ అవసరాల కోసం సర్పంచులు స్వేచ్ఛగా చెక్కులు జారీ చేసే అవకాశం ఉండేది. అయితే నిధుల దుర్వినియోగం జరుగుతుందనే అనుమానంతో ప్రభుత్వం ఈ అధికారాలను పరిమితం చేసింది. ఇకపై సర్పంచులు జారీ చేసే ప్రతి చెక్కును డీఎల్డీవో ఆమోదించడం తప్పనిసరి. పంచాయతీ కార్యదర్శులు నేరుగా చెక్కులను ప్రాసెస్ చేయకుండా, డీఎల్డీవోల అనుమతి పొందిన తర్వాతే నిధులు విడుదలయ్యేలా నిబంధనలు మార్చారు. దీంతో క్షేత్రస్థాయిలో సర్పంచుల పాత్ర కేవలం నామమాత్రంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్షసాధింపేనా? : జిల్లాలోని 79 గ్రామ పంచాయతీల్లో అత్యధిక శాతం సర్పంచులు వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఉండడంతో.. వారిని ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పదవీకాలం ముగిసే చివరి నిమిషంలో ఇలాంటి ఆంక్షలు విధించడం సర్పంచులను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి ‘స్పెషల్’ పాలన : జిల్లాలోని పంచాయతీల రూపురేఖలు ఏప్రిల్ 3 నుంచి మారనున్నాయి. భీమిలి మండలం రేఖవానిపాలెం మినహా (దీనికి ఇంకా ఏడాది గడువు ఉంది), మిగిలిన 78 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. ఏప్రిల్ 2వ తేదీ అర్ధరాత్రితో సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో, మరుసటి రోజు నుంచే పగ్గాలు చేపట్టేందుకు 78 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. -
సరదా కోసం వెళ్తే.. ప్రాణం పోయింది
రిజర్వాయర్లో పడి ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం ఆనందపురం: గంభీరం రిజర్వాయర్లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామానికి చెందిన మలిరెడ్డి నితిన్ (20), తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్డీ మూడ వ సంవత్సరం చదువుతున్నాడు. మధురవాడలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్న నితిన్.. ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా తన స్నేహితులతో కలిసి ఆటోలో గంభీరం రిజర్వాయర్ సందర్శనకు వెళ్లాడు. రిజర్వాయర్లో స్నేహితులు ఈతకు దిగగా, నితిన్ ఒడ్డున ఉన్న సిమెంట్ గోడపై కూర్చున్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న నితిన్ను బయటకు తీసి, 108కు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నితిన్ను పరీక్షించి.. అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు మలిరెడ్డి దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. ఎస్ఐ పి.శివ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మధ్యవర్తిత్వ పోటీల్లో ముంబై లా వర్సిటీ విజయం
సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన డీవీ సుబ్బారావు రెండో జాతీయ మధ్యవర్తిత్వ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల నుంచి 23 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో ముంబైకి చెందిన మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ జట్టు ప్రథమ స్థానంలో నిలిచి విజేతగా ఆవిర్భవించగా, ఒడిశా నేషనల్ లా యూనివర్సిటీ జట్టు ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ న్యాయపతి విజయ్, జస్టిస్ చల్లా గుణరంజన్, ప్రొఫెసర్ ఆర్. వెంకటరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చల్లా గుణరంజన్ మాట్లాడుతూ తమ విద్యార్థి దశలో ఇలాంటి ప్రాక్టికల్ పోటీలు లేవని, ప్రస్తుతం లభిస్తున్న ఇటువంటి అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. జస్టిస్ న్యాయపతి విజయ్ మాట్లాడుతూ ఈ తరహా పోటీలు న్యాయ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఆర్. వెంకటరావు మాట్లాడు తూ, ప్రముఖ న్యాయవాది, మాజీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ డీవీ సుబ్బారావు పేరుతో ఈ పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. సూర్యప్రకాశరావు, రిజిస్ట్రార్ డాక్టర్ విశ్వచంద్రనాథ్ మదాసు, ఫ్యాకల్టీ కన్వీనర్ డాక్టర్ సుధా తదితరులు పాల్గొన్నారు. -
అక్షరంతో పోరాటం చేద్దాం
సీతంపేట: ఆదివాసీల భాషలను పరిరక్షించడమే కాకుండా వారి అస్తిత్వం, సాహిత్యంపై విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని జయపూర్ సంస్థానాధీశుడు రాజా విశ్వేశ్వర్ చంద్ర చూడ్ దేవ్ పిలుపునిచ్చారు. ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో జరిగిన ‘కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళింగాంధ్ర చరిత్రకు, సాహిత్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తన పూర్వీకుడు విక్రమ్దేవ్ వర్మ కాలం నుంచే ఈ ప్రాంతంతో తమకు విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమ అధ్యక్షత వహించిన ఆచార్య కేఎస్ చలం మాట్లాడుతూ, కళింగ సీమ చరిత్ర తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వనరుల దోపిడీ వల్ల తూర్పు కనుమల మనుగడకే ముప్పు వాటిల్లుతోందని, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మరిన్ని రచనలు రావాలని ఆకాంక్షించారు. రైటర్స్ అకాడమీ అధ్యక్షులు వి.వి. రమణమూర్తి మాట్లాడుతూ, కార్పొరేట్ శక్తుల దోపిడీపై అక్షరంతో పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మూర్తి, బొబ్బిలి శ్రీధర్, దుప్పల రవికుమార్, పిల్లా తిరుపతిరావు తదితర రచయితలు రాసిన పలు పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు డాక్టర్ మాటూరి శ్రీనివాస్, బండి సత్యనారాయణ, గంటేడ గౌడ్ నాయుడు, అట్టాడ అప్పలనాయుడుతో పాటు పలువురు ప్రముఖ కవులు, రచయితలు పాల్గొన్నారు. కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్లో ప్రముఖుల పిలుపు -
పోర్ట్ రికార్డు
సాక్షి, విశాఖపట్నం: మేజర్ పోర్టులతో పోటీపడుతూ సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 92 ఏళ్ల వీపీఏ సుదీర్ఘ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 90.29 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సరుకు రవాణాను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను.. గతేడాది సాధించిన 82.62 ఎంఎంటీ రికార్డును అధిగమించడమే కాకుండా, నిర్దేశిత గడువు కంటే ముందే (362 రోజుల్లోనే) ఈ ఘనతను సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంపై పోర్ట్ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు హర్షం వ్యక్తం చేశారు. అధికారుల సమర్థవంతమైన నిర్వహణ, ఉద్యోగుల సమిష్టి కషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న 2026–27 ఆర్థిక సంవత్సరంలో 100 ఎంఎంటీ సరుకు రవాణా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి భాగస్వామ్య సంస్థలను అభినందించినట్లు పోర్ట్ కార్యదర్శి శంకర్ బాబు వెల్లడించారు. -
‘తమ్ముళ్ల’ తన్నులాట
తగరపువలస: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం వేళ భీమిలి నియోజకవర్గంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. లక్ష్మీపురం పంచాయతీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు రక్తమోడేలా రాళ్లతో కొట్టుకున్నారు. ఆదివారం మజ్జివలస కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటి నుంచి టీడీపీలో ఉన్న చెందిన కనకల సూరిబాబు వర్గం, గత ఎన్నికల ముందు టీడీపీలో చేరిన గాడు తాతినాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు వర్గం ఒకేసారి విగ్రహం వద్దకు చేరుకున్నాయి. పార్టీ మండల అధ్యక్షుడు సరగడ అప్పారావుతో ముందుగా దండ వేయించాలని తాతినాయుడు వర్గం వేచి ఉండగా, సూరిబాబు వర్గం పూలమాలలు వేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి భౌతిక దాడికి దారితీసింది. సుమారు అరగంట పాటు సాగిన ఈ ఘర్షణలో రాళ్లు రువ్వుకోవడంతో కనకల సూరిబాబుకు తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. అలాగే తాతినాయుడు వర్గానికి చెందిన మొకర శంకరరావుకు పన్ను విరిగిపోయింది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఘర్షణ కనకల సూరిబాబు వర్గం ఎంపీ శ్రీభరత్, మండల మాజీ అధ్యక్షుడు డీఏఎన్ రాజు అనుచరులుగా ఉండగా.. తాతినాయుడు వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరులుగా చలామణి అవుతున్నారు. ఏడాది కిందట పార్టీ మండల అధ్యక్షుడి నియామకం సందర్భంగా పార్టీ నిలువుగా చీలిపోయింది. గత ఐదేళ్లూ పార్టీలో లేని వారు ఇప్పుడు వచ్చి తమను అడ్డుకోవడంపై సూరిబాబు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా, ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ గొడవలను సర్దుబాటు చేయకుండా విద్వేషాలు పెంచి పోషిస్తున్నారని మిగిలిన టీడీపీ నాయకులు వాపోతున్నారు. పార్టీ అధిష్టానం కల్పించుకోకపోతే తమ దారి తాము చూసుకుంటామని సూరిబాబు వర్గం హెచ్చరిస్తోంది. -
మరికొంతకాలం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్ ప్రారంభమైన వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ● ప్రతి మంగళవారం బయలుదేరే విశాఖపట్నం–షాలిమర్(08508) స్పెషల్ రైలును జూన్ 30 వరకు, షాలిమర్–విశాఖపట్నం (08507) స్పెషల్ను జూలై 1వ తేదీ వరకు పొడిగించారు. ● దువ్వాడ మీదుగా ప్రయాణించే సంబల్పూర్–ఈరోడ్(08311) వీక్లీ స్పెషల్ను మే 27వ తేదీ వరకు, ఈరోడ్–సంబల్పూర్ (08312) వీక్లీ స్పెషల్ను మే 29వ తేదీ వరకు పొడిగించారు. ● దువ్వాడ మీదుగా ప్రయాణించే భువనేశ్వర్–యశ్వంత్పూర్(02811) వీక్లీ ఏసీ స్పెషల్ను జూన్ 27వ తేదీ వరకు, యశ్వంత్పూర్–భువనేశ్వర్ (02812) వీక్లీ ఏసీ స్పెషల్ను జూన్ 29వ తేదీ వరకు పొడిగించారు. ● విజయనగరం మీదుగా ప్రయాణించే యశ్వంత్పూర్–కతిహార్(06571) వీక్లీ ఏసీ స్పెషల్ను జూలై 14వ తేదీ వరకు, కతిహార్–యశ్వంత్పూర్ (06572) వీక్లీ ఏసీ స్పెషల్ను జూలై 17వ తేదీ వరకు పొడిగించారు. ● దువ్వాడ మీదుగా ప్రయాణించే ఎస్ఎంవీ బెంగళూరు–మాల్డా టౌన్(06565) స్పెషల్ రైలును జూలై 12వతేదీ వరకు,మాల్డా టౌన్– ఎస్ఎంవీ బెంగళూరు(06566) స్పెషల్ను జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. -
నూతన కలెక్టర్గా అభిషిక్త్ కిషోర్
ప్రస్తుత కలెక్టర్ హరేందిర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ మహారాణిపేట: జిల్లా కలెక్టర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముత్తంబకు అభిషిక్త్ కిషోర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయనను విశాఖ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ను కాకినాడ జిల్లాకు బదిలీ చేశారు. నూతన కలెక్టర్ కిషోర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. హరేందిర ప్రసాద్ సేవలు 22 నెలల పాటు కలెక్టర్గా హరేందిర ప్రసాద్ విశేష సేవలు అందించారు. 2024 జూలై 23న బాధ్యతలు చేపట్టిన ఆయన, తన పదవీ కాలంలో ఐఎఫ్ఆర్, మిలాన్ వంటి అంతర్జాతీయ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అలాగే నీతి ఆయోగ్ జాతీయ సదస్సు, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వీవీఐపీల పర్యటనలను సమర్థవంతంగా పర్యవేక్షించారు. సుమారు మూడు రోజుల పాటు జరిగిన భాగస్వామ్య సదస్సును కూడా ఆయన విజయవంతం చేశారు. అభిషిక్త్ కిషోర్ ప్రస్థానం నూతన కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ నెల్లూరు జిల్లాకు చెందిన వారు. 2015 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన, తన కెరీర్ను వెస్ట్ గోదావరి అసిస్టెంట్ కలెక్టర్గా ప్రారంభించారు. ఆ తర్వాత చింతూరు ఐటీడీఏ పీడీగా, కర్నూలు, రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్గా, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. అలాగే ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్గా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. హరేందిర ప్రసాద్ అభిషిక్త్ కిషోర్ -
డ్రగ్స్ ఫ్రీ విశాఖ లక్ష్యంగా పని చేయాలి
ఏయూక్యాంపస్: మాదక ద్రవ్యాల రహిత విశాఖను నిర్మించడమే లక్ష్యంగా డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బీచ్ రోడ్డులో 5కే రన్ నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ర్యాలీని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్, నేవీ అధికారి సంజీవ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ మాఫియాకు బలైన డీవైఎఫ్ఐ నాయకుడు పెంచలయ్య స్ఫూర్తితో ఈ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతే లక్ష్యంగా సాగుతున్న ఈ మాఫియా వల్ల అనేకమంది తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ముఖ్యంగా యువతులకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే ఇటువంటి సామాజిక రుగ్మతలకు అడ్డుకట్ట వేయగలమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘గంజాయి లేని విశాఖను నిర్మించుకుందాం.. యువతరాన్ని కాపాడుకుందాం’ అన్న నినాదంతో మున్ముందు కూడా పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అజయ్, వెంకటరమణ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు, మహేష్తో పాటు కుసుమాంజలి, కౌశిక్, మౌనిక, నరేష్, సంజయ్, ప్రసాద్, రాజా, శ్రీను తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
గ్యాస్ డెలివరీ బాయ్ అరెస్టు
గాజువాక: చినగంట్యాడలోని మణికంఠ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ ఎన్నశెట్టి అప్పారావును పోలీసులు అరెస్టు చేశారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారుల నుంచి ఆయన ఖాళీ సిలిండర్లను, ఓటీపీలను సేకరించి పరారైన విషయం తెలిసిందే. తమకు సిలిండర్లు ఇవ్వకుండానే డెలివరీ చేసినట్టు మొబైల్ ఫోన్ద్వారా మెసేజ్లు రావడంతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఏజెన్సీ మేనేజర్ ఎదరపల్లి విజయ రామమోహన్రాజు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగు చూసింది. దీనిపై సీఐ పార్థసారధి నేతృత్వంలో ఎస్ఐ జగదీష్, సిబ్బందితో కలిసి విచారించి 24 గంటల్లో అప్పారావును అరెస్టు చేశారు. అప్పారావు వినియోగదారుల వద్ద సేకరించిన ఖాళీ సిలిండర్లు, ఓటీపీల ద్వారా ఏజెన్సీ నుంచి గ్యాస్ నింపిన సిలిండర్లను సేకరించాడు. వాటిని వినియోగదారులకు ఇవ్వకుండా అధిక మొత్తాలకు బ్లాక్ మార్కెట్లో విక్రయించాడు. వినియోగదారుల నుంచి 33 సిలిండర్లను, ఏజెన్సీకి చెందిన తొమ్మిది సిలిండర్లను సేకరించి అక్రమంగా అమ్ముకున్నట్టు సౌత్ ఏసీపీ వై.శ్రీనివాసరావు తెలిపారు. కొంతమంది వినియోగదారుల నుంచి రూ.13,500 వసూలు చేసి ఆ నగదును కూడా సొంతానికి వాడుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
నేడు టిడ్కో గృహప్రవేశాలు
మహారాణిపేట: జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పట్టణ నివాస సముదాయాల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో సోమవారం గృహాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.323 కోట్ల వ్యయంతో నిర్మించిన 3,600 పైగా గృహాలను ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు అప్పగిస్తామని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. కొమ్మాది వద్ద రూ.30.55 కోట్లతో నిర్మించిన 336 ఇళ్లు, మంత్రిపాలెం వద్ద రూ.33.60 కోట్లతో నిర్మించిన 336 ఇళ్లు, తలారివానిపాలెం, దువ్వాడ, పెదగంట్యాడ ప్రాంతాల్లో రూ.253.88 కోట్ల వ్యయంతో నిర్మించిన 2,928 ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని టిడ్కో ఈఈ సుధాకర్ తెలిపారు. -
డీఆర్వోగా విశ్వేశ్వర నాయుడు బాధ్యతల స్వీకరణ
మహారాణిపేట: జిల్లా నూతన రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా ఎం.విశ్వేశ్వర నాయుడు శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇన్చార్జి డీఆర్వోగా వ్యవహరించిన శేష శైలజ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా.. గతేడాది అక్టోబర్ 21న అప్పటి డీఆర్వో భవానీశంకర్, ఆర్డీవో శ్రీలేఖలను ప్రభుత్వం బదిలీ చేసినప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. మధ్యలో గృహ నిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు అధికారి సత్తిబాబు ఇన్చార్జి డీఆర్వోగా పనిచేశారు. ఆయన విజయనగరం జిల్లాకు బదిలీ కావడంతో, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శేష శైలజకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా విశ్వేశ్వర నాయుడు నియామకంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి పూర్తిస్థాయి అధికారి లభించినట్లయింది. -
విజయనగర రాజుల శాసనం.. జాలారి కుటుంబాల రథగమనం
సింహాచలం: సింహగిరి శిఖరాన కొలువై ఉన్న ఆ వరాహ లక్ష్మీనృసింహస్వామివారికి, విశాఖ తీరంలోని జాలర్లకు మధ్య ఉన్న అనుబంధం విడదీయలేనిది. చైత్రశుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగే స్వామివారి వార్షిక కల్యాణోత్సవానికి ముందు, సింహగిరి మాడ వీధుల్లో రథోత్సవం కనుల పండువగా సాగుతుంది. ఈ బృహత్తర వేడుకను విజయవంతంగా నడిపించే బాధ్యతను 63వ సారి జాలారి పెద్ద, రథసారథి కదిరి లక్ష్మణరావు స్వీకరించబోతున్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారికి తాము పుట్టింటి వారమని భావించే జాలర్లందరూ, అప్పన్నను తమ ఆరాధ్యదైవంగా కొలుస్తూ, ఈ రథోత్సవంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సేవ ఈనాటిది కాదు.. తరతరాల నుంచి ఒక పవిత్ర వారసత్వంగా కొనసాగుతోంది. కదిరి లక్ష్మణరావు ముత్తాత సూర్యనారాయణ, తాత నారాయణ, తండ్రి గవరయ్యలు కూడా స్వామివారి రథాన్ని నడిపించిన వారే. వీరి కుటుంబమే రథసారథ్య బాధ్యతలు వహించాలని పూర్వమే విజయనగర సంస్థానాదీశులు శాసనం చేయడం విశేషం. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లక్ష్మణరావు, 1963 నుంచి నేటి వరకు అవిశ్రాంతంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో రథసారథిగా తన సేవలను అందిస్తున్నారు. సముద్ర తీరం నుంచి సింహగిరి వరకూ.. రథోత్సవ తేదీ ఖరారు కాగానే.. సింహాచలం దేవస్థానం నుంచి లక్ష్మణరావుకు అధికారిక ఆహ్వానం అందుతుంది. వెంటనే ఆయన విశాఖ తీర ప్రాంతాలైన భీమునిపట్నం, కోటవీధి, గంగవరం, దిబ్బపాలెం, జాలారి ఎండాడ, మల్కాపురం, కొత్త, పెద జాలారిపేటల జాలర్లకు సమాచారం పంపిస్తారు. అప్పన్న పిలుపు విన్న జాలర్లంతా తమ కుటుంబాలతో సహా సింహగిరికి తరలివస్తారు. రథం కదలికలను నియంత్రించడం, మలుపుల వద్ద చక్రాలకు చెక్క చొప్పలు వేయడం, జాకీని తిప్పడం వంటి కఠినమైన పనులను లక్ష్మణరావు సూచనల మేరకు వారు అత్యంత నైపుణ్యంతో నిర్వహిస్తారు. ఈ సేవ ముగిశాక దేవస్థానం అందించే బియ్యం, ఇతర పదార్థాలను వారు మహాప్రసాదంగా భావించి స్వీకరిస్తారు. తండ్రి అడుగుజాడల్లో తనయ ఈ అరుదైన సంప్రదాయంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. లక్ష్మణరావు తన నలుగురు కుమార్తెలలో చిన్న కుమార్తె అయిన సౌమ్యను కూడా నాలుగేళ్లుగా ఈ సేవలో భాగస్వామిని చేస్తున్నారు. తండ్రి వెంటే ఉంటూ రథోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, జాలారి కుటుంబీకులతో కలిసి ఆమె అందిస్తున్న సహకారం అందరినీ ఆకట్టుకుంటోంది. సంప్రదాయాలను తర్వాతి తరానికి చేరవేయడంలో లక్ష్మణరావు చూపిస్తున్న చొరవ అభినందనీయం. అంతా ఆ స్వామి అనుగ్రహమే ‘63వ సారి అప్పన్న రథసారథిగా సేవ చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం’ అని లక్ష్మణరావు ఎంతో వినమ్రంగా చెబుతారు. రథోత్సవానికి కొద్ది రోజుల ముందే కొండపైకి చేరుకుని, రథం మరమ్మతులు, కదలికలను స్వయంగా పర్యవేక్షించే ఆయన, ఈ బాధ్యతను దైవకార్యంగా భావిస్తారు. విశాఖ నగరవ్యాప్తంగా ఉన్న జాలారి సోదరుల సహకారం లేనిదే ఇది సాధ్యం కాదని, ఆ స్వామి దయ ఉన్నంత కాలం ఈ సేవను కొనసాగిస్తానని ఆయన విశ్వసిస్తున్నారు. -
10లోగా చందనోత్సవం ఏర్పాట్లు పూర్తి
దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశం సింహాచలం: చందనోత్సవం ఏర్పాట్లను ఏప్రిల్ 10వతేదీ నాటికల్లా పూర్తిచేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సింహాచలం దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూలు ఎక్కడెక్కడ నుంచి ప్రారంభమవుతాయో ఆయా ప్రదేశాల్లో ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేశారు. పలు చోట్ల ఇంకా సిమెంట్ వర్క్లు జరుగుతుండటంతో ఎన్ని రోజులపాటు చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనవసరమైన పనులు చేయకుండా, భక్తులకు ఉపయోగపడే పనులు చేయాలని ఆదేశించారు. దక్షిణరాజగోపురం నుంచి అన్నదానభవనం వరకు ఏర్పాటు చేసే ఫుట్ ఓవర్ బ్రిడ్జి విషయంపై ఆరా తీశారు. రూ.1500, రూ.1000,రూ.300 క్యూల వద్ద భక్తులకు తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సింహగిరిపై బస్ కాంప్లెక్స్ వద్ద భక్తుల రద్దీని నియంత్రించేందుకు పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏప్రిల్ 10 నాటికల్లా అన్ని పనులు పూర్తి కావాల్సిందే అని ఆదేశించారు. ఈవో జె.వెంకటరావు, ఈఈలు రమణ, రామకృష్ణ, రాంబాబు, డీఈ హరి పాల్గొన్నారు. -
మూలపేట పోర్టు పనులు సత్వరం పూర్తి చేయాలి
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నమైన మూలపేట పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం శ్రీకాకుళం జిల్లా నౌపడలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ. 4,361.91 కోట్లతో ప్రారంభించిన ఈ పోర్టు పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ఈ సభకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయం నుంచి నాయకులు బయలుదేరతారని ఆయన వెల్లడించారు. -
సూపర్వైజర్లకు సత్కారమా?
కొమ్మాది: ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’కార్యక్రమంలో భాగంగా నిరంతరం శ్రమిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులను సత్కరించడమే స్వచ్ఛ సర్వేక్షణ్ మిషన్ ప్రధాన ఉద్దేశం. అయితే, శనివారం ఎండాడ ఆర్ఆర్ఆర్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో దీనికి విరుద్ధంగా శానిటరీ సూపర్వైజర్లను సత్కరించడంపై కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జీవీఎంసీ అదనపు కమిషనర్లు పి.నల్లనయ్య, ఎస్.ఎస్.వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా స్వచ్ఛ సర్వేక్షణ్పై అవగాహన కల్పించారు. అనంతరం సన్మాన కార్యక్రమం చేపట్టారు. వాస్తవానికి రేయింబవళ్లు కష్టపడుతున్న కార్మికులను సత్కరించాల్సి ఉండగా, ఒక ఉన్నతాధికారి మెప్పు కోసం సూపర్వైజర్లకు ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సత్కారం పొందిన వారిలో విధి నిర్వహణలో అలసత్వం వహించే వారు, సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేసే వారు, తమ వద్ద డబ్బులు వసూలు చేసే వారు ఉన్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. మాకు తెలియకుండానే జరిగింది దీనిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మిని వివరణ కోరగా.. ఈ కార్యక్రమంలో కార్మికులను మాత్రమే సత్కరించాలని తాము ఆదేశించామని తెలిపారు. తమకు తెలియకుండానే సూపర్వైజర్లను వర్కర్ల స్థానంలో కూర్చోబెట్టి సన్మానం చేశారని ఆమె వివరణ ఇచ్చారు. అధికారుల తీరుపై పారిశుధ్య కార్మికుల ఆగ్రహం -
అప్పన్న కల్యాణం చూతము రారండోయ్
నేరరహిత విశాఖే లక్ష్యం సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు, వైదిక వర్గాలు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద జరిగే కొట్నాల ఉత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ధ్వజారోహణం, 6.30 గంటలకు ఉత్సవమూర్తులతో ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు మాడ వీధుల్లో రథోత్సవం, రాత్రి 10.30 గంటలకు ఉత్తర రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన సుందరమైన వేదికపై స్వామివారి వార్షిక కల్యాణాన్ని జరిపిస్తారు. ఈ వేడుకకు సుమారు 15 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు, వారందరికీ అన్నప్రసాదం, పంపిణీకి తలంబ్రాలు, లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం కొండపైన, దిగువన ఎల్ఈడీ స్క్రీన్లు, చలువ పందిళ్లు, తాగునీరు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 15 షటిల్ సర్వీసులతో పాటు నగరం నలుమూలలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భద్రత కోసం 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అప్పన్న మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి, తిరిగి రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. శనివారం ఉదయం రథ కదలికలను అధికారులు శాస్త్రోక్తంగా పరిశీలించి రథోత్సవానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సింహగిరిపై కల్యాణం ప్రాంగణంలో, మాడ వీధిలో, సింహగిరి బస్టాండ్, అన్నప్రసాద భవనం వద్ద, కొండదిగువ బస్టాండ్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. ఫైర్ సేఫ్టీ సిలిండర్లు, అగ్నిమాపక శకటం అందుబాటులో ఉంచారు. దేవస్థానంలో రెగ్యులర్ సీసీ కెమెరాలతో పాటు కల్యాణోత్సవం ప్రాంగణం తదితర ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలపై సానుకూల దృక్పథం అల్లిపురం: నగరంలో నేరాలు లేని వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా హోంగార్డు నుంచి ఉన్నతాధికారుల వరకు సమన్వయంతో పనిచేయాలని సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశించారు.నగర పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన మార్చి క్రైమ్ రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన పెంచాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్, రాత్రి నిఘా పటిష్టం చేయాలని ఆదేశిస్తూ.. విధుల్లో అవినీతికి పాల్పడినా, అధికార దుర్వినియోగం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీసీపీలు మణికంఠ చందోలు, మేరీ ప్రశాంతి, లతా మాధురి పాల్గొన్నారు. మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, నిర్ణీత సమయంలో నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపించి ప్రజలకు భరోసా కల్పించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. శనివారం విశాఖ జెడ్పీ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో మౌలిక వసతులను మరింత విస్తరించాలని సూచించారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని విభాగాల్లో సమస్యలు అధికంగా ఉండి, నిధులు మాత్రం శూన్యంగా ఉన్నాయని అధికారులు సభలో వెల్లడించడం చర్చనీయాంశమైంది. సభ్యులు అడిగిన ప్రతి అభివృద్ధి పనికి ‘నిధుల కొరత’ అనే సమాధానమే వినిపించింది. చివరకు ఆర్అండ్బీ రోడ్ల గుంతలు పూడ్చేందుకు కూడా నిధుల్లేవని అధికారులు పేర్కొన్నారు. గిరిజన ప్రాంత వాసుల సౌకర్యార్థం మహాప్రస్థానం వాహనాల సేవలను విస్తరిస్తామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లు విజయ కృష్ణన్, దినేష్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు. గిరిజనుల నుంచి విద్యుత్ బిల్లుల వసూళ్లు ఆపాలి గిరిజనులకు ఉచిత వి ద్యుత్ సౌకర్యం ఉన్నప్పటికీ బిల్లులు ఇవ్వటం సరికాదని, ఆ ప్రక్రియను సరిదిద్దాల ని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. రోలుగుంట మడలం అర్ల పంచాయతీ పరిధిలోని కొత్తలోసింగి, లోసింగి, పెదగరువు, పీత్రిగెడ్డ, నీళ్లబంద గ్రామాల్లో గిరిజనులకు విద్యుత్ బిల్లులు ఇచ్చారంటూ ఆమె ప్రస్తావించారు. పునఃపరిశీలన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. -
సింహగిరిపై రాములోరి వేడుక
కనులపండువగా కల్యాణోత్సవం సింహాచలం : సింహగిరిపై ఉన్న పురాతన రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కల్యాణ వేడుకను కనులారా తిలకించి భక్తిపారవశ్యంలో మునిగితేలారు. సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో విష్వక్సేనపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను దేవస్థానం స్థానాచార్యులు టీపీ రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు గిరి, కుమార్, అప్పాజి తదితరులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు కల్యాణ అక్షింతలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఏఈవోలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
నేడు ‘ఎర్త్ అవర్’
రాత్రి 8.30కు విద్యుత్ దీపాలు ఆఫ్ చేయండి డాబాగార్డెన్స్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్–2026’ కార్యక్రమంలో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గంట పాటు అనవసరమైన విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆపివేయాలని ఆయన కోరారు. 2007లో ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్–ఇండియా’ ప్రారంభించిన ఈ ఉద్యమం, ప్రస్తుతం 190కి పైగా దేశాల్లో విస్తరించి అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా మారిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది ఎర్త్ అవర్ ఉద్యమం 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషమని కమిషనర్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై అవగాహన, విద్యుత్ ఆదా, జీవ వైవిధ్య పరిరక్షణే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, గృహ సముదాయాల నివాసితులు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. నివాసిత సంక్షేమ సంఘాలు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కదిలి మన భూమిని, భవిష్యత్ తరాలను కాపాడడంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. -
నిద్రలో నిఘా.. ముప్పులో భద్రత
మహారాణిపేట: కోట్లాది రూపాయల మత్స్య వ్యాపారానికి నిలయం, వేలాది కుటుంబాలకు జీవనాధారమైన విశాఖ ఫిషింగ్ హార్బర్లో భద్రత డొల్లగా మారింది. ప్రతిష్టాత్మకమైన ఈ హార్బర్లో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోంది. పోర్ట్ అథారిటీ పర్యవేక్షణ లోపం మత్స్యకారుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. అలంకారప్రాయంగా 60 కెమెరాలు హార్బర్లో నేరాల నియంత్రణ కోసం విశాఖ పోర్టు సుమారు 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే వీటిలో మెజారిటీ కెమెరాలు మరమ్మత్తులకు గురికావడం, మరికొన్నింటికి నెట్వర్క్ కనెక్షన్లు లేకపోవడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో, కీలకమైన హార్బర్లో కెమెరాలు పనిచేయకపో వడంపై మత్స్యకార వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్ నిఘా లేకపోవడంతో హార్బర్ ప్రాంతం మందుబాబులకు, గంజాయి బ్యాచ్లకు ఆవాసంగా మారింది. రాత్రి సమయాల్లో బోట్లపైనే మద్యం సేవిస్తూ ఘర్షణలకు దిగడం నిత్యకృత్యమైంది. అంతేకాకుండా, బోట్లలోని విలువైన సామాగ్రి, వేట కోసం నిల్వ ఉంచుకున్న డీజిల్ దొంగతనానికి గురవుతున్నాయి. సీసీ ఫుటేజీ అందుబాటులో లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ఫిషింగ్ హర్బర్లో అలంకారంగా ఉన్న సీసీ కెమెరాలు -
నేత్రపర్వంగా రాములోరి కల్యాణం
సీతంపేట:సీతంపేటలో రాధాకృష్ణ ఆలయం వద్ద సీతారాముల కల్యాణ మహోత్సవ కమిటీ ప్రతినిధులు సంపంగి శ్రీనివాసరావు, భీమవరపు శ్రీనివాసరావు, ఇప్పిలి అప్పలనాయుడు ఆధ్వర్యంలో రాములోరి కల్యాణం వైభవంగా జరిగింది. సీతారాముల పంచలోహ ఉత్సవమూర్తులకు అర్చకుడు గంగవరపు భాస్కరశర్మ కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. సాయంత్రం సీతారాముల ఉత్సవ మూర్తులను మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు సారె సమర్పించారు. కమిటీ సభ్యులు నమ్మి వెంకట్, గుదే వేణు, వంగలపూడి శ్రీనివాసరావు, సారిపిల్లి సంతోష్, పెద్దాడ హేమంత్, మొండి శ్రీధర్, ఇసరపు రామ్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
స్పీడ్ గన్లతో ఉల్లంఘనులకు చెక్
అల్లిపురం: నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు పోలీస్ కమిషనరేట్ సరికొత్త సాంకేతికతను సిద్ధం చేసింది. ముఖ్యంగా యువత హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, జిగ్–జాగ్ డ్రైవింగ్ , మితిమీరిన వేగంతో ప్రయాణించడం వంటి చర్యలను అరికట్టేందుకు అత్యాధునిక స్పీడ్ గన్లను రంగంలోకి దించుతున్నారు. జీవీఎంసీ సహకారంతో సుమారు రూ.18 లక్షలు విలువచేసే రెండు స్పీడ్ లేజర్ గన్లను శుక్రవారం నగర పోలీస్ కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చికి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రహదారి భద్రతలో భాగంగా ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు, కూల్ రేడియం జాకెట్లు పంపిణీ చేశామని, దీనివల్ల సిబ్బంది సౌకర్యవంతంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న వాహనాల రద్దీ వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని, కొందరు వాహనదారులు నిబంధనలు అతిక్రమించడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఎలక్ట్రానిక్ ఆధారిత ఎన్ఫోర్స్మెంట్ను బలోపేతం చేయాలని నిర్ణయించామన్నారు. ఈ కొత్త స్పీడ్ లేజర్ గన్లు 100 మీటర్ల దూరం నుండే వాహనాల వేగాన్ని, హెల్మెట్ లేని ప్రయాణికులను, ట్రిపుల్ రైడింగ్ , రాంగ్ రూట్ డ్రైవింగ్ను పసిగట్టగలవు. వీటిని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అనుసంధానం చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రియల్ టైమ్లో కాంటాక్ట్ – లెస్ పద్ధతిన చలానాలు విధించడం జరుగుతుందని ఆయన వివరించారు. త్వరలోనే సౌత్ ఏషియన్ ఎల్పీజీ సంస్థ నుంచి మరో 18 లక్షల విలువైన స్పీడ్ గన్ను సీఎస్ఆర్ కింద అందుకోనున్నట్లు సీపీ వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ఈ సాంకేతికత ద్వారా నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నగరంలోని వ్యాపార సముదాయాలు తప్పనిసరిగా సెల్లార్ పార్కింగ్లను క్రమబద్ధీకరించుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. -
జీవీఎంసీ కమిషనర్తో బళ్లారి మేయర్ భేటీ
డాబాగార్డెన్స్: అధ్యయన యాత్రలో భాగంగా బళ్లారి మేయర్ పి.గాదెప్ప, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జె.ఎస్. ఆంజనేయులు శుక్రవారం కమిషనర్ కేతన్ గార్గ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర సుందరీకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. విశాఖలో అమలవుతున్న ‘ఆపరేషన్ లంగ్స్’, 24 గంటల నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి ద్వారా ఆదాయం..వంటి అంశాలను కమిషనర్ వారికి వివరించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ఐవీఆర్ఎస్, టోల్ఫ్రీ నంబర్ల పనితీరును తెలియజేశారు. జీవీఎంసీ కార్యాచరణ ఇతర నగరాలకు ఆదర్శంగా ఉందని మేయర్ గాదెప్ప కొనియాడారు. త్వరలోనే బళ్లారి నుంచి ఒక ప్రత్యేక సాంకేతిక బృందాన్ని అధ్యయనం కోసం విశాఖకు పంపిస్తామని, వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బళ్లారి టౌన్ ప్లానింగ్ అధికారి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా ప్రారంభమైన ఇనార్బిట్మాల్
తాటిచెట్లపాలెం: సాలగ్రామపురంలో దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మాల్గా పేరుగాంచిన ‘ఇనార్బిట్ మాల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోహిత్ గోప్లాని, ప్రాజెక్ట్స్ అండ్ డిజైన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యూసఫ్ సయ్యద్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ హిమాంశు ధడుధాలు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు షేక్ కౌసర్ సాహిల్, యాళ్ల సత్తిబాబు, గాలిదేవర శివగంగ దుర్గా, అడ్డగుదురు ప్రణయ్ల చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం విశేషం. మాల్ ప్రారంభం సందర్భంగా మొదటి 500 మందికి ‘గోల్డెన్ టికెట్’ గిఫ్ట్లు ప్రకటించడంతో ఉదయం నుంచే నగరవాసులు భారీగా తరలివచ్చారు. జనం ఒక్కసారిగా లోపలికి రావడంతో స్వల్ప తోపులాట జరగగా, ఫోర్త్ టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలు అవుట్లెట్లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, నగరంలోని అతిపెద్ద మాల్ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా బారులు తీరారు. -
రామతీర్థానికి అప్పన్న దేవస్థానం పట్టువస్త్రాల సమర్పణ
సింహాచలం: శ్రీరామనవమిని పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థంలో శుక్రవారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను వైదిక, అధికారులు తీసుకెళ్లారు. రామతీర్థంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సింహాచలం దేవస్థానం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు గత 11 ఏళ్ల నుంచి అందిస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా అక్కడికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం ఈవో జె.వెంకటరావు, అర్చకులు, అధికారులు తీసుకెళ్లారు. -
కమనీయం.. సీతారాముల కల్యాణం
తాటిచెట్లపాలెం: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతమ్మధారలోని క్షత్రియ కల్యాణ మండపంలో శుక్రవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు దంపతులు, సుదర్శన రాజు దంపతులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కె.కె. రాజు మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఇక్కడ రామనవమి వేడుకలను అత్యంత కమనీయంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ ఏడాది కూడా భక్తుల కోలాహలం మధ్య వేడుకలు ఘనంగా జరిగాయని పేర్కొన్నారు. కల్యాణ మహోత్సవంలో క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ తిరుపతి రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎన్. శ్రీనివాసరాజు, వీసీజీఎస్ఎన్ రాజు, ఎంఆర్కే రాజు, సీహెచ్ వెంకటపతి రాజు, తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ డిప్యూటీ మేయర్ కె.సతీష్, ముఖ్య నేతలు రొంగలి జగన్నాథం, అనిల్కుమార్ రాజు, అల్లు శంకర్రావు, సతీష్వర్మ, పేడాడ రమణికుమారి, శశికళ, వావిలపల్లి ప్రసాద్, రేయి వెంకట రమణ,భర్కత్ అలీ, శశికళ, అంబటి శైలేష్ పాల్గొన్నారు. -
నిషేధ కాలం వేళ.. పెరగనున్న భయం
ఫిషింగ్ హార్బర్లో కోట్లాది రూపాయల మత్స్య వ్యాపారం జరుగుతున్నా, భద్రత విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల హార్బర్ అసాంఘిక శక్తులకు, దొంగతనాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో బోట్లపై మద్యం సేవించడం, సామగ్రిని దోచుకోవడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. వచ్చే నెల 15 నుంచి వేట నిషేధ కాలం ప్రారంభం కానుంది. ఆ సమయంలో హార్బర్ నిర్మానుషంగా మారుతుంది కాబట్టి బోట్లకు రక్షణ కల్పించడం యజమానులకు పెద్ద సవాలుగా పరిణమించనుంది. ఇప్పటికై నా విశాఖ పోర్ట్ అథారిటీ స్పందించి వెంటనే సీసీ కెమెరాలను మరమ్మతు చేయాలి. అలాగే వేట లేని సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. – వాసుపల్లి జానకీరామ్, అధ్యక్షుడు, ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ (ఇండియా), -
పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనకు భారీ స్పందన
ఎంవీపీకాలనీ: పారిశ్రామిక, ఇంజినీరింగ్ ఉత్పత్తుల అవగాహన వేదికగా గాదిరాజు ప్యాలెస్లో ‘ఇంటర్నేషనల్ ఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఇండోర్ ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్, పీహెచ్డీసీసీఐ, వైజాగ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఆయా సంస్థల ప్రతినిధులు ఏకే బాలాజీ, సుదర్శనస్వామి, నీజ్, ఆర్కే అగర్వాల్ ప్రారంభించారు. ఈ ఎక్స్పోలో సుమారు 70 పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఆటోమేషన్, మెషిన్ టూల్స్, శాసీ్త్రయ, ల్యాబ్ పరికరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 29 వరకు ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. -
చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలన
సింహాచలం: ఏప్రిల్ 20న జరిగే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000, రూ.1500 మార్గాలను పరిశీలించి భక్తులకు తెలిసేవిధంగా సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. ఉచిత దర్శనంలో వచ్చే భక్తులకు రెండు మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో తెలిపారు. క్యూలైన్లలో మంచినీరు, వాష్రూమ్స్, ఎమెర్జన్సీ ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉత్తర రాజగోపురం నుంచి అన్నదానం భవనానికి వెళ్లే మార్గాలను సీపీ పరిశీలించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కొండపై బస్ కాంప్లెక్స్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు రద్దీని క్రమబద్ధీకరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింహగింపై పార్కింగ్ ఏరియా తక్కువగా ఉండటంతో ప్రైవేటు వాహనాలను నియంత్రించాలని సూచించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
వసుధైక కుటుంబానికి నిదర్శనం ఏయూ
మద్దిలపాలెం: ఐక్యత, వైవిధ్యమే మన బలం అని, వసుధైక కుటుంబానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నిదర్శనంగా నిలుస్తోందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ వేదికగా గురువారం నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక విభావరిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏయూకు ఉన్న ప్రతిష్టకు నిదర్శనంగానే విదేశీ విద్యార్థులంతా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని కొనియాడారు. యువతరం శాంతి, సుస్థిరతకు పాటుపడాలని సూచించారు. ఏయూ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో విద్యనందిస్తోందని ప్రశంసించారు. విభిన్న దేశాల సంస్కృతులను పంచుకుంటూ సామరస్య జీవనం సాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. వర్సిటీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఇది ఒకటని తెలిపారు. కొద్ది రోజుల కిందట నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్ మాట్లాడుతూ.. ఏయూలో ప్రస్తుతం 57 దేశాలకు చెందిన 1,150 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు ఆచార్య ఎన్.ఎం.యుగంధర్, ఆచార్య విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విదేశీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. ప్రత్యేక వస్త్రధారణలతో, ఆకట్టుకునే ఆహార్యంతో తమ దేశ సంస్కృతీ సంప్రదాయాలను, నృత్య రీతులను పరిచయం చేస్తూ వారు నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ -
ఏయూలో ఒంటెద్దు పోకడలు
విశాఖ సిటీ: శతాబ్ది ఉత్సవాల వేళ ఆంధ్ర విశ్వవిద్యాలయం విమర్శల పాలవుతోంది. పాలకుల ఏకపక్ష నిర్ణయాలతో వివాదం రాజుకుంటోంది. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ.. పాలక మండలిని విస్మరించి చేస్తున్న ఆలోచనలు అసంతృప్తికి కారణమవుతున్నాయి. పాలకుల వ్యక్తిగత అజెండాలకు వేదికగా ఏయూను మారుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుస వివాదాలు ఏయూను చుట్టుముడుతున్న సమయంలో నిబంధనలు, సంప్రదాయాలను పట్టించుకోకుండా తీసుకున్న నిర్ణయాలు వర్సిటీలో అగ్గి రాజేస్తున్నాయి. తాజాగా ఏయూ పూర్వ విద్యార్థి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తికి డాక్టరేట్ అందించడం పెద్ద చర్చకు దారితీసింది. ఆయనకు డాక్టరేట్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టకపోయినా.. ఇచ్చే విధానంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఇటువంటి నిర్ణయాలను పాలక మండలి సమావేశంలో చర్చించి, సభ్యుల దృష్టికి తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ప్రస్తుత పాలకులు ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై పలువురు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పాలక మండలిని పక్కనపెట్టి నిర్ణయాలు ఏయూలో గత కొంతకాలంగా పాలక మండలి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. యూనివర్సిటీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా మండలి సభ్యుల దృష్టికి వెళ్లాలి. అక్కడ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, వర్సిటీ పాలకులు మాత్రం అధికారం తమ చేతుల్లో ఉందన్న నెపంతో సభ్యులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంపై స్వయంగా మండలి సభ్యుల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వ్యవస్థాగతమైన పద్ధతులను కాదని, వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వర్సిటీలో ఉండాల్సిన ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వివాదాల సుడిగుండంలో విద్యా నిలయం ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయం వరుస వివాదాలతో సతమతమవుతోంది. విద్యార్థులకు సౌకర్యాల లేమి, పాలనలో రాజకీయ జోక్యం వంటి అంశాలపై వరుసగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పాలకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, వివాదాస్పద నిర్ణయాలతో అగ్నికి ఆజ్యం పోస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. శతాబ్ది ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమయంలో, ఇలాంటి ఆరోపణలు రావడం వర్సిటీ పూర్వ విద్యార్థులను, విద్యావేత్తలను కలచివేస్తోంది. ఇప్పటికై నా పాలకులు తమ ఒంటెద్దు పోకడలను మానుకోవాలని, నిర్ణయాల ప్రక్రియలో పారదర్శకతను పాటించాలని సూచిస్తున్నారు. పాలక మండలి సభ్యులను సమన్వయం చేసుకుంటూ, నిబంధనల ప్రకారం ముందుకు సాగాలని హితవు పలుకుతున్నారు. -
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలతో నిఘా
నగరంలో 120 కొత్త కెమెరాలు ప్రారంభం అల్లిపురం: నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిమితుల్లో నేరపూరిత ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి, అక్కడ జెమినీ ఎడిబుల్స్–ఫ్యాట్స్ వారి సహకారంతో 120 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గురువారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో దాతలతో కలిసి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలోని వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఫోర్త్ టౌన్, మహారాణిపేట, కంచరపాలెం, ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరం జరిగిన తర్వాత నేరస్తులు తప్పించుకునేందుకు అవకాశం ఉన్న సుమారు 250 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. అందులో మొదటి దశగా 44 ప్రాంతాల్లో 120 సీసీ కెమెరాలను సీఎస్సార్ నిధులతో ఏర్పాటు చేసినట్లు వెల్లించారు. నూనె బ్రాండ్ ‘ఫ్రీడ మ్’ తయారీదారులైన జెమినీ ఎడిబుల్స్–ఫ్యాట్స్ వారు ఈ కెమెరాల ఏర్పాటుకు సహకరించారని వివరించారు. ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. తాను 2024 జూన్ 1వ తేదీన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరవ్యాప్తంగా మొత్తం 13,485 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సహకరించిన జెమినీ ఎడిబుల్స్ ప్రతినిధులను సీపీ సత్కరించారు. -
దారిపై రక్తపు చారలు
ఎచ్చెర్ల: జాతీయ రహదారి మళ్లీ రక్తం పూసుకుంది. వరుస పెట్టి జరుగుతున్న ఘటనలతో రోడ్డు మళ్లీ మరణ సంకేతాలను పంపించింది. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు కన్నుమూశారు. దైవ దర్శనం కోసం వచ్చి తిరిగి వెళ్తుండగా ఇలా మృత్యు కౌగిలిలో చిక్కుకున్నారు. అరిణాం అక్కివలస గ్రామం సమీపంలో బైక్ లారీని ఢీకొన్న ఘటనలో విశాఖపట్నం చెంగల్రావుపేటకు చెందిన తల్లీ కొడుకులు నాగమణి(55), సీహెచ్ నరేంద్ర కుమార్(32) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జాలరిపేటకు చెందిన తల్లీకొడుకులు అరసవల్లి సూర్యనారాయణ మూర్తి దర్శనం కోసం బైక్పై వచ్చారు. స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా అరిణాం అక్కివలస వద్ద ఆగి ఉన్న లారీని వీరి బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నరేంద్రతో పాటు వెనుక కూర్చున్ని తల్లి కిందకు పడిపోగా.. ఇద్దరూ ఘటనా స్థలంలోనూ ప్రాణాలు వదిలేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను రిమ్స్కు తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొల్లాగొడుతున్నారు
చింతలూరు కొండలనునిరుద్యోగులకు టోపీ నుంచి మైనింగ్ మాఫియా వరకు అక్రమాల ఘనుడుగుంటూరు నుంచి వచ్చి చక్రం తిప్పుతున్న టీడీపీ నేత అక్రమంగా రాత్రి సమయాల్లో గ్రానైట్ బ్లాక్ల తరలింపు మైనింగ్ విజిలెన్స్లో అక్రమాలు బట్టబయలు కొమ్ము కాస్తున్న స్థానిక మైనింగ్ అధికారులు అక్రమ మైనింగ్ జరగలేదంటూ తప్పుడు నివేదికలుచింతలూరులో చంద్రబాబు ప్రభుత్వం రాకతో జిల్లాలో అక్రమాల గ(ఘ)నులు చెలరేగిపోతున్నారు. టీడీపీ నేతలు ఆడింది ఆటగా.. పాడింది పాటగా అధికారులు తాళం వేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. గతంలో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను రూ.100 కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత అజయ్ కొల్లా తాజాగా జిల్లాలో మైనింగ్ డాన్గా అవతారమెత్తాడు. గ్రానైట్ బ్లాక్ల అక్రమ రవాణాతో రూ.కోట్లు కొల్లగొడుతున్నాడు. స్థానిక మైనింగ్ అధికారులు కొమ్ము కాస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అర్ధరాత్రి సమయంలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చింతలూరు నుంచి అక్రమంగా గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చి మరీ వ్యవహారం నడుపుతున్న సదరు టీడీపీ నేత ఆడిందే ఆట... పాడిందే పాటగా వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో ఐటీ కంపెనీ పెట్టి, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేసి అరెస్టయిన చరిత్ర కలిగిన సదరు నేత చంద్రబాబు, లోకేష్లతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు డీపీగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నట్టు విమర్శలున్నాయి. ఇప్పటివరకు అక్రమంగా భారీ గ్రానైట్ బ్లాక్లను అడ్డంగా తరలిస్తూ రూ.10 కోట్ల మేర ఆర్జించినట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ జరుపుతున్నారని, పర్మిట్లు లేకుండానే గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారంటూ దీనిపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తమ తనిఖీల ద్వారా తేల్చారు. అయితే స్థానిక మైనింగ్ అధికారులు మాత్రం అంతా సవ్యంగానే ఉందంటూ అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు నివేదికలు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమిలోని బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేస్తుండడం గమనార్హం. మైనింగ్ పర్మిట్లు లేకుండానే...! వాస్తవానికి ఏదైనా క్వారీ మైనింగ్ జరపాలంటే పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత మేర మైనింగ్ చేస్తున్నది? ఎంత మొత్తం గ్రానైట్ను తరలిస్తున్నారనే విషయాన్ని పేర్కొంటూ రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధికార తెలుగుదేశం పార్టీ నేత పేరుతో ఎటువంటి మైనింగ్ పర్మిట్లు లేకుండానే సుమారు రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్లను తరలించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్లాస్టింగులు చేపడుతూ గ్రామ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా ఈ క్వారీ ఉన్న ప్రాంతానికి డీఆర్డీవో కూడా కూతవేటు దూరంలోనే ఉంది. రక్షణరంగ సంస్థకు సమీపంలో చేపడుతున్న ఈ బ్లాస్టింగులతో ఇబ్బందులు తప్పవనే ఆందోళన కూడా నెలకొంది. అర్ధరాత్రి సమయాల్లో వాహనాల సామర్థ్యానికి మించి మరీ అధిక లోడుతో భారీ గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారు. అయినప్పటికీ అటు పోలీసు, ఇటు రెవెన్యూ, మైనింగ్, రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. భారీ లోడ్లతో ఈ విధంగా మొత్తం రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్లను అక్రమంగా తరలించినట్టు మైనింగ్ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మైనింగ్ విజిలెన్స్ అధికారుల తనిఖీలో -
నామినేషన్ల ప్రక్రియ పూర్తి
విశాఖ లీగల్ : న్యాయవాదుల సంఘం వార్షిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు నాలుగేసి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ పూర్తయిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 28వ తేదీన ప్రకటిస్తారు. ఏప్రిల్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి ఎ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. అభ్యర్థులందరూ ఎన్నికల నియమాలు పాటిస్తూ ప్రచారం కొనసాగించాలని కోరారు. -
బీజేపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరికలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీలో పలువురు బీజేపీ నాయకులు బుధవారం చేరారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తన కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ కలిదిండి బద్రీనాథ్, వార్డు మాజీ అధ్యక్షుడు సోమాదుల సురేష్, యువజన విభాగం నాయకుడు సూరాడ అనుదీప్కు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బద్రీనాథ్ మాట్లాడుతూ.. తన సొంత పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్సార్ టీయూసీ ఉత్తరాంధ్ర జోనల్ ప్రెసిడెంట్గా పనిచేశానని.. పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ సారథ్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
మహారాణిపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సూచించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి బుధవారం కలెక్టరేట్లో జరిగిన రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్.సిహెచ్. శ్రీనివాసరావు గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది ప్రమాదాలు తగ్గినట్టు నివేదికలు సమర్పించారు. స్పీడ్ బ్రేకర్లపై పునఃపరిశీలన జిల్లాలో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల అవసరం, ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలపై జీవీఎంసీ, ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా పునఃపరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరం లేని చోట వాటిని తొలగించాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనల అమల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై పాదచారుల క్రాసింగ్ల వద్ద తప్పనిసరిగా సూచిక బోర్డులు, వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా బ్లింకర్స్ ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు ఆదేశించారు. హనుమంతవాక జంక్షన్ విస్తరణ హనుమంతవాక జంక్షన్ విస్తరణ, అండర్పాస్ నిర్మాణంపై సమీక్షించిన కలెక్టర్ జూ పార్క్ వైపు నుంచి వచ్చే మార్గంలో, అలాగే కై లాసగిరి నుంచి హైవేకు వెళ్లే దిశలో ఫ్రీ లెఫ్ట్లను విస్తరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో సహాయం చేసే వారికి నగదు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. నగరంలో మౌలిక వసతుల మెరుగుదల జీవీఎంసీ పరిధిలో రోడ్డు విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, డివైడర్లు, ఇనుప గ్రిల్స్ ఏర్పాటు పనులను గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎయిర్పోర్టు నుంచి గాజువాక వైపు సర్వీస్ రోడ్డు విస్తరణపై సంబంధిత శాఖలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రోడ్ల మధ్యలో ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. షాపింగ్ కాంప్లెక్సుల్లో సెల్లార్ పార్కింగ్ను ప్రోత్సహించాలని, రోడ్లపై అనియంత్రిత పార్కింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు, జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. విశాఖ వ్యాలీ, పోర్టు రోడ్లలో నైట్ పెట్రోలింగ్ పెంచాలని, భవన వ్యర్థాల పారవేయడాన్ని నియంత్రించాలని చెప్పారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. బైక్ రేసింగ్ల నియంత్రణపై సీపీ సూచనలు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ లేజర్ గన్లు అవసరమని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. రాత్రి వేళల్లో బైక్ రేసింగ్లను అరికట్టడంలో అవి కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల లైసెన్సుల రద్దుకు రవాణా శాఖ మరింత సహకారం అందించాలని కోరారు. సమావేశంలో డీసీపీ మణికంఠ చందోలు, ఆర్టీవో సూర్యప్రకాశ్, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, ఎంవీఐలు బుచ్చిరాజు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ -
ఉక్కు విశ్రాంత ఉద్యోగుల నిరసన గళం
ఉక్కునగరం: మెడికల్ ఇన్సూరెన్స్ పాత పద్ధతిలో అమలు చేయాలంటూ స్టీల్ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగులు బుధవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఏడాది మార్చి మొదటి వారంలో మెడికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం జారీ చేసే సర్క్యులర్ను, నెలాఖరు అవుతున్నా జారీ చేయకపోవడంతో యాజమాన్య వర్గాలను సంప్రదించారు. అయితే, యాజమాన్యం ప్రీమియం చెల్లింపులో రిటైర్డ్ ఉద్యోగులపై భారం పెంచుతున్నట్టు తెలియడంతో యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా చేశారు. ధర్నాలో రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాజమాన్యం వైఖరిని నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్లాంట్ కోసం శ్రమించి, వ్యాధుల బారిన పడ్డ ఉద్యోగుల ఇన్సూరెన్స్పై యాజమాన్యం వైఖరి సమంజనంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.డి.ప్రసాద్, అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాటూరి శ్రీనివాసరావు, డి.ఆదినారాయణ, కె.ఎస్.ఎన్.రావు, మంత్రి రాజశేఖర్, పి.వి.రమణమూర్తి, జె.అయోధ్యరామ్, యు.రామస్వామి, ఎన్.రామారావు, నీరుకొండ రామచంద్రరావు, బొడ్డు పైడిరాజు, బూసి వెంకటరావు, కర్రి దాలినాయుడు, రామ్మోహన్కుమార్, దొమ్మేటి అప్పారావు, ఎన్.బాలభాస్కరరావు, డేవిడ్, మహాలక్ష్మినాయుడు, సన్యాసిరావు, పరంధామయ్య, కాండ్రేగుల శ్రీనివాసనాయుడు తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రం అందజేసేందుకు అంగీకరించకపోవడంతో వినతిపత్రాన్ని గేటు బయట ఉన్న బారికేడ్లకు అతికించి తమ నిరసన తెలియజేశారు. మెడికల్ ఇన్సూరెన్స్ కోసం పోరాటంయాజమాన్యం కొత్త ప్రతిపాదనలు అనంతరం యాజమాన్యంతో జరిపిన చర్చల్లో యాజమాన్యం కొత్త ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికే రిటైర్మెంట్ సభ్యులు 20,924 మందికి చేరుకున్నందున ప్రీమియం చెల్లింపు కంపెనీకి భారంగా ఉందన్నారు. కొత్త ప్రతిపాదన మేరకు 90 ఏళ్లు పైబడిన వారికి పాత పద్ధతిలో ప్రీమియం చెల్లిస్తామని, 80–90 ఏళ్లు మధ్య వారికి యాజమాన్యం 80 శాతం, సభ్యులు మిగిలిన 20 శాతం చెల్లించాలని, 70–80 ఏళ్లు మధ్య వారికి 70–30 శాతం, 60–70 మధ్య వారికి 60–40 శాతం చెల్లించాలని ప్రతిపాదించింది. దీనిని నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. పాత పద్ధతి కొనసాగించాలని, లేనిపక్షంలో జరగనున్న పరిణామాలకు యాజమాన్యం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
ఖజానా ఖాళీ
మహారాణిపేట: ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి) అనగానే ట్రెజరీ(ఖజానా) కార్యాలయాలు బిల్లుల క్లియరెన్స్తో కిటకిటలాడుతుంటాయి. కానీ, ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, నిధుల కొరత కారణంగా ఖజానా కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఆదాయం గణనీయంగా తగ్గి, వ్యయాలు పెరిగిపోవడంతో.. కేవలం ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పింఛన్లు మినహా మిగతా అన్ని రకాల చెల్లింపులను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. సంపద సృష్టికర్త చంద్రబాబు హయాంలో ఇలా జరగడం గమనార్హం. ఆదాయం తగ్గి.. వ్యయాలు భారీగా పెరిగిపోతుండడమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. అర్ధరాత్రుల వరకు పనిచేసే చోట.. స్తబ్ధత సాధారణంగా మార్చి చివరి వారంలో బడ్జెట్ నిధులు మురిగిపోకుండా చూసుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు పెద్ద ఎత్తున బిల్లులు సమర్పిస్తుంటాయి. వీటిని పరిశీలించి సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి ట్రెజరీ సిబ్బంది అర్ధరాత్రి వరకు పనిచేసేవారు. కానీ ప్రస్తుతం అప్లోడ్ చేయడానికి ఫైళ్లు, క్లియర్ చేయడానికి నిధులు లేకపోవడంతో సిబ్బంది సైతం ఖాళీగా కూర్చునే పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్లు, ఇతర శాఖల అధికారుల రాక లేకపోవడంతో ట్రెజరీ ఆఫీసు పూర్తిగా బోసిపోయింది. నిలిచిపోయిన చెల్లింపులు ఇవే.. గత ఫిబ్రవరి నుంచే అన్ని రకాల బిల్లులను నిలిపివేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగే పనులకు సంబంధించిన బిల్లులు మినహా, రాష్ట్ర సర్కార్ పరిధిలోని చెల్లింపులన్నీ ఫ్రీజ్ అయ్యాయి. జిల్లాలోని 32 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కరెంటు, టెలిఫోన్, స్టేషనరీ తదితర రోజువారీ కార్యాలయ నిర్వహణ ఖర్చుల చెల్లింపులు బంద్ అయ్యాయి. దీంతో ఆయా శాఖలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక జీతాలు అందుతున్నప్పటికీ.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రవాణా, కరువు భత్యాలు, ఏళ్ల తరబడి దాచుకున్న జీపీఎఫ్ అడ్వాన్సులు, పదవీ విరమణ పొందిన వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సైతం పెండింగ్లోనే పడ్డాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో పాల్గొన్న కాంట్రాక్టర్ల బిల్లులు మురిగిపోతున్నాయి. మళ్లీ బిల్లు పెడితే చర్యలే! నిధుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఒకసారి రిజెక్ట్ అయిన బిల్లులను అధికారులు పదేపదే ట్రెజరీకి పంపితే, సంబంధిత డ్రా యింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ల్ల(డీడీవో)పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో ఏ శాఖాధికారి కూడా బిల్లులు సమర్పించే సాహసం చేయడం లేదు. -
పర్యాటకుడి దారుణహత్య
● అరకులోయలో గొంతు కోసిన దుండగులు ● పాత పరిచయాలు, రిసార్ట్ సిబ్బందితో గొడవలే కారణమా? అరకులోయ టౌన్/ తెర్లాం (విజయనగరం): ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ మండలం, చినలబుడు పంచాయతీ పరిధిలోని హట్టగుడ సమీపంలోని ‘రూప రిసార్ట్స్’ ప్రధాన రహదారిపై పర్యాటకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఏం జరిగింది?విజయనగరం జిల్లా తెర్లాం మండలం, జన్నివలస గ్రామానికి చెందిన నాగళ్ల సురేష్ (25) రెండేళ్ల కిందట అరకులోని పద్మాపురం వద్ద ఉన్న ఉషోదయ రిసార్ట్స్లో పనిచేసేవాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్లోని లలితా జ్యుయలరీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత వారం తన స్వగ్రామంలో జరిగిన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరైన సురేష్ విజయనగరం వెళ్లివస్తానని ఇంటి వద్ద చెప్పి అరకులోయ వచ్చాడు. ఉషోదయ రిసార్ట్స్లో పనిచేస్తున్న ఓ యువతితో కలిసి అతను రూప రిసార్ట్స్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో లాడ్జిలో పనిచేస్తున్న కొంతమంది యువకులతో సురేష్కు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. గొడవ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసిన సురేష్ను, రిసార్ట్స్ సమీపంలోని రహదారి వద్ద దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పాడేరు డీఎస్పీ అభిషేక్ వివరాలను సేకరించి విచారణ చేపట్టారు. ఈ కేసులో రిసార్ట్స్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. అరకులోయ ఎస్ఐ గోపాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం వెళ్లి వస్తానని చెప్పి... విజయనగరం వెళ్లి వస్తానని చెప్పి మంగళవారం ఉదయం ఇంటి నుంచి మోటార్ సైకిల్పై బయలుదేరి వెళ్లిన వ్యక్తి అదే రోజు రాత్రి సమయంలో అరకులోయలో హత్యకు గురైయ్యాడన్న సమాచారం బుధవారం ఉదయం తెలుసుకున్న అతని భార్య, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. జన్నివలసకు చెందిన నాగళ్ల అప్పలనాయుడు, సూరమ్మలకు ముగ్గురు వివాహితులైన కుమారులు, ఒక అవివాహిత కుమార్తె ఉన్నారు. వారిలో సురేష్ మూడవ కుమారుడు. రెండేళ్ల కిందట సురేష్ అరకులోయ మండలం పద్మాపురంలోని ఉషోదయ రిసార్ట్స్లో పనిచేసేవాడు. హైదరాబాద్లోని లలిత జ్యూయలరీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వెళ్లిపోయాడు. సురేష్కు ఏడాది కిందట అదే గ్రామానికి చెందిన తులసితో వివా హం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆలయ ప్రారంభానికి వచ్చి హత్యకు గురికావడంతో కన్నీరుపెడుతున్నారు. సురేష్ మృతితో జన్నివలస గ్రామంలోని యాదవ వీధిలో విషాదం అలముకుంది. -
డీసీఐ ఎండీగా కెప్టెన్ దివాకర్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, విశాఖపట్నం : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్) ఎండీ, సీఈవోగా కెప్టెన్ దివాకర్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ల బోర్డు, రెమ్యునరేషన్ కమిటీ ఇటీవల సమావేశమై.. ఈ బాధ్యతలను దివాకర్కు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. డీసీఐ కార్పొరేట్ కార్యాలయంలో ఆయన బాధ్యతల్ని బుధవారం స్వీకరించారు. 1987లో డీసీఐలో డ్రెడ్జింగ్ కేడర్లో ఏఐడీసీ–వీ బ్యాచ్ కేడెట్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మాస్టర్ ఆఫ్ డ్రెడ్జర్గా నిలిచారు. ఏడేళ్ల పాటు మాస్టర్గా విధులు నిర్వర్తించారు. అత్యాధునిక డ్రెడ్జర్లకు నాయకత్వం వహిస్తూ అనేక డ్రెడ్జింగ్ ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేశారు. డీసీఐలో ఉన్న ఒడిదొడుకుల్ని సరిచేస్తూ.. సంస్థను అగ్రపథాన నడిపించడమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. డీసీఐ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. -
పెన్షన్ మా హక్కు.. భిక్ష కాదు
మహారాణిపేట: పెన్షనర్ల హక్కులకు విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి 25న అమలులోకి తెచ్చిన పెన్షన్ వాలిడేషన్ చట్టం–2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ చట్టానికి వ్యతిరేకత తెలుపుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్లు బ్లాక్ డే పాటించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. పెన్షనర్ల ప్రయోజనాలను కాలరాసే ఈ చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.కూర్మారావు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలో వెచ్చించిన ఉద్యోగికి పెన్షన్ పొందడం అనేది ఒక గౌరవప్రదమైన హక్కు అని, అది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని అన్నారు. గతంలో డి.ఎస్.నకారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్ఫూర్తిని ఈ చట్టం దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి రాసిన వినతిపత్రాన్ని ఇన్చార్జి డీఆర్వో శేష శైలజకు అందజేశారు. జిల్లా సంఘం అధ్యక్షుడు బి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఆర్.కృష్ణ కుమార్, కోఆర్డినేటర్లు ఎన్.రవికుమార్, ప్రమీల, మోహన కుమారి, ఉమా మోహన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట పీఆర్ విశ్రాంత ఉద్యోగుల నిరసన -
28 నుంచి అప్పన్న వార్షిక కల్యాణోత్సవాలు
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈనెల 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి: ఉత్సవాల కార్యక్రమాలు ● ఈనెల 28న సాయంత్రం 6 గంటల నుంచి విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ఉత్సవాంగీకారం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. ● 29న మధ్యాహ్నం 3 గంటలకు కొట్నాల ఉత్సవం, సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు ధ్వజారోహణం, 6:30 నుంచి 7:30 వరకు ఎదురుసన్నాహోత్సవం, రాత్రి 8.30 నుంచి 9.30 వరకు రథోత్సవం, రాత్రి 10.30 నుంచి వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు మూలవిరాట్ దర్శనం ఉండదు. రాత్రి 8.30 నుంచి 10.30 వరకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. ● 30న సాయంత్రం 5 గంటలకు శేషవాహనంపై స్వామివారి తిరువీధి. ● 31న మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 వరకు పండిత సభ, సాయంత్రం 6 గంటలకు సర్వజన మనోరంజని వాహనంపై తిరువీధి. ● ఏప్రిల్ 1న సాయంత్రం 5 గంటలకు సూర్యప్రభ వాహనంపై తిరువీధి. ● ఏప్రిల్ 2న ఉదయం 6 గంటలకు పూర్ణాహుతి, 7 గంటలకు కొట్నాల ఉత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవం, గంగధార వద్ద చక్రస్నానం. ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు. రాత్రి దొంగలదోపు ఉత్సవం. ● ఏప్రిల్ 3న ఉదయం 8 నుంచి 10.30 వరకు వినోదోత్సవం, 10.30 నుంచి 11.30 వరకు తిరువీధి ఉత్సవం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం. దర్శనాల సమయాల్లో మార్పులు ● ఈనెల 28న సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనం లేదు. ● 29 నుంచి ఏప్రిల్ 2 వరకు (మార్చి 29 మినహా) రాత్రి 7 గంటల తర్వాత దర్శనం ఉండదు. ● ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనం లేదు. సేవలు రద్దు: ఈనెల 28 నుంచి ఏప్రిల్ 4 వరకు సుప్రభాత సేవ, ఆరాధన సేవ టికెట్లు, 28 నుంచి ఏప్రిల్ 13 వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఈనెల 29న కల్యాణోత్సవ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు రాజగోపురం సమీపంలోని కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు. కొండ దిగువ పుష్కరిణి సత్రం వద్ద ఈనెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు పౌరాణిక నాటకాలు, తోలుబొమ్మలాట ప్రదర్శనలు నిర్వహించనున్నారు. -
స్క్రాప్తో శిల్పాలు చెక్కండి
డాబాగార్డెన్స్: స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26లో భాగంగా జీవీఎంసీ ‘వేస్ట్ టు వండర్’పేరిట పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. బుధవారం తన చాంబర్లో అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, కార్యదర్శి బి.వి.రమణలతో కలిసి ఆయన పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. వెల్డింగ్ షాపులు, ఫ్యాబ్రిక్కేషన్ యూనిట్ల ప్రతినిధులు, మెటల్ ఆర్టిస్ట్లు, సృజనాత్మక కళాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. కళాఖండ తయారీలో 80 శాతం ఇనుప స్క్రాప్ లేదా ఆటో వేస్ట్ను ఉపయోగించాలి. శిల్పం 4 నుంచి 8 అడుగుల ఎత్తు ఉండాలి. ప్రతి జోన్లో ప్రథమ బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు అందజేస్తారు. వీటితో పాటు 10 మందికి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. మొత్తం అన్ని జోన్లలో కలిపి రూ.22.50 లక్షల నగదు బహుమతులు గెలుచుకోవచ్చు. ఆసక్తి గల వారు https:// pgi. billdesk. com/ pgidsk/ pgmerc/ gvmc/ GVMCDetails. jsp ద్వారా లేదా పోస్టర్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేరు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 10వ తేదీలోగా కళాఖండాలను అందజేయాలి. మరిన్ని వివరాలకు వార్డు పారిశుధ్య, పర్యావరణ కార్యదర్శులను సంప్రదించవచ్చు. విజేతల కళాఖండాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో వారి పేర్లతోనే ప్రతిష్టిస్తామని కమిషనర్ ప్రకటించారు. -
సీనియర్ సివిల్ జడ్జికి స్వర్ణ పతకం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన 91, 92వ సంయుక్త స్నాతకోత్సవంలో డాక్టర్ సోనీ ద్వారంపూడి ‘పెరి నారాయణ మూర్తి మెమోరియల్ గోల్డ్ మెడల్’అందుకున్నారు. గవర్నర్ డాక్టర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆమె ఈ పతకాన్ని స్వీకరించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ లా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.సీతా మాణిక్యం పర్యవేక్షణలో.. ‘ప్రాథమిక విద్యలో బోధనా మాధ్యమం– ఒక సామాజిక–చట్టపరమైన అధ్యయనం’అనే అంశంపై ఆమె పరిశోధన చేసి, పీహెచ్డీ పట్టాను పొందారు. డాక్టర్ సోనీ ద్వారంపూడి ప్రస్తుతం నగరంలో సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయశాస్త్ర అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు ఆమెను అభినందించారు. -
62 కేసుల్లో 54 మంది నిందితుల అరెస్ట్
విశాఖ సిటీ: నగరంలో నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రతబాగ్చి పేర్కొన్నారు. బుధవారం పోలీస్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఫిబ్రవరి నెలలో నగరంలో 62 చోరీ కేసులు నమోదవగా అన్నింటినీ ఛేదించినట్లు తెలిపారు. ఇందులో 54 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.7,57,500 నగదు, 1.79 కేజీల బంగారం, 6.14 కేజీల వెండి, 9 బైక్లు, 3 ఆటోలు, ఒక వ్యాన్, 303 మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రూ.1,12,01,598 విలువైన సొత్తును రికవరీ చేశామన్నారు. నేర నియంత్రణలో భాగంగా జూలైలో నగరంలో 239 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో రాత్రి, పగలు ప్రత్యేకంగా పెట్రోలింగ్ను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం బాధితులు పొగొట్టుకున్న సొత్తును సీపీ తన చేతుల మీదుగా వారికి అందజేశారు. సమావేశంలో డీసీపీ(కై మ్) లతామాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వంట గ్యాస్ పక్కదారి పడితే ఊరుకోం..
మహారాణిపేట: గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై సివిల్ సప్లయిస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 21 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 6ఎ కేసులు నమోదు చేశారు. జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి ఆదేశాల మేరకు డీఎస్వో వి.భాస్కరరావు ఆధ్వర్యంలో బర్మా క్యాంప్, కప్పరాడ, కంచరపాలెం ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలుచోట్ల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఈ దాడుల్లో వ్యాపారుల నుంచి 21 సిలిండర్లు స్వాధీనం చేసుకుని, సంబంధితులపై కేసులు నమోదు చేసినట్టు డీఎస్వో భాస్కరరావు తెలిపారు. గృహ అవసరాలకు కేటాయించిన గ్యాస్ను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని ఆయన హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగరంలోని హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలపై తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఈ దాడుల్లో ఎఎస్వో శ్రీహరి, చెకింగ్ ఇన్స్పెక్టర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు. హెల్ప్లైన్ నంబర్లు వంట గ్యాస్ దుర్వినియోగంపై ఫిర్యాదుల కోసం ప్రజలు ఈ కింది హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. హెచ్పీసీఎల్(హెచ్పీ) 18002333555 బీపీసీఎల్ (భారత్) 1800224344 ఐవోసీఎల్(ఇండియన్) 18002333555 కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 0891–2590102 -
సాగరతీరంలో సినీతారలు
కొమ్మాది: భీమిలి సాగరతీరంలో బుధవారం సినీ తారలు సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం నగరంలో జరుగుతోంది. ఇందులో భాగంగా భీమిలి బీచ్లోని ఒక రిసార్ట్తో పాటు మంగమారిపేట, తొట్లకొండ సమీపంలోని తీర ప్రాంతాల్లో ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్, నటుడు అజయ్ ఘోష్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్ కోసం కాజల్ వచ్చారనే విషయం తెలుసుకున్న స్థానికులు, అభిమానులు, పర్యాటకులు ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అజయ్ ఘోష్ -
అప్పన్న దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజుపై సస్పెన్షన్ ఎత్తివేత
శ్రీకాళహస్తి దేవస్థానం ఈఈగా శ్రీనివాసరాజు నియామకం సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.జి.శ్రీనివాసరాజుపై ఉన్న సస్పెన్షన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం.హరిజవహర్లాల్ బుధవారం జీవో నెంబరు 459 జారీ చేశారు. గత ఏడాది ఏప్రిల్ 30న చందనోత్సవం రోజు నాసిరకంగా నిర్మించిన గోడ కూలిపోవడంతో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. దానికి బాధ్యులుగా చేస్తూ దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజుతో పాటు దేవస్థానానికి చెందిన ఇన్చార్జి డిప్యూటీ ఈఈ, ఏఈ, ప్రసాద్ పథకం పనులు చేస్తున్న టూరిజంశాఖ ఈఈ, డీఈ, ఏఈలను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటినుంచి సుమారు ఏడాదిపాటు నుంచి విచారణ నడుస్తోంది. సస్పెన్షన్ జరిగి ఏడాది సమీపిస్తుండటంతో శ్రీనివాసరాజు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు శ్రీనివాసరాజుపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. అంతేకాకుడా శ్రీకాళహస్తి దేవస్థానం ఈఈగా శ్రీనివాసరాజును నియమించింది. -
స్నాతకోత్సవం.. ప్రతిభకు పట్టం
వైభవంగా ఏయూ 91, 92వ కాన్వొకేషన్లు విద్య అనేది కొత్త ప్రయాణానికి ఆరంభం: గవర్నర్ అబ్దుల్ నజీర్స్నాతకోత్సవంలో పట్టాలు స్వీకరించి ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు మద్దిలపాలెం: కళ్లలో భవిష్యత్తుపై కోటి ఆశలు.. చేతుల్లో ఎంతో శ్రమించి సాధించిన విద్యా పట్టాలు.. వెరసి ఆ విద్యార్థుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. నిరంతర శ్రమకు దక్కిన పతకాలు, పీహెచ్డీ డిగ్రీలను సగర్వంగా చేతబూని.. తమ విజయానికి బాటలు వేసిన కుటుంబ సభ్యులతో కలిసి కెమెరాలకు చిరునవ్వులు చిందిస్తూ వారు మురిసిపోయారు. శతాబ్ది ఉత్సవాలతో వందేళ్ల వైభవాన్ని చాటుకుంటున్న ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బుధవారం ఎటు చూసినా ఈ పండగ వాతావరణమే కనిపించింది. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా.. విద్యార్థుల ఉత్సాహం, కోలాహలం నడుమ 91, 92వ సంయుక్త స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఏయూ చాన్సలర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వందేళ్ల వైభవానికి, నిరుపమాన ప్రగతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రత్యేక నిదర్శనమని ఆయన కొనియాడారు. శతాబ్దకాలంగా ఏయూ విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికే గర్వకారణమన్నారు. సర్ సి.ఆర్.రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.వి.రామన్, సి.ఆర్.రావు వంటి మహనీయుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. డిగ్రీ సాధన అనేది విద్యా జీవితానికి ముగింపు కాదని, అదొక కొత్త ప్రయాణానికి ఆరంభమని విద్యార్థులకు సూచించారు. క్యాంపస్లో రాజకీయాలకు దూరంగా ఉండి, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సగ్గుర్తి, పతంజలి శాస్త్రిలకు డాక్టరేట్లు ప్రదానం వేడుకల్లో భాగంగా ఏయూ పూర్వ విద్యార్థి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తికి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లావజ్జల పతంజలి శాస్త్రికి గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. జియో, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ప్రొఫెసర్ పి.జగదీశ్వరరావు, ప్రొఫెసర్ సి.ఎన్.వి.సత్యనారాయణ రెడ్డిలకు బెస్ట్ రీసెర్చ్ అవార్డులు అందజేశారు. వివిధ విభాగాల నుంచి మొత్తం 17 మంది రీసెర్చ్ మెడల్స్ అందుకోగా.. 13 మంది రీసెర్చ్ ప్రైజ్లు, ఏడుగురు ఎం.ఫిల్ డిగ్రీలు, 441 మంది పీహెచ్డీ పట్టాలు తీసుకున్నారు. అలాగే 174 మందికి యూజీ పీజీ మెడల్స్, 437 మందికి యూజీ పీజీ ప్రైజులు ప్రదానం చేశారు. విశాఖతో.. ఏయూతో ఆత్మీయ అనుబంధం గౌరవ డాక్టరేట్ స్వీకరించిన అనంతరం బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణ చంద్రరావు సగ్గుర్తి ప్రసంగించారు. తన స్వస్థలమైన విశాఖపట్నంలో ఈ గౌరవం అందుకోవడం గర్వంగా ఉందన్నారు. తన కుటుంబంలో ఎనిమిది మంది ఏయూ నుంచే పట్టభద్రులయ్యారని గుర్తుచేసుకున్నారు. తన మావయ్య ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు 1984–87 మధ్య విశ్వవిద్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వేగంగా ఎదుగుతోందని, రాబోయే రోజుల్లో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల్లో భారత్ 7.5 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామి సంస్థగా నిలుస్తోందని, ఆస్తుల పరంగా అమెరికాలో రెండో స్థానంలో ఉండటంతో పాటు మార్కెట్ విలువ పరంగా కూడా ప్రముఖ స్థానాన్ని సంపాదించిందన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనలో ముందంజ ఆంధ్ర విశ్వవిద్యాలయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సాధనలో గర్వించదగ్గ స్థాయికి చేరుకోవాలని ఏయూ ఉపకులపతి జి.పి.రాజశేఖర్ ఆకాంక్షించారు. రెండో శతాబ్దంలోకి అడుగుపెడుతున్న ఏయూ.. విజ్ఞానం, ఆవిష్కరణలతో పాటు సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వం, చాన్సలర్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, ఏయూ పూర్వ వీసీలు, ఇతర యూనివర్సిటీల వీసీలు, ఏయూ రెక్టార్, రిజిస్ట్రార్, ఆచార్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి ఎక్కడ? ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరించింది. మొత్తం బాధ్యత అంతా విశ్వవిద్యాలయం పైనే వదిలేసి చేతులు దులిపేసుకుంది. దీంతో విశ్వవిద్యాలయం అధికారులు ఎవరికి నచ్చిన రీతిలో వారు జోక్యం చేసుకోవడంతో కార్యక్రమం అంతా అస్తవ్యస్తంగా తయారైంది. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు పేలవంగా సాగింది. పైగా.. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న స్నాతకోత్సవానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డుమ్మా కొట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బీచ్రోడ్డుతో పాటు కన్వెన్షన్ హాల్ చుట్టూ లోకేష్ ఫ్లెక్సీలతో నింపేశారు. కానీ మంత్రి మాత్రం కనిపించలేదు. కేవలం లోకేష్ మాత్రమే కాదు.. నగరంలోని ప్రముఖులు, విద్యావేత్తలు, టీడీపీ ఎమ్మెల్యేలెవ్వరూ ఈ కార్యక్రమానికి రాలేదు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ ప్రసంగంలో దొర్లిన తప్పు.! ఏర్పాట్ల విషయంలోనే కాదు, ఏకంగా చాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ ప్రసంగ ప్రతిని సిద్ధం చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గవర్నర్ డాక్టర్ ఎస్.అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో ప్రస్తుత రెక్టార్ పేరుకు బదులు, మాజీ రెక్టార్ పేరును చదవడంతో అంతా విస్మయానికి గురయ్యారు. వేదికపైనే ప్రస్తుత రెక్టార్ ప్రొఫెసర్ కింగ్ ఉన్నప్పటికీ, గవర్నర్ తన ప్రసంగంలో గతంలో పనిచేసిన కిషోర్ బాబు పేరును ప్రస్తావించడం అధికారుల అలసత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ వేడుకలో ఇటువంటి తప్పిదాలు దొర్లడంపై మేధావి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
ఎలా పనిచేస్తుందంటే?
ఇందులో ఫిజికల్, బయోలాజికల్, కెమికల్ రియాక్టివ్ ఇంటర్ఫేస్లతో కూడిన 25 నుంచి 100 వరకు సక్కర్స్(పీల్చే గొట్టాలు) ఉంటాయి. ఇవి గాలిలోని ధూళి కణాలను, హానికర రసాయన వాయువులను సమర్థవంతంగా పీల్చుకుని గాలిలోంచి తొలగిస్తాయి. గాలి స్వచ్ఛీకరణను క్షణాల వ్యవధిలోనే పూర్తి చేసి బయటకు విడుదల చేస్తుంటాయి. ఇందులో ఉండే మోడ్స్ ప్రకారం ఎంత విస్తీర్ణం మేర గాలి నాణ్యతను పెంచాలనేది సెట్ చేసుకోవచ్చు. ఈ యంత్రం ద్వారా ప్రస్తుతం దాదాపు 200 చదరపు మీటర్ల వరకూ గాలిని స్వచ్ఛీకరించవచ్చు. -
ఓపెన్ హార్ట్ సర్జరీలకు ఆధునిక పరికరాలు
మహారాణిపేట: కేజీహెచ్ గుండె శస్త్రచికిత్స విభాగంలోని కొత్త పరికరాలు చేరాయి. కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో అత్యాధునిక హార్ట్ లంగ్ మెషీన్, హీమోథెర్మ్(టెంపరేచర్ కంట్రోల్ యూనిట్) పరికరాలను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. సుమారు రూ.2కోట్ల విలువైన ఈ పరికరాలను ఐసీఐసీఐ ఫౌండేషన్ తమ సీఎస్సార్ నిధులతో కేజీహెచ్కు విరాళంగా అందించింది. ఈ నూతన పరికరాలతో కేజీహెచ్లో క్లిష్టమైన ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సలను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం కలుగుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.ఎస్.ఎం.సంధ్యాదేవి, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మణీత, తదితరులు పాల్గొన్నారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ నుంచి శివ కుమార్ చిట్టిపోలు, శ్రీవర్ధన్ బొబేపల్లి, పక్కి వెంకట సాయి శంకర్, ఎం. రాజనీకాంత్ రెడ్డి, సురేంద్ర పురోహిత్ తదితరులు హాజరయ్యారు. సమకూర్చిన ఐసీఐసీఐ ఫౌండేషన్ -
● కేఎఫ్‘సీ’ బకెట్
ఆర్కే బీచ్లో సరికొత్త అందం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. బీచ్రోడ్లో నగరంలోని 14వ కేఎఫ్సీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేఎఫ్సీ బకెట్ సైకత శిల్పం సందర్శకులను కట్టిపడేస్తోంది. ప్రముఖ సైకత శిల్పి అకునూరు బాలాజీ వరప్రసాద్ దాదాపు 48 గంటలపాటు శ్రమించి, 7 టన్నులకు పైగా సముద్రపు ఇసుకతో ఈ కళాఖండాన్ని ఆవిష్కరించారు. ఇసుకలోంచి ఉద్భవించినట్లుగా ఉన్న ఈ బకెట్ వద్ద పర్యాటకులు ఉత్సాహంగా ఫొటోలు, రీల్స్ తీసుకుంటూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కేవలం సైకత శిల్పమే కాకుండా.. విశాఖ నేపథ్యానికి తగ్గట్లుగా కొత్త రెస్టారెంట్ను నౌక శైలిలో తీర్చిదిద్దడం మరో ఆకర్షణ. ఆకట్టుకునే వెదురు ముఖద్వారంతో, ఒకేసారి 70 మంది కూర్చుని సముద్రపు అందాలను వీక్షిస్తూ భోజనం చేసేలా ఈ సరికొత్త కేఎఫ్సీ పర్యాటకులకు విందుతో పాటు కనువిందును కూడా పంచుతోంది. – ఏయూ క్యాంపస్ -
దివ్యాంగ క్రీడాకారులకు ఏసీఏ దన్ను
సబ్బవరం: సౌత్ జోన్ డెఫ్ క్రికెట్ చాంపియన్షిప్–2026 గుల్లేపల్లిలోని అవెన్యూ స్పోర్ట్స్ అరేనా క్రికెట్ మైదానంలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. దక్షిణ జోన్ రాష్ట్రాల నుంచి నాలుగు జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) సహకారంతో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పోటీలను నిర్వహిస్తోంది. డ్రీమ్ షెల్టర్ చైర్మన్ రవిశంకర్, ఆర్ఆర్ రిసార్ట్స్ చైర్మన్ రతన్ రాజ్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ సురవరపు రామన్ సుబ్బారావు, సెక్రటరీ యడ్లపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఏసీఏ ఇలాంటి టోర్నీలకు ఎల్లప్పుడూ తమ మద్దతు ఇస్తోందని తెలిపారు. మాజీ భారత దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుడు ఉత్పల్, అడ్వైజర్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఉత్కంఠ పోరులో తెలంగాణదే విజయం తొలి మ్యాచ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన తెలంగాణ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ జట్టు 19.5 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం 125 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన తెలంగాణ జట్టు 19.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో తెలంగాణ బ్యాటర్ టి.హరికృష్ణ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. అట్టహాసంగా ప్రారంభమైన సౌత్ జోన్ టోర్నీ -
తిరుమలనగర్కు వరల్డ్ వాటర్ డైజస్ట్ అవార్డు
కూర్మన్నపాలెం: జీవీఎంసీ 87వ వార్డులోని తిరుమలనగర్కు ప్రతిష్టాత్మక ‘వరల్డ్ వాటర్ డైజస్ట్’అవార్డు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ చేతుల మీదుగా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జల సంరక్షణకు విశేష కృషి చేస్తున్న కాలనీల్లో ఒకటిగా తిరుమలనగర్ను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. కాలనీలో ఇంకుడు గుంతల ఏర్పాటు, తాగునీరు వృథా కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను గుర్తించిన కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు పరమానంద, విశ్వేశ్వరరావు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఏయూ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం 91వ, 92వ సంయుక్త స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ ఇప్పటికే పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పూలతో అలంకరించిన వేదిక, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ప్రాంగణం, శ్రద్ధగా అమర్చిన సీటింగ్.. ఇవి అన్నీ కలిపి విద్యార్థులకు మరపురాని అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పట్టాలు అందుకునే విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం విశేషం. వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరుకానుండటం కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తెస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొననున్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్, ఏయూ పూర్వ విద్యార్థి డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ. ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుండటం విశేషం. అదేవిధంగా సాహిత్య రంగంలో విశిష్ట సేవలందించిన తల్లావజ్ఝల పతంజలి శాస్త్రికి కూడా గౌరవ డాక్టరేట్ అందజేయనున్నారు. ఇద్దరు ఆచార్యులకు బెస్ట్ రీసెర్చ్ అవార్డులు, పీహెచ్డీ విద్యార్థులకు 17 రీసెర్చ్ మెడల్స్, 13 రీసెర్చ్ ప్రైజ్లు అందజేస్తారు. మొత్తం 441 మంది పీహెచ్డీ డిగ్రీలు, 7 మంది ఎం.ఫిల్ డిగ్రీలు అందుకుంటారు. యూజీ, పీజీ స్థాయిలో 174 మెడల్స్, 437 ప్రైజ్లు కూడా విద్యార్థుల ప్రతిభకు గుర్తింపుగా అందించనున్నారు. -
జీవీఎంసీ ఇక 120 వార్డులు
డాబాగార్డెన్స్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ విశాఖపట్నం(జీవీఎంసీ) వార్డుల సంఖ్య ఇకపై 120కి చేరనుంది. జీవీఎంసీగా అవతరించిన తొలినాళ్లలో 72 వార్డులు ఉండగా, గత ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య 98కి చేరింది. తాజాగా జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్యను 120కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో 65ను జారీ చేసింది. పరిపాలన సౌలభ్యం కోసం జీవీఎంసీ ఇప్పటికే జోన్ల సంఖ్యను 8 నుంచి 10కి పెంచిన సంగతి తెలిసిందే. మధురవాడ నుంచి అనకాపల్లి వరకు విస్తరించిన మహా నగరంలో ప్రతి ప్రాంతానికి సమాన ప్రాధాన్యం దక్కేలా ఈ విభజన జరిగింది. కొత్తగా ఏర్పడనున్న 22 వార్డులను కూడా ఈ 10 జోన్ల పరిధిలోనే శాసీ్త్రయంగా సర్దుబాటు చేయనున్నారు. తద్వారా జోనల్ కార్యాలయాల ద్వారా ప్రజలకు మున్సిపల్ సేవలు మరింత వేగంగా అందనున్నాయి. మారనున్న వార్డుల సరిహద్దులు వార్డుల సంఖ్య పెరుగుతుండటంతో నగరంలోని దాదాపు అన్ని డివిజన్ల సరిహద్దులు మారబోతున్నాయి. ముఖ్యంగా అత్యధిక ఓటర్లు, విస్తీర్ణం ఉన్న పెద్ద వార్డులను విభజించి కొత్తవి ఏర్పాటు చేస్తారు. దీని వల్ల ప్రతి కార్పొరేటర్ పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా భౌగోళికంగా సమీపంలో ఉన్న ప్రాంతాలను ఒకే వార్డు కిందకు తెచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు త్వరలోనే వార్డుల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించనున్నారు. జనాభా సాంద్రత, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కొత్త వార్డుల సరిహద్దులను ఖరారు చేస్తారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాతే తుది నోటిఫికేషన్ వెలువడుతుంది. రాబోయే ఎన్నికల నాటికి విశాఖ నగరం 120 వార్డులతో సరికొత్త రాజకీయ స్వరూపాన్ని సంతరించుకోనుంది. జనాభా ప్రాతిపదికన పెంపు గత దశాబ్ద కాలంలో విశాఖ మహానగరం అనూహ్యంగా అభివృద్ధి సాధించింది. భీమిలి, అనకాపల్లి వంటి మున్సిపాలిటీలు జీవీఎంసీలో విలీనం కావడంతో నగర రూపురేఖలు మారిపోయాయి. పారిశ్రామికాభివృద్ధి, వలసల కారణంగా ప్రస్తుతం నగర జనాభా సుమారు 26 లక్షలకు చేరినట్టు అంచనా. ప్రభుత్వ తాజా గెజిట్ నిబంధనల ప్రకారం.. 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో తప్పనిసరిగా 120 వార్డులు ఉండాలి. ఈ నిబంధనల మేరకే విశాఖలో అదనంగా మరో 22 వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. -
సామాన్య భక్తులకే పెద్దపీట
మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామిమహారాణిపేట: సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని, ఆ దిశగా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. టికెట్ల జారీ ప్రక్రియలోనూ, ఇతర ఏర్పాట్లలోనూ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏప్రిల్ 17 నాటికి అన్ని పనులను పూర్తి చేయాలన్నారు. పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం : కలెక్టర్గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వివరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత దర్శనంతో పాటు రూ.300, రూ.1,000, రూ.1,500 టికెట్ల వారికి విడివిడిగా క్యూలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో పూజలు మొదలవుతాయని, 3 గంటలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త తొలి దర్శనం చేసుకుంటారని తెలి పారు. 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తుల రవాణా కోసం 50 ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రత్యేక టికెట్లు కొన్న వారికి మరో 30 మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గందరగోళం లేకుండా టికెట్ల జారీ ఉండాలి దర్శన టికెట్ల జారీలో గందరగోళం లేకుండా చూడాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు. భద్రతా పరంగా విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని, క్రేన్లు, పొక్లెయిన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు(వర్చువల్ విధానంలో), జేసీ విద్యాధరి, ఈవో జె.వెంకటరావు, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, విశాఖ ఆర్డీవో సుధాసాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
413 వాహనాల అప్పగింత
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతలు, క్రైం, ట్రాఫిక్ విభాగాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను వాహన యజమానులకు తిరిగి ఇచ్చే కార్యక్రమం మంగళవారం చేపట్టారు. నగర పోలీస్ కమిషనరేట్ పోలీస్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సంబంధిత యజమానులకు వాహనాలను అప్పగించారు. వివిధ కేసుల్లో, వివిధ సందర్భాలలో సీజ్ చేసిన వాహనాలను వాటి యజమానులు కోర్టుల ద్వారా రిలీజ్ చేసుకోలేకపోతున్నందున అవి పాడైపోతున్నాయన్నారు. ఆ వాహనాలను తిరిగి అందజేయాలని ఉద్దేశంతో ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 5వ సారి చేపట్టిన ఈ కార్యక్రమంలో 413 వాహనాలు అందజేసినట్లు తెలిపారు. మొత్తంగా 5 విడతల్లో 1582 మందికి వాహనాలు అందజేసినట్లు పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి బద్రీనాథ్ !
మల్కాపురం: జీవీఎంసీ 60వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ మాజీ జిల్లా అధ్యక్షుడు కలిదిండి బద్రీనాథ్ మళ్లీ వైఎస్సార్ సీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయన తండ్రి దివంగత కలిదిండి సీతారామరాజు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, షిప్యార్డ్ గుర్తింపు యూనియన్ నాయకుడిగా అందించిన సేవలు జిల్లా వాసులకు సుపరిచితం. తండ్రి అడుగుజాడల్లో వైఎస్సార్ సీపీలోకి వచ్చిన బద్రీనాథ్.. పారిశ్రామిక ప్రాంత పరిధిలో పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ట్రేడ్ యూనియన్ ద్వారా కార్మిక సమస్యలను జిల్లా స్థాయిలో బలంగా వినిపించారు. అయితే, ఇటీవల ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు తన అనుచరులతో కలిసి మళ్లీ వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు బద్రీనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ సూచనలతో పార్టీకి పూర్వ మాదిరిగా తన సేవలను అందిస్తానని స్పష్టం చేశారు. ఏ రోజున పార్టీలో చేరేది మరో రెండు రోజుల్లో వెల్లడిస్తానని బద్రీనాథ్ పేర్కొన్నారు. -
ఇక ఆగాలి!
ఆ గాలి..వాయు కాలుష్య నియంత్రణకు వినూత్న పరికరం గాలి కాలుష్యం ఉన్న చోట అమర్చితే వడపోత ఏక్యూఐ లెవల్స్ను తగ్గిస్తున్న ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ యంత్రం సౌర, పవన శక్తితో నడిచేలా తయారు చేసిన ‘నిటెమ్’సంస్థ జైలు రోడ్డులో అమర్చిన ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ మెషీన్ సాక్షి, విశాఖపట్నం: పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ఊపిరి తీసుకోవడమే ఒక సవాలుగా మారుతోంది. ఇటీవల కాలంలో విశాఖ నగరంలో గాలి కాలుష్యం గణనీయంగా పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. చాలా మంది ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైర్స్ వాడుతూ కొంత ఉపశమనం పొందుతున్నారు. మరి బయటకు వస్తే.. స్వచ్ఛమైన గాలి ఎక్కడ ఉంటుంది? ఈ ప్రశ్నను సవాల్గా తీసుకుని విజయవాడకు చెందిన , ఓ జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సరికొత్త ప్యూరిఫైర్ను తయారు చేశారు. నిషాంత్ ఇన్నోవేటివ్ మాన్యుఫ్యాక్చర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అండ్ టెక్నాలజీ(నిటెమ్) సంస్థ పేరుతో నగర వీధుల్లో గాలిని శుద్ధి చేసే ఈ పరికరం టెస్టింగ్ను విశాఖలో నిర్వహించారు. గాలిలోని విష వాయువులను, కాలుష్య కారకాలను పీల్చేసి స్వచ్ఛమైన గాలిని అందించే ‘ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ మెషీన్’ను నిటెమ్ సంస్థ చైర్మన్ డా.కేఎం లక్ష్మణరావు రూపొందించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మణరావు, మెట్రో నగరాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు. ఇందులో భాగంగా తయారు చేసిందే ఈ యంత్రం. నిటెమ్ రూపొందించిన ఈ పరికరాన్ని భవనాల పైనా, ప్రధాన కూడళ్లలో అమర్చడం ద్వారా 250–300 ఉన్న ఏక్యూఐను వంద లోపునకు తీసుకురావచ్చు. ఈ పరికరం కేవలం గాలిని శుద్ధి చేయడమే కాకుండా, వాతావరణ సమతుల్యతను కాపాడటంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రీన్ టెక్నాలజీతో.. సౌర, పవన శక్తులతో పనిచేసే గ్రీన్ టెక్నాలజీని వినియోగించి పర్యావరణహితంగా ఈ యంత్రాన్ని రూపొందించారు. ఈ ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ మెషీన్ అందులో అమర్చిన బ్యాటరీల ద్వారా పని చేస్తుంది. దీనికి అవసరమైన విద్యుత్ను సోలార్ ప్యానెల్స్, చిన్నపాటి విండ్ టర్బైన్ల ద్వారా ఉత్పత్తి చేసుకోవడం దీని ప్రత్యేకత. రన్వేల నుంచి డ్రైనేజీ వరకు.. వీధుల్లోనూ, పరిశ్రమల్లోనే కాకుండా ఎయిర్పోర్టు రన్వేల దగ్గర నుంచి వీధుల్లో ఉన్న డ్రైనేజీల పక్కన కూడా ఈ యంత్రాన్ని వినియోగించవచ్చు. పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతుంటుంది. ఈ విజిబిలిటీ సమస్యను కూడా ఈ మెషీన్ పరిష్కరిస్తుంది. పరిశ్రమలు, ప్లాస్టిక్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయన వాయువులు, కాలుష్యాన్ని ఇది నియంత్రిస్తుంది. ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో గాలిని శుద్ధి చేసేందుకు ఇది ఎంతగానో ఉపయుక్తమవుతుంది. అంతేకాదు, అగ్ని ప్రమాదాల సమయంలో పొగను పీల్చేయడానికి, డ్రైనేజీ మ్యాన్హోల్స్ నుంచి వెలువడే వివిధ రకాల విషవాయువులను తొలగించేందుకు ఇది దోహదపడుతుంది. విశాఖలో టెస్టింగ్ విజయవంతం ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ యంత్రాన్ని టెస్టింగ్ కోసం నగరానికి తీసుకొచ్చారు. జైలు రోడ్డు సమీపంలో మంగళవారం ఉదయం దీనిని అమర్చారు. 200 చదరపు మీటర్ల విస్తీర్ణం వరకూ గాలిని వడబోసేలా మోడ్ను సెట్ చేశారు. యంత్రం ప్రారంభించే సమయంలో ఆ ప్రాంతంలో ఏక్యూఐ లెవల్స్ 180 వరకూ ఉండగా, ప్రారంభించిన కొద్ది సేపటికే అది 80–90 మధ్యకు తగ్గుముఖం పట్టింది. దీంతో యంత్రం విజయవంతంగా పనిచేసినట్లు ధ్రువీకరించారు. ప్రగతి.. పర్యావరణానికి శాపం కాకూడదు మన పారిశ్రామిక ప్రగతి అడుగులు పర్యావరణానికి శాపం కాకూడదు. అత్యాధునిక సాంకేతికతతో కాలుష్యాన్ని మూలాల్లోనే తుడిచిపెట్టి రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే మా లక్ష్యం. అందుకే ఈ ఎయిర్ పొల్యూషన్ మిటిగేటింగ్ యంత్రాన్ని తయారు చేశాం. దాదాపు రెండేళ్ల పాటు దీనిపై శ్రమించాం. ఈ యంత్రం కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, గాలి కాలుష్యంతో పోరాడుతున్న ప్రతి నగరానికి ఒక రక్షణ కవచంగా మారుతుందని భావిస్తున్నాను. – డా. కేఎం లక్ష్మణరావు, నిటెమ్ సంస్థ చైర్మన్ -
గ్యాస్ సెగ.. బ్లాక్ మార్కెట్ దగా!
ఎంవీపీకాలనీ: నిత్యం పొయ్యి వెలగాలంటే గ్యాస్ సిలిండర్ ఉండాల్సిందే. కానీ, ప్రస్తుతం విశాఖ నగరంలో గ్యాస్ సిలిండర్ పొందడం సామాన్యుడికి గగనమైపోతోంది. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావంతో దిగుమతులు మందగించి కొరత ఏర్పడటాన్ని కొందరు దళారులు ‘కాసుల వర్షం’గా మార్చుకుంటున్నారు. అరకొరగా వస్తున్న స్టాక్ను సామాన్యులకు చేరకుండా పక్కదారి పట్టిస్తూ బ్లాక్ మార్కెట్కు తెరలేపుతున్నారు. ధర రూ. 923.. దందా రూ. 3,000 ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ. 923 ఉండగా, బ్లాక్ మార్కెట్లో అది ఏకంగా రూ. 2,500 నుంచి రూ. 3,000 వరకు పలుకుతోంది. గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ల వద్ద పనిచేసే సిబ్బంది, డెలివరీ బాయ్స్ కొందరు దళారులతో చేతులు కలిపి బుకింగ్ అయిన సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తున్నారు. డెలివరీ సిబ్బంది ఒక సిలిండర్ను రూ. 2,000కు దళారులకు అమ్ముతుండగా, వారు అవసరాన్ని బట్టి హోటళ్లు, రెస్టారెంట్లు, అత్యవసరమున్న వినియోగదారులకు రూ. 3,000 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిమ్మకు నీరెత్తిన విజిలెన్స్ ? బ్లాక్ మార్కెట్ను అరికట్టాల్సిన విజిలెన్స్, సివిల్ సప్లై విభాగాలు ప్రస్తుతం పూర్తిగా నిద్రావస్థలో ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అడపాదడపా దాడులు చేసిన ఈ విభాగాలు, ప్రస్తుతం ఇంత పెద్ద ఎత్తున దందా జరుగుతున్నా కనీసం కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దళారుల కదలికలపై అవగాహన ఉన్నప్పటికీ, అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న ’మర్మం’ ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. పెరగనున్న ఇబ్బందులు కమర్షియల్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో, హోటల్ యజమానులు డొమెస్టిక్ (ఇంటి) సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు దక్కాల్సిన కోటాను గండి కొడుతోంది. అర్హులైన లబ్ధిదారులకు నెలల తరబడి వేచి చూసినా సిలిండర్ దొరకని పరిస్థితి నెలకొంది. నిఘా పెంచాలి జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి, విజిలెన్స్, సివిల్ సప్లయ్ విభాగాలకు కఠిన ఆదేశాలు జారీ చేయాలి. గ్యాస్ గోడౌన్ల వద్ద నిఘా పెంచి, అక్రమ విక్రయాలకు పాల్పడే ఏజెన్సీలు, దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
అప్పన్న సన్నిధిలో బైకర్ చిత్ర బృందం
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం సినీ హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్ దర్శించుకున్నారు. తాము నటించిన బైకర్ సినిమా విజయవంతం కావాలని స్వామికి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్పస్తంభానికి మొక్కుకున్నారు. అంతరాలయంలో వీరి పేరిట అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అందజేశారు. కప్పస్తంభానికి మొక్కుకుంటున్న హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్ -
ఆకట్టుకునేలా ‘యోగాంధ్ర మెమోరియల్’
ఏయూక్యాంపస్: ప్రజల ఆరోగ్యానికి ప్రతీకగా, యోగాకు విశిష్ట గుర్తింపుగా యోగాంధ్ర మెమోరియల్ నిలుస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బీచ్ రోడ్లోని యోగా విలేజ్ వద్ద నూతనంగా నిర్మించిన యోగాంధ్ర మెమోరియల్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ప్రధానమంత్రి సందర్శించిన ఈ ప్రాంతానికి గుర్తుగా, ఆరోగ్య ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఈ యోగా చిహ్నాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా.. జీవీఎంసీ ఆధ్వర్యంలో యోగా విలేజ్ సమీపంలో సుమారు రూ.69.55 లక్షల అంచనా వ్యయంతో ఈ మెమోరియల్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పింక్ శాండ్స్టోన్తో మెమోరియల్ నిర్మాణంతో పాటు ఆకట్టుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మనాభం ప్రాంతానికి చెందిన ఓ యోగా క్రీడాకారిణి ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జీవీఎంసీ ఏడీసీలు రమణ మూర్తి, సత్యవేణి పాల్గొన్నారు. -
గుజరాత్లో తక్కువ ధర.. మన దగ్గర ఎందుకు ఎక్కువ?
మహారాణిపేట: ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం రాష్ట్రంలోని మత్స్యకారులపై తీవ్రంగా ఉందని, డీజిల్ కొరత కారణంగా 10 రోజులుగా వేట సాగక మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖ ఫిషింగ్ హార్బర్లోని గంగమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్య పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు. డీజిల్ సమస్యను పరిష్కరించాలని తాము కలెక్టర్ను కోరినా, ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఎటువంటి సహకారం అందలేదని మండిపడ్డారు. మరికొన్ని రోజుల్లో వేట నిషేధ కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో, సబ్సిడీ డీజిల్ సకాలంలో అందకపోతే మత్స్యకారుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మత్స్య పరిశ్రమను ఇండస్ట్రియల్ సెక్టార్లో చేర్చడం వల్ల లీటర్ డీజిల్పై అదనంగా రూ.24 భారం పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను గుజరాత్ ప్రభుత్వం ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లి పాత ధరలకే డీజిల్ పొందుతోందని, అక్కడ లీటర్ రూ.79కే లభిస్తోందని తెలిపారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మత్స్యకారుల సమస్యలను పట్టించుకోవడంలో చొరవ చూపకపోవడం వల్ల వేలాది బోట్లు హార్బర్కే పరిమితమయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 28 ఎకరాల స్థలాన్ని సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడాన్ని జానకీరామ్ తీవ్రంగా ఖండించారు. స్థానిక మత్స్యకారుల నుంచి ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా హార్బర్లను ప్రైవేటీకరించడం సమంజసం కాదన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం -
కొత్త జోష్
ఆశావహుల్లోఉమ్మడి విశాఖలో కొత్తగా 6–7 అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం సీట్ల సంఖ్య 21 నుంచి 22కు పెరిగే అవకాశం ● పునర్విభజనతో మారనున్న ఉమ్మడి విశాఖ జిల్లా ముఖచిత్రం ● పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం ● ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని సీట్లు ● 2029 సమరానికి ఇప్పుడే మొదలైన లెక్కలుసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రాజకీయ ముఖచిత్రం త్వరలోనే పూర్తిగా మారిపోనుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 15 నియోజకవర్గాల సంఖ్య 21 నుంచి 22కు చేరుకోనుంది. అంటే కొత్తగా 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిణామాలు స్థానిక రాజకీయ ఆశావహుల్లో కొత్త జోష్ నింపుతున్నాయి. ఇప్పటివరకు అవకాశం కోసం ఎదురు చూసిన నాయకులకు ఇది గోల్డెన్ ఛాన్స్గా మారగా, కొత్త తరం నేతలకు రాజకీయ ప్రవేశానికి మార్గం సుగమమవుతోంది. అసెంబ్లీలో ‘అధ్యక్షా’ అంటూ తమ గళాన్ని వినిపించాలన్న కలలు కనే వారికి ఈ పునర్విభజన ప్రక్రియ కొత్త ఆశలు, అవకాశాలు తెరచి పెడుతోంది. ఓట్ల సంఖ్యను బట్టి విభజన పునర్విభజన ప్రక్రియ 2011 జనాభా లెక్కల ఆధారంగా సాగనున్నా.. ప్రధానంగా ఓటర్ల సంఖ్యే కీలక ప్రమాణంగా మారనుంది. ఒక నియోజకవర్గంలో సుమారు 1.6 లక్షల ఓటర్ల పరిమితి ఉండేలా రూపకల్పన జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ తూర్పు, ఉత్తర నియోజకవర్గాలు కూడా ఇదే బాటలో నడవొచ్చు. ఈ నియోజకవర్గాల్లో కూడా 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 3 లక్షలకు దాటే అవకాశం ఉంది. అలాగే నగరంలో కొత్తగా ‘విశాఖ సెంట్రల్’ నియోజకవర్గం ఏర్పడే సూచనలు బలంగా ఉన్నాయి. తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాల నుంచి కొన్ని వార్డులు కలిపి దీనిని రూపొందించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త సమీకరణలు పాయకరావుపేటలో అధిక ఓటర్ల సంఖ్య కారణంగా అది రెండు నియోజకవర్గాలుగా విడిపోయే అవకాశం ఉంది. యలమంచిలి, అనకాపల్లి పరిధిలో కొత్తగా ‘అనకాపల్లి రూరల్’ నియోజకవర్గం కూడా తెరపైకి రావొచ్చు. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మార్పులు తప్పవు. నర్సీపట్నంలోని కొన్ని గ్రామాలు కలిపి... పాడేరు, అరకు నియోజకవర్గాలను పునర్విభజించి.. కొత్తగా ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక గతంలో ఉన్న పరవాడ, చింతపల్లి నియోజకవర్గాలు మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ మ్యాప్ కూడా మారే చాన్స్ అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిమితి మారి.. కొత్తగా ఏర్పడే అసెంబ్లీ సీట్లతో రీడిజైన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం ప్రాంతంలో కొత్త పార్లమెంట్ నియోజకవర్గం కూడా రావచ్చనే చర్చ నడుస్తోంది. మహిళలకు 7 సీట్లు ఖాయం 2029 ఎన్నికల నుంచి అమలుకానున్న 33 శాతం మహిళా రిజర్వేషన్ విశాఖ రాజకీయాల్లో గేమ్చేంజర్గా మారనుంది. ఉమ్మడి విశాఖలో పునర్విభజన తర్వాత ఉండే 21–22 సీట్లలో కనీసం 7 సీట్లు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళా నాయకులకు ఇది ఒక సువర్ణావకాశం. దీంతో అసెంబ్లీలో విశాఖ నుంచి మహిళా వాణి బలంగా వినిపించనుంది. ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రాధాన్యం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాతినిధ్యం పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ఒక ఎస్సీ (పాయకరావుపేట), రెండు ఎస్టీ (అరకు, పాడేరు) స్థానాలకు అదనంగా.. మరో ఎస్సీ, మరో ఎస్టీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ద్వితీయ శ్రేణి నేతల జోరు సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అధ్యక్షా.. అని పిలిపించుకోవాలని తపించే రాజకీయ నేతలకు కేంద్రం నిర్ణయం ఒక వరంగా మారింది. నియోజకవర్గాల హద్దులు మారనుండటంతో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునేందుకు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. -
ఎట్టకేలకు స్పాందించారు
గోపాలపట్నం: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఎలైట్ స్పా సెంటర్ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎన్ఏడీ జంక్షన్ విల్లా కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న ఎలైట్ వెల్నెస్ అండ్ స్పా సెంటర్పై ఆరు నెలల కిందట టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి విటులను, మహిళలను పట్టుకున్నారు. ఆ తర్వాత దీన్ని సీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ, అధికారుల మధ్య సమన్వయ లోపంతో నిర్లక్ష్యంగా వదిలేశారు. అయితే, రెండు నెలల తర్వాత మారు తాళాలతో తిరిగి స్పాను తెరిచి వ్యాపారం చేస్తుండటాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. మరమ్మతులు చేసేందుకే తాళాలు తీశామంటూ నిర్వాహకులు వారిని నమ్మబలికారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. సాక్షిలో ‘స్పా..ందించండి’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం ఆ స్పా సెంటర్ను సీజ్ చేశారు. ఎస్ఐ ప్రసాద్, ఆర్.కోమలి, తదితరులు పాల్గొన్నారు. అలాగే జ్యోతినగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ఇంటిని కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గతేడాది డిసెంబర్లో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. తాజాగా స్పందించిన అధికారులు ఆ ఇంటికి కూడా మంగళవారం సీల్ వేశారు.ఎలైట్ స్పా సెంటర్ సీజ్ -
తలనీలాల ద్వారా రూ.15.55 కోట్ల ఆదాయం
సింహగిరిపై తలనీలాల వేలం నిర్వహణ సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి తలనీలాల వేలం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. 2026–27 సంవత్సరానికి గాను రూ.15 కోట్లు 55 లక్షల 50 వేలు వచ్చింది. దేవస్థానంలో ఏడాది కాలపరిమితికి గాను తలనీలాల ద్వారా ఇంతపెద్ద మొత్తంలో రావడం ఇదే ప్రథమం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు రెండేళ్ల కాలపరిమితికి తలనీలాలను సేకరించే హక్కులను కేటాయించేందుకు మంగళవారం దేవస్థానం ఈవో జె.వెంకటరావు ఆధ్వర్యంలో బహిరంగ వేలం, సీల్డ్ టెండర్ ప్రక్రియ నిర్వహించారు. తమిళనాడుకు చెందిన ‘దురై ఎంటర్ప్రైజెస్’ సంస్థ షీల్డ్ టెండర్ ద్వారా ఈ హక్కును దక్కించుకుంది. ఈ ఒప్పందం 2026 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు (రెండేళ్ల పాటు) అమల్లో ఉంటుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో తలనీలాల ఆదాయం రూ.10.13 కోట్లుగా ఉండగా, ఈసారి అది దాదాపు 50 శాతం పైగా పెరగడం విశేషం. కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో రాధ, ఏఈవోలు రమణమూర్తి, రమేష్బాబు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
నెలాఖరుకు ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి
మహారాణిపేట: ఈ నెలాఖరుకు జిల్లాలోని ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి జన గణన–2027 ప్రక్రియ మొదలవుతుందని, ఈ లోగా ఓటర్ల జాబితాలకు సంబంధించిన పనులను పూర్తి చేసుకోవాలని చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు కింది స్థాయి అధికారులతో, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకొని ప్రక్రయను వేగవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో లంచావతారం
సీతంపేట: అతనో ప్రభుత్వ సేవకుడు.. ప్రజలకు అండగా ఉండాల్సిన స్థానంలో ఉన్నాడు. కానీ కళ్లు మూసుకుపోయి కక్కుర్తితో ’చేయి’ చాచాడు. ఐదు సచివాలయాలు కొలువై ఉన్న ఆ ప్రాంగణంలో, వందలాది మంది కళ్లెదుటే ఏమాత్రం భయం లేకుండా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతడే జీవీఎంసీ 26వ వార్డు పరిధి అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జి సమీపంలోని లలితానగర్ సచివాలయం (125) వార్డు ఎడ్యుకేషన్ కమ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్. అసలేం జరిగిందంటే? లలితానగర్కు చెందిన ద్వారాపురెడ్డి గంగరాజ్యం తన కుమారుడు గణేష్ పేరుపై ఉన్న స్థిరాస్తిని సెటిల్మెంట్ డీడ్ రూపంలో నమోదు చేయించేందుకు లలితానగర్ (125) సచివాలయంలో సంప్రదించింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్ మొదట రూ.90 వేల లంచం డిమాండ్ చేయగా, చివరికి రూ.80 వేల వద్ద ఒప్పందం కుదిరింది. అయితే లంచం ఇవ్వడానికి ఇష్టపడని గణేష్ నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి మార్గదర్శకత్వంలో ప్రణాళిక రచించి.. సోమవారం మధ్యాహ్నం కార్యాలయంలోనే రాజేష్కు నగదు అందజేసే సమయంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ‘దర్జాగా’ టేబుల్పై డబ్బులు ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. రాజేష్ ఎలాంటి భయం లేకుండా తీసుకున్న లంచాన్ని టేబుల్పై బహిరంగంగా ఉంచి, దానిపై బ్యాగ్ పెట్టడం. అక్కడే ఐదు సచివాలయాలు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, ప్రజలు ఉండగా కూడా ఇలా నిర్లక్ష్యంగా లంచం తీసుకోవడం చూసి ఏసీబీ అధికారులు సైతం విస్తుపోయారు. ప్రజల్లో ఆగ్రహం ఇంత బహిరంగంగా అవినీతి జరుగుతుండటం ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ‘‘ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు, వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం’’ అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి చర్యలు పట్టుబడిన పైలా రాజేష్ను ఆరిలోవ పోలీస్ స్టేషన్కు తరలించి, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, హర్షిత, సీఐలు శ్రీనివాస్, వెంకటరావు పాల్గొన్నారు. అవినీతిపై ఫిర్యాదు ఇలా? ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. -
మరణంలోనూ నలుగురికి పునర్జన్మ
బీచ్రోడ్డు : పెను విషాదంలోనూ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగి ధర్మాల మాధవరావు (57) అవయవాలను దానం చేసి, ఆయన కుటుంబ సభ్యులు స్ఫూర్తిగా నిలిచారు. ఈనెల 20న గాజువాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాధవరావు తలకు తీవ్ర గాయమైంది. నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జీవన్ దాన్ ప్రతినిధుల అవగాహనతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో ఆయన శరీరం నుంచి లివర్, కిడ్నీ, రెండు కళ్లను సేకరించి, ప్రోటోకాల్ ప్రకారం సీనియారిటీ లిస్టులో ఉన్న బాధితులకు కేటాయించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అవయవ దాతలకు గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలన్న ప్రభుత్వ జీవో ప్రకారం.. మాధవరావు పార్థివ దేహానికి పోలీస్ బ్యాండ్తో ఘనంగా నివాళులర్పించారు. సీపీ శంఖబ్రత బాగ్చి, జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె. రాంబాబు స్వయంగా విచ్చేసి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చిన మాధవరావు కుటుంబాన్ని అభినందించారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని, దాతలకు ప్రభుత్వ గౌరవం దక్కడం శుభపరిణామమని పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన మాధవరావు అవయవాల దానం -
వడదెబ్బ నివారణకు చర్యలు వేగవంతం
మహారాణిపేట: జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వడదెబ్బపై అవగాహన పోస్టర్ను ఆవిష్కరించి సమీక్ష నిర్వహించారు. ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి, చల్లని తాగునీటి సదుపాయాలు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్, మందులు సిద్ధంగా ఉంచాలని, కార్మికులకు మధ్యాహ్న విశ్రాంతి కల్పించాలని తెలిపారు. ప్రజలు ఎండలో తిరగడం తగ్గించి తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. -
న్యాయవాదుల సంఘం ఎన్నికల సందడి
మొదలైన నామినేషన్ల పర్వంవిశాఖ లీగల్ : నగర న్యాయవాదుల సంఘం ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఎన్నికల అధికారి ఏ. ప్రభాకర్ రెడ్డికి పలువురు అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లను దాఖ లు చేశారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది శిష్ష్లా శ్రీనివాసమూర్తి (వాసు) అధ్యక్ష పదవికి తొలి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా తాను పోటీ చేస్తున్నానని, తోటి న్యాయవాదులందరూ సహకరించాలని కోరారు. శ్రీనివాసమూర్తితో పాటు కార్యదర్శి పదవికి ఒమ్మి వెంకట సుధాకర్, మహిళా ప్రతినిధిగా పీలా మహాలక్ష్మి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కోర్టు ఆవరణలో ఎన్నికల సందడి నెలకొంది. -
కొంతకాలం ఓపిక పట్టండి..
ఉక్కునగరం: కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వచ్చారు.. స్టీల్ప్లాంట్ను చూశారు.. సమస్యలు విన్నారు.. అన్నింటికీ ఓపిక పట్టాలని చెప్పి వెళ్లిపోయారు. ఇదీ సోమవారం కేంద్ర మంత్రుల పర్యటన స్థూల సారాంశం. నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ శంకుస్థాపనకు వచ్చిన మంత్రులు శనివారం రాత్రి స్టీల్ప్లాంట్లో బస చేశారు. ఉన్నత యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. వారి పర్యటనతో తమ పెండింగ్ జీతాలు, ప్రతీ నెలా పూర్తి జీతం, ఆర్థిక ప్రయోజనాల పునరుద్ధరణ జరుగుతుందని ఉద్యోగులు ఆశపడ్డారు. అయితే వారు ఎటువంటి హామీ ఇవ్వకుండా కొంత కాలం ఓపిక పట్టండి అంటూ చెప్పి ఉద్యోగులను నిరాశలో ముంచెత్తారు. కార్మిక సంఘాల నాయకులతో సమావేశం పర్యటనలో భాగంగా మధ్యాహ్నం మంత్రులు కార్మిక సంఘాలు, ఉక్కు అధికారుల సంఘం (సీ), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రతీ నెలా పూర్తి జీతాలు చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికుల ఆధార్ బ్లాక్ తొలగించాలని, ప్లాంట్ పూర్తి స్థాయిలో నడపడానికి ఆరవ బ్యాటరీ నిర్మించాలని, సింటర్ ప్లాంట్ సామర్థ్యం పెంచాలని, మరో రోలింగ్ మిల్ నిర్మించాలని నాయకులు కోరారు. దీనిపై కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ గత ఏడాదిలో ఉక్కు ఉద్యోగులు చేసిన కృషి అభినందనీయమని, ఊహించిన దాని కన్నా అధికంగా ఉత్పత్తి సామర్థ్యం చూపారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో రెండో ప్యాకేజీ ఇచ్చే అంశం ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలో ఉందన్నారు. కొద్దికాలం ఓపిక పడితే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సమావేశంలో అఖిపక్ష నాయకులు జె.అయోధ్యరామ్, పి.వి.రమణమూర్తి, కె.ఎస్.ఎన్.రావు, యు.రామస్వామి, కొమ్ము ప్రసాద్, డొక్క నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అసోసియేషన్లతో సమావేశం స్టీల్ప్లాంట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అసోసియేషన్ల నాయకులతో జరిగిన సమావేశంలో నాయకులు దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ సమస్యలను వివరించారు. పదోన్నతుల సమస్య పరిష్కరించాలని, కాంట్రాక్ట్ పనుల నుంచి తొలగించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బయ్యే మల్లయ్య, ఓబీసీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వినతి మెడికల్ ఇన్సూరెన్స్ ఉత్తర్వుల జారీ జాప్యం గురించి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వివరించారు. నెలాఖరవుతున్నా విడుల చేయకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఆరోగ్య ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారని అసోసియేషన అధ్యక్షుడు మాటూరి శ్రీనివాసరావు తెలిపారు. -
జగన్ దార్శనికతకు ఇనార్బిట్ మాల్ సాక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతకు ’ఇనార్బిట్ మాల్’ ఒక సజీవ సాక్ష్యమని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు కొనియాడారు. సోమవారం సాలగ్రామపురంలో జరిగిన మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న కృషిని, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. జగనన్న తెచ్చిన ’గేమ్ ఛేంజర్’ నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదల, ముందుచూపు వల్లే ఈరోజు విశాఖలో ఇంతటి భారీ మాల్ సాకారమైందని కేకేరాజు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా పెట్టుబడిదారులకు ఆయన కల్పించిన భరోసా వల్లే రహేజా గ్రూప్ వంటి దిగ్గజాలు ముందుకు వచ్చాయన్నారు. 2023 ఆగస్టు 1న గత ప్రభుత్వ హయాంలో సుమారు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.600 కోట్ల భారీ వ్యయంతో ఈ మాల్కు పునాది పడిందని గుర్తు చేశారు. ఈ మాల్ ద్వారా ప్రత్యక్షంగా సుమారు మూడు వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఇది విశాఖ ఆర్థిక వ్యవస్థకే ఒక ’గేమ్ ఛేంజర్’ అని అభివర్ణించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఐటీ టవర్, భారీ ఉపాధి మాల్ ప్రాంగణంలోనే సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ కూడా రానుందని, ఇది విశాఖను ఐటీ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ మాల్ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడం వైఎస్ జగన్మోహన్రెడ్డి కల అని చెప్పారు. రూ.600 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో మొదలైన ఈ ప్రాజెక్ట్, రెండో విడతతో మరో రూ.300 కోట్లతో కలిపి విశాఖ ఆర్థిక రంగానికి పెద్ద ఊతాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. క్రెడిట్ కోసం పాకులాట వద్దు మొక్క నాటిన వారు ఒకరైతే.. కాయలు కోసి క్రెడిట్ కొట్టాలని చంద్రబాబు నాయుడు తంటాలు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అసలు రూపకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరికీ తెలుసన్నారు. అభివృద్ధికి చిరునామా విశాఖ కేవలం ఇనార్బిట్ మాల్ మాత్రమే కాకుండా, అదానీ డేటా సెంటర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని కేకే రాజు గుర్తు చేశారు. చిన్న తరహా పరిశ్రమలు, టూరిజం, వినోద రంగాలకు ఈ మాల్ కొత్త ఊపిరి పోస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పారదర్శకతే మా బలం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాజెక్టును తీసుకువచ్చినా అందులో అవినీతికి తావు లేకుండా, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారని తెలిపారు. అదానీ డేటా సెంటర్ నుంచి ఇనార్బిట్ మాల్ వరకు ఆయన దార్శనికతకు ఇవన్నీ నిదర్శనాలని కేకే రాజు స్పష్టం చేశారు. కూటమి నాయకులు ఇప్పటికై నా వక్రబుద్ధి మానుకొని, ఈ ఉపాధి అవకాశాలను పారదర్శకంగా యువతకు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
గాజువాక : పాతగాజువాక సమీపంలోని చినగంట్యాడ జంక్షన్ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 ఏళ్ల మహిళ మృతి చెందింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరమాండల్ గేటు ప్రాంతానికి చెందిన ఎం.స్వాతి (30) తన తల్లి నాగమణితో కలిసి ద్విచక్ర వాహనంపై చినగంట్యాడ వచ్చారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో చినగంట్యాడ జంక్షన్ వద్ద వెనుక నుంచి వచ్చిన ఒక భారీ ట్రాలర్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వాతి బైక్ పై నుంచి కింద పడిపోవడంతో ట్రాలర్ చక్రాలు ఆమైపె నుంచి వెళ్లాయి. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై గాజువాక సీఐ షేక్ హుస్సేన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకు మోసం
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రకటించిన ‘జాబ్ క్యాలెండర్’ నిరుద్యోగులను మోసం చేయడమేనని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు మండిపడ్డారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది ఖాళీలు ఉండగా, కేవలం 10,060 పోస్టులను అక్టోబర్ వరకు విడతల వారీగా భర్తీ చేస్తామనడం యువతను తప్పుదోవ పట్టించడమేనన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3,000 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వం లక్షకు పైగా బాకీ ఉందన్నారు. గత జగన్ ప్రభుత్వంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా, సచివాలయ, వలంటీర్ వ్యవస్థల ద్వారా ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 1.72 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనకల ఈశ్వర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుజ్జు దీరజ్ కుమార్, ఉత్తర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మువ్వల సంతోష్ కుమార్, దక్షిణ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు తాడి రవితేజ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి చంద్రమౌళి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు -
‘మలబార్’లో శృతిహాసన్ మెరుపులు
బీచ్రోడ్: నగరంలోని వీఐపీ రోడ్డులో ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతనంగా ఏర్పాటు చేసిన భారీ షోరూంను సోమవారం సినీ నటి శృతి హాసన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ దేశంలో నాణ్యమైన, నమ్మకమైన బంగారు, వజ్రాభరణాలకు మలబార్ సంస్థ పెట్టింది పేరన్నారు. విశాఖ వంటి కీలక మార్కెట్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, సంప్రదాయ, ఆధునిక డిజైన్ల కలయికతో ఈ అతిపెద్ద షోరూంను అందుబాటులోకి తీసుకురావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. సంస్థ ఇండియా ఆపరేషన్స్ హెడ్ ఆషీర్ మాట్లాడుతూ.. విశాఖ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక కలెక్షన్లను ప్రదర్శిస్తున్నామన్నారు. ప్రస్తుతం షోరూంలో ‘బిగ్ బ్రిలియంట్ సేల్’ నడుస్తోందని, ఇందులో భాగంగా బంగారం, అన్కట్ రత్నాల ఆభరణాల తరుగుపై 40శాతం, వజ్రాల విలువపై 30శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. పాత బంగారం మార్పిడిపై ఎటువంటి తరుగు లేకుండా గరిష్ట విలువను అందిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో మలబార్ ప్రతినిధులు సిరాజ్, రాకేష్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో నాణ్యమైన ఉపాధి కీలకం
మద్దిలపాలెం: దేశాభివృద్ధిలో నాణ్యమైన ఉపాధి కల్పన కీలకమని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఐడీఎస్–ఏపీ చైర్మన్ ఆచార్య ఎస్. మహేంద్ర దేవ్ అన్నారు. ఆచార్య రొక్కం రాధాకృష్ణ నాలుగవ స్మారక ఉపన్యాస కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్య అతిథిగా హాజరైన మహేంద్ర దేవ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి విలువ ఆధారిత చర్యలు తోడవాలని, ఎగుమతులు పెరిగితేనే జీడీపీ వృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మానవ మూలధనం, సాంకేతికత, యువత నైపుణ్యాలు, మహిళల భాగస్వామ్యం దేశ ప్రగతికి దోహదపడతాయని ఆయన వివరించారు. మరో వక్త, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విశ్రాంత ఆచార్యులు దువ్వూరు నరసింహారెడ్డి ‘భారత వ్యవసాయ స్థితి– సవాళ్లు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. భూగర్భ జలాల మితిమీరిన వినియోగం, సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, పర్యావరణహిత వ్యవసాయం ద్వారానే రైతులకు సరైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోని ఒడిదుడుకులను అధిగమించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఐడీఎస్–ఏపీ సంచాలకులు ఆచార్య ఎస్. గాలబ్ సంస్థ పరిశోధనల గురించి వివరించగా, యూపీఎస్సీ పూర్వ చైర్మన్ ఆచార్య ఎస్.ఆర్. హషీం అధ్యక్షోపన్యాసం చేశారు. చివరగా అతిథులను ఘనంగా సత్కరించారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు మహేంద్ర దేవ్ -
నార్త్జోన్, సెంట్రల్జోన్ జట్ల విజయం
విశాఖ స్పోర్ట్స్ : నగరంలో ప్రారంభమైన ఆల్ ఇండియా జోనల్ ఫిజికల్లీ డిసేబుల్డ్ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు విజయాలతో ఖాతా తెరిచాయి. సోమవారం ఏసీఏ ఆపరేషన్స్ జీఎం ఎం.ఎస్. కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు. తొలి మ్యాచ్లో నార్త్ జోన్ 186 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో సౌత్ జోన్ 168 పరుగులకే పరిమితమైంది. మరో మ్యాచ్లో సెంట్రల్ జోన్ 252 పరుగుల భారీ స్కోరు సాధించగా (కేధార్నాథ్ 96), వెస్ట్ జోన్ కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్టేడియం మేనేజర్ జె.కె.ఎం. రాజు, మాజీ కెప్టెన్ గురుదాస్ రౌత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
చందనోత్సవానికి పక్కాగా వైద్య ఏర్పాట్లు
మహారాణిపేట: వచ్చే నెల 20న జరగనున్న సింహాచలం చందనోత్సవానికి పటిష్టమైన వైద్య ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. సోమవారం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవం కోసం మూడు షిఫ్టుల్లో 304 మంది సిబ్బందిని డిప్యుటేషన్పై నియమిస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం 90 అంబులెన్సులు, కొండపై 6 పడకల తాత్కాలిక ఆసుపత్రులు, 24 గంటల కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసర సేవల కోసం అపోలో, కేజీహెచ్, విక్టోరియా ఆస్పత్రులను రెఫరల్ ఆస్పత్రులుగా గుర్తించామన్నారు. ఈ ఏర్పాట్లకు ప్రైవేటు ఆస్పత్రులు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో నోడల్ అధికారి డాక్టర్ ఉమావతి, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
మహారాణిపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆయా శాఖలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా డీఎంహెచ్వో, అటవీ శాఖలు, పద్మనాభం తహసీల్దార్ పరిధిలో ఉన్న పెండింగ్ అంశాలను తక్షణమే క్లియర్ చేయాలని సూచించారు. మున్సిపల్ విభాగం, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, 21 రోజుల గడువు దాటినా స్పందించని ఆనందపురం మండల సర్వేయర్కు నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చార్జ్ మెమోలు ఇవ్వడానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో వచ్చిన 253 అర్జీలను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 91, జీవీఎంసీకి 96, పోలీస్ శాఖకు 13 వినతులు రాగా, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి. అధికారులు నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో శేషశైలజ, ఏడీసీ సత్యవేణి , ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. డీనోటిఫైడ్ తెగలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార కులాల వారికి తక్షణమే డీనోటిఫైడ్ తెగల కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని బీజేపీ నాయకుడు పొలిమేర శ్రీనివాసరావు కోరారు. సోమవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాటా డుతూ.. సంచార జాతులకు ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మూల వెంకటరా వు, దాడి పురుషోత్తం, తిప్పనబోయిన కోటీశ్వర రావు, కంటుభక్త సునీత తదితరులు పాల్గొన్నారు. -
వంట గది ఖాళీ.. రోడ్డెక్కిన సిలిండర్ల ర్యాలీ
నగర శివారు గ్రామాల్లో వంట గ్యాస్ కోసం సామాన్యుడి పాట్లు వర్ణనాతీతంగా మారాయి. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో వినియోగదారులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. సోమవారం ఉదయం విశాఖ నుంచి భీమిలి వెళ్లే ప్రధాన రహదారిపై ఖాళీ సిలిండర్లు బారులు తీరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వంట గదిలో పనులన్నీ పక్కన పెట్టి, గృహిణులు, కూలీలు గ్యాస్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక గంటల తరబడి రహదారిపైనే నిరీక్షిస్తున్నారు. చేతిలో పని వదిలేసి, పొయ్యి వెలిగించుకోవడానికి సిలిండర్లు పట్టుకుని రోడ్ల వెంట పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది. శివారు ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ కొరతను తీర్చాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 96 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 96 వినతులు అందాయి. కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్లు ఎస్.ఎస్. వర్మ, డీవీ రమణమూర్తి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన వినతుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 60 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్ విభాగానికి 14, రెవెన్యూ విభాగానికి 13, ప్రజారోగ్య శాఖకు 5, అడ్మినిస్ట్రేషన్ విభాగానికి 3, ఉద్యానవన విభాగానికి ఒకటి చొప్పున ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో జీవీఎంసీ జాయింట్ డైరెక్టర్ విజయభారతి, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, సీసీపీ ప్రభాకరరావు, అకౌంట్స్ ఎగ్జామినర్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, ఏడీహెచ్ వాసుకి, స్పోర్ట్స్ డైరెక్టర్ ఈఏ రాజు, ఆర్ఎఫ్వో కృపావరం పాల్గొన్నారు. -
ఇనార్బిట్ మాల్ను సందర్శించిన పోర్టు చైర్మన్
తాటిచెట్లపాలెం: నగరంలోని సాలగ్రామపురంలో నిర్మించిన ‘ఇనార్బిట్ మాల్’ సోమవారం గ్రాండ్ ఓపెనింగ్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు ఆదివారం ఉన్నతాధికారులతో కలిసి మాల్ ను సందర్శించారు. ప్రారంభోత్సవం నేపథ్యంలో జరుగుతున్న తుది దశ ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో, అత్యంత ఆధునిక హంగులతో రూపొందిన ఈ మాల్ నగరానికి సరికొత్త ల్యాండ్మార్క్గా నిలవనుంది. పోర్ట్ స్థలంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుండటంతో సందర్శకులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్, డైనింగ్, వినోద అను భూతి కలగనుంది. చైర్మన్ పర్యటనలో పోర్ట్, మాల్ ప్రతినిధులు పాల్గొని ఏర్పాట్ల గురించి వివరించారు. -
ఆరోగ్యశ్రీకి గండం
బకాయిల చిక్కుముడి..మహారాణిపేట: నిరుపేదల ప్రాణ సంజీవనిగా వెలుగొందుతున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి చంద్రబాబు సర్కార్ ఉరి బిగిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు దశాబ్దాలుగా పేద రోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా అందుతున్న ఆధునిక వైద్య సేవలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. పెరిగిన వ్యాధుల సంఖ్య.. ఇప్పుడు కోత? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. దివంగత వైఎస్సార్ 1059 వ్యాధులతో ప్రారంభించిన ఈ పథకాన్ని, జగన్ ఏకంగా 3257 వ్యాధులకు విస్తరించారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ఖరీదైన చికిత్సలను కూడా చేర్చి పేదలకు అండగా నిలిచారు. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఈ పథకానికి తూట్లు పొడిచేలా ‘యూనివర్సల్ హెల్త్ స్కీమ్’ పేరుతో కొత్త పాలసీని తీసుకురావడానికి సిద్ధమవుతోందన్న ప్రచారం సాగుతోంది. వచ్చే నెల నుంచి కొత్త పాలసీ? ఏప్రిల్ నుంచి కొత్త హెల్త్ పాలసీని అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచిందని వైద్య ఆరోగ్య శాఖలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పాత బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపడం, కొత్త పథకం పేరుతో ఎన్టీఆర్ వైద్యసేవను నీరుగార్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదల సంజీవనిగా ఉన్న ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త పాలసీకి ప్రభుత్వం సిద్ధం నెట్వర్క్ ఆస్పత్రులకు పేరుకుపోయిన బకాయిలు ఆరోగ్యశ్రీ నిర్వీర్యానికి చంద్రబాబు సర్కార్ కుట్రజిల్లాలో మొక్కుబడి సేవలు జిల్లాలో మొత్తం 108 నెట్వర్క్ ఆస్పత్రులు (66 ప్రైవేటు, 19 ప్రభుత్వ, 23 డెంటల్) ఉండగా, బకాయిల రాకతో ఇక్కడ సేవలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఫలితంగా పేద ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వర్కింగ్ జర్నలిస్టులు వైద్యం కోసం అల్లాడుతున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి నిధుల విడుదల నిలిచిపోవడంతో పర్యవేక్షణ కూడా లోపించిందని, దీనివల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. -
జిహ్వకో రుచి.. దేశానికో శైలి
సాగర తీరాన ‘ప్రపంచ’ విందు ఏయూలో 40 దేశాల రుచుల హంగామామద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేళ బీచ్ రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ ప్రపంచ వంటకాలకు వేదికై ంది. అంతర్జాతీయ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘ఫీస్ట్ ఫెస్ట్’ నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందించింది. 40 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులు 38 స్టాళ్లలో తమ దేశ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయగా, ఏయూ ఫుడ్ సైన్స్ విభాగం విద్యార్థులు మరో 18 స్టాళ్లలో భారతీయ స్వదేశీ రుచులను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ కెప్టెన్ ఎస్. దివాకర్, ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఇథియోపియా సంప్రదాయ కాఫీ, ఆఫ్గన్ ‘కాబూలి పలావ్’, జోర్డాన్ షవర్మ, నేపాల్ మోమోస్ వంటి వంటకాలు ఆహార ప్రియులను విశేషంగా ఆకర్షించాయి. వీటితో పాటు కొమరూన్ ఇగుసి సూప్, కాంబోడియా చేపల వంటకాలు, భూటాన్ శాకాహార రుచులు విదేశీ సంస్కృతిని ప్రతిబింబించాయి. ‘థింక్ గ్లోబల్.. యాక్ట్ లోకల్’ అనే నినాదంతో విభిన్న దేశాల ఆహారపు అలవాట్లను ఒకే చోట చేర్చడం అభినందనీయమని కెప్టెన్ దివాకర్ కొనియాడారు. ఏయూ వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ సంప్రదాయ వస్త్రధారణలో వంటకాలను వడ్డించడం ద్వారా తమ దేశ వారసత్వాన్ని పరిచయం చేశారని తెలిపారు. ఈ నెల 26న విదేశీ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవం కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమాన్ని అంతర్జాతీయ విద్యార్థుల విభాగం డీన్ ఆచార్య ఎస్.పాల్ డగ్లస్, అసోసియేట్ డీన్లు ఆచార్య యుగంధర్, ఆచార్య విజయశాంతి, ఆచార్య విజయమోహన్ సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, పాలక మండలి సభ్యులు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. ఫీస్ట్ఫెస్ట్లో పాల్గొన్న ఏయూ వీసీ -
డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడుదాం
భగత్సింగ్కు సీఐటీయూ ఆధ్వర్యంలో నివాళులు ఏయూక్యాంపస్: దేశ స్వాతంత్య్రం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల ఆశయాలను నిరంతరం కొనసాగిస్తామని సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ అన్నారు. భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం బీచ్రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్, మత్తు పదార్థాల మాఫియాకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ పెరుగుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్ మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో అధికార పార్టీకి చెందిన ఎంపీ ప్రమేయం ఉండటం ఆశ్చర్యకరమని, ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ మాఫి యా సాగుతోందని ఆరోపించారు. నెల్లూరు యువజన సంఘం కార్యకర్త పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకోవాలని, కార్మిక హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నేతలు పిలుపునిచ్చారు. అనంతరం ‘యుద్ధం వద్దు–శాంతి కావాలి’, ‘అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీ యూ నేతలు కుమార్ మంగళం, ఎం.సుబ్బారావు, కె.చంద్రశేఖర్, వి.కృష్ణరావు, పీతల అప్పారావు, అనపర్తి అప్పారావు, సింహాచలం, కుమారి, మణికుమార్, తులసీరామ్, మోహన్ రావు, రమాప్రభ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాద వృత్తి పూలబాట కాదు
విశాఖ లీగల్ : సమాజంలో న్యాయవాద వృత్తి అత్యంత కీలకమైందని, అయితే ఇది పూలబాట కాదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలో విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే నిరంతర శ్రమ, అంకితభావం తప్ప వేరే మార్గం లేదని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే విజయం సొంతమవుతుందని పేర్కొన్నారు. మరో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మాట్లాడుతూ.. నిరంతర అధ్యయనం ద్వారానే వృత్తిలో ఎదగడం సాధ్యమని తెలిపారు. నిత్యం కేసులతో బిజీగా ఉండే న్యాయమూర్తులు, న్యాయవాదులకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు మంచి ఆటవిడుపును ఇస్తాయని, మానసిక ఉల్లాసానికి ఇవి ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు న్యాయమూర్తులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి లాలం పార్వతి నాయుడు, క్రీడా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ -
విశాఖలో ‘రాకాస’ సందడి
డాబాగార్డెన్స్: నిహారిక కొణిదెల నిర్మాతగా, సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఆదివారం నగరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక మాట్లాడుతూ ‘కమిటీ కుర్రాళ్లు’ వంటి భారీ విజయం తర్వాత తమ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై వస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ఇదని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ బీచ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలని కూడా అనుకుంటానని ఆమె చమత్కరించారు. చిత్రంలో కామెడీ చాలా సహజంగా ఉంటుందని, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి సీనియర్ల రాకతో సినిమా స్థాయి పెరిగిందని పేర్కొన్నారు. హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ ఇది హర్రర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన ఫాంటసీ కామెడీ చిత్రమని, విఠలాచార్య సినిమాల తరహాలో ఒక చందమామ కథను విన్న అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. హీరోయిన్ నయన్ సారిక సినిమా ప్రమోషన్స్ విశాఖ నుంచి ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేయగా, గెటప్ శ్రీను చిత్రంలోని ఫాంటసీ కామెడీ బాగా పండిందని వివరించారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఈ క్యూట్ లవ్స్టోరీని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్వెల్లడించింది. -
అన్నమయ్య పదకవితా వైభవం
మద్దిలపాలెం : తొలి తెలుగు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో అన్నమయ్య కీర్తనల గాన సభ ఘనంగా జరిగింది. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ అన్నమాచార్య కీర్తన కళాకారులు ‘చైతన్య బ్రదర్స్’(కృష్ణమాచార్య, వెంకటేశ్వర శర్మ) తమ 23 మంది శిష్యులతో కలిసి అన్నమయ్య కీర్తలను ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ సంగీత విభావరికి డాక్టర్ మావుడూరి సత్యనారాయణ శర్మ (వయోలిన్), ఏడుకొండలు (మృదంగం), రాజు (తబలా) వాద్య సహకారం అందించారు. అంతకుముందు, కళాభారతి, త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు, కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, కోశాధికారి పైడా కృష్ణప్రసాద్, వంతుల నరసింగరావు, చైతన్య సోదరులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నమయ్య సంకీర్తనల విశిష్టతను చాటిచెప్పేలా సాగిన ఈ వేడుక నగర సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. -
విశాఖ స్టీల్ప్లాంట్ భూములు అదానీకి కేటాయిస్తే ప్రతిఘటన
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం మద్దిలపాలెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్టు ట్రస్టులను దెబ్బతీసి అదానీకి అప్పగించాలని చూస్తున్నా యని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం విమర్శించారు. ఆదివారం ఏచూరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్కు చెందిన 1167 ఎకరాల భూమిని అదానీ హస్తగతం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గంగవరం పోర్టును అదానీకి విక్రయించిన ప్రభుత్వం, ఇప్పుడు ప్లాంట్ భూములను కూడా ఆయనకే కట్టబెట్టాలని చూడటం అన్యాయమన్నారు. అదానీ డేటా సెంటర్ భూములే ఇంకా వినియోగంలోకి రాకముందే, పార్టనర్షిప్ పేరుతో గూగుల్ డేటా సెంటర్ భూములను కూడా అదానీ పొందేలా ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. నక్కపల్లిలోని ప్రైవేటు మిట్టల్ స్టీల్కు సొంత గనులు కేటాయిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం నిరాకరించడం విచారకరమన్నారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 7.5 మిలియన్ టన్నులకు పెంచేందుకు రూ.10 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్కేఎస్వీ కుమార్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాటం ఏప్రిల్ 2 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కార్మిక సంఘాల జెఎసితో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు డాక్టర్ బి. గంగారావు, వి. కృష్ణారావు పాల్గొన్నారు. -
27 ఏళ్ల తర్వాత ఇంటికి...
కన్నకొడుకును చూసి కన్నీరుమున్నీరైన తండ్రి అల్లిపురం: ఇరవై ఏడు ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇంటికి చేరుకుంటే ఆ కుటుంబంలో కలిగే ఆనందం వర్ణనాతీతం. అలాంటి మధుర అనుభూతిని ఏయూటీడీ సంస్థ ప్రతినిధులు ఆ కుటుంబానికి కల్పించారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం, కలహండి జిల్లా, బర్గాన్ గ్రామానికి చెందిన మహేందర్ చత్రియ గతంలో మానసిక అనారోగ్యానికి గురై ఇల్లు వదిలి వచ్చేశాడు. 2024 నవంబర్లో విశాఖ రైల్వే స్టేషన్లో దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న అతడిని ఏయూటీడీ సిబ్బంది గుర్తించి చేరదీశారు. ఐదు నెలలుగా ‘శ్రద్ధా’మందులతో వైద్య సేవలందించారు. చికిత్స అనంతరం మహేందర్ కోలుకోవడంతో, సంస్థ ప్రతినిధులు అతడిని నేరుగా సొంతూరికి తీసుకువెళ్లారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత గ్రామానికి చేరుకోవడంతో అక్కడి పరిసరాలన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఎనిమిదేళ్ల క్రితమే మహేందర్ తల్లి మరణించగా, తండ్రి రాకేశ్ కుమార్ చత్రియ మాత్రం కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. చనిపోయాడనుకున్న కొడుకు కళ్లముందు నిలబడటంతో ఆ వృద్ధ తండ్రి భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఇక నేను నిశ్చింతగా కన్నుమూస్తాను’అంటూ ఆయన అన్న మాటలు గ్రామస్తులందరినీ కదిలించాయి. మహేందర్ను అతని తండ్రికి, సోదరులకు క్షేమంగా అప్పగించినట్లు ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు తెలిపారు. -
విద్యార్థి ప్రగతికి వర్సిటీయే మూల కేంద్రం
మద్దిలపాలెం: విద్యార్థి ప్రగతికి విశ్వవిద్యాలయమే ప్రధాన కేంద్రంగా నిలుస్తుందని ఐఐటీ ఢిల్లీ మాజీ సంచాలకుడు ఆచార్య వి.ఎస్.రాజు అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ‘జియోటెక్నికల్ సొల్యూషన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ప్రాబ్లమేటిక్ గ్రౌండ్’అనే అంశంపై రెండు రోజుల వర్క్షాప్ ఆదివారం ప్రారంభమైంది. ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం, ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ (ఐజీఎస్) విశాఖ ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను చదువుకున్న ఏయూలో పొందిన జ్ఞానమే నేడు తనను ఈ స్థాయిలో నిలిపిందని గుర్తుచేసుకున్నారు. ఉన్నత స్థానాలకు చేరుకున్న పూర్వ విద్యార్థులు తమ జ్ఞానాన్ని, మేధస్సును, అనుభవాన్ని తాము చదువుకున్న విశ్వవిద్యాలయ వికాసానికి అందించి, మాతృ సంస్థకు రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో నిర్మాణ రంగంలో అనేక సాంకేతిక మార్పులు వస్తున్నాయన్నారు. సదస్సు కన్వీనర్ ఆచార్య సి.ఎన్.వి.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక స్వభావం కలిగిన నేలల్లో చేపట్టే నిర్మాణాలపై నిపుణుల సూచనలు పొందేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. సదస్సు సమన్వయకర్త ఆచార్య పి.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశ బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.12 లక్షల కోట్లు కేటాయించడం, ఈ రంగం విస్తరణ వేగాన్ని ప్రస్ఫుటం చేస్తోందన్నారు. ఐజీఎస్ అధ్యక్షుడు డాక్టర్ అనీల్ జోసఫ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏయూతో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఐజీఎస్ కార్యదర్శి ఎ.పి. సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిపుణులు ప్రత్యక్ష ఉదాహరణలతో సాంకేతిక అంశాలను వివరించారు. -
గ్యాస్ కష్టాలు.. ఇంకెన్నాళ్లు?
తగరపువలస: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భీమిలి ప్రాంతంలోని వంటిళ్లలో ‘గ్యాస్ ట్రబుల్స్’సృష్టిస్తోంది. తెల్లవారితే చాలు వినియోగదారులంతా వంట గ్యాస్ గురించే చర్చించుకుంటున్నారు. ఇక డెలివరీ బాయ్స్ పెరిగిన బుకింగ్స్ ఒత్తిడిని తట్టుకోలేక సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. పరిస్థితిని గమనించిన ఏజెన్సీలు, ఒక ఏరియా డెలివరీ బాయ్స్ను మరో ప్రాంతానికి పంపిస్తున్నాయి. దీంతో డెలివరీ పాయింట్ల వద్ద వినియోగదారులు ఉదయం నుంచే సిలిండర్ల కోసం నిరీక్షిస్తున్నారు. డెలివరీ బాయ్స్ జాడ లేకపోవడంతో నేరుగా భీమిలిలోని గ్యాస్ ఏజెన్సీలు, గోదాముల వద్దకే వెళ్తున్నారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్కు నెల రోజుల వ్యవధి ఉండటంతో, తక్కువగా వాడే వారు ఒక్కో సిలిండర్ను రూ.200 అదనంగా వసూలు చేస్తూ బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఏజెన్సీల వద్ద తగినంత నిల్వలు ఉన్నప్పటికీ.. యుద్ధ భయం, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల బుకింగ్స్ అసాధారణంగా పెరిగాయని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. చిట్టివలస జ్యూట్మిల్లు లేబర్ వెల్ఫేర్ సెంటర్ వద్ద క్యూ కట్టిన వినియోగదారులు -
సేవకులకు విశ్వగురు అవార్డులు
డాబాగార్డెన్స్ : సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు సేవలు అందిస్తూ దేశ ప్రగతికి సోపానాలుగా నిలవాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. ఆదివారం ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నిష్ణాతులకు ‘విశ్వగురు’ అవార్డులను ఘనంగా ప్రదానం చేశారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ మాట్లాడుతూ సేవ చేసే గుణం ఉన్నవారే సమాజంలో శాశ్వత కీర్తిని పొందుతారన్నారు. ముక్కుతో బొమ్మలు వేసే అరుదైన ప్రతిభ కలిగిన సంస్థ సీఈవో సత్యవోలు రాంబాబును ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కస్టమ్స్ అధికారి రవిశంకర్ మలిశెట్టి, సినీ నటుడు రాజీవ్ కనకాల, తుమ్మిడి బ్రదర్స్ అధినేత తుమ్మిడి రామ్ కుమార్ మాట్లాడుతూ.. అవార్డు గ్రహీతల సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. సంస్థ వ్యవస్థాపక సీఈవో డాక్టర్ సత్యవోలు రాంబాబు మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా క్షేత్రస్థాయిలో నిజమైన సేవకులను గుర్తించి గౌరవిస్తున్నామని, గతంలో తమ అవార్డులు అందుకున్న వారు పద్మ పురస్కారాలకు సైతం ఎంపిక కావడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, డాక్టర్ కిషోర్ కుమార్ సహా పలువురు కవులు, కళాకారులు, ఉన్నతాధికారులు పురస్కారాలు అందుకున్నారు. -
తీరంలో చందమామ
కొమ్మాది: దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చిత్రీకరణ మూడవ రోజు ఉత్సాహంగా సాగింది. ఇందులో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం ఆర్కే బీచ్, హవామహల్, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాల్లో కిడ్నాప్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. కాజల్ అగర్వాల్ను చూసేందుకు అభిమానులు, పర్యాటకులు భారీగా తరలిరావడంతో ఆమె వారికి అభివాదం చేశారు. కాజల్తో పాటు అజయ్ ఘోష్ షూటింగ్లో పాల్గొన్నారు. మరో వారం రోజుల పాటు బీచ్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ కొనసాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. -
రైల్వే స్థలంలో దుకాణాల తొలగింపు
డాబాగార్డెన్స్: ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం వెనుక భాగంలో ఫుట్పాత్పై ఉన్న పలు దుకాణాలను ఆదివారం రైల్వే అధికారులు తొలగించారు. రైల్వే క్వార్టర్స్ ప్రహరీకి ఆనుకొని ఉన్న స్థలంలో గత కొన్నేళ్లుగా గిఫ్ట్ షాపులు, పకోడీ బండ్లు, పండ్ల దుకాణాలు వెలిశాయి. వీటిని తొలగించాలని రైల్వే అధికారులు ఎనిమిదేళ్ల కిందటే దుకాణదారులకు నోటీసులు అందజేశారు. దీనిపై దుకాణదారులు కోర్టును ఆశ్రయించినప్పటికీ, వారికి దిగువ కోర్టులోనూ, అటు హైకోర్టులోనూ చుక్కెదురైంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రైల్వే పోలీసులు ఆదివారం భారీ బందోబస్తు మధ్య అక్కడ ఉన్న దుకాణాలన్నింటినీ తొలగించారు. తమ జీవనోపాధి కోల్పోయామని ఈ సందర్భంగా దుకాణదారులు లబోదిబోమన్నారు. -
గ్లోబల్ డెస్టినేషన్గా ఉత్తరాంధ్ర
సీఐఐ– స్వర్ణాంధ్ర కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మహారాణిపేట: భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం నోవాటెల్ హోటల్లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికి రెండు గంటల ప్రయాణ దూరంలో ఒక విమానాశ్రయం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కొత్త నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి 50 రోజులకు ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభించేలా తన శాఖ కార్యాచరణ సిద్ధం చేసిందని, భవిష్యత్తు అవసరాల కోసం 1700 విమానాలు రానున్న 16 ఏళ్లలో భారత్కు చేరనున్నాయని వెల్లడించారు. ప్రపంచాన్ని శాసిస్తున్న డ్రోన్ విప్లవంలో ఏపీ ‘డ్రోన్ సిటీ’గా అవతరిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే విమానాల అసెంబ్లింగ్ లైన్ను ఏర్పాటు చేసేందుకు ఎంబ్రయర్ సంస్థతో చర్చిస్తున్నామని, స్థానిక ఉత్పత్తి ద్వారానే పెరుగుతున్న డిమాండ్ను చేరుకోగలమని వివరించారు. అనంతరం సీఐఐ ప్రతినిధులు కేంద్రమంత్రిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీఐఐ ఆంధ్రప్రదేశ్ సీఈవో మురళి కృష్ణ, గ్రీన్ కో గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కోలి, ముత్తూట్ ఫిన్ కార్ప్ చైర్మన్ థామస్ జాన్, సీఐఐ వైస్ ఛైర్మన్ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. -
పేరు వింటే వణుకు
ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026● కొనసాగుతున్న కూటమి నేతల ‘అరాచక’ పర్వం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ విగ్రహాలపై దాడులు ● వైఎస్సార్ లాన్, వ్యూ పాయింట్ వద్ద ధ్వంసరచన ● తాజాగా గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి ● తీవ్రంగా స్పందించిన వైఎస్సార్సీపీ ● 48 గంటల్లో దోషులను శిక్షించాలని డిమాండ్ ఉమ్మడి విశాఖ జిల్లాలో విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో ఉన్న విగ్రహాలు, స్థలాలు లక్ష్యంగా మారడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వైఎస్సార్ పేరు వినగానే కూటమి నేతల్లో అసహనం వ్యక్తమవుతోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల గుండెల్లో చెరిగిపోని ఆ మహానేత జ్ఞాపకాలను ఇలా చెరిపేయాలని ప్రయత్నించడం దురుద్దేశపూరితమని ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఈ ఆందోళనలకు బలం చేకూరుస్తున్నాయి. ఫిల్మ్నగర్ క్లబ్లో అధికారికంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ లాన్ బోర్డును తొలగించడం మొదలుకుని, జీవీఎంసీ తీర్మానంతో ఏర్పాటైన వైఎస్సార్ వ్యూ పాయింట్ వద్ద పేరు చెరిపే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. అక్కడితో ఆగకుండా, పెందుర్తి వద్ద రోడ్డు విస్తరణ పేరుతో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించే యత్నం జరిగింది. స్థానిక నేతల ప్రతిఘటనతో ఆ ప్రయత్నం విఫలమైంది. తాజాగా అనకాపల్లి మండలం తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ రాక్షసకాండపై వైఎస్సార్సీపీ గర్జించింది. 48 గంటల్లో నిందితులను పట్టుకోకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తామని ‘అల్టిమేటం’ జారీ చేసింది. అధికార గర్వం అరాచక పర్వం గురునాథరావు విగ్రహంపై దాడి కూల్చివేతలే లక్ష్యంగా..పదవి కోసం పైశాచికం అభివృద్ధిని చూసి అసూయఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ వికృత క్రీడ పరాకాష్టకు చేరింది. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానేత స్మృతులను తుడిచిపెట్టాలనే సంకుచిత బుద్ధితో కూటమి నేతలు బరితెగిస్తున్నారు. వైఎస్సార్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతున్న పచ్చ దండు.. అభివృద్ధిని విస్మరించి, విగ్రహాల విధ్వంసమే ధ్యేయంగా అరాచక పర్వాన్ని కొనసాగిస్తోంది. వైఎస్సార్ వ్యూ పాయింట్, లాన్ల నుంచి మొదలైన ఈ ‘అల్పబుద్ధి’ రాజకీయం.. ఇప్పుడు దివంగత నేత గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి వరకు వెళ్లింది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం పెందుర్తిలో రోడ్ల వెడల్పు సాకుతో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించేందుకు తెగబడగా, వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాయి. గతంలో అనకాపల్లి జాతీయ రహదారి కొత్తూరు వద్ద చీకటి మాటున వైఎస్సార్ విగ్రహంపై దాడి చేశారు. తాజాగా అనకాపల్లి మండలం తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేయడం వైఎస్సార్సీపీ నేతలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అభివృద్ధి చేయలేక, ప్రజల మద్దతు పొందలేక ఇలాంటి నీచమైన దాడులకు పాల్పడుతున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. మంత్రి పదవి దక్కలేదన్న కసితోనో, అధినేత దృష్టిలో పడాలన్న తాపత్రయంతోనో గానీ.. గంటా అనుచరులు ఫిల్మ్నగర్ క్లబ్లో సాగించిన రభస అంతా ఇంతా కాదు. క్లబ్ కమిటీ అధికారిక తీర్మానం మేరకు ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్ లాన్’ బోర్డును బలవంతంగా పీకేసి తమ ఉన్మాదాన్ని చాటుకున్నారు. నియమ నిబంధనలను తుంగలో తొక్కి, దౌర్జన్యంతో భయాన్ని సృష్టించే ప్రయత్నం చేయడం కూటమి నేతల ‘కుటిల’ సంస్కృతికి నిదర్శనం. విశాఖ జిల్లాలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచే అరాచక శక్తులు జడలు విప్పాయి. ప్రశాంతతకు మారుపేరైన సాగర తీరాన్ని రాజకీయ కక్షలకు వేదికగా మార్చేశారు. ప్రజలకు మేలు చేసే పనులు చేతకాక, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక.. చివరకు మహనీయుల విగ్రహాలపై పడి ఏడవడం వీరి సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ‘వైఎస్సార్ వ్యూ పాయింట్’ ఇప్పుడు జనంతో కిటకిటలాడుతోంది. జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదంతో నామకరణం చేసిన ఈ ప్రాంతంపై పచ్చ నేతలు కన్నేశారు. అధికారికంగా మార్చే దమ్ము లేక, రాత్రికి రాత్రే పేరును తొలగించేందుకు విఫలయత్నం చేశారు. ప్రజలు ఆదరిస్తున్న ప్రదేశంపై ఇలాంటి ‘అల్పబుద్ధి’ రాజకీయం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
విలువలకు నిలువుటద్దం పద్మనాభరెడ్డి
ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అల్లిపురం: న్యాయవాద వృత్తిలో విలువలకు, నిబద్ధతకు నిలువుటద్దం దివంగత సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి అని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ కొనియాడారు. వర్ధమాన న్యాయవాదులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ హాల్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ విశాఖ జిల్లా, సిటీ కమిటీల ఆధ్వర్యంలో పద్మనాభరెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్మనాభరెడ్డి గారు ఒక ధ్రువతారలా వెలిగారని, ఆయన వాదనా పటిమ, చట్టంపై ఆయనకున్న పట్టు అనన్య సామాన్యమని గుర్తుచేశారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి చీమలపాటి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ భీమపాక ప్రసంగిస్తూ.. పద్మనాభరెడ్డి గారు కేవలం గొప్ప న్యాయవాదే కాకుండా, ఎంతోమందికి మార్గదర్శకుడిగా నిలిచారని ప్రశంసించారు. రిటైర్డ్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ (పద్మనాభరెడ్డి కుమారుడు) తన తండ్రి జ్ఞాపకాలను పంచుకున్నారు. విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ లాలం పార్వతినాయుడు, ఐఏఎల్ నేషనల్ జనరల్ సెక్రటరీ చలసాని అజయ్కుమార్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఏఎల్ నాయకులు వి.చంద్రశేఖరరెడ్డి, కె.ఎస్.సురేష్ కుమార్, ఎం.ఎస్.ఎం.భగవతీ, డి.మంజులత, ఎ.వి.లెనిన్, జహారా, అజయ్కుమార్, పీర్ల నూకరాజు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
కాకానినగర్ జంక్షన్లో లారీ బీభత్సం
ఆటో నుజ్జునుజ్జు..ముగ్గురికి తీవ్ర గాయాలుగోపాలపట్నం: నగరంలోని కాకానినగర్ జంక్షన్లో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఎయిర్పోర్టు పోలీసుల కథనం ప్రకారం.. ఉదయం 7.45 గంటల సమయంలో ఎన్ఏడీ నుంచి గాజువాక వైపు వెళ్తున్న ఓ లారీ, సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆటోను, మరో లారీని ఢీకొట్టింది. ఈ ధాటికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తాటిచెట్లపాలేనికి చెందిన పెంటకోట మోహన విష్ణుప్రియ పాదం చితికిపోగా, కరాసాకు చెందిన ఆటో డ్రైవర్ మైలపల్లి ఢిల్లీరావు కాలు విరిగింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ గణేష్ రామ్ గోపాల్ (ఛత్తీస్గఢ్) కూడా క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎయిర్పోర్టు, కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కొందరు భావిస్తుండగా.. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే డ్రైవర్ లారీని ఆపలేకపోయాడని మరికొందరు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి, ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఆటో డ్రైవర్ ఢిల్లీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సీహెచ్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రెడ్కార్పెట్ బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఎంవీపీకాలనీ: గాదిరాజు ప్యాలెస్ వేదికగా ‘రెడ్కార్పెట్ బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్’ శనివారం ప్రారంభమైంది. పలువురు నగర మహిళా పారిశ్రామికవేత్తలు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆర్.కె. నాయుడు, శైలజా రామ్ మాట్లాడుతూ విశాఖలో ఇది అతిపెద్ద గోల్డ్ , డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో బంగారం, వజ్రాలతో పాటు పోల్కి, జేమ్స్ వంటి ఆభరణాలకు సంబంధించి 30కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. తొలిరోజే ఈ ఎగ్జిబిషన్కు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. సోమవారం వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. -
‘కూటమి’ వైఫల్యాలను ఎండగట్టాలి
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వినియోగించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు మెరుగ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను విస్మరించి, రాజకీయ స్వార్థం కోసం వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారానికి దిగుతోందని మండిపడ్డారు. జగన్కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, ఆయన పర్యటనలకు వస్తున్న స్పందనే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సోషల్ మీడియా కేవలం పోస్టింగ్ల వేదిక మాత్రమే కాదని, ప్రజల్లో చైతన్యం నింపే శక్తివంతమైన ఆయుధమని కేకే రాజు అభివర్ణించారు. 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి సోషల్ మీడియా కీలక భూమిక పోషించిందని గుర్తు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను, అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఐటీ, సోషల్ మీడియా విభాగాలపై ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై ప్రభుత్వం చూపుతున్న వివక్షను, విశాఖలో జరుగుతున్న భూ అక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేస్తూ, చంద్రబాబుకు ప్రభుతవ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గర్భాపు అనిల్ శర్మ, గోపి రాజు వంక, బెవర జగదీశ్వరరావు, జి. పెంటరెడ్డి, గొర్లి నవీన్, గీతారెడ్డి, టి.అశోక్, నాగిరెడ్డి పోలిశెట్టి, బొడ్డేటి వేణు గోపాల్, బెవర మహేష్, దండ గణేష్, తంథాటి సంపత కుమార్, ఉమ్మిడి బాల మురళి, జిల్లా, నియోజకవర్గ, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వేసవి సవాళ్లకు వాల్తేర్ డివిజన్ సిద్ధం
తాటిచెట్లపాలెం: ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో, రైల్వే ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కోసం వాల్తేర్ డివిజన్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై శనివారం డీఆర్ఎం కార్యాలయంలో డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్బోహ్రా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాల్తేర్ డివిజన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, దువ్వాడ, రాయగడ, కోరాపుట్, జగదల్పూర్ వంటి చోట్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులకు నిరంతరం తాగునీరు అందుబాటులో ఉంచాలి. ఇందుకోసం ప్రత్యేక మంచినీటి బూత్లను ఏర్పాటు చేయాలన్నారు. సివిల్ డిఫెన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ప్రయాణికులకు నీటి సరఫరా సజావుగా సాగేలా చూడాలన్నారు. రైల్వే స్టేషన్లలోని మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్స్లో 24 గంటల పాటు నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైళ్ల రాకపోకల వివరాలను ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు చేరవేయాలని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే కమర్షియల్ సిబ్బంది సమన్వయంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం రైల్వే స్టేషన్ ఆవరణలో ఆపద వేళల్లో ప్రయాణికులను ఎలా రక్షించాలో వివరిస్తూ రైల్వే సిబ్బంది మాక్డ్రిల్ నిర్వహించారు. -
నటి కాజల్ అగర్వాల్ సందడి
కొమ్మాది: ఆర్కె బీచ్ సమీపంలోని హవా మహల్ వద్ద శనివారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శనివారం జరిగిన షూటింగ్లో కాజల్ అగర్వాల్తో పాటు ప్రముఖ నటులు అజయ్ ఘోష్, అజయ్లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. తమ అభిమాన నటిని చూ సేందుకు స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో హవా మహల్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. -
వాట్సాప్ గొడవలే ప్రాణం తీశాయి
ఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాలయం సమీపంలో జరిగిన బొచ్చు వెంకటేష్ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి శుక్రవారం సాయంత్రం ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. యువకుల మధ్య తలెత్తిన ఘర్షణలు, వాట్సాప్ గ్రూపుల్లో ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడం వంటి కారణాలే ఈ హత్యకు దారితీసినట్లు ఆయన తెలిపారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) పల్లా అనిల్కుమార్ది హెచ్బీ కాలనీ. గతంలో ఆటోమోటివ్ కూడలి వద్ద జరిగిన హత్య కేసుతో పాటు మరో హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఎంవీపీ పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీషీట్ కూడా ఉంది. అనిల్ గత కొంతకాలంగా రణస్థలంలో నివాసముంటూ ఆటో నడుపుకుంటున్నాడు. అయితే, అప్పుడప్పుడు నగరానికి వస్తూ స్థానిక యువకులతో గ్రూపులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో హత్యకు గురైన వెంకటేష్, గాయపడిన సంతోష్లతో అనిల్కు తగాదాలు ఏర్పడ్డాయి. వీరిద్దరిని అంతం చేసేందుకు అనిల్ ఇద్దరు మైనర్లతో పాటు వెంకటేష్ (ఏ2), నాగేంద్ర (ఏ3), రాజేష్ (ఏ4), చరణ్ (ఏ5), నిశాంత్ (ఏ6)లతో కలిసి పథకం రచించాడు. ఇసుకతోట కూడలి దరిలో పథక రచన చేసిన అనంతరం.. బొచ్చు వెంకటేష్ రామాలయం వద్ద ఉన్నాడని తెలుసుకొని మారణాయుధాలతో అక్కడికి చేరుకున్నారు. అతనిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం బాకి సంతోష్ ఇంటికి వెళ్లారు. సంతోష్ భార్య వరలక్ష్మి, స్నేహితుడు చందులను కొందరు అడ్డుకోగా, అనిల్, ఏ2 వెంకటేష్ సంతోష్పై కత్తి, ఇనుప రాడ్డుతో దాడి చేశారు. సంతోష్ భార్య, స్నేహితుడు పెనుగులాటలో పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు పారిపోయారు. పసల చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, 10 బృందాలుగా ఏర్పడి నిందితులందరినీ పట్టుకొని రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఎంవీపీ సీఐ ప్రసాద్, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐలు అసిరి తాత, డీడీ నాయుడు, భవ్య, సీతారాం, ఏఎస్ఐ ఆదిరాజు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల చొరవ అభినందనీయం ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఎంవీపీ పోలీసులు స్పందించిన తీరుపై ఏసీపీ హర్షం వ్యక్తం చేశారు. సీఐ ప్రసాద్తో పాటు ఎస్ఐలు నాయుడు, సీతారాం కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. అంబులెన్స్ కోసం వేచి చూడకుండా, పెట్రోలింగ్ జీప్లో వెంకటేష్ను, సీఐ ప్రసాద్ తన జీప్లో సంతోష్ను ఎక్కించుకొని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. సంతోష్కు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో, అతనికి అవసరమైన ‘ఓ పాజిటివ్’ రక్తాన్ని సైతం అందుబాటులోకి తెచ్చారు. వారి చొరవ కారణంగానే సంతోష్కు ప్రాణాపాయం తప్పిందని ఏసీపీ పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు మెడికవర్ ఆసుపత్రికి చేరుకొని సంతోష్కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం సంతోష్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ ఘటనలో ఎంవీపీ పోలీసుల చొరవ అభినందనీయమని నరసింహమూర్తి వెల్లడించారు. తప్పుడు స్నేహాలతో జీవితాలు నాశనం మొదటి నుంచీ నేరచరిత్ర ఉన్న పల్లా అనిల్ గురించి పూర్తిగా తెలియకపోవడంతోనే నిందితుల్లో పలువురు యువకులు ఈ హత్యకేసులో ఇరుక్కున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఎనిమిది మంది నిందితుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి ఎలాంటి నేరచరిత్ర లేదు. కేవలం ఆధిపత్య పోరు కోసం అనిల్ వారిని రెచ్చగొట్టి, ఈ దారుణానికి ప్రేరేపించాడనే అభిప్రాయం కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఇలాంటి రౌడీషీటర్లతో స్నేహం చేసే విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. క్షణికావేశం, అనవసర ఉత్సాహం వల్ల నేరాల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ నరసింహమూర్తి హితవు పలికారు. హత్య కేసులో ఎనిమిది మంది నిందితుల అరెస్ట్


