Visakhapatnam District News
-
చర్చలు విఫలం
● సమస్యలపై నేటిలోగా స్పందించకుంటే 28న సమ్మె ● ఆర్ఎల్సీ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకుల వెల్లడి ఉక్కునగరం : రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) సమక్షంలో స్టీల్ప్లాంట్ యాజమాన్యం, కాంట్రాక్ట్ కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. గురువారం సాయంత్రంలోగా స్పందించకుంటే శుక్రవారం నుంచి సమ్మె చేస్తామని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశంపై బుధవారం ఆర్ఎల్సీ ఏర్పాటు చేసిన సమావేశంలో యాజమాన్యం ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందులో ప్రధానంగా యాజమాన్యం నిలిపివేసిన 288 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. మెడికల్ చెకప్ పేరిట కార్మికులను తొలగించరాదని, తీసివేసిన కార్మికులను గురువారంలోగా తీసుకోకపోతే ఈనెల 28న సమ్మె తప్పదని స్పష్టం చేశారు. దీనిపై యాజమాన్యం ప్రతినిధులు మాట్లాడుతూ కాంట్రాక్టర్లు చెప్పిన కొంత మందిని తీసుకుంటామని, మెడికల్ చెకప్పై కార్మిక చట్టాల ప్రకారం నడుస్తామని తెలిపారు. మార్చి నెలాఖరు ఉత్పత్తికి కీలకం కాబట్టి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు యాజమాన్యానికి సహకరించాలని కోరారు. తమ డిమాండ్లపై యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో 28న ఉదయం 6 గంటల నుంచి 29 ఉదయం 6 గంటల వరకు సమ్మె చేస్తామని ప్రకటించారు. సమావేశంలో యాజమాన్యం నుంచి హెచ్ఆర్ జీఎంలు ఎన్.భాను, ఎం.మధుసూదనరావు, డీజీఎం ఖర్, మేనేజర్ శంకర్, కార్మిక సంఘాల నాయకులు జి.శ్రీనివాసరావు, నమ్మి శ్రీనివాసరావు, కె.ఎం.శ్రీనివాసరావు, మంత్రి రవి, జి.సత్యారావు, టి.గుర్నాథ్, జి.అప్పన్న, వంశీకృష్ణ, యు.అప్పారావు పాల్గొన్నారు. -
గ్రోత్ హబ్ లక్ష్య సాధనకు చర్యలు
మహారాణిపేట: గ్రోత్ హబ్ లక్ష్యాలు చేరుకునేందుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న మూడో విడత కలెక్టర్ల సదస్సులో రెండో రోజు బుధవారం జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖపట్నం రీజియన్ గ్రోత్ హబ్, వ్యవసాయ అనుబంధ రంగాల్లో చేపట్టబోయే చర్యల గురించి సీఎంకు వివరించారు. గ్రోత్ హబ్ కార్యసాధనలో భాగంగా విశాఖ రీజియన్లో నిర్దేశించిన 715 బిలియన్ డాలర్ల లక్ష్యం చేరుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిలో రీజియన్ వాటా 15.7 శాతం అనగా రూ.1,45,774 కోట్లు ఉండేలా కృషి చేస్తామని, తలసరి ఆదాయం రూ.6,14,763 సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాథమిక రంగంలో రెట్టింపు వృద్ధి లక్ష్యాలు చేరుకుంటామని చెప్పారు. జిల్లాలో రంగాల వారీగా చూసినట్లయితే జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్)లో వ్యవసాయ రంగం వాటా కేవలం 5 శాతం మాత్రమే ఉందని, దీన్ని 10 శాతానికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామన్నారు. నగదు రూపంలో చూస్తే రూ.68 కోట్ల మేర మాత్రమే వ్యవసాయ రంగం వాటా ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో అనేక కారణాల వల్ల సుమారు రెండు వేల హెక్టార్ల బీడు భూములు నిరుపయోగంగా ఉన్నాయని, వచ్చే ఏడాదిలో 200 హెక్టార్ల బీడు భూములను సాగులోకి తీసుకొస్తామన్నారు. వరి, చిరు ధాన్యాల సాగులో వినూత్న సంస్కరణలు చేపడతామని, కొత్త వంగడాలను ప్రవేశపెడతామన్నారు. వరిలో ఎంటీయూ–1224, ఆర్.ఎన్.ఆర్.–15048 వంటి వంగడాలను, మిల్లెట్లలో ఇంద్రావతి, వేగవతి వంటి నూతన రకాలను అందుబాటులోకి తీసుకొచ్చి.. ఉత్పాదకతను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
న్యాయవాదుల సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
విశాఖ లీగల్: ఈ నెల 28వ తేదీన జరిగే న్యాయవాదుల సంఘం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల అధికారి జీఎం రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఖరారు చేసిన న్యాయవాదుల జాబితా ప్రకారం ఎన్నికలు జరుగుతాయన్నారు. 2,958 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. జూనియర్, సీనియర్లు, 60 ఏళ్లు దాటిన న్యాయవాదులకు ప్రత్యేకంగా ఓటు వేయడానికి ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతాయని, అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామన్నారు. రాత్రి పది గంటలకు ఫలితాలు వెల్లడిస్తామని జీఎం రెడ్డి వెల్లడించారు. ఏమైనా సమస్యలు ఉంటే తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. ఎన్నికలు సాఫీగా సాగడానికి నలుగురు ఉపఎన్నికల అధికారులను నియమించినట్లు తెలిపారు. -
మేయర్ గుబులు!
టీడీపీలో అవిశ్వాస తీర్మానంతో ఆందోళనసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : కూటమి పార్టీలకు మేయర్ అవిశ్వాసం గుబులు మొదలైంది. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మెజార్టీ లేకపోయినప్పటికీ కలెక్టర్ను కలిసి కూటమి పార్టీల నేతలు నోటీసులు అందజేశారు. ఒకవైపు అసలు మెజార్టీ లేకపోవడం ప్రధాన సమస్య కాగా.. తీరా నోటీసుల తర్వాత సొంత పార్టీలోనే మేయర్ పీఠాన్ని అధిష్టించేది ఎవరనే ప్రశ్నలతో పాటు తమ సామాజికవర్గానికే మేయర్ పీఠాన్ని ఇవ్వాలంటూ యాదవ నేతలంతా ఐక్యంగా గొంతు కలపడం కూటమి ప్రభుత్వానికి కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో నేరుగా మంత్రి లోకేష్ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పనికావడం లేదని భావించడంతోనే లోకేష్ తెరమీదకు వచ్చినట్టు సమాచారం. మరింతగా ప్రలోభాలు పెట్టో.. బెదిరింపులకు పాల్పడటం ద్వారానో అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన 2/3 మంది కార్పొరేటర్లను (64 మంది) లాగేసేందుకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విశాఖలో కూడా అమలు చేసేందుకే లోకేష్ వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, లోకేష్ రాకపై అటు అధికార యంత్రాంగానికి.. పార్టీలోని ముఖ్యనేతలకు అధికారికంగా సమాచారం లేదు. కానీ లోకేష్ సమావేశం విషయం వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ టీమ్ ద్వారా ప్రజాప్రతినిధులకు సమాచారం చేరవేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. అవినీతి ఆరోపణలతో...! మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న వ్యక్తితో పాటు డిప్యూటీ మేయర్లుగా రంగంలో ఉన్న మరో ముగ్గురు కార్పొరేటర్ల వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. స్టాండింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా వసూళ్లతో పాటు ప్రతీ పనికీ ఇంత రేటు చెప్పి వసూలు చేస్తున్న వ్యవహారంపై అనేక విమర్శలున్నాయి. ఈ నలుగురు కలిసి ఇప్పటికే కార్పొరేషన్లలో తెగబడి చేస్తున్న వసూళ్లతో చెడ్డపేరు వచ్చిందని కూటమిలోని ఇతర కార్పొరేటర్లు మండిపడుతున్నారు. కొద్ది మంది కాంట్రాక్టర్లు బీజేపీ ఎమ్మెల్యేను కలిసి మరీ వసూళ్ల పర్వంపై ఫిర్యాదు కూడా చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా నేరుగా టీడీపీ అధిష్టానానికి కూడా వీరి వ్యవహారశైలిపై ఫిర్యాదులు రావడంతో పునరాలోచన పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో లోకేష్ నిర్వహించబోయే సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే చర్చ సాగుతోంది. -
ఎస్వోపీతో సజావుగా చందనోత్సవం
సింహాచలం: వచ్చే నెల 30న జరగనున్న చందనోత్సవంలో స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ)ను రూపొందించినట్లు రాష్ట్ర దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ తెలిపారు. బుధవారం సింహాచలం వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకుని, స్థానిక మీడియాతో మాట్లాడారు. సింహాచలం క్షేత్రంలో చందనోత్సవం చాలా పెద్ద ఉత్సవమని, రోజులో కొన్ని గంటలు మాత్రమే ఉంటుందన్నారు. ఏటా లక్ష 50 వేలమంది భక్తులతో పాటు వీఐపీలు కూడా స్వామివారి నిజరూప దర్శనానికి వస్తారన్నారు. ఇప్పటి వరకు జరిగిన పలు చందనోత్సవాల్లో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎస్ఓపీ రూపొందించామన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. చందనోత్సవం నిర్వహణపై వచ్చేనెల మొదటి వారంలో ప్రభుత్వ స్థాయిలో దేవదాయశాఖ, హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రులతో ఒక సమావేశం జరుగుతుందన్నారు. దేవదాయశాఖలో ఎన్ఎంఆర్ల పర్మినెంట్ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. దర్శనార్థం ఆలయానికి వచ్చిన ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక, శేషవస్త్రాన్ని ఈవో కె.సుబ్బారావు అందించారు. -
ప్రలోభాలతో ప్రయత్నాలు
● నేరుగా రంగంలోకి దిగుతున్న మంత్రి లోకేష్ ● ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లతో సమావేశం? ● వెంటాడుతున్న యాదవ సామాజికవర్గ డిమాండ్లు ● పీఠం ఆశిస్తున్న వ్యక్తులపై ఇప్పటికే అవినీతి మరకలు వాస్తవానికి జీవీఎంసీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు 2/3 మెజార్టీ అవసరం ఉంది. అయితే కూటమి పార్టీలకు అంత మెజార్టీ లేదు. కొద్ది మందిని బెదిరించి, మరి కొద్ది మందిని ప్రలోభాలకు గురిచేసి తమ వైపునకు లాక్కొనే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన మెజార్టీ (64 మంది కార్పొరేటర్లు) దక్కలేదు. ఈ నేపథ్యంలో మరింతగా ప్రలోభాలకు గురిచేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడటం ద్వారా నెగ్గేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు నేతలకు బాధ్యతలను అప్పగించారు. వీరంతా కొద్ది మందిని నయానో భయానో తమ పార్టీల్లోకి చేర్చుకునే ప్రయత్నం చేశారు. అయినా 2/3 మెజార్టీ సభ్యులు కూటమి పార్టీల్లో చేరలేదు. అవిశ్వాసం నోటీసులో పలువురి సంతకాలను కూటమి నేతలే చేసినట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఇక లాభం లేదనుకుని నేరుగా లోకేష్ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. -
అప్పన్న హుండీ ఆదాయం రూ.1.57 కోట్లు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం 21 రోజులకు రూ.కోటీ 57 లక్షల 71 వేల 152 వచ్చినట్లు సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. సింహగిరిపై బుధవారం స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 63 గ్రాముల బంగారం, 9.725 కిలోల వెండి లభించిందన్నారు. అన్నప్రసాద భవనంలోని హుండీ ద్వారా లక్షా 75 వేల 780 రూపాయలు లభించినట్లు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన లెక్కింపులో దేవస్థానం అధికారులు, సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. -
వందేళ్ల జ్ఞాపకం.. విశాఖ విజయ రథం
దేశంలో ఎలక్ట్రిక్ రైలు కార్యకలాపాలు ప్రారంభమై వందేళ్లు పూర్తయ్యాయి. ఈ శతాబ్ది వేడుకల సందర్భంగా వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్తగా సంబరాలు చేసుకుంది. ఎలక్ట్రికల్ రైల్వే వ్యవస్థకు చిహ్నంగా థీమ్ బేస్డ్ స్పెషల్ ఇంజిన్ను రూపొందించింది. ఈ ఇంజిన్ను ప్రశాంతి ఎక్స్ప్రెస్కు అనుసంధానించింది. త్రివర్ణ పతాకం ఐకానిక్గా.. విశాఖ చరిత్రను, విశిష్టతనుస్పృశిస్తూ రైల్వే యంత్రాంగం ‘విశాఖ విజయ రథం’పేరుతో ఈ అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. – సాక్షి, విశాఖపట్నం బాంబే విక్టోరియా టెర్మినస్ (ప్రస్తుతం సీఎస్ఎంటీ), కుర్లా మధ్య 1925 ఫిబ్రవరి 3న మొదటి ఎలక్ట్రిక్ రైలు పరుగులు పెట్టింది. ఈ చారిత్రక రోజున భారతీయ రైల్వే వ్యవస్థ ఒక అద్భుతమైన మైలురాయిని అందుకుంది. ఆ తర్వాత ఇండియన్ రైల్వే వరుస విజయాలతో దూసుకుపోయింది. వందేళ్ల పండగకు ప్రతీకగా, వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త ఆలోచనతో అద్భుతాన్ని ఆవిష్కరించింది. దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ లోకో షెడ్లలో ఒకటైన వాల్తేరు లోకోషెడ్ ఆధ్వర్యంలో థీమ్ బేస్డ్ లోకోను రూపొందించింది. దీనికి విశాఖ విజయరథంగా నామకరణం చేశారు. డబ్ల్యూఏపీ–7 (నం.39145)తో రూపొందించిన ఎలక్ట్రిక్ లోకోను బుధవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి డీఆర్ఎం లలిత్బోరా జెండా ఊపి ప్రారంభించారు. ఏడీఆర్ఎం (ఇన్ఫ్రా) ఈ సీతారామ్, ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ బి.షణ్ముఖరావు నేతృత్వంలో రూపొందించిన ఈ లోకోమోటివ్ను బెంగళూరు–భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్కు అనుసంధానించారు. త్రివర్ణపతాకం.. విశాఖ వైభవం వాల్తేరు ఎలక్ట్రిక్ లోకో షెడ్ 39145 నంబర్ గల WATE WAP–7 లోకోను రూపొందించినప్పుడు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా.. త్రివర్ణ పతాకంతో శోభిల్లేలా లోకో మొత్తం ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అంతేకాదు విశాఖ నగరపు ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేసేలా కొన్ని ముఖ్యమైన చిహ్నాలను కూడా దీనిపై ముద్రించారు. ఈ లోకో ఇంజిన్పై తూర్పు నౌకాదళానికి గుర్తుగా జలాంతర్గామి, విశాఖపట్నం పోర్టు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం ఆలయం, పారిశ్రామిక హబ్గా గుర్తింపు పొందిన వైజాగ్ స్టీల్ప్లాంట్ బొమ్మలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన లోకో విశాఖ నగరానికి, భారతీయ రైల్వేకు గర్వకారణంగా నిలుస్తోంది. ఎలక్ట్రికల్ రైల్వే వ్యవస్థకు వందేళ్లు థీమ్ బేస్డ్ ఇంజిన్ రూపకల్పన విశాఖ ఘనత చాటేలా వాల్తేరు లోకోషెడ్ శ్రద్ధ కర్బన ఉద్గారాల నియంత్రణలో కీలకం.. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు ఇండియన్ రైల్వేస్ ఈ ఎలక్ట్రిక్ లోకోలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అద్భుత ఘట్టానికి వందేళ్లు పూర్తవ్వగా, ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశాఖ విజయరథం రూపొందించడం శుభపరిణామం. వాల్తేరు ఎలక్ట్రిక్ లోకో షెడ్ 336 లోకోల నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. నిరంతరం ఎంతో పని ఒత్తిడి ఉన్నా.. వందేళ్ల ఉత్సవానికి గుర్తుగా అద్భుతమైన లోకోను తీర్చిదిద్దినందుకు షెడ్ సిబ్బందికి కృతజ్ఞతలు. ఎలక్ట్రిక్ లోకోల రాకతో భారతీయ రైల్వే ప్రయాణ వేగాన్ని క్రమంగా పెంచుకుంటూ దూసుకుపోతోంది. – లలిత్బోరా, వాల్తేరు డీఆర్ఎం -
పర్యవేక్షణ లోపం.. రోగులకు శాపం
● మెడికల్ షాప్లు, ఏజెన్సీల్లో అడుగడుగునా అక్రమాలు ● కాలం చెల్లిన మందులు విక్రయిస్తూ ప్రాణాలతో చెలగాటం ● విజిలెన్స్, పోలీస్, ఈగల్, డ్రగ్ కంట్రోల్ బృందాల తనిఖీల్లో వెల్లడి మహారాణిపేట: వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణ లోపం రోగుల పాలిట శాపంగా మారింది. కాలం చెల్లిన మందుల విక్రయాలు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తునిచ్చే మందులు, ఇంజక్షన్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన మెడికల్ షాపులు, ఏజెన్సీలు అడ్డగోలుగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకోని పరిస్థితి. నిబంధనలు బేఖాతరు ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపు 3 వేల మందుల షాపులు, 1,400 మెడికల్ ఏజెన్సీలు, హోల్సేల్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో చిన్న చిన్న షాపుల్లో ఎలాంటి కంప్యూటర్లు, రిజిస్టర్లు లేకుండానే మందుల విక్రయాలు జరుగుతున్నాయి. నిబంధనల మేరకు ప్రతి మందుల షాపులో ఫార్మసిస్టు ద్వారానే మందుల విక్రయాలు జరగాలి. కానీ ఎక్కడా ఈ నిబంధన అమలు జరగట్లేదు. అయినా ఔషధ నియంత్రణ మండలి అధికారులు మాత్రం దృష్టి సారించరు. నెలనెలా తూతూ మంత్రపు తనిఖీలతో ‘మామూళ్లు’గా మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఠంచనుగా జరపాల్సిన తనిఖీలు జరగకపోవడంతో చాలా మందుల షాపులు కనీస నిబంధనలను కూడా పాటించట్లేదు. కాలం చెల్లిన మందుల్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అడ్డగోలుతనం బట్టబయలు మెడికల్ షాపుల అడ్డగోలుతనంపై ఆరోపణల నేపథ్యంలో ఇటీవల విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ కింజరాపు ప్రభాకర్, ఈగల్(ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్), డ్రగ్ కంట్రోల్, ఇతర విభాగాలకు చెందిన 40 మంది సభ్యులతో కూడిన 4 బృందాలు మందులు షాపులు, ఎజెన్సీల్లో తనిఖీలు చేపట్టాయి. ఆరిలోవ, అల్లిపురం, లీలా మహల్, డాబాగార్డెన్స్, కై లాసపురం, కూర్మన్నపాలెం, గాజువాక, అనకాపల్లి, ఎంవీపీ కాలనీ తదితర ప్రాంతాల్లో దుకాణాలను తనిఖీ చేశారు. కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న ఎంవీపీ కాలనీలోని త్యాగరాయ మెడికల్స్, గాజువాకలోని శ్రీ సాయి వెంకటేశ్వర మెడికల్స్లో మందులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కనీస నిబంధనలు పాటించని మరో 13 షాపులకు నోటీసులిచ్చి సరిపెట్టారు. -
చీకటి
బతుకులు ● విద్యుత్ సదుపాయం లేక చిమ్మ చీకట్లో అవస్థలు ● రేయింబవళ్లు చీకట్లో విష కీటకాలతో సావాసం ● అంగన్వాడీ, పాఠశాలలకు దూరాభారం ● ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కూటమి నేతలు బర్థన్నగర్లో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో కొవ్వొత్తుల వెలుగులో చదువుకుంటున్న విద్యార్థులుకారు చీకట్లో కానరాని దారులు.. కొవ్వొత్తుల వెలుగులో విద్యార్థుల చదువులు.. కట్టెల పొయ్యి నుంచి వచ్చే వెలుతురులోనే మహిళల వంటలు.. ఆరు బయట ముసురుకున్న చీకట్లోనే కుటుంబాల భోజనాలు.. ఫ్యాన్ గాలి లేని నిద్రలు.. చుట్టూ నిత్యం బుసలు కొట్టే పాములు.. ఇవీ చిమ్మ చీకట్లో నిత్యం పిల్లా పాపలతో బర్థన్నగర్ వాసుల బతుకులు.. మొహం చాటేశారు 2023లో తొలుత 13 మందికి ఇంటి పన్ను వేశారు. మిగిలినవారికి త్వరలో వేస్తామని చెప్పారు. అయితే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికలప్పుడు స్థానిక టీడీపీ నాయకులు వచ్చి ఓట్లేస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాకు రూ.40 లక్షలు ఇస్తేనే చేస్తామంటున్నారు. కలెక్టర్, జీవీఎంసీ అధికారులు చొరవ తీసుకుని మా కష్టాలు తీర్చాలి. –నారాయణపురం అరుణ, బర్థన్ నగర్ జీవితం దుర్భరంగా ఉంది మేమంతా ఇళ్లల్లో పనులు, భవన ని ర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తు న్నాం. తాగునీటికి ఇబ్బందులు ఉ న్నాయంటే రెండు బోర్లు వేశారు. కా నీ విద్యుత్ సదుపాయం లేక తీ వ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాత్రి పూట నిద్రపట్టడం లేదు. – మట్టా అనురాధ, బర్థన్నగర్ పెందుర్తి: నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జీవీఎంసీ 97 సుజాతనగర్కు అతి సమీపంలో వెలసిన బర్థన్నగర్ కనీస మౌలిక వసతులకు నోచుకోలేదు. ఇళ్లల్లో పనులు చేసుకుంటూ.. తాపీమేసీ్త్రలుగా.. ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దాదాపు 120 కుటుంబాలు దాదాపు పుష్కరకాలం క్రితం ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. చిన్నపాటి గుడిసెలు, షెడ్లు వేసుకుని జీవిస్తున్నారు. అయితే ఈ కాలనీలో జీవీఎంసీ వేసిన రెండు తాగునీటి బోర్లు తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు అందలేదు. ముఖ్యంగా విద్యుత్ సదుపాయం లేక వీరి జీవితాలు నరకప్రాయంగా మారాయి. ఇక్కడి పిల్లలకు పాఠశాలలకు వెళ్లేందుకు కూడా తగిన సదుపాయాలు లేవు. అంగన్వాడీ కూడా కాలనీకి మూడు కిలోమీటర్ల దూరంగా ఉండడంతో ఐదేళ్ల లోపు పిల్లలు ఇంట్లోనే ఉండిపోయే దుస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే బర్థన్నగర్ వాసుల అవస్థలు చంతాడంతా ఉన్నాయి. పాములు, తేళ్లతో భయం భయం మా ప్రాంతంలో జీవీఎంసీ వేసిన రెండు బోర్లు తప్ప ఏమీ లేవు. రోడ్డు ఊసే లేదు. విద్యుత్ లేకపోవడంతో బాధలు పడుతున్నాం. రాత్రుళ్లు కంటి మీద కునుకే ఉండడం లేదు. పాములు, తేళ్లు మా ముందే తిరుగుతున్నాయి. భయమేస్తుంది. – గొద్దు నారాయణమ్మ, బర్ధన్నగర్ అంగన్వాడీకి పంపలేని పరిస్థితి చాలా ఏళ్లుగా ఇక్కడే చిన్న షెడ్ వేసుకుని ఉంటున్నాం. విద్యుత్ సదుపాయం లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలు ఈగలతో చాలా కష్టపడుతున్నాం. దూరాభారం వల్ల పిల్లలను అంగన్వాడీలకు పంపించలేకపోతున్నాం. – షేక్ మహాపజా, బర్థన్నగర్ సూర్యాస్తమయంతో కష్టాలు మొదలు బర్థన్నగర్లో దాదాపు 120 కుటుంబాలు ఉంటున్నాయి. వీళ్లలో అధిక శాతం మంది సమీపంలోని ఉన్నత వర్గాల ఇళ్లల్లో పనులు చేస్తూ పొట్ట పోసుకుంటారు. మిగిలిన వారు తాపీ మేసీ్త్రలుగా, కూలీలుగా, ఆటో కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. కాగా కాలసీ వాసులు పగటిపూట ఏదోలా నెట్టుకొచ్చినా.. సూర్యాస్తమయం తరువాత కష్టాలు మొదలవుతాయి. పనుల మీద బయటకు వెళ్లిన వారు పొద్దుపోయాక వచ్చేటప్పుడు మార్గం చిమ్మ చీకటిగా ఉంటుంది. ఇంట్లో వంటలు చేయాలంటే కట్టెల పొయ్యి వెలుగే దిక్కు. ఇక విద్యార్థుల చదువులు కొవ్వొత్తుల వెలుతురులోనే సాగుతున్నాయి. నిత్యం విష కీటకాలు భయంతో కునుకు తీయాల్సిన దుర్భర జీవితం వీరిది. అప్పుడు ఓట్లడిగి.. ఇప్పుడు మోకాళ్లడ్డు దాదాపు 12 ఏళ్ల క్రితం ఏర్పడిన బర్థన్నగర్ వాసులకు ఆధార్, ఓటరు కార్డులు ఇక్కడి చిరునామాతోనే ఉన్నాయి. గ్యాస్ కూడా బర్థన్నగర్ చిరునామాతోనే సరఫరా అవుతుంది. 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అదీప్రాజ్ చొరవతో జీవీఎంసీ అధికారులు ఇక్కడ నివాసం ఉంటున్న కొందరికి ఇంటి పన్నులు కూడా వేశారు. ఈ క్రమంలో విద్యుత్ సదుపాయం, ఇతర వసతుల కల్పనకు జీవీఎంసీ అధికారులు పూనుకున్నారు. ఎన్నికలు సమీపించడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల సమయంలో కాలనీకి ప్రచారానికి వచ్చిన కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే సకల సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తీరా అధికారంలో వచ్చాక ఇక్కడ సదుపాయాలు కల్పించాలంటే కాలనీవాసులంతా కలిసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి డిమాండ్ చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. నిరుపేదలమైన తమకు కనీస మౌలిక వసతుల కల్పనకు కూడా ఈ తరహాలో ప్రవర్తించడం పట్ల వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమకు విద్యుత్ సదుపాయంతో పాటు ఇతర వసతులు కల్పించాలని కోరుతున్నారు. కనీస మౌలిక వసతులు లేక అల్లాడిపోతున్న బర్థన్నగర్ వాసులుకొవ్వొత్తుల వెలుగులోనే చదువు నేను రోజు మా కాలనీ నుంచి పెందుర్తి వెళ్లి చదువుకుంటున్నాను. పాఠ శాల నుంచి ఇంటికి వచ్చాక చదువుకుందామంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పరీక్షల సమయంలో అయి తే నరకమే. కొవ్వొత్తుల వెలుగులో చదువుకుంటున్నాం. – ఆశ, విద్యార్థిని, బర్థన్నగర్ -
రైల్వే జోన్ పనుల అడ్డగింత
న్యాయం చేయాలని శ్రీకృష్ణాపురం గిరిజనుల ఆందోళన ఆరిలోవ: జీవీఎంసీ 13వ వార్డు పరిధి ముడసర్లోవ వద్ద రైల్వే జోన్ పనులను మంగళవారం శ్రీకృష్ణాపురానికి చెందిన గిరిజనులు అడ్డుకున్నారు. ముడసర్లోవ ప్రాంతంలో 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే జోన్ కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థ భూసార పరీక్షలు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పొక్లెయిన్ ద్వారా పనులు జరగనివ్వకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఈ భూములు రైల్వేకు కేటాయించారని, వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. 1976లో అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణాపురంలో 66 గిరిజన కుటుంబాలకు 66 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించిందని వారు తెలిపారు. ఆ భూమిని ఇప్పుడు రైల్వేకు కేటాయించడం అన్యాయమన్నారు. ఈ భూములు తీసుకున్నందుకు తమకు ప్రత్యామ్నాయం చూపాలని, అప్పటివరకు పనులు జరగనివ్వమని హెచ్చరించారు. పత్తా లేని టీడీపీ నాయకులు రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రైల్వే అధికారులు ఈ భూములకు హద్దులు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో శ్రీకృష్ణాపురం గిరిజనులతో కలిసి టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. గిరిజనులకు ప్రత్యామ్నాయం చూపకుండా పనులు జరపకూడదని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పనులు జరుగుతుండగా టీడీపీ నాయకులు పత్తా లేకుండా పోయారు. ఇక్కడ గిరిజనులను రాజకీయంగా ఉపయోగించుకుని అవసరం తీరిన తర్వాత ముఖం చాటేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే..
ఇక్కడ ప్రతి సంవత్సరం చదువుకున్న ఖైదీల సంఖ్య మారుతూ ఉంటుంది. కొత్త వారు రావడం, శిక్ష పూర్తయిన వారు వెళ్లిపోవడం వల్ల ఈ సంఖ్యలో మార్పు ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 55 మంది ఖైదీలు ఓపెన్ పదో తరగతిలో చేరారు. 20 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. డిగ్రీ స్థాయిలో బీఏ కోర్సును 29 మంది పూర్తి చేయగా, ఒకరు పీజీలో ఎంఏ పరీక్షలు రాశారు. ● 2020–21లో 80 మంది ప్రాథమిక విద్య, 26 మంది ఓపెన్ టెన్త్, 14 బీఏ చదువుకున్నారు. ● 2021–22లో 90 మంది ప్రాథమిక విద్య, 10 మంది ఓపెన్ టెన్త్, 9 మంది బీఏ విద్యనభ్యసించారు. ● 2022–23లో 82 మంది ప్రాథమిక విద్య, ఆరుగురు బీఏ, ఒకరు ఎంఏ చదివారు. ● 2023–24లో 80 మంది ప్రాథమిక విద్య, 9 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ చదివారు. ● 2024–25 (ప్రస్తుతం)లో 90 మంది ప్రాథమిక విద్య కొనసాగిస్తుండగా, 19 మంది ఓపెన్ టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. 11 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. -
హామీలు నెరవేర్చే వరకూ పోరాడుతాం..
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలన్నీ అమలుచేసే వరకూ వైఎస్సార్ సీపీ పోరాడుతూనే ఉంటుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అందులో భాగంగానే వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుచేశామని, త్వరలో మండల, గ్రామ స్థాయి యువజన విభాగం కమిటీలను కూడా ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. మంగళవారం మద్దిలపాలెంలో గల వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర యువజన విభాగం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. త్వరలో నియోజకవర్గ, మండల, గ్రామ యువజన విభాగం ఇన్చార్జిలను నియమించాలని దిశా నిర్దేశం చేశారు. అధికారం చేపట్టిన 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని, ప్రజలంతా ఎదురు తిరిగే రోజు అతి త్వరలో వస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు అబద్దపు హామీలు ఇవ్వడం.. గెలిచిన తరువాత పంగనామాలు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన చంద్రబాబు అండ్ కో.. అధికారం చేపట్టిన తరువాత ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా.? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలే వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితులను చూస్తున్నామని మండిపడ్డారు. నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ.3 వేలు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేవరకూ మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం పోరాడుతూనే ఉంటుందని హామీ ఇచ్చారు. రాజాకు సత్కారం ఉత్తరాంధ్ర సమావేశానికి వచ్చిన వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాను విశాఖ యువజన విభాగం అధ్యక్షుడు దొడ్డి కిరణ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ కొండారాజీవ్ గాంధీ, ఉత్తరాంధ్ర జోనల్ అధ్యక్షుడు మెంట స్వరూప్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు మారపు పృథ్వీరాజ్, సూరిబాబు, వెంకటేష్, గవాడ శేఖర్, 66వ వార్డ్ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగాలు, భృతి అంతా నాటకం ఉన్న పరిశ్రమలే వెనక్కి పోతున్నాయి త్వరలో మండల, గ్రామ స్థాయిలో యువజన విభాగం కమిటీల ఏర్పాటు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా -
ఎకై ్సజ్ కానిస్టేబుళ్ల సంఘం నూతన కార్యవర్గం
పెందుర్తి: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రోహిబిషన్, ఎకై ్సజ్ శాఖ కానిస్టేబుల్ అసోషియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నగరంలోని ఓ పంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా కె.అప్పలనారాయణ, గౌరవ అధ్యక్షుడిగా కె.వి.ఎం రాజు, ఉపాధ్యక్షుడిగా డి.రవితేజ, ప్రధాన కార్యదర్శిగా ఆర్.జగన్నాథ, ఐదుగురు కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు సంఘం కృషి చేస్తుందని అధ్యక్షుడు అప్పలనారాయణ తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. -
గత ప్రభుత్వ హయాంలో యాదవులకు సముచిత స్థానం
● కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర యాదవులకు తీరని అన్యాయం ● జిల్లా యాదవ సంఘం నాయకులు సీతంపేట: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో యాదవులకు సముచిత స్థానం దక్కిందని, కూటమి ప్రభుత్వం కూడా అదే రీతిలో పదవులు కేటాయించి.. గౌరవించాలని జిల్లా యాదవ సంఘం నాయకులు ఒమ్మి కనకరాజు యాదవ్, పిన్నింటి ఆదిమూర్తి డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో మంగళవారం విలేకరులతో వారు మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లాలో ఓ ఎమ్మెల్సీ, విశాఖ జిల్లాలో ఓ ఎమ్మెల్సీ, వీఎంఆర్డీఏ చైర్పర్సన్, జీవీఎంసీ మేయర్ ఇలా చాలా పదవులు యాదవులకు కేటాయించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో కనీసం జనాభా ప్రాతిపదికన కూడా రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కూటమి పార్టీలు యాదవులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంటున్నాయని ఆక్షేపించారు. జీవీఎంసీ పరిధిలో 22 మంది కార్పొరేటర్లు యాదవులు ఉన్నారని, గత ప్రభుత్వం యాదవ మహిళకు మేయర్ పదవి కేటాయించి సముచిత స్థానం కల్పించిందన్నారు. మేయర్ పదవి నుంచి యాదవ మహిళను తొలగిస్తే తీవ్ర మానసిక ఆందోళన పెంచినట్లేనన్నారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపునకు యాదవ సామాజిక వర్గం కృషి చేసిందని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర జిల్లా ల్లో 16 లక్షల వరకు యాదవులున్నా, దానికి తగ్గట్టు ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు దక్కలేదన్నారు. యాదవ నాయకులు యడ్ల వేణుగోపాల్కృష్ణ(సుమన్), నక్కా పద్మ, ఒమ్మి ఆనంద్, అల్లు రమణ, ఇసరపు వెంకటలక్ష్మి, చందక శ్రీను, ఈశ్వరరావు పాల్గొన్నారు. -
ఖజానా ఖాళీ!
● ఉద్యోగుల జీతాలు మినహా అన్ని బిల్లులు కట్ ● కాంట్రాక్టర్ల బిల్లులు, ఇతర చెల్లింపులన్నీ బంద్ ● బోసిపోతున్న ఖజానా కార్యాలయం మహారాణిపేట : సంపద సృష్టికర్త హయాంలో ఖజానా ఖాళీ అయిపోయింది. ఉద్యోగుల జీతాలు, పింఛన్ల మినహా మిగిలిన అన్ని బిల్లులు మురిగిపోతున్నాయి. కాంట్రాక్టర్ల బిల్లులతో పాటు ఇతర చెల్లింపులన్నీ బంద్ అయిపోయాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో బిల్లుల కోసం వచ్చే కాంట్రాక్టర్లు, ఇతరులతో రద్దీగా కనిపించే ఖజానా కార్యాలయాలు నేడు బోసిపోతున్నాయి. బిల్లులు తీసుకోకపోవడంతో ఎవరూ ట్రెజరీ కార్యాలయాలకు రావడం మానేశారు. దీంతో ఖజానా సిబ్బంది సైతం ఖాళీ అయిపోయారు. అన్ని బంద్ : జిల్లాలో 32 డిపార్టుమెంట్లలో టెలిఫోన్, కరెంటు, స్టేషనరీ బిల్లులు, ఇతర చెల్లింపులు కూడా బంద్ అయ్యాయి. అలాగే కార్యాలయం నిర్వహణ ఖర్చులకు కూడా చెల్లింపులు జరగడం లేదు. పలు శాఖల అధికారులు, ఉద్యోగులకు ఇచ్చే రవాణా భత్యం(టీఏ, డీఏ)లు, జీపీఎఫ్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నిలిపివేశారు. గతంలో అయితే ప్రభుత్వ శాఖలు ఇచ్చే బిల్లులను ట్రెజరీ శాఖ సిబ్బంది వాటిని సీఎఫ్ఎంఎస్ పోర్టల్లోని అప్లోడ్ చేసేవారు. ప్రభుత్వ శాఖలో పలు అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు రోడ్డు ఎక్కారు. గత వారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో వినతులు ఇవ్వగా.. మంగళవారం నగరంలో ఆందోళన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు వివిధ విభాగాల కాంట్రాక్టర్లు ప్లకార్డులు చేతపట్టి నిరసన ర్యాలీ నిర్వహించారు. బోసిపోతున్న కార్యాలయాలు ఆర్థిక సంవత్సరం చివరిలో ట్రెజరీ కార్యాలయాలు బిల్లుల కోసం వచ్చే వారితో సందడిగా కనిపించేవి. ఈ సమయంలో సిబ్బంది అర్థరాత్రి సైతం విధులు నిర్వర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు మినహా మిగిలిన అన్ని బిల్లులు నిలుపుదల చేయడంతో ట్రెజరీ సిబ్బంది ఖాళీ అయ్యారు. ఆర్థిక సంక్షోభంలో పలు శాఖలు పలు ప్రభుత్వ శాఖలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో అన్ని రకాల బిల్లులను నిలిపివేయాలని ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలో ఆదేశించింది. ఫలితంగా ఉద్యోగులకు సంబంధించిన బిల్లులతో పాటు కాంట్రాక్టు బిల్లులను నిలిపివేశారు. దీంతో నిధుల సంక్షోభంతో ప్రభుత్వ శాఖలు కటకటలాడుతున్నాయి. -
పోదాం పదే యాతర.. నూకాలమ్మ జాతర
● నెల రోజులు వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు ● రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ అనకాపల్లి టౌన్: ఉత్తరాంధ్రలోనే ప్రఖ్యాతి గాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 28, 29 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనుంది. 28న జాతర, 29న కొత్త అమావాస్య పండగ, 30న ఉగాది వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల రోజులపాటు జరగనున్న జాతర ఏప్రిల్ 27వ తేదీతో ముగుస్తుంది. అమ్మవారు కొలువై ఉన్న బాలాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేసవి కావడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లను సిద్ధం చేశారు. మంచినీటి కూలర్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్ విజయ కృష్ణన్ సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ గొల్లబాబు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను నిరంతరం పరిశీలిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో మరింత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ఆలయ పరిసరాల్లోనే ఈ పండగ వాతావరణం కనిపించేది. ఈసారి పట్టణం నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో కూడా ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాగణంలో భారీ వేదిక రూపొందించి భక్తులందరికీ కనిపించేలా అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. ఈ అమ్మవారి విగ్రహానికి రెండు పూటలా ప్రత్యేక పూజలు చేయడానికి కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్టేడియం పరిసరాలను పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతున్నారు. జెయింట్వీల్, మూవింగ్ ట్రైన్, రన్నింగ్ షిప్, పిల్లలు ఆడుకొనే వివిధ రకాల వస్తువులు, తినుబండారాల స్టాల్స్ నెలకొల్పనున్నారు. ఆధ్యాత్మికత ప్రతిఫలించేలా సంకీర్తనలు, కోలాటం, జానపద నృత్యాలను నెల రోజులపాటు నిర్వహించనున్నారు. నెల రోజుల జాతర కోసం ఎన్టీఆర్ స్టేడియంలో నెలకొల్పే 12 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం గవరపాలెం పురవీధుల గుండా ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. -
కనీస పెన్షన్ కోసం దేశవ్యాప్త ఉద్యమం
గాజువాక: విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ.7,500, డీఏ, మరో పక్క హయ్యర్ పెన్షన్ కోసం దేశవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ నేషనల్ ఏజిటేషన్ కమిటీ జాతీయ నాయకుడు కమాండర్ అశోక్ రావత్ తెలిపారు. వైజాగ్ నేషనల్ ఏజిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో గాజువాకలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలం పాటు తమ సేవలను అందించి రిటైరైన ఉద్యోగులకు కనీస పెన్షన్, డీఏతోపాటు రెండు హెల్త్ కార్డులను కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఒక పక్క కనీస పెన్షన్ కోసం పోరాడుతూనే మరోపక్క హయ్యర్ పెన్షన్ కోసం కూడా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అందరూ సమైక్యంగా పని చేస్తే హక్కులను సాధించుకోగలుగుతామన్నారు. దీనిపై ఇప్పటికే పీఎఫ్ సెంట్రల్ కమిటీతో మాట్లాడినట్టు చెప్పారు. వెయ్యి రూపాయల పెన్షన్ తీసుకుంటున్న అనేక మంది విశ్రాంత ఉద్యోగులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. నేషనల్ ఏజిటేషన్ కమిటీ అధ్యక్షుడు బాబూరావు మాట్లాడుతూ కనీస పెన్షన్ కోసం అవసరమైతే పీఎఫ్ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామన్నారు. కార్యదర్శి ఎ.వి.ఎన్.ఎం.అప్పారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేస్తోందన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.రామారావు మాట్లాడుతూ ఈ విషయంపై పార్టీలకతీతంగా ఉద్యమం చేపట్టాలన్నారు. ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు డి.ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేస్తోందని, ఏ వర్గానికీ ఉపయోగపడటం లేదన్నారు. ఐఎన్టీయూసీ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ పెన్షన్ పోరాటంలో అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నేషనల్ ఏజిటేషన్ కమిటీ ప్రతినిధులు సరితా నార్కడ్, శోభా అరసు తదితరులు పాల్గొన్నారు. -
● కొత్తగా చేరిన వారికి ఓటు హక్కు లేదు ● స్పష్టం చేసిన న్యాయవాద సంఘం
28నే బార్ అసోసియేషన్ ఎన్నికలు విశాఖ లీగల్: విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికలు ఈనెల 28న యథాతథంగా జరుగుతాయని ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది జి.ఎం.రెడ్డి వెల్లడించారు. ‘ప్రశ్నార్థకంగా న్యాయవాదుల సంఘం ఎన్నికలు’ శీర్షికతో ‘సాక్షి’ మంగళవారం ఓ వార్తను ప్రచురించింది. ఈ వార్తకు స్పందించిన జి.ఎం.రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. మరోవైపు కొత్తగా చేరిన న్యాయవాదులకు ఓటు హక్కు లేదని బార్ అసోసియేషన్ తెలిపింది. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు 2,970 న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. 28వ తేదీ ఉదయం 10 గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలై సాయంత్రం 4.30కు పూర్తవుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై రాత్రి పది గంటలకు తుది ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. అభ్యర్థులందరూ తమ ప్రచారాన్ని కొనసాగించుకోవచ్చని, ఏమైనా సందేహాలు ఉంటే తనను నేరుగా సంప్రదించాలని జి.ఎం.రెడ్డి సూచించారు. కాగా.. ఎన్నికలపై స్పష్టత రావడంతో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా అధ్యక్ష, కార్యదర్శి పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతీ న్యాయవాదిని వ్యక్తిగతంగా కలుస్తున్నారు. తమ అజెండాతో పాటు న్యాయవాదుల సంక్షేమానికి అందించే సేవల గురించి వివరిస్తున్నారు. -
● తీరంలో గుండె‘కోత’కు అడ్డుకట్ట
విశాఖ సాగరతీరం ఏటా కోతకు గురవుతోంది. దీని కారణంగా తీరం క్రమంగా తగ్గిపోవడం, తీర ప్రాంతంలోని కట్టడాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి, విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సముద్ర గర్భం నుంచి ఇసుకను వెలికి తీసి, పైపుల ద్వారా తీరానికి తరలిస్తోంది. కోతకు గురైన ప్రాంతాల్లో పోస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెజ్జర్ను డీసీఐ ఉపయోగిస్తోంది. ప్రస్తుతం కురుసుర సబ్మైరెన్ మ్యూజియం సమీపంలో ఈ పనులు జరుగుతున్నాయి. – ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ఇన్పుట్ ట్యాక్స్ స్వాహా!
● రెండేళ్ల క్రితం ఇంటర్ చదివి జులాయిగా తిరిగే యువకుడు చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ.. జీఎస్టీ లొసుగుల్ని పసిగట్టాడు. వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ మొదలైన నగరాల్లో ఏకంగా 20 ఫేక్ కంపెనీలు సృష్టించి.. పన్ను మోసాలకు పాల్పడేందుకు ఎత్తుగడ వేశాడు. ఈ సంస్థల నుంచి దేశంలోని వివిధ నగరాల్లోని కంపెనీలకు సరకు లావాదేవీలు జరిపినట్లు రూ.265 కోట్ల మేర నకిలీ ఇన్వాయిస్లు రూపొందించాడు. వీటిని ఉపయోగించుకొని రూ.31 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని సొంత చేసుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికే 10 కోట్ల వరకూ క్రెడిట్ చేసుకున్న యువకుడి వ్యవహారాన్ని చివరి నిమిషంలో బట్టబయలు చేశారు. ● బెంగళూరు కేంద్రంగా ఫ్లైవుడ్ పరిశ్రమ నడుపుతున్నట్లు మద్ది ప్రసాద్ అనే వ్యక్తి విశాఖపట్నం, ఇతర నగరాలకు కలప సరఫరా చేస్తున్నట్లుగా వ్యాపార లావాదేవీలు చూపించారు. దీనికి సంబంధించి ఏకంగా రూ.171.45 కోట్ల నకిలీ ఇన్వాయిస్లని సృష్టించి.. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను క్లెయిమ్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దీని ద్వారా రూ.30.85 కోట్ల విలువైన జీఎస్టీ ఎగవేసేందుకు పన్నాగం పన్నారు. దీనిపై దృష్టి సారించిన డీజీజీఐ బృందం.. ప్రసాద్ని అదుపులోకి తీసుకున్నారు.సిబ్బంది చేతివాటం ? ఫేక్ ఇన్వాయిస్లు సృష్టిస్తున్న కొందరు నకిలీ వ్యాపారులకు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ కార్యాలయాల్లోని కొందరు దిగువ స్థాయి సిబ్బంది సహకారం అందుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేక్ ఇన్వాయిస్లను పక్కాగా ఎలా తయారు చేయాలి..? వాటిని ఏ సమయంలో సమర్పిస్తే.. ఎవరికీ అనుమానం రాకుండా పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ జరగదు.. ఎలా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని సొంతం చేసుకోవచ్చు.. ఇలా.. సమగ్ర వివరాలతో స్కెచ్ వేస్తూ.. సక్రమంగా అమలయ్యేటట్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఫైల్స్ తమ దగ్గర నుంచే వెళ్లేలా చూస్కోని ఎవరికీ అనుమానం రాకుండా ఇన్పుట్ని కొట్టేస్తూ.. చెరిసగం పంచేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : నకిలీ ఇన్వాయిస్ల పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఫేక్ కంపెనీల పేరుతో పన్నుల చెల్లింపును ఎగవేసేలా వ్యూహాల్ని అమలు పరుస్తున్నారు. కొన్ని కంపెనీలు చిన్న చిన్న తప్పులతో దొరికిపోతుంటే.. చాలా మంది వ్యాపారులు మాత్రం దర్జాగా ఇన్పుట్ క్రెడిట్ని తమ ఖాతాల్లోకి జమ చేసుకుంటున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్(డీజీజీఐ) విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో దాదాపు 380కి పైగా నకిలీ కంపెనీల గుట్టు రట్టు చేసి రూ.300 కోట్లుకు పైగానే రికవరీ చేశారు. అయినా ఫేక్ కంపెనీలు నకిలీ ఇన్వాయిస్లతో రెచ్చిపోతున్నాయి. ఖజానాకు చిల్లు! ముఖ్యంగా స్టేట్ ట్యాక్స్ కార్యాలయంలోని కొందరు సిబ్బందితో పాటు సూర్యాబాగ్, సిరిపురం, ద్వారకానగర్, డాబాగార్డెన్స్, కురుపాం మార్కెట్, గాజువాక, అనకాపల్లి, చినవాల్తేరు సర్కిల్స్ పరిధిలో ఈ తరహా నకిలీ ఇన్వాయిస్లు ఎక్కువగా సృష్టించి.. ఇన్పుట్ క్రెడిట్ కుంభకోణంతో ఖజానాకు చిల్లు పెడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కంపెనీల్ని గుర్తిస్తున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మాత్రం.. ఏదో ఒక రూపంలో.. మోసం చేస్తూనే ఉన్నారు. కేవలం వ్యాపారుల వైపు నుంచి మాత్రమే ఉన్నతాధికారులు దృష్టిసారిస్తుండటంతో.. ఇంటిదొంగలెవరూ పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫేక్ కంపెనీలతో నకిలీ ఇన్వాయిస్ల సృష్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని సొంతం చేసుకునేందుకు వ్యాపారుల కుయుక్తులు విశాఖ డివిజన్ పరిధిలో రూ.కోట్లలో మోసాలు సహకరిస్తున్న కొందరు జీఎస్టీ సిబ్బంది ‘ఇన్పుట్’ను చెరో సగం పంచుకుంటున్న వైనం -
ఇఫ్తార్ సహర్ సోమ మంగళ 6.12 4.42
ప్రాణం తీసిన ఈత సరదా పెందుర్తి: వారాంతంలో స్నేహితులతో సరదాగా గడుపుదామని పార్టీకి వెళ్లిన ఓ వ్యక్తి మేహాద్రి రిజర్వాయర్ కాలువలో అసువులు బాశాడు. స్నేహితులతో సరదాగా ఈతకు దిగిన డబ్బీరు సాయిక్రాంతి(28) అనే వ్యక్తిని మృత్యువు కబళించింది. సీఐ కె.వి.సతీష్కుమార్ తెలిపిన వివరాలివి. గోపాలపట్నం సమీపంలోని బుచ్చిరాజుపాలేనికి చెందిన 9 మంది స్నేహితులు కోటనరవ సమీపంలోని ఎంఈఎస్ పంపు హౌస్ సమీపంలో ఉన్న మేహాద్రి రిజర్వాయర్ కాలువ వద్దకు పిక్నిక్కు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అందరూ కలిసి స్నానాలకు కాలువలో దిగారు. అయితే డబ్బీరు సాయిక్రాంతి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఆందోళనకు గురైన స్నేహితులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తక్షణమే గజ ఈతగాళ్లను రప్పించి సాయిక్రాంతి కోసం గాలించారు. మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
స్టీల్ప్లాంట్ నష్టాలకు కార్మిక నాయకులే కారణం
ఎంవీపీకాలనీ : విశాఖ స్టీల్ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లడానికి కార్మిక నాయకులే కారణమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. లాసన్స్ బే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ కార్మిక సంఘాల నాయకుల అనాలోచిత నిర్ణయాలు కారణంగానే ప్లాంట్కు నష్టం వాటిళ్లుతుందన్నారు. ఆయా కార్మిక సంఘాల నాయకుల ఆస్తులపై విచారణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రూ.11,400 కోట్లు నిధులు కేంద్రం స్టీల్ప్లాంట్కు కేటాయించినా కార్మిక నాయకులు అక్కడ ధర్నాలు చేసున్నారంటూ ఎద్దేవా చేశారు. అసలు అక్కడ నిరసన చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు ఎక్కడి నుంచి వచ్చారంటూ ప్రశ్నించారు. వారంతా రష్యా, చైనా బాగుండాలంటూ జెండాలు కట్టుకుని తిరిగే నాయకులంటూ ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీని పూర్తిగా ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమన్నారు. బీజేపీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడంలో భాగంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మాధవ్, పరశురామరాజు, ఆడారి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆయా నాయకుల ఆస్తులపై ప్రభుత్వం విచారణ జరపాలి బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు -
స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం
● రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం ● ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు మధురవాడ: కాపులుప్పాడ జీవీఎంసీ డంపింగ్ యార్డుకు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డంపింగ్ యార్డుకు అత్యంత సమీపంలో ఉన్న ఒక స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తను ఈ దుకాణంలో కంప్రెస్ చేసి, ప్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. అలాగే ఇక్కడ చెత్త నుంచి వివిధ రకాల పదార్థాలను వేరు చేసే కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రంగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే దుకాణం పరిసరాలకు వ్యాపించాయి. చెత్త, ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. నిర్వాహకులు, స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న వెంటనే తాళ్లవలస, నగరం నుంచి రెండు అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. పెద్ద ఎత్తున ఎగసిన మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 30 లక్షల విలువైన సామగ్రి, యంత్రాలు కాలిపోయాయని దుకాణ నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు భద్రం తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 1.15 నుంచి 2 గంటల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ చెత్త ఉన్న ప్రాంతంలో పడేయడం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని తెలిపారు. స్థానికులు మాత్రం చెత్తను తగలబెట్టడం వల్ల మంటలు స్క్రాప్ దుకాణానికి అంటుకుని ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ============ 23టివిఎల్37, మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది 23టివిఎల్37ఏ, 37ఏఏ, స్క్రాప్ దుకాణంలో ఎగసి పడుతున్న మంటలు -
విశాఖలో సినిమా నిర్మిస్తే హిట్టే..
అల్లిపురం: విశాఖలో ఏ చిత్రం నిర్మించినా విజయం సాధిస్తుందనే సెంటిమెంట్ తనకు ఉందని హీరో ప్రదీప్ మాచిరాజు అన్నారు. విశాఖ, అరకు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఆయన తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం హీరోయిన్ దీపిక, యూనిట్ నగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రదీప్ మాట్లాడారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపుదిద్దుకుందన్నారు. ఉదిత్ నారాయణ్ ఆలపించిన ‘ఎవ్వడో ఈడి కొచ్చినాడు సూడు’ అనే సూపర్హిట్గా నిలిచిందన్నారు. ఏప్రిల్ 11న వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన సాహిత్యం అద్భుతంగా ఉందని, సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ఓ పాటను మరింత శ్రావ్యంగా ఆలపించారని కొనియాడారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. హీరోయిన్ దీపిక మాట్లాడుతూ ఈ సినిమా కథ తన పాత్ర చుట్టూ తిరుగుతుందని, ప్రేక్షకులందరూ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’చిత్ర హీరో ప్రదీప్ మాచిరాజు -
ఆఖరి నిమిషంలో.. హంగామా
ఎంవీపీకాలనీ: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో జిల్లా బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించడం దుమారం రేపింది. 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గానూ స్వయం ఉపాధి కోసం బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, కమ్మ, ఆర్యవైశ్య ఇలా ఆ కార్పొరేషన్ పరిధిలోని అనేక అనుబంధ కార్పొరేషన్ల ద్వారా జిల్లాలోని వెనుకబడిన తరగతుల వారికి రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేసి, తొలుత దరఖాస్తులకు 22వ తేదీని చివరి తేదీగా పేర్కొంది. అయితే, తాజాగా మరో మూడు రోజులు దరఖాస్తు గడువును పొడిగించింది. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం, ఏడాది మొత్తం వదిలేసి ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో రుణాల నోటిఫికేషన్ విడుదల చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, గడువును పొడిగించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ రుణాలు లబ్ధిదారులకు అందుతాయా లేదా కేవలం ప్రచారం కోసమే కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్తో హడావిడి చేస్తుందా అనే ప్రశ్నలు లబ్ధిదారుల నుంచి సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 20,914 మంది దరఖాస్తులు స్వయం ఉపాధి, జనరిక్ ఫార్మసీలు, వివిధ కులవృత్తులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలైన 11 రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 20,914 ఆన్లైన్ దరఖాస్తులు(శనివారం సాయంత్రం 4 గంటల వరకు) వచ్చినట్లు బీసీ కార్పొరేషన్ కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం కేవలం 6,032 యూనిట్ల మంజూరు లక్ష్యాన్ని నిర్దేశించగా, వచ్చిన దరఖాస్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగియడానికి వారం రోజులే ఉండటంతో, ఈ భారీ సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాల ప్రక్రియ ప్రతి సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. అయితే ఈసారి మాత్రం 2024–2025 సంవత్సరానికి సంబంధించిన రుణాల ప్రక్రియను మార్చి చివరిలో ప్రారంభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు, కేవలం 11 రోజుల వ్యవధిలో 20 వేలకు పైగా దరఖాస్తులు రావడం వెనుక కూటమి నాయకుల హస్తం ఉందనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ హడావుడి నోటిఫికేషన్ ద్వారా తమకు కావాల్సిన వారికే రుణాలు మంజూరు చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ రుణాల మంజూరు ప్రక్రియలో పారదర్శకత లోపించే అవకాశం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో గందరగోళం ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో హడావుడిగా నోటిఫికేషన్ 2024–25 ఏడాది సబ్సిడీ రుణాలంటూ దరఖాస్తుల ఆహ్వానం ప్రభుత్వ తీరు, రుణాల మంజూరుపై సర్వత్రా అనుమానాలు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రుణాల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27 నాటికి రుణాలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మే 1 నాటికి మంజూరు ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలి. మే 11 నాటికి జియోట్యాగింగ్, మే 21 నాటికి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆదేశాలతో ముందుకు సాగుతున్నాం. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో నోటిఫికేషన్ విడుదలైన విషయం వాస్తవమే. అందుకే రెండు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించింది. – శ్రీదేవి, ఈడీ బీసీ కార్పోరేషన్ -
● విశాఖ తీరంలో మరో ఆకర్షణ
తుది దశకు హెలికాప్టర్ మ్యూజియం పనులు ఏయూక్యాంపస్: సాగరతీరంలో మరో పర్యాటక ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. బీచ్ రోడ్డులో ఇప్పటికే ఉన్న టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం పక్కనే యూహెచ్–3 హెచ్ హెలికాప్టర్ మ్యూజియం తుది మెరుగులు దిద్దుకుంటోంది. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో దాదాపు రూ. 2.2 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. భారత నావికాదళంలో 17 ఏళ్లపాటు అవిరళంగా సేవలందించిన ఈ హెలికాప్టర్ను కొద్ది నెలల కిందట విశ్రాంతినిచ్చారు. విపత్తుల సమయంలోనూ, తీర ప్రాంత భద్రతలోనూ ఇది ఎంతో కీలక పాత్ర పోషించింది. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించిన వీఎంఆర్డీఏ .. భారత నావికాదళ సత్తాను చాటి చెప్పేలా, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో సుందరీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. రానున్న రెండు వారాల్లో దీనిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హెలికాప్టర్ చుట్టూ పచ్చని లాన్లు, ప్రత్యేకమైన మొక్కలు, ఆకర్షణీయమైన నీటి ఫౌంటెన్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల్లో మరింత అందంగా కనిపించేలా దీని చుట్టూ అద్దాల నిర్మాణం చేపట్టారు. త్వరలోనే సందర్శన వేళలు, టికెట్ ధరల వివరాలను వీఎంఆర్డీఏ ప్రకటించే అవకాశం ఉంది. నేటి యువతరం సెల్ఫీలు, ఫొటోల పట్ల చూపిస్తున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మ్యూజియం లోపలి భాగాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. -
చందనోత్సవం సీఎఫ్వోగా భ్రమరాంబ
సింహాచలం : సింహగిరిపై వచ్చే నెల 30న జరిగే చందనోత్సవానికి దేవదాయశాఖ తరపున చీఫ్ ఫెస్టివల్ అధికారిగా ఆ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ దర్భముళ్ల భ్రమరాంబ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం దేవదాయశాఖ ప్రధానకార్యాలయం అడిషనల్ కమిషనర్ టి.చంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమరావతిలో దేవదాయశాఖ ప్రధాన కార్యాలయంలో ఆర్జేసీగా ఉన్న నిర్వర్తిస్తున్న భ్రమరాంబ మూడుసార్లు సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవోగాను, 2022 చందనోత్సవంలో చీఫ్ ఫెస్టివల్ అఽధికారిగా విధులు నిర్వర్తించారు. -
బలం లేకపోయినా అవిశ్వాసమా?
● మేయర్పై అవిశ్వాసం ఖండిస్తున్నాం ● దొడ్డి దారి రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య ● తమ పార్టీ కార్పొరేటర్లను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేస్తున్నారు ● కూటమి నేతలు చెప్పేవన్నీ శ్రీరంగనీతులు, చేసేవి అడ్డదారులు ● వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుసాక్షి, విశాఖపట్నం : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమికి సంఖ్యా బలం లేకపోయినా.. మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ దొడ్డిదారిన రాజకీయాలు చేయడం చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యని, వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లను ప్రలోభపెట్టి, లొంగకపోతే భయపెట్టి బలవంతంగా లాక్కొంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రజాప్రతినిధులు చెప్పేవన్నీ శ్రీరంగనీతులు.. చేసేవన్నీ పనికిమాలిన రాజకీయాలంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్ సీపీని అభిమానించే కార్పొరేటర్లంతా సమావేశానికి వచ్చారని.. కూటమి నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా మేయర్ పీఠాన్ని కదపలేరన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి కుళ్లు రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచన మానుకోవాలని హితవుపలికారు. కూటమి పార్టీలకు మెజారిటీ లేకపోయినా అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారంటే.. తమ పార్టీ కార్పొరేటర్లను ఏవిధంగా భయపెడుతున్నారో.. ప్రలోభపెడుతున్నారో అర్థమవుతుందన్నారు. మేయర్ పీఠం ఎలా కాపాడుకోవాలనే దానిపై వ్యూహ రచనలు చేశామని, తప్పనిసరిగా కాపాడే ప్రయత్నం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన ఉక్కు కాంట్రాక్టు కార్మికులు
గాజువాక : స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ ఆదివారం భారీ పాదయాత్ర నిర్వహించారు. ఉపాధి రక్షణ యాత్ర పేరుతో విశాఖ ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రలో కాంట్రాక్టు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగాజువాక జంక్షన్లో ప్రారంభమైన ఈ పాదయాత్ర గాజువాక మెయిన్రోడ్, పాతగాజువాక, శ్రీనగర్ మీదుగా కూర్మన్నపాలెంలోని ఉక్కు కార్మికుల దీక్షా శిబిరం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించడం దారుణమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి పార్టీలను నమ్మి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చిన కార్మికులకు కూటమి ప్రజాప్రతినిధులు మద్దతు నిలవకపోవడం సరికాదన్నారు. కష్టంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలవాలని సూచించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ను అమ్మడానికి, కార్మికులను తొలగించడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిందన్నారు. స్టీల్ప్లాంట్లో పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించడానికి ఆ ప్యాకేజీ వల్ల ఎలాంటి ఉపయోగంలేదన్నారు. స్టీల్ప్లాంట్ను కాపాడుతామని, నిర్వాసితులకు ఉపాధి ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి నాయకులు ఎన్నికల్లో గెలిచిన తరువాత మొహం చాటేస్తున్నారన్నారు. ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ ప్లాంట్ కోసం కార్మికులు 1500 రోజుల నుంచి ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం రూ.11,400 కోట్లు ప్యాకేజీ ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులను రోడ్డుపైకి నెట్టేయడం కోసం ప్రయత్నిస్తోందన్నారు. అందులోభాగంగా ఇప్పటికే వెయ్యి మందిని బయటకు పంపేసిందన్నారు. సెయిల్లో కలపడానికి గాని, సొంత గనులు కేటాయించడానికి గాని కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదని, అయినప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయకుండా ఉద్యోగులను తొలగిస్తోందన్నారు. కార్మికుల తొలగింపును ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, విశాఖ స్టీల్ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. గాజువాక నుంచి కూర్మన్నపాలెం వరకు ఉపాధి రక్షణ పాదయాత్ర తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ -
స్మార్ట్కు మించి!
● ప్రీమియం స్మార్ట్ఫోన్ల కొనుగోలుకువైజాగ్వాసుల ఆసక్తి ● అల్ట్రా ప్రీమియం ఫోన్ల వినియోగంలో 3వ స్థానంలో నగరం ● ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ నివేదికలో వెల్లడి ఈఎంఐ సౌకర్యంతో సులువుగా.. పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బుల చెల్లించి ఫోన్ కొనుగోలు చేసే విషయంలో మాత్రం వైజాగ్ వాసులు కాస్త జంకుతున్నారు. ఎంత ఖరీదైన ఫోన్ అయినా.. ఉందిగా ఈఎంఐ అంటూ వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లిస్తూ అల్ట్రా ప్రీమియంకి మారిపోతున్నారు. ప్రతి ఫోన్ కొనుగోలుపైనా ఈఎంఐ ఆఫర్లతో సెల్ఫోన్ షాపుల్లోనే కాకుండా..ఈ–కామర్స్ ప్లాట్ఫాంలలోనూ బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలు ఆకర్షిస్తుండటంతో పని సులువవుతోంది. 3 లేదా 6 నెలల చెల్లింపుపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఏడాది వాయిదాలు చెల్లిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంది.సాక్షి, విశాఖపట్నం : స్మార్ట్ఫోన్ ఇప్పుడు కేవలం అవసరం మాత్రమే కాదు.. ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది. ఒకప్పుడు ఫోన్ పాడైపోయే వరకు వాడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ ఫీచర్లు వస్తే చాలు.. రేటుతో పనిలేకుండా కొనాల్సిందే అనే రోజులు వచ్చేశాయి. ఎందుకంటే ఫోన్ ఇప్పుడు ఇంట్లో ఒక వస్తువు కాదు.. శరీరంలో ఒక భాగమైపోయింది. అందుకే వైజాగ్ ప్రజలు చాలా మంది చెబుతున్న మాట ఒక్కటే.. నా ఫోన్ స్మార్ట్ మాత్రమే కాదు.. ప్రీమియం.! ఈ విషయాన్ని ప్రముఖ మార్కెట్ పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ ధ్రువీకరించింది. ద్వితీయ శ్రేణి నగరాల్లోని ప్రజలు వాడుతున్న అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ల గురించి కౌంటర్ పాయింట్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సూరత్ మొదటి స్థానంలో నిలవగా, విశాఖ మూడవ స్థానంలో ఉండటం విశేషం. ఒకప్పుడు కేవలం మాట్లాడటానికి ఉపయోగపడే ఫోన్ ఇప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. అత్యాధునిక ఫీచర్లతో ప్రపంచాన్నే అరచేతిలో చూపిస్తోంది. అందుకే ప్రజలు కొత్త ఫోన్ కొనడానికి అంత ఆసక్తి చూపుతున్నారు. అద్భుతమైన ఫీచర్లు ఉంటే చాలు.. ధర గురించి ఆలోచించడం లేదు. కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇటీవల ఈ విషయాన్ని తెలిపింది. టైర్–2 నగరాల్లో అల్ట్రా ప్రీమియం స్మార్ట్ఫోన్ అమ్మకాలలో సిల్క్ సిటీ, డైమండ్ సిటీగా పేరొందిన సూరత్ ముందు వరసలో ఉంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన కోల్కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, చైన్నెని మించి మరీ ఇక్కడ ప్రీమియం స్మార్ట్ఫోన్ల విక్రయాలు జరుగుతుండటం విశేషం. దేశీయ మార్కెట్ వాటాలో సూరత్ 24 శాతం ఆక్రమించడం గమనార్హం. సూరత్లో ఎక్కువగా రూ.2,45,000 కంటే ఎక్కువ ధర గల స్మార్ట్ఫోన్ల విక్రయాలు జరుగుతున్నట్లు నివేదిక చెబుతోంది. ఆపిల్ ప్రో.. లేదంటే ఎస్ సిరీస్.. మహా విశాఖ నగరంలో ఆల్ట్రా ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో ఆపిల్, శాంసంగ్ పోటీపడుతున్నాయి. వీటి తర్వాత వన్ప్లస్, వివో, గూగుల్, షియోమీ ఫోన్ల కొనుగోలుపై నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆపిల్ 16, 16 ప్రోతో పాటు శాంసంగ్ ఎస్ 23, 24, 25 సిరీస్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని కౌంటర్ పాయింట్ సర్వే చెబుతోంది. ప్రతి 50 మందిలో ఒకరు రూ.1.50 లక్షకు మించి ధర పెట్టి కొనుగోలు చేసిన ఫోన్లను వాడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఏఐ ఆధారిత ఫీచర్లపై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో ప్రీమియం ఫోన్లను ఆశ్రయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. కెమెరా ఫీచర్ నచ్చితే చాలు హై ఎండ్ ఫీచర్లున్న ఫోన్లు వాడటమంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కెమెరా బాగుండాలి. ఇటీవల ఐఫోన్–16 ప్రో తీసుకున్నాను. దానికంటే ఎస్–24 ఆల్ట్రాలో కెమెరా అద్భుతంగా ఉందని చూశాను. ఇప్పుడు దానికి షిఫ్ట్ అవుతున్నాను. ప్రస్తుతం వస్తున్న ప్రీమియం ఫోన్లలో ఏఐ బేస్డ్ టెక్నాలజీతో పాటు కెమెరా వినియోగం కూడా వచ్చేసింది. టెక్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. – పుప్పాల మోహన లక్ష్మి, గృహిణి●వైజాగ్ వాసులూ.. ప్రీమియం ప్రియులే.! ద్వితీయ శ్రేణి నగరాల్లో అన్ని విభాగాల్లోనూ ముందు వరుసలో ఉండే విశాఖ.. ప్రీమియం ఫోన్ల కొనుగోళ్లలోనూ తక్కువేం కాదని నిరూపించుకుంది. సూరత్ తర్వాత జైపూర్ రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో విశాఖపట్నం నిలిచింది. రూ.1.50 లక్షల నుంచి రూ.2.45 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్ల కొనుగోళ్లలో వైజాగ్ మార్కెట్ వాటా 0.8 శాతంగా ఉంది. ప్రీమియం మోడళ్ల వైపు నగరవాసుల మార్పు ఏడాది పొడవునా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే వైజాగ్లో స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో ప్రీమియం ఫోన్ల విభాగం వాటా మే 2024లో 10 శాతం నుంచి అక్టోబర్లో 18 శాతానికి పెరగడం విశేషం. -
● ఎండు చేప.. వెండి మెరుపు
● బీళ్లు.. కన్నీళ్లు.! ● రంజాన్ శోభ● ఇద్దరా.. ఒక్కరా? బీచ్రోడ్డులో త్వరలో ప్రారంభం కానున్న హెలికాప్టర్ మ్యూజియం వద్ద ఒక దృశ్యం ఆసక్తికరంగా కనిపించింది. మెరిసే అద్దాలను శుభ్రం చేస్తున్న కార్మికుడి ప్రతిబింబం.. ఆ అద్దంలో స్పష్టంగా దర్శనమిచ్చింది. దూరం నుంచి చూసే వారికి అక్కడ ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారేమో అనే భ్రమ కలిగింది. పర్యాటకంగా ఎప్పుడూ సందడిగా ఉండే విశాఖ సాగర తీరంలో ఈ హెలికాప్టర్ మ్యూజియం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. –ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
● సాగర్తీరం కిటకిట
సాగరతీరం ఆదివారం సందర్శకులతో కళకళలాడింది. వారాంతం కావడంతో నగరవాసులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బంది పడినప్పటికీ, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగర ప్రజలు బీచ్ వైపు పరుగులు తీశారు. పిల్లలు ఇసుకలో ఆటలాడుకుంటూ, పెద్దలు తీరం వెంబడి నడుస్తూ ఆనందంగా గడిపారు. కొంతమంది సముద్రంలో స్నానాలు చేశారు. యువత తమ స్నేహితులతో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఆహార స్టాళ్లు సందర్శకులతో కిటకిటలాడాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
రిమాండ్ ఖైదీతో ‘యూఎస్ ఎంబసీ’ ములాఖత్
ఆరిలోవ: ఓ మహిళ ఆత్మహత్య కేసులో రిమాండ్లో ఉన్న యూఎస్ సిటిజన్ పిల్లా శ్రీధర్ను ములాఖత్లో భాగంగా యూఎస్ ఎంబసీ ప్రతినిధులు గురు వారం కేంద్ర కారాగారంలో కలిశారు. అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, బెయిల్, ఇతర సహాయంపై చర్చించినట్లు జైలు అధికారులు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. యూఎస్ పౌరసత్వం కలిగిన విశాఖ వాసి పిల్లా శ్రీధర్కు నగరంలో ఇటీవల జరిగిన ఓ మహిళ ఆత్మహత్య కేసులో కోర్టు రిమాండ్ విధించింది. విదేశీ పౌరసత్వం ఉండటంతో నిబంధనల మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్) ఎన్.సాయిప్రవీణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనతో ములాఖత్కు యూఎస్ ఎంబసీ నుంచి అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ స్పెషలిస్ట్ శ్రీదేవి పోలి, వైస్ కౌన్సిల్ క్రిస్టీ చార్లెస్ వచ్చినట్లు పేర్కొన్నారు. విదేశీయులు ఎవరు జైల్కు రిమాండ్కు వచ్చినా ఆ దేశ మంత్రిత్వ శాఖకు సమా చారం ఇవ్వాలన్నారు. ఇటీవల శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు యూఎస్ సిటిజన్లు బెయిల్పై విడుదలైనట్లు పేర్కొ న్నారు. వీరిద్దరు ఓ స్థల వివాదంపై రిమాండ్కు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర కారాగారంలో తొమ్మిదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నైజీరియాకు చెందిన ఓ ముద్దాయితో పా టు, సైబర్ నేరంలో అరెస్టయిన తైవాన్కు చెందిన ఇద్దరు ఖైదీలు ఉన్నట్లు డీఎస్ సాయి ప్రవీణ్ తెలిపారు. వీళ్లు వారి దేశంలో తమ కుటుంబ సభ్యులతో ఇ–ములాఖత్లో భాగంగా వీడియోకాల్ ద్వారా మాట్లాడుతుంటారని వెల్లడించారు. -
విశాఖ ఉక్కు ఉద్యమం @ 1500
● 2021 నుంచి అలుపెరగని పోరాటం ● నేడు దీక్ష శిబిరం వద్ద మానవహారం ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలోని స్టీల్ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉద్యమం శనివారం నాటికి 1500 రోజులు పూర్తవుతుంది. స్టీల్ప్లాంట్ను నూరు శాతం వ్యూహాత్మక అమ్మకం చేయాలని 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ నిర్ణయించింది. దీంతో ఉక్కు కార్మిక వర్గం భగ్గుమంది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పటి నుంచి కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో రెండు రోజులు ధర్నాలు చేశారు. జాతీయ రహదారిని పలుమార్లు దిగ్బంధించారు. స్టీల్ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడి, గేట్ల ముట్టడి చేపట్టారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా అమ్మకాల ప్రక్రియలకు ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజర్ల నియామకాలు చేపట్టింది. ఉక్కు ఉద్యమానికి కార్మిక సంఘాలు, రచయితలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు మద్దతు ఇస్తూ దీక్షల్లో పాల్గొంటున్నారు. దీక్షలు ప్రారంభించిన నాటి నుంచి ముఖ్యమైన ఘట్టాలను పరిశీలిస్తే.. 2021 ఫిబ్రవరి 3న వేలాది మంది కార్మికులు ఉక్కు పరిపాలన భవనాన్ని ముట్టడించారు. ఫిబ్రవరి 5న స్టీల్ప్లాంట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేశారు. ఫిబ్రవరి 12న సీపీఐ కార్యదర్శి నారాయణ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఫిబ్రవరి 17న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ విమానాశ్రయంలో పోరాట కమిటీ నాయకులతో సమావేశమై తమ సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో భారీ బహిరంగ సభ, జాతీయ రహదారి రాస్తారోకో, రెండు రోజులపాటు జాతీయ రహదారి దిగ్బంధం, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేత, చలో కలెక్టరేట్, 36 గంటల నిరాహార దీక్షలు తదితర కార్యక్రమాలు చేపట్టారు. రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు సంఘం నాయకుడు రాకేష్ తికాయిత్ విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ప్రముఖ సామాజిక వేత్త మేథా పాట్కర్ దీక్ష శిబిరానికి విచ్చేసి కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. అప్పటి నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నేడు మానవహారం : దీక్షలు ప్రారంభించి 1500 రోజులు పూర్తవుతున్న సందర్భంగా శనివారం సాయంత్రం దీక్ష శిబిరం వద్ద మానవహారం నిర్వహించనున్నట్టు పోరాట కమిటీ ప్రకటించింది. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించరాదన్న డిమాండ్లపై ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. -
మాజీ సర్పంచ్ భూమిలో టీడీపీ నేతల దౌర్జన్యం
పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమి నాయకుల దౌర్జన్యాల పరంపర కొనసాగుతోంది. పెందుర్తి మండలం జెర్రిపోతుపాలెం మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నేత కోన శ్రీనివాసరావుకు చెందిన డీ–ఫారం భూమిలోని సరుగుడు, అరటి తోటలను అదే గ్రామానికి చెందిన సర్పంచ్, టీడీపీ నేత మడక అప్పలరాజు, మరికొంత మంది నాయకులు ధ్వంసం చేశారు. అడ్డుకున్న శ్రీనివాసరావు, ఇతర గ్రామస్తులపై దాడికి పాల్పడినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలివీ.. జెర్రిపోతులపాలెం మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నేత కోన శ్రీనివాసరావుకు గ్రామానికి సమీపంలోని పెదగాడి సర్వే నంబర్ 420/1లో పిత్రార్జితంగా వచ్చిన డీ–ఫారం భూమి ఉంది. అందులోని కొంత భాగంలో సరుగుడు, అరటి తోట వేశారు. మిగిలిన భూమిలో కాయగూరలు పండిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సర్పంచ్ మడక అప్పలరాజు, టీడీపీ నాయకుడు గళ్ల శ్రీనివాసరావు, వారి అనుచరులు శ్రీనివాసరావుకు చెందిన భూమిలోకి చొరబడి మొక్కలను ఇష్టానుసారం నరికేశారు. సమాచారం అందుకున్న కోన శ్రీనివాసరావు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది. టీడీపీ నాయకుల దౌర్జన్యంపై పోలీసులకు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. తనకు టీడీపీ నాయకుల నుంచి ప్రాణ హాని ఉందని అందులో పేర్కొన్నారు. ఈ వివాదంపై టీడీపీ నాయకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెర్రిపోతులపాలెంలో సరుగుడు, అరటి చెట్ల తొలగింపు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు -
మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం
విశాఖ లీగల్: కేసుల రాజీకి మధ్యవర్తిత్వ ప్రక్రియ ఉపయుక్తంగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. ఐదు రోజులుగా జిల్లా కోర్టు నూతన ప్రాంగణంలోని సమావేశ మందిరంలో జరుగుతున్న న్యాయవాదుల మధ్యవర్తిత్వ శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. జిల్లాకు చెందిన న్యాయవాదులు, ప్రభుత్వ సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మధ్యవర్తిత్వ విషయంలో వెనుకబడి ఉందన్నారు. శిక్షితులైన న్యాయవాదులు కేసులను ప్రాథమిక స్థాయిలోనే పరిష్కరించే దిశగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఫలితాలను అందించాలన్నారు. మధ్యవర్తిత్వ జాతీయ శిక్షకురాలు ఎస్.అరుణాచలం మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఓ వెలుగు రేఖగా చెప్పారు. ఈ పక్రియ ద్వారా కేసులు రాజీ చేసుకుంటే బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నారు. మరో జాతీయ శిక్షకురాలు బీన దేవి మాట్లాడుతూ న్యాయవాదులందరూ మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగి ఉంటే కేసుల రాజీ సులభతరమవుతుందన్నారు. న్యాయస్థానాలపై భారం తగ్గించడం ద్వారా పెండింగు కేసులు సత్వర విచారణకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో 40 మంది న్యాయవాదులు, సిబ్బంది, విశాఖ జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎం.వి. శేషమ్మ పాల్గొన్నారు. -
‘వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు’కు వ్యతిరేకంగా నిరసన
సీతమ్మధార: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు’ను వ్యతిరేకిస్తూ విశాఖలో ముస్లింలు శాంతియుత నిరసన చేపట్టారు. యునైటెడ్ ముస్లిం ఫ్రంట్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. వీరికి పలు రాజకీయ పార్టీలు, హిందూ, క్రిస్టియన్, సిక్కు, ఆవాజ్, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రతినిధులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ గంగారావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఒక్కో బిల్లును ప్రవేశపెడుతోందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి వక్ఫ్ బోర్డు బిల్లుకు సవరణలు చేపట్టిందని దుయ్యబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు భూములు పూర్తిగా ముస్లింలకు చెందిన ప్రైవేట్ భూములన్నారు. సిక్కు సంఘం నేత సచ్చేంద్ర సింగ్ మాట్లాడుతూ తక్షణం బిల్లును ఉపసంహరించుకోకపోతే దేశంలో లౌకికవాదం పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం నేత అబ్దుల్ మునీర్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ, ఎస్టీల కంటే ముస్లింల పరిస్థితి దయనీయంగా ఉందని ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయన్నారు. తక్షణం వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యునైటెడ్ ముస్లిం ఫ్రంట్ ప్రెసిడెంట్ అబ్దుల్ మున్నన్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఇలియాస్, ఉపాధ్యక్షుడు అబ్దుల్ అహ్మద్, స్టేట్ మైనారిటీ యూత్ లీడర్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ గొల్లపల్లి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే చట్టాలు అవసరం
విశాఖ విద్య: ఆధునిక సాంకేతికత విసిరే సవాళ్లకు సమాధానమిచ్చే పటిష్టమైన చట్టాలను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ రావు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో శుక్రవారం జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ సమాజ అవసరాలకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు వస్తాయని తెలిపారు. శాసీ్త్రయ ఆవిష్కరణలు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాయని, అదే సమయంలో కొన్ని సవాళ్లను సైతం ఎదురవుతున్నాయని ఉదాహరణలతో వివరించారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా రూ.13 వేల కోట్ల విలువైన మత్తుపదార్థాలను పట్టుకున్నారని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం గురించి వివరించి.. సైబర్ నేరాలు, శిక్షలు ఏ విధంగా విధిస్తారనే అంశాలను తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విరివిరిగా వినియోగిస్తున్నారని.. దీనితో మేధో హక్కులకు భంగం కలిగే అవకాశం ఏర్పడుతోందన్నారు. యూరోపియన్ దేశాలు హక్కులను రక్షించడానికి కఠినమైన చట్టాలను రూపకల్పన చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భారత్లో ఈ రంగానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు ప్రస్తుతం లేవని, దీనిపై మేధో చర్చలు జరగాలని సూచించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ యువ న్యాయ విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామమన్నారు. వివిధ కేసుల్లో వచ్చే తీర్పులపై సాధారణ ప్రజలకు సైతం అవగాహన కల్పించే సులభమైన విధానాలను రూపొందించాలని సూచించారు. న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం మాట్లాడుతూ న్యాయ విద్యార్థులకు అవసరమైన ప్రత్యక్ష శిక్షణ, నైపుణ్యాలను అందించే విధంగా ఈ పోటీలు ఉంటాయని చెప్పారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 24 విద్యాసంస్థల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి అతిథులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విశ్రాంత న్యాయమూర్తి యు.దుర్గా ప్రసాద్రావును సత్కరించారు. ఆచార్య వై. సత్యనారాయణ, ఆచార్య వి. కేశవరావు, ఆచార్య ఎస్. సుమిత్ర, ఆచార్య వి. రాజ్యలక్ష్మి, ఆచార్య వి. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాదరావు ఏయూలో జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీలు ప్రారంభం -
అభివృద్ధి పనులకు స్థాయీ సంఘం ఆమోదం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయీ సంఘం సభ్యులు ఆమోదం తెలిపారని నగర మేయర్, జీవీఎంసీ స్థాయీ సంఘం చైర్పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. శుక్రవారం స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. 104 అంశాలు పొందుపరచగా, ఒక అంశాన్ని వాయిదా వేశారు. 2 అంశాలను సభ్యులు తిరస్కరించారు. మిగిలిన 101 అంశాలు ఆమోదం తెలిపారు. వీటిలో ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగానికి చెందిన పలు అభివృద్ధి పనులు ఉన్నాయని వాటిని చర్చించిన పిదప సభ్యులు ఆమోదం తెలిపారన్నారు. సమావేశంలో కార్యదర్శి బీవీ రమణ, వ్యయ పరిశీలకుడు సి.వాసుదేవరెడ్డి, జోనల్ కమిషనర్లు ప్రేమ ప్రసన్నవాణి, శివప్రసాద్, మల్లయ్యనాయుడు, బి.రాము, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు చిరంజీవి, గంగాధరరావు, సుధాకర్, అప్పారావు, సహాయ వైద్యాధికారులు డాక్టర్ ఎన్ కిషోర్, డాక్టర్ సునీల్కుమార్, డాక్టర్ కిరణ్కుమార్, డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ కృష్ణంరాజు పాల్గొన్నారు. -
మోగిద్దాం!
చీకటి గంటఎర్త్ అవర్కు పిలుపునిచ్చిన వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా నేటి రాత్రి 8.30 నుంచి గంట పాటు లైట్లు ఆర్పాలని పిలుపు విశాఖ సర్కిల్ పరిధిలో ఆ గంట సేపట్లో 5 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా వాతావరణ మార్పు జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఏటా ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో నిర్వహిస్తున్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ వార్మింగ్ కారణంగా జీవవైవిధ్య ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో భూమిని పరిరక్షించేందుకు ఏటా నిర్వహిస్తున్న కార్యక్రమమే ఎర్త్ అవర్. విద్యుత్ ఆదా చెయ్యడం అంటే.. పర్యావరణాన్ని కాపాడడమే. అందుకే ప్రతీ సంవత్సరం ఒక గంట కరెంటు సరఫరా ఆపేసి.. ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు. శనివారం ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అనే సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విశాఖలోనూ ఈ బృహత్తర ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. భూమిపై ఉన్న ప్రేమ, వాతావరణాన్ని కాపాడటంలో బాధ్యతగా మొదలైన ఒక చిన్న కార్యక్రమమే.. కాలక్రమంలో పెద్ద ఉద్యమంగా మారింది. అదే ఎర్త్ అవర్. ప్రతి సంవత్సరం ఒక రోజున ఒక గంట పాటు నగరంలో మొత్తం విద్యుత్ వాడకాన్ని ఆపేసి ఈ ఎర్త్ అవర్ను పాటిస్తుంటారు. ఈసారి మార్చి 22న అంటే.. ఇవాళ రాత్రి సరిగ్గా 8.30 నుంచి 9:30 గంటల వరకు ఈ ఎర్త్ అవర్ను పాటించి.. పర్యావరణ పరిరక్షణకు మేము సైతం ముందుకు రావాలంటూ పర్యావరణ వేత్తలు పిలుపునిస్తున్నారు. ఆ ఒక్క గంటలో 5 లక్షల యూనిట్లు ఆదా భారత్ ఈ ఎర్త్ అవర్లో 2011 నుంచి పాలుపంచుకుంటోంది. ప్రతి ఏటా ఆయా నగరాలు, ప్రాంతాలు గంట పాటు చీకటిగంటని కొట్టి భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించేందుకు నడుంబిగిస్తున్నాయి. విశాఖలోనూ ప్రతి ఇల్లూ ఈ ఎర్త్ అవర్ పాటిస్తే.. లక్షల యూనిట్ల విద్యుత్ను ఆదా చెయ్యవచ్చు. సాధారణంగా ఈపీడీసీఎల్ పరిధిలో విశాఖ సర్కిల్లో ప్రతి రోజూ 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. అంటే.. గంట సేపు విద్యుత్ దీపాలు సర్కిల్ పరిధిలో ఆపేస్తే.. ఏకంగా 5 లక్షల యూనిట్లు ఆదా చెయ్యడంతో పాటు.. 0.82 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు కూడా నియంత్రించవచ్చు. ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఈపీడీసీఎల్ అధికారులు సైతం పిలుపునిస్తున్నారు. అసలు ఎందుకు లైట్లు ఆర్పాలంటే..? వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమ అసలు లక్ష్యం. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబాలిక్ లైట్స్ అవుట్ కార్యక్రమంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ఈ కార్యక్రమాన్ని పాటిస్తూ.. ప్రపంచ ఉద్యమంగా మారింది. ఈ క్రమంలోనే.. విశాఖపట్నంలోనూ కూడా ఈ కార్యక్రమాన్ని పాటిస్తున్నారు. వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ (డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పర్యావరణ ఉద్యమాన్ని ప్రతి సంవత్సరం మూడో శనివారం పాటిస్తుంటారు. రూ.25 లక్షల విలువైన విద్యుత్ ఆదా పర్యావరణ పరిరక్షణ కోసం సంవత్సరానికి ఒకసారి నిర్వహించే కార్యక్రమమే ఈ ‘ఎర్త్ అవర్’. ఇందులో ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడూ భాగస్వామి కావాలి. భూగోళాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా చాలా నగరాల్లో ప్రధాన ప్రదేశాలలో ఒక గంట విద్యుత్తు స్వచ్ఛంధం ఆపేస్తారు. అదేవిధంగా ఇళ్లల్లో విద్యుత్ ఉపకరణాలు ఆపివేయడం ద్వారా కర్బన ఉద్గారాలు తగ్గించవచ్చు. తద్వారా విద్యుత్తును ఆదా చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించే విధంగా ఉపయోగపడుతుంది. విద్యుత్తు ఆదా సమస్త జీవరాసులనీ కాపాడేందుకు, మన తరాన్నీ, భవిష్యత్తు తరాలను కాపాడేందుకు ఉపకరిస్తుంది. గంటపాటు విద్యుత్ ఆపితే సర్కిల్ పరిధిలో రూ.25 లక్షల విలువైన విద్యుత్ను ఆదా చెయ్యగలం. – శ్యామ్బాబు, ఈపీడీసీఎల్ విశాఖసర్కిల్ ఎస్ఈ ప్రతి ఒక్కరూ ఎర్త్ అవర్ పాటించండి పెరుగుతున్న పర్యావరణ సమస్యలు, రోజువారీ విద్యుత్ వినియోగం యొక్క ప్రభావం గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా ఎర్త్ అవర్ అనే గ్లోబల్ గ్రాస్రూట్ ఉద్యమం నిర్వహిస్తున్నాం. వ్యక్తులు, సంస్థలు, కమ్యూనిటీలు.. భూ పరిరక్షణతో పాటు వ్యక్తిగత జీవనశైలిలో మార్పు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకోసమే.. గంట సేపు అనవసరమైన లైట్లను ఆఫ్ చేయాలని పిలుపునిస్తున్నాం. కేవలం విశాఖ నగరంలోనే కాకుండా.. జిల్లా అంతటా పాటించాలని వైజాగ్ ప్రోగ్రాం అధికారి హనీసెలజ్ సహకారంతో అవగాహన కల్పించాం. ప్రతి ఒక్కరూ ఎర్త్ అవర్ పాటించాలని వేడుకుంటున్నాం. – ఫరీదా టాంపల్, డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్ -
విశాఖ అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్ష
మహారాణిపేట: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని విశాఖలో అభివృద్ధి చర్యలు చేపట్టాల్సి ఉందని, దానికి తగినట్లు అక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నగర అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ అమలు, డీటీఆర్ బాండ్ల జారీ తదితర అంశాలపై శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన సమీక్షించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ విశాఖలో టీడీఆర్ బాండ్ల జారీలో మరింత వేగం పెంచాలని, చాలా వరకు పెండింగ్ ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై జీవీఎంసీ కమిషనర్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నెల రోజుల్లోగా పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్ల జారీ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించారు. మెట్రో, మెట్రో లైట్, మోడరన్ ఎలక్ట్రిక్ బస్ కారిడర్లపై ప్రధానంగా చర్చించారు. మాస్టర్ ప్లాన్ మార్పులు, చేర్పులపై చర్చ మాస్టర్ ప్లాన్లో మార్పులు, చేర్పులపై ఎమ్మెల్యేలతో మంత్రి చర్చించారు. గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్పై పునరాలోచన చేయాలని, తప్పకుండా మార్చాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. రోడ్ల విస్తరణ అవసరం ఎంత మేరకు ఉందో అంతవరకే ప్లాన్ అమలు చేయాలని, భూసేకరణ చేపట్టాలని ఎమ్మెల్యేలు సూచించారు. డబుల్ డెక్కర్ రోడ్లు, మెట్రో కారిడార్ నిర్మించేందుకు యోచిస్తున్నామని, అతి త్వరలోనే ముఖ్యమంత్రి సూచనల మేరకు కార్యాచరణ ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
మధురవాడ: విశాఖ రూరల్ మండల కొమ్మాది వెంకట్నగర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన షెడ్లను రెవెన్యు అధికారులు తొలగించారు. కోర్టు వివాదంలో ఉండి రద్దు అయిన డి. పట్టా భూముల్లో ఏర్పాటు చేసిన కోళ్ల ఫారం, ఇతర షెడ్లను శుక్రవారం నేల మట్టం చేశారు. ఆక్రమణదారులతో రెవెన్యూలోని కొందరు దిగువ స్థాయి అధికారులు లాలూచీ పడడంతో కబ్జాలపర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో సుమారు రు.40 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమికి రెక్కలొచ్చాయి. ఈ అక్రమ వ్యవహారంపై సాక్షి దినపత్రికలో ‘రూ.40కోట్లు సర్కారు భూమికి రెక్కలు’ అనే శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధిలేని పరిస్థితిలో ఆక్రమణదారులతో లాలూచీ పడిన రెవెన్యూ అధికారులు పరుగులు తీశారు. కొమ్మాది సర్వే నంబరు. 157/1లో 3.9 ఎకరాల భూమిలో షెడ్లు, ఇతర నిర్మాణాలను ఆర్ఐ అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో పలువురు వీఆర్వోలు, వీఆర్ఏలు ఇతర సిబ్బంది కూల్చివేశారు. ఆక్రమణదారులు నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. దీనిపై తహసీల్దారు పాల్కిరణ్ స్పందిస్తూ ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. అయితే ఈ భూమి కోర్టు వివాదంలో ఉందని, కోర్టు ఆదేశాలకు భిన్నంగా నిర్మాణాలు చేస్తుండడంతో చర్యలు చేపట్టినట్టు చెప్పారు. బాధ్యులపై చర్యలు ఎక్కడ? కోర్టు ఆదేశాలు ధిక్కరించి కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించేస్తున్న అక్రమార్కులపై, ఇంతటి విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోకుండా, అక్రమార్కులకు అండగా నిలుస్తున్న రెవెన్యూలోని దిగువ స్థాయి అధికారులు, సిబ్బందిపై చర్యలు చేపట్టక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
మెట్లు కూలి మహిళా కూలీ మృతి
ఐఏఎస్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా శ్రీధర్ విశాఖ సిటీ: ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ(ఐఏఎస్) గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా తొలిసారిగా తెలుగువారైన డాక్టర్ శ్రీధర్ గంగవరపు ఎన్నికయ్యారు. మెడికవర్ ఆస్పత్రిలో ఆర్థ్రోస్కోపీ కీ హోల్ స్టెషలిస్ట్ అయినా శ్రీధర్ 2025 నుంచి 2027 వరకు ఐఏఎస్ సభ్యుడిగా కొనసాగనున్నారు. ఐఏఎస్ ఎన్నికల్లో తొలిసారిగా తెలుగు వ్యక్తి గెలవడం రాష్ట్రానికి గర్వకారణమని మెడికవర్ ముఖ్య అధికారులు, వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. పీఎంపాలెం: నిర్మాణంలో ఉన్న భవనం మెట్లు కూలిపోయిన ఘటనలో మహిళా కూలీ సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలైంది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 8వ వార్డు పరిధి పనోరమ హిల్స్ వద్ద ఐకానికా గ్రాండ్ విల్లా నంబరు 121 నిర్మాణంలో ఉంది. ఈ భవనం మెట్ల నిర్మాణ లోపం కారణంగా రెండవ అంతస్తు నుంచి కూలిపోయి.. అదే భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో పని చేస్తున్న మహిళా కూలీ నీలరోతు రామలక్ష్మిపై పడ్డాయి. విజయనగరం జిల్లా మొరకముడిదాం మండలం వేముల గ్రామానికి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే ఘటనలో విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చౌడంతవలస గ్రామానికి చెందిన టి.ఆదినారాయణ వెన్నుపూస దెబ్బతింది. భీమిలి చేపలుప్పాడకు చెందిన కోడా అమ్మాజమ్మ కాలు విరిగి బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాయత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇద్దరికి గాయాలు -
ఉపాధి హామీ పథకంపై సమీక్ష
మహారాణిపేట: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈ పథకం పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షించారు. సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ కాన్ఫరెన్స్లో పాల్గొని.. జిల్లాలో చేపడుతున్న చర్యలు వివరించారు. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కె.వి.వి.చౌదరి, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాసరావు, డీపీవో శ్రీనివాసరావు, డ్వామా అధికారులు పాల్గొన్నారు. ‘యువర్ ప్లాట్ఫాం’ మ్యాగజైన్ ప్రారంభం -
ముస్లింలపై కూటమి కక్ష సాధింపు
● హజ్ యాత్రీకులకు గన్నవరం ఎయిర్పోర్టులో ఎంబార్కేషన్ పాయింట్ రద్దు చేయడం తగదు ● వైఎస్సార్ సీపీ నేతలు మహమ్మద్ ఇమ్రాన్, భర్కత్ అలీ, జహీర్ అహ్మద్ సాక్షి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లింలపై కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షుడు భర్కత్ అలీ, సీనియర్ నాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్ మండిపడ్డారు. హజ్ యాత్రీకుల సౌలభ్యం కోసం విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్టులో ఎంబార్కేషన్ పాయింట్లు రద్దు చేసిందని, ఇది రంజాన్ మాసంలో రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘వెన్ను పోటు’ తోఫా అని విమర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముస్లిల పక్షపాతి వైఎస్ జగన్ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఏపీ నుంచి బయలుదేరే యాత్రికులకు గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లేలా ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గతంలో హజ్ యాత్రలో భాగంగా 2,873 యాత్రీకులకు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 14.04 కోట్లు నిధులు కేటాయించడమే కాకుండా వివిధ ఎంబార్కేషన్ పాయింట్లు నుంచి బయలుదేరిన వారికి కూడా ఆర్థిక చేయుతనిచ్చిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకపోగా కనీసం గన్నవరం విమాశ్రయం నుంచి వెళ్లే వీలు లేకుండా చేయడం దారుణమన్నారు. కో–ఆప్షన్ సభ్యుడు మహ్మద్ షరీఫ్, షేక్ బాబ్జి, ఆప్రోజ్ లతీష్, ముజీబ్ ఖాన్, ఎండీ నౌషాద్, ఎండీ ముక్బాల్ పాల్గొన్నారు. -
‘పీజీఆర్ఎస్’ వినతులపై నిర్లక్ష్యం వద్దు
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన వినతులపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఈనెల 18న సాక్షి దిన పత్రికలో ‘ప్రజా ప్రదక్షిణ’లే అన్న శీర్షికతో వార్త ప్రచురితమైన సంగతి విధితమే. దీనిపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ స్పందించారు. సాక్షి కథనంలో తమ అభిప్రాయాలను వెల్లడించిన వారి సమస్యలు తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను పరిష్కరించడంలో ఎవరు అలసత్వం ప్రదర్శించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సంబంధిత విభాగాలు, పలు శాఖల అధికారులు ఫిర్యాదుల పరిష్కారంపై తక్షణం నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
కనులపండువగా శ్రీవారి ఆలయ వార్షికోత్సవం
కొమ్మాది: రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం(టీటీడీ) తృతీయ వార్షికోత్సవం గురువారం కనులపండువగా సాగింది. ఉత్సవంలో భాగంగా ఉదయం 5 గంటల నుంచి 5.30 వరకు సుప్రభాతం, 5.30 నుంచి 7 గంటల వరకు తోమాల సహస్ర నామార్చన, మొదటి అర్చన నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో భగవత్ అనూజ్ఞ, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, హోమం, ఉత్సవ మూర్తులకు అష్టోత్తర శత కలశ స్నపనం, పూర్ణాహుతి, అక్షతారోపణం, స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ కనులపండువగా తిరుచ్చి ఉత్సవం జరిగింది. టీటీడీ అర్చకులు, వేద పండితులు ఉత్సవ మూర్తులను ఊరేగిస్తుండగా.. భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ నాటక ప్రదర్శన, భక్తుల కోలాటాలు, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణలు, పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ఇన్స్పెక్టర్లు శివకుమార్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు డీఆర్ఎం బంగ్లా ఖాళీ
సాక్షి, విశాఖపట్నం : లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన వాల్తేరు పూర్వ డీఆర్ఎం సౌరభ్కుమార్ ప్రసాద్ ఎట్టకేలకు విశాఖలోని తన నివాసాన్ని ఖాళీ చేశారు. గతేడాది నవంబర్లో ముంబయిలోని ఓ కాంట్రాక్టు సంస్థకు చెందిన వ్యాపారుల నుంచి లంచం తీసుకుంటూ సౌరభ్కుమార్ దొరికిపోయిన సంగతి తెలిసిందే. రూ.25 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారులు అంగీకరించడంతో పుణేలో లంచం తీసుకుంటూ కేంద్ర దర్యాప్తు సంస్థకు రెడ్ హ్యాండెడ్గా సౌరభ్కుమార్ దొరికిపోయారు. అప్పటి నుంచి సీబీఐ జైలులోనే సౌరభ్కుమార్ ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. చివరికి సొంత పూచీకత్తుతో గత నెల 28న బెయిల్ మంజూరు చేసింది. తాజాగా.. లలిత్ బోరా డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. నివాస గృహం అవసరమైంది. అయితే గత డీఆర్ఎం ఖాళీ చేయకపోవడంతో గెస్ట్హౌస్లో నివాసముంటున్నారు. రైల్వే బోర్డు ఆదేశించడంతో సౌరభ్కుమార్ ఎట్టకేలకు గురవారం సాయంత్రం డీఆర్ఎం బంగ్లాను ఖాళీ చేశారు. బంగ్లాలో ఉన్న తన ఇంటి సామగ్రిని తీసుకువెళ్లినట్లు వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు. -
రూ.40 కోట్ల
సర్కారు భూమికి రెక్కలుకొమ్మాదిలో సుమారు 3.9 ఎకరాలు కబ్జా చేసేస్తున్న తెలుగు తమ్ముళ్లు● నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించిన హైకోర్టు ● అయినా డీ పట్టా భూముల్లో దర్జాగా ఆక్రమణలు ● సహకరిస్తున్న భీమిలి రెవెన్యూ అధికారులు ● ఉన్నతాధికారులకు మాత్రం నిర్మాణాలు ఆపేశామంటూ నివేదికలు అక్రమార్కులకు రెవెన్యూ అధికారి అభయం! ఆర్డీవో, తహసీల్దార్ ఆదేశించినా.. స్థానిక రెవెన్యూ అధికారి మాత్రం భూ కబ్జాదారులకు అభయహస్తమిచ్చేశారు. ‘మీ నిర్మాణాల పని మీరు కానివ్వండి.. ఎవరు ఆపుతారో నేనూ చూస్తానన్నట్లు’గా అండగా నిలబడ్డారు. తహసీల్దార్, ఆర్డీవో, జేసీ ఎవరు వచ్చినా.. నేను చూసుకుంటానంటూ.. అందరూ నా మాటే వింటారని సదరు రెవెన్యూ అధికారి చెబుతుండటం గమనార్హం. దీంతో కోళ్ల ఫారం నిర్మాణాలు చకచకా సాగిపోతున్నాయి. ఉన్నతాఽధికారులు సర్వే నం.157/1 భూమి పరిస్థితి ఏంటని అడిగితే మాత్రం.. ప్రభుత్వ ఆధీనంలో ఉంది.. ఎలాంటి నిర్మాణాల జరగడం లేదని తప్పుడు నివేదికలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఆక్రమణలు చేపడుతున్న కబ్జాదారుల నుంచి రూ.లక్షలు దండుకొని రెవెన్యూ సిబ్బంది పంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదల ఇళ్లు, చిన్న చిన్న దుకాణాలపై ప్రతాపం చూపిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం.. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే మాత్రం.. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం : విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని వెంకట్నగర్ సమీపంలో కొమ్మాది సర్వే నం.157/1లో 3.93 ఎకరాల డి–ఫారం పట్టా భూమి అక్రమార్కుల చేతుల్లో చిక్కుకుంది. నాలుగైదు దశాబ్దాల క్రితం పైడితల్లి అనే వ్యక్తి ఈ భూమి సాగుచేసుకునేవారు. అప్పట్లో ఆయనకు డీ–పట్టా ఇచ్చారు. సదరు పైడితల్లి తర్వాత ఈ భూమిని వదిలేశారు. అప్పటి నుంచి ఇది ప్రభుత్వ భూమిగా రికార్డుల్లోనే ఉంది. గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ ప్రభుత్వ ఇళ్లు నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ.. ఈ ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి టీడీపీ నేతల కన్ను ఈ భూమిపై పడింది. గంటాకు సన్నిహితులం, 6వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడి అనుచరులమంటూ కొందరు ఈ భూమిని ఆక్రమించేందుకు పన్నాగం పన్నారు. గతంలో పైడితల్లికి ఇచ్చిన పట్టా మాదిరిగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అధికారులు ఈ భూమిని కాపాడారు. దీంతో సదరు భూ కబ్జాదారులు కొందరు రెవెన్యూ అధికారుల సూచనలతో కోర్టుకు వెళ్లారు. అయితే.. ఇది పక్కాగా ప్రభుత్వ భూమిగా రికార్డులు స్పష్టం చేస్తుండటంతో కోర్టు స్టేటస్కో ఇచ్చింది. ప్రభుత్వం మారిన వెంటనే.. ప్రస్తుతం ఈ స్థల వివాదం న్యాయస్థానంలో ఉంది. యథాతఽఽథ స్థితిగా భూమిని ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. అయినా.. ఓ రెవెన్యూ అధికారి అండతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. చుట్టూ ఫెన్సింగ్ మాదిరిగా వేసేసి.. భూమిని చదును చేసేశారు. కోళ్లఫారం ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలు కూడా చకచకా సాగిపోతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయ సిబ్బంది ఆ నిర్మాణాలను అడ్డుకున్నారు. తగిన ధ్రువపత్రాలతో తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని నోటీసులు జారీ చేశారు. అయినా ఆగకుండా నిర్మాణాలు చేస్తుండటంతో ఆర్డీవోకి ఫిర్యాదు వెళ్లింది. ఇటీవలే ఆర్డీవో సంగీత్ మాథుర్ స్థలాన్ని పరిశీలించి వెంటనే నిర్మాణాలు ఆపించేసి మొత్తం తొలగించాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వెంటనే నిర్మాణాలు ఆపేశారు. -
క్యాష్ కొట్టు.. స్టాఫ్ నర్స్ పోస్టు పట్టు
● నర్సింగ్ పోస్టులకు కూటమి నాయకుల బేరాలు ● పోస్టుకు రూ.3 లక్షల నుంచిరూ.5 లక్షల వరకు వసూళ్లు ● రెండు రోజుల్లో మెరిట్ జాబితా.. 31లోగా తుది జాబితా మహారాణిపేట: స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీలో పైరవీలు జోరందుకున్నాయి. ఈ పోస్టులను కూటమి నేతలు ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వంత పాడుతూ పైరవీలకు తెరతీస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ అనుకూలురికి పోస్టులు కట్టబెట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్(ఆర్డీ) మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు సిఫార్సుల లేఖలు, మరో వైపు ప్రజాప్రతినిధులు, వారి పీఏలు ఫోన్లు మీద ఫోన్లతో ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. బేరసారాలు : ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో 106 స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఏడాది కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. 8,309 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 88 మంది చొప్పున పోటీ నెలకొనడంతో కూటమి నేతల పంట పండినట్లయింది. ఒక్కో పోస్టు కోసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ ఆధ్వర్యంలో ప్రొవిజినల్ జాబితా మీద వచ్చిన 1,530 అభ్యంతరాల వడపోత కార్యక్రమం జరుగుతోంది. రెండు రోజుల్లో మెరిట్ జాబితా వెల్లడికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 31 లోపు రోస్టర్ ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని అధికారులు కసరత్తు చేపట్టారు. రంగంలోకి దళారులు : మరోవైపు దళారులు కూడా రంగంలోకి దిగారు. దరఖాస్తుదారుల్ని మాయ మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇవ్వడంతోపాటు, కార్యాలయ సిబ్బందితో బేరాలకు దిగుతున్నారు. కార్యాలయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వారి ద్వారా పోస్టులకు ధర నిర్ణయిస్తున్నారు. వీరు కూడా పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ అడ్వాన్స్ ముడుపులిచ్చేవారికే పోస్టింగ్ అంటూ నమ్మబలుకుతున్నారట. దళారులను నమ్మొద్దు పోస్టుల భర్తీ మెరిట్ ప్రకారమే జరుగుతుంది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. అర్హత ప్రమాణాలు, మెరిట్, రోస్టర్ ప్రకారం ప్రాథమిక ఎంపిక జాబితా సిద్ధం చేస్తున్నాం. దీనిపై కూడా అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించాకే తుది ఎంపిక జాబితాను వెల్లడిస్తాం. – డాక్టర్ రాధారాణి, ఆర్డీ, వైద్య ఆరోగ్యశాఖ -
ఐఐఎంవీలో నూరుశాతం ప్లేస్మెంట్స్
తగరపువలస: ఐఐఎంవీ 2024–2026 బ్యాచ్ నూరుశాతం నియామకాలతో వేసవిని విజయవంతంగా ముగించినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ వేసవి ప్లేస్మెంట్ ప్రక్రియలో 344 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. 130 మంది రిక్రూటర్లు నియామక జాబితాలో చేరారన్నారు. వీరిలో 77 మంది కొత్తగా తమతో భాగస్వామ్యం పొందారన్నారు. కెరీర్ డెవలప్మెంట్ సర్వీసెస్ చైర్పర్సన్ దీపికా గుప్తా మాట్లాడుతూ అంచనాలు అధిగమించి నూరు శాతం ఫలితాలు సాధించామన్నారు. గతేడాదితో పోలిస్తే స్టైఫండ్లో 45.83 శాతం గ్రోత్ ఉందన్నారు. రుషికొండ బీచ్లో పనులు త్వరితగతిన పూర్తి చేయాలి కొమ్మాది : రుషికొండ బీచ్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి గురువారం పరిశీలించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టూరిజం అధికారులకు సూచించారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట ఆర్డీ జగదీష్, ఏఎంఓహెచ్ కిశోర్ తదితరులు ఉన్నారు. నేడు జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశండాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. నగర మేయర్, స్థాయి సంఘం చైర్పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన ఉదయం 11 గంటల నుంచి జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశ మందిరంలో నిర్వహించనున్న సమావేశంలో 104 అంశాలు సభ్యుల ముందుకు చర్చకు రానున్నాయి. పలు అభివృద్ధి అంశాలతో పాటు ఉద్యోగుల సర్వీస్ అంశాలు చర్చకు రానున్నాయి. -
కుట్ర
వైఎస్సార్ పేరు తొలగింపులో ● క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ ధర్నా ● ఏసీఏ 48 గంటల్లో సమాధానం చెప్పాలని డిమాండ్ఏసీసీలో తిష్ట వేసిన టీడీపీ ఎంపీల ఒత్తిడితోనే.. వైఎస్సార్ పేరును ఏసీఏ తొలగించిందా? లేదంటే కూటమి ప్రభుత్వం ఒత్తిడితో తొలగించారా? 48 గంటల్లో సమాధానం చెప్పాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏసీఏలో రెండు కీలక పదవుల్లో టీడీపీకి చెందిన ఎంపీలు ఉన్నందునే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారనేది స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం రాజకీయ పదవుల్లో ఉన్నవారు క్రికెట్ అసోసియేషన్లకు బాధ్యత వహించకూడదనేది ఉందని, దానిని కూడా ఉల్లంఘించి టీడీపీ ఎంపీలు ఏసీఏలో తిష్టవేశారన్నారు. గుర్తులు చెరిపేయాలనే.. కూటమి ప్రభుత్వం వైఎస్సార్ పేరును చూస్తేనే ఉలిక్కిపడుతోందని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేరరెడ్డి విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దారన్నారు. ఆయన కృషిని గుర్తించి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఈ ప్రాంతంలో స్టేడియంకు వైఎస్సార్ పేరు పెడితే ఇప్పుడు దానిని కూడా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారన్నారు. సాక్షి, విశాఖపట్నం : పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించేందుకు చేస్తున్న కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. స్టేడియం ఆధునీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఎంట్రన్స్ ఆర్చ్పై వైఎస్సార్ పేరు తొలగింపునకు నిరసిస్తూ గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తొలుత మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లతో కలిసి ఆయన స్టేడియం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నల్ల రిబ్బన్లతో ఆందోళన చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ ఆనవాళ్లను తుడిచేయాలని సీఎం చంద్రబాబు అనుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. 2009 సెప్టెంబర్ 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగారాజు ఆధ్వర్యంలో ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంగా మార్చినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ మార్క్, బ్రాండ్ కనబడకూడదనే కుట్రతోనే పేరును తొలగిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన సీతకొండ వ్యూ పాయింట్కు వైఎస్సార్ పేరు పెడితే దాన్ని తొలగించారని మండిపడ్డారు. విశాఖ ఫిల్మ్నగర్ క్లబ్ లాన్కు వైఎస్సార్ పేరు తొలగించారని, ఇవే కాకుండా ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక చోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేశారన్నారు. ముఖ్య నాయకులకు బెదిరింపు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ ఆందోళన చేయనున్న నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. నిరసన కార్యక్రమానికి ఎవరినైనా తీసుకెళ్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, అన్నంరెడ్డి అదీప్రాజ్, కె.భాగ్యలక్ష్మి, శోభా హైమావతి, నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్వెస్లీ, పేర్ల విజయచంద్ర, పార్టీ ముఖ్య నాయకులు రొంగలి జగన్నాఽథం, కొండా రాజీవ్గాంధీ, మొల్లి అప్పారావు, వుడా రవి, జహీర్ అహ్మద్, గండి రవి, శోభాస్వాతి రాణి, కార్పొరేటర్లు రెయ్యి వెంకట రమణ, అక్కరమాని పద్మరాము నాయుడు, డౌలపల్లి ఏడుకొండలరావు, కోరుకోడ వెంకట రత్న స్వాతి దాస్, పద్మా రెడ్డి, బిపిన్ కుమార్ జైన్, కె.వి.శశికళ, గుడివాడ అనూష, ఇమ్రాన్, జిల్లా కార్యవర్గం కమిటీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు బోని బంగారు నాయుడు, నడింపల్లి కృష్ణంరాజు, చెన్నా జానకీరామ్, మువ్వల సురేష్, ద్రోణంరాజు శ్రీవాస్తవ్, బింగి హరి కిరణ్ రెడ్డి, పల్లా దుర్గారావు, మనలత జాబ్దాస్ (చిన్ని), పేడాడ రమణి కుమారి, వంకాయల మారుతీ ప్రసాద్, పీలా కిరణ్ జగదీష్, రామారెడ్డి, రాయపు అనిల్ కుమార్, లావణ్య చిమట, శెట్టి రోహిణి, పిల్లి సుజాత, పిల్లా సుజాత, అల్లంపల్లి రాజబాబు, మాధవీవర్మ, మజ్జి వెంకట రావు, బంకు సత్య, పోలిరెడ్డి, శ్రీదేవి వర్మ, రాజేశ్వరి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
8న అప్పన్న వార్షిక కల్యాణోత్సవం
సింహాచలం: అన్ని శాఖల సమన్వయంతో వచ్చే నెల 8న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు తెలిపారు. వార్షిక కల్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై సింహగిరిపై గురువారం పోలీస్, వైద్యారోగ్య, ఈపీడీసీఎల్, ఆర్టీసీ, ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వచ్చే నెల 8న రాత్రి 8 గంటల నుంచి స్వామి రథోత్సవం, 10.30 గంటల నుంచి వార్షిక కల్యాణోత్సవం జరుగుతుందని తెలిపారు. ఆ రోజు తీసుకోవాల్సిన చర్యలు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య శిబిరాల నిర్వహణ, ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడం, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవ్, సీఐ గొలగాని అప్పారావు, ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
73 చోరీ కేసుల్లో రూ.93.21 లక్షలు రికవరీ
విశాఖ సిటీ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫిబ్రవరి నెలలో 73 చోరీ కేసులను ఛేదించి 103 మంది నిందితులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో చోరీ కేసుల్లో స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను ప్రదర్శించి రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చోరీ కేసుల్లో నిందితుల నుంచి మొత్తంగా రూ.93,21,435 విలువైన నగదు, బంగారం, వెండి, మొబైల్స్, వాహనాలను రికవరీ చేసినట్లు చెప్పారు. ఇందులో 660.655 గ్రాముల బంగారం, 2,008.3 గ్రాముల వెండి, రూ.2,73,575 నగదు, 14 బైక్లు, 2 ల్యాప్టాప్లు, 419 మొబైల్ ఫోన్లు ఇలా మొత్తంగా రూ.93,21,435 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నగరంలో నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని వివరించారు. గత నెలలో నగరంలో 751 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు 203 నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. అలాగే నేరాలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి 24 గంటలు నిఘా పెట్టినట్లు తెలిపారు. అనంతరం ఆభరణాలు, బైక్లు, ఇతర వస్తువులను వాటి యజమానులకు సీపీ చేతుల మీదుగా అందజేశారు. -
గేట్–2025లో దినేష్కు 23వ ర్యాంక్
సింహాచలం: గేట్–2025లో ఆలిండియా 23వ ర్యాంకును సాధించి సింహాచలం దరి శ్రీనివాస్నగర్కి చెందిన చింతా దినేష్ సత్తా చాటాడు. దినేష్ తాడేపల్లి గూడెంలోని ఎన్ఐటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి హరిశివప్రసాద్ అనకాపల్లి జిల్లా తుమ్మపాల పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్. తల్లి సుజాత గృహిణి. టెన్త్లో 10 జీపీఏ, ఇంటర్లో 980 మార్కులు సాధించాడు. విజయనగరంలోని ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అసోసియేట్ ఫ్రొఫె సర్గా పనిచేస్తున్న మామయ్య కె.అజయ్ ప్రోత్సాహంతో దినేష్ చదువులో రాణిస్తున్నట్లు తల్లిదండ్రు లు తెలిపారు. గేట్–2025లో ఎలక్ట్రానిక్స్ అండ్ క మ్యూనికేషన్స్ విభాగంలో ఆలిండియా 23వ ర్యాంకు సాధించిన దినేష్ను కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు అభినందించారు. -
ముడసర్లోవ పార్కులో అగ్ని ప్రమాదం
ఆరిలోవ: జీవీఎంసీ 13వ వార్డు పరిధిలోని ముడసర్లోవ పార్కులో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగలు వ్యాపించడంతో సందర్శకులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాల ప్రజలు, వాహనచోదకులు ఆందోళన చెందారు. పార్కులో జీవీఎంసీ నీటి సరఫరా విభాగం సిబ్బంది అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చి, అక్కడే ఉన్న ట్యాంకర్ల ద్వారా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అనంతరం చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పి వేశారు. ఈ ప్రమాదం కారణంగా పార్కులోని స్టోర్ రూం వద్ద భద్రపరిచిన 5 వేల లీటర్ల సామర్థ్యం గల ఆరు వాటర్ ట్యాంకులు, ఐదు హెచ్డీపీ పైపులు పూర్తిగా కాలిపోయాయి. అంతేకాకుండా స్టోర్రూం(పాత గెస్ట్ హౌస్) కిటికీలు, తలుపులు, ఒక పెద్ద చింత చెట్టు, వెదురు పొదలు కూడా దగ్ధమయ్యాయి. కాగా.. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టత లేదు. సందర్శకులెవరైనా కాల్చిన సిగరెట్ ఆకులపై వేయడం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని పార్కు సిబ్బంది భావిస్తున్నారు. పార్కులో చెత్త, చెట్ల ఆకులను సిబ్బంది ఇక్కడ స్టోర్ రూం సమీపంలో నీటి గ్యాలరీ పక్కన దిబ్బలుగా వేస్తారు. వాటికి తరచూ మంట పెట్టి కాల్చేస్తారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా మంట పెట్టడంతో అదుపు తప్పి.. వెదురు కొమ్మలకు అంటుకోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. -
సీఐఐ చైర్మన్గా మురళీకృష్ణ
ఏయూక్యాంపస్: కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్టీ(సీఐఐ) ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన చైర్మన్గా ఫ్లంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థ సీఈవో గన్నమనేని మురళీకృష్ణ ఎన్నికయ్యారు. ఆయన మహాత్మా గాంధీ కాన్సర్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ వి.మురళీకృష్ణ నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఎపెక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.నరేంద్ర కుమార్ సీఐఐ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. సీఐఐ వార్షిక సమావేశం ముగింపులో స్వర్ణాంధ్ర ప్రదేశ్–విజన్ 2047 అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆన్లైన్లో ప్రసంగించారు. సీఐఐ పనితీరు, పరిశ్రమల భాగస్వామ్యం తదితర అంశాలను అభినందించారు. భారత విదేశాంగశాఖ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ పి.ఎస్ గంగాధర్ వాణిజ్యం పెంచడంలో ఉన్న వ్యూహత్మక ప్రయోజనాన్ని వివరించారు. సీఐఐ ఇండియా 100 కౌన్సిల్ రాజన్ నవాని మాట్లాడుతూ యువత శక్తి, ఆవిష్కరణల నుంచి ప్రేరణ పొందుతున్న విధానం గురించి వివరించారు. బోయింగ్ ఇండియా దక్షిణాసియా సీఎస్ఆర్ హెడ్ ప్రవీణ యాగ్నంభట్ మాట్లాడుతూ యువతకు అనేక అవకాశాలు ఉన్నాయని, విద్య, నైపుణ్యాల మధ్య వ్యత్యాసాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సీఐఐ పూర్వ చైర్మన్ సురేష్ రాముడు చిట్టూరి మాట్లాడుతూ ఏఐ వల్ల విద్యా రంగంలో జరిగే మార్పులు, ఏఐని కరికులంలో భాగం చేయడం తదితర అంశాలపై ప్రసంగించారు. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ రియర్ అడ్మిరల్ ఆర్.ఎస్ ధలివాల్ దేశ రక్షణ రంగంలో పెరుగుతున్న వృద్ధిని వివరించారు. వార్షిక సమావేశంలో భాగంగా సీఐఐ ఏపీ పరిశ్రమల భద్రత ఎక్స్లెన్స్ 2024 అవార్డులను ప్రదానం చేశారు. 59 సంస్థలకు రాష్ట్ర ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ అందజేశారు. సీఐఐ ఏపీ కై జెన్ పోటీల విజేతలకు తొలిసారిగా అవార్డులను ప్రదానం చేశారు. -
26 తర్వాత.. సమ్మె?
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వివాదం ముదురుతోంది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధులు మౌనం వహించడం గమనార్హం. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ప్లాంట్ను ఆదుకునే ప్రయత్నం చేయాల్సింది పోయి.. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తన చర్యలతో మరింత దిగజార్చేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలోని ప్రైవేట్ స్టీల్ప్లాంట్లతో పోల్చి చూపిస్తూ.. విశాఖ స్టీల్ప్లాంట్లో శాశ్వత, కాంట్రాక్ట్ కార్మికులు అధికంగా ఉన్నారనే సాకుతో వేలాది మంది ఉద్యోగుల మెడపై తొలగింపు కత్తి పెట్టింది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం ద్వారానే ప్లాంట్కు భవిష్యత్ ఉంటుందని స్టీల్ప్లాంట్ పర్యటనలో కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉద్యోగులను ఇతర ప్లాంట్లకు డిప్యూటేషన్పై పంపడం, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(వీఆర్ఎస్) ద్వారా సుమారు 2,500 మందిని తగ్గించడం, దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఉద్యోగులను డిప్యుటేషన్పై పంపేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా.. గత ఏడాది సెప్టెంబర్ 30న ఒకేసారి 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు ప్రయత్నించింది. అయితే కార్మిక సంఘాల తీవ్ర ఆందోళనల ఫలితంగా ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత వీఆర్ఎస్కు సుమారు 1,130 మంది ఉద్యోగులు దరఖాస్తు చేయగా.. ప్రభుత్వం ఆమోదించింది. ఆర్ఎల్సీ ఆదేశాలు బేఖాతర్ తాజాగా, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును మళ్లీ తెరపైకి తెచ్చింది యాజమాన్యం. ఇందులో భాగంగా గతంలో రెన్యువల్ చేయాల్సిన పలు కాంట్రాక్ట్లను నిలిపివేయడంతో దాదాపు 644 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ చర్యను నిరసిస్తూ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు గత నెల 20న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ నెల 7 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. దీంతో గత నెల 25న ప్రాంతీయ కార్మిక కమిషనర్(ఆర్ఎల్సీ) సమక్షంలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తొలగించిన 644 మంది కార్మికుల జాబితాను ఇవ్వాలని ఆర్ఎల్సీ.. స్టీల్ యాజమాన్యాన్ని కోరారు. ఈ క్రమంలో ఈ నెల 5న దాదాపు 288 మంది కార్మికుల బయోమెట్రిక్ను ఆన్లైన్లో నిలిపివేయడంతో కార్మిక సంఘాలు మళ్లీ ఆర్ఎల్సీకి ఫిర్యాదు చేశాయి. ఈ నెల 11న జరిగిన సమావేశంలో ఆపివేసిన బయోమెట్రిక్ను 15వ తేదీలోగా పునరుద్ధరించాలని ఆర్ఎల్సీ సూచించారు. యాజమాన్య ప్రతినిధులు దీనికి అంగీకరించినప్పటికీ బయోమెట్రిక్ పునరుద్ధరణ జరగలేదని కార్మి క నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా.. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు వ్యతిరేకంగా ఈ నెల 7న బీసీ గేటు వద్ద మానవహారం జరిగింది. ఈ నెల 9న గాజువాకలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ నెల 18న ఈడీ(వర్క్స్) బిల్డింగ్ వద్ద ఆందోళన చేశారు. 26న జరగనున్న ఆర్ఎల్సీ సమావేశంలో యాజమాన్యం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే సమ్మెకు వెళ్తామని నాయకులు ప్రకటించారు. ప్రజాప్రతినిధుల మౌనం స్టీల్ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటించామని గొప్పలు చెప్పుకున్న స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కార్మికుల తొలగింపుపై మౌనం వహించడం గమనార్హం. ఈ అంశాన్ని ఎంపీ, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఉక్కు మంత్రిత్వశాఖకు చెప్పి తొలగింపు ఆపే ప్రయత్నాలు చేయడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె జరిగితే.. ప్రస్తుతం రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మంచి ఉత్పత్తిని సాధిస్తున్న తరుణంలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తే ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ప్లాంట్కు ఇది మరింత నష్టం కలిగిస్తుంది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యం తమ మొండి వైఖరిని వీడి, కాంట్రాక్ట్ కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగానే తొలగింపు స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు చేపట్టారు. ఒకవైపు ప్లాంట్లో ఉత్పత్తి పెరుగుతుంటే కార్మికులను తొలగించడం అన్యాయం. తద్వారా ఉన్న వారిపై పనిభారం పెరుగుతుంది. యాజమాన్యం మొండికేస్తే సమ్మె చేయడం ఖాయం. –జి.శ్రీనివాసరావు, అధ్యక్షులు, సీఐటీయూ కాంట్రాక్ట్ కార్మిక సంఘం కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అన్యాయం స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు మూడు ఫర్నేస్లను నడుపుతామని యాజమాన్యం చెబుతూ.. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తుండటం దుర్మార్గం. ఈ చర్యను వెంటనే ఆపకపోతే నిరవధిక సమ్మెకు దిగుతాం. – మంత్రి రవి, ప్రధాన కార్యదర్శి,ఏఐటీయూసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం స్టీల్ప్లాంట్లో ముదురుతున్న కాంట్రాక్ట్ కార్మికుల వివాదం ఆర్ఎల్సీ సమావేశంపై అందరి చూపు సానుకూల నిర్ణయం రాకపోతే సమ్మె: నాయకుల ప్రకటన -
ఇఫ్తార్ సహర్ శుక్ర శని 6.11 4.45
తూర్పు నేవీలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు సింథియా: గోపాల్పూర్లోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీ 125వ యంగ్ ఆఫీసర్స్ కోర్సుకు చెందిన డైరెక్టింగ్ సిబ్బంది 29 మంది గురువారం తూర్పు నావికాదళాన్ని సందర్శించారు. జాయింట్ మ్యాన్షిప్, ఇంటర్ సర్వీస్ సినర్జీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన జరిగింది. సందర్శనలో ఆఫీసర్లకు తూర్పు నావికాదళ కార్యకలాపాలు, ఆపరేషనల్ నావెల్ కమాండ్, సబ్మైరెన్స్, షోర్ సదుపాయాలు తదితర కార్యకలాపాలను నావికాదళ సిబ్బంది వివరించారు. -
రైల్వే డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి
● ఆమె తల్లిదండ్రులు, బంధువుల ఆరోపణ ● ఈస్ట్కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ నాయకులతో కలిసి ఆందోళన తాటిచెట్లపాలెం: దొండపర్తిలోని రైల్వే ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మూడేళ్ల చిన్నారి హన్విక మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిని నిరసిస్తూ చిన్నారి బంధువులు, యూనియన్ నాయకులు రైల్వే ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాలివి.. వాల్తేరు డివిజన్, ఇంజినీరింగ్ విభాగంలో ట్రాక్ మెయింటైనర్గా పనిచేస్తున్న ఎన్.శ్రీనివాసరావు కుమార్తె హన్విక బుధవారం ఉదయం తీవ్రమైన కడుపు నొప్పికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు రైల్వే ఆస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారిని మొదట క్యాజువాలిటీకి తీసుకెళ్లగా.. అక్కడ సిబ్బంది ఓపీకి వెళ్లమని సూచించారు. ఓపీ వద్ద వేచి ఉన్న సమయంలో నొప్పి తీవ్రం కావడంతో మళ్లీ క్యాజువాలిటీకి తీసుకువచ్చారు. అక్కడ పాపను వార్డులోకి పంపి ఇంజక్షన్లు చేసినప్పటికీ సరైన చికిత్స అందించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి పాప తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా.. వైద్య సిబ్బంది పట్టించుకోలేదని వాపోయారు. ఉదయం చిన్న పరీక్షలు చేసి పల్స్, హార్ట్ బీట్ ఆగిపోయిన తర్వాత మెడికవర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడకు తీసుకెళ్లిన అనంతరం వైద్యులు పాప మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆగ్రహించిన చిన్నారి బంధువులు, ఈస్ట్కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ నాయకులు చిన్నారి మృతదేహంతో రైల్వే ఆస్పత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా యూనియన్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. వెంటనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. -
విద్యుత్ షాక్తో ఇంటర్ విద్యార్థి దుర్మరణం
శుభకార్యంలో విషాదం అక్కిరెడ్డిపాలెం: శుభకార్యానికి హాజరైన బాలుడు విద్యుత్ షాక్కు బలయ్యాడు. మేడ మీద ఆడుకుంటూ.. హైటెన్షన్ వైరు నుంచి వేలాడుతున్న మరో తీగను పట్టుకోవడంతో దుర్మరణం పాలయ్యాడు. గాజువాక సీఐ ఎ.పార్థసారధి తెలిపిన వివరాలివి. శ్రీనగర్ లైన్ 3 అఫీషియల్ కాలనీకి చెందిన అప్పలరాజు కుమారుడు గోపిశెట్టి దిలీప్కుమార్(16) గాజువాకలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. చినగంట్యాడ నాయుడుగారి వీధిలో తమ బంధువుల ఇంట గురువారం జరిగిన ఓ శుభకార్యానికి గోపిశెట్టి అప్పలరాజు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఫంక్షన్ జరుగుతుండగా దిలీప్ కుమార్ మేడ మీదకు వెళ్లి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో మేడ చివరన ఓ తీగ వేలాడుతుండగా దిలీప్ దానిని పట్టుకుని లాగాడు. ఆ వైరు హైటెన్షన్ వైరు నుంచి కొనసాగుతుండటంతో.. దిలీప్ విద్యుత్ షాక్కు గరయ్యాడు. కొంత సమయానికి మేడపైకి వెళ్లిన బంధువులు దిలీప్ కుమార్ వైరు పట్టుకుని పడి ఉండటం చూసి వెంటనే గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే దిలీప్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నజీర్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. -
పిచ్చుకలకు తోడుగా..
మద్దిలపాలెం: మన ఇంటికి వచ్చే పిచ్చుకలను మనమే కాపాడుకుందామని డాక్టర్ వి.ఎస్.కృష్ణా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఐ.విజయబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు పిచ్చుకల గూళ్లు, మంచి నీటి పాత్రలు ఏర్పాటు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వేసవిలో పక్షుల కోసం నీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేయాలని కోరారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే జీవకోటి మనుగడ సాధ్యమన్నారు. గ్రీన్ కై ్లమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం మాట్లాడుతూ 25 ఏళ్లుగా పిచ్చుకలకు గూళ్లు, ఇతర పక్షులు, వన్య ప్రాణుల కోసం మట్టి పాత్రలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జయ, బోటనీ హెడ్ ఎస్.పద్మావతి, టీచింగ్ ఫ్యాకల్టీ ఎం.హెచ్.డి పద్మావతి, స్వామినాయుడు, గ్రీన్ వలంటీర్లు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్’ పేరు చూస్తే ‘కూటమి’లో కలవరం
● ప్రతిచోటా ఆయన పేరును తొలగిస్తున్నారు ● ప్రజల గుండెల్లో మాత్రం ఆయన స్థానాన్ని చెరపలేరు ● విశాఖ స్టేడియానికి ఉన్న వైఎస్సార్ పేరు తొలగించడం దుర్మార్గం ● నేడు స్టేడియం వద్ద వైఎస్సార్సీపీ నిరసన ● మీడియాతో మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ సాక్షి, విశాఖపట్నం : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును చూసి టీడీపీ కూటమి సర్కారు కలవరపడుతోందని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్సార్ పేరు లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ పేరు ఎక్కడ ఉంటే అక్కడ వరుసగా తొలగిస్తూ వస్తున్నారన్నారు. వైఎస్సార్ పేరు అయితే చెరిపేయగలరుగానీ.. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో ఉన్న ఆ పేరును చెరిపేయగలరా అని ప్రశ్నించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని.. వైఎస్సార్ అనే బ్రాండ్ కనిపించకుండా చేయాలన్న కుతంత్రమే కనిపిస్తోంది. నాగార్జున యూనివర్సిటీలోని వైఎస్సార్ విగ్రహాన్ని నేలమట్టం చేశారు.. బాపట్ల జిల్లా వేమూరులో వైఎస్సార్ విగ్రహానికి నిప్పంటించారు.. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరును తీసేశారు.. చివరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఉన్న ‘వైఎస్సార్’ పేరునూ దుర్మార్గంగా తొలగించారు. అలాగే, వైఎస్ జగన్ సీఎంగా ఉండగా సీతకొండను అభివృద్ధిచేసి వైఎస్సార్ వ్యూ పాయింట్ అని పెడితే అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని కూడా తీసేశారు. అలాగే, వైఎస్సార్ జిల్లా పేరును మార్చేశారు. రైతుల పక్షపాతి అయిన వైఎస్సార్ పేరును రైతుభరోసా కేంద్రాలకు పెడితే, వాటినీ నిర్వీర్యం చేశారు. చివరికి.. విజయవాడ సమీపంలోని తాడిగడప మున్సిపాలిటీకి వున్న వైఎస్సార్ పేరును కూడా తొలగించారు. జగన్ పేరునూ తీసేశారు.. ఇక వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండగా విజయవాడ నడిబొడ్డున 150 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియం నిర్మిస్తే దానిపైన వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును తీసేశారు. వైఎస్సార్ పేరు కనపడితేనే ఓర్చుకోలేకపోతున్న చంద్రబాబు.. గతంలో మూడుసార్లు సీఎంగా పనిచేసి కూడా కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేకపోయారు? వైఎస్ జగన్ సీఎం అయ్యాకే ఎన్టీఆర్కు సమున్నత గౌరవం కల్పించారు. ఇక విశాఖ వీడీసీఏ క్రికెట్ స్టేడియానికున్న వైఎస్సార్ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 20న ఉ.10 గంటలకు స్టేడియం వద్ద శాంతియుతంగా నిరసన చేపడతాం. ఈ నెలాఖరున ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నందున ప్రభుత్వం, ఏసీఏ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వైఎస్సార్ పేరును కొనసాగించాలి. -
ఏయూ ఆచార్యులకు పేటెంట్ మంజూరు
విశాఖ విద్య: బయో యాక్టివ్ ఫీడ్ యాడిటివ్ ఫర్ కంట్రోలింగ్ విబ్రియో ఇన్ఫెక్షన్స్ ఇన్ క్రస్టేషియన్స్ అంశంపై ఏయూలోని మైరెన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం ప్రొఫెసర్ పి.జానకి రామ్, డాక్టర్ సునీల్కుమార్లకు సంయుక్తంగా భారత ప్రభుత్వ పేటెంట్ మంజూరయింది. రొయ్యల పరిశ్రమలో వచ్చే వ్యాధులకు సంబంధించిన నూతన ఔషధాన్ని అభివృద్ధి చేసిన విధానానికి గాను వీరికి పేటెంట్ దక్కింది. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ధనంజయరావు, ప్రిన్సిపాల్ ఎంవీఆర్ రాజులు పేటెంట్ సాధించిన ఆచార్యులను అభినందించారు. -
హే పిచ్చుక.. తిరిగి రావాలిక.!
పక్షుల కోసం ఏర్పాటు చేసే వరి కంకులతో నగర ప్రజలు, గ్రీన్ క్లైమేట్ సభ్యులుఏయూక్యాంపస్: స్వేచ్ఛకు, సంతోషానికి, ప్రకృతి అందానికి చిహ్నాలు పిచ్చుకలు. కానీ, వాటి గురించి ప్రస్తుత కాలం పిల్లలకు తెలుసో తెలియదో మరి!. ఒకప్పుడు మన పూరి గుడిసెల్లో, మనతోనే కలిసిమెలిసి జీవించేవి ఈ చిట్టి పక్షులు. మన కిటికీ పక్కనో.. పెరట్లోని చెట్టుపైనో వాటి కిచకిచలు వింటూ ఆనందంగా కళ్లు తెరిచిన రోజులు చాలానే ఉంటాయి. ఇప్పుడా గుడిసెలు లేవు.. వాటికి గూడు కట్టుకోవడానికి చోటూ లేదు.. ఫలితంగా పిచ్చుకలూ లేవు. కాలం మారింది. మన అవసరాలు పెరిగాయి. చిన్న గుడిసె స్థానంలో పెద్ద భవంతులు వచ్చాయి. మన ఆశలు పెరిగాయి. కానీ మనకు సహాయపడే ఇతర జీవులతో మన ఆత్మీయత తగ్గిపోయింది. మన అవసరాల కోసం వాటిని అంతం చేస్తున్నాం. ఏటా మార్చి 20న మ నం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటున్నాం. అంతరించిపోతున్న ఈ పక్షుల గురించి తెలుసుకోవడం, వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. పిచ్చుకలు చూడ్డానికి బుల్లి పిట్టలే కానీ.. పర్యావరణ వ్యవస్థలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. బుజ్జి బుజ్జి ముక్కులతో కీటకాలను తినేసి.. మొక్కలను తెగుళ్లు, చీడ పీడల నుంచి కాపాడతాయి. విత్తనాలను వ్యాప్తి చేస్తాయి. ఇవి ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు వెళ్లే సమయంలో పరోక్షంగా పరాగ సంపర్కం జరగడానికి దోహదపడతాయి. ఇలా ఎన్నో ఏళ్లుగా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇవి కనిపించడం లేదు. నగరీకరణ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా చెట్లను నరికివేయడం, ఎక్కడబడితే అక్కడ సెల్ టవర్ల నిర్మాణం తదితర కారణాలు పిచ్చుకల పాలిట పెద్ద ముప్పుగా మారాయి. పంట పొలాల్లో పురుగు మందుల వాడకం, ఆహారం లభించకపోవడం, గూడు కట్టుకోవడానికి సరైన ప్రదేశాలు లేకపోవడం వంటి కారణాల వల్ల వాటి మనుగడ కష్టతరమవుతోంది. ఇళ్లలో మొక్కలు పెంచే సంస్కృతి తగ్గిపోవడం కూడా మరో కారణం. ప్రతిజ్ఞ చేద్దాంఈ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మన వంతుగా పిచ్చుకలను కాపాడుకుందాం. బాల్కనీల్లో, ఇంటి పెరడులో వాటి కోసం కాసిన్ని నీళ్లు పెడదాం. బర్డ్ ఫీడర్ను ఉంచి వాటిల్లో కొన్ని బియ్యం గింజలు, లేదంటే మనకు అందుబాటులో ఉన్న ఇతర తృణ ధాన్యాలను వాటికి ఆహారంగా అందిద్దాం. హే పిచ్చుక.. గూడు కట్టుకో.. అని ఆహ్వానిద్దాం! తద్వారా మన భవిష్యత్ తరాలకు ఈ అందమైన పక్షులను పరిచయం చేద్దాం. -
బరితెగింపు
అభివృద్ధిని విస్మరించిడాబాగార్డెన్స్/మధురవాడ/కొమ్మాది/ తగరపువలస: మంచితనానికి మారుపేరు.. మానవత్వానికి ప్రతిరూపం.. చిరునవ్వుకు చిరునామా.. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి. ఆయన పేరును పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నుంచి కూటమి ప్రభుత్వం తొలగించింది. ఇది పూర్తిగా కక్షపూరిత చర్యేనని క్రీడాకారులు, క్రీడాభిమానులు, వైఎస్సార్ అభిమానులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. విశాఖ నగర అభివృద్ధికి వైఎస్సార్ చేసిన కృషి ఎనలేనిది. మధురవాడ నేడు అభివృద్ధిలో దూసుకుపోతుందంటే అందుకు ప్రధాన కారణం వైఎస్సార్. ఈ క్రికెట్ స్టేడియానికి అంతర్జాతీయ హోదా కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాంటి గొప్ప నాయకుడి పేరును రాత్రికి రాత్రే తొలగించడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్ అభిమానులు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి నేతలు బీచ్రోడ్డులోని వైఎస్సార్ వ్యూ పాయింట్ను ధ్వంసం చేశారు. నగరంలో పలు చోట్ల ఆయన విగ్రహాలను తొలగించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన పేరు లేకుండా చేశారు. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరును మార్చి వికృతానందం పొందుతున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి, విశాఖకు చేసిన సేవలకు గుర్తింపుగా 2009 సెప్టెంబర్ 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంగా పేరు పెట్టారు. ఆనాడు అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జీవీఎంసీ కౌన్సిల్లో సభ్యులందరి అభిప్రాయం మేరకు తీర్మానం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు జీవీఎంసీ కౌన్సిల్ దృష్టికి తీసుకురాకుండా, సభ్యులకు కనీసం తెలియజేయకుండా స్టేడియం పేరును ఎలా తొలగిస్తారంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు, కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై త్వరలో జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చకు పట్టుబడతామని పలువురు కార్పొరేటర్లు హెచ్చరించారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కేవలం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వెంటనే వైఎస్సార్ పేరును స్టేడియంకు జత చేయాలని డిమాండ్ చేశారు.విశాఖపై వైఎస్సార్ ముద్ర నగరంలో మంచినీటి సమస్య పరిష్కారం, నష్టాల్లో ఉన్న స్టీల్ప్లాంట్ను గట్టెక్కించి రెండో దశను విస్తరించడం, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్(బీహెచ్పీవీ)ని భెల్లో విలీనం చేయడం, షిప్యార్డును రక్షణ శాఖలో విలీనం చేసి పునరుజ్జీవం కల్పించడం. ఇలా ఎన్నో ప్రధాన సమస్యలను పరిష్కారం చూసిన దార్శినికుడు వైఎస్సార్. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం దూరప్రాంతాలకు వెళ్లకుండా విశాఖలో ఐటీ సెజ్కు శ్రీకారం చుట్టారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ను 2005 నవంబర్ 22న మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)గా గ్రేటర్ హోదాని కల్పించారు. ఆయన చొరవతోనే జెఎన్ఎన్యూఆర్ఎంలో భాగంగా రూ.1885 కోట్ల విలువైన పనులు విశాఖ నగరానికి దక్కాయి. సెంట్రల్ సిటీలో రూ.244 కోట్లతో 750 కిమీ మేర యూజీడీ పనులు చేపట్టారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలకు హైదరాబాద్ నిమ్స్ తరహాలో అత్యుత్తమ సేవలు అందించేందుకు విమ్స్కు 2006లో శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్న సంకల్పంతోనే పోలవరం ఎడమ కాలువను నిర్మించారు. ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్ విస్తరణకూ రాజశేఖరరెడ్డి పునాదులు వేశారు. ఎండాడ ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.23 కోట్లు.. విశాఖ నగర దాహార్తిని తీర్చేందుకు తాటిపూడి నుంచి నగరానికి రూ.95 కోట్లతో పైపులైన్ ఏర్పాటు చేశారు. ఆశీల్మెట్ట నుంచి రైల్వేస్టేషన్ వరకు రూ.87 కోట్లతో నగరంలో తొలి ఫ్లైఓవర్ నిర్మించారు. పట్టణ పేదలకు గృహయోగం కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో.. ఇంకెన్నో.. విశాఖ స్టేడియం పేరు మార్పుపై వైఎస్సార్ అభిమానుల ఆగ్రహం వెంటనే జతచేయాలని డిమాండ్ -
సింహగిరిపై అభివృద్ధి పనుల పరిశీలన
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో రూ.54 కోట్లతో జరుగుతున్న ప్రసాద్ పథకం పనులను ఏప్రిల్ 10 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 30న సింహగిరిపై జరిగే చందనోత్సవానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ ముందస్తు పరిశీలన చేశారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, ఇంజినీరింగ్ అధికారులు ఆయా ఏర్పాట్లను ఆయనకు వివరించారు. ఈ క్రమంలో సింహగిరిపై ఉన్న క్యూలు, నిత్యాన్నదాన ప్రసాద భవనం, ప్రసాదాల తయారీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే ప్రసాద్ పథకంలో భాగంగా జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, పార్కుల అభివృద్ధి, కల్యాణ మండపం, బస్టాండ్ ఆధునికీకరణ తదితర పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా చేసి రానున్న చందనోత్సవం నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దేవస్థానం ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, పర్యాటక శాఖ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 10 నాటికి ‘ప్రసాద్’ పూర్తికి కలెక్టర్ ఆదేశం -
ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
విశాఖ స్పోర్ట్స్: విశాఖలోని డా.వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఈ నెల 24, 30 తేదీల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్ బుధవారం సమీక్ష జరిపారు. వివిధ విభాగాల అధికారులతో మాట్లాడుతూ సమన్వయ లోపానికి తావీయకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారుల బస, రవాణా, బందోబస్తు తదితర ఏర్పాట్లపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రేక్షకులకు అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సమీక్షలో పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, డీసీపీలు, ఏసీఏ, ఢిల్లీ క్యాపిటల్స్, ఐపీఎల్ ప్రతినిధులతో పాటు జీవీఎంసీ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ పేరు తొలగింపు బాధాకరం
రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా విశాఖ మహా నగరాన్ని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి బాట పట్టించారు. ఆయన సేవలకు గుర్తుగా క్రికెట్ స్టేడియానికి వైఎస్సార్ పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరును తొలగించడం బాధాకరం. కూటమి ప్రభుత్వం బరితెగించిందనడానికి ఇదే నిదర్శనం. విశాఖలో బీచ్, తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ వ్యూ పాయింట్లు ధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలు బాధిస్తున్నాయి. – గొలగాని హరి వెంకటకుమారి, మేయర్, జీవీఎంసీ -
సాంకేతిక కారణాలతో ఆర్ఆర్బీ పరీక్ష రద్దు
పెందుర్తి: ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆర్ఆర్బీ(లోకో పైలట్) అభ్యర్థులు పరీక్ష రద్దుతో తీవ్ర నిరాశ చెందారు. చినముషిడివాడలోని ఐయాన్ డిజిటల్ కేంద్రంలో బుధవారం జరగాల్సిన ఆన్లైన్ పరీక్ష ఆఖరి క్షణంలో రద్దయింది. పరీక్షకు అంతా సిద్ధమని తొలుత నిర్వాహకులు ప్రకటించారు. అభ్యర్థులు లోపలికి వెళ్లగానే సర్వర్ డౌన్.. క్షణాలు.. నిమిషాలు.. గంటలు గడుస్తున్నా ఆ సాంకేతిక సమస్య పరిష్కారం కాలేదు. రైల్వే సర్వర్ పనిచేయకపోవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచిచూసిన నిర్వాహకులు పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే దాదాపు 1300 మంది అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. మళ్లీ ఎప్పుడు పరీక్ష ఉంటుందో నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. -
కూటమి చర్యలు సిగ్గుచేటు
క్రికెట్ స్టేడియంకు వైఎస్సార్ పేరు రాత్రికి రాత్రే తొలగించడం దుర్మార్గం. మధురవాడ నేడు అభివృద్ధిలో ఉందంటే అక్కడ ఉన్న క్రికెట్ స్టేడియం కారణం. ఈ స్టేడియానికి అంతర్జాతీయ హోదా ఇచ్చిన ఘనత వైఎస్సార్దే. అంతటి మహానాయకుడి పేరును క్రికెట్ స్టేడియంనకు పెట్టాలని అందరూ ప్రతిపాదించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విశాఖలో వైఎస్సార్ గుర్తులు తుడిచేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకన్నా సిగ్గు చేటు ఏముంటుంది? – వాసుపల్లి గణేష్కుమార్, మాజీ ఎమ్మెల్యే -
పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వాలు చేయూతనివ్వాలి
సాక్షి, విశాఖపట్నం: చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వాలు చేయూతనివ్వాలని నీతిఆయోగ్ సీనియర్ సలహాదారు సంజీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. నోవోటల్ హోటల్లో ఎంఎస్ఎంఈల సాధికారతపై సీఐఐ సహకారంతో ఏపీ ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్, నీతి ఆయోగ్ బుధవారం సంయుక్తంగా నిర్వహించిన వర్క్షాప్లో ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల మనుగడ నేపథ్యంలో ప్రతి విషయంలోనూ ప్రభుత్వాలు చేయూతనందించాలని సూచించారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈల పరంగా విశాఖ జిల్లా ముందంజలో ఉందన్నారు. ఈ వర్క్షాప్లో సీఐఐ ఎంఎస్ఎంఈ చైర్మన్ పొన్నుస్వామి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి.ఆదిశేషు, అనకాపల్లి జిల్లా డీఐసీ జీఎం నాగరాజారావు, డీఐసీ సహాయ సంచాలకులు జోగినాథ్, సూపరింటెండెంట్ ఆర్ఆర్ఎస్ మహేష్, ఐపీవోలు హామిని, త్రివేణి, సునీత, జ్యోతితో పాటు సుమారు 300కి పైగా ఎంఎస్ఎంఈ హోల్డర్లు సదస్సుకు హాజరయ్యారు. ఎంఎస్ఎంఈ వర్క్షాప్లో నీతిఆయోగ్ సలహాదారు సంజీత్ సింగ్ -
పూర్తయిన నామినేషన్ల పర్వం
వివిధ పదవులకు 40 మంది పోటీవిశాఖ లీగల్ : విశాఖ జిల్లా న్యాయవాదుల సంఘం ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. బుధవారం సాయంత్రం తుది జాబితా వివరాలను ఎన్నికల అధికారి జి.ఎం.రెడ్డి, ఉప ఎన్నికల అధికారి సి.బి.ఎస్.లింగరాజు విలేకరులకు తెలిపారు. అధ్యక్ష స్థానానికి న్యాయవాదులు ఎం.కె.శ్రీనివాస్, ఐ.ఎం.అహ్మద్, నమ్మి సన్యాసిరావులు పోటీలో ఉన్నారు. కీలకమైన కార్యదర్శి పదవికి ఎల్పీ నాయుడు, ఆర్.సూర్యనారాయణ, ఏవి సోమేశ్వరరావు, వి.వెంకట సుధాకర్ రావు పోటీ చేస్తున్నారు. మొత్తం 5000 మందికి పైగా న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 28 తేదీ ఉదయం ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు రాత్రి 9 గంటలకు ఫలితాలు ప్రకటిస్తారు. -
చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
మహారాణిపేట : సింహగిరిపై ఏప్రిల్ 30వ తేదీన జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వివిధ విభాగాల అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఆ రోజు తెల్లవారుజాము 3.30 నుంచి 4.30 గంటల వరకు మాత్రమే అనువంశిక ధర్మకర్త, తితిదే నుంచి పట్టువస్త్రాలు సమర్పించేవారికి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు, దాతలకు అంతరాలయ దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. 29వ తేదీ రాత్రి 6 గంటల నుంచి సాధారణ దర్శనాలు నిలిపివేస్తామని తెలిపారు. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, ఇతర ఏడీసీపీలు, దేవదాయ శాఖ అధికారులు, ఈవో కె.సుబ్బారావు, డీఆర్వో బి.హెచ్.భవానీశంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, ఇతర అధికారులతో కలిసి కలెక్టరేట్లో చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నగర పరిధిలోని అనుకూల ప్రాంతాల్లో టికెట్ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి.. రూ.1500, రూ.1,000, రూ.300 టికెట్ల జారీ ప్రక్రియను ప్రణాళికాయుతంగా చేపట్టాలన్నారు. రూ.1,500 టికెట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే నీలాద్రి గుమ్మం వద్ద నుంచి దర్శనానికి అనుమతిస్తారని స్పష్టం చేశారు. హనుమంతవాక వైపు నుంచి పాత గోశాల వరకు, అక్కడ నుంచి అడవివరం వరకు రెండు పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని.. అవసరం మేరకు హనుమంతవాక వైపు, అడవివరం వైపు వీలైనన్ని పార్కింగ్ స్థలాలను గుర్తించాలని సూచించారు. తగినన్ని బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విరివిగా తాగునీటి కేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, వైద్య శిబిరాలను పెట్టాలన్నారు. మరుగుదొడ్లు ఇతర వసతులు సమకూర్చాలని చెప్పారు. పరిమిత సంఖ్యలో వెహికల్ పాస్లు జారీ చేయాలని చెప్పారు. ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించరాదని స్పష్టం చేశారు. అదనపు పార్కింగ్ ప్రదేశం, పోలీస్ ఔట్ పోస్టుపై సూచన సింహాచలం కొండపై అదనపు పార్కింగ్ ప్రదేశాన్ని అభివృద్ధి చేయడంతోపాటు శాశ్వత పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేయగా సంబంధిత చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అనుసంధానం చేస్తూ.. సెంట్రలైజ్డ్ పబ్లిక్ అడ్రస్ సిస్టం పెట్టాలని, కొండ, మెట్ల మార్గంలో విరివిగా మైక్ హారన్లు పెట్టాలని సూచించారు. పోలీస్ కమిషనర్ బాగ్చి ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రదేశాల గుర్తింపు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై సూచనలు చేశారు. సమావేశంలో దేవదాయ, పోలీసు, జీవీఎంసీ, విద్యుత్, వైద్య, రవాణా, ఆర్టీసీ, రెవెన్యూ తదితర విభాగాల ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం -
అప్పుడలా.. ఇప్పుడిలా?
2009 సెప్టెంబర్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మహానేత డాక్టర్ వైఎస్సార్ పేరును స్టేడియానికి పెట్టేందుకు అందరూ అంగీకరించారు. కౌన్సిల్ ఆమోదం పొందింది. అన్ని వర్గాల ప్రజలు సంతోషించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహానేత వైఎస్సార్ పేరు తొలగించాలని కంకణం కట్టుకున్నట్టుంది. కౌన్సిల్ దృష్టికి రాకుండా, సభ్యుల ఆమోదం తెలపకుండా పేరు ఎలా తొలగిస్తారు? ఈ విషయమై త్వరలో జరగబోవు కౌన్సిల్ సమావేశంలో చర్చకు పట్టుబడతాం. – బానాల శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ -
కై లాసగిరిపై భద్రత ప్రశ్నార్థకం
ఆరిలోవ: నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కై లాసగిరిలో పర్యాటకుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నగరానికి వచ్చే విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షించే కై లాసగిరిపై నిర్వహిస్తున్న సర్క్యూట్ ట్రైన్(విశాఖ దర్శిని టాయ్ ట్రైన్) సోమవారం పట్టాలు తప్పింది. సందర్శకులను తీసుకువెళుతుండగా తెలుగు మ్యూజియం ఎదురుగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ట్రైన్ సుమారు 200 మీటర్ల దూరం ట్రాక్పై దూసుకుపోవడంతో ట్రాక్, ఇరువైపులా రోడ్డు కొంతమేర దెబ్బతిన్నాయి. వారం రోజుల కిందట కై లాసగిరిలోని రోప్వే వద్ద అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సర్క్యూట్ ట్రైన్ పట్టాలు తప్పడంతో వీఎంఆర్డీఏ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా యని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైన్ మొరాయించడం కొత్తేమీ కాదు. గతంలోనూ అనేకసార్లు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. నెల రోజుల కిందటే మరమ్మతులకు గురి కాగా ఈ ట్రైన్ను నడపకుండా వీఎంఆర్డీఏ అధికారులు నిలిపివేశారు. దీని ఇంజిన్లో కొన్ని భాగాలు పాడవడం, జనరేటర్ పనిచేయకపోవడం, ఏసీ, ఫ్యాన్లు పాడవడంతో మరమ్మతులు చేస్తామంటూ కై లాసగిరి స్టేషన్లో ఓ బోర్డు ఏర్పాటు చేశారు. నిలిపివేసిన మూడు వారాల తర్వాత మళ్లీ ట్రైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మళ్లీ అదే పరిస్థితి తలెత్తడం గమనార్హం. సేవలు ప్రారంభించిన వారం రోజులకే ట్రైన్ పట్టాలు తప్పడం ఆందోళన కలిగిస్తోంది. ట్రైన్లో మరమ్మతులు పూర్తి కాకుండానే తిప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ట్రైన్ చక్రాలు పూర్తిగా అరిగిపోయాయని, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని తెలుస్తోంది. అధికారులు మాత్రం తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరమ్మతులు చేస్తున్నట్లుగా పాత బోర్డునే మళ్లీ ఏర్పాటు చేసి పర్యాటకులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. నగరంలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతం పట్ల అధికారులు చూపుతున్న నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీఎంఆర్డీఏ తక్షణమే స్పందించి కై లాసగిరిలోని పర్యాటక సౌకర్యాల నిర్వహణపై దృష్టి సారించాలని కోరుతున్నారు. పట్టాలు తప్పిన సర్క్యూట్ ట్రైన్ ఇటీవలే రోప్వే వద్ద అగ్ని ప్రమాదం వరుస ప్రమాదాలతో పర్యాటకుల్లో ఆందోళన -
సబ్బవరంలో భారీగా గంజాయి స్వాధీనం
● ఏవోబీ నుంచి మహారాష్ట్రకు కారులో తరలిస్తుండగా పట్టివేత ● రూ.18.19 లక్షల విలువైన 363.8 కిలోల గంజాయి స్వాధీనం ● 2 కార్లు, ఐదు మొబైళ్లు, రూ.50 వేలు నగదు సీజ్ ● ఏడుగురి అరెస్ట్, ముగ్గురు పరారీసబ్బవరం: మండలంలోని ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై బాటజంగాలపాలెం టోల్గేట్ వద్ద కారులో పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయిని సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ పిన్నింటి రమణతో కలిసి డీఎస్పీ వళ్లెం విష్ణుస్వరూప్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆంధ్ర–ఒడిశా బోర్డర్లో ఏజెన్సీ ప్రాంతం నుంచి మహరాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.18.19 లక్షల విలువ చేసే 363.8 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు సీఐ పిన్నింటి రమణ ఆధ్వర్యంలో ఎస్ఐ సింహాచలం తన సిబ్బందితో కలిసి గంజాయి తరలిస్తున్న కారుతో పాటు పైలెట్ వాహనంగా వస్తున్న మరో కారును తనిఖీ చేసి, గంజాయిని పట్టుకున్నారు. రెండు కార్లను సీజ్ చేశారు. 7గురిని అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారైనట్లు తెలిపారు. వారి నుంచి రూ.50 వేలు నగదు, 5 సెల్ఫోన్లతో కలిపి ఈ కేసులో మొత్తం రూ.57.10 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఏవోబీ బోర్డర్లో కోనుగోలుచేసి చింతపల్లిలో లోడ్చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. గంజాయి తరలింపులో వినియోగించిన వాహనాలు తప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్నాయని, వీటిపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. పట్టుబడిన వ్యక్తుల్లో ఏఎస్ఆర్ జిల్లాకు చెందిన వారు ఆరుగురు, ఒడిశాకు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఏ1గా సామిరెడ్డి విజయ్(31), ఏ2 వంతల హరీష్బాబు(30), ఏ3 మాడబత్తుల అరుణ్కుమార్(38), ఏ4 సాగర్ శివాజీ గోపనీ(32), ఏ5 కొర్రా మహేష్బాబు(32), ఏ6 ఎన్.రమణ(40), ఏ7గా సరమంద అనిల్కుమార్(25)లపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ పిన్నింటి రమణ, ఎస్ఐలు సింహాచలం, టి.దివ్య తదితరులు పాల్గొన్నారు. -
కుట్రలకు కేరాఫ్ చంద్రబాబు
వెన్నుపోటు రాజకీయాలు.. అరాచక పాలన● తమ కార్పొరేటర్లకు అధికారులతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నారు ● ప్రలోభాలతో సిగ్గు లేని రాజకీయాలకు తెరతీస్తున్నారు.. ● వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ● బెదిరింపులు సహించం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు రాజకీయమంతా కుట్రలు, కుతంత్రాలేనని.. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లకు అధికారులతో ఫోన్లు చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులు, సమన్వయకర్తలతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్తో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీలకు బలం లేకున్నా మేయర్పై అవిశ్వాసం పెట్టడానికి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీలోని కొంతమంది కార్పొరేటర్లను టీడీపీలోకి చేర్చుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్ సీపీ అంటే అభిమానంతో ఉన్న కార్పొరేటర్లు భయపడేది లేదని, మేయర్ పీఠాన్ని తప్పకుండా కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. స్టీల్ప్లాంట్పై కూటమి ప్రభుత్వం దగా విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగా మరోసారి బయట పడిందని ఆయన అన్నారు. ప్యాకేజీ ఇచ్చాం, ప్రైవేటీకరణ అంశమే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ప్రకటనలు తప్పని కేంద్ర ఆర్థిక శాఖ అనుబంధంగా ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్(దీపం) ఇచ్చిన సమాధానంతో బట్టబయలైందని పేర్కొన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేది లేదని దీపం రాసిన లేఖతో కూటమి నేతల నాటకాలు అందరికీ తెలుస్తున్నాయన్నారు. స్టీల్ప్లాంట్కు ప్యాకేజీ తీసుకొచ్చి ప్రైవేటీకరణను తామే ఆపించామని చెబుతున్న కూటమి నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని, రాష్ట్ర సంపదను దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందన్నారు. తలొగ్గకుంటే కేసులు పెడతారంట? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారని, తలొగ్గకపోతే కేసులు పెడతామని భయపెడుతున్నారన్నారు. ప్రలోభాలతో తమ పార్టీకి చెందిన ముగ్గురు, నలుగురు కార్పొరేటర్లను చేర్చుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కార్పొరేటర్లకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. తమ కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని, భవిష్యత్తులో అసలైన రాజకీయం వారికి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దేవన్రెడ్డి, జీవీఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
నలుగురు ఎస్ఐలకు స్థానచలనం
విశాఖ సిటీ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరిలోవ ట్రాఫిక్ ఎస్ఐగా ఉన్న ఎస్.శ్రీకాంత్ను పద్మనాభం క్రైమ్కు, ఆరిలోవ క్రైమ్ స్టేషన్కు అటాచ్మెంట్లో ఉన్న ఎ.మురళీకృష్ణను అదే స్టేషన్ ట్రాఫిక్లో పోస్టింగ్ ఇచ్చారు. అలాగే గాజువాక లా అండ్ ఆర్డర్లో ఉన్న ఎం.రాధాకృష్ణను భీమిలి లా అండ్ ఆర్డర్కు, పీఎం పాలెం లా అండ్ ఆర్డర్లో ఉన్న ఎ.మన్మథను టూ టౌన్ లా అండ్ ఆర్డర్కు బదిలీ చేశారు. -
కనీస పెన్షన్ రూ.5 వేలకుపెంచాలని పెన్షనర్ల ఆందోళన
సీతమ్మధార: కనీస పెన్షన్ రూ.5 వేలు అమలు చేయాలని ఈపీఎస్ 95 పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(బీఎంఎస్ అనుబంధం) రాష్ట్ర కన్వీనర్ ఐ.ముత్యాలు డిమాండ్ చేశారు. ఈపీఎస్ పెన్షన్కు డీఏ కలపాలని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వైద్య సౌకర్యం అందించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ల ద్వారా ప్రధానికి వినతిపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. 1995లో ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్ను సవరించి ఈపీఎస్ 95 పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కనీస పెన్షన్ అమలు కాలేదని, తర్వాత భారతీయ మజ్దూర్ సంఘ్ కృషితో 2014 నుంచి కనీస పెన్షన్ రూ.1000కి పెంచారన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరల నేపథ్యంలో కనీస పింఛన్ రూ.5 వేలకు పెంచడంతో పాటు డీఏ జోడించి ఇవ్వాలని కోరారు. యూనియన్ నాయకులు, అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తున్న దృశ్యంరుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం(టీటీడీ)లో మంగళవారం ఆలయ శుద్ధి, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 20న నిర్వహించనున్న శ్రీవారి ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా టీటీడీ సంప్రదాయం ప్రకారం ముందుగా వచ్చే మంగళవారం ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుగంధ ద్రవ్యాలతో శ్రీవారి ఆలయం, హనుమాన్, మహాలక్ష్మి, గోదాదేవి ఆలయాలను శుద్ధి చేశారు. మధ్యాహ్నం నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఏఈవో జగన్మోహనాచార్యులు, ఇన్స్పెక్టర్ శివకుమార్, ఆలయ అర్చకులు, పండితులు పాల్గొన్నారు. -
ఆదివాసీలపై దమనకాండను ఆపాలి
సీతంపేట: దేశంలో అభివృద్ధి నమూనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ప్రముఖ సామాజిక వేత్త, ఆచార్య జి.హరగోపాల్ అన్నారు. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని, అభివృద్ధిలో సమానత్వం లేదన్నారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో అభివృద్ధి పేరుతో అణచివేత జరుగుతోందని ఆరోపించారు. ఎవరు వ్యతిరేకించినా రాష్ట్రంలో ఖనిజాల తవ్వకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తామని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రకటించారని.. బస్తర్ ప్రాంతంలో పోలీస్ క్యాంపుల వెనుక అక్కడి ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర ఉందన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, ఆ మేరకు ఆదివాసీల వ్యతిరేకతతో వేదాంత కంపెనీ వెనక్కి వెళ్లిపోయిందని గుర్తు చేశారు. మావోయిస్టుల ఏరివేత వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమేనన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు వి.ఎస్.కృష్ణ మాట్లాడుతూ మావోయిస్టు ఉద్యమాన్ని రాజకీయంగా పరిష్కరించే దృష్టి ప్రభుత్వాలకు లేదన్నారు. ప్రజల హక్కులకు లోబడి మావోయిస్టులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, దీనికి విరుద్ధంగా బూటకపు ఎన్కౌంటర్లు, గ్రామాలను ధ్వంసం చేయడం, లైంగిక దాడులు, వ్యక్తుల అదృశ్యం వంటి చర్యలకు పాల్పడుతూ ఉద్యమాన్ని క్రిమినలైజ్ చేశారని విమర్శించా రు. హక్కుల సంఘాల పోరాటంతో 2011లో కోర్టు సల్వాజుడుం రాజ్యాంగ విరుద్ధమని ఇచ్చిన తీర్పు తో దానిని రద్దు చేశారన్నారు. ఆ తర్వాత గ్రీన్హంట్, ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా, పెద్ద ఎత్తున రహదారులు నిర్మిస్తూ వనరుల దోపిడీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సదస్సులో పర్యావరణవేత్త గంజివరపు శ్రీనివాస్, ఆదివాసీ హక్కుల నేత రామారావు దొర, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, న్యాయవాది వృద్ధుల కల్యాణ రామా రావు, వామపక్ష నేతలు ఎం.పైడిరాజు, వై.కొండయ్య, డి.లలిత, ఎ.విమల, పద్మ, ఎం. లక్ష్మి, ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.సామాజిక వేత్త ఆచార్య హరగోపాల్ -
24న క్యాబ్ డ్రైవర్ల ధర్నా
సీతమ్మధార: తమ సమస్యల పరిష్కారానికి ఈ నెల 24న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపడుతున్నట్టు క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు బి.జగన్, అధ్యక్షుడు సిహెచ్.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె.పోలినాయుడు తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం జరిగిన కార్యక్రమంలో ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లకు రాడార్ ట్రిప్పులు, ప్రీపెయిడ్ ఆప్షన్ తీసివేయాలని డిమాండ్ చేశారు. క్యాబ్ డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సామాజిక భద్రత చట్టం చేయాలన్నారు. డ్రైవర్లు, కస్టమర్లకు ఉపయోగపడేలా ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వం యాప్ను తీసుకురావాలని కోరారు. మోటార్ వెహికల్ చట్టం 2019, గ్రీన్ టాక్స్లను రద్దు చేయాలని, బీమా ప్రీమియం, టోల్గేట్ చార్జీ లు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు. -
ఇక వృద్ధులకు ఒంటరితనం దూరం
● టైమ్ బ్యాంక్ కాన్సెప్ట్తో ఇది సాధ్యం ● కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: రాజస్థాన్కు చెందిన పి.సి.జైన్, అతని బృందం అభివృద్ధి చేసిన టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా వయోవృద్ధులకు ఒంటరితనం పోతుందని, అవసరమైన సమయంలో తోడు దొరుకుతుందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఇందులో భాగంగానే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ సహకారంతో విశాఖను పైలట్ జిల్లాగా ఎంపిక చేసిందన్నారు. టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా–విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పరిషత్ సమీపంలోని ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ భవన్లో సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండటంతో సీనియర్ సిటిజన్లకు ఒంటరితనం అనే భావన ఉండేది కాదన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారడం వల్ల వారు ఒంటరిగా మారుతున్నారని, రోజు వారీ అవసరాలు, వారి భావోద్వేగ అవసరాల్లో ఇతరుల తోడు అవసరమవుతుందన్నారు. ఈ టైమ్ బ్యాంక్ భావనతో ఆ పరిస్థితిని మార్చుకోవచ్చని కలెక్టర్ అన్నారు. అనంతరం సంబంధిత బ్రోచర్ను కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ఆవిష్కరించారు. ఉచితంగా రిజిస్ట్రేషన్ టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్లో భాగంగా 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు www.timebankofindia.com వెబ్సైట్లో లేదా బ్యాంక్ అనే మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ జె.మాధవి చెప్పారు. రిజిస్ట్రేషన్, సేవ, పాస్ బుక్ పొందడం మొదలైనవన్నీ ఉచితంగా లభిస్తాయని తెలిపారు. యువకులు మాత్రమే కాకుండా, సహాయం అందించడానికి అర్హులైన వారందరూ స్వచ్ఛందంగా సేవ చేయవచ్చని, ఆ మేరకు వారి సమయం వారి పాస్ పుస్తకాల్లో జమ అవుతుందని వివరించారు. వారికి అవసరమైనప్పుడు ఇతరుల నుంచి సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. నమోదిత సభ్యులను స్థానిక నిర్వాహకుల ద్వారా వారి కేవైసీ ధ్రువీకరిస్తామని.. పోలీస్ వెరిఫికేషన్కు కూడా పంపిస్తామని స్పష్టం చేశారు. పైలట్ జిల్లాగా ఎంపికై న విశాఖపట్నంలో ఈ కాన్సెప్ట్ అమలుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో భాగంగా టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులు కలెక్టర్, ఇతర అధికారులను సత్కరించారు. క్రైం డీసీపీ రాజ్ కమల్, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, వి.ఎస్.కళాశాల ప్రిన్సిపాల్ విజయ బాబు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కుతంత్రం
కూటమిమేయర్ పీఠం కోసం కుయుక్తులు● రంగంలోకి దిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ● కార్పొరేటర్కు రూ.25 లక్షల చొప్పున బేరం● ససేమిరా అంటున్న వారికి ఎక్కువ ఆఫర్లు ● లొంగని వారికి బెదిరింపులుడాబాగార్డెన్స్ : విశాఖలో కూటమి కుట్రలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దుర్బుద్ధితో తెర వెనుక అప్రజాస్వామిక ప్రయత్నాలు సాగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీకి చెందిన కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు కోట్లాది రూపాయలు సిద్ధం చేశారు. ఒక్కొక్క కార్పొరేటర్కు ఏకంగా రూ.25 లక్షలు వెలకట్టి, వారిని కొనుగోలు చేసేందుకు తెగబడినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కూటమికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం నేరుగా రంగంలోకి దిగడం గమనార్హం. కొందరికి భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తూ, మరికొందరి వ్యాపారాలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరైనా లొంగకపోతే వారి ఆస్తులను ధ్వంసం చేస్తామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా అప్రజాస్వామిక విధానాలను అవలంబించి స్థానిక సంస్థలను చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు విశాఖ నగర పీఠాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కుట్రలు పన్నుతోంది. గ్రేటర్లో బలం లేకపోయినా.. గ్రేటర్లో కూటమికి సంఖ్యా బలం లేదు. మహా విశాఖ నగరపాలక సంస్థలోని 98 వార్డులకు కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం 19వ వార్డు మినహాయిస్తే 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైఎస్సార్ సీపీ 58, తెలుగుదేశం 29, జనసేన 3, సీపీఐ, సీపీఎం, భాజపాకు ఒక్కొక్కరు, నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లు గెలుపొందారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను నయానో భయానో తమకు మద్దతు తెలిపేలా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రలోభాలు, బెదిరింపులకు దిగుతున్నారు. ఇందుకోసం అవసరమైతే క్యాంపు రాజకీయాలకు కూడా సిద్ధమవుతున్నారు. కూటమిలో చేరితే రూ.25 లక్షలు ఇస్తామని ఎర వేస్తున్నట్టు తెలిసింది. అక్కడికీ లొంగకపోతే మరింత ఎక్కువ ఇస్తామని నమ్మబలుకుతున్నారు. వార్డుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయిస్తాం.. వచ్చే ఎన్నికల్లో సీటు మీదే.. ఇలా పలు విధాలుగా లొంగదీసుకునేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కమిషనర్నే నియమించుకోలేయపోయారు కూటమి ప్రభుత్వం దాదాపు రెండు నెలలుగా జీవీఎంసీ కమిషనర్ను నియమించకుండా పాలనను గాలికి వదిలేసిందని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 10న వామపక్షాలు జీవీఎంసీలో పాలన పూర్తిగా గాడి తప్పిందని నిరసన తెలిపారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడి, అధికారులు సైతం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు కనీస సౌకర్యాలు అందడం లేదు. పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. దోమల బెడదతో నగర ప్రజలు రోగాల బారిన పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడు. ఎండాకాలం కావడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా.. వార్డుల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం కమిషనర్ను నియమించలేని అసమర్థ ప్రభుత్వం.. కుట్రలు చేసి అధికారం దక్కించుకోవాలని చూడటం సిగ్గుచేటని మండిపడుతున్నారు. కూటమి నేతలు కుట్రలను మానుకొని పాలనపై దృష్టి సారించాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతు చూస్తామంటూ బెదిరింపులు కూటమి నేతల ఆఫర్లకు తలొగ్గని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు దిగుతున్నారు. మద్దతు తెలపని కార్పొరేటర్లను ‘మీ అంతు చూస్తాం’అంటూ కూటమి నేతలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వార్డుల్లో అభివృద్ధి పనులు జరగనివ్వబోమని, వ్యాపారాలు, ఇతర పనులు సాఫీగా సాగనివ్వబోమని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉంది. మా నాయకుడు ఇప్పటికే వైఎస్సార్ సీపీకి ఎటువంటి పనులు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు.’ అంటూ కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ద్రోహం చేయలేను ‘నాకు వైఎస్సార్ సీపీ రాజకీయ భిక్ష పెట్టింది. పార్టీకి ద్రోహం చేయలేను. ఇప్పటికే జనసేన, టీడీపీల నుంచి నాకు ఫోన్లు వచ్చాయి. వాళ్లు ఎన్నో ప్రలోభాలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా నువ్వే ఉంటావని హామీ ఇచ్చారు. నా వార్డు అభివృద్ధికి మరింత సహకారం అందిస్తామని చెప్పారు. వార్డులో జనసేన, టీడీపీ కార్యకర్తలు నీ వెంటే ఉంటారని తెలిపారు. అంతేకాదు నాకు మరిన్ని పదవులు ఇస్తామని ఎన్నో వాగ్దానాలు చేశారు. డబ్బు కూడా ఇస్తామన్నారు.’ అంటూ ఓ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ ప్రారంభం
ఏయూక్యాంపస్: తీరప్రాంత భద్రత ప్రాధాన్యతను వివరిస్తూ సీఐఎస్ఎఫ్ చేపట్టిన సైకిల్ థాన్ను మంగళవారం ఉదయం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు జెండా ఊపి ప్రారంభించారు. విశ్వప్రియ ఫంక్షన్ హాలు వద్ద ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకా కుళం నుంచి సైకిల్థాన్ బృందం సోమవారం విశాఖ చేరుకున్న విషయం తెలిసిందే. తిరిగి విశాఖ నుంచి మంగళవారం తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. సైకిల్థాన్కు మద్దతుగా పలువురు చిన్నారులు సైకిళ్లపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంట కొంత దూరం ప్రయాణించారు. పీపీఏ సెక్రటరీ టి.వేణు గోపాల్ పాల్గొన్నారు. -
కుట్రలకు కేరాఫ్ చంద్రబాబు
వెన్నుపోటు రాజకీయాలు.. అరాచక పాలన● తమ కార్పొరేటర్లకు అధికారులతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నారు ● ప్రలోభాలతో సిగ్గు లేని రాజకీయాలకు తెరతీస్తున్నారు.. ● వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ● బెదిరింపులు సహించం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు రాజకీయమంతా కుట్రలు, కుతంత్రాలేనని.. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లకు అధికారులతో ఫోన్లు చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులు, సమన్వయకర్తలతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్తో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీలకు బలం లేకున్నా మేయర్పై అవిశ్వాసం పెట్టడానికి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీలోని కొంతమంది కార్పొరేటర్లను టీడీపీలోకి చేర్చుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్ సీపీ అంటే అభిమానంతో ఉన్న కార్పొరేటర్లు భయపడేది లేదని, మేయర్ పీఠాన్ని తప్పకుండా కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. స్టీల్ప్లాంట్పై కూటమి ప్రభుత్వం దగా విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగా మరోసారి బయట పడిందని ఆయన అన్నారు. ప్యాకేజీ ఇచ్చాం, ప్రైవేటీకరణ అంశమే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ప్రకటనలు తప్పని కేంద్ర ఆర్థిక శాఖ అనుబంధంగా ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్(దీపం) ఇచ్చిన సమాధానంతో బట్టబయలైందని పేర్కొన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేది లేదని దీపం రాసిన లేఖతో కూటమి నేతల నాటకాలు అందరికీ తెలుస్తున్నాయన్నారు. స్టీల్ప్లాంట్కు ప్యాకేజీ తీసుకొచ్చి ప్రైవేటీకరణను తామే ఆపించామని చెబుతున్న కూటమి నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని, రాష్ట్ర సంపదను దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందన్నారు. తలొగ్గకుంటే కేసులు పెడతారంట? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారని, తలొగ్గకపోతే కేసులు పెడతామని భయపెడుతున్నారన్నారు. ప్రలోభాలతో తమ పార్టీకి చెందిన ముగ్గురు, నలుగురు కార్పొరేటర్లను చేర్చుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కార్పొరేటర్లకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. తమ కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని, భవిష్యత్తులో అసలైన రాజకీయం వారికి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దేవన్రెడ్డి, జీవీఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
వేయి కనులు చాలవులే..
కొమ్మాది: రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. సాగరానికి అభిముఖంగా ఎత్తైన కొండపై కొలువుదీరిన ఈ ఆలయం ఉత్తరాంధ్ర తిరుపతిగా పేరుగాంచింది. ఇక్కడికి వచ్చే భక్తులు ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శించుకున్న అనుభూతిని పొందుతున్నారని చెబుతున్నారు. పచ్చని కొండలు, విశాలమైన సముద్ర తీరం మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. యాంత్రిక జీవనంతో అలసిపోయిన వారికి ఈ ప్రదేశం ప్రశాంతతను, ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తోంది. ఈ ఉత్తరాంధ్ర వైకుంఠధామంలో ఈ నెల 20న తృతీయ వార్షికోత్సవం నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అణువణువునా అద్భుతమే.. శ్రీ వారి ఆలయం అణువణువునా ఓ అద్భుతమే. కనుచూపు మేర పరుచుకున్న ప్రకృతి అందాల మధ్య 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ నిర్మించింది. 1.5 ఎకరాల్లో ప్రధాన ఆలయం ఉంటుంది. కొండపైకి రోడ్డుమార్గం సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్డుకిరువైపులా పూల మొక్కలు, శ్రీ వారి నామాలతో అలంకరించిన పూల కుండీలు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక శోభ, శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా నిర్మించిన ఈ శ్రీవారి ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. భక్తులకు సువర్ణావకాశం శ్రీవారి ఆలయంలో ప్రతి నెలా శ్రవణ నక్షత్రం సందర్భంగా స్నపన తిరుమంజనం, ప్రతీ శుక్రవారం వారాభిషేకంలో భాగంగా శ్రీవారికి మేల్చాట్ వస్త్రం ధరింపజేస్తున్నారు. భక్తులు నేరుగా శ్రీవారికి మేల్చాట్ వస్త్రాన్ని అందించే అవకాశం ఉంది. ఈ వస్త్రం ధర రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంటుంది. ఏటా వైకుంఠ ఏకాదశి, ఉగాది, బ్రహ్మోత్సవాల ముందు మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయిస్తున్నారు. ప్రతి శనివారం కోలాటాలు, శ్రీవారి నామ సంకీర్తనలు, అన్నమాచార్య సంకీర్తనలు, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాలు జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిత్యం అన్నప్రసాదాల పంపిణీ జరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో శ్రీవారి సేవకు వస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని చేరుకునేందుకు కొండపైకి ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఆటోలకు అనుమతి లేదు. కొండ చిన్నది కావడంతో భక్తులు నడిచి ఆలయాన్ని చేరుకోవచ్చు. కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంది. రాత్రి 7.45 గంటల వరకు మాత్రమే స్వామి దర్శనానికి భక్తులు అనుమతి కలదు. వేడుకలు ఇలా.. ఈ నెల 20న శ్రీవారి ఆలయ తృతీయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు తెలిపారు. ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు సుప్రభాతం, 5.30 నుంచి 7 గంటల వరకు తోమాల సహస్ర నామార్చన, మొదటి గంట నిర్వహించి 7 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నారు. ఆ రోజు ప్రత్యేకంగా భగవత్ అనూజ్ఞ, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, హోమం, ఉత్సవ మూర్తులకు అష్టోత్తర శత కలశ స్నపనం, పూర్ణాహుతి, అక్షతారోపణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మాఢ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏఈవో తెలిపారు. ఉత్తరాంధ్ర తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిత్యం శ్రీవారిని దర్శించుకుంటున్న వేలాది మంది భక్తులు రేపు ఆలయ తృతీయ వార్షికోత్సవం ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగంశ్రీవారి సేవలివీ సేవ వివరాలు భక్తుల సమయం టికెట్ ధర సంఖ్య సుప్రభాతం 1 ఉ. 6 గంటలు 100 పుష్పవిరాళం 4 ఉ. 8 గంటలు 12,000 తోమాల సేవ 1 ఉ. 8 గంటలు 200 సహస్ర నామార్చన 1 ఉ. 8.30 గంటలు 200 అర్చన 1 ఉ. 9.30 నుంచి సా.7.30 గంటలు 100 మేల్చాట్ వస్త్రం 4 ఉ. 6.30 గంటలు 30,150 అభిషేకం(శుక్ర) 1 ఉ. 6.30 గంటలు 250 ఏకాంత సేవ 1 రాత్రి 8 గంటలు 100 వేదాశీర్వాదం 4 ఉ. 10 నుంచి సా.6 గంటలు 1,500 భోగం విరాళం 4 – 10,000 -
కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపకపోతే నిరవధిక సమ్మె
ఉక్కునగరం: కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపకపోతే నిరవధిక సమ్మైకె నా వెనుకాడబోమని ఉక్కు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఈడీ(వర్క్స్) బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో నాయకులు మాట్లాడుతూ తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని రీజనల్ లేబర్ కమిషనర్ ఆదేశించినా యాజమాన్యం లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికులను తొలగించడానికి మెడికల్ టెస్టులు బలవంతం చేయడం దుర్గార్మన్నారు. మరో వెయ్యి మందిని తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. స్టీల్ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చింది కార్మికులను తొలగించడానికా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కాంట్రాక్ట్ కార్మికులను తొలగించకుండా చూడాలన్నారు. ఈనెల 23న గాజువాక నుంచి కూర్మన్నపాలెం దీక్ష శిబిరం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్లాంట్ పర్సనల్ జీఎం ఎన్.భానుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నమ్మి రమణ, జి.శ్రీనివాసరావు, మంత్రి రవి, కె.వంశీ, ఉరుకూటి అప్పారావు, వేణు, ఉమ్మిడి అప్పారావు, రామిరెడ్డి, చట్టి నర్సింగరావు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. -
కబడ్డీ జాతీయ పోటీలకు విశాఖ క్రీడాకారులు
ఎంవీపీకాలనీ: బీహార్లో జరగనున్న 34వ సబ్ జూనియర్ జాతీయ స్థాయి కబడ్డీ చాంపియన్షిప్ పోటీలకు విశాఖ క్రీడాకారులు ఎంపికై నట్లు విశాఖ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాదరెడ్డి మంళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని వైఎస్సార్ ఇంటిగ్రేట్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన 34వ రాష్ట్ర సబ్ జూనియర్ బాలురు, బాలికల కబడ్డీ పోటీల్లో విశాఖ క్రీడాకారులు సత్తాచాటారు. బాలుర విభాగంలో పల్లి శ్రీనివాసులు(గాజువాక), బాలికల విభాగంలో పేట ద్రాక్షాయణి(పెందుర్తి) రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. మన రాష్ట్రం తరఫున బీహార్లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొనే బాలురు, బాలికల జట్లకు వీరు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసాదరెడ్డితో పాటు జాయింట్ సెక్రటరీ సీహెచ్ గోవిందు, కోశాధికారి లక్ష్మణరావు, జాతీయ క్రీడాకారులు వైవీ శ్రీనివాస్, వి.కనకరాజు తదితరులు అభినందించారు. -
సీఐపీఈటీ సహకారంతో ఎన్టీపీసీలో ఉపాధికి శిక్షణ
పరవాడ: విజయవాడలోని సీఐపీఈటీ సహకారంతో సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం కల్పిస్తున్న ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ఈడీ సమీర్శర్మ కోరారు. విజయవాడలోని సీఐపీఈటీని ఈడీ సమీర్శర్మ, సంస్థ అధికారులు మంగళవారం సందర్శించారు. శిక్షణ పొందుతున్న నిరుద్యోగులను కలిసి, వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈడీ సమీర్ శర్మ మాట్లాడుతూ సీఐపీఈటీ సహకారంతో సింహాద్రి ఎన్టీపీసీ శతశాతం ఉద్యోగ నియామక హామీపై మెషిన్ ఆపరేటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, మెషిన్ ఆపరేటర్–ఇంజెక్షన్ మోల్డింగ్లో ఆరు నెలల శిక్షణ అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్లలో 120 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించామన్నారు. ప్రస్తుతం మరో 60 మంది నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. -
ఆచరణే అసలైన దేశభక్తి
● ఆర్ఎస్ఎస్ సహప్రాంత కార్యవాహ మాలపాటి శ్రీనివాసరెడ్డి ● అట్టహాసంగా ఆర్ఎస్ఎస్ మహానగర్ సాంఘిక్ ● ఘోష్ ప్రదర్శన, విన్యాసాలతో అబ్బురపరిచిన స్వయంసేవకులు సీతమ్మధార: ఏ పని చేసినా భారతదేశం గర్వించేలా ఉండాలని, భారతీయతను ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ఎస్ సహ ప్రాంత కార్యవాహ మాలపాటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అక్కయ్యపాలెంలోని పోర్ట్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మహానగర్ సాంఘిక్ ఉత్సాహంగా జరిగింది. పూర్ణగణవేష్తో వందలాది స్వయంసేవకులు హాజరయ్యారు. ఘోష్ ప్రదర్శనతో స్వయం సేవకులు ఆకట్టుకున్నారు. పలు రకాల విన్యాసాలతో అబ్బురపరిచారు. ఈ సందర్భంగా మాలపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మేధాశక్తి, నైపుణ్యానికి మనదేశం పెట్టింది పేరన్నారు. ధర్మ రక్షణ కోసం ఆర్ఎస్ఎస్ వందేళ్లుగా పని చేస్తోందన్నారు. వ్యక్తికి దేశభక్తి, సంస్కృతి పట్ల నిష్ట ఉండాలని, దేశానికి పూర్వవైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. వ్యక్తి నిర్మాణంతోనే సంఘ నిర్మాణం జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి దేశాన్ని దెబ్బతీసే వారిని ఇప్పటికీ చూస్తున్నామని.. అందుకే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలదేనన్నారు. స్వదేశీ భావన ఉపన్యాసాలతో సాధ్యం కాదని, కార్యాచరణ అవసరమన్నారు. మతం పేరుతో భూభాగాన్ని పోగొట్టుకున్నామని గుర్తుచేశారు. ప్రపంచంలోని అనేక సవాళ్లకు హిందూత్వమే సమాధానమని, మనదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ఒక అద్భుతమని కొనియాడారు. అమెరికా నేడు కుటుంబ వ్యవస్థను కోరుకుంటోందన్నారు. దేశంలో మళ్లీ ప్రాంతీయ భేదాలు సృష్టించి విడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశంలో సీ్త్రకి స్వాతంత్య్రం లేదని సోషల్ మీడియాలో నూరిపోస్తున్నారని, సీ్త్రని ప్రతి దశలోనూ కాపాడే వ్యవస్థ మనకుందన్నారు. ఒక ఆలయం మీద ఆధారపడి పది మంది జీవిస్తున్నారు. ఆలయాలు హిందూ సమాజాన్ని మేలుకొలిపే శక్తి కేంద్రాలుగా ఉన్నాయన్నారు. పర్యావరణ సమతుల్యత మన సంస్కృతిలోనే ఉందని, నదులను తల్లులుగా భావిస్తామన్నారు. రాజకీయ స్వార్థాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ట్రినీటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డైరెక్టర్ నాగ వెంకట సత్యేంద్ర, మహానగర సంఘ్ చాలక్ పి.వి.నారాయణరావు, సహ సంఘ్ చాలక్ బి.సి.అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
విశాఖ విద్య: ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డాక్టర్ వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన అసోసియేషన్ సమావేశంలో పి.గోపాలనాయు డు ఎన్నికల అధికారిగా కమిటీని ఎంపిక చేశా రు. అధ్యక్షుడిగా ఆర్.పి.నాయుడు(వీఎస్ కృష్ణా కాలేజీ), ఉపాధ్యక్షురాలుగా ఎ.శ్రీదేవి( పెందుర్తి), ప్రధాన కార్యదర్శిగా బి.మాధవరావు(భీమునిపట్నం)జాయింట్ సెక్రటరీగా పి.సుమతి(ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీ విశాఖ), కోశాధికారిగా పి.హేమంత్ కుమార్(కృష్ణా కాలేజీ), మహిళా కార్యదర్శిగా ఎల్.ఉమామహేశ్వరి (పెందుర్తి), రాష్ట్ర కౌన్సిలర్గా పీఎంకేఎం నాయుడు(కృష్ణా కాలేజీ)లను ఎన్నుకున్నారు. మూడేళ్లపాటు నూతన కమిటీ పనిచేయనుందని ఎన్నికల అధికారి ప్రకటించారు. -
పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శం
మహారాణిపేట : అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ అన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రాణాలను కూడా ఫణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన జీవితం అనుసరణీయమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో భవానీశంకర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి (ఈవో) కె.ఈశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆచార్య మలయవాసినికి సాహిత్య కళాభారతి బిరుదు
మద్దిలపాలెం: ప్రముఖ ఆంధ్ర భాషా ఆచార్యులు, అభినవ మొల్ల, ఆచార్య కోలవెన్ను మలయవాసినికి సాహిత్య కళా భారతి బిరుదు ప్రదానం ఘనంగా జరిగింది. విశాఖ మ్యూజిక్, డాన్స్ అకాడమీ(వీఎండీఏ), కళాభారతి నిర్వాహక మండలి ఆధ్వర్యంలో ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. అకాడమీ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు, ట్రస్టీ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.ఆర్.కె.ప్రసాద్, కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్లు.. విశ్రాంత సంస్కృత అధ్యాపకుడు పిళ్లా వెంకట రమణమూర్తి రాసి చదివిన సన్మాన పత్రం, నూతన వస్త్రాలు, నగదు పురస్కారంతో ఆచార్య మలయవాసిని దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ ఆచార్య కోలవెన్ను మలయవాసినికి సాహిత్య కళా భారతి బిరుదు ప్రదానం చేసిన సభలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సత్కార గ్రహీత ఆచార్య మలయవాసిని తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డాక్టర్ గుమ్మలూరి ఇందిర రచించిన ‘మన రాముడు’అనే పుస్తకాన్ని రఘునాథ శర్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. డాక్టర్ పేరి రవికుమార్ పుస్తక సమీక్ష చేశారు. -
మరో రెండు అడుగుల దూరంలో..
● తన 7వ ఏట డ్యాన్స్ శిక్షణ ప్రారంభించిన చైతన్య.. కొన్ని నెలలకే ఒరిజినల్ స్ట్రీట్ డ్యాన్స్ పోటీల్లో 70 మందితో పోటీ పడి విజేతగా నిలిచాడు. ● రాష్ట్ర డ్యాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ 2022లో నిర్వహించిన ఏపీ స్టేట్ బ్రేకింగ్ చాంపియన్షిప్ పోటీల్లో అండర్–16 విభాగంలో బంగారు పతకం సాధించాడు. ● ఐఐటీ మద్రాస్లో 2023 జనవరిలో నిర్వహించిన ఒరిజినల్ స్ట్రీట్ డ్యాన్స్ చాంపియన్షిప్ పోటీలో అండర్–16 విభాగంలో విజేతగా నిలిచాడు. ● అమెచ్యూర్ డ్యాన్స్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2023 డిసెంబర్లో నిర్వహించిన 3వ నేషనల్ బ్రేకింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ఆల్ ఇండియా 8వ ర్యాంకుతో ప్రతిభ చాటాడు. ● 2024 జూన్లో నిర్వహించిన నాలుగో నేషనల్ బ్రేకింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆల్ ఇండియా 8వ ర్యాంకు సాధించాడు. ● వరల్డ్ డ్యాన్స్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2024 సెప్టెంబర్లో చైనాలో జరిగిన 5వ వరల్డ్ యూత్ బ్రేకింగ్ చాంపియన్షిప్ పోటీలో 122వ వరల్డ్ ర్యాంక్ సాధించి అబ్బురపరిచాడు. ఈ పోటీల్లో ఇండియా నుంచి నలుగురు పాల్గొనగా.. చైతన్య ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ● బ్రేక్ డ్యాన్సింగ్లో అథ్లెట్గా యూఎస్ఏ గుర్తింపు కార్డు ఇచ్చింది. ఈ గుర్తింపుతో ప్రపంచంలోని ఏ దేశంలో జరిగే పోటీల్లోనైనా చైతన్య పాల్గొనడానికి అవకాశం దక్కింది. ● 2025 నవంబర్లో ఇండోనేషియాలో, ఆ తర్వాత చైనాలో మరోసారి జరగనున్న పోటీల్లో ప్రతిభ చూపితే 2026 డాకర్లో జరిగే యూత్ ఒలింపిక్స్లో భారత్ తరఫున పాల్గొనే అవకాశం చైతన్యకు లభిస్తుంది. -
నేడు విశాఖకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
రేపటి నుంచి ప్రాక్టీస్ విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్గా వ్యవహరిస్తున్న అక్షర్ పటేల్ తన జట్టుతో కలిసి సోమవారం విశాఖపట్నం చేరుకోనున్నారు. విశాఖలోని వైఎస్సార్ స్టేడియాన్ని తమ రెండో హోం గ్రౌండ్గా ఎంచుకున్న డీసీ ఈ సీజన్ను ఇక్కడే ప్రారంభించనుంది. చాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్ జట్టులోని డీసీ సభ్యులంతా వారి ఇంటి నుంచి నేరుగా విశాఖ చేరుకుంటారు. మంగళవారం నుంచి వైఎస్సార్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటారు. గతంలో పంజాబ్ తరఫున ఆడిన అక్షర్ 2016లో హాట్రిక్ సాధించాడు. 2020లో రన్నరప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ట్రోఫీ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖలో జరిగే తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ)తో తలపడనుంది. హెడ్ కోచ్ హేమంగ్ బదాని, సహాయ కోచ్ మాథ్యూ, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ పర్యవేక్షణలో అక్షర్ పటేల్, ఇతర ఆటగాళ్లు మంగళవారం నుంచి నెట్స్లో సాధన చేస్తారు. జట్టులో స్టార్క్, చమీరా వంటి విదేశీ బౌలర్లు, డ్యూ, బ్రూక్ వంటి బ్యాటర్లు, కేఎల్ రాహుల్, ఫెరీరా వంటి వికెట్ కీపర్లు ఉన్నారు. దేశవాళీ క్రికెట్లో సెంచరీలతో చెలరేగిపోయిన కరుణ్ నాయర్తో పాటు పోరెల్, స్టబ్స్, అశుతోష్, కుల్దీప్ కూడా ప్రాక్టీస్లో పాల్గొంటారు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన జట్టుతో ఈ నెల 22న విశాఖ చేరుకోనున్నారు. గత సీజన్లో రిషబ్ డీసీకి కెప్టెన్గా ఉన్నారు. ఎల్ఎస్జీ 23న నెట్స్లో ప్రాక్టీస్ చేయనుంది. డీసీ, ఎల్ఎస్జీ మధ్య తొలి మ్యాచ్ ఈ నెల 24న విశాఖలో జరగనుంది. -
తీరం కోతకు డ్రెడ్జింగ్ పూత
● పనులు ప్రారంభించిన డీసీఐ ● రూ.20 కోట్లు ఖర్చు సాక్షి, విశాఖపట్నం: అలలు ఎగసిపడి తీరంపై దాడి చేయడం ప్రకృతి సహజం. ఈ దాడి కారణంగా తీరం క్రమంగా కోతకు గురవుతోంది. ఈ కోత తీవ్రం కావడంతో బీచ్ తన సహజ రూపాన్ని కోల్పోతోంది. ఈ నష్టాన్ని నివారించడానికి విశాఖ పోర్టు ఏటా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సహాయంతో ఈ ఏడాది కూడా సుమారు రూ.20 కోట్లతో కోత నివారణ పనులు చేపట్టింది. కాగా.. విశాఖ తీరంలో ఇసుక కోతకు సంబంధించి పదేళ్ల కిందట నెదర్లాండ్కు చెందిన డెల్టారిస్ అనే సంస్థ సర్వే చేసింది. అలల తాకిడి కారణంగా పెద్ద మొత్తంలో ఇసుక సముద్రంలోకి వెళ్లిపోతోందని గుర్తించింది. ఈ సమస్యకు ఇసుక మేటలను తిరిగి తీరానికి తరలించడం ఒక్కటే పరిష్కారమని సూచించింది. తీరం కోతకు గురవుతున్న విషయంపై ఆందోళన వ్యక్తం చేసిన విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) దాని నివారణ బాధ్యతను తన భుజానికెత్తుకుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్) జరిగిన నేపథ్యంలో 2016లో కోత నివారణకు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేసింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహాయంతో 4.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీరానికి తీసుకొచ్చి.. కోత నివారణకు చర్యలు తీసుకుంది. ఏటా మాదిరిగానే ఈ సారి డ్రెడ్జింగ్ కార్పొరేషన్తో విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.6 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వీపీఏ ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది 2.1 లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున మొత్తం 6.3 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను డీసీఐ డ్రెడ్జర్ ద్వారా తోడనుంది. -
తాటిపూడి వద్ద భూమాత సరికొత్త వెంచర్
కొమ్మాది : భూమాత గ్రూప్, ఎస్విఎన్ గ్రూప్ సంయుక్తంగా తాటిపూడి వద్ద 200 ఎకరాల్లో భూమాతాస్ ఎస్విఎన్ స్వప్నలోక్ పేరుతో వెంచర్ వేస్తున్నట్లు భూమాత గ్రూప్ ఎండీ తాళ్లూరి పూర్ణచంద్రరావు తెలిపారు. బీచ్రోడ్డులోని ఓ రిసార్ట్లో ఆదివారం సాయంత్రం దీనికి సంబంధించిన బ్రోచర్ను ఎస్విఎన్ ప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 ఎకరాల్లో 5 ఫేజ్ల్లో.. 1650 ఫ్లాట్లు వీఎంఆర్డీఏ అనుమతులతో అందరికి అందుబాటు ధరల్లో నిర్మించినట్లు తెలిపారు. ఈ వెంచర్లో ఇంతవరకు రియల్ఎస్టేట్ చరిత్రలో ఎవరు ఇవ్వని సౌకర్యాలు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. థీమ్డ్ ప్రీమియం రెసిడెన్షియల్ మెగా ప్రాజెక్టుగా కస్టమర్లకు విశ్రాంతి, వినోదం ఇచ్చే ఇలాంటి భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ఆంధ్రలో ఇదే మొదటిదని తెలిపారు. ఈ వెంచర్కు సమీపంలోని తాటిపూడి రిజర్వాయర్ను ప్రభుత్వం టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తుండడంతోపాటు 500 ఎకరాల్లో జిందాల్ కంపెనీ టూరిస్ట్ స్పాట్గా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ వెంచర్ మీదుగా 4 లైన్ల హైవే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తాళ్లూరి శివాజి, కిరణ్ శంకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
గ్లకోమా.. జాగ్రత్త సుమా
బీచ్రోడ్డులో అవగాహన ర్యాలీఏయూక్యాంపస్: ప్రజలు గ్లకోమా వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్య శాల వైద్యుడు టి.సాయి యశ్వంత్ సూచించారు. ఎల్వీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్.కె బీచ్ నుంచి వైఎంసీఏ వరకు గ్లకోమా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ గ్లకోమా పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. మార్చి 8 నుంచి 16 వరకు ఆస్పత్రి ఆధ్వర్యంలో గ్లకోమా అవగాహన వారోత్సవాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలు, అవగాహన సదస్సుల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గ్లకోమాను తొలి దశలో గుర్తించడానికి, మెరుగైన చికిత్సకు, అంధత్వాన్ని నివారించడానికి పలు సూచనలు చేశారు. జీఎంఆర్ వరలక్ష్మి ప్రాంగణంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించా రు. ఆస్పత్రి ప్రధాన వైద్యుడు డాక్టర్ వీరేంద్ర సచ్దేవ మాట్లాడుతూ కుటుంబంలో ఎవరికై నా గ్లకోమా ఉంటే తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 40 ఏళ్లు పైబడిన ప్రతి 200 మందిలో ఒకరికి గ్లకోమా వచ్చే అవకాశం ఉందన్నారు. గ్లకోమా ముదిరే వరకు లక్షణాలు కనిపించకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, తొలి దశలో గుర్తిస్తే చూపును కాపాడుకోవచ్చన్నారు. డాక్టర్ శ్రావణి కొడాలి మాట్లాడుతూ 40 ఏళ్ల లోపు వారు 2–4 ఏళ్లకోసారి, 40–60 ఏళ్ల వారు 2–3 ఏళ్లకోసారి, 60 ఏళ్లు పైబడిన వారు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రపంచ గ్లకోమా సంస్థ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 7 మిలియన్ల మంది గ్లకోమా కారణంగా అంధులు అవుతున్నారు. వీరిలో 66 శాతం మంది మహిళలేనని, అవగాహన లేకపోవడం వల్ల 90 శాతం కేసులు గుర్తించలేకపోతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహన ర్యాలీలో ప్లకార్డులు పట్టుకుని 200 మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
విజయోస్తు
నేటి నుంచి పదో తరగతి పరీక్షలుజిల్లాలో పరీక్ష కేంద్రాలు 134 ఏ కేటగిరీ కేంద్రాలు 48 బీ కేటగిరీ కేంద్రాలు 71 సీ కేటగిరీ కేంద్రాలు 9 సమస్యాత్మక కేంద్రాలు 6 చీఫ్ సూపరింటెండెంట్లు 134 డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 134 రూట్ ఆఫీసర్లు 14 అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లు 14 హాజరుకానున్న విద్యార్థులు 29,927 రెగ్యులర్ 28,523 ప్రైవేటు 1,404 బాలురు 15,094బాలికలు 13,429విశాఖ విద్య: పదో తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని 448 పాఠశాలల నుంచి 28,523 మంది విద్యార్థులు రెగ్యులర్గా, మరో 1,404 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లాలో 134 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 134 మంది సీఎస్లు, 134 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 14 మంది రూట్ ఆఫీసర్లు, మరో 14 మంది అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లను పరీక్షల పర్యవేక్షణ నిమిత్తం కేటాయించారు. ప్రతీ కేంద్రంలో సరిపడా ఇన్విజిలేషన్ సిబ్బందిని నియమించారు. అవసరమైన పక్షంలో వినియోగించుకునేలా అనకాపల్లి జిల్లా నుంచి 240 మంది ఉపాధ్యాయులను రిజర్వ్లో ఉంచారు. పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రాలను తనిఖీ చేసేలా ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. గోపాలపట్నం బాలుర, బాలికల హైస్కూళ్లలో పరీక్షా కేంద్రాలను రాష్ట్ర పరిశీలకుడు డి.దేవానందరెడ్డి జిల్లా విద్యాశాఽధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈవో ఎన్.ప్రేమ్కుమార్, పాఠశాల హెచ్ఎం వేణుగోపాల్ పర్యటనలో పాల్గొన్నారు. ఓపెన్ పరీక్షలకు 938 మంది విద్యార్థులు సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్) ఆధ్వర్యంలోని పదో తరగతి పరీక్షలు కూడా సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాలో 938 మంది పరీక్షలకు హాజరుకానుండగా, ఇందుకోసం 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రానికి వంద మీటర్లు పరిధిలో ఉన్న జెరాక్స్ కేంద్రాలను మూసివేసేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఇన్విజిలేషన్ సిబ్బంది, ఛీప్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదు. పరీక్షలు ఎప్పటివరకంటే : సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ పరీక్ష సమయం : ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటలు పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సూచనలు విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటికి వెళ్లడానికి అనుమతి లేదు. సున్నితమైన పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడింది. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ ఫోన్ తీసుకురావద్దు. విద్యార్థులకు సూచనలు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి. సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్ డివైజులు, స్మార్ట్ వాచ్లు తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్టికెట్ చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలో తాగునీరు, నిరంతర విద్యుత్, ఫ్యాన్లు ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రతీ కేంద్రంలో ఆశ కార్యకర్త, ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. -
ఆచార్య.. ఫలితాలెప్పుడు?
● ఏయూ రంగస్థల విభాగంలో వింత పోకడలు ● పరీక్షలు పూర్తయి ఐదు నెలలైనా ఫలితాల విడుదలలో జాప్యం ● తెర వెనుక వివాదాలే కారణమా? విశాఖ విద్య: యూనివర్సిటీల్లో పరీక్షలు పూర్తయిన రెండు నెలల్లో ఫలితాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఆంధ్ర యూనివర్సిటీలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. పరీక్షల విభాగంపై వర్సిటీ పాలనాధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని విద్యార్థులు అంటున్నారు. యూనివర్సిటీ క్యాంపస్లో నిర్వహిస్తున్న రంగస్థల విభాగం (థియేటర్ ఆర్ట్స్) పరీక్ష ఫలితాల్లో మితిమీరిన జాప్యం నెలకొంది. ఇక్కడ పని చేస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ ఆచార్యుల మధ్య నెలకొన్న మనస్పర్థలతో ఆ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ప్రచారం ఉంది. గతేడాది నవంబర్లో జరిగిన డిప్లమో యాక్టింగ్, డైరెక్షన్ ఆఖరి ఏడాది పరీక్ష ఫలితాలు మార్చి గడుస్తున్నా ఇంకా ప్రకటించలేదు. విద్యార్థులు రాసిన జవాబుపత్రాలు రంగస్థల విభాగానికి ఎప్పుడో చేరినా.. వాటిని మూల్యాంకనం చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ‘రంగస్థలం’కు పునరుజ్జీవం ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాటకరంగానికి పుట్టినిల్లుగానే చెబుతారు. అందుకనే ఆంధ్ర యూనివర్సిటీలో నటన, దర్శకత్వం కోర్సుల నిర్వహణకు ప్రత్యేకంగా థియేటర్ ఆర్ట్స్ విభాగం ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ నిర్వహించే నటన, దర్శకత్వంలో ఒక్కో కోర్సులో 20 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. అయితే రెండేళ్లుగా అడ్మిషన్లు చేపట్టలేదు. దీనికి పునరుజ్జీవం పోసేలా విభాగాధిపతి నరసింహారావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ విద్యా సంవత్సరంలో మళ్లీ కోర్సుల నిర్వహణ ప్రారంభమైంది. రంగస్థల విభాగం ప్రాధాన్యం దృష్ట్యా కోర్సుల నిర్వహణకు ఎటువంటి ఆటంకం లేకుండా అవసరమైన నిధులు సైతం కేటాయిస్తున్నారు. రెగ్యులర్ పోస్టుల భర్తీ లేకపోవడంతో ఇద్దరు కాంట్రాక్టు ఆచార్యులు, మిగతా అన్ని సబ్జెక్టులకు సరిపడే గెస్ట్ ఫ్యాకల్టీలను నియమించారు. ఆచార్యుల తీరు మారాల్సిందే.. రంగస్థల విభాగంలో అత్యధిక మార్కులతో ప్రతిభ సాధించిన విద్యార్థులకు స్నాతకోత్సవంలో బంగారు పతకాలు బహూకరిస్తారు. వీటిని ఎవరికి ఇవ్వాలనేది ఆచార్యులకే సర్వాధికారాలు ఉంటాయి. విద్యార్థుల్లో నటన, సృజనాత్మక ప్రతిభను అంచనా వేయడం చాలా అవసరం. వాటిని బట్టి అంతర్గత, ప్రయోగ సామర్థ్యాలకు మార్కులు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారు పతకం మీకే ఇస్తామంటూ విద్యార్థులతో ఇక్కడి ఆచార్యులు బేరసారాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిణామాలతోనే గతంలో ఒక అధ్యాపకుడు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడి రంగస్థల విభాగానికి మచ్చ తెచ్చిపెట్టారు. అయినా ఇక్కడి ఆచార్యుల్లో మార్పు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడ్మిషన్లు ఆలస్యం వల్లే.. రంగస్థల విభాగంలో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ కాస్తా ఆలస్యమైంది. మూల్యాంకనం పూర్తి చేసేలా దృష్టి సారిస్తాం. కాంట్రాక్టు ఆచార్యులతో పాటు, మూల్యాంకనం కోసం రిటైర్డ్ ఆచార్యులను కూడా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే ఫలితాలు ప్రకటిస్తాం. – ఆచార్య నరసింహారావు, థియేటర్ ఆర్ట్స్ విభాగాధిపతి పరీక్షల విభాగం ఏం చేస్తున్నట్లో? పరీక్షల నిర్వహణ, వాటికి సకాలంలో మూల్యాంకనం చేయించి, ఫలితాలు విడుదల చేయడం వర్సిటీలోని పరీక్షల విభాగం (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్) బాధ్యత. కానీ ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షల విభాగం మొద్దు నిద్రపోతున్నట్లుగా ఉంది. రంగస్థల విభాగంలో పరీక్షలు నిర్వహించి ఐదు నెలలు కావస్తున్నా ఫలితాలు విడుదల చేయాలనే ధ్యాస లేకపోవడం వారి పనితీరుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిణామాలతో ఫలితాల కోసమని రంగస్థలం కోర్సు అభ్యసించిన విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. -
ఎట్టకేలకు కదలిక.!
● ఆరు లేన్ల రహదారి నిర్మాణ పనులు షురూ.. ● షీలానగర్ నుంచి సబ్బవరం వరకు 12.66 కి.మీ మేర రహదారి ● 2023లో రూ.554.64 కోట్లతో వర్క్ ఆర్డర్ ● ప్రస్తుతం రూ.963 కోట్లకు చేరుకున్న ప్రాజెక్టు వ్యయం రూ.400 కోట్ల అదనపు వ్యయంతో.. 2023లో వర్క్ ఆర్డర్ ఇచ్చిన సమయంలో రూ.554.64 కోట్లకు ప్రాజెక్టు ఖరీదుగా నిర్ణయించారు. అయితే డిజైన్లలో మార్పులు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్ల నిర్మాణం అదనంగా కొన్ని చోట్ల చేర్చి తుది డీపీఆర్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.963.93 కోట్లకు చేరుకుంది. విశాఖపట్నం జిల్లాలో ఆరు లేన్ల యాక్సెస్–కంట్రోల్డ్ హైవే నిర్మాణం కోసం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూ.963.93 కోట్లు మంజూరు చేసింది. సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు రోడ్డును కలుపుతూ షీలానగర్ జంక్షన్ నుంచి సబ్బవరం వరకూ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కొన్నేళ్ల క్రితం నుంచి ఈ ప్రాజెక్టు పలుమార్లు తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు 2023లో ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచి ఖరారు చేశారు. ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో రూ.554.64 కోట్లతో పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యారు. అయితే రహదారి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, మ్యాపింగ్ ఆలస్యమవ్వడం.. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో.. ప్రాజెక్టు వర్క్ ఆర్డర్లు అందించే దశలోనే నిలిచిపోయింది. రెండేళ్ల తర్వాత ఈ రహదారి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమైంది. ట్రాఫిక్ అంతరాయాలు తొలగించేలా.. అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారి–16 కారిడార్, ఎన్హెచ్–516సీ లోని షీలానగర్ జంక్షన్ మధ్య కనెక్టివిటీని పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. 12.66 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ హైవే సబ్బవరం గ్రామంలోని తూర్పు వైపున ప్రారంభమై, ప్రస్తుత పోర్ట్ రోడ్డులోని షీలానగర్ జంక్షన్లోని గెయిల్ కార్యాలయం సమీపం వరకూ 6 లైన్ల రహదారిగా రూపుదిద్దుకోనుంది. షీలానగర్ జంక్షన్ నుంచి పెదగాడి, నరవ, జెర్రిపోతులపాలెం, చింతగట్ల మీదుగా సబ్బవరం సమీపంలో జాతీయ రహదారికి ఈ రోడ్డు అనుసంధానం కానుంది. రెండు టోల్ప్లాజాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ కారిడార్ ఏర్పాటైతే విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. అదేవిధంగా షీలానగర్–ఆనందపురం ట్రాఫిక్ను సమర్థవంతంగా విభజించవచ్చు. దీని వల్ల సరకు రవాణా సులువవుతుంది. విశాఖపట్నం పోర్ట్కు కనెక్టివిటీ గణనీయంగా పెరిగి.. పోర్టు లాజిస్టికల్ సామర్థ్యం మెరుగుపడుతుందని విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) అధికారులు చెబుతున్నారు. రెండుమూడేళ్లలో ఈ ఆరులైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. -
ఆచరణే అసలైన దేశభక్తి
● ఆర్ఎస్ఎస్ సహప్రాంత కార్యవాహ మాలపాటి శ్రీనివాసరెడ్డి ● అట్టహాసంగా ఆర్ఎస్ఎస్ మహానగర్ సాంఘిక్ ● ఘోష్ ప్రదర్శన, విన్యాసాలతో అబ్బురపరిచిన స్వయంసేవకులు సీతమ్మధార: ఏ పని చేసినా భారతదేశం గర్వించేలా ఉండాలని, భారతీయతను ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ఎస్ సహ ప్రాంత కార్యవాహ మాలపాటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అక్కయ్యపాలెంలోని పోర్ట్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మహానగర్ సాంఘిక్ ఉత్సాహంగా జరిగింది. పూర్ణగణవేష్తో వందలాది స్వయంసేవకులు హాజరయ్యారు. ఘోష్ ప్రదర్శనతో స్వయం సేవకులు ఆకట్టుకున్నారు. పలు రకాల విన్యాసాలతో అబ్బురపరిచారు. ఈ సందర్భంగా మాలపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మేధాశక్తి, నైపుణ్యానికి మనదేశం పెట్టింది పేరన్నారు. ధర్మ రక్షణ కోసం ఆర్ఎస్ఎస్ వందేళ్లుగా పని చేస్తోందన్నారు. వ్యక్తికి దేశభక్తి, సంస్కృతి పట్ల నిష్ట ఉండాలని, దేశానికి పూర్వవైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. వ్యక్తి నిర్మాణంతోనే సంఘ నిర్మాణం జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి దేశాన్ని దెబ్బతీసే వారిని ఇప్పటికీ చూస్తున్నామని.. అందుకే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలదేనన్నారు. స్వదేశీ భావన ఉపన్యాసాలతో సాధ్యం కాదని, కార్యాచరణ అవసరమన్నారు. మతం పేరుతో భూభాగాన్ని పోగొట్టుకున్నామని గుర్తుచేశారు. ప్రపంచంలోని అనేక సవాళ్లకు హిందూత్వమే సమాధానమని, మనదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ఒక అద్భుతమని కొనియాడారు. అమెరికా నేడు కుటుంబ వ్యవస్థను కోరుకుంటోందన్నారు. దేశంలో మళ్లీ ప్రాంతీయ భేదాలు సృష్టించి విడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశంలో సీ్త్రకి స్వాతంత్య్రం లేదని సోషల్ మీడియాలో నూరిపోస్తున్నారని, సీ్త్రని ప్రతి దశలోనూ కాపాడే వ్యవస్థ మనకుందన్నారు. ఒక ఆలయం మీద ఆధారపడి పది మంది జీవిస్తున్నారు. ఆలయాలు హిందూ సమాజాన్ని మేలుకొలిపే శక్తి కేంద్రాలుగా ఉన్నాయన్నారు. పర్యావరణ సమతుల్యత మన సంస్కృతిలోనే ఉందని, నదులను తల్లులుగా భావిస్తామన్నారు. రాజకీయ స్వార్థాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ట్రినీటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డైరెక్టర్ నాగ వెంకట సత్యేంద్ర, మహానగర సంఘ్ చాలక్ పి.వి.నారాయణరావు, సహ సంఘ్ చాలక్ బి.సి.అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
చైతన్య షేక్
బ్రేక్ డ్యాన్స్తోతల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని కలలు కనే ఈ రోజుల్లో.. చదువుతో పాటు ఇతర కళల్లోనూ రాణించవచ్చని నిరూపిస్తున్నాడు 9వ తరగతి విద్యార్థి పెంటకోట చైతన్య. అక్కయ్యపాలేనికి చెందిన చైతన్య బ్రేక్ డ్యాన్స్లో అద్భుతమైన నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. చిన్న వయసు నుంచే పిల్లలను ఫౌండేషన్ కోర్సుల్లో చేర్పించి, వారి ఆసక్తులను పట్టించుకోకుండా ఆట పాటలకు దూరం చేస్తున్న ప్రస్తుత తరుణంలో చైతన్య కథ ఒక వెలుగు దివ్వె. తరగతి గది చదువులే కాదు, పిల్లలకు నచ్చిన రంగాల్లో ప్రోత్సాహం లభిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని చైతన్య తన విజయంతో చాటి చెబుతున్నాడు. అతను తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిద్దాం, అభినందిద్దాం. – సీతంపేటఇది ఏడేళ్ల కిందటి మాట.. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటన వచ్చింది. ఇది చూసిన పెంటకోట రాజేష్ రెండో తరగతి చదువుతున్న తన కుమారుడు చైతన్యకు డ్యాన్స్లో శిక్షణ ఇప్పించేందుకు శిబిరంలో చేర్పించారు. 45 రోజుల పాటు డ్యాన్స్ మాస్టర్ సోహెయిల్ సింగ్ వద్ద చైతన్య శిక్షణ తీసుకున్నాడు. చైతన్యలోని చురుకుదనం, బాడీ లాంగ్వేజ్, పట్టుదల, క్రమశిక్షణ చూసిన సోహెయిల్ సింగ్ ఆశ్చర్యపోయాడు. ఇదే విషయాన్ని రాజేష్కు చెప్పాడు. దీంతో కుమారుడిని ఇదే రంగంలో ప్రోత్సహించాలని ఆ తండ్రి నిర్ణయించుకుని సోహెయిల్ సింగ్ వద్ద శిక్షణ కొనసాగించారు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్ర, జాతీయ స్థాయి బీ–బాయ్స్(బ్రేక్ డ్యాన్స్) పోటీల్లో చైతన్య విజేతగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ముంబయిలో టోర్నడో అనే మాస్టర్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఏడేళ్ల వయసులో శిక్షణ ప్రారంభించిన పెంటకోట చైతన్య 2026 యూత్ ఒలింపిక్స్లో పాల్గొనడమే లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ● -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆరిలోవ : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు తెలిపారు. విశాలాక్షినగర్ బీవీకే జూనియర్ కళాశాలలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఏపీయూఎస్) ఉత్తరాంధ్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకీకృత విధానం, సీపీఎస్ రద్దు, పాత పింఛన్ విధానం అమలు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు ఉపాధ్యాయుల సమస్యలు తీర్చలేదన్నారు. ఐఆర్ ప్రకటించకపోవడం, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర క్షోభకు గురవుతున్నారని తెలిపారు. సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సీహెచ్.శ్రావణ్కుమార్ మాట్లాడుతూ శాశ్వత బదిలీ చట్టంలో లోపాలను సవరించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టాలన్నారు. డీఎస్సీ ఖాళీలన్నింటినీ బదిలీల్లో చూపించాలని తెలిపారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తమ్మినేని ఆనందరావు, సహాయ కార్యదర్శి చిన్ని శ్రీనివాస్, ఇ.రామునాయుడు, జె.రామునాయుడు, శ్రీనివాసరావు, అప్పారావు పాల్గొన్నారు. ఏపీయూఎస్ జిల్లా కార్యదర్శిగా విశ్వనాథం విశాఖ విద్య : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీ చెందిన తెలుగు ఉపాధ్యాయుడు ఎం.ఎన్.వి విశ్వనాథం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కోశాధికారిగా పద్మనాభం మండలానికి చెందిన కనకల సన్యాసినాయుడు, నగర అధ్యక్షుడిగా సుదర్శన పట్నాయక్, నగర ప్రధాన కార్యదర్శిగా దొరబాబు నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రవణ్కుమార్, ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కార్యదర్శి చిన్ని శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు అరుణ్కుమార్, జిల్లా పర్యటన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా మహిళా కన్వీనర్ రామలక్ష్మి తదితరులు కమిటీ నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఆర్ట్ వర్క్ టీచర్లను రెగ్యులర్ చేయాలి
కంచరపాలెం : సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో గత 14 ఏళ్లగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ట్ వర్క్ ఎడ్యుకేషన్ టీచర్లను రెగ్యులర్ చేయాలని, ఎంటీఎస్ వర్తింపు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్క్స్ ఆర్క్ ఇన్స్ట్రక్టర్స్ యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు ముఖ్యఅతిథులుగా మాట్లాడారు. న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన నాయకులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో రాష్ట్రంలో మొత్తం సుమారు 5,800 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 460 మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ఒకేషనల్ ఉపాధ్యాయులుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షురాలు సైకం శివకుమారిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శంకర్ భాగవతులు, విశాఖ అధ్యక్షుడు బి.రవిచంద్, జిల్లా అసోసియేషన్ చైర్మన్ త్రినాథరావు, కె.ఎస్.రావు, ఎన్ నాగరాజు, పాడి పంతులు, ఎస్.రామచంద్రరావు, వరప్రసాదరావు, పేరూరి శ్రీనివాసరావు, మెట్ట భారతి పాల్గొన్నారు. -
సమ్మర్ క్యాంప్ నుంచి అంతర్జాతీయ స్థాయికి..
చైతన్య నాకు రెండవ సంతానం. మొదటి బిడ్డకంటే తొమ్మిదేళ్లు ఆలస్యంగా పుట్టాడు. సమ్మర్ క్యాంప్లో డ్యాన్స్లో మంచి ప్రతిభ చూపడంతో.. అందులోనే శిక్షణ కొనసాగించాను. ప్రతీ కదలికను ఎంతో శ్రద్ధగా నేర్చుకున్న చైతన్య భవిష్యత్లో మంచి డ్యాన్సర్ అవుతాడని సోహెయిల్ మాస్టర్ విశ్వసించారు. అతని నమ్మకాన్ని చైతన్య నిలబెట్టాడు. డ్యాన్స్తో పాటు చదువును కూడా కొనసాగిస్తున్నాడు. మర్రిపాలెంలోని శివశివాని స్కూల్ యాజమాన్యం చైతన్య చదువుకు సహకరిస్తోంది. యూత్ ఒలింపిక్స్లో దేశం తరఫున పాల్గొనాలన్న లక్ష్యంతో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. – పెంటకోట రాజేష్, చైతన్య తండ్రి -
ఆఫ్లైన్లో టికెట్లు లేనట్టేనా?
● 24న లక్నో సూపర్ జెయింట్స్తో డీసీ ఢీ ● ఆన్లైన్లోనే టికెట్ల విక్రయాలు విశాఖ స్పోర్ట్స్: వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడనున్న తొలి ఐపీఎల్ మ్యాచ్కు ఆఫ్లైన్లో టికెట్ల విక్రయం లేనట్టేనా? ఇటీవల ఏసీఏ నిర్వహించిన సమావేశంలో ఆఫ్లైన్లో కూడా టికెట్లు విక్రయిస్తామని ప్రకటించినప్పటికీ, అందుకు తగ్గట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) బృందం ఏర్పాట్లు చేయకపోవడంతో కౌంటర్ల ద్వారా టికెట్ల విక్రయం లేదని తెలిసింది. ఈ నెల 24న లక్నో సూపర్ జెయింట్స్తో డీసీ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఈ నెల 13వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఆన్లైన్లో డీసీ టికెట్లను విక్రయించడం ప్రారంభించింది. ప్రస్తుతం తక్కువ ధరల్లో టికెట్లు అందుబాటులో లేవు.రూ.2,200, రూ.2,500,రూ.3,000, రూ.3,500, అత్యధికంగా రూ.5,000 విలువ గల టికెట్ల ఖాళీలే కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు వాటిని ఫిజికల్ టికెట్లుగా మార్చుకోవడానికి మున్సిపల్ స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్ వద్ద కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు వరకు టికెట్లు మార్చుకునే అవకాశం ఉంది. భద్రతా ఏర్పాట్ల పరిశీలన ఐపీఎల్ నేపథ్యంలో వైఎస్సార్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను శనివారం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే హోటల్తో పాటు స్టేడియంలోని ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు తగిన సూచనలు చేశారు. ఇరుజట్లకు సీజన్లో ఇదే తొలిమ్యాచ్ కావడంతో నెట్ ప్రాక్టీస్ చేసుకునే బీ గ్రౌండ్లోనూ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం
అధికారులకు కలెక్టర్ ఆదేశం మహారాణిపేట: జిల్లాలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నిర్దేశించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్లో జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్తో కలిసి శనివారం పలు ప్రాజెక్ట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టనున్న రైల్వే, హెచ్పీసీఎల్, ఇరిగేషన్, విద్యుత్, ఐవోసీఎల్, జాతీయ రహదారులు, అంతర్గత రోడ్లు తదితర ప్రాజెక్ట్లకు నిర్ణీత కాలంలో అవసరమైన భూములను సేకరించి, నివేదిక అందేజేయాలని ఆదేశించారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు. -
పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
● జిల్లాలో 134 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 29,927 మంది విద్యార్థులు విశాఖ విద్య: పదో తరగతి పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో ఎన్.ప్రేమ్కుమార్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 29,927 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. వీరిలో 26,523 మంది రెగ్యులర్గా, 1,404 మంది ప్రైవేట్గా, 2,124 మంది ఒకేషనల్ ట్రేడ్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 15,094 మంది బాలురు, 13,429 మంది బాలికలు ఉన్నారన్నారు. 265 మంది దివ్యాంగ విద్యార్థుల సౌలభ్యం కోసం గ్రౌండ్ ఫ్లోర్లో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు 134 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో 48 ఏ కేటగిరీ కేంద్రాలు, 71 బీ కేటగిరీ కేంద్రాలు, 9 సీ కేటగిరీ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో ముందస్తుగా గుర్తించిన 6 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 134 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 134 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 1,472 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయన్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్ ఆధారంగా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు పేర్కొన్నారు. -
మీరు అగ్నివీర్ అవుతారా?
సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకునే యువతకు శుభవార్త. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిక్రూట్మెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రవేశ పరీక్షను ఏకంగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. మరోవైపు రాష్ట్రంలోని 13 జిల్లాల అభ్యర్థుల కోసం ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశాఖపట్నం మరోసారి వేదిక కానుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అంబేడ్కర్, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణా, మచిలీపట్నం జిల్లాల అభ్యర్థులకు విశాఖలో ఎంపికలు నిర్వహించాలని ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఏప్రిల్ 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ కేటగిరీల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు 8వ తరగతి, జనరల్ డ్యూటీ కేటగిరీలకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు. అలాగే 17 1/2 నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులే అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. అగ్నివీర్ నియామకాలకునోటిఫికేషన్ జారీ 13 భాషల్లో ప్రవేశ పరీక్ష ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమో అభ్యర్థులకు బోనస్ మార్కులు ఏప్రిల్ 10 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం ఈ ఏడాది కీలక మార్పులు ఈ సారి అగ్నివీర్ రిక్రూట్మెంట్లో పలు ముఖ్యమైన మార్పులు చేశారు. గతంలో అభ్యర్థులు ఒక కేటగిరీకి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈసారి రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమో వంటి అదనపు విద్యార్హతలు కలిగిన వారికి బోనస్ మార్కులు లభిస్తాయి. గతంలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీఈఈ)ను ఇప్పుడు తెలుగుతో సహా 13 భాషల్లో రాసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అడ్మిట్ కార్డులో ర్యాలీకి హాజరుకావాల్సిన తేదీ, సమయం వంటి వివరాలు ఉంటాయి. అభ్యర్థుల సౌకర్యం కోసం రిక్రూ ట్మెంట్ జరిగే ప్రదేశంలో ప్రత్యేక రిపోర్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో పారదర్శకంగా జరుగుతుందని రక్షణ శాఖ తెలిపింది. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం లైవ్ చాట్ సదుపాయంతో పాటు ‘ఆర్మీ కాలింగ్’ అనే ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సమాచారం కో సం www.joinindianarmy. nic.in వెబ్సైట్ ను సందర్శించవచ్చు లేదా విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయాన్ని 0891– 2756959, 0891–2754680 నంబర్లలో సంప్రదించవచ్చు. -
మన్యంలో చిన్నారుల మృత్యు ఘోష
● అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది గైర్హాజరుపై జెడ్పీ చైర్పర్సన్ ఆగ్రహం ● నోటీసులు జారీ చేయాలని సీఈవోకు ఆదేశం ● కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలైనా కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంపై సభ్యుల ఆగ్రహం ● వాడీవేడిగా జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు మహారాణిపేట: కీలకమైన జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు వివిధ శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన పలు స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఏజెన్సీలో వైద్య సదుపాయాలపై, పిల్లల మరణాలపై చర్చ జరిగింది. కానీ సమాధానం చెప్పడానికి అధికారులే లేరు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు నోటీసులు జారీ చేయాలని చైర్పర్సన్ సీఈవోను ఆదేశించారు. తొలుత అరకు జెడ్పీటీసీ చెట్టి రోష్ని మాట్లాడుతూ అరకు మండలం బస్కి గ్రామంలో పిల్లలు ఆకస్మికంగా మృతి చెందారని, ఈ విషయం గురించి మాట్లాడడానికి తాను హెల్త్ సబ్ సెంటర్కు కాల్ చేసినా ఎవరూ ఫోన్ ఎత్తడం లేదన్నారు. పలు వైద్య ఆరోగ్యశాఖ సబ్ సెంటర్లకు వైద్యులు రావడం లేదని, వారిని అడిగే నాథులే లేరని ఆమె వాపోయారు. గిన్నెల, మాడగూడ తదితర ప్రాంతాల్లో చిన్న పిల్లలు వరుసగా చనిపోయారని, కారణం తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరణ ఇవ్వాలని చైర్పర్సన్ జె.సుభద్ర కోరారు. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక్క అధికారి కూడా రాలేదని, జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలకు రాని అధికారులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆమె సీఈవోను ఆదేశించారు. గిరిజన ప్రజలను మన్యం నుంచి కేజీహెచ్కు తరలించడానికి 108 అంబులెన్సు అవసరం ఉంటుందని, కానీ ఫోన్ చేసినా 108 అంబులెన్సులు రావడం లేదని చైరపర్సన్ అన్నారు. పింఛన్ల మీద వివక్ష : కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవడంపై పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో పింఛన్లు తీసుకుంటూ చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో అర్హులుంటే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారని, దరఖాస్తు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారన్నారు. అలా గే అర్హులకు పింఛన్లు ఇస్తామని చెప్పారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలు అవుతున్నా ఎక్కడా కొత్త పింఛన్లు ఇవ్వలేదని, ఇది అన్యాయమన్నారు. జెడ్పీటీసీ సభ్యులను పట్టించుకోని హౌసింగ్ అధికారులు హౌసింగ్ అధికారులు జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులను పట్టించుకోవడం లేదని పలువురు చైర్పర్సన్ దృష్టికి తెచ్చారు. తమ మండలాల్లో గృహ నిర్మాణ అధికారులు సర్వే చేస్తున్న సమయంలో, కొత్త పేర్ల నమోదు చేసేటప్పుడు తమను సంప్రదించడం లేదని, దీనివల్ల స్థానికంగా తాము ఇబ్బంది పడుతున్నామని, గతంలో ఎప్పుడూ ఇలా లేదని వారన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కోరారు. పోస్టుమార్టంలో జాప్యం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహణలో జాప్యంపై చైర్పర్సన్తోపాటు పలువురు జెడ్పీటీసీలు ప్రశ్నించారు. మార్చురీ వద్ద అనధికారికంగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎక్కువగా గిరిజన ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎందుకు జాప్యం జరుగుతోందని చైర్పర్సన్ సుభద్ర ప్రశ్నించారు. దీనికి కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ బదులిస్తూ.. రోడ్డు ప్రమాదాల్లో మృతులకు పోస్టుమార్టం జరిగే ముందు పోలీసులు శవ పంచనామా నిర్వహించాలని, ఇందులో జాప్యం జరిగితే అన్నీ ఆలస్యం అవుతాయన్నారు. పాయరావుపేట నుంచి అనకాపల్లి వరకు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, అందువల్ల అనకాపల్లిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని మునగపాక జెడ్పీటీసీ పెంటకోట సోమ సత్యనారాయణ కోరారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తితోపాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జూ పార్కులో రాప్టర్ల ప్రదర్శన ప్రారంభం
ఆరిలోవ: పర్యావరణ పరిరక్షణలో రాప్టర్ల(గెద్ద జాతి) పాత్ర ఎంతో కీలకమని చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ శాంతిప్రియ అన్నారు. ఇందిరాగాంధీ జూ పార్కులో డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఇండియా వింగ్ ఆఫ్ వండర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రాప్టర్స్ ఎగ్జిబిషన్ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శాంతి ప్రియ మాట్లాడుతూ రాప్టర్లు మాంసాహార పక్షులని, ఇవి ఎలుకలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయని చెప్పారు. అంతేకాకుండా, చనిపోయిన జంతువుల కళేబరాలను తొలగించడం ద్వారా పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయని వివరించారు. విద్యార్థులు రాప్టర్ల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని సూచించారు. 90 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో రాప్టర్ల చిత్రపటాలు, వాటికి సంబంధించిన సమాచార బోర్డులు ఏర్పాటు చేశారు. జూ క్యూరేటర్ జి.మంగమ్మ, అసిస్టెంట్ క్యూరేటర్లు గోపి, గోపాల నాయుడు, డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఇండియా వింగ్ ఆఫ్ వండర్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేల నుంచి నీటిలోకి..
సముద్రంలోకి ఆలీవ్ రిడ్లే తాబేలు పిల్లలు కొమ్మాది: బుల్లి ఆలివ్ రిడ్లే తాబేళ్లు బుడిబుడి అడుగులు వేసుకుంటూ తమ సహజ ఆవాసమైన సముద్రంలోకి చేరుకున్నాయి. ఈ మనోహరమైన దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. జోడుగుళ్లపాలెం, చేపలుప్పాడ, పెదనాగమయపాలెం ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెట్టిన గుడ్లను అటవీ శాఖ అధికారులు సేకరించి సాగర్నగర్లోని తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో సంరక్షించారు. వీటి నుంచి వచ్చిన పిల్లలను డీఎఫ్వో శ్రీవాణి శనివారం సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోడుగుళ్లపాలెం నుంచి పెదనాగమయపాలెం వరకు మొత్తం 57,372 గుడ్లను సేకరించి సంరక్షించినట్లు తెలిపారు. తొలి దశలో శనివారం ఉదయం 237 తాబేలు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ విడతల వారీగా మరిన్ని తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేస్తామని ఆమె వివరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తరిమేద్దాం
తాటిచెట్లపాలెం: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నగరం నుంచి తరిమివేయాలని మేయర్ గొలగాని హరివెంకటకుమారి పిలుపునిచ్చారు. రైల్వే న్యూకాలనీలోని సుబ్బలక్ష్మీ కల్యాణ మండపంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర అవగాహన కార్యక్రమం జరిగింది. కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ తదితరులతో కలిసి ఆమె స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించి, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలన్నారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసి.. నగర పరిశుభ్రతకు పాటుపడాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులను వాడి క్యాన్సర్ బారిన పడొద్దని హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్లే కలిగే నష్టాలను డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా వస్త్ర లేదా నార సంచులను వినియోగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, ఆర్.సోమనారాయణ, కార్పొరేటర్లు ఉషశ్రీ, రాజశేఖర్, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. మేయర్ హరివెంకటకుమారి పిలుపు -
ప్లాస్టిక్ భూతం.. అడ్డుకట్టతో ఆరోగ్యం
స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేస్తున్న మహిళలు, ర్యాలీలో పాల్గొన్న మేయర్ హరివెంకటకుమారి, కలెక్టర్ హరేందిర ప్రసాద్, ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ఏయూక్యాంపస్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని మేయర్ జి.హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. బీచ్రోడ్డులోని కాళీమాత ఆలయం వద్ద శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. క్యాన్సర్ వంటి వ్యాధులు రావడానికి ప్లాస్టిక్ ప్రధాన కారణంగా నిలుస్తోందని, ఇటువంటి వాటికి పూర్తిగా స్వస్తి పలకాలని కోరారు. ప్లాస్టిక్ సంచుల్లో వేడి ఆహారం ప్యాకింగ్ చేయడం, వాటిని తినడం ప్రమాదకరమన్నారు. కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెలా ఒక ప్రత్యేక నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి ప్లాస్టిక్ వస్తువుల క్రయ విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, దాడులు నిర్వహించి అమ్మే వారిపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అనంతరం ర్యాలీని జిల్లా ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్ ప్రారంభించారు. వంద అడుగుల వస్త్రంతో చేసిన బ్యానర్ పట్టుకుని మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజల చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. వస్త్రంతో చేసిన సంచులను పంపిణీ చేశారు. జీవీఎంసీ అదనపు కమిషనర్లు సోమన్నారాయణ, వర్మ, రమణ, మూర్తి, సీఎంవో నరేష్, వివిధ జోనల్ కమిషనర్లు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
● కళ్లెం వేయకపోతే.. కడుపు కోతే..
నగరంలో మైనర్లు ద్విచక్ర వాహనాలపై రెచ్చిపోతున్నారు. లైసెన్స్ లేకుండానే బైక్లు నడుపుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా హెల్మెట్లు ధరించకుండా, ట్రిపుల్, జిగ్జాగ్ డ్రైవింగ్తో ఇతర వాహనచోదకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. వారికి సరైన డ్రైవింగ్ నైపుణ్యాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన ఉండదు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వంటివి కూడా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వారి ప్రాణాలకే కాకుండా.. ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి మైనర్లకు బైక్లు ఇవ్వకుండా చూడాలి. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
గాజువాకలో దారుణం
● పదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం ● కామాంధుడిని పట్టుకున్న స్థానికులు అక్కిరెడ్డిపాలెం: పదేళ్ల బాలికపై 45 ఏళ్ల కామాంధుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై.. నిందితుడిని పట్టుకుని గాజువాక పోలీసులకు అప్పగించారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ఎ.పార్థసారధి తెలిపారు. సీఐ తెలిపిన వివరాలివి.. గాజువాక డ్రైవర్స్ కాలనీలో కూరగాయలు అమ్ముకుంటూ దాడి భాను ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని ఎదురింట్లో పదేళ్ల బాలికతో కలిసి ఒక కుటుంబం నివాసం ఉంటోంది. శనివారం బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి భాను ప్రవేశించాడు. బాలికను సుత్తి కావాలని అడిగి ఆమైపె లైంగికదాడికి యత్నించాడు. దీంతో బాలిక పెద్దగా కేకలు వేయడంతో.. స్థానికులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇది గమనించి పారిపోతున్న భానును పట్టుకుని గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని భానును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
మొదలైన న్యాయవాదుల నామినేషన్ పర్వం
విశాఖ లీగల్: విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఎన్నికల అధికారి, ప్రముఖ న్యాయవాది జీఎం రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్లు పర్వం మొదలైంది. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పలువురు న్యాయవాదులు నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గ్రంథాలయ కార్యదర్శి, సాంస్కృతి కార్యదర్శి, తొమ్మిది మంది కార్యవర్గ సభ్యుల కోసం ఎన్నికలు జరుగుతాయి. 18వ తేదీ సాయంత్రం వరకు నామినేషన్ పర్వం కొనసాగుతుంది. 19న నామినేషన్ల పరిశీలన, 20 వరకు ఉపసంహరణ, అదే రోజు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 28వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. -
కిలో
జోష్ హైలీ..ఆనందపు రంగులను మొహానికి పూసుకున్నారు, అందమైన క్షణాలను, జ్ఞాపకాలుగా నిక్షిప్తం చేసుకున్నారు. సప్తవర్ణాల చిరుజల్లుల్లో తడిసి ముద్దయ్యారు. ఆత్మీయులతో ప్రేమానుబంధాలు వసంతంగా వికసించేలా హోలీ జరుపుకున్నారు. విశాఖలోని సాగరతీరాల్లో హోలీ జోష్ కనిపించింది. ప్రముఖ హోటళ్లలో హోలీ సందర్భంగా రెయిన్ డ్యాన్స్లు ఏర్పాటు చేశారు. కురుసుర మ్యూజియం పక్కనే ఏర్పాటు చేసిన రెయిన్ డ్యాన్స్ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో యువత పాల్గొని రంగులు పూసుకుంటూ జోష్ నింపారు. సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్లో అపార్ట్మెంట్ వాసులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. –ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం అంటే 900గ్రాములే..! శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025సాధారణంగా ఒక కేజీకి ఎన్ని గ్రాములు అంటే.. ఠక్కున 1000 గ్రాములు అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ లెక్కలు మారిపోయాయి. కేజీ అంటే 900 గ్రాములు..అంతకంటే తక్కువేనంటూ కొత్త భాష్యం చెబుతున్నారు కొందరు వ్యాపారులు. నమ్మట్లేదా.? ఇది పచ్చి నిజం.. మహరాణిపేటకు చెందిన రాజేశ్వరి పూర్ణామార్కెట్కు వెళ్లి కేజీ వెల్లుల్లి కొన్నారు. – సాక్షి, విశాఖపట్నం/డాబాగార్డెన్స్/ ఆరిలోవ/తాటిచెట్లపాలెంధర్నాలో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాల నేతలు కూర్మన్నపాలెం: నిర్బంధాలతో ఉద్యమాన్ని అణచలేరని ఉక్కు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు అన్నారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం శాంతియుతంగా పోరాటాలు చేస్తుంటే.. వాటిని విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేయడం మంచి పరిణామం కాదని హెచ్చరించారు. విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణకు కూర్మన్నపాలెం దీక్ష శిబిరం వద్ద కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం పాత గాజువాకలో ధర్నా నిర్వహించాలని ముందుగా నిర్ణయించి, అనుమతి కూడా తీసుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం కుటిల రాజకీయం చేసిందని ఆరోపించారు. ధర్నాకు పిలుపునిచ్చిన నేతలను పోలీసుల ద్వారా నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులను స్టీల్ప్లాంట్ పోలీసులు ఉదయాన్నే అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రభుత్వ అడ్డంకుల మధ్య చివరకు కూర్మన్నపాలెం జంక్షన్లో దీక్ష శిబిరం వద్దే ధర్నా చేసినట్లు నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వల్ల ఉక్కు కర్మాగారానికి పైసా ప్రయోజనం కలగలేదని తేల్చి చెప్పారు. కనీసం ప్లాంట్ అభివృద్ధికి గాని, ఉపాధి కల్పనకు గాని, ఉత్పత్తి వ్యయానికి గాని, కనీసం కార్మికుల వేతనాలు చెల్లింపునకు గాని ప్యాకేజీ దోహదపడలేదన్నారు. ధర్నాలో 78వ వార్డు కార్పొరేటర్ గంగారావు, పోరాట కమిటీ చైర్మన్ బి.ఆదినారాయణ, హెచ్ఎంఎస్ నాయకులు గణపతిరెడ్డి, సీఐటీయూ నేత ఎన్.రామారావు, సన్యాసిరావు, ఐఎన్టీయూసీ నాయకులు రామచంద్రరావు, మద్ది అప్పలరాజు రెడ్డి, వరసాల శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పల్లా చినతల్లి తదితరులు మాట్లాడుతూ ఉక్కు యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలన్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ధర్నా సందర్భంగా ఏసీపీ త్రినాథ్ నేతృత్వంలో సీఐలు మల్లేశ్వరరావు, కేశవరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉక్కు కార్మిక నాయకుల నిర్బంధం గాజువాక : విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాతగాజువాక జంక్షన్లో శుక్రవారం ధర్నా తలపెట్టిన కార్మిక సంఘాల నాయకులను స్టీల్ప్లాంట్ పోలీసులు నిర్బంధించారు. పాతగాజువాక జంక్షన్లో ధర్నాకు అనుమతి లేదని పేర్కొంటూ నాయకులను స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిర్బంధించిన వారిలో నాయకులు డి.ఆదినారాయణ, కె.ఎస్.ఎన్.రావు, రామస్వామి, సుబ్బయ్య, పల్లా పెంటారావు, కామేశ్వరరావు తదితరులున్నారు. ఆరిలోవ టీఐసీ పాయింట్కు చెందిన కూరగాయల వ్యాపారి దగ్గర కిలో క్యారెట్ కొనుగోలు చేశారు. అనుమానం వచ్చి పక్కన ఉన్న పండ్ల దుకాణంలో తూకం వేయిస్తే 740 గ్రాములు మాత్రమే కనిపించింది. ఇక్కడ రెండూ ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్లే కావడం గమనార్హం.దాడులు జరుగుతున్నా తూకంలో మోసాలెందుకు? రాష్ట్ర తూనికలు కొలతల శాఖ నిరంతరం దాడులు నిర్వహిస్తోంది. కానీ వినియోగదారులు ఏదో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం.. అడపాదడపా దాడులు చేస్తూ.. వెయింగ్ మెషీన్లకు సీల్ ఉందా.? సాంకేతికంగా ఏమైనా మోసాలకు పాల్పడుతున్నారా లేదా అని చెక్ చేస్తూ.. మోసం చేస్తున్న వ్యాపారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. 2023–24లో ఇప్పటి వరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,227 కేసులను వ్యాపారులపై నమోదు చేశారు. బరువు తూచే యంత్రాల తయారీ, మరమ్మతు, యంత్రాలు సరిచూసి అధికారుల ఆమోదంతో ధ్రువీకరించేందుకు కొందరికి తూనికలు, కొలతల శాఖ అనుమతులిస్తుంది. అవి పొందిన లైసెన్స్దారులు ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు బరువు తూచే యంత్రాల్ని ఏటా మరమ్మతు చేసి తనిఖీ అధికారి ద్వారా ధ్రువీకరించి వ్యాపారికి ధ్రువపత్రం ఇవ్వాలి. అంతా సక్రమంగా ఉంటేనే సీల్ వేస్తారు. అయినా వ్యాపారి మోసానికి పాల్పడితే వ్యాపారిపై చర్యలు తీసుకుంటున్నారు. మోసాన్ని తూకమేస్తున్నారు.! జిల్లాలో ఎక్కడ చూసినా.. ఏదో ఒక చోట తూనికలు, కొలతల మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు అడపాదడపా దాడులు జరుగుతున్నా.. వ్యాపారులు మాత్రం తమ హస్తలాఘవాన్ని చూపిస్తూనే ఉన్నారు. పండ్లు, కూరగాయలు, కిరాణా సరుకుల విక్రయాల్లో కొనుగోలుదారులు మోసపోవడం పరిపాటిగా మారిపోయింది. మెషీన్లకు వేసిన సీళ్లు వేసినట్లే ఉంటున్నాయి. కానీ మోసం మాత్రం జరుగుతూనే ఉంది. దీంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. పలు రైతు బజార్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్యాకింగ్లోనూ మోసాలు ఇక సూపర్ మార్కెట్లలోనూ మోసాలు జోరందుకుంటున్నాయి. ప్యాకింగ్ చేసి సొంత స్టిక్కర్లు వేసి విక్రయాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. సూపర్ మార్కెట్లో అక్కడ తూకం వేసి చూసుకునేందుకు యంత్రాలు ఏర్పాటు చెయ్యాలి. కానీ ఏ సూపర్ మార్కెట్లోనూ ఇవి కనిపించడంలేదు. అంతేకాదు ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న పదార్థాలపై ఎప్పుడు తయారు చేశారు. ఎంత బరువు ఉంది. ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకూ ఉంటుందనే విషయాలు కూడా ముద్రించడం లేదు. ఎంవీపీ కాలనీలోని విశాఖ సూపర్ మార్కెట్లో ఇదే జరుగుతోంది. ఫ్రెంచ్ఫ్రైస్ని తమ సొంత ప్యాకింగ్లలో విక్రయిస్తున్నారు. కానీ దానిపై ఎంఎఫ్జీ డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా లేదు. అదేవిధంగా తినుబండారాలపై కేవలం ధర స్టిక్కర్ మాత్రమే అతికించి అమ్మేస్తున్నారు. దానిపై ఎక్కడ తయారు చేశారు.? ఏఏ పదార్థాలతో తయారు చేశారన్న వివరాలూ కనిపించడం లేదు. కేవలం ఈ ఒక్క సూపర్ మార్కెట్లోనే కాదు.. నగరంలో ఉన్న సగానికిపైగా సూపర్ మార్కెట్లు నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. స్థానికులకు ఉపాధి కరువు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థానికులకు ఉపాధి మృగ్యమైపోయింది. అన్ని రకాల పనులు జిందాల్, మిట్టల్ కంపెనీలకు అప్పగించే కుట్ర జరుగుతోంది. దీని వల్ల రాష్ట్ర ప్రజలు అన్యాయమైపోతారు. కర్మాగారానికి పూర్తి స్థాయి సీఎండీని కూడా నియమించడం లేదు. సంబంధం లేని వ్యక్తిని ఇన్చార్జి సీఎండీగా నియమించి.. కర్మాగారాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. –డి.ఆదినారాయణ, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఉద్యోగులను తొలగించేస్తున్నారు ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విషయాలలోనూ అణచివేతకు గురిచేస్తున్నాయి. అందువల్లే కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఇప్పటికే వందలాది మందిని స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా ఇంటి దారి పట్టించారు. ఇంకా కాంట్రాక్టు, శాశ్వత ఉద్యోగులను అనేక రూపాల్లో తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. – జి.గణపతిరెడ్డి, ఉక్కు హెచ్.ఎం.ఎస్. ప్రధాన కార్యదర్శి ఉక్కు కార్మిక సంఘాల హెచ్చరిక విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణకు కూర్మన్నపాలెం వద్ద ధర్నా గాజువాకలో ధర్నా అడ్డుకోవడంపై ధ్వజం -
‘సాక్షి’తో వినియోగదారుల హక్కుల మండలి..
వినియోగదారుడు మోసపోకుండా ప్రతి దుకాణం కన్జ్యూమర్ రైట్స్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలంటూ జాతీయ వినియోగదారుల హక్కుల మండలితో కలిసి ‘సాక్షి’ బృందం.. ప్రజల్లోనూ, వ్యాపారుల్లోనూ చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డా.వికాస్పాండే, జాతీయ అధికారప్రతినిధి బాలకృష్ణతో కూడిన బృందంతో కలిసి పలు దుకాణాలకు, సూపర్ మార్కెట్లకు వెళ్లి.. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న విక్రయాలను వ్యాపారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్, తూనికలు సరిచేసుకోవాలని సూచించారు. -
మోసం జరిగితే ధైర్యంగా ఫిర్యాదు చెయ్యాలి
వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం పెరగాలి. అప్పుడే వ్యాపారుల్లో మోసపూరిత ధోరణులు మారతాయి. వస్తువు కొనుగోలు చేసే సమయంలో తూకాలను నిశితంగా గమనించాలి. మోసాలకు పాల్పడతున్నట్లు అనుమానం వస్తే వెంటనే తూనికలు, కొలతల శాఖ టోల్ఫ్రీ నంబర్ 1967, లేదా 0891–27995511 నంబర్కి ఫోన్చేసి ధైర్యంగా ఫిర్యాదు చెయ్యండి. ప్రజలు కూడా ఏదైనా వస్తువు కొనే ముందు కొలతలు సరిగా చేస్తున్నారా లేదా గమనించడం అలవాటు చేసుకోవాలి. – కె.థామస్ రవికుమార్, ఏపీ లీగల్ మెట్రాలజీ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కంట్రోలర్ -
గుండెపోటుతో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
● బంధువులు, కార్మిక సంఘాల ఆందోళన కూర్మన్నపాలెం : విధులు నిర్వహిస్తూ ఉక్కు కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు. వివరాలివి. పెదగంట్యాడ దరి ముసలినాయుడుపాలెంలో నివాసం ఉంటున్న వేపాడ సూర్యవెంకటరమణ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్టర్ వద్ద ట్రాక్టర్ డైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. యథావిధిగా శుక్రవారం విధులకు హాజరై జోన్ ఎంఎంజెడ్లో ట్రాక్టర్ను నడుపుతుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో సహచర కార్మికులు వైద్యులకు సమాచారం అందించి రప్పించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బంధువులు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో ఉక్కు ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. బంధువులకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. అదే సమయంలో అంబులెన్స్లో మృతదేహం ఉక్కు ప్రధాన గేటు వద్దకు చేరుకుంది. దీంతో అంబులెన్స్ను కదలనీయకుండా బంధువులు, కార్మికులు ఆందోళన చేశారు. కాంట్రాక్టర్, బంధువులతో పోలీసులు, యూనియన్ నేతలు చర్చలు జరి పారు. మృతుని బంధువులకు పరిహారం కింద రూ.2 లక్షలు, మట్టి ఖర్చుల నిమిత్తం మరో రూ.30 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదరడంతో ఆందోళకారులు శాంతించారు. మృతదేహాన్ని సొంత గ్రామమైన చోడవరం ప్రాంతానికి బంధువులు తీసుకువెళ్లారు. -
ఘనంగా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు జయంతి ఉత్సవాలు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ చైతన్య మహా ప్రభువు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీగౌర పూర్ణిమ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణ చైతన్య మహా ప్రభువు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హరేకృష్ణ మూవ్మెంట్ భక్తులు ముందుగా శీకృష్ణబలరాముల విగ్రహాలకు, అనంతరం శ్రీకృష్ణ చైతన్య మహా ప్రభువుకు పంచామృతాలు, పంచగంధ్య, సువాసనలతో కూడిన పుష్పాలు, వివిధ పండ్ల రసాలతో మహా అభిషేకం నిర్వహించారు. స్వామి వారికి విశేషంగా పిండి వంటలతో నైవేద్యం పెట్టి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేడుకలను అంబరీష దాస పర్యవేక్షించారు. అనంతరం హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస గౌరలీల గురించి ప్రవచించారు. -
ముగ్గురి మధ్య ఘర్షణ.. ఒకరికి కత్తిపోట్లు
కూర్మన్నపాలెం: గాజువాక శివారు 77వ వార్డు మద్దివానిపాలెంలో శుక్రవారం జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు ప్రస్తుతం గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి.. మద్దివానిపాలేనికి చెందిన వివాహిత మద్ది వెంకటలక్ష్మిని అదే గ్రామానికి చెందిన కర్రి సతీష్రెడ్డి కొంత కాలంగా వేధిస్తున్నాడనే పుకార్లు గ్రామంలో వ్యాపించాయి. వెంకటలక్ష్మి భర్త పైడి రెడ్డి విదేశాల నుంచి ఇటీవల తిరిగి వచ్చాడు. ఆనోట.. ఈనోట ఈ విషయం విన్న పైడి రెడ్డి.. వరసకు తమ్ముడైన మద్ది అప్పలరాజు (రాజు)కు తెలియజేశాడు. దీంతో శుక్రవారం ఉదయం గ్రామంలో సతీష్ రెడ్డిని రాజు నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది కొట్లాటకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న సతీష్రెడ్డి తమ్ముడు ఏకాంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నాడు. అనంతరం ముగ్గురి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశంతో ఊగిపోయిన రాజు, తన వద్ద ఉన్న కత్తితో ఏకాంత్ రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఏకాంత్ రెడ్డి తల, చేయి, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని గాజువాకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఏకాంత్ రెడ్డి చికిత్స పొందుతున్నాడని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి రాజును అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా.. అనుమానం ఎంతటి ఘోరానికై నా దారి తీస్తుందనడానికి ఈ సంఘటనే నిదర్శనమని స్థానికులు చర్చించుకున్నారు. -
అట్టహాసంగా జాతీయ నాటకోత్సవాలు ప్రారంభం
మురళీనగర్: కేవీ మెమోరియల్ ఆర్ట్స్, విశాఖ పోర్ట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మురళీనగర్ వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ సంయుక్త ఆధ్వర్యంలో మురళీనగర్లోని వేములపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జాతీయస్థాయి ఆహ్వాన నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రదర్శించిన నాటికల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారాలు పొందిన రంగస్థల నటులు తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముందుగా గుంటూరు అభినయ ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన ‘ఇంద్రప్రస్థం’యువతను ఆలోచింపజేసింది. నేటి యువత జీవితంలో స్థిరత్వం లేకుండా ప్రేమ, పెళ్లి మోజులో పడటం, అనంతరం జీవితంలో వారికి ఎదురయ్యే పరిణామాలు, వారి కష్టాలను కళ్లకు కట్టినట్లు నటీనటులు ప్రదర్శించారు. ‘వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి అందరూ డబ్బు మోజులో సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగాల్లోకి వెళ్లిపోతే రానున్న కాలంలో రైతులనేవారు కనిపించరు. దీని వల్ల తిండి కొరత ఏర్పడితే మానవ మనుగడ పరిస్థితి ఏమిటి?’అనే సందేశాత్మక అంశంతో చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ నటులు‘మా ఇంట్లో మహా భారతం’ నాటికను అద్భుతంగా ప్రదర్శించారు. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్ బోగీల్లో ఉన్న ప్రయాణికుల గురించి ఎవరూ పట్టించుకోరు. ఒక రైలు ప్రమాదం సమయంలో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న తన కొడుకు ఆచూకీ తెలియక ఒక తల్లి అనుభవించే ఆవేదనను తెలిపే ‘జనరల్ బోగీలు’ నాటికను కొలకలూరు సాయి ఆర్ట్స్ బృందం ప్రదర్శించింది. పార్కు అధ్యక్ష, కార్యదర్శులు సనపల వరప్రసాద్, పి.వెంకట సూర్యనారాయణరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాకర్స్ డిస్ట్రిక్ట్–101 ఆర్సీ–5 యు. శుభ, వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు పల్లా చంద్రమౌళి సహకరించారు. శనివారం సాయంత్రం 6.15కు ఒంగోలు పండు క్రియేషన్స్ వారిచే ‘పక్కింటి మొగుడు’, రాత్రి 8.15 గంటలకు విశాఖ జాస్మిన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ మహిళలచే ‘సంకల్పం’ నాటికల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
హెచ్ఎస్ఎల్ ఫైనాన్స్ డైరెక్టర్గా కిరణ్
సింథియా: హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ నూతన డైరెక్టర్గా కిరణ్ సణికరాలా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1997లో చార్టర్డ్ అకౌంటెంట్గా అర్హత సాధించిన ఆయన 1998లో ఆర్ఐఎన్ఎల్లో చేరి కార్పొరేట్ ఖాతాలు, ట్రెజరీ, ప్రాజెక్ట్ ఫైనాన్స్, బడ్జెట్, ఇంటర్నెల్ ఆడిట్ వంటి రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించారు. ఆర్ఐఎన్ఎల్ ఐవోపీ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ అవార్డును కూడా గెలుచుకున్నారు. హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఫైనాన్స్ అండ్ కమర్షియల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేశారు. -
వైభవంగా గౌర పూర్ణిమ ఉత్సవాలు
కొమ్మాది : బీచ్రోడ్డు సాగర్నగర్ ఇస్కాన్ టెంపుల్లో శుక్రవారం గౌర పూర్ణిమ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ కృష్ణభగవానుని భక్త అవతారమైన శ్రీ చైతన్య మహా ప్రభు ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించిన ఈ ఉత్సవాలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యాయి. శ్రీ కృష్ణుని భజన సంకీర్తనలు, పుష్పాభిషేకం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చైతన్య లీలల్లో ఒకటైన చాంద్కాజీ ఉద్ధరణ నాటకం అద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని, వంశీకృష్ణ ప్రభు, భక్తులు పాల్గొన్నారు. -
మోసపోయారా? మేం పోరాడతాం
● వినియోగదారుడికి అండగా ఉన్నాం ● ఏడేళ్ల కాలంలో విశాఖలో 86 కేసులు ఫైల్ చేశాం ● 90శాతం కేసుల్లో పరిహారం అందించగలిగాం ● వినియోగదారుల హక్కుల మండలి జాతీయ అధ్యక్షుడు డా.వికాస్పాండే సాక్షి, విశాఖపట్నం: వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–1986 ప్రకారం బాధితుల తరఫున పోరాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని వినియోగదారుల హక్కుల మండలి జాతీయ అధ్య క్షుడు డా.వికాస్ పాండే తెలిపారు. కన్జ్యూమర్ రైట్స్ డే సందర్భంగా నగరంలో పలు వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో మండలి తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. 13 ఏళ్లుగా పోరాడుతున్నాం వినియోగదారుడి సమస్య.. మండలి సమస్య గా భావించి 13 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. చట్ట ప్రకారం ఏ ఒక్క వినియోగదారుడు మోసపోకూడదు. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో మండలి తరఫున కేసులు వేస్తూ న్యాయం కోసం పోరాడు తున్నాం. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. వినియోగదారుడు కోర్టుల చుట్టూ తిరగా ల్సిన అవసరం లేకుండా.. ఎలాంటి ఫీజులు తీసుకోకుండా కేసు గెలిచేంత వరకు అండగా ఉంటాం. దేశ వ్యాప్తంగా 300 కేసుల ఫైలింగ్ మా మండలి తరఫున దేశ వ్యాప్తంగా గడిచిన ఐదేళ్లలో 300కిపైగా కేసులు వేశాం. విశాఖలో 86 కేసులు నమోదు చేశాం. ఈ ఏడాది ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో 7 కేసులు ఫైల్ చేశాం. దాదాపు 90 శాతం కేసుల్లో విజయం సాధించాం. 6–7 నెలల్లో మిగిలిన కేసులు కూడా పరిష్కారం కానున్నాయి. సైబర్ నేరాలపైనా పోరాటం.. ఇప్పుడు సైబర్ నేరాలు రాజ్యమేలుతున్నాయి. అందుకే వాటిపైనా దృష్టిసారించాం. బ్యాంకుల పేరు తో మోసాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో విశాఖలో ఎస్ సెక్యూరిటీస్ పేరుతో నకిలీ యాప్ ద్వారా హరికుమార్ అనే వ్యక్తి రూ.15 లక్ష లు నష్టపోయారు. కొటక్ సెక్యూరిటీస్ పేరుతో వెంకటరమణ అనే వ్యక్తి రూ.15 లక్షలు పోగొట్టుకున్నా రు. దీనిపైనా కేసులు ఫైల్ చేశాం. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. చట్టం ఎంతో ఉపయోగపడుతుంది వినియోగదారుల హక్కుల చట్టం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజలు దీనిపై అవగాహన పెంచుకోవాలి. ఎవరికి ఏ మోసం జరిగినా మండలిని ఆశ్రయిస్తే.. పరిష్కారం చూపుతాం. చట్టం విలువ అందరికీ తెలియజెప్పేందుకు దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. -
సొంత గనుల కోసం కార్మికుల పోరాటం
సీతమ్మధార: స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం మహా ధర్నా చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా గురజాడ అప్పారావు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ, గాజువాకలో తలపెట్టిన ధర్నాకు పోలీసులు అడ్డుపడి నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తొలగించిన సుమారు 400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. స్టీల్ప్లాంట్లోని ఆఫీసర్లు, శాశ్వత ఉద్యోగులకు మూడు నెలల బకాయి జీతాలు విడుదల చేయాలని, స్టీల్ప్లాంట్ క్వార్టర్లలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో ఉద్యమాలు నిర్వహిస్తున్న స్టీల్ప్లాంట్ సీఐటీయూ నాయకుడు జె.అయోధ్యరామ్కు ఇచ్చిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, నాయకులు వై.రాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ, పి.మణి, కె.ఎం.కుమార మంగళం, ఎం.సుబ్బారావు, పి.వెంకటరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.మన్మధరావు, ఐఎన్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగవిల్లి నాగభూషణం, ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యులు ఎస్.కె.రెహమాన్, జె.డి.నాయుడు పాల్గొన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహా ధర్నా, మానవహారం -
అప్పన్న పెళ్లికి ముహూర్తం ఖరారు
సింహాచలం: సింహాచలంపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వివాహం కోసం శుక్రవారం సింహగిరి నుంచి కొండ దిగువకు వచ్చి న స్వామి.. పిల్లనివ్వమని తన సోదరి, అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారిని కోరారు. ఏం చూసి నీకు పిల్లనివ్వాలని తొలుత నిరాకరించిన అమ్మవారు.. ఆ తర్వాత స్వామి వైభవాన్ని, ఆయనకున్న అసంఖ్యాకమైన భక్తజనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చివరకు పిల్లనివ్వడానికి అమ్మవారు అంగీకరించారు. దీంతో ఈ నెల 30న ఉగాది రోజు పెళ్లిరాట ఉత్సవం, వచ్చే నెల 8వ తేదీ చైత్ర శుద్ధ ఏకాదశి నాడు స్వామి వార్షిక కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సింహగిరిపై పెళ్లి సందడి నెలకొంది. ఘనంగా డోలోత్సవం ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి డోలోత్సవం ఘనంగా జరిగింది. ఏటా చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామికి జరిగే వార్షిక కల్యాణోత్సవానికి ముందు వచ్చే ఫాల్గుణ పౌర్ణమి రోజు అడవివరంలో స్వామికి డోలోత్సవం విశేషంగా నిర్వహించడం ఆనవాయితీ. తనకు పిల్లనివ్వాలంటూ తన సోదరి అయిన పైడితల్లి అమ్మవారిని స్వామి అర్ధించే విధానాన్నే అడవివరం గ్రామస్తులు బొట్టెనడిగే పున్నమి ఉత్సవం(డోలోత్సవం)గా అభివర్ణిస్తారు. కాగా.. కొండదిగువ పుష్కరిణి ఉద్యానవన మండపంలో ఈ ఉత్సవాన్ని దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి అయిన గోవిందరాజస్వామి ని విశేషంగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా సింహగిరిపై నుంచి పల్లకీలో మెట్లమార్గం ద్వారా తొలిపావంచా వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్వామికి దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు, అధికారులు, గ్రామస్తులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్వామిని ఊరేగింపుగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ స్వామికి గ్రామస్తులు విశేషంగా హారతులు పట్టారు. అనంతరం స్వామిని పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి ఉద్యానవన మండపంలో ఏర్పాటు చేసిన డోలీపై అధిష్టింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. చూర్ణోత్సవం, వసంతోత్సం నిర్వహించారు. పూజలు చేసిన వసంతాలను స్వామికి సమర్పించారు. అనంతరం నాళాయిర దివ్య ప్రబంధాన్ని ఆలపిస్తూ డోలోత్సవం నిర్వహించారు. తదుపరి స్వామికి సమర్పించిన వసంతాలను అర్చకులు భక్తులపై చల్లారు. స్వామి కి పెళ్లికుదిరిన ఆనందంలో భక్తులు, దేవస్థానం ఉద్యోగులు ఒకరిపై ఒకరు వసంతాలను జల్లుకుని ఆనంద డోలికల్లో మునిగితేలారు. అనంతరం భక్తులకు పానకాన్ని ప్రసాదంగా అందజేశారు. తర్వాత అడవివరంలో తిరువీధి నిర్వహించారు. పెళ్లి కొడుకు అలంకరణలో తమ ఇంటి ముందుకు వచ్చిన స్వామికి గ్రామస్తులు మంగళ హారతులిచ్చా రు. తదుపరి స్వామిని మరల పైడితల్లి ఆలయానికి తీసుకెళ్లి అక్కడి నుంచి సింహగిరికి చేర్చారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఇన్చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేద పండితులు, పారాయణదారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు, డిప్యూటీ ఈవో రాధ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 30న ఉగాది రోజు పెళ్లిరాట ఏప్రిల్ 8న వార్షిక కల్యాణోత్సవం ఉద్యానవన మండపంలోఘనంగా డోలోత్సవం శాస్త్రోక్తంగా వసంతాల సమర్పణ -
ఇసుకకొండకు పౌర్ణమి తాకిడి
డాబాగార్డెన్స్: ఇసుకకొండ(బాబాజికొండ)పై వెలసిన రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. పౌర్ణమి సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు చేశారు. వేకువజాము 3 గంటల నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుదీరారు. నగరం నుంచే గాక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ మండపంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు జరిగాయి. ఆలయ ఈవో రాజగోపాల్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామికి పూజలు చేస్తున్న అర్చకుడు -
ఫిర్యాదు చేస్తే 90 రోజుల్లో పరిష్కారం
సాక్షి, విశాఖపట్నం: చట్టాలపై ప్రజలు అవగాహన పొందడం ద్వారా మోసపోకుండా ఉండవచ్చని జిల్లా వినియోగదారుల ఫోరం–1 ప్రెసిడెంట్ జి.తనూజరెడ్డి అన్నారు. వస్తు సేవలు, నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణాలు, ఇలా ఎందులో మోసం జరిగిందని భావించినా.. నిరభ్యంతరంగా జిల్లా వినియోగదారుల మండలిని ఆశ్రయించవచ్చని సూచించారు. ఎవరైనా.. ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసే సాంకేతికత ఈ–జాగృతి పేరుతో అందుబాటులోకి వస్తోందని వెల్లడించారు. వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఫిర్యాదు చేయడం ఎలా అంటే.? వినియోగదారుల మండలికి ఫిర్యాదు చేసి విధానం చాలా సులువు. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. ఏ న్యాయవాది అవసరం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశాం. మీరెలా మోసపోయారో చెబితే అంతా వారే సహకారం అందిస్తారు. అన్ని రకాల వస్తువులపై ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారులకు ఉంది. లోపాలు, ఇబ్బందులు తలెత్తితే వస్తువు కొన్న రెండేళ్లలోపు ఫిర్యాదు చేయాలి. ఆలస్యమైతే పూర్తి ఆధారాలతో డిలే పిటిషన్ వేయవచ్చు. ప్రతివాది సంస్థ నోటీసులు అందిన 45 రోజుల్లో కౌంటర్ ఫైల్ చేయకపోతే.. తదుపరి ప్రొసీడింగ్స్ లేకుండానే కేసు పరిష్కృతమయ్యే అవకాశం ఉంది. బిల్లు తప్పకుండా తీసుకోవాలి వినియోగదారుడు ఏదైనా వస్తువును కొన్న తర్వాత బిల్లు తప్పకుండా తీసుకోవాలి. ఇదే ప్రాథమిక ఆధారం. అప్పుడే కేసు స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది. వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారం పొందవచ్చు. రూ.5లక్షల లోపు వస్తువు ధర ఉంటే ఎలాంటి రుసుం లేకుండా వినియోగదారుల ఫోరం(కోర్టు)లో కేసులు వేయవచ్చు. రూ.5 లక్షలపైబడి ఉంటే.. రూ.400 నుంచి రూ.2 వేల వరకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 30 నుంచి 40 ఫిర్యాదులు ప్రతి నెలా 30 నుంచి 40 ఫిర్యాదులొస్తుంటాయి. ఇందులో టూ వీలర్, ఫోర్ వీలర్, వాటర్ ఫిల్టర్, గ్యాస్, పెట్రోల్ దుకాణాలు, ధరల వ్యత్యాసం, బీమా, వైద్యం వంటివి ఎక్కువగా ఉంటాయి. వచ్చిన ఫిర్యాదుల్లో బీమా కంపెనీల మోసాలపై 50 శాతం వరకు.. మోటర్ వాహనాలపై 30 శాతం ఉంటున్నాయి. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదుల్లో న్యాయవాది సాయంతో వస్తున్న ఫిర్యాదులే అధికంగా ఉన్నాయి. త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంపూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. 90 రోజుల్లో పరిష్కృతమై వినియోగదారుడికి పరిహారం అందించగలుగుతున్నాం. కొన్ని కేసులు మాత్రం ఎక్కువ సమయం పడుతున్నాయి. ప్రతి నెలా 30 కిపైగా కేసులు పరిష్కరిస్తున్నాం. ప్రస్తుతం 190 కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. పరిధి లేదు.. ఫిర్యాదు చేయవచ్చు ఒకప్పుడు ఎక్కడ వస్తువు కొనుగోలు చేస్తే ఆ పరిధిలోనే ఫిర్యాదు చేసేవారు. చట్టంలో వచ్చిన మార్పులు వినియోగదారుడికి వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఎవరు ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. త్వరలోనే ఈ–జాగృతి అమల్లోకి రానుంది. అంటే పేపర్లెస్ విధానం. ప్రొసీడింగ్స్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటాయి. భయపడకుండా రావాలి అన్యాయమైన వాణిజ్య విధానాలు, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందడం వినియోగదారుల హక్కు. జిల్లా వినియోగదారుల ఫోరం ద్వారా నష్ట పరిహారం రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు, రాష్ట్ర కమిషన్ ద్వారా రూ. కోటి నుంచి రూ. 10 కోట్ల వరకు పొందవచ్చు. రూ.10 కోట్లు దాటితే జాతీయ వినియోగదారుల కమిషన్లో కేసులు వేసుకునే అవకాశం ఉంటుంది. మోసం జరిగిందని గుర్తిస్తే ప్రతి ఒక్కరూ భయపడకుండా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నాం. చట్టాలపై అవగాహనతో మోసాలకు చెక్ ఈ–జాగృతితో మరింత వెసులుబాటు జిల్లా వినియోగదారుల ఫోరం–1ప్రెసిడెంట్ తనూజరెడ్డి -
అప్పన్న పెళ్లిచూపులు నేడు
● కొండదిగువ ఉద్యాన మండపంలో డోలోత్సవం ● బొట్టెనడిగే పున్నమి ఉత్సవంగా అడవివరం ప్రజల ఆచారం సింహాచలం: పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం పెళ్లి చూపులు జరగనున్నాయి. స్వామి పెళ్లికుమారుడిగా ముస్తాబై సింహగిరి దిగి, కొండ దిగువ పుష్కరిణి సత్రంలో ఉన్న ఉద్యానమండపంలో కొలువుండి, డోలోత్సవం నిర్వహించుకోనున్నాడు. పెళ్లి నిశ్చయం అనంతరం అడవివరం గ్రామంలో తిరువీధి చేసుకోనున్నాడు. అనంతరం పైడితల్లి ఆలయం వద్దకు కెళ్లి, అక్కడి నుంచి మెట్లమార్గంలో కొండకి చేరుకుంటాడు. డోలోత్సవం కథ ఇదీ.. సింహాచలేశుడికి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి రోజు వార్షిక కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. దీనికి ముందు వచ్చే పాల్గుణ పౌర్ణమి రోజున స్వామివారి పెళ్లిచూపుల తంతుతో డోలోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. దీన్నే అడవివరం గ్రామస్తులు బొట్టెనడిగే పున్నమిగా చెప్తారు. అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారిని స్వామికి అక్కగా అభివర్ణిస్తుంటారు. పైడితల్లి అమ్మవారి కుమార్తెనే స్వామి మనువాడినట్లు చెప్తారు. సింహగిరిపై నుంచి కొండదిగువకు వచ్చిన స్వామి తొలుత తన సోదరి పైడితల్లి ఆలయం వద్దకు వెళ్లి పిల్లనివ్వాల్సిందిగా అమ్మవారిని అడగ్గా.. నీకు ఆస్తిపాస్తులేం ఉన్నాయని, ఏం చూసి పిల్లనివ్వాలని అమ్మవారు తొలుత ఒప్పుకోరు. దీంతో స్వామి అలిగి అక్కడి నుంచి వెళ్లి, పుష్కరిణి సత్రంలోని ఉద్యాన మండపంలో వేంచేస్తాడు. అక్కడ వైభవంగా డోలోత్సవం, వసంతోత్సవం, చూర్ణోత్సవం చేసుకుంటాడు. ఈ వేడుక గురించి తెలుసుకున్న పైడితల్లి అమ్మవారు స్వామికి ఎంతో మంది భక్తులు ఉన్నారని, వారే ఆయన ఆస్తిగా భావించి పిల్లనివ్వడానికి ఒప్పుకుంటుంది. స్వామికి పెళ్లి నిశ్చయమైన ఆనందంలో గ్రామస్తులు, భక్తులు, దేవస్థానం ఉద్యోగులు, వైదికులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని వసంతోత్సవం జరుపుతారు. దీన్నే డోలోత్సవంగా అభివర్ణిస్తారు. డోలోత్సవం నిర్వహణ అనంతరం ఉగాది రోజున పెళ్లిరాట, చైత్రశుద్ధ ఏకాదశిన వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో వైదికులు,అధికారులు ఏర్పాట్లు చేశారు. కొండదిగువ ఉద్యానవనమండపాన్ని విశేషంగా ముస్తాబు చేశారు. -
సాగరతీరంలో..సంప్రదాయ హోలీ
ఏయూక్యాంపస్: నగరంలో నివాసం ఉంటున్న మార్వాడీలు హోలీ వేడుకలను ముందుగానే ప్రారంభించారు. గురువారం ఉదయం ఆవు పేడతో చేసిన పిడకలను సముద్ర తీరానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ప్రతీ కుటుంబం నుంచి ఒక పిడకల దండను సేకరించి, వాటి తో సాగరతీరంలో పెద్ద కుప్పగా పేర్చారు. ఈ పిడకల కుప్పకు మహిళలు పూజలు చేశారు. గురువారం రాత్రి 11.34 గంటలకు పిడకలకు నిప్పు వెలిగించి హోలికా దహన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పిడకల నుంచి వచ్చి బూడిదను విభూతిగా భావించి ప్రతి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేశారు. శుక్రవారం జరిగే వేడుకల్లో ఆ విభూతిని నుదుటన తిలకంగా ధరిస్తారు. ఆ తర్వాత మార్వాడీలందరూ కుటుంబ సమేతంగా హోలీ వేడుకల్లో పాల్గొంటారు. -
వైభవంగా అనంతుని రఽథోత్సవం
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవ స్వామి ఆలయంలో అనంతుని కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అనంత పద్మనాభ స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా విశేష హోమం, గ్రామ బలిహరణం, మంగళాశాసనం వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కుంతీ మాధవ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉత్సవ విగ్రహాలను వేద పండితులు వేద మంత్రోచ్ఛరణలు, నాద మునీశ్వరుల స్వరాల నడుమ రథంపైకి తోడ్కొని వచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రథం ముందు కుంభం(అన్నం) పోశారు. స్థానిక సీఐ సిహెచ్.శ్రీధర్ ప్రథమ పూజ అనంతరం గాలి గోపురం వద్ద నుంచి రథోత్సవం ప్రారంభమైంది. పూలమాలలు, అరటి చెట్లు, విద్యుద్దీపాలతో అలంకరించిన రఽథం భక్తుల గోవింద నామస్మరణల నడుమ ముందుకు సాగింది. రాజ వీధి గుండా అనంత పద్మనాభ స్వామి రథచక్రాలు వడివడిగా ముందుకు కదిలాయి. ఈవో నానాజీ బాబు పర్యవేక్షణలో జరిగిన ఈ రథోత్సవంలో ఎంపీపీ రాంబాబు, పద్మనాభం సర్పంచ్ టి.పాప, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రేపు వినియోగదారుల హక్కులపై జాతీయ స్థాయి సదస్సు
డాబాగార్డెన్స్: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 15న వినియోగదారుల చట్టం అమలుపై అవగాహన కల్పించడంతోపాటు జాతీయ స్థాయి శిక్షణా సదస్సు నిర్వహించనున్నట్లు కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్న ఈ సదస్సులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు వినియోగదారుల హక్కుల మండలి జిల్లా, రాష్ట్ర, జాతీ య స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ సివిల్ సప్లయ్ ఆఫీసర్ మురళీనాథ్, చంద్రశేఖర్, ప్రసాద్రాజు, బాలకృష్ణ పాల్గొన్నారు. -
కష్టజీవులను కబళించిన టిప్పర్
కూర్మన్నపాలెం : విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న ఇద్దరు కార్మికులను టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. స్టీల్ సిటీ డిపో ఎదురుగా జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దువ్వాడ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. దువ్వాడ ఉప్పర కాలనీకి చెందిన డి.రాంబాబు(45), నక్కా కృష్ణ(43), నక్కా శ్రీను స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులకు హాజరయ్యారు. విధులు ముగించుకొని గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. స్టీల్ సిటీ డిపో ఎదురుగా జాతీయ రహదారి వద్ద మలుపు తిరుగుతుండగా అనకాపల్లి నుంచి గాజువాక వైపు వస్తున్న టిప్పర్ బైక్ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రాంబాబు, కృష్ణ చక్రాల కింద నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. బైక్పై వెనుక కూర్చున్న నక్కా శ్రీను ఎగిరి పడడంతో గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాంబాబుకు భార్య చంటమ్మ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కృష్ణకు భార్య సింహాచలంతో పాటు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఈ సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గుండెలవిసేలా రోదించారు. కాగా.. ప్రమాదం జరిగే సమయంలో కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు మలుపు తిరుగుతోంది. దానిని కూడా టిప్పర్ ఢీకొని కొంత దూరం ఈడ్చుకు పోయింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. అప్పుడే డిపో నుంచి బయలుదేరడంతో బస్సులో ప్రయాణికులెవరూ లేరు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మరణం.. ఒకరికి గాయాలుబంధువుల ఆందోళన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బంధువులు, కాలనీవాసులు ఘటనా స్థలం వద్ద ఆందోళనకు దిగారు. టిప్పర్ యజమాని ఘటనా స్థలానికి రావాలని, అంతవరకూ మృతదేహాలు తరలించడానికి వీలులేదని పట్టుబట్టారు. రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఏడీసీపీ కె.ప్రవీణ్కుమార్ అక్కడకు చేరుకుని, వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగించడంతో.. పోలీసులు టిప్పర్ యాజమాన్య ప్రతినిధులను రప్పించి పోలీస్స్టేషన్లోనే చర్చలు జరిపారు. ఏసీపీ టి.త్రినాథ్ సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో సవర సంఘం ప్రతినిధులు జి.రాజేష్, నూకరాజు, తాతారావు యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడానికి ఒప్పందం కుదరడంతో బంధువులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. టిప్పర్ డ్రైవర్ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. సీఐ మల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జపాన్ దేశస్తుడికి సెల్ ఫోన్ అప్పగింత
భీమునిపట్నం: సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తున్న జపాన్ దేశస్తుడు గురువారం తన సెల్ఫోన్ పోగొట్టుకోగా క్రైం పోలీసులు వెతికి అతనికి అప్పగించారు. వివరాలివి. జపాన్కు చెందిన తొషియుకి షిషిడా తన యాత్రలో భాగంగా ఒడిశా నుంచి హైవేపై విశాఖపట్నం వస్తున్నారు. అయితే తగరపువలస సమీపంలోకి వచ్చేసరికి తన సెల్ఫోన్ పోయిన విషయాన్ని గుర్తించారు. వెంటనే అతను భీమిలి క్రైం స్టేషన్కు వచ్చి ఎస్ఐ సూర్యప్రకాశ్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అయితే అది జాతీయ రహదారిపై భోగాపురం పరిధిలోని మహరాజుపేట వద్ద ఉంది. ఆ ప్రాంతం తమ పరిధిలోనిది కానప్పటికీ ఎస్ఐ సూర్యప్రకాశ్, కానిస్టేబుల్ రాజేష్తో అక్కడకు వెళ్లి సెల్ఫోన్ను సేకరించారు. అనంతరం జపాన్ దేశస్తుడికి అందజేశారు. ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే ఫోన్ను వెతికి అప్పగించిన పోలీసులకు షిషిడా ధన్యవాదాలు తెలిపారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్, పీ–4 సర్వేపై ప్రత్యేక దృష్టి
డాబాగార్డెన్స్: స్వచ్ఛ సర్వేక్షణ్.. స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ ఎంఎన్ హరేందిరప్రసాద్ ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జోనల్, వార్డు స్థాయి స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ విశాఖ నగరంలో స్వచ్ఛ సర్వే క్షణ్ సర్వే బృందం కొద్ది రోజుల్లో సర్వే నిర్వహించనుందని, అందుకు తగిన పారామీటర్లలో లోపా లు గుర్తించి సవరించేలా చూడాలన్నారు. సచివాలయ పరిధిలో ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలపై వార్డు స్థాయి స్పెషల్ ఆఫీసర్లు నిత్యం పర్యవేక్షణ జరుపుతూ నేరుగా ప్రజలను కలిసి సంబంధిత విషయాలపై అడిగి, వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. నగరంలో జరుగుతున్న పి–4 సర్వేను 18లోగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులకు ప్రజలు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 85 శాతం ఓకేనట మూతపడనున్న ప్రాథమిక పాఠశాలలు అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆందోళన
విశాఖ విద్య : ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియ తుదిదశకు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 117 జీవోను రద్దు చేసి... దానికి ప్రత్యామ్నాయంగా మోడల్ స్కూళ్లను తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసి, చుట్టు పక్కల పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఇందులో విలీనం చేసేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో దూరంగా వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు ఇస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. ప్రాథమిక విద్యకు విఘాతం కలిగేలా కూటమి ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ పేరిట స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆమోదం పొందాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో ఇది పారదర్శకంగా జరగడం లేదు. పాఠశాలల పునర్నిర్మాణంపై వ్యతిరేకత లేకుండా చూడాలనే కూటమి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలతో దీనిపై నేరుగా జిల్లా కలెక్టర్లు రంగంలోకి దిగారు. దీంతో బడిలో బలవంతపు తీర్మానాలు జరిగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విలీనానికి సై అంటున్నారా..? కూటమి ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఇంకా తగ్గిపోతాయని ఉపాధ్యాయులు బాహాటంగానే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రస్తుత నిర్ణయాలతో చాలా స్కూళ్లలో 1, 2 తరగతుల నిర్వహణకు విద్యార్థులు లేక, స్కూళ్లకు తాళాలు వేయాల్సిందే. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాఠశాలలు మూతపడనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్మానాలు వస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్లో తమ బడి మూతపడుతుందనే విషయం వారికి తెలిసే, ఇదంతా జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభిప్రాయ సేకరణ పూర్తయిన స్కూళ్లుఅభిప్రాయ సేకరణలో ఆమోదం శాతంప్రభుత్వ స్కూళ్లుజిల్లాపంచాయతీలుమండలాలుమిగులు ఉపాధ్యాయుల దారెటో.. ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటి వరకు ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు (ఎస్జీటీ) పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో 783 మంది, అనకాపల్లిలో 2,114 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,566 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. 3, 4, 5 తరగతులను మోడల్ స్కూళ్లకు తరలించినట్లయితే, ఆయా పాఠశాలల్లో ఇక ఒక్కరే ఉపాధ్యాయుడు పనిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మూడు జిల్లాల్లో కలిపి ఆరు వందలకు పైగానే ఉపాధ్యాయులు సర్ప్లస్గా ఉంటారు. రేషనలైజేషన్ పేరుతో వీరిలో ఎక్కువ మందిని అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి పంపించాల్సి ఉంటుంది. 117 జీవో అమల్లో భాగంగా జరిగిన రేషనలైజేషన్తో ఏజెన్సీకి వెళ్లిన ఉపాధ్యాయులు ఇప్పట్లో వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం తాజాగా చేపడుతున్న చర్యలతో మిగులు ఉపాధ్యాయులు దారెటనేది ప్రశ్నార్థకమే.స్కూళ్ల పునర్నిర్మాణంపై అభిప్రాయ సేకరణ ఇలా.. విశాఖపట్నం 11 161 560 440 81.63 అనకాపల్లి 24 667 1,408 1,159 84.85 అల్లూరి 22 421 1,673 1,587 98.02 -
భూముల క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ
మహారాణిపేట: అభ్యంతరం లేని అనధికారిక ఆక్రమణలు, నివాసయోగ్యమైన కట్టడాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్ 30 ఉద్దేశాలు, ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. 2019కి ముందు జరిగిన ఆక్రమణలను పరిగణలోకి తీసుకుని క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం వేర్వేరుగా విశాఖ, భీమిలి రెవెన్యూ డివిజన్లపై సమీక్ష జరిగింది. జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఆర్డీవోలు పి.శ్రీలేఖ, సంగీత్ మాధుర్, కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, సర్వే శాఖ ఏడీ సూర్యారావులతో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులు, పీజీఆర్ఎస్ వేదికగా వచ్చిన వినతుల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. ప్రజల సంతృప్తే కొలమానంగా రెవెన్యూ సిబ్బంది పనితీరును అంచనా వేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. రీ సర్వే, మ్యుటేషన్ల ప్రక్రియలో పారదర్శకత లోపించకుండా పని చేయాలన్నారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని, ఆక్రమణల వివరాలను ప్రతి సచివాలయంలో ప్రదర్శించాలని ఆదేశించారు. జీవో నంబర్ 301 ప్రకారం గాజువాక పరిధిలోని భూముల క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో తహసీల్దార్లు, డీటీలు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు. విశాఖ, భీమిలి డివిజన్ల రెవెన్యూ సమీక్షలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం -
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లు
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక ఎంవీపీకాలనీ : రాష్ట్ర స్థాయి పోటీలకు విశాఖ జిల్లా బాలురు, బాలికలు జట్లను ఎంపిక చేసినట్లు విశాఖ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాదరెడ్డి తెలిపారు. ఎంపికై న జట్లు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని వైఎస్సార్ ఇంటిగ్రేడ్ స్పోర్ట్స్ అకాడమిలో జరగనున్న 34వ రాష్ట్ర సబ్ జూనియర్ బాలురు, బాలికల కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో విశాఖ జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. గత వారం రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో బాలురు, బాలికల జట్లుకు శిక్షణ అందించినట్లు తెలిపారు. బాలురు జట్టుకు మేనేజర్గా ఎం.శివ, కోచ్గా కె.జయ వ్యవహరించనుండగా ప్రదీప్, దుర్గాప్రసాద్, శ్రీను, సంపత్, సందీప్, ప్రసాద్, మణికంఠ, కార్తీక్, హేమంత్, హేమసతీష్, శ్రీను, హేమసుందర్ సభ్యులుగా ఎంపికై నట్లు పేర్కొన్నారు. మహిళల జట్టుకు కోచ్గా చైతన్య వ్యవహరిస్తుండగా ద్రాక్ష, మేఘన, పుణ్యమ, జానకి, కుసుమ, ప్రణీత, హరిక, అనురాధ, సౌమ్య, అక్షయ, కావ్య, పావని ఎంపికై నట్లు వెల్లడించారు. ఎంపికై న ఆయా జట్ల క్రీడాకారులకు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసాదరెడ్డితో పాటు జాయింట్ సెక్రటరీ సిహెచ్ గోవిందు, కోశాధికారిగా లక్ష్మణరావు, జాతీయ క్రీడాకారులు వై.వి.శ్రీనివాస్, వి.కనకరాజు అభినందనలు తెలిపారు. -
అపరిశుభ్రంగా భోజన శాల
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లను గురువారం ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హాస్టళ్లలో భోజనం సరిగా పెట్టడం లేదని, ఇతర సమస్యలపై బుధవారం రాత్రి విద్యార్థులు ఖాళీ కంచాలతో ఏయూ ప్రధాన గేటు ముందు ధర్నా చేపట్టడంతో అధికారుల్లో చలనం వచ్చింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆచార్య రాజశేఖర్ హాస్టళ్లను పరిశీలించారు. ఆర్ట్స్ కళాశాల భోజన శాలలో అపరిశుభ్ర వాతావరణం ఉండటం గమనించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులతో కలసి అక్కడే అల్ఫాహారం తీసుకున్నారు. భోజన నాణ్యత, మెనూ అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాష్ బేసిన్కు వెళ్లే మార్గాన్ని తరచూ శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. వంటశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. భోజనశాలలో కుర్చీలు కొన్ని చోట్ల విరిగి ఉండటాన్ని గమనించి, వెంటనే మార్పు చేయాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను మెరుగుపరచడంలో, పర్యవేక్షణలో విద్యార్థులను భాగస్వాములు చేస్తామని, ఇందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని వీసీ స్పష్టం చేశారు. హాస్టల్ మెస్లపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని విద్యార్థులకు హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన సమయంలో వీసీ మరో మెస్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, భోజన నాణ్యతను పరిశీలించారు. సాయంత్రం అకడమిక్ సెనేట్ మందిరంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. హాస్టల్లో ఉన్న సమస్యలపై సమగ్ర వివరాలు తీసుకున్నారు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం డిస్పెన్సరీని తనిఖీ చేసి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. అసంతృప్తి వ్యక్తం చేసిన ఏయూ వీసీ క్యాంపస్ హాస్టళ్ల ఆకస్మిక తనిఖీ -
అవయవదానంపై అవగాహన అవసరం
● కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఏయూక్యాంపస్: అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి, అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ అన్నారు. ప్రపంచ కిడ్నీ డే పురస్కరించుకుని జీవన్దాన్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం బీచ్రోడ్డులో అవయవదాన అవగాహన నడక జరిగింది. ఈ సందర్భంగా కాళీమాత ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఎక్కువగా కూర్చోవడం, మూత్ర విసర్జనకు సకాలంలో వెళ్లకపోవడం వంటివి మానుకోవాలని హితవు పలికారు. దీర్ఘ కాలంలో ఇవి సమస్యలకు కారణాలుగా మారుతాయన్నారు. మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతేడాది 210 మందికి అవయవాలు మార్పిడి చేశారని, ప్రస్తుతం జిల్లాలో 4,312 మంది అవయవాల కోసం నమోదు చేసుకున్నట్లు తెలిపారు. జీవనశైలిలో మార్పులతోనే చక్కని ఆరోగ్యం సాధ్యమని సూచించారు. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ ఇటీవల కాలంలో కిడ్నీ సంబంధ వ్యాధులు పెరగడం ఆందోళనకరమన్నారు. బ్రెయిడ్ డెడ్ అయిన వ్యక్తి దానం చేసే అవయవాలు మరొక ఎనిమంది మందికి ప్రాణదానంగా నిలుస్తాయన్నారు. అవయవదానంపై ప్రతీ ఆస్పత్రి బయట ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. జీవన్దాన్ రాష్ట్ర ఇన్చార్జి డాక్టర్ కె.రాంబాబు మాట్లాడుతూ కిడ్నీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని, ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలిని కలిగి ఉండాలన్నారు. రెండున్నర నెలల కాలంలో 54 అవయవాలు మార్పిడి చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.ఎస్.ఎం.సంధ్యాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైద్య, నర్సింగ్ విద్యార్థులు, వివిధ ఆస్పత్రుల సిబ్బందితో కలిసి కలెక్టర్, సీపీ తదితరులు నడిచారు. -
గీతాకృష్ణ వ్యాఖ్యలపై మహిళా న్యాయవాదుల నిరసన
సీతమ్మధార: మహిళలపై టాలీవుడ్ దర్శకుడు గీతా కృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను వుమెన్స్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్(వావా) అధ్యక్షురాలు పప్పు అనురాధ ఖండించారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వావా ఆధ్వర్యంలో గురువారం మహిళా న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గీతాకృష్ణ వివిధ చానల్స్లో మహిళలను అసభ్యకరంగా వర్ణిస్తూ వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. అసోసియేషన్ తరఫున అతనిపై పోలీస్ కమిషనర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని, ఆయన మాట్లాడిన వీడియోలు ఆధారంగా గీతాకృష్ణపై చర్యలు తీసుకోవాలని అనురాధ కోరారు. నిరసనలో అసోసియేషన్ కార్యదర్శి హేమమాలిని, కోశాధికారి బి.రమాదేవి, ఉపాధ్యక్షురాలు కె.లక్ష్మీదుర్గ, డి.పద్మారాణి, తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో ఘనంగా మొల్లమాంబ జయంతి
మహారాణిపేట: కవయిత్రి, మొల్ల రామాయణం రచయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు గురువారం కలెక్టరేట్లో జరిగాయి. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె జీవిత విశేషాలను గుర్తు చేసుకున్నారు. మొల్ల రచనా శైలి సరళమైనదని, ఆమె జీవితం అనుసరణీయమైనదని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి బి.శ్రీదేవి, కుమ్మరి శాలివాహన సంఘం డైరెక్టర్ చిరంజీవులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తేనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట
● పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ● ముగిసిన సైబర్ సెక్యూరిటీ బూట్ క్యాంప్ విశాఖ విద్య: యువతరం సైబర్ నేరాలను నియంత్రించే నిపుణులుగా తయారు కావాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల బూట్ క్యాంప్ బుధవారంతో ముగిసింది. సైబర్ దాడులు, సైబర్ నేరాలు అనేక దేశాలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న తీరును ఈ సందర్భంగా సీపీ వివరించారు. వ్యవస్థలోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్న విధానాన్ని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారని, వీరు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశ్నించడం మొదలు పెడితేనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని, యువత సైబర్ సెక్యూరిటీ రంగంలో నిష్ణాతులుగా మారడానికి అవసరమైన కోర్సులు చేయాలని సూచించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ తరగతి గదిలో నేర్చుకున్నదానికి భిన్నంగా బూట్ క్యాంపులో నైపుణ్యాలు వృద్ధి చెందుతాయని చెప్పారు. పోలీస్ శాఖ నేడు అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. శశిభూషణరావు మాట్లాడుతూ సైబర్ నిపుణులను తయారు చేయడం, విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీపై శిక్షణ అందించడం, ప్రజల్లో అవగాహన కలిగించడం ఈ కార్యక్రమ లక్ష్యాలన్నారు. ఆచార్య వి. వల్లి కుమారి, కంప్యూటర్ సైన్స్ విభాగ ఆచార్యులు ఆచార్య ఎం. శశి, ఆచార్య జి. లావణ్య దేవి తదితరులు మాట్లాడిన అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కంప్యూటర్ సైన్స్ విభాగం ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.