breaking news
Visakhapatnam District Latest News
-
కమీషన్ల కక్కుర్తే కారణం
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాలను ప్రైవేటీకరిస్తోందని.. అదే విధంగా కమీషన్ల కోసమే రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించేందుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మండిపడ్డారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించాలని, పేదవాడికి అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను దగ్గర చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్రంలో సుమారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. కూట మి ప్రభుత్వం జగన్కి మంచి పేరు వస్తుందనే మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుందని విమర్శించారు. 2019కి ముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 1045 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తే వైఎస్సార్సీపీ పాలనలో 3,275 వ్యాధులకు దానిని విస్తరించిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేవలం 1,000 ఆస్పత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తే జగన్ ఆధ్వర్యంలో సుమారు 2,350 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం అందించినట్లు తెలిపారు. కరోనాకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం అందించినట్లు చెప్పారు. జగన్ 45 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13 వేల కోట్లు వెచ్చించి వైద్యం, రూ. 1,500 కోట్ల ఆర్థిక ఆసరా అందించారన్నారు. బాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 5 లక్షల వరకు మాత్రమే లబ్ధి ఇచ్చేదని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ లబ్ధిని రూ. 25 లక్షలకు పెంచిందన్నారు. ఈ రోజు వైద్య విద్యను పేదలకు దూరం చేయాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని భావించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కె.కె. రాజు స్పష్టం చేశారు. -
బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం
నరసాపురం జంక్షన్లో రోడ్డుపై ధర్నా పద్మనాభం: మండలంలోని తునివలస పంచాయతీ నరసాపురం జంక్షన్లో బస్సులు ఆపకపోవడంతో ఆ గ్రామ ప్రజలు, కళాశాల విద్యార్థులు శుక్రవారం జంక్షన్లో రోడ్డుపై ధర్నా చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు వీరు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టినప్పటి నుంచి విజయనగరం నుంచి వచ్చేటప్పుడు నరసాపురం జంక్షన్లో బస్సులు అపకుండా రెడ్డిపల్లిలో నిలుపుతున్నారు. ఉచితంగా మహిళలు ఎక్కువగా బస్సులు ఎక్కుతున్నారని డైవర్లు బస్సులను నరసాపురంలో ఆపడం లేదు. రాత్రి వేళల్లోనూ బస్సులు నరసాపురం జంక్షన్లో ఆపకుండా రెడ్డిపల్లిలో నిలపడంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం చీకట్లో నడిచి రావాల్సి వస్తుండటంతో ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. బస్సులకు అడ్డంగా రోడ్డు మీద వీరు నిలబడి పోయారు. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. బస్సులు, ఆటోలు రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో డ్రైవర్లు, ప్రయాణికులు విద్యార్థులు, ప్రజలతో వాగ్వాదానికి దిగారు. చివరకు బస్సు డ్రైవర్లు నరసాపురంలో బస్సులో నిలుపుతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
మరణించి నలుగురికి వెలుగునిచ్చి..
పెందుర్తి : బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందిన ఓ వ్యక్తి నేత్రాలను దానం చేసి ఓ కుటుంబం మానవత్వం చాటుకుంది. వివరాలివి.. పెందుర్తి ఆదిత్యనగర్లో నివాసం ఉంటున్న కోరుబిల్లి శ్రీను(40) క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం రాత్రి శ్రీను ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు వెంటనే కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ క్రమంలో శ్రీను సమీప బంధువు శరగడం రాము(కర్రల రాము) చొరవతో కుటుంబ సభ్యులు శ్రీను నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు. మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు శ్రీను నేత్రాలను సేకరించారు. ఇటీవల కాలంలో విస్తృతంగా నేత్రదానం చేయిస్తున్న పెందుర్తిలోని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ స్ఫూర్తిలో తాము ఈ నేత్రదానం చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్అల్లిపురం: ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతా క్రియేట్ చేసి ఒక మహిళ ఫొటోలు మార్ఫ్ చేసి న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ ఆ ఫొటోలు పోస్ట్ చేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. సాంకేతికత సహాయంతో సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలివి.. నగరానికి చెందిన ఒక మహిళకు గుర్తు తెలియని ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన ఫేస్తో అశ్లీలంగా మార్ఫ్ చేసిన ఫొటోలు వచ్చాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే తన మార్ఫ్ చేసిన ఫొటోలు బాధితురాలి ఫాలోవర్స్ అందరికీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫార్వర్డ్ చేస్తానని బెదిరింపు మెసేజ్లు వచ్చాయి. దీంతో బాధితురాలు భయాందోళనకు గురై సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి సాధారణ ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీస్ నుంచి డౌన్లోడ్ చేసుకుని.. ఆన్లైన్ అప్లికేషన్ ఉపయోగించి అశ్లీలంగా మార్ఫ్ చేసి మళ్లీ ఆమెకు పంపించింది నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సాంకేతికత సహాయంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. -
ఆకట్టుకుంటున్న వస్త్ర ప్రదర్శన
అల్లిపురం: దేశంలోని వివిధ రాష్ట్రాలలో పేరు గాంచిన చీరలు, వస్త్రాల అమ్మకాలు గ్రీన్ పార్కు హోటల్లో నేషనల్ సిల్క్ ఎక్స్ పో సంస్థ ప్రారంభించింది. ఈ ప్రదర్శన ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దసరా, వివాహాది వేడుకలకు అవసరమైన అన్ని రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్లు కలబోసిన విభిన్న వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. నేషనల్ సిల్క్ ఎక్స్పో – ఎగ్జిబిషన్ కమ్ సేల్ సందర్శన షాపింగ్ చేయటంలోఒక అద్భుతమైన వస్త్రాల సంబరాన్ని చూసిన అనుభూతి పొందుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రవేశం ఉచితమని నిర్వాహకులు పేర్కొన్నారు. -
ఖాతా తెరవని బుల్స్.. స్టీలర్స్ థ్రిల్లింగ్ గెలుపు
విశాఖ స్పోర్ట్స్: పోర్టు ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్ల్లో బెంగళూరు బుల్స్ మరో ఓటమిని చవిచూడగా, హర్యానా స్టీలర్స్ ఉత్కంఠ పోరులో విజయం సాధించి అభిమానులకు మజాను అందించింది. యూ ముంబాతో జరిగిన ఏకపక్ష మ్యాచ్లో బెంగళూరు బుల్స్ ఘోర పరాజయం పాలైంది. మ్యాచ్లో మూడుసార్లు ఆలౌట్ అయిన బుల్స్.. తొలి అర్ధభాగంలోనే 12–29తో భారీగా వెనుకబడింది. రెండో అర్ధభాగంలో బుల్స్ కాస్త పుంజుకున్నా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సీజన్లో బుల్స్ ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్ 35–30 పాయింట్ల తేడాతో యూపీ యోథాస్పై విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో.. చివరి ఐదు నిమిషాల్లో దూకుడుగా ఆడిన స్టీలర్స్, యోథాస్ను రెండుసార్లు ఆలౌట్ చేసి విజయాన్ని కై వసం చేసుకుంది. శనివారం రాత్రి 8 గంటలకు పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్, రాత్రి 9 గంటలకు తమిళ్ తలైవాస్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. -
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
మహారాణిపేట : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి శుక్రవారం ఉదయం విశాఖలో జిల్లాలో ఘనస్వాగతం లభించింది. రాడిసన్ బ్లూ హోటల్లో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీలు శ్రీ భరత్, సీఎం రమేష్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్లు గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. సదస్సు అనంతరం రుషికొండ హెలిప్యాడ్ నుంచి 11.50 గంటలకు ఉండవల్లికి తిరుగు పయనమయ్యారు. -
కరెంట్ సమస్య.. క్షణాల్లో పసిగట్టేలా..
‘స్కాడా’ అనుసంధానం ఆటోమేటిక్ ఫీడర్ చేంజ్ రూమ్ సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, సమస్య ఎక్కడుందో కనుగొనడానికి సిబ్బంది క్షేత్రస్థాయిలో గంటల తరబడి శ్రమించాల్సి వచ్చేది. లోపం ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, సబ్స్టేషన్కు సమాచారమిచ్చి, విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత మరమ్మతులు చేసేవారు. ఈ ప్రక్రియకు గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కానీ, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో పరిస్థితులు మారాయి. ఇప్పుడు విద్యుత్ సరఫరాలో లోపం ఎక్కడ తలెత్తిందో క్షణాల్లోనే కంప్యూటర్ స్క్రీన్పై కనిపిస్తోంది. ఆ సమాచారంతో సంబంధిత సిబ్బంది కేవలం 5 నుంచి 30 నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఇది తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో అమలు చేస్తున్న సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) వ్యవస్థతో సాధ్యమవుతోంది. విశాఖపట్నం సర్కిల్ పరిధిలో ఇప్పటికే సగానికి పైగా సబ్స్టేషన్లు స్కాడాతో అనుసంధానం కావడంతో నగరవాసులకు విద్యుత్ సమస్యలు గణనీయంగా తగ్గాయి. స్కాడా అంటే.? విద్యుత్ సరఫరా వ్యవస్థను ఒకే కేంద్రం నుంచి పర్యవేక్షిస్తూ.. సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించి, సరఫరాను పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవస్థే స్కాడా. ఇది సెన్సార్లు, రిమోట్ టెర్మినల్ యూనిట్ల ద్వారా సబ్స్టేషన్లను కంట్రోల్ సెంటర్తో అనుసంధానిస్తుంది. ఆపరేషనల్ టెక్నాలజీ ద్వారా రియల్ టైమ్ డేటాను సేకరించి, వ్యవస్థను పూర్తిస్థాయిలో నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది. సాధారణంగా సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లు చేసే పనులను స్కాడా కంట్రోల్ సెంటర్ నుంచే ఆటోమేటిక్గా, రిమోట్ సెన్సార్ల సహాయంతో నిర్వహిస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో... విశాఖ నగరంలో స్కాడా ఏర్పాటుకు 2013లో ప్రతిపాదనలు రాగా, 2014లో రూ.13.16 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. 2015 నుంచి మొదలుపెడితే 28 సబ్స్టేషన్లను స్కాడా కంట్రోల్ స్టేషన్కు అనుసంధానం చేశారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత మరో 12 స్టేషన్లను అనుసంధానం చేయడంతో పాటు మరో 24 సబ్స్టేషన్లను స్కాడా పరిధిలోకి తీసుకొచ్చే పనులు ప్రారంభమై.. చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సబ్స్టేషన్లలోనూ స్కాడా అమలుకానుంది. విశాఖపట్నం సర్కిల్ పరిధిలో మొత్తం 130 విద్యుత్ సబ్ స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం 40 స్టేషన్లు ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా పనిచేస్తున్నాయి. మరో 24 స్టేషన్లలో త్వరలోనే సేవలు మొదలుకానున్నాయి. మిగిలిన కేంద్రాలను కూడా భవిష్యత్తులో అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కంట్రోల్ సెంటర్ ఎక్కడంటే..? స్కాడా పరిధిలోని అన్ని సబ్స్టేషన్లను పెదవాల్తేరులోని పోలమాంబ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. ఇది అత్యంత కీలకమైన, సాంకేతికతతో కూడిన కార్యాలయం కావడంతో దీనిని నియంత్రిత ప్రాంతంగా (నిషిద్ధ ప్రాంతం) పరిగణిస్తారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి నగర విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉన్నందున ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈపీడీసీఎల్ ప్రత్యేక నిపుణుల బృందం (ఈఈ, డీడీఈ, ఏఈ స్థాయి అధికారులతో పాటు 8 మంది షిఫ్ట్ ఇంజినీర్లు) ఈ కేంద్రాన్ని 24/7 పర్యవేక్షిస్తోంది. స్కాడాకు అనుసంధానించిన సబ్స్టేషన్ పరిధిలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో లోపం వస్తే, వెంటనే కంట్రోల్ రూమ్లో అలారమ్స్ మోగుతాయి. హై వోల్టేజ్, లో వోల్టేజ్ వంటి హెచ్చుతగ్గులను కూడా ఈ కేంద్రం నుంచే నియంత్రించవచ్చు. ఏ ప్రాంతానికి ఎంతసేపు విద్యుత్ సరఫరా చేశారు, ఎంతసేపు కోతలు విధించారు, లోడ్ ఎంత ఉంది వంటి సమాచారం మొత్తం రియల్ టైమ్ డేటా రూపంలో నిక్షిప్తమవుతుంది. ప్రమాదాలు తగ్గుముఖం స్కాడా కంట్రోల్ స్టేషన్ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉండటంతో.. ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి. విద్యుత్ సరఫరాలో నాణ్యత ఉంటోంది. స్కాడాకి అనుసంధానం చేయడం వల్ల సరఫరాలో అంతరాయాలు గుర్తించి, పునరుద్ధరించడంలో 56 శాతం వరకు సమయం ఆదా అవుతోంది. పవర్ ట్రిప్ అయితే రియల్ టైమ్లో తెలుస్తోంది. స్క్రీన్పై నుంచే వోల్టేజ్, ఇతర అంశాల్ని నిశితంగా పరిశీలించవచ్చు. ఏ చిన్న సమస్య తలెత్తినా.. పసిగట్టగలుగుతున్నాం. గతంలో ఫీడర్ మార్పు చేసేందుకు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 2 లేదా 3 నిమిషాల్లో ఫీడర్ని మార్పు చేయగలుగుతున్నాం. గ్రామస్థాయిలో ఫీడర్ల వరకూ స్కాడా అనుసంధానం చేసేందుకు కొంత సమయం పడుతుంది. –జి.శ్యామ్బాబు, విశాఖపట్నం సర్కిల్ ఎస్ఈ స్కాడా పరిధిలోని సబ్స్టేషన్లనుపర్యవేక్షిస్తున్న సిబ్బంది -
ఏయూ ఆచార్యులకు అవార్డులు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని పలువురు ఆచార్యులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరున బెస్ట్ అకాడమీషన్ ఆఫ్ ది ’ఇయర్ 2025 అవార్డులను అందించారు. సెనేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏయూ ఆచార్య జి.పి.రాజశేఖర్ అవార్డులను అందజేశారు. లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సీతామాణిక్యం, సైన్స్ కళాశాల కెమిస్ట్రీ విభాగం ఆచార్యురాలు డీవీవీ శైలజ, ఇంజినీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ ఆచార్యులు వెంకట్రావులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎ.నరసింహారావు, ఆచార్య ఎం. వి. ఆర్. రాజు, ఆచార్య జి. శంకర్, ఆచార్య కె. సీతామాణిక్యం, ఆచార్య ఆర్. పద్మశ్రీ, ఆచార్య డి. నాగరాజకుమారీ ,పపలువురు డీన్లు, డైరెక్టర్లు, అధికారులు, ఆచార్యులు పాల్గొన్నారు. -
డీఎస్ఎన్ఎల్యూలో అకడమిక్ బ్లాక్ ప్రారంభం
సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్ఎన్ఎల్యూ)లో నూతనంగా నిర్మించిన అకడమిక్ బ్లాక్ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి, విశ్వవిద్యాలయ విజిటర్ జస్టిస్ పి.శ్రీనరసింహ శుక్రవారం ప్రారంభించారు. దీంతోపాటు వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహత్మాగాంఽధీ, రాజ్యాంగ పిత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, తొలి దళిత ముఖ్యమంత్రి, దామోదరం సంజీవయ్య విగ్రహాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వర్సిటీ సమావేశమందిరంలో వాతావరణ మార్పులు, చట్టాలు అనే అంశంపై జస్టిస్ ఇ.వెంకటేశం స్మారక ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డాక్టర్ సూర్యప్రకాశరావు, ఇన్చార్జ్ రిజిస్ట్రార్ విశ్వచంద్ర మదాసీ పాల్గొన్నారు. -
● చెరువు కాదు.. స్టేడియమే..
జనసేన నిర్లక్ష్యానికి నిదర్శనంజగదాంబ : అవునండీ నిజమే.. ఇది జీవీఎంసీ 35వ వార్డులో ఉన్న ఇందిరా మున్సిపల్ క్రికెట్ స్టేడియమే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోస్టేడియాన్ని రూ.5 కోట్ల మేర నిధులు వెచ్చించి మెరుగుపరిచారు. అయితే ఇటీవల జనసేన కార్యకర్తల సమావేశం కోసం మైదానాన్ని తవ్వేసి వదిలేశారు. దీంతో కురుస్తున్న వర్షాలకు స్టేడియం చెరువులా మారింది. ఆటలాడుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తల సమావేశానికి ముందు స్టేడియం -
గురువులదే గురుతర బాధ్యత
ఆరిలోవ: ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సూచించారు. విద్యార్థులను ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించే స్థాయికి తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గతేడాది 10వ తరగతి ఫలితాల్లో గురుకుల పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు 590 మార్కులు దాట గా, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం నలుగురైదుగురు మాత్రమే ఆ ఘనత సాధించడం ఆలోచించాల్సిన విషయమని ఉపాధ్యాయులకు చురకంటించారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏయూలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హాల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 90 మందిని ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం మంత్రి డోలా మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, ఉత్తమ సమాజ నిర్మాణం కోసం విద్యార్థులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కొందరు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, వారిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత గురువులదేనని సూచించారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, విద్యా వ్యవస్థలో రాజకీయ ప్రమేయం తగదన్నారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ దేశానికి అవసరమైన మానవ వనరులను తయారుచేసే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. డీఈవో ఎన్.ప్రేమకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
ఆనందం నిండుగ
పట్టాల పండగ.. విశాఖ సిటీ: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్ఎన్ఎల్యూ) పట్టభద్రుల కేరింతలతో బీచ్రోడ్డు మార్మోగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచే దేశంలో పలు రాష్ట్రాల నుంచి విశాఖలో న్యాయ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు నోవాటెల్ హోటల్లో సందడి చేశారు. శుక్రవారం హోటల్లో డీఎస్ఎన్ఎల్యూ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. గత ఐదేళ్లలో యూనివర్సిటీలో పలు కోర్సులో ఉత్తీర్ణులైన వారికి పట్టాల అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, అతిథులుగా జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ పి.నరసింహా, రాష్ట్ర హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. అతిథుల చేతుల మీదుగా విద్యార్థులను బంగారం, వెండి పతకాలతో పాటు పట్టాలను అందజేశారు. ఇందులో 397 మంది బీఏ ఎల్ఎల్బీ, 153 మందికి ఎల్ఎల్ఎం, నలుగురికి పీహెచ్డీ, ఇద్దరికి ఎల్ఎల్డీ పట్టాలు అందించారు. అలాగే 153 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. బ్యాచ్ల వారీగా విద్యార్థులు న్యాయమూర్తులతో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ప్రసంగించారు. వర్సిటీతోనే కాకుండా తమ జీవిత అనుభవాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సందడి : కోవిడ్, ఇతరత్రా కారణలతో గత ఐదేళ్లుగా డీఎస్ఎన్ఎల్యూ స్నాతకోత్సవం వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఐదేళ్లలో న్యాయ విద్యను పూర్తి చేసిన వారు ఇప్పటికే సుప్రీంకోర్టు, పలు రాష్ట్రాల్లో హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో ప్రాక్టీసులు ప్రారంభించారు. 8 నుంచి 12 బ్యాచ్లకు ఒకేసారి పట్టాలు అందించేందుకు డీఎస్ఎన్ఎల్యూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి.సూర్యప్రకాశరావు స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. దీనికి పలు రాష్ట్రాల్లో స్థిరపడిన న్యాయ విద్యార్థులు శుక్రవారం విశాఖకు వచ్చారు. తమ స్నేహితులను కలుసుకుని కేరింతలు కొడుతూ సందడి చేశారు. తమ ప్రొఫెసర్లతో ముచ్చటించారు. ఐదేళ్ల తర్వాత అందరూ స్నాతకోత్సవం ద్వారా కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది మాకు పండగే.. ఐదేళ్ల తర్వాత ఇంత ఘనంగా స్నాతకోత్సవం జరగడం నిజంగా మాకు పండుగలా ఉంది. కోవిడ్, ఇతర కారణాలతో కాన్వోకేషన్ ఆలస్యమైంది. 2021లో న్యాయ విద్యను పూర్తి చేశాను. ప్రస్తుతం హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్నాతక్సోతవానికి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరవడం గర్వంగా ఉంది. వారి అనుభవాలతో అందించిన ప్రసంగం స్ఫూర్తిదాయకం. – ఎం.మనోజ్, 2021 న్యాయ విద్యార్థి ఉత్సాహం నింపింది దేశంలో నల్సార్ వంటి యూనివర్సిటీలో ఈ తరహా వేడుకలు జరుగుతుంటాయి. ఇప్పుడు డీఎస్ఎన్ఎల్యూ నిర్వహించడం అద్భుతంగా ఉంది. దీనికి దేశ, రాష్ట్ర అతున్నత న్యాయస్థానాల జడ్జీలు రావడంతో సంతోషంగా ఉంది. ఇది మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. న్యాయమూర్తుల అనుభవాలు తమకు జీవితంలో ఉపకరిస్తాయి. ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన వైస్చాన్సలర్ సూర్యప్రకాష్కు కృతజ్ఞతలు. – సాయి దత్తా, న్యాయవిద్యార్థిఘనంగా డీఎస్ఎన్ఎల్యూ స్నాతకోత్సవం ఐదు బ్యాచ్ల విద్యార్థులకు పట్టాల ప్రదానం అతిథులుగా హాజరైన సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు పట్టాలతో కేరింతలు కొట్టిన విద్యార్థులు భార్గవశర్మకు 3 బంగారు పతకాలు విశాఖకు చెందిన భార్గవ శర్మ మూడు సబ్జెక్టుల్లో బంగారు పతకాలను అందుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహం వీటిని ప్రదానం చేశారు. భార్గవ శర్మ 2021లో డీఎస్ఎన్ఎల్యూ నుంచి న్యాయశాస్త్రంలో 5 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా 2021–22 బ్యాచ్కు చెందిన అడ్వకేట్ కుమార్ నిఖిల్ నాలుగు స్వర్ణపతకాలు అందుకున్నాడు. -
కిక్కిరిసిన జనం.. ఏర్పాట్లలో వైఫల్యం
బీచ్రోడ్డు: సాగరతీరంలోని ఎంజీఎం గ్రాండ్స్లో శుక్రవారం విశాఖ ఫుడ్ ఫెస్టివల్ 2025 ప్రారంభమైంది. ఈ పండగకు ప్రజల నుంచి స్పందన లభించినప్పటికీ, నిర్వాహకుల వైఫల్యం కారణంగా ఫుడ్ లవర్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రజల రాకను అంచనా వేయడంలో అధికారులు విఫలమవడంతో, ప్రాంగణం వేలాది మందితో కిక్కిరిసిపోయింది. నిలబడటానికి కూడా స్థలం లేకపోవడం, ఒకే మార్గంలో రాకపోకలు సాగించాల్సి రావడంతో తోపులాట జరిగి, గాలి ఆడక ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆశించిన స్థాయిలో సాంస్కృతిక ప్రదర్శనలు లేకపోవడం కూడా వారిని నిరుత్సాహపరిచింది. అయితే, ఈ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన డిన్నర్ ఆన్ బోట్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యుత్ కాంతుల్లో, అలల సవ్వడి మధ్య బోట్లపై భోజనం చేసే అవకాశం సందర్శకులను ఆకట్టుకుంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్.. ఈ ఏడాది డిసెంబర్లో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామని ప్రకటించారు. విశాఖను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని మెగా ఈవెంట్లు నిర్వహిస్తామన్నారు. 2026 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, సిటీ పరేడ్ ఉంటుందన్నారు. అనంతరం స్టార్ చెఫ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అతిథులంతా ఫుడ్ స్టాళ్లను సందర్శించి వంటకాల రుచి చూశారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ హరేందిర ప్రసాద్, టూరిజం శాఖ అధికారులు జె.మాధవి, జగదీష్, ఫోరమ్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నూతన విద్యావిధానంతోనే వికసిత భారత్
మద్దిలపాలెం: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘స్వర్ణాంధ్ర, వికసిత భారత్–2047 కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్’అనే అంశంపై సైన్స్ కాంక్లేవ్ను ఘనంగా నిర్వహించింది. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి, ఏయూ పూర్వ వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ గ్రహీత, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆచార్య సంఘమిత్ర బందోపాధ్యాయ ప్రసంగించారు. వికసిత భారత్–2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి నూతన విద్యావిధానం దోహదపడుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సవాలని, దానిపై పూర్తి అవగాహన లేకపోతే నష్టం తప్పదని హెచ్చరించారు. విద్యార్థులు టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా, బృంద చర్చల ద్వారా నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. ప్రత్యేక అతిథి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర.. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే విపత్తుల గురించి వివరించారు. టెక్నాలజీని ఉపయోగించి వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సదస్సులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్తో రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(హైదరాబాద్) డైరెక్టర్లు డాక్టర్ ప్రకాశ్ చౌహన్, డాక్టర్.వి.ఎం.చౌదరి, ఏపీటీసీ చైర్మన్ డాక్టర్ సిహెచ్ మోహన్రావు, ఐఐటీ హైదరాబాద్ పూర్వ సంచాలకుడు ఆచార్య జి.నరహరిశాస్త్ర, రెక్టార్ ఆచార్య కిశోర్బాబు, రిజిస్ట్రార్ కె.రాంబాబు, ప్రిన్సిపాళ్లు, డీన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఏయూలో ఘనంగా సైన్స్ కాంక్లేవ్ -
కొత్త లాండ్రీ సదుపాయం ప్రారంభం
తాటిచెట్లపాలెం : ఆటోనగర్లోని అల్ట్రావాష్ టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కొత్త సదుపాయాన్ని వాల్తేరు రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా గురువారం ప్రారంభించారు. రైల్వే బెడ్రోల్స్, లెనిన్లను శుభ్రం చేయడానికి అధునాతన మెషినరీతో కూడిన స్టీమ్ బాయిలర్ ను ఈ సంస్థలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డీఆర్ఎం యూనిట్లోని బెడ్షీట్ క్యాలెండరింగ్, ఫోల్డింగ్ మెషిన్, వాషర్ ఎక్స్ట్రాక్టర్స్ వంటి వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. అల్ట్రావాష్ టెక్స్ సంస్థ గత 14 ఏళ్లుగా విశాఖపట్నం ప్రాంతంలో రైల్వేలకు లాండ్రీ , డ్రై క్లీనింగ్ సేవలను అందిస్తోంది. ఈ యూనిట్ ఒక షిఫ్ట్లో 7.5 టన్నుల వస్త్రాలను శుభ్రపరిచే సామర్థ్యం కలిగి ఉంది. అల్ట్రా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎల్.జి. త్రినాథరావు, డైరెక్టర్ ఎల్. సాయి వందన అందించిన సేవలను డీఆర్ఎం ఈ సందర్భంగా ప్రశంసించారు. -
ఉత్తరాంధ్ర మైనార్టీ విద్యాభివృద్ధి డీడీగా ఖాజా రహమతుల్లా
మద్దిలపాలెం: ఉత్తరాంధ్ర ప్రాంతీయ మైనార్టీ విద్యాఅభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా డాక్టర్ ఖాజా రహమతుల్లా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాంధ్ర మైనార్టీల విద్య, ఉద్యోగ శిక్షణకు సంబంధించిన కార్యక్రమాలను ఈ సంస్థ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న డాక్టర్ ఖాజా, వినియోగదారుల సంరక్షణ కమిటీ సభ్యుడిగా, గతంలో ప్రధానమంత్రి 15 అంశాల జిల్లా కమిటీ సభ్యుడిగా కూడా సేవలందించారు. ఈ పదవికి అవకాశం కల్పించినందుకు ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు, పాఠశాల హెచ్ఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
11న స్టీల్ప్లాంట్ ఈవోఐ, ప్రైవేటీకరణ రద్దు కోసం సభ
డాబాగార్డెన్స్: ఈవోఐ పేరిట విశాఖ స్టీల్ప్లాంట్ అమ్మకాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం తక్షణం నిలిపేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు పాతగాజువాకలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతారని చెప్పారు. విశాఖలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ విశాఖ కార్యదర్శివర్గ సభ్యులు ఆర్కేఎస్వీ కుమార్, పి.మణి, బి.జగన్, వి.కృష్ణారావులతో కలిసి బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి, చట్ట విరుద్ధంగా తొలగించిన 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. వారి స్థానంలో ఇతర రాష్ట్రాల కార్మికుల నియామకాన్ని ఆపాలన్నారు. ప్లాంట్లోని 6 వేల ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేసి, నిర్వాసితులకు పర్మినెంట్ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు, కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలన్నారు. సీఎం చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అవాస్తవ ప్రకటనలతో తమ ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్కు, రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని కప్పిపెట్టడం ఆపి, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించి, పరిరక్షించేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవుపలికారు. -
ప్రజారోగ్య మౌలిక వసతులకు పవర్ గ్రిడ్ ప్రాధాన్యత
అగనంపూడి: ప్రజారోగ్యానికి పవర్గ్రిడ్ సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగా అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రికి రూ. 32.50 కోట్ల విలువైన అధునాతన లినాక్ యంత్రాన్ని అందించినట్లు పవర్గ్రిడ్ డైరెక్టర్ (పర్సనల్) డాక్టర్ యతీంద్ర దివ్వేది తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగమని ఆయన పేర్కొన్నారు. హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ ఉమేష్ మహంతిశెట్టి మాట్లాడుతూ లినాక్ యంత్రం సహాయంతో స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ, టోటల్ బాడీ ఇరాడికేషన్, టోటల్ మారో ఇరాడికేషన్ వంటి అత్యాధునిక చికిత్సలను రోగులకు అందించవచ్చని తెలిపారు. దీనివల్ల రోగులపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సహకారానికి పవర్ గ్రిడ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పవర్గ్రిడ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్) వంశీరామ్మోహన్ బుర్రా, స్వతంత్ర డైరెక్టర్లు శివతపస్వ పాశ్వాన్, రోహిత్ వాస్వానీ, సజల్ ఝా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
భక్తి ముసుగులో వ్యాపారానికి బ్రేక్
గాజువాక : భారీ విగ్రహం పేరుతో గాజువాకలో వినాయక ఉత్సవాలను ప్రారంభించిన నిర్వాహకులకు అధికారులు షాకిచ్చారు. భక్తి ముసుగులో వ్యాపారానికి తెరలేపారన్న ఫిర్యాదులపై స్పందించిన అధికారులు వినాయక ఉత్సవాన్ని ముగించాలని నిర్వాహకులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంబంధిత మండపానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి భక్తులను అక్కడ్నుంచి పంపించేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో పాతగాజువాకలోని లంకా మైదానంలో 111 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. లక్ష చీరలతో సుందర వస్త్ర మహాగణపతి పేరిట ఉత్సవాలను గత నెల 27న ప్రారంభించారు. 21 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించడం కోసం జీవీఎంసీ నుంచి సింగిల్ విండో ప్రాసెస్లో నిర్వాహకులు అనుమతి తీసుకున్నారు. అయితే భక్తి ముసుగులో వ్యాపారానికి తెరలేపారని, కమర్షియల్గా టికెట్లు అమ్మడం, పార్కింగ్కు ఫీజు వసూలు చేయడం, దుకాణాలు పెట్టించి డబ్బులు వసూలు చేశారంటూ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులపై స్పందించిన అధికారులు నిర్వాహకులకు నోటీసులను కూడా అందజేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఉత్సవాల నిర్వహణ కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ జీవీఎంసీ కమిషనర్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. పోలీసులు, విద్యుత్ సిబ్బంది సహకారంతో మండపానికి, అక్కడి దుకాణాలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. దర్శనాలను నిలిపివేసిన పోలీసులు మండపాన్ని మూసేసి భక్తులను అక్కడ్నుంచి పంపించేశారు. గాజువాక లంకా మైదానంలో వినాయక ఉత్సవాలు ముగిశాయని అధికారవర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి. కోటి లింగాల గణపతి మండపానికి కూడా.. గాజువాక ఆర్టీసీ డిపో సమీపాన కోటి శివలింగాలతో 108 అడుగుల ఎత్తయిన భారీ వినాయక విగ్రహ మండపానికి కూడా జీవీఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వాహకులు వ్యవహరించడంపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. -
ప్రతి నెలా మూడో శనివారం ప్రవేశం
విద్యార్థుల సందర్శనకు హెర్బేరియం, మ్యూజియం సిద్ధం మద్దిలపాలెం: ఏయూలోని వృక్షశాస్త్ర విభాగంలో ఉన్న మ్యూజియం, హెర్బేరియంలను ఇకపై విద్యార్థులు, పరిశోధకులు సందర్శించవచ్చు. గురువారం ఈ కార్యక్రమాన్ని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. ప్రతి నెల మూడో శనివారం విద్యార్థులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వృక్షశాస్త్రంలో ఆసక్తి ఉన్నవారు సందర్శించవచ్చని వీసీ చెప్పారు. అంతరించి పోతున్న, అరుదైన వృక్ష జాతుల సమాచారం తెలుసుకోవచ్చని, ఇది పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రయోగశాలగా ఉపయోగపడుతుం దన్నారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీసీ కోరారు. -
టైటాన్స్కు తొలి విజయం
విశాఖ స్పోర్ట్స్ : పోర్ట్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. జైపూర్ పింక్ పాంథర్స్తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో 37–32 తేడాతో విజయం సాధించింది. టైటాన్స్ కెప్టెన్ విజయ్, ఆల్రౌండర్ భరత్ ఎనిమిది పాయింట్లతో రాణించగా, రైడర్లు చేతన్, అజిత్ ఐదేసి పాయింట్లు సాధించారు. గత రెండు మ్యాచ్లలో ఓటమి తర్వాత, ఈ విజయం టైటాన్స్కు పాయింట్ల ఖాతాను తెరిచింది. దబాంగ్ ఢిల్లీకి హ్యాట్రిక్ విజయం : మరో మ్యాచ్లో, దబాంగ్ ఢిల్లీ హోరాహోరీగా తలపడిన పునేరి పల్టన్ను గోల్డెన్ రైడ్లో ఓడించింది. మ్యాచ్ 28–28తో డ్రా కావడంతో, గోల్డెన్ రైడ్ ద్వారా విజేతను నిర్ణయించారు. స్టార్ రైడర్ ఆషు మాలిక్ సాధించిన రెండు పాయింట్లతో దబాంగ్ ఢిల్లీ 30–28 తేడాతో గెలిచి, ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. పునేరి పల్టన్ తరఫున ఆదిత్య ఏడు పాయింట్లు సాధించగా, దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ ఆషు సూపర్ టెన్ సాధించాడు. -
ఆచార్యులకు అవార్డులు
అరుణ్ కుమార్దుర్గ ప్రసాద్ రావువల్లీకుమారి జాలాది రవిమద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు ఆచార్యులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగాధిపతి ఆచార్య జాలాది రవి, అణుభౌతిక శాస్త్ర విభాగం ఆచార్యులు దుర్గాప్రసాద్ రావు, కంప్యూటర్ సైన్స్ విభాగం ఆచార్యులు వి.వల్లీ కుమారిలను ఎంపిక చేసి, ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డులకు ఎంపికై న ఆచార్యులను ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ అభినందించారు. అలాగే డాక్టర్ వి.ఎస్. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వాణిజ్య విభాగంలో పని చేస్తున్న డాక్టర్ గెద్దాడ అరుణ్ కుమార్కు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.విజయబాబు, ఇతర అధ్యాపకులు ఆయన్ని అభినందించారు. -
ఉపాధ్యాయుల కుటుంబం
తగరపువలస: వారు చదువుకు దూరమయ్యారు., కూలి పనులకే పరిమితమయ్యారు..అయితే తమ పిల్లల చదువు కోసం చూపిన త్యాగం ఎప్పటికీ ఆదర్శనీయం. పద్మనాభం మండలం రెడ్డిపల్లికి చెందిన నిరక్షరాస్యులైన రెడ్డిపల్లి సన్యాసిరావు, ఆదిలక్ష్మి దంపతులు తమ కష్టంతో అలాంటి అద్భుతాన్నే సృష్టించారు. వ్యవసాయ కూలీలుగా మొదలైన వారి జీవితం, నేడు ఒకే కుటుంబంలో ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను, ఒక బ్యాంకు ఉద్యోగిని చూస్తుండడంతోనే ఎంతో ఆనందానికి లోనవుతున్నారు. 50 ఏళ్ల క్రితం వ్యవసాయ కూలీలుగా జీవితం ప్రారంభించిన ఈ దంపతులు, తమ అపారమైన కష్టంతో రెండు ఎకరాల భూమిని సంపాదించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆ భూమిని కూడా కరిగించి వారి చదువుకు వెచ్చించారు. ఫలితంగా వారి ఐదుగురు కుమారులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా జీవితంలో స్థిరపడ్డారు. 1998 డీఎస్సీలో పెద్ద కుమారుడు శ్రీనివాసరావు మన్యం జిల్లా కొమరాడలో, రెండో కుమారుడు త్రినాథరావు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. 2008 డీఎస్సీలో మూడో కుమారుడు ప్రసాదరావు విజయనగరం జిల్లా మెరక ముడిదాంలో, నాలుగో కుమారుడు అప్పలరాజు జీవీఎంసీ భీమిలి జోన్లో, ఐదో కుమారుడు రమేష్ విజయనగరం జిల్లా జామిలో ఉద్యోగాలు సాధించారు. కోడళ్లు కూడా ఉద్యోగులే.. ఈ కుటుంబంలో వారి పిల్లలు మాత్రమే కాదు.. వారి కోడళ్లు కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. త్రినాథరావు భార్య సుజాత విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో ఉపాధ్యాయురాలిగా, అప్పలరాజు భార్య మద్దిరెడ్డి సంతోషికుమారి పద్మనాభం మండలంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే రమేష్ భార్య జి. నిర్మల గరివిడిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులే గురుబ్రహ్మలు సన్యాసిరావు, ఆదిలక్ష్మి చదువుకోకపోయినా తమ పిల్లలకు అక్షర జ్ఞానమే కాదు, జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో నేర్పించారు. వారి త్యాగం, కష్టం ఈ కుటుంబానికి మార్గదర్శమయ్యాయి. ఈ కుటుంబాన్ని చూసి ఉత్తరాంధ్రలోని యువత ఉద్యోగాల కోసం ప్రేరణ పొందుతున్నారు. ఒక నిరక్షరాస్యులైన దంపతులు తమ కష్టంతో చూపిన ఈ గొప్ప విజయం, ఈ త్యాగమూర్తులను గురుబ్రహ్మలుగా తీర్చిదిద్దింది. మా కుటుంబం చేసుకున్న పుణ్యమే ఒక ఇంట్లో ఒక ఉద్యోగమే గగనమైన రోజుల్లో 27 ఏళ్ల క్రితం ఇద్దరు, 17 ఏళ్ల క్రితం ముగ్గురికి సమాజాన్ని సరిదిద్దే ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడం ఇదంతా మా అత్తామామల పుణ్యమే. – సంతోషికుమారి, ఉపాధ్యాయురాలు, రౌతులపాలెం పద్మనాభం -
పదేళ్ల తర్వాత యుద్ధ నౌకల పండగ
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మరోసారి అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కానుంది. 2026 ఫిబ్రవరిలో భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2026 విన్యాసాలను నిర్వహించనుంది. దాదాపు పదేళ్ల తర్వాత విశాఖలో జరుగుతున్న ఈ యుద్ధ నౌకల ప్రదర్శన కోసం దాదాపు 145 దేశాలను ఆహ్వానించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే చైనాను ఆహ్వానించాలా వద్దా అనే విషయంపై ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నాయి. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ.. గతంలో 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించింది. అలాగే 2024లోనూ రికార్డు స్థాయిలో మిలాన్ విన్యాసాలు జరిగాయి. ఇప్పుడు ఈ అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనతో విశాఖ ప్రాముఖ్యత మరింత పెరగనుంది. ఏమిటీ ఫ్లీట్ రివ్యూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో ఎదురుదాడికి దిగగల సత్తా చాటేందుకు నావికాదళ విన్యాసాలు ప్రపంచదేశాలకు చాటేందుకు నిర్దేశించినవే ఫ్లీట్ రివ్యూలు. భారత సుప్రీం కమాండర్ అయిన దేశాధ్యక్షుని సమక్షంలో ఈ విన్యాసాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే భారత్ 2001లో ముంబైలోనూ 2016లో విశాఖలో ఐఎఫ్ఆర్ని నిర్వహించిన అనుభవం ఉంది. ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలకు వేదికగా విశాఖ నిలుస్తోంది. ప్రపంచానికే నాగరికత నేర్పిన దేశంలో తొలి టైడల్ డాక్ని భారత్ నిర్మించింది. చంద్రగుప్త కాలం నుంచే భారతీయులు సముద్రయానంపై మంచి పట్టు సాధించినట్లు చరిత్ర పేర్కొంటున్నది. నాటినుంచి నేటి అణుజలాంతర్గాముల నిర్మాణంలోనూ స్వయంచాలితంగా ఎదిగిన భారత్ ప్రపంచదేశాలను ఆకర్షిస్తూనే ఉంది. అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనతో మరోసారి ప్రపంచదేశాల దృష్టి విశాఖ తీరంవైపు సాగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 24 వరకూ ఐఎఫ్ఆర్తో పాటు మిలాన్–2026ని విశాఖలో నిర్వహించనున్నారు. తొలిసారి 25.. మూడోసారి 145 2001లో భారత్లో తొలిసారి ముంబైలో ఐఎఫ్ఆర్ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్ఆర్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో 145 దేశాలకు ఆహ్వానం పంపించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు ఇండియన్ నేవీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ టాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్, గ్రీన్టగ్స్ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి. చైనాని పిలవాలా.. వద్దా.? ఇటీవల చైనాతో చర్చలు జరిగిన నేపథ్యంలో..ఐఎఫ్ఆర్కు చైనాను ఆహ్వానించాలా వద్దా అనే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్చలు జరుపుతోంది. 2016లో నిర్వహించిన ఐఎఫ్ఆర్కు చైనాని ఆహ్వానించగా రెండు యుద్ధ నౌకలు, ఓ జలాంతర్గామి విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. ఈసారి ఆహ్వానం అందించాలా వద్దా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తోందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ భారత్లో జరిగే ఏ విన్యాసాలకు పాక్ని ఆహ్వానించలేదు. రాబోతున్న ఐఎఫ్ఆర్, మిలాన్–2026కి కూడా ఆహ్వానం లేదని రక్షణ వర్గాలు తెగేసి చెబుతున్నాయి. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలకు చెందిన దేశాలు ఐఎఫ్ఆర్లో భాగస్వామ్యం కాబోతున్నాయి. -
నేటి నుంచి వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్
మహారాణిపేట: బీచ్రోడ్లోని ఎంజీఎం మైదానంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. పర్యాటక శాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫెస్టివల్లో ప్రముఖ స్టార్ హోటళ్లు పాల్గొంటున్నాయి. దాదాపు 40 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రా రుచులు, ప్రపంచ వంటకాలు, సిగ్నేచర్ వంటకాలతో పాటు, గోదావరి జిల్లాల ప్రత్యేకతలు, ఆర్గానిక్ వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి. అన్నీ సరసమైన ధరలకే లభిస్తాయి. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టివల్కు ప్రవేశం ఉచితమని, ఈ మూడు రోజుల పండగలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. -
కూటమి హామీలు నిలబెట్టుకోవాలి
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ జేఏసీ (అమరావతి) డిమాండ్ చేసింది. గురువారం విశాఖలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో ఏపీ జేఏసీ రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టి.వి. ఫణి పేర్రాజు మాట్లాడుతూ వెంటనే ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న డీఏ , 11వ పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల వివరాలను సీఎఫ్ఎంఎస్, పే స్లిప్పుల్లో చూపించాలని, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలన్నారు.కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి., మహిళా ఉద్యోగులకు రెండేళ్లు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విశాఖ, భీమలి డివిజన్లకు కొత్త కమిటీలను కూడా ఎన్నుకున్నారు. -
నేడు ‘సైన్స్ కాంక్లేవ్’
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ‘సైన్స్ కాంక్లేవ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్టీసీ– హైదరాబాద్)తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ ఫర్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్– 2047’ అనే అంశంపై ఈ కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 10.30 గంటల నుంచి బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుందని, విద్యా పురస్కార గ్రహీత, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (కోల్కతా) డైరెక్టర్ ఆచార్య సంఘమిత్ర బందోపాధ్యాయ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం
మహారాణిపేట: జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పి.ఎస్.నరసింహ గురువారం సాయంత్రం విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. వీరికి జిల్లా సెషన్స్ జడ్జి చిన్నంశెట్టి రాజు, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి, పలువురు న్యాయమూర్తులు స్వాగతం పలికారు. వారంతా ఉదయం 09.30 గంటలకు రాడిసన్ బ్లూలో జరిగే ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్లోను, ఉదయం 11.30 గంటలకు నొవోటల్ హోటల్లో జరిగే దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడ జరిగే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సమావేశంలో పాల్గొంటారు. -
అన్నింటా మేటి
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో సత్తా చాటిన ఆంధ్ర విశ్వవిద్యాలయంవిశాఖ సిటీ : ఆంధ్రా యూనివర్సిటీ చరిత్ర సృష్టించింది. జాతీయ స్థాయిలో మరోసారి ఘనతను చాటుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో సత్తా చూపించింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కొత్త ఊపిరులందుకుంది. విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలతో నాలుగేళ్ల కాలంలో యూనివర్సిటీ ప్రపంచస్థాయి గుర్తింపు సంపాదించుకుంది. గత ప్రభుత్వ హయాంలో నాక్ డబుల్ ప్లస్ గ్రేడ్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్(ఐఐసీ) రేటింగ్స్లో 4 స్టార్ రేటింగ్ను సొంతం చేసుకుంది. తాజాగా 2023–2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో జాతీయ స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 4వ స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో రాష్ట్రంలో నంబర్ వన్ స్థానాన్ని ఏయూ కై వసం చేసుకుంది. విశ్వవిద్యాలయాల విభాగంలో జాతీయ స్థాయిలో 23వ ర్యాంకును సొంతం చేసుకుంది. వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో సాధించిన ఏయూ ప్రగతికి కొలమానంగా మారింది. అనేక సంస్కరణలతో ఘనత వైఎస్సార్ సీపీ పాలనలో విద్యా రంగంలో అనేక సంస్కరణలకు నాంది పలికారు. ప్రతి విద్యా సంస్థ, వర్సిటీల్లో ఆలోచనలు.. ఆవిష్కరణలు.. అవకాశాలు అనే నినాదంతో విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థి అభివృద్ధికి మార్గదర్శిగా.. పరిశోధనలకు నిలయంగా ఏయూలో అనేక కీలక విభాగాలను, ఆవిష్కరణ కేంద్రాలను ప్రారంభించారు. వివిధ దేశాలు, యూనివర్సిటీలు, సంస్థల ఒప్పందాలు చేసుకున్నారు. విద్యార్థులను ఆవిష్కర్తలుగా, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏయూ–నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను రూ.27 కోట్లతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గతంలో లేని విధంగా సొంతంగా ఒక స్టార్టప్, ఇంకుబేషన్ సెంటర్ ఆ–హబ్ని తీర్చిదిద్దారు. ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఏయూ సిబ్), ఆర్ఐఎన్ఎల్ సహకారంలో హ్యూమన్ జెనిటిక్స్ విభాగంలో బయో ఆర్బర్ ఇంకుబేషన్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతర్జాతీయంగా జియో ఇంజనీరింగ్ ప్రాధాన్యతను ముందుగానే గుర్తించి జియో ఇంజనీరింగ్ విభాగాన్ని పటిష్టపరిచారు. రూ.67.5 కోట్లతో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) సంయుక్తంగా ఏయూతో ఇంక్యుబేషన్, స్టార్టప్ సెంటర్ని ఏర్పాటు చేశాయి. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కూడా సిద్ధమైంది. ఇలా అనేక నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 59.20 స్కోర్తో 23వ ర్యాంకు అత్యుత్తమ విద్యా విధానాలు, ఆవిష్కరణలు, సౌకర్యాలు, ఫలితాలు, అత్యుత్తమ ప్రమాణాలకు సాధించే విద్యా సంస్థలు, వర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం ఏటా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు కేటాయిస్తుంది. ఇన్స్టిట్యూషన్లకు ర్యాంక్స్ ఇవ్వడానికి ప్రధానంగా విద్యా భోధన, అభ్యాసం, వనరులు, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకు కేటాయిస్తారు. 2023 జూన్ నుంచి 2024 జూన్ విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ర్యాంకులు ప్రకటించింది. ఇందులో ఏయూ యూనివర్సిటీ కేటగిరీలో 59.20 స్కోర్తో 23వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇంజనీరింగ్ కేటగిరీలో 47.37 స్కోర్తో 88వ ర్యాంకు, మేనేజ్మెంట్లో 59.95 స్కోర్తో 29వ ర్యాంకు, ఫార్మసీలో 58.19 స్కోర్తో 31వ ర్యాంకు, డాక్టర్ అంబేడ్కర్ లా యూనివర్సిటీ 63.12 స్కోర్తో 16వ ర్యాంకు సాధించింది. అలాగే రాష్ట్రంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఏయూ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. ఈ ర్యాంకు ద్వారా దేశం, రాష్ట్రంలో అత్యుత్తమ యూనివర్సిటీలను గుర్తించే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో పెరిగిన ప్రతిష్ట 2019 తర్వాత ఏయూ విశేష ప్రగతి సాధించింది. జాతీయ స్థాయిలో ప్రతిష్టను ఇనుమడింపచేసుకుంది. ప్రధానంగా ఏయూ నాక్ డబుల్ ప్లస్ గ్రేడ్ని, 3.74 సీజీపీఏతో సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ గుర్తింపు 2030 వరకు ఉంటుంది. ఆచార్యుల కొరత ఉన్న సమయంలో కూడా ఏయూ ఇంతటి విశిష్ట ర్యాంక్ని సాధించడంతోపాటు జాతీయ స్థాయిలో తొలి మూడు విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచింది. అలాగే స్టార్టప్ల ఆవిష్కరణలకు చేయూత అందించేందుకు ఏర్పాటు చేసిన ఆ–హబ్ ప్రారంభించిన కొద్ది కాలంలోనే దేశానికి దిక్సూచిగా మారింది. ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్(ఐఐసీ) ప్రకటించిన 4.0 స్టార్టప్ క్యాంపస్ విభాగంలో 4 స్టార్ రేటింగ్ సాధించింది. తాజాగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా సత్తా చాటింది. -
అధ్యాపకురాలి సేవలకు గుర్తింపు
డాబాగార్డెన్స్: విశాఖ ప్రభుత్వ బాలికల కళాశాల అధ్యాపకురాలు ఎం.రాధకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఆమె చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించింది. 1996లో స్కూల్ అసిస్టెంట్గా వీరనాయణంలో తన వృత్తిని ప్రారంభించిన రాధ, 2001లో నక్కపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు జూనియర్ లెక్చరర్గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత ఆమె పెందుర్తి, వడ్డాది, విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేశారు. అనంతరం దేవరాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సేవలందించిన ఆమె ప్రస్తుతం విశాఖ ప్రభుత్వ బాలికల కళాశాలలో జూనియర్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎందరో విద్యార్థులు ఆమె మార్గదర్శకత్వంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. -
ఐఎఫ్ఆర్ –2026 నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధం
మహారాణిపేట: వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ– 2026 నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో సీపీ శంఖబ్రత బాగ్చి, డీసీపీ అజిత, కమాండర్ వై.కె. కిశోర్ తో పాటు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో పలు అంశాలను చర్చించారు. ఐఎఫ్ఆర్తో పాటు, మిలాన్ వేడుకలు కూడా అదే సమయంలో జరుగుతాయని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులతో పాటు సుమారు 135 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ, గెయిల్, హెచ్పీసీఎల్ వంటి సంస్థలు చేపట్టిన అభివృద్ధి పనులను నవంబర్ రెండో వారంలోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రోడ్లు, డ్రెయిన్లు, కాలువల ఆధునికీకరణ, మారుతీ జంక్షన్ వద్ద జరుగుతున్న వంతెన పనులను వేగవంతం చేయాలని సూచించారు. -
మేయర్పై గరం..గరం
డాబాగార్డెన్స్: నగర మేయర్ పీలా శ్రీనివాసరావు వ్యవహారశైలిపై సొంత పార్టీ కార్పొరేటర్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని, అధికారులతోనూ సమన్వయం పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. దీనికి నిదర్శనంగా గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని చూపుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం సెక్షన్ 97ఏ ప్రకారం కొత్తగా ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ తొలి సమావేశం కమిషనర్ నిర్ణయం ప్రకారం నిర్వహించాలి. కానీ మేయర్ కార్యాలయం ఈ నిబంధనను పక్కనపెట్టి, కార్యదర్శి సంతకంతో ఒకరోజు ముందు మాత్రమే అజెండాను సభ్యులకు పంపింది. దీనివల్ల అజెండాలోని అంశాలను పరిశీలించడానికి తగినంత సమయం దొరకలేదని సభ్యులు మండిపడుతున్నారు. మేయర్ ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని, ఇది నగర పాలనకు మంచిది కాదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కమిషనర్కు వినతి: పైన పేర్కొన్న విషయమై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్, జీవీఎంసీ స్థాయీ సంఘం సభ్యురాలు సాడి పద్మారెడ్డి మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్గార్గ్కు వినతి పత్రం అందజేశారు. సమావేశ నోటీసు రద్దు చేయాలని, స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిబంధనల ప్రకారం కచ్చితంగా నిర్వహించాలని ఆమె అభ్యర్థించారు. పలు అభివృద్ధి పనులకు ఆమోదం: స్థాయీ సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు. 198 అంశాలు అజెండాలో పొందుపరచగా, సభ్యులు చర్చించిన అనంతరం 194 అంశాలు ఆమోదించారు. 4 అంశాలు వాయిదా వేశారు. సమావేశంలో సభ్యులు కొణతాల నీలిమ, గంకల కవిత, దాడి వేంకటరామేశ్వరరావు, మొల్లి హేమలత, సేనాపతి వసంత, గేదెల లావణ్య, మాదంశెట్టి చిన్నతల్లి, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు, మొల్లి ముత్యాలు, సాడి పద్మారెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. నిర్వహణకే రూ.35 కోట్లా? తాగునీటి సరఫరా, నిర్వహణ అంశాలపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో అసంపూర్తిగా ఉన్న పనులు, వాటి నిర్వహణపై అధికారులను ప్రశ్నలతో నిలదీశారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడు రాపర్తి త్రివేణి వరప్రసాదరావు మాట్లాడు తూ నగరంలో టెలిఫోన్ వైర్ల కోసం రోడ్లపై తవ్విన గుంతలను సరిచేసే బాధ్యత ఎవరిదని అధికారులను ప్రశ్నించారు. గత ఆరు నెలల్లో కేబుల్ కంపెనీల నుంచి ఎంత నష్టపరిహారం వసూలు చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మరమ్మతుల కోసం కొనుగోలు చేసిన మెటీరియల్ను ఎక్కడపడితే అక్కడ వదిలివేయడంతో అవి తుప్పు పట్టిపోతున్నాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తా రని నిలదీశారు. మరో సభ్యురాలు సాడి పద్మారెడ్డి మాట్లాడుతూ మోటార్లు ఆగిపోతే వాటికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ కూడా లేకపోవడంపై మండిపడ్డారు. ‘మోటార్ల నిర్వహణ కోసం రూ.35 కోట్లు కేటాయిస్తున్నారు, కానీ స్పేర్ పార్ట్స్ లేకపోతే ఆ నిధులు దేనికి?’ అని ప్రశ్నించారు. తాగునీటి సరఫరాలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని ఈ సందర్భంగా ఆమె అధికారులను కోరారు. ఇలా అయితే ర్యాంకు వెళ్లిపోవడం ఖాయం పారిశుధ్య నిర్వహణపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2025–26 సంవత్సరానికి 49.66 లక్షల అంచనా వ్యయంతో కొబ్బరి చీపుర్ల కొనుగోలు ప్రతిపాదన చర్చకు వచ్చినప్పుడు సభ్యులు అధికారులను నిలదీశారు. సభ్యురాలు సాడి పద్మారెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు చీపుర్లు వంటి ఉపకరణాలు అందజేసే ముందు స్థానిక కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో సభ్యుడు రాపర్తి త్రివేణి వరప్రసాదరావు మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. స్వచ్ఛభారత్ ర్యాంకింగ్లో జీవీఎంసీ 9వ ర్యాంకుకు పడిపోయిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ర్యాంకు 90కి పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఈ అంశాన్ని దాట వేశారు.. ఏయూ ప్రాంగణాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ప్రైవేట్ కార్మికులకు చెల్లింపుల అంశంపై స్టాండింగ్ కమిటీలో చర్చ జరిగింది. ఈ అంశాన్ని సభ్యురాలు సాడి పద్మారెడ్డి లేవనెత్తారు. మే 12న ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ, ఏయూ గ్రౌండ్స్లో మూడు షిఫ్టుల్లో 900 మంది ప్రైవేట్ కార్మికులను రోజువారీ వేతనం రూ. 549 చొప్పున నియమించడంపై ఆమె ప్రశ్నించారు. అసలు ఏయూ ప్రాంగణాల్లో జీవీఎంసీ పారిశుధ్య పనులను ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, మేయర్ పీలా శ్రీనివాసరావు ‘తర్వాత చర్చిద్దాం’ అంటూ ఆ అంశాన్ని దాటవేశారు. దీంతో పద్మారెడ్డితో పాటు ఇతర సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఈఎన్సీలో హిందీ పక్షోత్సవాలు ప్రారంభం
సింథియా: తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 2 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న హిందీ పక్షోత్సవాలను చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్టేషన్) అడ్మిరల్ మురళీమోహన్రాజు ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా హిందీ పోటీలు, వర్క్షాపులతో సహా పలు కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 17న సంస్థ హిందీ మ్యాగజైన్ పూర్వి వాణి 31వ ఎడిషన్ ఆవిష్కరణతో వేడుకలు ముగుస్తాయని పేర్కొంది. ప్రారంభ వేడుకల్లో తూర్పు నావికాదళ పరిధిలోని వివిధ నౌకల సిబ్బంది, పలు సంస్థల పౌర సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్కంఠ పోరులో హర్యానా గెలుపు
విశాఖ స్పోర్ట్స్: నగరంలోని పోర్టు స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ స్థానిక క్రీడాభిమానులకు ఉత్కంఠతో పాటు ఉత్సాహం నింపుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లు అసలైన కబడ్డీ మజాను పంచాయి. ఒక మ్యాచ్లో పునేరి పల్టన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ ఊపిరి బిగపట్టి చూసేలా అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్లో పునేరి పల్టన్ జట్టు వరసగా మూడో విజయాన్ని నమోదు చేస్తూ తమ జైత్రయాత్రను కొనసాగించింది. బెంగాల్ వారియర్స్తో జరిగిన ఈ పోరులో పల్టన్ 45–36 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జట్టు కెప్టెన్ అస్లాం, ఆదిత్య చెరో 11 పాయింట్లతో రైడింగ్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మరోవైపు బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంక్ ఒంటరి పోరాటం చేసి 17 పాయింట్లు సాధించినా, జట్టును గెలిపించలేకపోయాడు. రెండో మ్యాచ్ క్రీడాభిమానులకు అసలైన థ్రిల్లర్ను పరిచయం చేసింది. డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్.. యూ ముంబాతో తలపడిన ఈ మ్యాచ్లో చివరి క్షణం వరకు విజయం దోబూచులాడింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 36–36తో సమంగా నిలిచాయి. దీంతో విజేతను తేల్చేందుకు టైబ్రేకర్ అనివార్యమైంది. టైబ్రేకర్లో రైడర్ శివమ్ పటారే ఒకే రైడ్లో మూడు పాయింట్లు సాధించి హర్యానాను గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ ఉత్కంఠభరిత విజయం స్టీలర్స్కు ఈ సీజన్లో తొలి గెలుపును అందించింది. అజిత్ కుమార్ 12 పాయింట్లతో యూ ముంబా తరఫున పోరాడినా ఫలితం లేకపోయింది. గురువారం జైపూర్ పింక్ పాంథర్స్, తెలుగు టైటాన్స్, పునేరి పల్టన్, దబాంగ్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. కొనసాగిన పునేరి జోరు -
టీడీఆర్ బాండ్లు వద్దే వద్దు..
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణ బాధితులు కదంతొక్కారు. నష్టపరిహారాన్ని టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలోనే అందించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయం ఎదుట బుధవారం నిరసనకు దిగారు. ఇళ్లు, దుకాణాలు, భూములకు ఒకేసారి నష్టపరిహారం చెల్లించాలని నినదించారు. అనంతరం రోడ్డు విస్తరణ నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఆర్.రాము ఆధ్వర్యంలో నిర్వాసితులు వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్కు వినతిపత్రం అందజేశారు. గతంలో నిర్వహించిన గ్రామ సభల్లో టీడీఆర్ బాండ్లు వద్దని నిర్వాసితులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారని, అయినా టీడీఆర్ బాండ్లే ఇస్తామని అధికారులు పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వాపోయారు. మరోవైపు మూడు రోజుల క్రితం అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణ నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలంటూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేయడంపై మండిపడ్డారు. నిర్వాసితులంతా పేదవారని, వారికి టీడీఆర్ బాండ్లు ఏమాత్రం ఉపయోగపడవని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నగదు రూపంలో నష్ట పరిహారం అందించి, తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వమే ఉపాధి కల్పించాలన్నారు. 100 అడుగుల తర్వాత నిర్మించుకునే ఇళ్లకు ఎటువంటి నిబంధనలు విధించరాదన్నారు. మూడు నియోజకవర్గాలు.. 1225 మంది బాధితులు అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణ కోసం మూడు నియోజకవర్గాల పరిధిలో 125 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఈ భూముల్లో దాదాపుగా 1225 మంది నిర్వాసితులున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దేవుడి మాన్యంలో ఉన్న 12 మంది నిర్వాసితులకు, ఆర్అండ్బీ, పీడబ్ల్యూ స్థలాల్లో ఉన్న 62 మంది నిర్వాసితులకు బలవంతంగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. మిగిలిన నిర్వాసితులెవ్వరూ టీడీఆర్ బాండ్లు తీసుకోకుండా వ్యతిరేకించారు. కమిషనర్కు వినతి ఇస్తే.. సమాధానమే లేదు మాకు టీడీఆర్ బాండ్లు వద్దు.. నష్ట పరిహారంగా నగదు ఇవ్వాలి. 2023లో గ్రామాల వారీగా ధర నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నష్ట పరిహారం ఇవ్వడానికి అంతా సిద్ధం చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ జీవో రద్దు చేశారు. గత నెల 31న టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ జీవో ఇచ్చారు. వీఎంఆర్డీఏ కమిషనర్ను కలిసి టీడీఆర్ బాండ్లు వద్దు అని కోరాం. మాకు సంబంధం లేదని సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. – కర్రి అప్పారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, తిమ్మరాజు పేట, అచ్యుతాపురం మండలం -
అభివృద్ధి పనులపై సమీక్ష
తాటిచెట్లపాలెం : ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎం) రీటా రాజ్ బుధవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్లో పర్యటించారు. రీటారాజ్ పీసీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖలో పర్యటించారు. ప్రయాణికుల సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా దొండపర్తిలో గల డివిజినల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో డీఆర్ఎం లలిత్ బోహ్ర, ఇతర ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. కమర్షియల్ విభాగానికి చెందిన పలు అంశాలు, నాన్ఫేర్ రెవెన్యూకు సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు. సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ డివిజన్ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. సమావేశంలో వాల్తేర్ డివిజన్ కమర్షియల్, ట్రాఫిక్ విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
సుగాలి ప్రీతి కేసుపై హైలెవల్ కమిటీ వేయాలి
సాక్షి, విశాఖపట్నం: సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసి, అందులో సీబీఐని భాగస్వామ్యం చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు డిమాండ్ చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కె.భాగ్యలక్ష్మి, జీసీసీ మాజీ చైర్పర్సన్ స్వాతిరాణితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన బాలిక సుగాలి ప్రీతి హత్య జరిగింది. అప్పటి ప్రభుత్వం ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేసింది. ప్రీతిని అత్యంత పాశవికంగా హత్య చేసినా, నిందితులను చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు, ఇప్పుడు కాపాడుతోంది. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఇదే చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఈ కేసు గురించి ఊగిపోయి మాట్లాడిన పవన్, అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు. సుగాలి ప్రీతి తల్లి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను ఆదుకున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరగడం లేదని మీడియా సాక్షిగా వాపోయారు. ఆదివాసీలంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే..’ అని రవిబాబు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ కేసును వాడుకున్నారని ఆరోపించిన రవిబాబు.. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సుగాలి ప్రీతి కోసం ఎక్కడ పోరాటం జరిగినా.. వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, నంద్యాల ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి నాగసారి సుంకన్న, అల్లూరి జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు డాక్టర్ టి.సురేష్కుమార్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దండు మధు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ డిమాండ్ -
శ్లాబ్ పెచ్చులూడి తల్లీబిడ్డకు గాయాలు
స్థానికుల సహాయంతో కేజీహెచ్కు తరలింపు జగదాంబ: జీవీఎంసీ 35వ వార్డు దుర్గమాంబ సమాజం వీధిలోని ఓ ఇంటి శ్లాబ్ పెచ్చులూడి పడటంతో తల్లీకూతురుకు గాయాలయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇల్లు బాగా తడిసిపోయింది. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న ముద్దా భువనేశ్వరి తన 13 నెలల కుమార్తెతో కలిసి మంగళవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా శ్లాబ్ పెచ్చులు ఊడి వారి మీద పడ్డాయి. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లిద్దరికీ కాలిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని కేజీహెచ్కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ వార్డు అధ్యక్షుడు కనకరెడ్డి ప్రమాదానికి గురైన తల్లీబిడ్డలను పరామర్శించారు. ఏఎస్డబ్ల్యూవో నిర్లక్ష్యం200 మందికి వేతనాల చెల్లింపులో జాప్యంతగరపువలస: పాయకరావుపేట ఏఎస్డబ్ల్యూవో నిర్లక్ష్యం కారణంగా ఆగస్టు నెలకు సంబంధించి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని సుమారు 200 మంది సాంఘిక సంక్షేమ వసతిగృహాల సిబ్బంది జీతాలు ఆలస్యం కానున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖలో ఏపీసీవోలుగా పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల డ్యూటీ సర్టిఫికెట్లు ప్రతి నెలా 25లోగా విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన భీమిలి, విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపేట ఏఎస్డబ్ల్యూవోలు విశాఖలోని సాంఘిక సంక్షేమశాఖకు పంపించాలి. గత నెలలో నలుగురు ఏఎస్డబ్ల్యూవోలు డ్యూటీ సర్టిఫికెట్లు పంపించగా, పాయకరావుపేట నుంచి ఏఎస్డబ్ల్యూవో పంపించలేదు. ఫలితంగా సాంఘిక సంక్షేమశాఖలోని ఏపీసీవోలు, వార్డెన్లు, డిప్యూటీ డైరెక్టర్లు, సూపరింటెండింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది కలిపి సుమారు 200 మందికి జీతాలు నిలిచిపోయాయి. వీరి కి ప్రతి నెలా ఒకటో తేదీకి జీతాలు అందవలసి ఉండగా, ఇప్పుడు 15రోజులు ఆలస్యమయ్యేలా ఉంది. ఏపీసీవోల డ్యూటీ సర్టిఫికెట్ల పంపించడంలో జాప్యం చేసిన ఏఎస్డబ్ల్యూవోకు గత నెల 30న డిప్యూటీ డైరెక్టర్ మెమో జారీ చేశారు. దీనిపై మూడు రోజులలోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. -
సీఐపీఈటీతో సింహాద్రి ఎన్టీపీసీ ఒప్పందం
పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల యువతకు నైపుణ్యాభివృద్ధిశిక్షణ ద్వారా ఉపాధి, ఆదాయ వనరులను కల్పించేందుకు సింహాద్రి ఎన్టీపీసీ కృషి చేస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రాజెక్టు హెడ్ సమీర్శర్మ అన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించేందుకు వీలుగా విజయవాడలోని సీఐపీఈటీతో ఎన్టీపీసీ సింహాద్రి బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం సంస్థ ఈడీ సమీర్శర్మ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంస్థ సీఎస్సార్ విభాగం సౌజన్యంతో పరవాడ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి వీలుగా సీఐపీఈటీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఒప్పందం మేరకు 2025–26లో మూడు బ్యాచ్లకు వసతులతో కూడిన శిక్షణ కల్పించనున్నారు. బ్యాచ్కు 30 మంది చొప్పున శిక్షణ పొందుతారు. మెషిన్ ఆపరేటర్–ఇంజెక్షన్ మోడలింగ్, మెషిన్ ఆపరేటర్–ప్లాస్టిక్ ప్రాసెసింగ్లో నాలుగు నెలల పాటు శిక్షణ కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సుగాలి ప్రీతికి న్యాయం జరగాల్సిందే..
అల్లిపురం/ఎంవీపీకాలనీ: గిరిజన బాలిక సుగాలి ప్రీతి హత్య కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆమెను దారుణంగా హత్య చేసి ఎనిమిదేళ్లు గడిచినా నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. అల్లిపురంలో న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జైభీమ్ భారత్ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ నిందితులను తప్పించడానికే అభియోగ పత్రంలో అత్యాచారం, హత్య సెక్షన్లను తొలగించారని ఆరోపించారు. నిందితులకు శిక్ష పడితేనే అసలైన న్యాయం జరుగుతుందన్నారు. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచా నాగ మల్లేశ్వరి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ దారుణం జరిగిందన్నారు. ఇప్పు డు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉందని, రాజకీయ ఒత్తిడితోనే ఈ కేసును నీరుగారుస్తున్నారని విమర్శించారు. న్యాయవాది సలీం మాట్లాడుతూ దళిత, ఆదివాసీలకు అన్నివిధాలా అండగా నిలుస్తామన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గవర్నర్, రాష్ట్రపతిని కలిసి వినతిపత్రాలు సమర్పించాలని తీర్మానించారు. సమావేశంలో జై భీమ్ భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు ఎస్.చొక్కారావు, పలు సంఘాల ప్రతినిధులు ఉమామహేశ్వరరావు, అప్పన్న, భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంపీ కాలనీలోని గిరిజన భవన్లో జరిగిన సమావేశంలో జడ శ్రావణ్కుమార్ మాట్లాడారు. సుగాలి ప్రీతి హత్య కేసు విచారణలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు -
అప్పలరాజుకు రాంపాల్ సింగ్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
తగరపువలస: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య మాజీ అధ్యక్షుడు రాంపాల్ సింగ్ పేరుమీద నెలకొల్పిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు భీమిలి జోన్ ఒకటోవార్డు సంతపేట అంబేడ్కర్ జీవీఎంసీ హైస్కూల్కు చెందిన ఉపాధ్యాయుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ బందాలోని రాంపాల్సింగ్ ఉత్తమ ఉపాధ్యాయ సెలక్షన్ కమిటీ ఫౌండేషన్ ప్రధానకార్యదర్శి ప్రేమ్కుమార్ సింగ్ ఈ మేరకు సమాచారం అందించారు. అప్పలరాజుకు ఈ నెల 22న బందాలో మొమెంటో, సర్టిఫికెట్, నగదు బహుమతి అందించనున్నారు. సాయి సంహిత ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న అప్పలరాజును పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. -
ఎన్ఐపీఎం జాతీయ ఉపాధ్యక్షుడిగా మురళీధరరావు
మహారాణిపేట: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీఎం) జాతీయ ఉపాధ్యక్షుడిగా విశాఖకు చెందిన డాక్టర్ బి.మురళీధరరావు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాగ్పూర్కు చెందిన రజిత్ పాండేపై 450 ఓట్ల మెజారిటీతో మురళీధరరావు విజయం సాధించారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. మురళీధరరావు గతంలో విశాఖ చాప్టర్ కార్యదర్శిగా, చైర్మన్గా, ఎన్ఐపీఎం ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం జపాన్ ఎంఎన్సీ మెస్సర్స్ టయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్–హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. -
అడుగేస్తే.. గాల్లో తేలేలా..
కై లాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ విశాఖ సిటీ: తూర్పు కనుమలను తిలకిస్తూ.. సాగర సోయగాలను వీక్షిస్తూ.. గాల్లో తేలియాడే సరికొత్త అనుభూతిని అందించేందుకు విశాఖలో మరో పర్యాటక ఆకర్షణ సిద్ధమవుతోంది. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేందుకు కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ రూపుదిద్దుకుంటోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పునాది రాయి పడిన ఈ పర్యాటక ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రూ.10 కోట్ల వ్యయంతో పీపీపీ పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టు త్వరలో ప్రారంభానికి ముస్తాబవుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో పర్యాటకానికి పెద్దపీట గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఎన్నడూలేని విధంగా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కై లాసగిరిపై చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 2019 వరకు కై లాసగిరిపై కేవలం రోప్ వే, సర్క్యూట్ ట్రైన్, శివపార్వతుల విగ్రహాలు తప్ప మరో సందర్శనీయ, ఆహ్లాదాన్ని పంచే ప్రాజెక్టులు లేవు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పీపీపీ పద్ధతిలో స్కై సైక్లింగ్, జిప్లైనర్, గ్లాస్ బ్రిడ్జ్ పనులను ప్రారంభించారు. ఇప్పటికే గ్లాస్ బ్రిడ్జ్ మినహా మిగిలిన రెండు ప్రాజెక్టులు పర్యాటకులకు థ్రిల్ను పంచుతున్నాయి. వీటితో పాటు సైన్స్ మ్యూజియం, రివాల్వింగ్ రెస్టారెంట్, కాటేజీలకు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన గ్లాస్ బ్రిడ్జ్ పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. గాల్లో తేలియాడే అనుభూతి విశాఖలోని పర్యాటక ప్రాంతాల్లో కైలాసగిరికి ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం వేలాది మంది ఈ శిఖర దర్శనానికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు, గాల్లో తేలియాడేలా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దేశంలోనే అతిపెద్ద గాజు వంతెనల్లో ఒకటిగా నిలవనున్న ఈ నిర్మాణం.. విశాఖ పర్యాటకానికి అదనపు ఆకర్షణ కానుంది. గతంలో కై లాసగిరి కొండ ప్రారంభంలో ఉన్న టైటానిక్ వ్యూ పాయింట్ శిథిలమైంది. దాని స్థానంలో వీఎంఆర్డీఏ పీపీపీ పద్ధతిలో 55 మీటర్ల పొడవుతో ఈ గాజు వంతెనను నిర్మించింది. ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యంతో దీనిని నిర్మించినా, భద్రతా కారణాల దృష్ట్యా ఒక విడతకు 40 మందిని మాత్రమే అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై నడిచేటప్పుడు గాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. దీనిపై నుంచి చూస్తే చుట్టూ ఎత్తయిన కొండలు, కింద కై లాసగిరి లోయ, అద్భుతమైన సాగర సోయగాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఆస్వాదించేందుకు వీలుగా పటిష్టమైన భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేశారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం
విశాఖ లీగల్ : రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 5వ తేదీన నోవోటెల్, ర్యాడిసన్ బ్లూ హోటళ్లలో జరగనున్న వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ వీసీ డి.సూర్యప్రకాష్ రావు, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, పలువురు కోర్టు అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. -
ఏజీపీగా సతీష్
విశాఖ లీగల్ : నగరంలోని ఆరో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా ఎల్.సతీష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. సతీష్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన 1997లో ఎన్వీపీ లా కళాశాల నుంచి న్యాయ పట్టా పొంది న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రభుత్వ, ఇతర కేసుల్లో ప్రైవేటు కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరించారు. సతీష్ నియామకం పట్ల విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతి నాయుడు, సీనియర్ న్యాయవాది భక్తి రాజశేఖర్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, మాజీ ఉపాధ్యక్షుడు రామ జోగేశ్వరరావు అభినందనలు తెలిపారు. -
ఉత్తమ గురువులకు పురస్కారాలు
ఆరిలోవ: సమాజమనే సౌధానికి గురువులే పునాది రాళ్లు. తమ జ్ఞానమనే దీపంతో వేలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే నిస్వార్థ శిల్పులు ఉపాధ్యాయులు. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యా య పురస్కారాలకు జిల్లా నుంచి ముగ్గురు గురువులు ఎంపికయ్యారు. వారి అంకితభావానికి, కృషికి దక్కిన గౌరవమిది. ఆ రోజున అమరావతిలో ఈ పురస్కారాలను అందుకోనున్నారు. ఆంగ్ల బోధనలో మేటి గాజువాక: అక్కిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిమెట్ల కుమారస్వామి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారానికి ఎంపికయ్యారు. 35 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఆయన.. గత రెండేళ్లుగా అక్కిరెడ్డిపాలెం పాఠశాలలో సేవలందిస్తున్నారు. బోధనలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఆయన 2019 లోనే జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును అందుకున్నారు. 2021లో 7వ తరగతి విద్యార్థుల కోసం ఒక ఆంగ్ల పాఠ్యపుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2023 వరకు అధికారికంగా అమలులో ఉంచింది. ఆ తర్వాత సీబీఎస్ఈ సిలబస్ అమలు కావడంతో పుస్తకాలు మారాయి. బోధనాంశాల్లో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడంలో కుమారస్వామి దిట్ట అని తోటి ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. సేవా నిరతికి నిలువుటద్దం పెదగంట్యాడ: యారాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న గడ్డం మేరీ సుజాత తన విశేష సేవలకు గాను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. మచిలీపట్నంలో జన్మించిన ఆమె, 1997లో మాడుగులలో తన ఉపాధ్యాయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పలు పాఠశాలల్లో పనిచేసి, 2024లో యారాడ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చారు. కేవలం బోధనకే పరిమితం కాకుండా, పాఠశాల అభివృద్ధిని తన బాధ్యతగా స్వీకరించా రు. తన సొంత నిధులతో పాఠశాలకు అవసరమైన సామగ్రిని సమకూర్చారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, పాఠశాల ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా విద్యార్థులను సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ వారిలో బాధ్యతను పెంపొందిస్తున్నారు. ఆ మె నిస్వార్థ సేవకు ఈ పురస్కారం సరైన గుర్తింపు అని తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
పక్కా కమర్షియల్
వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంసాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ విశాఖ డివిజన్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. డివిజన్ పరిధిలోని వివిధ సర్కిళ్లలో జరుగుతున్న తనిఖీల్లో వసూలు చేయాల్సిన జరిమానాలో 90 శాతం వరకు ప్రభుత్వానికి చేరకుండా, సిబ్బంది జేబుల్లోకి వెళ్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. డివిజన్లో విశా ఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో 14 సర్కిళ్లు ఉన్నాయి. విశాఖ పరిధిలోని కురుపాం, గాజువాక, సిరిపురం, స్టీల్ప్లాంట్, భీమిలి, ఎయిర్పోర్టు, అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం, అల్లూరి జిల్లా లోని పాడేరు సర్కిళ్లలో వసూళ్ల పర్వం కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. డివిజన్ ప్రధాన కా ర్యాలయంలోని కొందరు ఉద్యోగుల సహకారంతో సర్కిళ్ల పరిధిలో దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. వసూళ్లకు ప్రత్యేక సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా తనిఖీల సమయంలో పట్టుబడిన సరకులకు సంబంధించి జరిమానా బదులు.. వ్యాపారులతో బేరసారాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇంటిలిజెన్స్ విభాగం, ప్రధాన కార్యాలయం, సంబంధిత సర్కిల్ సిబ్బంది కలిసి ఈ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ముడుపులు అందిన తర్వాత సరకులకు బిల్లులు ఉన్నట్లు ధ్రువీకరించి, నామమాత్రపు జరిమానాతో వ్యవహారాన్ని ముగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పట్టుబడిన భారీ విదేశీ సిగరెట్లు, వస్త్రాలు, బోట్ ఇంజిన్ల విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరించారని తెలుస్తోంది. నకిలీ ఇన్వాయిస్లతో మోసం బిల్లులు లేని సరకులతో పాటు నకిలీ ఇన్వాయిస్ల ద్వారా కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం నష్టం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు ఉద్యోగులు వ్యాపారులతో చేతులు కలిపి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని సమాచారం. నకిలీ కంపెనీలను సృష్టించి, తప్పుడు ఇన్వాయిస్లు తయారు చేయడం ద్వారా ‘ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్’ ను అక్రమంగా పొందడానికి ఉద్యోగులు సహకరిస్తున్నారని తెలుస్తోంది. ఏ సమయంలో ఇన్వాయిస్లు సమర్పిస్తే అనుమానం రాకుండా ఉంటుందో, వెరిఫికేషన్ జరగకుండా ఎలా చూసుకోవాలో వంటి విషయాల్లో వీరు వ్యాపారులకు సహాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యాబాగ్, సిరిపురం, ద్వారకానగర్, గాజువాక, అనకాపల్లి వంటి సర్కిళ్ల పరిధిలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్న ఈ సిబ్బంది, వ్యాపారులతో కలిసి అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని పంచుకుంటున్నారని సమాచారం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఈ అక్రమాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. విదేశీ సిగరెట్లు.. వివిధ రకాల సరకులు... ఇలా కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యంలో జరిగే దాడుల్లో పట్టుబడుతుంటాయి. కానీ అబ్రకదబ్రద అనగానే గుట్టుచప్పుడు కాకుండా అవన్నీ మాయమైపోతుంటాయి. విశాఖ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖలో ఇలా వింత దాడులు జరుగుతున్నాయి. భారీగా బిల్లులు లేని సరకులు పట్టుకున్నా.. ముడుపులు ముడితే చాలు.. అవన్నీ సక్రమమేనంటూ సర్టిఫైడ్ చేస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కోల్కతా నుంచి బిల్లులు లేకుండా రెడీమేడ్ దుస్తుల బేల్స్ విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకుంటాయి. దాదాపు రూ.5 లక్షల వరకు పన్ను ఎగ్గొట్టి వ్యాపారులు వాటిని తీసుకొస్తారు. విషయం తెలుసుకుని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వలపన్ని పట్టుకుంటారు. పక్కా ఆధారాలతో వాటిని సీజ్ చేస్తారు. కానీ.. తెల్లారితే అవన్నీ అక్రమం కాదు.. సక్రమమని నిర్ధారించేస్తారు. ఒడిశా నుంచి రూ.లక్షల విలువ చేసే ఫిష్ బోట్ ఇంజిన్లను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టుకుంటారు. పట్టుకునేటప్పుడు 50 వరకు ఇంజిన్లు ఉంటాయి. ఫైన్ వేసేటప్పుడు మాత్రం.. ఒక్కటే పట్టుకున్నట్లు చూపిస్తారు. -
వలంటీర్ విభాగాన్ని బలోపేతం చేయాలి
మహారాణిపేట : వైఎస్సార్ సీపీకి వలంటీర్ విభాగం వెన్నుముక వంటిదని, ఆ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సూచించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షుడు పీలా ప్రేమ్ కిరణ్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా వలంటీర్ విభాగం సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కె.కె.రాజుతోపాటు వలంటీర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జున యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 14 నెలలపాటు కాలయాపన చేసిందని విమర్శించారు. సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేసే వరకూ ప్రజల తరఫున పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా స్థానికంగా కూటమి ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ ప్రజల తరఫున పోరాడాలని సూచించారు. ఈ సమావేశంలో పులగం శ్రీనివాస రెడ్డి, పి.రాము, బి.శ్రీనివాస్, మొల్లి వెంకటరమణ, మామిడి శ్రీను, సునీల తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
కదంతొక్కిన ఉక్కు కార్మికులు
మహారాణిపేట: ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) పేరుతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం తగదని, వెంటనే ఈవోఐను రద్దు చేయాలని, స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ కార్మికులు భారీ నిరసన చేపట్టారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జరిగిన ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట బైఠాయింపులో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. తొలుత జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో భవానీశంకర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఎం. జగ్గునాయుడు మాట్లాడుతూ ఈవోఐని రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా తొలగించిన 5 వేల మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని కోరారు. జేఏసీ వైస్ చైర్మన్ ఎం.మన్మధరావు మాట్లాడుతూ కూర్మన్నపాలెం వద్ద నిరాహార దీక్ష శిబిరానికి అనుమతి ఇవ్వాలని, ప్లాంట్లో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగులకు, కార్మికులకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏఐసీటీయూసీ, ఏపీఎఫ్టీయూ తదితర సంఘాల ప్రతినిధులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, నాగభూషణం, దేవ, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, ఎస్.కె.రెహ్మాన్, వై.సత్యవతి, యు.ఎస్.ఎన్.రాజు, పి.అజయ్, యు.నాగరాజు, కె.అచ్యుతరావు, రైతు సంఘం నాయకులు జి.నాయన బాబు తదితరులు పాల్గొన్నారు. -
‘ఓపెన్ ఎయిర్’ స్పెషల్
ఆరిలోవ: సాధారణంగా జైలు అనగానే నాలుగు గోడల మధ్య ఉండే ఖైదీలు గుర్తుకు వస్తారు. కానీ విశాఖ కేంద్ర కారాగారంలో నిర్వహిస్తున్న ‘ఓపెన్ ఎయిర్ జైలు’మాత్రం ఖైదీలకు కొంత స్వేచ్ఛను కల్పిస్తోంది. ఈ ప్రత్యేకమైన జైలులో ప్రస్తుతం 30 మంది ఖైదీలు ఉన్నారు. సాధారణ జైలు ఖైదీలతో పోలిస్తే.. ఓపెన్ ఎయిర్ జైలులో ఉన్నవారికి ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. ముఖ్యంగా మంచి ప్రవర్తన ఉన్న ఖైదీలను జైలు అధికారులు ఈ విభాగం కింద ఎంపిక చేస్తారు. వారిని జైలులో వ్యవసాయం, పాడి పరిశ్రమ, సుధార్ కేంద్రాల్లో పనిచేయడానికి అవకాశం కల్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరు ఈ పనుల్లో నిమగ్నమై, తిరిగి సాయంత్రానికి జైలు లోపలికి చేరుకుంటారు. ఒక ఖైదీని ఓపెన్ ఎయిర్ జైలుకు ఎంపిక చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వారి ప్రవర్తన బాగుండడంతో పాటు, వారు పెరోల్కు, ఫర్లోకు ఇంటికి వెళ్లొచ్చి ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతో వారికి ఉన్న సంబంధాలు తెగిపోకుండా ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారిని, జైలు అధికారుల పూర్తి నమ్మకం చూరగొన్న వారిని మాత్రమే ఈ ప్రత్యేక జైలుకు ఎంపిక చేస్తారు. ఇలాంటి ఖైదీలు చాలా మంది శిక్ష కాలం పూర్తవక ముందే క్షమాభిక్ష పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ఓపెన్ ఎయిర్ జైలులో పనిచేస్తున్న ఖైదీలకు సెమీ–స్కిల్డ్ విభాగం కింద రోజుకు రూ.180 వేతనం ఇస్తారు. మన దేశంలో 17 రాష్ట్రాల్లో 91 కేంద్ర కారాగారాల్లో ఇలాంటి ఓపెన్ ఎయిర్ జైళ్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. 30 మంది ఖైదీలకు స్వేచ్ఛ -
సేవలో తరించి..సేవతోనే ముగించి
పెందుర్తి: మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవరూ ఊహించలేరు. కానీ కొంతమంది జీవితం మాత్రం ఇతరుల కోసం అంకితమై ఉంటుంది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన సయ్యపురెడ్డి రాజేష్ (రాజా) (42) అలాంటి కోవకు చెందినవారు. అగ్రి కల్చర్ మార్కెటింగ్ కమిటీలో ఉద్యోగం చేస్తూనే..‘అమ్మ హెల్పింగ్ హార్ట్స్’ స్వచ్ఛంధ సేవా సంస్థలో క్రియాశీలక సభ్యుడిగా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. అతని జీవిత ‘ప్రయాణం’ సేవతో మొదలై, సేవతోనే ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం, చోడవరం నుంచి విశాఖ నగరానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరిన రాజేష్ను విధి వెంబడించింది. పెందుర్తి మండలం రాంపురం వద్దకు రాగానే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి బస్సు ఆపారు. బస్సు కండక్టర్ మురళీకృష్ణ వెంటనే రాజేష్కు సీపీఆర్ చేయగా, డ్రైవర్ వాసు సమయస్ఫూర్తితో బస్సును పెందుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రి (సీహెచ్సీ)కి వేగంగా తరలించారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే రాజేష్ గుండెపోటుతో మృతి చెందాడు. మరణంలోనూ మానవత్వం.. నలుగురికి వెలుగులు రాజేష్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు.. ‘అమ్మ హెల్పింగ్ హార్ట్స్’ ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెందుర్తి ఆస్పత్రికి విషాదంతో తరలివచ్చారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుని కంటతడిపెట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పెందుర్తిలోని ‘సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. రాజేష్ నేత్రాలను దానం చేయమని ఆయన కుటుంబ సభ్యులను కోరారు. వారి కోరికను అర్థం చేసుకున్న రాజేష్ తల్లిదండ్రులు వరహాలబాబు, స్వర్ణకుమారి గొప్ప మనసుతో అంగీకరించారు. ‘మా కుమారుడు జీవించి ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు లేడు. అతని నేత్రాలు నలుగురికి ఉపయోగపడతాయంటే మాకు ఏ అభ్యంతరం లేదు’ అని వారు కన్నీళ్లతో తెలిపారు. వారి అంగీకారంతో, ‘మోషిన్ ఐ బ్యాంక్’ ప్రతినిధి అజయ్ బృందం రాజేష్ నేత్రాలను (కార్నియా) సేకరించారు. నిస్వార్థంగా సేవ చేస్తూ తన జీవితాన్ని అంకితం చేసిన రాజేష్, మరణానంతరం కూడా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపి చరిత్రలో నిలిచిపోయాడు. -
కాపర్ స్టేవ్స్ దొంగతనం కేసులో పురోగతి
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్లోని బ్లాస్ట్ఫర్నేస్ విభాగంలో జరిగిన స్టేవ్స్ దొంగతనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు తెలిసింది. సుమారు 1200 కిలోల బరువు గల ఆరు కాపర్ స్టేవ్స్ కనిపించకపోవడంపై గత నెల 28న ప్లాంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన క్రైం పోలీసులు నలుగురు అనుమానితులను విచారించినట్లు తెలిసింది. వారి నుంచి అందిన సమాచారం మేరకు, పోలీసులు మంగళవారం రెండు స్టేవ్స్ను సీఆర్ఎంపీ ఆర్ఈడీ స్టోర్స్ సమీపంలోని పొదల్లో గుర్తించారు. వాటిని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నాలుగు స్టేవ్స్ను ప్లాంట్ గేటు బయటకు తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని, ఒకటి రెండు రోజుల్లో కేసు మొత్తం కొలిక్కి వస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి. -
అదరగొట్టిన దబాంగ్ ఢిల్లీ
దుమ్మురేపిన పాంథర్స్ విశాఖ స్పోర్ట్స్ : ప్రో కబడ్డీ పన్నెండో సీజన్లో తమ తొలి మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ అదరగొట్టింది. పోర్ట్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో దబాంగ్ ఢిల్లీ 41–34 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్ ఆశు మాలిక్ 15 పాయింట్లతో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రైడర్ నీరజ్ 7 పాయింట్లతో అతనికి సహకరించాడు. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తొలి మ్యాచ్లో పాట్నా పైరేట్స్పై 39–36 తేడాతో విజయం సాధించింది. జైపూర్ తరఫున నవీన్ 13 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పాట్నా పైరేట్స్ తరఫున మనీందర్ 15 పాయింట్లతో రాణించినా, వారి జట్టు వరుసగా రెండో మ్యాచ్లో ఓడిపోయింది. -
సముద్ర అధ్యయన కేంద్రం భవన నిర్మాణంపై సంతృప్తి
కొమ్మాది: సాగరతీరంలో నిర్మిస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ భవనాన్ని మంగళవారం సాయంత్రం కేంద్ర పరిశీలనా బృందాలు సందర్శించాయి. బేపార్కు కొండ దిగువన, బీచ్ రోడ్డుకు ఆనుకుని దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చీఫ్ సైంటిస్ట్ ఇన్చార్జ్ డాక్టర్ వీవీఎస్ ఎస్. శర్మ తెలిపారు. ఎన్ఐవో డైరెక్టర్ సునీల్ కుమార్ సింగ్ , కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చీఫ్ ఇంజినీర్ అతుల్ కుమార్ గోయల్ భవన నిర్మాణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భవనానికి వెళ్లే రహదారి కొండ వాలులో ఉండటం వల్ల, రహదారి మలుపుల వద్ద బలమైన రక్షణ గోడ నిర్మించాలని వారు సూచించారు. ఈ పరిశోధనా కేంద్రంలో ఓషన్ ఫిజిక్స్, సముద్ర అధ్యయనం, పర్యావరణం, ఖనిజ అన్వేషణ, పారిశ్రామిక పరిశోధన వంటి కీలకమైన అధ్యయనాలు జరుగుతాయని పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న 38 ప్రయోగశాలల్లో విశాఖపట్నంలోని ఇది ఒకటి అని వారు తెలిపారు. -
జూకి కొత్త అతిథులు
స్వాంప్డీర్(బారసింగ)ఆరిలోవ : ఇందిరాగాంధీ జూ పార్కుకు కొత్త వన్యప్రాణులు చేరుకున్నాయి. వన్యప్రాణి మార్పిడి విధానంలో భాగంగా జూ అధికారులు కాన్పూర్లోని జూలాజికల్ పార్కు నుంచి వివిధ జాతులకు చెందిన 25 వన్యప్రాణులను మంగళవారం సాయంత్రం రోడ్డు మార్గంలో తీసుకువచ్చారు. వాటికి బదులుగా విశాఖ జూ పార్కు నుంచి పలు జాతులకు చెందిన 23 వన్యప్రాణులను కాన్పూర్ జూ పార్కుకు తరలించారు. కాన్పూర్ జూ నుంచి స్వాంప్డీర్లు–3(ఒక మగ, రెండు ఆడవి), స్ట్రైప్డ్ హైనా–1(ఆడది), కామన్ సాండ్ బోవ–2(అన్నౌన్), రెడ్ క్రౌన్డ్ రూప్ టార్టల్–4(అన్నౌన్), హగ్డీర్–3(ఒకటి మగ, రెండు ఆడవి), ఖలీజ్ ఫీసెంట్–6(మూడు జతలు), రోడ్డుషెల్ డక్–4(రెండు జతలు), రెడ్ సాండ్ బోవ–2(ఒక జత) వన్యప్రాణులను విశాఖ తీసుకువచ్చినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. వాటికి బదులుగా విశాఖ జూ పార్కు నుంచి మూడు అడవి కుక్కలు, ఒక స్ట్రైప్డ్ హైనా, ఒక ఇండియన్ గ్రే ఫూల్స్, మూడు జతలు పారాకీట్స్, రెండు జతల గ్రీన్ ఇగ్వానాలు, రెండు బార్కింగ్ డీర్లు పంపించినిట్లు తెలిపారు. జూకి తీసుకువచ్చిన వాటిని క్వారంటైన్లో ఉంచామన్నారు. కొద్ది రోజుల్లో వాటిని సందర్శకుల కోసం వాటి ఎన్క్లోజర్లలో విడిచిపెడతామని తెలిపారు. రెడ్సాండ్ బోవ, కామన్ పాండ్ బోవ -
7న ఉదయం 11.30 వరకే అప్పన్న దర్శనాలు
సింహాచలం: ఈ నెల 7న చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు ఉదయం 11.30 గంటల వరకు మాత్రమే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు లభిస్తాయని సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. తిరిగి 8న ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. 7న మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. 7, 8 తేదీల్లో స్వామికి జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు తెలిపారు. సుప్రభాత సేవ, ఆరాధన టిక్కెట్లు కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులంతా ఈ విషయాలను గమనించాలని కోరారు. -
కేజీహెచ్లో కోల్డ్వార్
మహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు పలు రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కేజీహెచ్లో పాలన గాడి తప్పుతోంది. ఆస్పత్రిలో కొత్తగా నియమితులైన అడ్మినిస్ట్రేటర్, వైద్యుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్తగా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్గా నియమించడంపై వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి పాలనా వ్యవహారాలు వైద్యులే చూడాలని వారు అభిప్రాయపడుతున్నారు. అడ్మినిస్ట్రేటర్ ప్రతి ఫైల్ను పరిశీలించడం, అన్ని నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల వైద్యులకు, అడ్మినిస్ట్రేటర్కు మధ్య ‘కోల్డ్ వార్’ నడుస్తోంది. ఇటీవల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆస్పత్రిని సందర్శించినప్పుడు అడ్మినిస్ట్రేటర్ తనదైన శైలిలో కార్యక్రమాన్ని నిర్వహించారని, కనీసం ఆస్పత్రిలోని డిప్యూటీ సూపరింటెండెంట్లు, హెచ్వోడీలు, ఇతర వైద్యులను ఆహ్వానించకుండా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన వీరి మధ్య ఆధిపత్య రగడ మొదలైందని తెలుస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాలికొదిలేసిన సమస్యలు సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆస్పత్రిలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆస్పత్రిలోని 217 ఏసీలలో 90 ఏసీలు మరమ్మతులకు గురయ్యాయి. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, వైద్యుల గదుల్లో ఏసీలు పని చేయకపోవడంతో రోగులతోపాటు సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షల నిలిపివేత కిడ్నీ, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులకు అవసరమైన ఆర్టీరియల్ బ్లడ్ గ్లాస్ పరీక్షలు నిలిచిపోయాయి. పరీక్షలకు అవసరమైన రీజెంట్స్ లిక్విడ్ లేకపోవడంతో 20 రోజులుగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ నుంచి సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. డ్రైనేజీ సమస్యక్రిటికల్ కేర్ యూనిట్ వెనుక భాగంలో మంగళవారం డ్రైనేజ్ సమస్య తలెత్తింది. వ్యర్థాలు, చెత్త బయటకు రావడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని వారు వాపోయారు. ఆస్పత్రిలో నెలకొన్న ఈ అంతర్గత విభేదాలు, పర్యవేక్షణ లోపం కారణంగా వైద్య సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సింహగిరిపై పవిత్రోత్సవాలకు అంకురార్పణ
సింహాచలం: సింహగిరిపై మంగళవారం నుంచి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి అంకురార్పణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుట్టబంగారుమండపంలో నిర్వహించాల్సిన ఈ పూజలను వర్షం కారణంగా ఆలయ కల్యాణమండపంలో నిర్వహించారు. పుట్టమనున్నను స్వామి వద్ద ఉంచి మృత్సంగ్రహణం జరిపారు. ఆ మన్నును శిరస్సుపై పెట్టుకుని స్థానాచార్యులు ఆలయ బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. యాగశాల ప్రవేశం, యాగశాలార్చన అనంతరం పుట్టమన్నును పాలికల్లో వేసి అంకురార్పణ నిర్వహించారు. దేవస్థానం ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు చక్రవర్తి తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజు బుధవారం ఉదయం పవిత్రాధివాసం, చక్రాబ్జమండల రచనం, ఆవాహనం, పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
పరిశ్రమలకు పూర్తి సహకారం
మహారాణిపేట: జిల్లాలోని పరిశ్రమల నిర్వహణకు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ అండ్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు.పారిశ్రామికవేత్తలు, వివిధ విభాగాల అధికారులతో కలెక్టర్ పలు అంశాలపై చర్చించారు. పారిశ్రామికవాడల్లో అవస్థాపనా సౌకర్యాలు కల్పించటంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఏపీఐఐసీ ద్వారా కేటాయించిన భూముల్లో నిర్ణీత సమయంలోనే పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇండియన్ ల్యాండ్ ఆర్మీ అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు, ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలలో ప్రత్యేక బస్ స్టాప్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అలాగే, సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ నెలలో జరిగిన స్క్రూటినీ అండ్ వెరిఫికేషన్ కమిటీ సమావేశంలో ఆరు పెట్టుబడుల క్లెయిమ్లకు గాను రూ.25,80,487 మంజూరు చేశారు. విశ్వకర్మ యోజన ద్వారా అర్హులైన వారికి లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఆదిశేషు, ఫ్యాక్టరీల చీఫ్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సింహాచలం, పీసీబీ ఈఈ ముకుందరావుతో పాటు వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. డీఐఈపీసీ సమావేశంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
సీఎం చంద్రబాబుకు స్వాగతం
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి విశాఖలో స్థానిక నేతలు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. మంగళవారం మధ్యాహ్నం 2.45 గంటలకు కోస్టల్ బ్యాటరీ వద్ద గల హెలిప్యాడ్కు చేరుకున్న ఆయనకు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ శ్రీబాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ శ్రీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జేసీ కె.మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.విశ్వనాథన్ తదితరులు స్వాగతం పలికారు. నోవోటల్లో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారీ టైమ్ అండ్ లాజిస్టిక్ సదస్సులో పాల్గొన్న ఆయన సాయంత్రం 4.45 గంటలకు తిరుగు పయనమయ్యారు. -
పేదల గుండెచప్పుడు వైఎస్సార్
సాక్షి, విశాఖపట్నం : అభివృద్ధి, సంక్షేమంతో పేదల తలరాత మార్చిన మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ కొనియాడారు. ఉమ్మడి విశాఖపై వైఎస్సార్ అందించిన అభివృద్ధి ముద్రలు ఎప్పటికీ చెరగనివని కొనియాడారు. జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో బీచ్రోడ్డులో గల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, 108, 104 అంబులెన్స్లు, జలయజ్ఞం వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేపట్టారన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. సమావేశంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవి రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ చంద్ర, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, రీజినల్ యువజన విభాగం అధ్యక్షుడు అంబటి శైలేష్, ముఖ్యనేతలు రొంగలి జగన్నాథం, వుడా రవి, నడింపల్లి కృష్ణంరాజు, డాక్టర్ జహీర్ అహ్మాద్, సతీష్వర్మ, పి.రవిరాజు, కార్పొరేటర్లు బానాల శ్రీనివాసరావు, అల్లు శంకరరావు, కె.అనిల్కుమార్ రాజు, స్వాతి దాస్, బర్కత్ అలీ, శశికళ, పద్మారెడ్డి, బిపిఎన్ కుమార్ జైన్, పార్టీ నాయకులు బోని శివరామకృష్ణ, అల్లంపల్లి రాజుబాబు, రామన్న పాత్రుడు,తాడి జగన్నాథ రెడ్డి, బోని బంగారునాయుడు, సనపల రవీంద్ర భరత్, సేనాపతి అప్పారావు, శ్రీదేవి వర్మ, రాధ, సకలభక్తుల ప్రసాద్, రామిరెడ్డి, దిలీప్ కుమార్, బోండా ఉమామహేశ్వరరావు, జిలకర్ర నాగేంద్ర, దేవరకొండ మార్కెండేయులు, నీలి రవి, మువ్వల సురేష్, పల్లా దుర్గ, మంచ మల్లేశ్వేరి, బొండా శ్రీను, తదితరలు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్ర
2004 నాటికి ఉమ్మడి విశాఖ జిల్లా పారిశ్రామికంగా సంక్షోభంలో ఉంది. స్టీల్ ప్లాంట్, బీహెచ్పీవీ, షిప్యార్డ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలతో మూసివేత దశకు చేరుకున్నాయి. వైఎస్సార్ ఈ సంస్థల పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించి, రెండో దశ విస్తరించాలని నిర్ణయించారు. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ (బీహెచ్పీవీ)ని బీహెచ్ఈఎల్లో విలీనం చేసి, దానికి కొత్త జీవం పోశారు. మూతపడే స్థితిలో ఉన్న హిందూస్థాన్ షిప్యార్డ్ను రక్షణ శాఖలో విలీనం చేసి పునరుద్ధరించారు. అలాగే అచ్యుతాపురం సెజ్, పరవాడ ఫార్మాసిటీ, గంగవరం పోర్టు వంటి కీలక ప్రాజెక్టుల భూసేకరణ సమస్యలను పరిష్కరించి, పారిశ్రామిక ప్రగతికి మార్గం సుగమం చేశారు. -
గిరిజనుల ఆశాజ్యోతి
దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు అండగా నిలిచారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా వేలాది గిరిజన కుటుంబాలకు వారు సాగు చేసుకుంటున్న భూములపై హక్కు పత్రాలు అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఏజెన్సీలో కాఫీ సాగును ప్రోత్సహించడానికి రూ.144 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా వేలాది మంది గిరిజనులకు స్థిరమైన ఉపాధి లభించింది. ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా విశాఖ ప్రజల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు వైఎస్సార్. -
పోర్టును సందర్శించిన నేపాల్ కాన్సుల్ జనరల్
విశాఖ సిటీ: కోల్కత్తాలోని నేపాల్ కాన్సుల్ జనరల్ ఝక్కా ప్రసాద్ ఆచార్య, ఉప కాన్సుల్ జనరల్ జనక్ రాజ్ భట్టా సోమవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీని సందర్శించారు. పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్ దుర్గేష్ కుమార్ దూబే వీరికి స్వాగతం పలికారు. పోర్ట్లోని మౌలిక వసతులు, కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం, ఆధునికీకరణ, యాంత్రీకరణ చర్యలు, కవర్డ్ స్టోరేజ్ సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పారిశ్రామిక అవసరాల కోసం ఎస్టీపీ ద్వారా నీటి పునర్వినియోగం వంటి అంశాలను అధికారులు వివరించారు. అదేవిధంగా పెట్టుబడి అవకాశాలు, దిగుమతి–ఎగుమతుల విస్తరణకు సంబంధించిన మార్గాలపై చర్చించారు. -
వైఎస్సార్ సేవలను స్మరించుకుందాం
సాక్షి, విశాఖపట్నం: మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంతో పాటు నియోజకవర్గ, వార్డులోని పార్టీ కార్యాలయాల్లో ఆయనకు ఘన నివాళులర్పించాలన్నారు. అలాగే వైఎస్సార్ విగ్రహాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రక్తదానం, అన్నసమారాధన, పండ్లు, రొట్టెల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి, విశాఖ నగరానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుందామన్నారు. -
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జేసీ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఇతర అధికారులతో కలిసి సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నోవాటెల్లో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయిన బుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతారన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ముందుగా చెక్ చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లు చేయాలన్నారు. -
‘గ్రేటర్’హోదా ఆయన చలువే..
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ‘గ్రేటర్’హోదా కలను వైఎస్సార్ సాకారం చేశారు. 2005 నవంబర్ 22న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ను ‘మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)’గా ఉన్నతీకరించారు. దీంతో నగరం 111 చదరపు కిలోమీటర్ల నుంచి 540 చ.కి.మీలకు విస్తరించి, అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకుంది. 2013లో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలని విలీనం చేయగా 681.96 చ.కిమీ. విస్తరించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మరో 10 పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేసి.. 98 వార్డులుగా విస్తరించారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్నిర్మాణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) కింద దేశవ్యాప్తంగా ఎంపికై న 63 నగరాల్లో విశాఖను చేర్చిన ఘనత వైఎస్సార్దే. ఆయన చొరవతో ఈ పథకం ద్వారా నగరానికి సుమారు రూ.1,885 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో సింహాచలం–పెందుర్తి బీఆర్టీఎస్ కారిడార్లు, ఆశీల్మెట్ట ఫ్లైఓవర్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ (యూజీడీ) వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. -
పేద రోగులకు అండ
అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులను విశాఖ ప్రజలకు పరిచయం చేయాలని వైఎస్సార్ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా రూ.100 కోట్లు వెచ్చించి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చారు. దీంతో ఒక్క సారిగా విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ సర్వీసులు పెరిగాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో.. హైదరాబాద్ నిమ్స్ తరహాలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) నిర్మాణానికి 2006లో శ్రీకారం చుట్టగా.. నేడు విశేష సేవలందిస్తోంది. గోదావరి జలాలను విశాఖకు తీసుకొచ్చి.. నగర తాగునీటి సమస్యతో పాటు స్టీల్ ప్లాంట్ పారిశ్రామిక అవసరాలను తీర్చారు. రాజీవ్ గృహకల్ప, జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే పథకాల ద్వారా నగర పరిధిలో లక్షకు పైగా ఇళ్లను నిర్మించి.. ఎందరో పేదల సొంతింటి కలను నెరవేర్చారు. -
రైల్వేస్టేషన్లో 2.2 కిలోల బంగారం స్వాధీనం
తాటిచెట్లపాలెం : వాల్తేర్ డివిజన్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ స్క్వాడ్(సీపీడీఎస్) బృందం సభ్యులు అనధికారికంగా బంగారం రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 11.30 సమయంలో సీపీడీఎస్, వాల్తేర్ సభ్యులు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్, సిబ్బందితో కలిసి రైల్వేస్టేషన్లో తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు గేట్ నెంబర్ 4 వద్ద బ్యాక్ప్యాక్ బ్యాగ్తో సంచరించడం గమనించి తనిఖీ చేశారు. అందులో మరుధర్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్(లాజిస్టిక్ సర్వీస్) పేరిట రెండు కార్టన్ బాక్స్లు ఉన్నాయి. వారిని విచారించగా మధ్యప్రదేశ్కు చెందిన హరేంద్రసింగ్, రాజస్థాన్కు చెందిన హరి గోవింద్లని తెలిపారు. వారు ఈ కొరియర్ను బ్రహ్మపూర్ నుంచి విశాఖ తీసుకువచ్చినట్లు చెప్పారు. అనుమానించిన ఆర్పీఎఫ్ సిబ్బంది స్టేట్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ మంజుల, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ బారుణ్కుమార్ బెహరాలకు సమాచారం అందించారు. వారి సమక్షంలో బాక్స్లను తెరిచి చూడగా 2.20 కిలోల బంగారం స్వాధీనం ఉంది. దీని విలువ రూ.2.20 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే కొన్ని ఈ ట్యాక్స్ ఇన్వాయిస్లు ఉన్నాయని, ఇందులో కొన్ని వాస్తవమైనవి కాగా మరికొన్ని నకిలీ పత్రాలని గుర్తించారు. జీఎస్టీ నిబంధనలను అతిక్రమించడంతో రూ.7 లక్షలు జరిమానా విఽధించారు. -
ఓపెన్లో రిజర్వేషన్లతో అన్యాయం
ఆరిలోవ : డీఎస్సీ–2025లో మెరిట్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కాల్ లెటర్లు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివి మంచి ర్యాంక్ సాధించినా ఉద్యోగానికి దూరమవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 ప్రకారం వర్టికల్ విధానం అమలుకాలేదని గగ్గోలుపెడుతున్నారు. అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ నుంచి రిజర్వేషన్లోకి దించి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. డీఎస్సీ రిజర్వేషన్ల కోటాలో కూటమి ప్రభుత్వం కోత విధించింది. దీంతో బాధిత అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో మంచి ర్యాంకులు సాధించినప్పటికీ మెరిట్ జాబితా ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్ లెటర్లు రాని సుమారు 20 మంది అభ్యర్థులు విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్కు చేరుకున్నారు. వారంతా అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు. వారికి కాల్ లెటర్లు రాకపోవడంతో వారి వారి ర్యాంకులు, మార్కుల జాబితాతో కూడిన వినతి పత్రాలను జాయింట్ కలెక్టర్కు అందించారు. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, జనరల్ కేటగిరీలో ర్యాంకులు సాధించిన వారిని రిజర్వేషన్ కేటగిరీలోకి మార్చడం రాజ్యాంగ విరుద్ధమంటూ నినాదాలు చేశారు. జిల్లాలో ఎస్జీటీ ఓపెన్లో 115 పోస్టులు ఉండగా మెరిట్లో ఎంపికై న 58 మందిలో 20 మందికిపైగా ఎస్సీ, ఎస్టీలు మంచి ర్యాంకులు సాధించారని.. వారిని ఓపెన్ కేటగిరీ జాబితాలో కాకుండా రిజర్వేషన్ కేటగిరీకి మార్చేశారని.. దీంతో రోస్టర్ ప్రకారం అర్హత కలిగిన 20 మంది రిజర్వడ్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించి కాల్ లెటర్లు పంపలేదని వాపోయారు. ఎస్సీ ‘బీ’లో 360 ర్యాంక్ సాధించినా కాల్ లెటర్ పంపలేదు.. నేను ఎస్సీ ‘బి’ కేటగిరికి చెందిన అభ్యర్థిని. నేను 360వ ర్యాంక్ సాధించారు. 77 జీవో ప్రకారం వర్టికల్ విధానం పాటించకపోవడంతో నాకు అన్యాయం జరిగింది. ఓపెన్లో 39వ ర్యాంకర్ను ఎస్సీ‘బీ’ కేటగిరిలోకి మార్చేశారు. దీంతో నా స్థానం కోల్పోయాను. ఉద్యోగానికి దూరం కావాల్సి వచ్చింది. –శేఖర్బాబు, విశాఖ, 195 ర్యాంక్ వచ్చినా.. డీఎస్సీలో 195 ర్యాంక్ సాధించాను. నాది బీసీ ‘ఏ’ కేటగిరి. మా కేటగిరిలో 10 పోస్టులున్నాయి. బీసీ‘ఏ’లో నేను 7వ స్థానంలో ఉన్నాను. ఓపెన్లో ఉన్న అభ్యర్థులను బీసీ ‘ఏ’ కేటగిరిలోకి మార్చడంతో నాకు కాల్ లెటర్ రాలేదు. నా తర్వాత స్థానంలో ఉన్న ముగ్గురు అమ్మాయిలకు మాత్రం కాల్ లెటర్లు వచ్చాయి. –నరవ రాజేష్, కోరాడ సంతపాలెం, కె.కోటపాడు మండలంరాజ్యాంగ విరుద్ధంగా డీఎస్సీ నియామకాలు డీఎస్సీ–2025 నియామకాల్లో రిజర్వేషన్ల విధానం గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా డీఎస్సీ నియామకాలు జరుపుతోంది. మెరిట్లో నిలిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ప్రభుత్వం ఆవేదనకు గురిచేస్తుంది. ఆయా కేటగిరీల అభ్యర్థులు మెరిట్ సాధించనప్పటికీ రిజర్వేషన్ కోటాలోకి మార్చడం జీవో 77కి విరుద్ధం. రోస్టర్లో వర్టికల్ విధానంలో రిజర్వేషన్ అమలు చేయాలి. – డాక్టర్ బూసి వెంకటరావు విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్,బీసీ ‘ఏ’లో 141వ ర్యాంక్ సాధించినా కాల్ లెటర్ రాలేదు.. నేను బీసీ‘ఏ’ కేటగిరీకి చెందిన అభ్యర్థిని. ఈ డీఎస్సీలో 141వ ర్యాంక్ సాధించాను. ఓపెన్లో 23వ ర్యాంకర్ అయిన బీసీ‘ఏ’ అభ్యర్థిని బీసీ‘ఏ’ రిజర్వేషన్ కేటగిరీలో పెట్టారు. దీంతో నా స్థానం వెనుకకు నెట్టేసి కాల్ లెటర్ పంపించలేదు. ఈ విధానం వల్ల నాకు అన్యాయం జరిగింది. – శీలా అభియాంగో, విశాఖఓపెన్లో 24వ ర్యాంకర్ను ఎస్సీ కేటగిరీలోకి మార్చేశారు.. ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్లో 7 పోస్టులు చూపించారు. నేను ఓపెన్లో 149వ ర్యాంక్ సాధించి ఎస్సీ కేటగిరీలో 7వ స్థానంలో ఉన్నాను. కానీ 24 ర్యాంక్ సాధించిన ఓపెన్లో ఉన్న వ్యక్తిని ఎస్సీ కేటగిరీలో మార్చారు. దీంతో నా స్థానంలో కిందకి వెళ్లిపోయి ఏడో స్థానం దాటిపోయింది. దానివల్ల నాకు కాల్ లెటర్ రాలేదు. ఓపెన్లో ఉన్న ఎస్సీ అభ్యర్థిని రిజర్వేషన్ కేటగిరీలో పెట్టేయడంతో ఏడో స్థానంలో ఉన్న నాకు అన్యాయం జరిగింది. నాకు న్యాయం చేయాలి. – అనిల్కుమార్, అవనాం, భీమిలి -
క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యం
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కేజీహెచ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో సుమారు రూ.42 కోట్లతో సమకూర్చిన అధునాతన వైద్య పరికరాలను, స్క్రీనింగ్ యంత్రాలను ఆయన సోమవారం ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ నిధులు మంజూరైన విషయం విదితమే. పరికరాల్లో లీనియర్ యాక్సిలరేటర్ (రూ.25 కోట్లు), సిటీ సిమ్యులేటర్ (రూ.9.5 కోట్లు), బ్రాకీథెరపీ (రూ.7.5 కోట్లు) ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల, క్యాన్సర్ రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇక నుంచి కేజీహెచ్లో ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కేజీహెచ్తోపాటు కర్నూలులో కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, దీనికి గాను కేంద్రం ఇప్పటికే నిధులు కూడా కేటాయించిందని వివరించారు. క్యాన్సర్ లక్షణాలున్న వారిని గుర్చేందుకు త్వరలో ప్రత్యేక సర్వే చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, పి.విష్ణుకుమార్ రాజు, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, స్థానిక కార్పొరేటర్ అప్పలరత్నం, డీఎంఈ డాక్టర్ రఘునందన్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ శ్రీహరి, ఆంకాలజీ విభాగం వైద్యాధికారులు పాల్గొన్నారు. క్యాన్సర్ వల్ల ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయాను క్యాన్సర్ మహమ్మారి వల్ల తమ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులను కోల్పోయానని వైద్య కళాశాల సెంటినరీ భవనంలో వైద్య విద్యార్థులు, వైద్యులతో జరిగిన మీట్–గ్రీట్లో మంత్రి సత్యకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. అమ్మ, సోదరుడు, అక్క వేర్వేరు సమయాల్లో ప్రాణాలు విడిచారని వివరించారు. ఈ ఘటనలు తనను ఎంతగానో కలచివేశాయన్నారు. -
92 శాతం పింఛన్ల పంపిణీ
మహారాణిపేట: జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. రాత్రి 7 గంటల సమయానికి సుమారు 92 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీపతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,60,445 పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.70 కోట్ల నిధులు విడుదల చేసింది. వీటిలో సోమవారం రాత్రి 7 గంటల సమయానికి 1,48,089 మంది లబ్ధిదారులకు రూ. 58.85 కోట్లు పంపిణీ చేశారు. ఈ నెల కూడా పలు ప్రాంతాల్లో ఇంటి వద్ద కాకుండా.. సచివాలయాల వద్ద పంపిణీ చేపట్టారు. జీవీఎంసీ పరిధిలో 26,638 మందికి గాను 24,842 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 1,33,807 మందికి గాను 1,23,247 మందికి పింఛన్లు అందాయి. మిగిలిన పింఛన్లను మంగళవారం సచివాలయాల వద్ద పంపిణీ చేస్తామని పీడీ లక్ష్మీపతి తెలిపారు. -
వృద్ధురాలికి ఆగిన పింఛన్
‘బతికి ఉండగానే చంపేశారు’ అని కుమార్తెల ఆవేదన ఈమె పేరు మళ్ల అప్పలనరసమ్మ. జీవించి ఉన్న ఈమెను ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్లు నమోదు చేయడం వల్ల నెలవారీ పెన్షన్ ఆగిపోయింది. ఈ ఘటనపై ఆమె కుమార్తెలు బి.లీల, ఎ.వరలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్ఞానాపురం సబాస్టియన్ కాలనీలో నివసించే మళ్ల అప్పలనరసమ్మ గతంలో నెలవారీ పెన్షన్ పొందేవారు. అయితే గత కొన్ని నెలలుగా ఆమెకు పెన్షన్ నిలిచిపోయింది. దీనిపై సచివాలయాన్ని సంప్రదించగా, ఆమె పేరుపై కారు ఉన్నట్లు రికార్డులు చూపిస్తోందని, అందువల్ల పెన్షన్ నిలిచిపోయిందని సిబ్బంది వివరించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆమె కుమార్తెలు గత కొన్ని నెలలుగా కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా.. ఆధార్ కార్డుకు అటాచ్ అయిన కారు వివరాలను తొలగించినప్పటికీ, ఇప్పుడు ఆమె చనిపోయినట్లుగా రికార్డుల్లో చూపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ‘పింఛను అడిగితే చంపేస్తారా?’అని ప్రశ్నిస్తున్నారు. తమ తల్లిని చూసుకునే దిక్కు లేదని, పింఛను వస్తే ఆమె బతకగలదని వాపోయారు. దయచేసి తమ తల్లికి పెన్షన్ తిరిగి ఇప్పించాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. -
5న డీఎస్ఎన్ఎల్యూ సమష్టి స్నాతకోత్సవం
సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ(డీఎస్ఎన్ఎల్యూ) సమష్టి స్నాతకోత్సవాన్ని ఈ నెల 5న విఽశాఖలో నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య డాక్టర్ సూర్యప్రకాశరావు తెలిపారు. తెలియజేసారు. వర్సిటీ సమావేశమందిరంలో సోమవారం మీడియాకు వివరాలు తెలిపారు. విశాఖలోని నోవోటెల్లో ఆ రోజు ఉదయం 11 గంటలకు విశ్వవిద్యాలయ 8, 9, 10, 11, 12వ స్నాతకోత్సవాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగిస్తారని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి, వర్సిటీ విజిటర్ జస్టిస్ పి.శ్రీనరసింహ, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, వర్సిటీ పూర్వ వీసీ జస్టిస్ జేకే మహేశ్వరి ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. వర్సిటీ ప్రస్తుత చాన్సలర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగే ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖామంత్రి నారా లోకేష్ గౌరవ అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. అదే రోజు సబ్బవరంలోని వర్సిటీ క్యాంపస్లో అకడమిక్ బ్లాక్–2లో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇతర కొత్త భవనాల ప్రారంభోత్సవం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ, దామోదరం సంజీవయ్య విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందన్నారు. -
టౌన్ప్లానింగ్ విభాగానికి అత్యధిక ఫిర్యాదులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 44 ఫిర్యాదులు అందాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ వినతులు స్వీకరించారు. మొత్తం 106 ఫిర్యాదులు అందగా, వాటిలో పట్టణ ప్రణాళికా విభాగానికి 44 ఫిర్యాదులు వచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 11, రెవెన్యూ సెక్షన్కు 11, ప్రజారోగ్య విభాగానికి 2, ఇంజనీరింగ్ సెక్షన్కు 34, మొక్కల విభాగానికి ఒకటి, యూసీడీ విభాగానికి 3 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో ప్రధాన ఇంజనీర్ పీవీవీ సత్యనారాయణరాజు, అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, ఫైనాన్స్ అండ్ అడ్వైజర్ మల్లికాంబ, సీసీపీ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
లులూకి భూ కేటాయింపు రద్దు చేయాలి
డాబాగార్డెన్స్ : విశాఖ సాగర తీరంలో లులూకి 13.74 ఎకరాల అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని విశాఖపట్నం ప్రజా వనరుల పరిరక్షణ వేదిక తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు సోమ వారం నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. వేదిక చైర్మన్ రాణిశర్మ మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తులకు రాష్ట్రంలో అత్యంత ఖరీదైన భూములు పందేరాన్ని తప్పుబట్టారు. తక్షణమే లులూకి భూమిని కేటాయిస్తూ ఇచ్చిన జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, సీపీఐ నాయకుడు చలసాని రాఘవేంద్రరావు మాట్లాడుతూ కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత నగరంలోని ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతోందని పేర్కొన్నారు. సీఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి సాగర తీరంలోని 13.74 ఎకరాల భూమిని లులూకు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. కార్పొరేటర్ ఏజే స్టాలిన్, వేదిక కన్వీనర్ సీఎన్ క్షేత్రపాల్, ఆర్కేఎస్వీ కుమార్, వెంకటలక్ష్మితో పాటు పౌర, ప్రజా సంఘాలు, కార్మిక, మహిళ, యువజన, విద్యార్థి, దళిత, సంఘాలతో పాటు వార్వా, నివాస్ సంఘాల ప్రతినిధులు లులూ మార్ట్కు ఇచ్చిన అన్ని రకాల అనుమతులు రద్దు చేయాలని ఏకగ్రీవ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ భూమిలో సైన్స్ మ్యూజియం నిర్మించి భావితరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎన్ మాధవి, వనజాక్ష్మి, మన్మధరావు, మణి, అష్రాఫ్, రాంబాబు, నాగభూషణం, అప్పారావు, బీబీ గణేష్ పాల్గొన్నారు. -
యోథాస్, పునేరి జట్ల ఘన విజయం
విశాఖ స్పోర్ట్స్: నగరంలోని పోర్టు స్టేడియంలో ప్రో కబడ్డీ 12వ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్ల్లో యూపీ యోథాస్, పునేరి పల్టన్ జట్లు అద్భుత విజయాలు సాధించాయి. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్లో యూపీ యోథాస్ 34–31 పాయింట్ల తేడాతో పాట్నా పైరేట్స్పై విజయం సాధించింది. చివరి నిమిషాల్లో అద్భుతంగా పుంజుకున్న యోథాస్.. పాట్నాను ఓడించి వరుసగా రెండో గెలుపును నమోదు చేసింది. ఏకపక్షంగా సాగిన మరో మ్యాచ్లో పునేరి పల్టన్ 41–19 పాయింట్ల భారీ తేడాతో గుజరాత్ జెయింట్స్పై విజయకేతనం ఎగురవేసింది. ఈ ఓటమితో గుజరాత్ జెయింట్స్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. విశాఖలో జరుగుతున్న ఈ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు స్థానిక యువ క్రీడాకారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మంగళవారం రాత్రి 8 గంటలకు దబాంగ్ ఢిల్లీ, బెంగళూర్ బుల్స్, రాత్రి 9 గంటలకు జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్ జట్లు తలపడనున్నాయి. -
రాజకీయ కారణాలతో రేషన్ కార్డుల కుదింపు
డిపో డీలర్ ఆవేదన గత 12 ఏళ్లు రేషన్ డిపో మీద ఆధారపడి జీవిస్తున్నానని, రాజకీయాల కారణంగా తన డిపోలో కార్డుల సంఖ్యను ఆకస్మికంగా తగ్గించారని ఏవీఎన్ కాలేజీ డౌన్ 265 నంబర్ డిపో డీలర్ బుద్ధవరపు లలిత నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 932 మంది కార్డుదారులు ఉండేవారని, ఇప్పుడు 634 కార్డులకు కుదించారని ఆయన వాపోయారు. అంతేకాకుండా, అనేక వివాదాల్లో ఉండే వ్యక్తుల కార్డులను తన డిపోలో చేర్చడం వల్ల ఇబ్బందులు పడుతున్నానని తెలిపారు. ఈ విషయంపై అధికారులకు చాలాసార్లు వినతులు సమర్పించినప్పటికీ, ఎటువంటి స్పందన లేదని, అందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు గతంలో ఉన్న అన్ని కార్డులను తిరిగి కేటాయించాలని ఆయన కోరారు. -
పుట్టిన రోజునే మృత్యు ఒడికి..
పెందుర్తి: కాయ కష్టం చేసుకుని బతుకుతున్న కుటుంబం. కొడుకు చేతికి అందొస్తున్నాడు. చదువు పూర్తి చేసుకుని కష్టాలు గట్టెక్కిస్తాడని ఆశపడుతున్న సమయంలో విధి ఆ కుటుంబాన్ని చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదం రూపంలో కొడుకును మృత్యువు కాటేసింది. పుట్టినరోజు నాడే అందని లోకాలకు తీసుకుపోయింది. అయితే అంతటి విషాదంలోనూ వారిలో మానవత్వం పరిమళించింది. మరణించిన తమ కుమారుడి నేత్రాలను దానం చేసి మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. పెందుర్తిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చినముషిడివాడకు చెందిన కేశబోయిన సుబ్రహ్మణ్యం(21) చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతి చెందాడు. స్థానిక పెద్ద చెరువు వద్ద బైక్ ఆటో ఢీకొన్న ఘటనలో సుబ్రహ్మణ్యంతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. తీరని విషాదం చినముషిడివాడకు చెందిన కేసుబోయిన శ్రీనివాసరావు, రాములమ్మ దంపతులకి సుబ్రహ్మణ్యం(21), పుణ్యకేశ్వరి సంతానం. శ్రీనివాసరావు కూలి పనులకు వెళుతుంటాడు. రాములమ్మ స్థానికంగా టిఫిన్ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సుబ్రహ్మణ్యం సబ్బవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సుబ్రహ్మణ్యం పుట్టినరోజు కావడంతో రాత్రి స్నేహితుడితో కలిసి కొత్తవలస వైపు బైక్పై వెళుతున్నాడు. ఈ క్రమంలో పెందుర్తి పెద్ద చెరువు వద్ద ఆటోను ఢీకొని తీవ్రగాయాలపాలై సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంతో పాటు చినముషిడివాడ ప్రాంతంలో తీవ్ర విషాదం అలముకుంది. నలుగురి జీవితాల్లో వెలుగులు మృతి చెందిన సుబ్రహ్మణ్యం నేత్రాలను దానం చేయాల్సిందిగా తల్లిదండ్రులు శ్రీనివాసరావు, రాములమ్మను పెందుర్తి సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ప్రతినిధి దాడి శ్రీనివాస్ కోరగా వారు వెంటనే అంగీకారం తెలిపారు. ‘చేతికందిన కొడుకే మాకు లేకుండా పోయాడు. అలాంటిది వాడి కళ్ళు నలుగురి వెలుగునిస్తాయంటే మాకు అభ్యంతరం ఏముంటుంది’అంటూ అంగీకరించారు. అయితే కేజీహెచ్ మార్చురీ వద్ద సుబ్రహ్మణ్యం మృతదేహం ఉండడం.. తల్లిదండ్రులు చినముషిడివాడలో ఉండడంతో న్యాయబద్ధంగా నేత్రాలను సేకరించే అవకాశం లేకపోయింది. ఆలస్యం అయితే నేత్రాలు సేకరించినా ఉపయోగం లేని పరిస్థితి. ఈ క్రమంలో చొరవ తీసుకున్న పెందుర్తి సీఐ కేవీ సతీష్కుమార్ వెంటనే తండ్రి శ్రీనివాసరావును కేజీహెచ్కు తీసుకువెళ్లాలని ఏఎస్ఐ కాళీ ప్రసాద్కు చెప్పడంతో హుటాహుటిన అక్కడకు వెళ్లి అంగీకార పత్రంపై సంతకం చేశారు. దీంతో మొహిషిన్ ఐబ్యాంక్ ప్రతినిధులు నేత్రాలు సేకరించారు. -
విదేశీయుడికి పాస్పోర్ట్ అప్పగింత
విశాఖ సిటీ: నగరంలో విదేశీయుడు పోగొట్టుకున్న పాస్పోర్టును గుర్తించి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి చేతుల మీదుగా సోమవారం అందజేశారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన నేవీ అధికారి పోజెఫ్ జాన్సన్ వాన్ రెన్సబర్గ్ విధులరీత్యా విశాఖలో ఐఎన్ఎస్ శాతవాహనకు వచ్చారు. ఈ క్రమంలో పాస్పోర్టును పోగొట్టుకున్నారు. దీంతో సదరు నేవీ అధికారి నేరుగా పోలీస్ కమిషనరేట్కు వచ్చి విషయాన్ని చెప్పారు. వెంటనే సీపీ స్పందించి పాస్పోర్టు గుర్తించాలని స్పెషల్ బ్రాంచ్ పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు గాజువాక ప్రాంతంలో పోస్పోర్టును గుర్తించారు. సీపీ చేతుల మీదుగా నేవీ అధికారికి అందజేశారు. కాగా.. పోలీస్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు మొత్తం 110 ఫిర్యాదులు వచ్చాయి. -
సెగలు కక్కుతున్న కాలుష్యం
కొమ్మాది: మారికవలస, కొమ్మాదిలో గల కొన్ని సీ ఫుడ్స్ కంపెనీలు కలుషిత నీరును నేరుగా వదిలివేయడంతో మారికవలస–కాపులుప్పాడ గెడ్డలోకి కలిసిపోతుంది. దీంతో నీరు కలుషితమవ్వడమే కాకుండా దుర్వాసన వెదజల్లుతుంది. సోమవారం ఉదయం ఈ గెడ్డ వద్ద భారీ ఎత్తులో కలుషిత నీరు నురుగులు కక్కుతున్న దృశ్యమే దీనికి సాక్ష్యం. ఈ కలుషిత నీరు సమీపంలో పంట పొలాలతో పాటు నగరపాలెం నుంచి ప్రవహించే గెడ్డలో కలిసిపోవడంతో తీర ప్రాంతం కూడా కలుషితమవుతుందని ఇక్కడ వారు వాపోతున్నారు. ఈ రసాయనిక కలుషిత నీటి వల్ల చుట్టు పక్కన పంట పొలాలు నాశనమవుతున్నాయని.. దుర్వాసన వెదజల్లుతుందని.. చర్మవ్యాధులు ప్రభలుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మృత్యువాత పడుతున్న జీవరాశులు కలుషిత నీరు నేరుగా గెడ్డ నుంచి సముద్రంలోకి కలవడంతో ఇక్కడ నీరు అంతా కలుషితం అవుతుంది. దీంతో సముద్రంలో చేపలు, తాబేళ్లు వంటివి మృత్యువాత పడి తీరానికి కొట్టుకొస్తున్నాయి. ఈ కలుషిత నీటి ప్రభావం ఉప్పాడ నుంచి తిమ్మాపురం బీచ్ వరకు ఉంటుంది. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇక్కడ మత్స్యకారులు కోరుతున్నారు. -
ఆటో, బైక్ ఢీ.. నలుగురికి గాయాలు
పెందుర్తి: పెందుర్తిలోని పెద్ద చెరువు సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలివి.. సరిపల్లికి చెందిన కండిపల్లి కన్నయ్య తన ఆటోలో భార్య దేవి, కుమార్తె భారతి, కోడలు నాగమణితో కలిసి అక్కిరెడ్డిపాలెం వెళుతున్నారు. వీరు పెందుర్తి పెద్ద చెరువు వద్దకు చేరేసరికి.. అదే సమయంలో చినముషిడివాడ నుంచి బైక్పై ఇద్దరు యువకులు వస్తున్నారు. ఒక్కసారిగా బైక్,ఆటో ఢీకొన్నాయి. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు, ఆటోలో ఉన్న కన్నయ్యతో పాటు అతని భార్య దేవి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో బైక్పై వచ్చిన ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పెందుర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇద్దరి పరిస్థితి విషమం -
వైద్యశాఖలో పోస్టుల భర్తీ ఎప్పుడు?
మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖలోనూ, కేజీహెచ్, ఆంధ్ర వైద్య కళాశాల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోంది. జనవరిలో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం నర్సుల భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తక్షణం పోస్టులు భర్తీ చేసి తమను ఆదుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ను (సోమవారం మంత్రి విశాఖ వస్తున్నారు) కోరుతున్నారు. అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మాట తప్పారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇది పారదర్శక పాలన కాదని వారు నిలదీస్తున్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతను ఆకట్టుకున్న కూటమి నేతలు, అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా పోస్టుల భర్తీపై ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి నెలల తరబడి పెండింగ్లో పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీలు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఖాళీగా ఉన్న 106 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వివిధ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అదనంగా మరో 264 నర్సుల పోస్టులు చేరాయి. వీటితో కలిపి మొత్తం 370 పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం చర్యలు చేపట్టింది. ఆన్లైన్, ఆఫ్లైన్లలో మొత్తం 8,300 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు, కేజీహెచ్, రాణీ చంద్రమతి దేవి ఆస్పత్రి, శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు ప్రభుత్వ ఆస్పత్రులు, క్యాన్సర్ వార్డులకు అదనంగా నర్సులు మంజూరు కావడంతో పాటు, పదవీ విరమణ వల్ల ఏర్పడిన ఖాళీలతో కలిపి ఈ 370 పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఆదేశాలతో 246 పోస్టుల భర్తీని నిలిపివేశారు. టీచింగ్ ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి ఆంధ్ర మెడికల్ కాలేజీ, కేజీహెచ్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్స్లో మొత్తం 22 కేటగిరీల్లో 71 పోస్టుల భర్తీకి అవుట్సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానించారు. వీటికి భారీగా దరఖాస్తులు వచ్చినా, ఇంతవరకు ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. నిరుద్యోగులు ప్రతిరోజూ ఆశగా ఎదురుచూస్తున్నారు. నర్సుల పోస్టుల భర్తీలో జాప్యం 124 నర్సుల పోస్టుల ఎంపిక జాబితాను విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ పోస్టులను వైద్య విధాన పరిషత్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆస్పత్రుల్లో భర్తీ చేస్తున్నామని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఇతర ఆస్పత్రుల్లో 90 పోస్టులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 34 పోస్టుల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. -
ఆ చిన్నారికి చేయూత కావాలి
గోపాలపట్నం: చిరునవ్వుల ఆనందంతో గడపాల్సిన ఒక ఏడాది చిన్నారి, పుట్టినప్పటి నుంచే జీవితంతో పోరాడుతున్నాడు. ఎన్. అయాన్ తేజ్ అనే ఈ పసివాడు ‘విస్కోట్ ఆల్డ్రిచ్ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా అతనిలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా క్షీణించింది. ఫలితంగా నిత్యం అనారోగ్యంతో బాధపడుతూ, చూపును కూడా కోల్పోయాడు. అయాన్ తేజ్ తల్లిదండ్రులు నిటిపల్లి వాసు, పావని తమ కొడుకు కోసం గత ఏడాది కాలంగా అష్టకష్టాలు పడుతున్నారు. అతడి చికిత్స కోసం ఇప్పటికే తమ ఇల్లు, కారు కూడా అమ్ముకుని దాదాపు రూ.16 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు తమ కొడుకును బతికించుకోవడానికి వారికి కేవలం ఒకే ఒక మార్గం ఉంది..హల్పో ఐడెంటికల్ బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్. ఈ చికిత్సకు సుమారు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఇందులో రూమ్ ఛార్జీలు, మందులు, బ్లడ్ ప్రొడక్షన్, స్టీమ్ సెల్ ప్రాసెసింగ్ వంటి పలు ఖర్చుల కోసం లక్షల రూపాయలు అవసరమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి .. అయాన్ తేజ్ కు హాప్లో ఐడెంటికల్ బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలి. ఇందుకు అతని కుటుంబ సభ్యుల నుంచి బోన్ మారో సేకరించి అది బాబుకు సరిపోతుందో లేదో పరీక్షించాలి. ఇంట్లో ఉన్న ముగ్గురికి ఈ పరీక్షలు చేయించడానికి అదనంగా రూ.వేలల్లో ఖర్చవుతుంది. అదృష్టవశాత్తు, అయాన్ తేజ్ అన్న బోన్ మారో సరిపోయినట్లయితే, చికిత్స ప్రారంభించవచ్చు. ఇప్పటికే తమకున్నదంతా ఖర్చు చేసిన ఆ కుటుంబానికి ఈ మొత్తం భరించడం అసాధ్యం. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రుల హృదయవేదన చూసి పలువురు కన్నీటిపర్యంతమవుతున్నారు. దాతల సాయం కోసం.. అయాన్ తేజ్ చికిత్స కోసం దాతల నుంచి సాయాన్ని తల్లి దండ్రులు కోరుతున్నారు. వీరి ఫోన్పై నంబర్ 9014097133, అకౌంట్ నంబర్ 37760806272, ఐఎస్ఎఫ్ కోడ్: ఎస్బీఐఎన్0004816 ఎకౌంట్ హోల్డర్ పేరు నిటిపల్లి వాసు. -
ఆరుగురి ప్రాణాలు కాపాడిన లైఫ్గార్డ్స్
కొమ్మాది: రుషికొండ బీచ్లో సముద్రంలో కొట్టుకుపోతున్న పర్యాటకులను లైఫ్గార్డ్స్ రక్షించారు. ఆదివారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్కు చెందిన 15 మంది యువతీ యువకుల బృందం రుషికొండ బీచ్ను సందర్శించడానికి వచ్చింది. వీరు సముద్రంలో స్నానం చేస్తుండగా, అలల ఉధృతి కారణంగా వారిలో ఆరుగురు నమన్, చంద్రకర్, అంజు, ఖుష్బూ యాదవ్, గౌరవ్ సాహు, ఆరుషి సింఘా, రోహన్ చంద్రుకర్ కొట్టుకుపోయారు. ఈ విషయాన్ని గమనించిన లైఫ్గార్డ్స్ ఎస్. నూకరాజు, ఎం. అమ్మోరు, చందు, సతీష్, గురుమూర్తి, చిన్నప్పన్న, వెంకటేష్, దేవ, రాజ్కుమార్ వెంటనే స్పందించి, వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం మైరెన్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడిన లైఫ్గార్డ్స్ను మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు. -
‘సెంచూరియన్’తో యూపీ ప్రభుత్వం ఒప్పందం
కొరాపుట్: సెంచూరియన్ యూనివర్సిటీతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తర ప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ వర్సిటీల మధ్య ఆగస్టు 29న ఎంవోయూ కుదిరింది. లక్నోలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా పరిశోధనాత్మక, న్యాయ సంబంధిత, సాంకేతిక అంశాల్లో రెండు సంస్థలు పరస్పరం సహకారం అందించుకుంటాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ డీఐజీ రాజీవ్ కృష్ణతో వర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ముక్తికాంత్ మిశ్రా సమాలోచనలు చేశారు. డీఐజీ మాట్లాడుతూ ఈ రెండు సంస్థల కలయిక పరిశోధన రంగంలో నూతన మార్పులు తీసుకువస్తుందని తెలిపారు. సెంచూరియన్ వర్సిటీ ప్రెసిడెంట్ ముక్తి కాంత్ మిశ్రా మాట్లాడుతూ తాము 2016లోనే గుజరాత్ ఫోరెన్సిక్ విభాగంతో పనిచేశామని, ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో ఫోరెన్సిక్ సేవలు సమాజానికి ఉపయోగపడతాయన్నారు. ఈ ఒప్పందంపై ఉత్తర్ ప్రదేశ్ ఏడీఐజీ నవీన్ ఆరోరా, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ సుప్రియ పట్నాయక్ సంతకాలు చేశారు. లక్నో లోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్, సెంచూరియన్ యూనివర్సిటీ అంతర్జాతీయ, ప్రభుత్వ సంబంధాల డైరెక్టర్ మెనాలిసా ఘోష్, డాక్టర్ రీనా, సి.జమాతానీ పాల్గొన్నారు. -
ఉక్కు పోరాటానికి వైఎస్సార్ సీపీ సిద్ధం
7వ పేజీ తరువాయిసమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను లూలూ మాల్ వంటి ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. పార్టీ బలోపేతంపై విస్తృత చర్య బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని విభాగాలు, కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తమ వార్డుల అభివృద్ధి కార్యక్రమాల కోసం విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్కు వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పవన్కల్యాణ్ చంద్రబాబు చెప్పిన స్క్రిప్ట్ చదవడానికే విశాఖకు వచ్చారని విమర్శించారు. దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ..పవన్కల్యాణ్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, స్టీల్ ప్లాంట్కు నష్టం వస్తోందని చెప్పి ప్రైవేటీకరణను సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబూరావు, మాజీ మంత్రి బాలరాజు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, గతంలో ప్రైవేటీకరణ చేస్తే రాజీనామా చేస్తామని చెప్పిన వారు ఇప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన నేతలు తెరవెనుక ప్రైవేటీకరణకు సహకరిస్తూ ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తి రెడ్డి , చింతలపూడి వెంకట రామయ్య, మాజీ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్లు కె.సతీష్, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగం అధ్యక్షులు, ముఖ్యనేతలు బొల్లవరపు జాన్ వెస్లీ, కొండా రాజీవ్ గాంధీ, కోలా గురువులు, రొంగలి జగన్నాథం, జియ్యాని శ్రీధర్, ఉరుకూటి అప్పారావు, వుడా రవి, రేయివెంకట రమణ ,బోని బంగారు నాయుడు , చెన్నా జానికీ రామ్, రాజనా వెంకటరావు, మువ్వల సురేష్ ,ద్రోణంరాజు శ్రీ వాస్తవ, పిల్లా సుజాత, పల్లా చిన్న తల్లి ,అల్లంపల్లి రాజు బాబు , డాక్టర్ జహీర్ అహ్మద్, సతీష్ వర్మ, రవి రాజు, చెన్న దాస్, అనిల్ కుమార్ రాజు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు అబంటి శైలేష్, పి.వి.సురేష్ , ఉరుకూటి రామచంద్రరావు (చందు), పేడాడ రమణి కుమారి, బోని అప్పల నాయుడు , సనపల రవీంద్ర భరత్ , బోని శివ రామకృష్ణ , బర్కత్ అలీ , సేనాపతి అప్పారావు , పీలా ప్రేమ కిరణ్ జగదీష్ , సకలభక్తుల ప్రసాద్ , కర్రి రామి రెడ్డి , రాయపు అనిల్ కుమార్ , కటికల కల్పన , వడ్డాడి దీలిప్ కుమార్, మేడి ఆనందరావు,, వంకాయల మారుతీ ప్రసాద్ , బోండా ఉమా మహేశ్వర రావు , జిలకర్ర నాగేంద్ర , దేవరకొండ మార్కెండేయులు , నీలి రవి కార్పొరేటర్లు , జిల్లా పార్టీ కార్యదర్శిలు , రాష్ట్ర అనుబంధ విభాగం ఉపాధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగం జోనల్ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగం ప్రధాన కార్యదర్శులు, అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షులు, జిల్లా పార్టీ అధికారిక ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగం సభ్యులు , మండల , డివిజన్ పార్టీ, అనుబంధ విభాగం కమిటీ సభ్యులు, పార్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
మహారాణిపేట: ముఖ్యమంత్రి మంగళవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పరిశీలించారు. ముందుగా, కోస్టల్ బ్యాటరీ వద్ద ఉన్న హెలిప్యాడ్ను పరిశీలించి, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అనంతరం, మంగళవారం నోవోటెల్ హోటల్లో జరగనున్న ‘ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్’ ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు. హెలిప్యాడ్ వద్ద దుమ్ము రేగకుండా నీరు చల్లడం, వీఐపీల జాబితా సిద్ధం చేయడం, నోవోటెల్ హోటల్లో మూడు వేర్వేరు సమావేశాల నిర్వహణ, ముఖ్యమంత్రికి గ్రీన్ రూమ్ ఏర్పాటు, సీటింగ్, వీఐపీ ప్రోటోకాల్ వంటి అంశాలపై వారు అధికారులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అజిత, ఆర్డీవో శ్రీలేఖ, జీవీఎంసీ ఏడీసీ రమణమూర్తితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా రాధాష్టమి ఉత్సవం
తగరపువలస: ఆనందపురం మండలం, గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో ఆదివారం హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీరాధాష్టమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం 11 గంటలకు శ్రీరాధా మదన్ మోహన మందిరం నుంచి శ్రీరాధాకృష్ణుల విగ్రహాలను సంకీర్తనలతో పల్లకీలో ఊరేగించారు. ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, పూలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా, శ్రీరాధా మదన్ మోహనుల విగ్రహాలకు సప్త నదులైన గంగ, యమున, సరస్వతి, గోదావరి, నర్మద, సింధు, కావేరి నదుల జలాలతో అభిషేకం నిర్వహించారు. వీటితో పాటు 108 కలశాలు, పండ్ల రసాలు, పంచామృతాలు, పంచగవ్యాలతో వేద మంత్రాల నడుమ అభిషేకాలు అంగరంగ వైభవంగా జరిగాయి. హరేకృష్ణ మూవ్మెంట్ జిల్లా అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస, శ్రీరాధారాణి ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. రాధాదేవి సాక్షాత్తు శ్రీకృష్ణుని అంతరంగిక శక్తి స్వరూపమని, ఆమె ఆరాధనకు ఇది ఒక అపురూప సమయమని అన్నారు. ఈ వేడుకలలో పాల్గొన్న సుమారు 500 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసినట్లు హరేకృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి యదురాజ దాస వెల్లడించారు. సందడిగా పూల అలంకరణ పోటీలు హరేకృష్ణ వైకుంఠంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం పూలదండలు, పుష్పగుచ్ఛాల అలంకరణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 12 నుంచి 16 ఏళ్ల బాలబాలికలు, 16 ఏళ్లు పైబడిన మహిళలు కలిపి మొత్తం 112 మంది పాల్గొన్నారు. రాధాష్టమి సందర్భంగా జరిగిన ఈ పోటీలలో, అందరూ ఉత్సాహంగా వివిధ రకాల పూల అలంకరణలు చేశారు. జయంతి దేవివాసికి ప్రథమ బహుమతి(రూ.50వేలు), ద్వితీయ బహుమతి కె.జయలక్ష్మి (రూ.40వేలు), తృతీయ బహుమతి కె.సుధ (రూ.25 వేలు) కై వసం చేసుకున్నారు. వీరికి హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస అందజేశారు. ఈ పోటీలకు ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతి ఆముక్త మాల్యద న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో పల్లకీ ఉత్సవం -
మరణించిన తండ్రి నేత్రాలు దానం
పెందుర్తి: అనారోగ్యంతో మరణించిన తండ్రి నేత్రాలను దానం చేసి ఆయన కుమారులు గొప్ప మనసును చాటుకున్నారు. పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామానికి చెందిన ఆడారి సూరి (65) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పెందుర్తి సాయి హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్.. సూరి నేత్రాలను దానం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులను అభ్యర్థించారు. మృతుడి భార్య సూర్యకాంతం, కుమారులు సన్యాసిరావు, సూరి అప్పారావు, కుమార్తె వరలక్ష్మి నేత్రదానానికి అంగీకరించారు. దీంతో మోహసీన్ ఐ బ్యాంక్ ప్రతినిధి మనోజ్ నేతృత్వంలోని బృందం సూరి నేత్రాలను సేకరించింది. -
ఉక్కు పోరాటానికి వైఎస్సార్ సీపీ సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రుల ఆత్మగౌరవంగా భావించే విశాఖ ఉక్కును కాపాడటానికి ఎలాంటి పోరాటాలకై నా వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ముందుకొచ్చే ఇతర పార్టీలను, కార్మిక నాయకులను కలుపుకుని పోరాటం చేస్తామని ఆయన అన్నారు. మద్దిలపాలెం లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్వర్యంలో ఆదివారం పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ విశాఖలో మూడు రోజుల పాటు ఉన్న పవన్కల్యాణ్.. స్టీల్ ప్లాంట్పై మాట్లాడకుండా వెళ్లిపోయారని, ఈ ప్రాంత ప్రజల, కార్మికుల కుటుంబాల ఆవేదన ఆయనకు కనిపించలేదా అని ప్రశ్నించారు. సమావేశంలో కీలక నిర్ణయాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. పోరాటానికి మద్దతు ఇచ్చే ఇతర పార్టీలు, కార్మిక సంఘాలతో త్వరలో రౌండ్ టేబుల్ మిగతా 8లో -
పోస్టులు సరే.. అధికారులెక్కడ?
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన వచ్చి ఆరేళ్లు దాటినా, దాని కార్యకలాపాలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కాగితాలపై చకచకా పనులు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి’ అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. రైల్వే బోర్డు దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్గా (జీఎం) సందీప్ మాధుర్ని రెండున్నర నెలల క్రితం నియమించింది. అదేవిధంగా, పలువురు ప్రిన్సిపల్ అధికారుల్ని కూడా నియమించారు. అయితే జోన్కు ఇంకా శాశ్వత కార్యాలయం లేకపోవడంతో జీఎం విశాఖకు అప్పుడప్పుడు వస్తూ పోతున్నారు. మిగతా అధికారులు మాత్రం బాధ్యతలు స్వీకరించడానికి వెనుకంజ వేస్తున్నారు. వీఎంఆర్డీఏ ది డెక్, ఇతర రైల్వే భవనాలను తాత్కాలిక కార్యాలయాల కోసం రైల్వే బోర్డుకు పంపినా, ఇంతవరకు ఆమోదం లభించలేదు. దీంతో జీఎం విశాఖ రైల్వే గెస్ట్ హౌస్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రిన్సిపల్ అధికారులను నియమించినా..? జీఎం నియామకం తర్వాత పలు ప్రిన్సిపల్ పోస్టులను కూడా జోన్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్) నుంచి ఒక ఎలక్ట్రికల్ అధికారిని, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ నుంచి పీసీఎంఈ (ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్)గా అమిత్ గుప్తాని నియమించారు. కానీ వీరు ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. ఎక్కడ బాధ్యతలు తీసుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. కేంద్రంపై ఒత్తిడి తేవాలి.. ప్రయాణికులు, ఉత్తరాంధ్ర ప్రజలు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వీలైనంత త్వరగా గెజిట్ విడుదల చేయించాలని, తద్వారా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావాలని కోరుకుంటున్నారు. గెజిట్ విడుదల కీలకం ఈ దుస్థితికి ప్రధాన కారణం గెజిట్ విడుదల కాకపోవడమేనని వాల్తేరు అధికారులు అంటున్నారు. గెజిట్ విడుదలైన తర్వాతే తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభం కావడం సాధ్యమవుతుంది. గెజిట్తో పాటుగా కార్యచరణ ప్రకటిస్తే, జీఎంతో సహా మొత్తం 180 మంది అధికారులు, ఉద్యోగులు నియమితులవుతారు. అప్పుడు మాత్రమే జోన్ కార్యకలాపాలు మొదలవుతాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, దసరా నాటికి కూడా ఈ పనులు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. -
హక్కులు సాధించేందుకు పోరాటాలకు సిద్ధం
మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ బీచ్రోడ్డు: వైద్య ఉద్యోగుల హక్కుల సాధనకు పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గిరిబాబు అన్నారు. ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ జిల్లా సర్వసభ్య సమావేశం పెద్ద వాల్తేరులోని టీబీ ఆస్పత్రిలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఉద్యోగులకు 36శాతం తాత్కాలిక భృతి ప్రకటించి, 12వ వేతన కమిటీ చైర్మన్ను నియమించి పెండింగ్ డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి 12వ పీఆర్సీ, 36శాతం ఐఆర్ చెల్లించాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు సాయి సత్యనారాయణ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సంపాదిత లీవ్ ఎన్క్యాష్మెంట్, పెండింగ్ డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్లో డైటీషియన్లకుచ వైద్య విద్యా సంచాలకుల విభాగంలో ఇన్సర్వీస్లో శిక్షణ పూర్తి చేసిన ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 100 శాతం బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ చెల్లించాలని, 126 జీవోను సవరణ చేసి ఈఎస్ఐ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షుడు పడాల రమణ యూనియన్ వజ్రోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. యూనియన్ నాయకు లు సారిపిల్లి గంగరాజు, కొర్రాయి రమేశ్, ఎస్కే ఇబ్రహీం, ధనుంజయ్, శివశంకర్, రమాశంకర్, మహమ్మద్ దురానీ, ఎంఎస్ రఘునాథరావు, రఘు పాల్గొన్నారు. -
అధినేత జగన్ దృష్టికి స్టీల్ ప్లాంట్ సమస్య
మహారాణిపేట: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో పాటు, ప్లాంట్లో ప్రకటించిన 34 డిపార్ట్మెంట్లలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ల జారీ, అలాగే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వంటి సమస్యలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని స్టీల్ ప్లాంట్ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు కోరారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకుడు డీవీ రమణ, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ 64వ వార్డు అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాసరావు, 69వ వార్డు అధ్యక్షుడు భోగాది సన్నీ, 78వ వార్డు అధ్యక్షుడు రావాడ శివ, 86వ వార్డు అధ్యక్షుడు గడ్డం శ్రీను, పార్టీ ప్రచార అధ్యక్షుడు జీలకర్ర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. బొత్సకు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు -
కేజీహెచ్ క్యాన్సర్ యూనిట్కు అత్యాధునిక పరికరాలు
గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పరికరాలను నేడు ప్రారంభించనున్న మంత్రి మహారాణిపేట: కేజీహెచ్ రేడియోథెరపీ విభాగంలో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం హయాంలో మంజూరైన ఈ పరికరాలను సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ పరికరాల కోసం మొత్తం రూ. 45 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో హెచ్డీఆర్ బ్రాచీ థెరపీ (రూ. 8 కోట్లు), లినాక్ (రూ. 22 కోట్లు), సీటీ సిములేటర్ (రూ. 10 కోట్లు) ఉన్నాయి. కేజీహెచ్లో 1983 నుంచి రేడియోథెరపీ విభాగం పనిచేస్తున్నప్పటికీ, ఇప్పుడు వచ్చిన ఈ అత్యాధునిక పరికరాల వల్ల క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వస్తాయని కేజీహెచ్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ శిల్పా తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రులలో లభించే ఆధునిక చికిత్స ఇప్పుడు కేజీహెచ్లో కూడా అందుబాటులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. గతంలో 2001 నుంచి టెలికోబాల్ట్–60 యంత్రంతో చికిత్స అందిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. -
చెస్ టోర్నీ విజేతలు సాత్విక్, ఆదిత్య
విశాఖ స్పోర్ట్స్: ఆల్ విశాఖ చెస్ సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్ర చెస్ సంఘం పర్యవేక్షణలో వాల్తేర్ క్లబ్లో రెండు రోజుల పాటు ఉత్కంఠభరితంగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ర్యాపిడ్ విభాగంలో సాత్విక్ విజేతగా నిలవగా, బ్లిట్జ్ ఓపెన్ చాంపియన్షిప్ను ఫిడే మాస్టర్(ఎఫ్ఎం) ఆదిత్య వరుణ్కై వసం చేసుకున్నారు. ర్యాపిడ్లో సాత్విక్దే పైచేయి తొమ్మిది రౌండ్ల పాటు హోరాహోరీగా సాగిన ర్యాపిడ్ ఓపెన్ టోర్నీలో సాత్విక్, శ్రావ్యశ్రీ, నైనాలు ఎనిమిదేసి పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే మెరుగైన టై బ్రేకర్ స్కోర్ ఆధారంగా సాత్విక్ను విజేతగా ప్రకటించారు. కేవలం ఎనిమిదో ర్యాంక్తో టోర్నీని ప్రారంభించిన సాత్విక్ అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచి తన ఫిడే రేటింగ్ను 23 పాయింట్లు మెరుగుపరుచుకున్నాడు. శ్రావ్యశ్రీ 11వ ర్యాంక్ నుంచి రెండో స్థానానికి, నైనా 15వ ర్యాంక్ నుంచి మూడో స్థానానికి ఎగబాకి సత్తా చాటారు. చివరి రౌండ్లో నైనాపై శ్రావ్యశ్రీ విజయం సాధించడం గమనార్హం. టోర్నీ టాప్ సీడ్, ఫిడే మాస్టర్ (ఎఫ్ఎం) ఆదిత్య 7.5 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఎరీనా ఇంటర్నేషనల్ మాస్టర్ (ఏఐఎం) రవికుమార్, షణ్ముఖ, శ్రీరామ్, శ్రీ అఖిల్ కూడా 7.5 పాయింట్లతో టాప్–8లో నిలిచారు. ఈ టోర్నీలో మొత్తం 332 మంది క్రీడాకారులు పాల్గొనగా, వారిలో 131 మంది ఫిడే రేటెడ్ ఆటగాళ్లు ఉన్నారు. బ్లిట్జ్లో ఆదిత్య వరుణ్ హవా బ్లిట్జ్ ఓపెన్ చాంపియన్షిప్లో ఫిడే మాస్టర్ (ఎఫ్ఎం) ఆదిత్య వరుణ్ విజేతగా నిలిచాడు. ఆదిత్య, ఎరీనా ఫిడే మాస్టర్ (ఏఎఫ్ఎం) ఆర్నవ్, సాత్విక్, రామ్చరణ్లు ఎనిమిదేసి పాయింట్లు సాధించినప్పటికీ, మెరుగైన టై బ్రేకర్స్ ఆదిత్యను విజేతగా నిలబెట్టాయి. కాండిడేట్ మాస్టర్ (సీఎం) రుత్విక్, అఖిల్, శ్రీరామ్లు 7.5 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. మూడు నిమిషాల టైమ్ కంట్రోల్తో నిర్వహించిన ఈ బ్లిట్జ్ టోర్నీలో 285 మంది పాల్గొన్నారు. ర్యాపిడ్ చెస్ టోర్నీలో అండర్–7 కేటగిరీలో షణ్విక్ (బాలురు), సాయిశ్రీ (బాలికలు), అండర్–9లో శ్రీసాయి (బాలురు), శ్రీనిఖిల (బాలికలు), అండర్–11లో పర్వేష్ (బాలురు), అనన్య (బాలికలు), అండర్–13లో హర్షవర్ధన్ (బాలురు), త్రిపురాంబిక (బాలికలు), అండర్–15లో వెంకటేశ్వరరావు (బాలురు), లక్ష్మీ ప్రియ (బాలికలు), అన్రేటెడ్లో కుమార్, బెస్ట్ వుమెన్గా సుప్రీత, బెస్ట్ విశాఖ ప్లేయర్గా రమణబాబు, పీహెచ్సీ కేటగిరీలో జిగ్నేష్ విజేతలుగా నిలిచారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు సురేష్, ఆంధ్ర చెస్ సంఘం సలహాదారు కేవీవీ శర్మ, టోర్నీ డైరెక్టర్ మణికంఠ, చీఫ్ ఆర్బిటర్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘మిస్ విశాఖ’గా డాక్టర్ సృజన
ఏయూక్యాంపస్: నగరంలోని యువతులు, తమ స్టైల్, గ్లామర్తో ర్యాంప్పై సందడి చేశారు. సరికొత్త డిజైనర్ వేర్ ధరించి, ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ముద్ర వేశారు. ఆత్మవిశ్వాసంతో కూడిన వారి అడుగులు, ఆకట్టుకునే భంగిమలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రతి యువతి తనదైన స్టైల్తో ర్యాంప్పై తళుక్కున మెరిసింది. ఆదివారం ఓ హోటల్లో ‘ఫరెవర్ మిస్ ఇండియా విశాఖపట్నం 2025’ పోటీలు నిర్వహించారు. ‘మిస్ విశాఖ’ గా డాక్టర్ సృజనదేవి నిలిచారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ బీకే అగర్వాల్ , కరణం రెడ్డి నరసింగరావు ఆమెకు అందాల పోటీ కిరీటాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ యార్లగడ్డ గీత, నాగమణి, డాక్టర్ మీనాక్షి అనంత రామ్ తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా ప్రో కబడ్డీ
విశాఖ స్పోర్ట్స్: పోర్టు స్టేడియం జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ విశాఖ క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లు ప్రేక్షకులకు అసలైన కబడ్డీ మజాను పంచాయి. ఒక మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగితే, మరో మ్యాచ్ పాయింట్ల వర్షంతో కనులవిందు చేసింది.ఉత్కంఠ పోరులో ముంబా థ్రిల్లింగ్ విక్టరీఊహించని మలుపులతో, చివరి క్షణం వరకు హోరాహోరీగా సాగిన పోరులో తమిళ్ తలైవాస్పై యు ముంబా 36–33 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి అర్ధభాగంలో వెనుకబడిన ముంబా, ద్వితీయార్ధంలో అద్భుతంగా పుంజుకుంది. సమష్టి కృషితో ఆడి, చివరి ఐదు నిమిషాల్లో ఆటను పూర్తిగా తమవైపు తిప్పుకుని అభిమానులకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించింది.వారియర్స్ జోరు.. చాంపియన్కు షాక్మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ పాయింట్ల సునామీ సృష్టించింది. డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్ను 44–54 తేడాతో చిత్తు చేసింది. ఈ సీజన్లో 50 పాయింట్ల మార్కును దాటిన తొలి జట్టుగా నిలిచి తమ సత్తా చాటింది. వారియర్స్ కెప్టెన్ దేవాంగ్ ఏకంగా 21 పాయింట్లతో ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించడం ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. సోమవారం విశాఖ వేదికగా మరో రెండు ఆసక్తికరమైన మ్యాచ్లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు పాట్నా పైరేట్స్, యూపీ యోధాస్, రాత్రి 9 గంటలకు పుణేరి పల్టన్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. -
విశాఖ క్యారమ్స్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శన
చిలకలూరిపేట: సీఆర్ క్లబ్లో జరిగిన స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ పోటీల్లో విశాఖపట్నం క్రీడాకారులు సత్తా చాటారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులతో హోరాహోరీగా సాగిన ఈ టోర్నమెంట్లో విశాఖపట్నానికి చెందిన సీహెచ్ జనార్దనరెడ్డి పురుషుల విభాగంలో విజేతగా నిలిచి ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఎన్.వెంకయ్య(నెల్లూరు), బి.జయకుమార్ (గుంటూరు), బి.పవన్కుమార్(అనంతపురం) ద్వితీయ, తృతీయ, నాల్గవ స్థానాలు సాధించారు. మహిళల విభాగంలోనూ విశాఖపట్నం ఆధిపత్యం కొనసాగించింది. ఎ.భవాని, ఎల్.హరిప్రియ, ఎంఎస్కే హారిక, ఎస్కె హుస్నా సమీర మొదటి నాలుగు స్థానాల్లో నిలిచి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. మాల్దీవుల్లో జరగనున్న ఏడో ప్రపంచ కప్ క్యారమ్స్ పోటీల్లో జనార్దనరెడ్డి దేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా స్పాన్సర్గా వ్యవహరించిన సీఆర్ క్లబ్ ఆయనకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించింది. మొత్తం 150 మంది పురుష క్రీడాకారులు, 20 మంది మహిళా క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఏపీ స్టేట్ క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలను ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ పర్యవేక్షించారు. స్టేట్ క్యారమ్స్ చాంపియన్షిప్ విజేతలుగా జనార్దనరెడ్డి, భవాని -
వృద్ధురాలి కళ్లు, దేహం దానం
పీఎం పాలెం: తాను మరణించిన తర్వాత పార్థివ దేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించాలన్న తల్లి చివరి కోరికను ఒక కొడుకు నెరవేర్చాడు. దీనికి సంబంధించిన వివరాలివి. పీఎం పాలేనికి చెందిన 88 ఏళ్ల వడ్డే సూర్యకాంతమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాను మరణించిన తర్వాత తన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్కు, శరీరాన్ని గాయత్రీ మెడికల్ కాలేజీకి అప్పగించాలని ఆమె తన కుమారుడు నాగేంద్రబాబుకు సూచించారు. ఆదివారం ఆమె మరణించగా, నాగేంద్రబాబు తన తల్లి కోరిక మేరకు సావిత్రి బాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్టీ సురేఖ ఆధ్వర్యంలో ఆమె పార్థివ దేహాన్ని ఆస్పత్రికి అప్పగించారు. -
నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు
ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ మీనాక్షి ఏయూక్యాంపస్: దేశంలో అనేక మంది ప్రజలు నేత్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఒకరు దానం చేసే నేత్రాలు మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపుతాయని ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వి.మీనాక్షి పేర్కొన్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు కంటి దానం పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం బీచ్రోడ్డులోని కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ, మోహసీన్ ఐ బ్యాంక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మీనాక్షి మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత 6 నుంచి 8 గంటల వ్యవధిలో నేత్రాలను దానం చేయవచ్చని తెలిపారు. నేత్రదానంపై అవగాహన కల్పిస్తూ విభిన్న కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. గాయత్రి మెడికల్ కళాశాల వైద్యురాలు డాక్టర్ జ్యోతిర్మయి, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ధర్మరాజులు నేత్రదానం ఆవశ్యకతను వివరించారు. బీచ్రోడ్డులో పాదచారులకు కరపత్రాలను పంపిణీ చేసి, అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సిబ్బంది, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థులు, ఎల్.వి.ప్రసాద్ ఐ హాస్పిటల్, మోహసీన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు, శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్, గీతం హాస్పిటల్, విశాఖ ఐ హాస్పిటల్ వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి టెండరింగ్
విశాఖ సిటీ: జిల్లాలో బార్ల కేటాయింపులో కూటమి నేతల టెండ‘రింగ్’ బట్టబయలైంది. బార్ల డిపాజిట్ ధరలు భారీగా తగ్గించి వాటిని సొంతం చేసుకునే ఎత్తుగడ స్పష్టంగా కనిపించింది. కొత్త బార్లకు దరఖాస్తులు రాకుండా తెరవెనుక నడిపిన తతంగం బహిర్గతమైంది. జిల్లాలో కొత్త బార్లకు ఎవరూ ముందుకు రాకుండా కూటమి రింగ్ మాస్టర్లు బ్లాక్మెయిలింగ్ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. జీవీఎంసీ పరిధిలో ఓపెన్ కేటగిరీలో 121 బార్లకు కేవలం 57 బార్లకు మాత్రమే దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. వీటికి శనివారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ చేతుల మీదుగా లాటరీ తీసి బార్లను కేటాయించారు. మిగిలిన 64 బార్లను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భారీగా డిపాజిట్ ధరలు తగ్గించి చేజిక్కించుకోవాలని కూటమి నేతలు ఎత్తులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సగం బార్లకు కూడా జరగని లాటరీ జీవీఎంసీ పరిధిలో ఓపెన్ కేటగిరీలో 121, కల్లు గీత కులాలకు 10 బార్లు మొత్తంగా 131 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. గతేడాది వైన్షాపులను చేజిక్కించుకున్నట్లుగానే ఈ బార్లను కూడా సొంతం చేసుకోవాలని కూటమి నేతలు పక్కా ప్లాన్ వేశారు. అయితే బార్ లైసెన్సు కోసం 50 వేలు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, రూ.5 లక్షలు దాటితే రూ.75 లక్షలు చెల్లించాల్సి ఉంది. లైసెన్సు ఫీజు భారీగా ఉండడంతో దాన్ని తగ్గించే ఎత్తుగడ వేశారు. తొలి దశలో నిర్వహించే లాటరీకి దరఖాస్తులు రాని పక్షంలో తర్వాత ఆ లైసెన్స్ ఫీజులు భారీగా తగ్గించి తద్వారా బార్లను సొంతం చేసుకోవాలని ఆలోచనకు వచ్చారు. ఇందుకు తగ్గట్టుగానే కూటమిలో ఒక గ్యాంగ్ ఆ బాధ్యతను తీసుకుని బార్లకు ఎక్కువగా దరఖాస్తులు రాకుండా తెరవెనుక కథ నడిపినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పైకి వైన్షాపులు కారణంగానే బార్ల నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదన్న ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ నెపంతో లైసెన్స్ ఫీజు భారీగా తగ్గించిన తర్వాత బార్లను చేజిక్కించుకునే కుట్రకు తెరతీశారన్న టాక్ వినిపిస్తోంది. ఫలితంగా జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 121కి, గీత కులాలకు చెందిన 10 బార్లకు కేవలం 263 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దీని ప్రకారం ఓపెన్లో 57 బార్లకు దరఖాస్తులు చేశారు. ఒక్కరే నాలుగేసి.. ఓపెన్ కేటగిరీలో కూడా బార్లకు ఒక్కరే నాలుగేసి దరఖాస్తులు చేయడం గమనార్హం. వీరిలో అధిక సంఖ్యలో కూటమికి చెందిన వారే ఉండడం విశేషం. ఒక్కో బార్కు నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీసే అవకాశముంది. దీంతో బయట వారు ఎవరూ దరఖాస్తులు చేయకుండా కేవలం కూటమికి చెందిన వారే ఒక్కొక్కరు నాలుగేసి దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఒక్కొక్కరు నాలుగు దరఖాస్తులకు అప్లికేషన్ ఫీజుతో కలిపి రూ.20.40 లక్షలు చెల్లించారు. ఫలితంగా లాటరీ ప్రక్రియ నామమాత్రంగా మారిపోయింది. నిబంధనల ప్రకారం లాటరీ తీసినప్పటికీ.. ఒక్కో బార్కు ఒక్కరే ఉండడంతో పోటీ లేకుండా పోయింది. వారికే ఆ బార్ దక్కింది. కల్లు గీత కులాలకు కేటాయించిన 10 బార్లకు ఇదే తరహాలో దరఖాస్తులు రాగా వాటికి కూడా లాటరీ తీసి కేటాయించారు. డిపాజిట్ ధరలు భారీగా తగ్గించి తీసుకునేందుకు కూటమి నేతల కొత్త ఎత్తుగడ సగానికి పైగా బార్లకు దరఖాస్తులు పడకుండా తెరవెనుక వ్యూహాలు జిల్లాలో 131 బార్లకు గాను 67 బార్లకే దరఖాస్తుల రాక అది కూడా ఒక్కో బార్కు ఒక్కరే నాలుగేసి దరఖాస్తులు లాటరీ తీసిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఓపెన్లో 57, గీత కులాలకు 10 బార్లు కేటాయింపు -
యాచకులను వారికుటుంబాలకు అప్పగించాలి
విశాఖ సిటీ: నగరంలో గుర్తించిన యాచకులను వారి కుటుంబాల చెంతకు చేర్చేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు జ్యోతిర్గమయ కార్యక్రమం ద్వారా నగరంలో భిక్షాటన చేస్తున్న 243 యాచకులను పోలీసులు ఇప్పటికే రెస్క్యూ చేసి వారిని పలు ఆశ్రమాల్లో ఆశ్రయం కల్పించారు. వీరిలో 115 మందిని వారి కుటుంబాలకు అప్పగించారు. మిగిలిన 128 మంది యాచకులను వారి వివరాలను తెలుసుకునేందుకు ఏయూటీడీ డే–నైట్ హోంలెస్ షెల్టర్ ఆధ్వర్యంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యాచకులకు ఆధార్ ఉన్నదీ, లేనిదీ, వారి వేలిముద్రల ఆధారంగా పరిశీలించారు. కార్యక్రమాన్ని సీపీ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షించారు. వివరాల ప్రకారం యాచకులను వారి కుటుంబాలకు చేర్చాలని పోలీసులను సీపీ ఆదేశించారు. -
గీతం గుప్పిట్లో ఏయూ?
సాక్షి, విశాఖపట్నం: చారిత్రాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంపై ‘గీతం’ పెత్తనం పెరుగుతోందా? విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాల్సిన వర్సిటీని కూటమి ప్రభుత్వం రాజకీయ క్రీడకు వేదికగా మారుస్తోందా? ప్రస్తుత పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా పక్కనే ఉన్న ప్రైవేట్ వర్సిటీ కోసం ఏయూ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిన టీడీపీ.. ఇప్పుడు మళ్లీ అదే బాటలో పయనిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గీతంలో పనిచేసిన వ్యక్తిని వైస్ చాన్సలర్గా నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ తాను ముక్కనే రిజిస్ట్రార్గా నియమించడం వివాదాస్పదమవుతోంది. ఏయూ లో ఎంతోమంది సీనియర్లు ఉండగా, వారిని కాదని గీతం వర్సిటీతో సంబంధమున్న వ్యక్తిపై అవాజ్య ప్రేమ చూపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీసీ నియామకం లాగే.. ప్రస్తుత రిజిస్ట్రార్ నియామకం వెనుక ఎంపీ భరత్ సిఫార్సు ఉందన్నది బహిరంగ రహస్యం. అస్తవ్యస్తంగా ఏయూ పాలన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అస్తవ్యస్త పాలన కొనసాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీని రాజకీయానికి బలి చేస్తున్నారు. గతంలో పనిచేసిన వీసీ, రిజిస్ట్రార్లపై బెదిరింపులకు పాల్పడి.. బలవంతపు రాజీనామాలు చేయించిన కూటమి నేతలు.. తమ వారిని ఆ కుర్చీల్లో కూర్చోబెట్టారు. ముఖ్యంగా గీతం యూనివర్సిటీ చైర్మన్, ఎంపీ భరత్ కనుసన్నల్లోనే కీలక పదవుల నియామకాలు జరుగుతుండటం చూస్తుంటే.. విశ్వ విద్యాలయం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఏయూ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా బోధన, ఇతర ఏయూ అభివృద్ధిని పక్కనపెట్టేసి.. కుర్చీలాటలాడుకోవడం సర్వత్రా విస్మయానికి గురి చేస్తోంది. నాలుగు రోజుల కిందట ఏయూ రిజిస్ట్రార్ ధనుంజయరావు అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తమ వ్యక్తిని ఆ పదవిలో నియమించుకోవడం కోసం వీసీ రాజశేఖర్.. ఆయనపై పొమ్మనలేక పొగపెట్టినట్లు తెలుస్తోంది. వీసీ వైఖరి నచ్చకపోవడం, పదవీకాలం ముగియనుండటంతో త్వరగా వైదొలగాలని కూటమి నేతల నుంచి వచ్చిన ఒత్తిడులను తట్టుకోలేకే ధనుంజయరావు రాజీనామా చేశారని సమాచారం. ఆ వెంటనే, ఎంపీ భరత్ మరోసారి చక్రం తిప్పి, గీతం వర్సిటీతో సంబంధం ఉన్న వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టేశారు. వీసీ, రిజిస్ట్రార్.. ఇద్దరూ ‘గీతం’ వారే! గత వీసీని బలవంతంగా రాజీనామా చేయించిన తర్వాత కూటమి నేతలు ఏయూను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఎంపీ భరత్ ఏయూపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే, గతంలో గీతంలో పనిచేసి, ఆ తర్వాత ఐఐటీ ఖరగ్పూర్లో విధులు నిర్వర్తించిన రాజశేఖర్ను ఏయూ వైస్ చాన్సలర్గా నియమించాలని పట్టుబట్టి మరీ పదవి కట్టబెట్టారు. ఇప్పుడు రిజిస్ట్రార్ను అర్థాంతరంగా తొలగించడం వెనుక కూడా భరత్ కుట్ర ఉందన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా పనిచేస్తున్న రాంబాబు గతంలో గీతంలోనూ విధులు నిర్వర్తించారు. రాంబాబును రిజిస్ట్రార్గా నియమించాలని భరత్ సిఫార్సు చేయడంతో, వీసీ ఆయన పేరును ఉన్నత విద్యామండలికి పంపించారు. ఆ తర్వాత ఎంపీ ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి రాంబాబు నియామకానికి ఆమోదముద్ర వేయించారు. రాంబాబు కంటే ఎంతోమంది సీనియర్లు వర్సిటీలో ఉన్నా, వారందరినీ పక్కనపెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీసీ పూర్తిగా రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తూ విశ్వవిద్యాలయ ప్రతిష్టను మంటగలుపుతున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వర్సిటీ మూలాలు ఏయూలో విస్తరించడం భవిష్యత్తులో విశ్వవిద్యాలయ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చని ఆందోళన సర్వత్రా నెలకొంది. -
తరాల మధ్య సమరం
నాలుగేళ్ల బాలుడు, 84 ఏళ్ల వృద్ధుడి మధ్య చెస్ పోరు విశాఖ స్పోర్ట్స్: క్రీడా వేదికపై ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకవైపు చదరంగం బోర్డుపై ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న నాలుగేళ్ల చిచ్చరపిడుగు.. మరోవైపు ఎనభై నాలుగేళ్ల అనుభవజ్ఞుడు. తరాల అంతరం ఉన్నా.. వారిద్దరి లక్ష్యం ఒకటే.. ప్రత్యర్థి రాజును కట్టడి చేయడం. విశాఖ వేదికగా శనివారం ప్రారంభమైన అంతర్జాతీయ ఫిడే రేటింగ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో వీరిద్దరి ఆట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా ఏ క్రీడలోనైనా సబ్–జూనియర్, సీనియర్, వెటరన్ వంటి వయో విభజనలు ఉంటాయి. ఎవరి కేటగిరీలో వారే పోటీపడతారు. కానీ, చదరంగం ఆటలో వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. అందుకే 4.3 ఏళ్ల జీఆర్ షాన్విక్, 84 ఏళ్ల సీహెచ్ గోపాలకృష్ణ ఒకే టోర్నీలో ప్రత్యర్థులుగా తలపడగలిగారు. క్లాసికల్ చెస్లో ఆటగాళ్లు ఆలోచించుకోవడానికి చాలా సమయం ఉంటుంది. కానీ ర్యాపిడ్ చెస్లో వేగమే ప్రధానం. పరిమిత సమయంలో మెరుపువేగంతో ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేయాలి. ఇలాంటి ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీలు జరగడం విశేషం. ఇటీవల ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ టైటిల్ కోసం ఇద్దరు భారత క్రీడాకారిణులే తలపడటం, ఈ ప్రాచీన భారతీయ క్రీడలో మన ప్రావీణ్యానికి నిలువుటద్దం పడుతోంది. కాగా.. గోపాలకృష్ణ 7 రౌండ్లలో 4.5, షాన్విక్ 3.5 పాయింట్లు సాధించారు. -
బీసీ మహిళలకు సబ్ కోటా కోసం దీక్ష
బీచ్రోడ్డు: మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి, బీసీ మహిళలకు సబ్–కోటా కేటాయించిన తర్వాతే దానిని అమలు చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శనివారం ఒక్క రోజు నిరాహార దీక్ష నిర్వహించి, తమ నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ అనాదిగా ఓబీసీలు భారతీయ మనువాద సమాజంలో సామాజిక అణచివేతకు, ఆర్థిక దోపిడీకి గురై అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు. ఉత్పత్తి కులాలుగా, శ్రామిక వర్గంగా ఉన్న ఓబీసీలు దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. అన్ని విధాలా అభివృద్ధి చెందిన ఓసీ మహిళలతో బీసీ మహిళలు పోటీపడి చట్టసభల్లో అడుగుపెట్టడం అసాధ్యమని, అందుకే 33 శాతం మహిళా రిజర్వేషన్లతో కూడిన చట్టానికి సవరణ చేసి, బీసీ మహిళలకు తప్పనిసరిగా సబ్–కోటా కేటాయించిన తర్వాతే దానిని అమలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఆధిపత్య వర్గాల మహిళలతో పోలిస్తే, ఓబీసీ మహిళలు చాలా వెనుకబడి ఉన్నారన్నారు. జయశ్రీ మాట్లాడుతూ 30 ఏళ్లుగా కేంద్రంలో ప్రభుత్వాలు మారినా.. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శ ఎన్ని శ్రీనివాస్, ఉత్తరాంధ్ర కన్వీనర్ గొర్లె శ్రీనివాస్ నాయుడు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా రమణ యాదవ్, నగర అధ్యక్షుడు బోసు, రాష్ట్ర కార్యదర్శి బుద్దా చంద్రవాణి, రాష్ట్ర అధికార ప్రతినిధి పేడాడ సూర్యకుమారి, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జీవీఎంసీలో 18 మంది ఉద్యోగుల పదవీ విరమణ
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సుదీర్ఘ కాలం విధులు నిర్వహించిన 18 మంది ఉద్యోగులు, కార్మికులు శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో ఉద్యోగులను జీవీఎంసీ డీపీవో ఎల్.సురేష్తో కలిసి అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి సన్మానించారు. రిటైరైన ఉద్యోగుల శేష జీవితం ఆనందదాయకంగా సాగాలని రమణమూర్తి ఆకాంక్షించారు. ప్రతి ఉద్యోగి కుటుంబం కంటే అధిక కాలం సంస్థ కోసం పనిచేస్తారన్నారు. పదవీ విరమణ పొందిన వారిలో పర్యవేక్షక ఇంజినీర్తోపాటు ఎనిమిది మంది పర్మినెంట్ ఉద్యోగులు, 9 మంది పొరుగు సేవల సిబ్బంది ఉన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ జెమ్స్ యూనియన్ నాయకులు, పలువురు ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు
నూతన బార్ పాలసీకి అనుగుణంగా లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ మీడియాకు చెప్పారు. జీవీఎంసీ పరిధిలో రిజర్వ్లో పది, ఓపెన్ కేటగిరీలో 121 కలిపి మొత్తం 131 బార్లు ఉండగా ఆశావహుల నుంచి 263 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిలో గీత కులాలకు పది, ఓపెన్ కేటగిరీలో 57 కలిసి మొత్తం 67 బార్లకు లాటరీ ప్రక్రియ ముగిసిందన్నారు. సంబంధిత నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తామని, దరఖాస్తులు రాక మిగిలిపోయిన బార్ల విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజశేఖర్, సీఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు సన్మానం
విశాఖ సిటీ: పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన ఏడుగురు పోలీస్ సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సన్మానించారు. ఎస్ఐలు డి.రాము, ఎం.అన్వరాల్హక్, ఏఎస్ఐలు పి.ఆదినారాయణ, జి.అప్పలరాజు, పి.బాబూరావు, డి.అరుణకుమారి, ఏఆర్హెచ్సీ ఎ.లోకేశ్వరరావులు ఉద్యోగ విరమణ పొందారు. వీరికి శనివారం పోలీస్ సమావేశ మందిరంలో పోలీస్ అధికారుల సమక్షంలో సీపీ శాలువాతో సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. వీరి కుటుంబ సభ్యులతో కొంత సేపు ముచ్చటించారు. పోలీస్ శాఖలో 40 ఏళ్లు సుదీర్ఘ సర్వీసు అందించడం గొప్ప విషయమన్నారు. -
ఫిడే చెస్ టోర్నీలో నైనా ఆధిక్యం
విశాఖ స్పోర్ట్స్: ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఆంధ్ర చెస్ అసోసియేషన్ పర్యవేక్షణలో వాల్తేరు క్లబ్లో శనివారం అంతర్జాతీయ ఫిడే రేటింగ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ర్యాపిడ్ విభాగంలో ఏడు పాయింట్లతో నైనా ఆధిక్యంలో ఉండగా, రవి, ఆదిత్య ఆరేసి పాయింట్లతో పోటీలో ఉన్నారు. ర్యాపిడ్ ఏడో రౌండ్లో ఎఫ్ఎం(ఫిడే మాస్టర్) నైనాతో ఆరు పాయింట్లతో ఉన్న సాత్విక్ తలపడగా, నైనా విజయం సాధించి ఏడు పాయింట్లతో ఆధిక్యానికి దూసుకెళ్లింది. మరోవైపు రామ్చరణ్పై ఆదిత్య, ఐదున్నర పాయింట్లతో ఉన్న విజయ్పై రవి గెలిచాడు. ఆరో రౌండ్లో ఎఫ్ఎం ఆదిత్య, ఐఎం(ఇంటర్నేషనల్ మాస్టర్) రవికృష్ణల మధ్య జరిగిన పోటీ డ్రాగా ముగిసింది. శ్రావ్యశ్రీపై సాత్విక్ గెలవగా, విజయ్ కుమార్, రామ్చరణ్లు డ్రా చేసుకున్నారు. మహిళా ఫిడే మాస్టర్ సుప్రీతపై ఎఫ్ఎం నైనా విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో ర్యాపిడ్ చెస్లో భాగంగా తొమ్మిది రౌండ్లకు పదిహేను నిమిషాల టైమ్ కంట్రోల్తో తొలిరోజు ఆరు రౌండ్లు నిర్వహించారు. ఇందులో 332 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. వీరిలో 131 మంది ఫిడే రేటింగ్ ఆటగాళ్లు ఉన్నారు. ఎఫ్ఎం ఆదిత్య వరుణ్ (2183 ఫిడే రేటింగ్), మహిళా ఎఫ్ఎం సుప్రీత (1831 ఫిడే రేటింగ్) పోటీకి సిద్ధపడ్డారు. ర్యాపిడ్ విభాగంలో తొలి 30 స్థానాల్లో నిలిచిన వారికి లక్షన్నర రూపాయల నగదు బహుమతులు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తామని ఆంధ్ర చెస్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ కె.వి.వి.శర్మ తెలిపారు. బ్లిట్జ్ విభాగంలో తొలి 20 స్థానాల్లో నిలిచిన వారికి యాభై వేల రూపాయలు ఇస్తామన్నారు. ఆదివారం బ్లిట్జ్ విభాగంలో మూడు నిమిషాల వ్యవధితో తొమ్మిది రౌండ్లు నిర్వహిస్తామని ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. మణికంఠ రావు చెప్పారు. టోర్నీ ప్రారంభోత్సవంలో నగర పోలీస్ కమిషనర్ బాగ్చి, ఎస్ఎన్ఎల్ వర్సిటీ వైస్ చాన్సలర్ సూర్యప్రకాశరావు, ఆర్వీ గ్రూప్ చైర్మన్ ఆర్. వెంకటేశ్వరరావు, వాల్తేరు క్లబ్ అధ్యక్షుడు శేషగిరిరావు, కార్యదర్శి బాల సతీష్, కంకటాల మల్లికార్జునరావు, ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్, మహిళా ఫిడే మాస్టర్ ఆలనామీనాక్షి పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి సుయాష్ చవాన్ విదేశీ సమాఖ్యల నుంచి వచ్చిన ఆటగాళ్లతో పరిచయం చేసుకున్నారు. -
సీఫుడ్ ఎగుమతిదారులసమస్యలు పరిష్కరిస్తాం
కేంద్ర కార్యదర్శి అవినాష్ జోషి మహారాణిపేట: సీఫుడ్ ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్ర పుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కార్యదర్శి అవినాష్ జోషి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో సీఫుడ్ ఎగుమతిదారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎగుమతిదారుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఏపీ పుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి చిరంజీవి చౌదరి మాట్లాడుతూ సీఫుడ్ వినియోగాన్ని మరింత పెంచడానికి అందరూ కృషి చేయాలని కోరారు. సమీక్షలో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, జేసీ మయూర్ అశోక్, మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు, సీఫుడ్ సంస్థల ప్రతినిధులు పవన్ కుమార్, జి.ఎస్.రావు, డిప్యూటీ డైరెక్టర్ అన్సార్ ఆలీ, ఎంపెడకు చెందిన విజయ్ కుమార్, మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక నేతలది ప్రేక్షకపాత్రే
జగదాంబ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. భారీ అంచనాల మధ్య జరిగిన ఈ సభకు జనం ముఖం చాటేశారు. సభలో స్థానిక నాయకులను పూర్తిగా విస్మరించడం, పోలీసుల మితిమీరిన ఆంక్షలతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక నేతలకు దక్కని ప్రాధాన్యం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన సేనతో సేనాని కార్యక్రమం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సభలో స్థానిక నాయకులకు ప్రాధాన్యం లేకుండా పోయింది. దక్షిణ నియోజకవర్గం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లితో పాటు రాష్ట్రంలోని జనసేన ఎమ్మె ల్యేలు, ఎంపీలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం అవుతుందనుకున్న సభ.. ఆరు గంటల వరకు ప్రారంభం కాలేదు. పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత సభాధ్యక్ష బాధ్యతలు తీసుకున్న దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ మినహా మిగతా వారంతా ప్రేక్షక పాత్ర వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా ఏ ఒక్క స్థానిక నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఇతర జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలతో పొగడ్తలు గుప్పించడంతో స్థానిక నేతలు తెల్లముఖాలు వేశారు. మరో వైపు జనసేన కార్పొరేటర్లను, పార్టీ మారిన వారిని సభా ప్రాంగణంలో ఓ మూలకు కూర్చోబెట్టడం వారిని మరింత ఇబ్బందికి గురిచేసింది. కనీసం నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. కార్యకర్తను నాయకుడిని చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. పోలీసుల ఆంక్షల హంగామా సేనతో సేనాని కార్యక్రమం కోసం పోలీసులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం స్టేడియం పరిసరాల్లో మోహరించింది. రామకృష్ణ జంక్షన్, రైతుబజార్, టౌన్కొత్తరోడ్డు, దుర్గాలమ్మ జంక్షన్, వెలంపేట వంటి కీలక ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి రహదారులను మూసేశారు. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వన్టౌన్ సీఐ జీడీ బాబు చేసిన అత్యుత్సాహం తోటి పోలీసులకే విసుగు తెప్పించింది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారట!విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా జనసేన ఆపిందని చెప్పిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం చాపకిందనీరులా స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కార్యక్రమాలు జరుగుతున్నా సభలో నోరెత్తకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక సభా కార్యక్రమం మధ్యలో తమిళ నటుడు విజయ్ పెట్టిన పార్టీ జెండాలను పవన్ కల్యాణ్ వేసుకోవడంతోపాటు అక్కడ నుంచి వచ్చిన కార్యకర్తలతో ఆ జెండాలను ఆవిష్కరించారు. -
నేడు వైఎస్సార్ సీపీజిల్లా సర్వ సభ్య సమావేశం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా సర్వ సభ్య సమావేశం ఆదివారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూ రావు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబుతో పాటు సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయ ర్, ముఖ్యనాయకులు హాజరవుతారు. సమావేశానికి జిల్లా ముఖ్యనాయకులు, కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు, వార్డు అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు హాజరుకావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. -
రేపటి నుంచి నేవీ మారథాన్కు రిజిస్ట్రేషన్లు
విశాఖస్పోర్ట్స్: సాగర తీరం వెంట 10వ వైజాగ్ నేవీ మారథాన్ డిసెంబర్ 14న నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మారథాన్లో భాగంగా 42కే, 21కే, 10కే, 5కే పరుగులను నిర్వహించనున్నారు. శనివారం ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, కమోడోర్ అనిరుధ్ రాయ్, కెప్టెన్ టి.ఆర్.ఎస్.రాయ్, రాహుల్ సంఖ్రియా మారథాన్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ మాట్లాడుతూ ఉత్సాహంగా సాగే ఈ పరుగులో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్కువ మందిని ప్రోత్సహించేందుకు నేవీ ప్రత్యేక డిస్కౌంట్తో ప్రవేశ రుసుం కల్పించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఐఎన్ఎస్ కళింగ సీవో అనిరుధ్ మాట్లాడుతూ మారథాన్లో ఏటా పాల్గొనే ఔత్సాహికుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇందులో పాల్గొనే ప్రతి రన్నర్కు కిట్, స్నాక్స్, మెడల్ అందజేస్తామన్నారు. రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్నవారు వైజాగ్ నేవీ మారథాన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. అన్ని పరుగులూ ఆర్.కె.బీచ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద నుంచి ప్రారంభమవుతాయని, ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. 10కే రన్కు 16 ఏళ్లు నిండిన వారు, 21కే, 42కే పరుగుకు కనీసం 18 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. ఎస్బీఐ డీజీఎం రాహుల్ మాట్లాడుతూ వైజాగ్ నేవీ మారథాన్కు మరోసారి స్పాన్సర్గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. -
వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్
విశాఖ లీగల్: వచ్చే నెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులను పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణ నుంచి వర్చువల్గా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో లోక్ అదాలత్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి, కక్షిదారులకు లోక్ అదాలత్ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, అన్ని న్యాయస్థానాల జ్యుడిషియల్ అధికారులు పాల్గొన్నారు. వీబీసీఏ అధ్యక్షుడిగా రోలండ్ విలియమ్స్ -
అగమ్యగోచరంగా విద్యా రంగం
ఆరిలోవ: రాష్ట్రంలో విద్యా రంగం అగమ్యగోచరంగా మారిందని వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కదిరి బాబూరావు, జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. 13వ వార్డు ఆరిలోవ శివాజీనగర్, 40 గజాల కాలనీల్లో శనివారం బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, వార్డు అధ్యక్షుడు సత్యాల వెంకట్, స్థానిక నాయకులతో కలిసి వారు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించి వివరించి, వాటిపై ముద్రించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు, బాబూరావులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విద్యార్థులకు మేలు జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యా రంగానికి గ్రహణం పట్టించిందన్నారు. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్లను రద్దు చేసి పేదలపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు కె.ఆర్.పాత్రుడు, జిల్లా మార్కెటింగ్ శాఖ మాజీ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు, జిల్లా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కె.శిరీష, స్థానిక నాయకులు వానపల్లి ఈశ్వరరావు, పోలరావు, దుర్గారావు, వాసు, నారాయణరావు, మధుసూదనరెడ్డి, వనం వరలక్ష్మి, పాల్గొన్నారు. -
కష్టజీవుల పస్తు!
అల్లిపురం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ‘సేనతో సేనాని’ పేరిట నిర్వహించిన సభ.. ఆ ప్రాంతంలోని కష్టజీవులకు కన్నీటిని మిగిల్చింది. పవన్ రాక సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం, తీసుకున్న కఠిన చర్యలు.. రోజు కూలి వస్తే గానీ పూట గడవని వందలాది కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఈ కార్యక్రమం ‘ఒకరికి మోదం.. మరొకరికి ఖేదం’ అన్న చందంగా సాగింది. బలవంతంగా దుకాణాల బంద్ సభా వేదికై న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పరిసరాల్లోని దుకాణాలు, వర్క్షాపులు, తోపుడు బండ్లను పోలీసులు బలవంతంగా మూయించారు. ‘దుకాణం మూయకపోతే జరిమానా విధిస్తాం’ అంటూ చేసిన హెచ్చరికలతో వ్యాపారులు భయభ్రాంతులకు గురై తాళాలు వేశారు. ‘పని పూర్తి చేసి డెలివరీ ఇవ్వాల్సినవి ఉన్నాయి సార్, ఒక్క గంట సమయం ఇవ్వండి’అని వేడుకున్నా అధికారులు కనికరించలేదని, ‘ఒక్క రోజుకు ఏమీ కాదులే’అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని దుకాణదారులు వాపోయారు. ఈ ఆకస్మిక బంద్ వల్ల రోజువారీ కూలీల పరిస్థితి దారుణంగా మారింది. ‘పని ఉందని ఉదయాన్నే వస్తే, మమ్మల్ని పనిలేకుండా చేశారు. రోజు కూలి చేసుకుంటేనే మా కుటుంబాలు గడిచేది. ఈ రోజు మా పరిస్థితి ఏంటి?’ అంటూ పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేర్లు చెబితే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకోనివ్వరేమోనన్న భయంతో వారు వివరాలు చెప్పడానికి కూడా నిరాకరించారు. పవన్ రాక తమ లాంటి పేదలకు పస్తులుండేలా చేసిందని వారు ఆవేదన చెందారు. మీడియాపైనా ఆంక్షలు సభను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల జనసేన నాయకులు, కార్యకర్తల తీరు వివాదాస్పదమైంది. కొందరు జనసేన నాయకులు సీనియర్ పాత్రికేయులను సైతం అడ్డుకుని, ‘మీకు పాసులు ఎవరు ఇచ్చారు? మీకు డీపీఆర్వో అక్రిడిడేషన్ ఉందా?’అంటూ అధికార దర్పం ప్రదర్శించారు. పార్టీ కార్యక్రమానికి, ప్రభుత్వ గుర్తింపు కార్డుకు సంబంధం ఏమిటని ప్రశ్నించినా వినిపించుకోకుండా నానా హంగామా సృష్టించారు. మరోవైపు అసలైన మీడియా ప్రతినిధులను కాదని.. జనసేన కార్యకర్తలు మీడియా పాసులు ధరించి స్వేచ్ఛగా తిరగడం గందరగోళానికి దారితీసింది. ఈ పరిణామాలపై మీడియా వర్గాల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమైంది. మొత్తం మీద ఒక రాజకీయ సభ కోసం సామాన్య ప్రజలను, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయడం, పోలీసుల సహాయంతో వారి జీవనోపాధిని దెబ్బతీయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. -
హార్బర్ ఆధునికీకరణ పనుల పరిశీలన
మహారాణిపేట: ఫిషింగ్ హార్బర్లో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రూ.178 కోట్లతో జరుగుతున్న ఆధునికీకరణ పనులను శనివారం రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ పరిశీలించి, వేగవంతం చేయాలని సూచించారు. కొత్తగా నిర్మిస్తున్న ఫిషింగ్ జెట్టీలు, వేలం కేంద్రాలు, పార్కింగ్ బిల్డింగ్, నెట్ మెండింగ్ హాల్స్, స్టోరేజ్ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన మత్స్యకారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మత్స్య శాఖ జేడీ పి.లక్ష్మణరావు, ఎఫ్డీవోలు ఆశాజ్యోతి, మురళి, పోర్ట్ ఇంజినీరింగ్ శాఖ అధికారులు, బోట్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, వివిధ సంఘాల నాయకులు సిహెచ్.వీర్రాజు, పి.సి.అప్పారావు, బి.కొండబాబు, ఎం.బాలాజి, ట్రేడర్స్ ప్రతినిధులు, బోటు ఆపరేటర్లు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మత్స్య శాఖ కమిషనర్ రామశంకర్ -
ముగిసిన డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన
ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లాలో డీఎస్సీ–2025 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారంతో ముగిసింది. జిల్లాలో 1,426 పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీతో పాటు రిజర్వేషన్ కేటగిరీల మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ పరిశీలన ఈ నెల 28న విశాఖ ఉక్కునగరం విమల విద్యా పరిషత్లో ప్రారంభమైంది. మొదటి రెండు రోజుల్లో 1,426 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ రెండు రోజుల్లో హాజరు కాలేకపోయిన వారికి, అలాగే హాజరైనప్పటికీ ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా లేని, చిరునామాలు, పేర్లు తారుమారు అయిన 26 మంది అభ్యర్థులకు శనివారం మరో అవకాశం కల్పించినట్లు డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. వీరంతా సరైన ధ్రువీకరణ పత్రాలతో రావడంతో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఈ అభ్యర్థుల్లో కొందరు రెండు నుంచి నాలుగు పోస్టులకు ఎంపికయ్యే ర్యాంకులు సాధించారని, వారు ఏ పోస్టులకు సానుకూలత చూపుతారో దానిని బట్టి రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన ఉండే అవకాశం ఉందన్నారు. -
డూప్లికేట్ తాళాలతో ఏటీఎంల్లో చోరీ
ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్, రిమాండ్పరవాడ: దేశపాత్రునిపాలెం, పరవాడ ప్రాంతాల్లోని ఏటీఎం చోరీలకు పాల్పడిన ఉత్తరప్రదేశ్కు చెందిన శివసింగ్, ప్రదీప్సింగ్ చౌహన్లను అరెస్ట్ చేసినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. నిందితులిద్దరు ఎస్బీఐకి చెందిన పెర్టో కంపెనీ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని నగదు చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. సీఐ తెలియజేసిన వివరాలిలా.. ఈ నెల 27న నిందితులు పరవాడ అయ్యబాబు కాంప్లెక్స్, దేశపాత్రునిపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఏటీఎంల్లో చోరీలకు పాల్పడి నగదు అపహరించారు. డూప్లికేట్ తాళాలతో ఏటీఎం సేఫ్ డోర్ను తెరచి డిస్పెన్సర్ డోర్ వద్ద స్టిక్కర్ను డబుల్ టేప్తో అతికిస్తారు. దీంతో కస్టమర్లు విత్డ్రా చేసిన నగదు బయటకు రాకుండా అందులోనే నిలిచిపోతుంది. కస్టమర్ లావాదేవీలు జరిపి నగదు రాలేదని భావించి వెళ్లిపోయిన తరువాత నిందితులు ఏటీఎంలోకి ప్రవేశించి అతికించిన టేపును తొలగించి డోర్ తెరచి ఇరుక్కొని ఉన్న నగదును తీసుకొని తిరిగి మళ్లీ అదే డోర్కు టేపు అంటిస్తారు. ఈ విధానం ద్వారా వారు చోరీలకు పాల్పడుతున్నారు. దీన్ని అనుసరించి పరవాడ అయ్యబాబు కాంప్లెక్స్ ఏటీఎంలో రూ.10 వేలు, దేశపాత్రునిపాలెం ఏటీఎంలో రూ.4,200 నగదును అపహరించారు. ఈ చోరీలపై హిటాచి కంపెనీ చానల్ ఎగ్జిక్యూటివ్ కంఠంరెడ్డి సోమునాయుడు ఈ నెల 28న పరవాడ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్లు, బ్యాంకు లావాదేవీల ఆధారంగా పరవాడ సబ్స్టేషన్ వద్ద శనివారం తనిఖీలు జరుపుతుండగా.. నిందితులను గుర్తించామని చెప్పారు. వారి నుంచి రూ.8,800 నగదు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని అనకాపల్లి 11వ అడిషినల్ మున్సిపల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించడంతో అనకాపల్లి సబ్జైలుకు తరలించినట్లు సీఐ చెప్పారు. కేసును ఛేదించిన పరవాడ పోలీసులను అనకాపల్లి డీఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. -
కూత ఉత్కంఠగా..
విశాఖ స్పోర్ట్స్: విశాఖ పోర్టులో శుక్రవారం రాత్రి ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఆరంభమైంది. అభిమానుల కోలాహలం, సందడి వాతావరణం మధ్య జరిగిన తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 38–35 తేడాతో తెలుగు టైటాన్స్పై ఉత్కంఠ విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డాయి. ప్రోకబడ్డీ లీగ్ 12వ సీజన్ను తమిళ్ తలైవాస్ జట్టు విజయంతో ప్రారంభించింది. మ్యాచ్ ఆఖరి క్షణంలో తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ తన మాజీ జట్టుపై చేసిన సూపర్ రైడ్తో విజయం సాధించారు. ఒక దశలో టైటాన్స్ 27–20 ఆధిక్యంతో విజయం సాధించేలా కనిపించినా, చివరిలో తడబడింది. తలైవాస్ తరఫున స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ 12 పాయింట్లతో సూపర్ టెన్ సాధించాడు. తెలుగు టైటాన్స్ జట్టులో ఆల్రౌండర్ భరత్ 11 పాయింట్లతో రాణించినా ఫలితం దక్కలేదు. కెప్టెన్ విజయ్ మాలిక్ 6 పాయింట్లు, డిఫెండర్ శుభం షిండే 4 పాయింట్లు సాధించారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన జాతీయగీతాలాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, ఐపీఎల్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, హాకీ ఆటగాడు ధన్రాజ్ పిళ్లై తదితరులు పాల్గొన్నారు. శనివారం తెలుగు టైటాన్స్ జట్టు యూపీ యోధాస్తో తలపడనుంది. శనివారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో తెలుగు టైటాన్స్ తలపడనుండగా మరో పోటీలో యు ముంబా జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. మరో మ్యాచ్లో బెంగళూర్ బుల్స్ జట్టుపై పునేరి పాల్టన్ జట్టు విజయం సాధించింది. -
ఫైర్ సర్వీస్ పోర్టల్ ప్రారంభం
అల్లిపురం: సవరించిన అగ్నిమాపక సేవల శాఖ వెబ్సైట్, ఆన్లైన్ ఫైర్ సర్వీస్ (ఎన్ఓసీ) పోర్టల్ను హోం మంత్రి అనిత ప్రారంభించారు. ఎంవీపీ కాలనీలోని హెచ్హెచ్ఎం బేస్ క్యాంపులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, కొత్త పోర్టల్ పౌరులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఇకపై పౌరులు ప్రొవిజనల్, ఆక్యుపెన్సీ, పునరుద్ధరణ (రిన్యూవల్), ఎన్వోసీల కోసం అగ్నిమాపక శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వివరించారు. ఈ సర్టిఫికెట్లు ఏపీ ఫైర్ యాక్ట్ 1999, ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్బీసీ 2016) ప్రకారం స్వయంచాలకంగా జారీ అవుతాయన్నారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పి. వెంకట రమణను ఆమె అభినందించారు. కార్యక్రమంలో ప్రాంతీయ అగ్నిమాపక అధికారి డి. నిరంజన్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
జనసైనికుల ముష్టి యుద్ధం
విశాఖ సిటీ: జనసైనికుల మధ్య జరిగిన ముష్టి యుద్ధం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశ సమయంలోనే ఇద్దరు జన సైనికులు పిడుగుద్దులు కురిపించుకోవడం హాట్ టాపిక్గా మారింది. జనసేనాని పవన్ ప్రొటోకాల్ చైర్మన్పైనే తీవ్ర ఆరోపణలు ఆ పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. తక్కువ ధరకే ఫ్లాట్ల విక్రయాల పేరుతో డబ్బు వసూలు చేసి వాటిని ఎక్కువ ధరకు వేరొకరికి అమ్మి సొమ్ముచేసుకున్నాడని పవన్ సన్నిహితుడిని సమావేశంలోనే చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని గురువారం బీచ్ రోడ్డులోని వైఎంసీఏ పక్కన ఉన్న ఒక హోటల్లో నిర్వహించారు.దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సమావేశం జరిగే హోటల్లోనే పవన్కల్యాణ్ ప్రొటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు, కాకినాడ జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ప్రసాద్ మధ్య తీవ్ర స్థాయిలో కొట్లాట జరిగినట్లు సమాచారం.రూ.కోట్లకు కుచ్చుటోపిగత ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు ప్రొటోకాల్ చైర్మన్గా బిల్డర్ అయిన మల్లినేడి తిరుమలరావు అలియాస్ బాబీకి బాధ్యతలు అప్పగించారు. ఆ యాత్ర తర్వాత అతడి పదవి, హోదాపై స్పష్టత లేనప్పటికీ.. ఇప్పటికీ పవన్ పర్యటన బాధ్యతలు తానే చూసుకుంటున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వృత్తిరీత్యా బిల్డర్ అయిన తిరుమలరావు భీమవరంలో వెంకటసాయి బిల్డర్స్ పేరుతో భారీ అపార్ట్మెంట్ నిర్మించి అనేక మందిని మోసం చేసినట్లు బాధితులు ఇప్పటికే కోర్టులో కేసులు సైతం వేశారు. అపార్ట్మెంట్ నిర్మాణ సమయంలో ఒకేసారి క్యాష్ ఇస్తే రూ.25 లక్షలకే ఫ్లాట్ ఇస్తానని చెప్పి అనేక మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇలా డబ్బు తీసుకున్న వారికి కాకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత ఫ్లాట్లను అధిక ధరకు విక్రయించినట్లు చెబుతున్నారు. దీనిపై రూ.25 లక్షలు ఇచ్చిన వారు తిరుమలరావును ఏళ్లుగా అడుగుతున్నప్పటికీ.. పవన్ కల్యాణ్కు ఫండింగ్ చేశానని, ఆ డబ్బులు తిరిగి వచ్చిన వెంటనే ఇచ్చేస్తానని ఒకసారి, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి బినామీని అని త్వరలోనే అందరికీ ఇచ్చేస్తానని మరోసారి చెబుతూ తప్పించుకుని తిరుగుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ప్రసాద్ అనే వ్యక్తి నుంచి చేబదులు కింద రూ.40 లక్షలు తీసుకుని రెండేళ్లుగా ఇవ్వకుండా తిప్పుతున్నట్లు సమాచారం.సమావేశంలో చితక్కొట్టిన బాధితుడుజనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రొటోకాల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న తిరుమలరావును జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ప్రసాద్ పట్టుకున్నాడు. తన డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరగడంపై నిలదీశాడు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తిరుమలరావును కోపంతో చితక్కొట్టేశాడు. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల సమక్షంలో తీవ్ర స్థాయిలో కొట్లాట జరిగింది.అందులో చాలా మంది తిరుమలరావు వ్యవహారం తెలియడంతో వారు కల్పించుకోలేదు. కొంతమంది మాత్రం వ్యక్తిగత వ్యవహారాలు బయట చూసుకోవాలని సమావేశంలో కాదని వారిని వారించే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రసాద్ మండిపడుతూ పవన్ కల్యాణ్కు ప్రొటోకాల్ చైర్మన్ అని చెప్పుకుంటున్న తిరుమలరావు పార్టీ సభ్యుడు కాదా? అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తికి కీలకమైన బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించడంతో ఎవరూ నోరెత్తలేకపోయారు. ప్రసాద్ తనను తీవ్రంగా కొట్టినట్లు తిరుమలరావు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే తిరుమలరావు వ్యవహార శైలి తెలిసిన ఎమ్మెల్యేలు ఆ కేసు తీసుకోవద్దని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని బాధితులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే తిరుమలరావు వ్యవహారం పవన్కు తెలిసినప్పటికీ.. ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు వాపోతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. -
ఏ సమస్య అయినా ఏఐతో పరిష్కారం
మధురవాడ: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైయేంట్ లిమిటెడ్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఐ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సాంకేతిక పరిజ్ఞానం జీవితంలో తీసుకువచ్చే మార్పుల గురించి వివరించారు. ఏఐ, స్టెమ్, రోబోటిక్స్ టూల్స్తో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఆయన పరిశీలించి, అభినందించారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థినులు అరుణశ్రీ, భాగ్యలక్ష్మిలు రూపొందించిన ‘స్మార్ట్ ఫార్మింగ్’ ప్రాజెక్టును ఆసక్తిగా తిలకించారు. పాఠశాల మైదానం బురదమయంగా ఉండడం గతంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా ఈ సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదిలావుండగా పాఠశాల ప్రాంగణంలో టీడీపీ జెండాలు, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. టీడీపీ కార్పొరేటర్లను లోపలికి వెళ్లనీయకుండా సెక్యూరిటీ బైటకి తోసేయడంతో వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గంటా శ్రీనివాసరావు కొద్ది సేపటి తర్వాత వచ్చి కార్పొరేటర్లను లోపలికి తీసుకు వెళ్లారు. కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, గాదే శ్రీనువాసులు నాయుడు, ఆర్జేడీ విజయభాస్కర్, డీఈవో ప్రేమకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభం
ఏయూక్యాంపస్ : బీచ్రోడ్డులో శుక్రవారం హాప్ ఆన్–హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి కొద్ది దూరం ప్రయాణించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు దాదాపు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఈ బస్సులు తిరుగుతాయి. నగరానికి వచ్చే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించే విధంగా బస్సు ప్రయాణం ఉంటుందన్నారు. ఈ బస్సుల్లో ప్రాథమికంగా 24 గంటల ప్రయాణానికి రూ.500 ఉండగా టికెట్ చార్జీలో సగం మొత్తాన్ని ప్రభుత్వం భరించనుందన్నారు. విశాఖ ఆర్థిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్గా ఎదుగుతోందన్నారు. విశాఖలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీబాల వీరాంజనేయ స్వామి, హోం మంత్రి అనిత, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ శ్రీ భరత్, స్పెషల్ చీఫ్సెక్రటరీ అజయ్ జైన్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు షర్టుకు హాప్ ఆన్–హాప్ ఆఫ్ బ్యాడ్జిని జీవీఎంసీ కమిషనర్ కేతన్ అతికించారు. -
జనసేనలో అసంతృప్తి జ్వాలలు
విశాఖ సిటీ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. కూటమి ప్రభుత్వంలో తమకు విలువ లేకుండా పోయిందని పార్టీ నేతలు ఆక్రోశం వెళ్లగక్కారు. ఎమ్మెల్యేలు, అధికారులు తమను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తే.. అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టేశారని అధినేతనే నిలదీశారు. తమకు పదువులే కాదు.. కనీసం గుర్తింపు కూడా లేదని వాపోయారు. వారిని సముదాయించడానికి పవన్ కల్యాణ్ కిందా మీదా పడాల్సి వచ్చింది. జనసేన ప్లీనరీ సందర్భంగా రెండు రోజులుగా విశాఖలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా భేటీ అయ్యారు. ఇందులో నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో తమ పరిస్థితులను, కష్టాలను అధినేత దృష్టికి తీసుకువెళ్లారు.జనసైనికులు, వీర మహిళలే పార్టీకి బలంజనసేన పార్టీ సైద్ధాంతిక భావజాలాన్ని నమ్మిన జనసైనికులు, వీర మహిళలే పార్టీకి బలమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఇచ్చే బలంతోనే జనసేన జాతీయ పార్టీ స్థాయికి ఎదిగేలా పనిచేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సిద్ధాంతాన్ని నమ్మే సమూహం కావాలని పిలుపునిచ్చారు. సినిమా అభిమాన బలాన్ని రాజకీయంగా వ్యవస్థీకృతం చేయాలి. ఎవరో ఒకరికి బాధ్యత అప్పగించడం తన ఉద్దేశం కాదని, పార్టీని సంస్థాగతంగా ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నామని చాలా మంది అడుగుతున్నారన్నారు. కానీ జనసేనను భుజాన వేసుకుంటూ మోస్తున్నది జనసైనికులు, వీరమహిళలే అన్నారు. కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.కూటమిలో విలువ లేదు..కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలు, కార్యకర్తలకు కనీసం విలువ లేకుండా చేస్తున్నారని కొందరు అధినేతకు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే వారి స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని, తమను కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అధికారులు సైతం తమకు విలువ ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడితే ఇప్పటి వరకు పదవులు లేవని, గుర్తింపు కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతోందని, దీని నుంచి బయట పడే విషయంపై పార్టీ పెద్దలు దృష్టిసారించాలని సూచించినట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీ ఇంకా ఎదగాలని, ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా ఆ ప్రభావం పార్టీపై కూడా పడుతోందని, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ప్రమాదముందని హెచ్చరించినట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న నేతలు, కార్యకర్తలకు అధినేత పవన్ సర్ధిచెప్పడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. -
అయిపోయిన పెళ్లికి బాజాలు
విశాఖ సిటీ : కూటమి ప్రభుత్వంలో ప్రారంభోత్సవాలన్నీ అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్లే ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ కూటమి ప్రభుత్వమే చేపట్టినట్లు కలరింగ్ ఇస్తోంది. నెలల క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాల పేరిట హడావుడి చేస్తుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా బీచ్ రోడ్డులో లుంబినీ పార్క్ ఎదురుగా పర్యాటక శాఖకు చెందిన యాత్రీ నివాస్ ప్రారంభోత్సవంలోను అదే పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.12.3 కోట్లతో యాత్రీ నివాస్ భవన నిర్మాణాలు చేపట్టగా అప్పట్లో 85 శాతం పనులు పూర్తయ్యాయి. దేశ విదేశీ పర్యాటకులకు వారి అభిరుచులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలతో నిర్మాణాలు ఎన్నికల సమయానికే దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. స్టార్ హోటల్స్కు ధీటుగా చేపట్టిన భవన నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక నెమ్మదించాయి. మొత్తం 4 అంతస్తుల భవనంలో 46 గదులు, రెస్టారెంట్ ఉన్న ఈ పర్యాటక హోటల్ను ప్రైవేటుకు ఇచ్చేందుకు ఇప్పటికే టెండర్లు సైతం ఆహ్వానించారు.బుకింగ్లు మొదలయ్యాక ప్రారంభోత్సవమంట..యాత్రీ నివాస్లో 42 ఏసీ గదులు ఉన్నాయి. వీటిని ఏసీ సూట్, ఏసీ డీలక్స్, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్లుగా విభజించారు. ఇందులో ఇప్పటికే బుకింగ్లు కూడా ప్రారంభించారు. ఇద్దరు టూరిస్టులకు ఏసీ సూట్ రూమ్ డిమాండ్ను బట్టి రూ.3,750 నుంచి రూ.4,200, ఏసీ డీలక్స్ రూ.4,625 నుంచి రూ.5,180 వరకూ, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్కి రూ.3,125 నుంచి రూ.3,500(ట్యాక్స్ అదనం) వరకూ వసూలు చేస్తున్నారు. రూమ్లతో పాటు అత్యాధునిక వసతులతో రెస్టారెంట్, బార్, వెయిటింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్ మొదలైనవి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎక్కువగా పశ్చిమబెంగాల్, ఒడిశాతో పాటు ఉత్తరభారత దేశానికి చెందిన పర్యాటకులు బస చేస్తున్నారు. బుకింగ్ ప్రారంభించిన వారాల తర్వాత ఇప్పుడు ఈ హోటల్ను ప్రారంభించడానికి రాష్ట్ర పర్యాటక శాఖ కందుల దుర్గేష్ వస్తున్నారు. శనివారం ఆయన చేతుల మీదుగా యాత్రీ నివాస్ ప్రారంభోత్సవానికి హడావుడి చేస్తున్నారు. అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్లు.. బుకింగ్లు ప్రారంభమయ్యాక కూడా మంత్రి దుర్గేష్ ప్రారంభోత్సవానికి రావడం పట్ల పర్యాటక శాఖలో సిబ్బందే విస్తుపోతున్నారు. -
ఎన్టీపీసీ సీఎండీకి ఎక్స్లెన్స్ అవార్డు
పరవాడ: స్థిరమైన విద్యుత్ ఉత్పత్తిలో ఎన్టీపీసీని అగ్రగామిగా నిలపడంలో విశేష కృషి జరిపిన ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్కు ఎక్స్లెన్స్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శుక్రవారం జరిగిన స్కోప్ ఎమినెన్స్ ఆవార్డుల కార్యక్రమంలో ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్కు వ్యక్తిగత నాయకత్వ ఎక్స్లెన్స్ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఎన్టీపీసీ ఇంధన పరివర్తనను నడిపించడంలోను.. దాని క్లీన్ ఎనర్జీ పోర్ట్పోలియోను బలోపేతం చేయడంలోను.. స్థిరమైన విద్యుదుత్పత్తిలో కంపెనీని అగ్రగామిగా నిలబెట్టడడంలో గుర్దీప్ సింగ్ చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. -
ప్రతిభ కనబర్చిన డ్రైవర్లు, కండక్టర్లకు మెరిట్ సర్టిఫికెట్లు
సింహాచలం: ఆంధ్రప్రదేశ్లో ‘సీ్త్రశక్తి’ పథకం ఎటువంటి సమస్యలు లేకుండా విజయవంతంగా కొనసాగుతోందని, ఈ విజయం ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యానిది, కార్మికులది అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండలిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సింహాచలంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో శుక్రవారం సీసీ కెమెరాలు, తాగునీటి శుద్ధి పరికరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అనంతరం జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లకు మంత్రి మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసి విజయనగరం ఈడీ కె.బ్రహ్మానందరెడ్డి, విశాఖ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు, సింహాచలం డిపో మేనేజర్ శరత్బాబు, చీఫ్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి పాల్గొన్నారు. -
కీచక లెక్చరర్కు రిమాండ్
పరవాడ: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్న గుత్తుల శ్రీధర్(56) కళాశాలలో ఇంటర్ సెకండియర్ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. ఈ నెల 23న మధ్యాహ్నం కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీధర్ సైన్స్ ల్యాబ్కు విద్యార్థినిని పిలిపించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు, విద్యార్థినుల వాగ్మూలం ఆధారంగా లెక్చరర్పై 24న కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. అనంతరం అనకాపల్లి అడిషినల్ మున్సిప్ కోర్టులో హాజరు పర్చగా ప్రధాన న్యాయమూర్తి వచ్చే నెల 12 వరకు రిమాండ్ విధించగా..అనకాపల్లి సబ్ జైలుకు తరలించినట్టు సీఐ వెల్లడించారు. కేసును పరవాడ మహిళా ఎస్ఐ జీవీఎస్ మహాలక్ష్మి దర్యాప్తు చేశారు. -
వారు మరణించి.. కొందరికి వెలుగునిచ్చి
పెందుర్తి: పుట్టెడు దుఃఖంలోనూ పలు కుటుంబాలు మానవత్వం చాటుకున్నాయి. పెందుర్తిలోని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ చొరవతో కొందరి జీవితాలకు వెలుగురానుంది. పెందుర్తి, చినముషిడివాడ, చింతలగ్రహారం ప్రాంతాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి నేత్రాలను ఆయా కుటుంబాలు దానం చేశాయి. వివరాలివి..చినముషిడివాడలో..స్థానిక శతాబ్దినగర్లో నివాసం ఉంటున్న అడబాల అప్పలనర్సమ్మ(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించింది. విషయం తెలుసుకున్న ట్రస్ట్ అధ్యక్షుడు దాడి శ్రీనివాస్ అక్కడకు చేరుకుని స్థానికులు మెంటి మహేష్, చిట్టిబోయిన గౌరి చొరవతో నేత్ర దానం కోసం కుటుంబ సభ్యులను ఒప్పించారు. దీంతో అప్పలనర్సమ్మ కుమారులు అడబాల ఎర్రినాయుడు, సత్యనారాయణ అంగీకారం తెలిపారు.చింతలగ్రహారంలో..గ్రామంలో నివాసం ఉంటున్న ఆడారి అప్పారావు(50) ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీనివాస్ మృతుని బంధువు భీశెట్టి శంకర్ చొరవతో కుటుంబ సభ్యులను నేత్రదానానికి ప్రతిపాదించగా.. అప్పారావు భార్య ఆడారి సూర్యకాంతం, కుమారులు శంకర్, రాము, కుమార్తెలు నాగమణి, వెన్నెల జ్యోతి ఆమోదించారు.ప్రశాంతినగర్లో..కాలనీలో నివాసం ఉంటున్న కందాల అరుణకుమారి(56) అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న సాయి ట్రస్ట్ ప్రతినిధులు నేత్రాదానానికి ఒప్పించగా.. భర్త బుచ్చి రమణ, కుమారుడు సాయిభరత్కుమార్ అంగీకారం తెలిపారు. ఆయా మృతుల నేత్రా(కార్నియా)లను మొహిషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధి మనోజ్ సేకరించారు. ఆయా కుటుంబాల మానవత్వానికి స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.అప్పలనర్సమ్మ, అప్పారావు, అరుణకుమారి (ఫైల్) -
మహిళా క్రికెట్ జట్టుతో లోకేష్ చిట్చాట్
విశాఖ స్పోర్ట్స్: మహిళల ప్రపంచకప్లో పాల్గొనే భారత మహిళా క్రికెట్ జట్టు విశాఖ వేదికగా శిక్షణా శిబిరంలో పాల్గొంటుంది. శుక్రవారం మంత్రి నారా లోకేష్ జట్టు సభ్యులతో చిట్చాట్ చేశారు. ఉమ్మడి ఏపీ అంతర్జాతీయ పోటీలకు వేదికగా నిలిచిందన్నారు. క్రీడల్ని ప్రోత్సహించేందుకు మూడు శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా క్రీడాకారిణులతో అన్నారు. జట్టు సభ్యులకు శుభాకాంక్షలందించారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ క్రీడల్లో భారతీయ మహిళల సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు. -
బస్సులపై భారం.. ప్రాణాలతో చెలగాటం
తాటిచెట్లపాలెం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సీ్త్ర శక్తి’ పథకం ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారింది. శుక్రవారం విశాఖలో జరిగిన బస్సు ప్రమాదం.. ఈ ఆందోళనను మరింత పెంచింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ప్రయాణికులతో పాటు ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో బస్సుల సామర్థ్యానికి మించి ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి బస్సుల నిర్వహణపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. తగినన్ని బస్సులను నడపకుండా, ఉన్న బస్సులపైనే భారం మోపడం వల్ల, అవి త్వరగా పాడైపోతున్నాయి. సరైన నిర్వహణ లేకపోవడం, అధిక భారం వల్ల ఇంజిన్లు వేడెక్కడం వంటి సమస్యలు తలెత్తి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. విశాఖలో బస్సు దగ్ధమైన ఘటన ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ సంఘటన ఉచిత బస్సు ప్రయాణంపై ప్రజలు, ముఖ్యంగా మహిళలు పునరాలోచించుకునేలా చేసింది. క్షణాల్లో అగ్నికీలలు.. బస్సు దగ్ధం ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై విశాఖ–విజయనగరం మెట్రో బస్సులో శుక్రవారం పొగలు వచ్చాయి. ఆటో డ్రైవర్.. కండక్టర్కు సమాచారం ఇవ్వడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. దీంతో ప్రయాణికులందరూ తక్షణమే బస్సులో నుంచి దిగిపోయారు. కొన్ని క్షణాల్లోనే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదాలకు కారణం.. అధికారుల నిర్లక్ష్యం? సామర్థ్యానికి మించి ప్రయాణించడం, బస్సుపై అధిక ఒత్తిడి పడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఉచిత బస్సు పథకం ప్రారంభించినప్పుటి నుంచి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించకపోతే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్నా.. ఆ సమయంలో ఇక్కడే విధి నిర్వహణలో ఉన్నాను. అకస్మాత్తుగా బస్సులో నుండి పొగలు, మంటలు రావడంతో వెంటనే అఽగ్ని మాపక సిబ్బందికి, ఉన్నతాధికారులకు సమాచారం అందించాను. ప్రయాణికులందర్నీ దూరంగా వెళ్లిపోవాలని ఆదేశించాను. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. – బంగారుబాబు, ఫోర్త్టౌన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్ధమైన బస్సు -
కబడ్డీ.. కబడ్డీ
విశాఖ స్పోర్ట్స్: కబడ్డీ.. కబడ్డీ అంటూ కొదమ సింహాల్లా బరిలో నిలిచే ప్లేయర్లు సిద్ధమయ్యారు. అదరగొట్టే యాక్షన్ మొదలుకాబోతోంది. కబడ్డీ ప్రేమికులను ఉత్కంఠతో నిలబెట్టే ప్రో కబడ్డీ సీజన్–12 విశాఖ వేదికగా శనివారం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా గురువారం 12 జట్ల కెప్టెన్లు ట్రోఫీతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. పోటీకి సై అంటూ తొడకొడుతూ సవాల్ విసిరారు. ప్రముఖ క్రియెటర్లతో కలిసి మ్యాట్ మావెరిక్స్, రైడ్ మాస్టర్లు పేరిట రెండు జట్లుగా విడిపోయి కబడ్డీ ఆడారు. విశాఖ వేదికగా శుక్రవారం రాత్రి 8 గంటలకు తెలుగు టైటాన్స్–తమిళ్ తలైవాస్ మధ్య మ్యాచ్తో లీగ్ ఆరంభంకానుంది. ఈసారి ప్రో కబడ్డీ ఫార్మాట్లో మార్పులు చేశారు. తొలిసారిగా జట్లు రెండు గ్రూపుల్లో ఆడనున్నాయి. తెలుగు టైటాన్స్ జట్టు ‘బి’ గ్రూప్లో ఉంది. ప్రతి జట్టు లీగ్ దశలో 18 మ్యాచ్లు ఆడుతుంది. ప్లే–ఆఫ్స్తో పాటు ‘ప్లే–ఇన్లు’ కూడా ప్రవేశపెట్టారు. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే–ఇన్లు, ప్లే–ఆఫ్స్ ఆడతాయి. ఫలితం తేలని మ్యాచ్ల్లో విజేతను నిర్ణయించడానికి ‘గోల్డెన్ రైడ్’ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ కొత్త ఫార్మాట్ భవిష్యత్తులో మరిన్ని లీగ్లలో అనుసరించవచ్చని ప్రో కబడ్డీ ఛైర్మన్ అనుపమ్ గోస్వామి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ సీజన్ ప్రారంభం కావడం విశేషం. గురువారం అంతర్జాతీయ క్రీడాకారుడు రాహుల్ చౌదరి వంటి వారిని సత్కరించారు. అలాగే సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్లు ఐఎన్ఎస్ కురుసురను సందర్శించి సాయుధ దళాలకు నివాళులర్పించారు. ప్రో కబడ్డీ లీగ్–12ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. ఈ సీజన్ టికెట్లను జొమాటో డిస్ట్రిక్ట్లో అందుబాటులో ఉంచారు. -
భక్తి ముసుగులో అక్రమ వసూళ్లు
గాజువాక : పాత గాజువాక లంకా మైదానంలో ఎస్వీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహం వద్ద నిర్వాహకులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. సుందర వస్త్ర మహాగణపతి దర్శనానికి విచ్చేసిన భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు విగ్రహం వద్దకు వచ్చి దర్శనాలను కొద్దిసేపు నిలిపివేశారు. ఆంక్షలకు తూట్లు పొడుస్తూ ఉత్సవ నిర్వాహకులు దర్శనానికి వచ్చేవారి నుంచి టికెట్ల పేరుతో వసూళ్లకు పాల్పడటంతో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. భారీ వినాయకుడి మండపం వద్ద అర్చనలు, అన్న సమారాధన, వాహనాల పార్కింగ్, చెప్పులు భద్రపరచడం వంటి పేర్లతో వ్యాపారానికి తెరలేపడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వినాయక మండపాల వద్ద కమర్షియల్ టికెట్లు ఉండకూడదని పెట్టిన నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని గాజువాక సీఐ పార్థసారథి హెచ్చరించారు. లంకా మైదానంలోని గణపతి మండపం వద్ద దారుణం -
తొట్లకొండకు చేరుకున్న సైకిల్ యాత్ర
కొమ్మాది: శాంతి, ఐక్యత, సోదరభావం అనే సందేశాన్ని వ్యాప్తి చేస్తూ భారత త్రివిధ దళాల బృందం చేపట్టిన ‘లార్డ్ బుద్ధ సర్క్యూట్ మోటార్ సైకిల్ యాత్ర’ ప్రముఖ పర్యాటక కేంద్రమైన తొట్లకొండకు చేరుకుంది. ఈ యాత్ర బృందానికి పర్యాటక శాఖ అధికారిణి మాధవి సాదర స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. బృంద సభ్యుడు రాహుల్ పాటిల్ మాట్లాడుతూ ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదని, దేశాల మధ్య స్నేహాన్ని, బౌద్ధ వారసత్వాన్ని గుర్తుచేసుకునే ఒక గొప్ప యాత్ర అని తెలిపారు. శాంతి, ఐక్యత, సోదరభావాల ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకే ఈ యాత్రను చేపట్టామని ఆయన వివరించారు. -
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కోస్టల్ బ్యాటరీ, నోవాటెల్, రాడిసన్ బ్లూ రిసార్ట్లలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కలెక్టర్ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. నొవాటెల్లో జరిగే ఫుడ్ మానుఫ్యాక్చరింగ్ సమ్మిట్, రాడిసన్ బ్లూ రిసార్ట్లో జరిగే గ్రిఫిన్ నెట్వర్కింగ్ మీటింగ్ ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. హెలిప్యాడ్, గ్రీన్ రూమ్, సీటింగ్ వంటి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు.విద్యుత్, వైద్య, పారిశుద్ధ్య పనులలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగు హాలులో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జీఎం హనుమా నాయక్, ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ అన్షుమలి బాజ్ పాయి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్లతో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై సమీక్షించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, కష్ణకాంత్ పాటిల్, డీఎఫ్వో రేణుకయ్య, పాల్గొన్నారు. -
జింక్ గేటు సమీపంలో కారు దగ్ధం
మల్కాపురం : జింక్ గేట్ సమీపంలో గురువారం ఉదయం ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు యజమాని కారును స్టార్ట్ చేస్తున్న సమయంలో ఇంజిన్ నుంచి నల్లటి పొగ వచ్చి, అనంతరం మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే కారు దిగిన యజమాని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఏడు రోజులుగా కారు అక్కడే నిలిపి ఉంచినట్లు సమాచారం. అటుగా వెళ్తున్న వాహనదారులు మంటలను చూసి భయాందోళనలకు గురయ్యారు. కొంతమంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు 60 శాతం కాలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
2 నుంచి సింహగిరిపై పవిత్రోత్సవాలు
సింహాచలం: సింహగిరిపై వచ్చే నెల 2 నుంచి 6 వరకు పవిత్రోత్సవాలను విశేషంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. 2వ తేదీ సాయంత్రం 6 నుంచి రుత్విక్వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 3న ఉదయం 7 గంటల నుంచి శాంతిపాఠం, పవిత్రాధివాసం, యాగశాలార్చన, కుంభవాహనం, చక్రాబ్జమండలరచనం, పవిత్రప్రతిష్ట, సాయంత్రం 5 నుంచి గ్రామతిరువీధి ఉంటాయన్నారు. 4న ఉదయం విశేష ఆరాధన, హోమాలు, పారాయణాలు, సాయంత్రం తిరువీధి, రాత్రి పవిత్ర సమర్పణ నిర్వహించనున్నట్లు తెలిపారు. 5న ఉదయం పూర్ణాహుతి, పవిత్ర విసర్జనం, గ్రామతిరువీధి, 6న ఉదయం ఏకాంతస్నపనంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 2 నుంచి 6 వరకు నిత్యకల్యాణంతో పాటు అన్ని ఆర్జిత సేవలు బంద్ చేసినట్లు తెలిపారు. -
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
ఉక్కునగరం: డీఎస్సీ–2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. డీఈవో ఎన్.ప్రేమ్కుమార్ ఆధ్వర్యంలో విశాఖ విమల విద్యాలయం పాఠశాలలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన అభ్యర్థులు హాజరయ్యారు. పరిశీలన కోసం పాఠశాలలో 24 రూమ్లను ఒక్కో రూమ్కు 50 చొప్పున 815 అభ్యర్థులకు కేటాయించారు. ప్రతీ రూమ్లో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారి, ఎంఐఎస్ కోఆర్డినేటర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో కూడిన బృందం సర్టిఫికెట్లను పరిశీలించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం వచ్చిన ఒక మహిళా అభ్యర్థి తమ తండ్రి కుల ధృవీకరణ పత్రం తేవడంతో భర్త కుల ధృవీకరణ పత్రం తేవాలని చెప్పి సమర్పించడానికి కొంత వ్యవధి ఇచ్చారు. సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం జరగనుంది. వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లా నేతలకు చోటు విశాఖ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలకు చోటు దక్కింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. గాజువాకకు చెందిన చెరుకూరి హరీష్వర్మను రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగాను, విశాఖ ఉత్తర నుంచి బయ్యవరపు రాధాను రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షురాలుగా, విశాఖ దక్షిణ నుంచి కణితుముచ్చు సాగర్ను రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా నియమించారు. స్టీల్ప్లాంట్ ఫైనాన్స్ డైరెక్టర్గా వినయ్కుమార్ ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ నూతన డైరెక్టర్ (ఫైనాన్స్)గా సెయిల్ కార్పొరేట్ ఆఫీస్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ వినయ్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో బుధవారం సెర్చ్ కమ్ సెలక్షన్ కమీటీ (ఎస్సీఎస్సీ) నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 13 మంది అభ్యర్ధులను పరిశీలించారు. విశాఖ స్టీల్ప్లాంట్ నుంచి నలుగురు. సెయిల్ నుంచి ఏడుగురు, ఎన్ఎండీసి, ఎన్సీఎల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున వచ్చిన దరఖాస్తులో వినయ్ కుమార్ను ఎంపిక చేసినట్టు ప్రకటించారు. -
ఈఎస్ఐ స్ప్రీ–2025 పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
సీతంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్’(స్ప్రీ) 2025 పథకాన్ని సంస్థలు, కర్మాగారాలు సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ఐ కార్పొరేషన్ గాజువాక బ్రాంచి మేనేజర్ లెంకా కృష్ణ ప్రసాద్ కోరారు. లారస్ ల్యాబ్స్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈఎస్ఐ చట్ట పరిధిలో నమోదు కాని సంస్థల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. పథకం జూలై 1 డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కాలంలో నమోదు చేసుకునే సంస్థలు, వారు ప్రకటించిన తేదీ నుంచి మాత్రమే చందా చెల్లిస్తే సరిపోతుంది. అంతకు ముందు కాలానికి సంబంధించిన చందా కట్టనవసరం లేదు.నమోదుకు ముందు కాలానికి సంబంధించిన క్లెయిమ్లు, తనిఖీలు ఉండవు. ఈఎస్ఐలో నమోదు కాని ఉద్యోగులు కూడా ఈ పథకం ద్వారా నమోదు చేసుకోవచ్చునన్నారు. వారికి చందా, లాభాలు యాజమాన్యం ప్రకటించిన తేదీ నుంచి వర్తిస్తాయన్నారు. -
ఫ్లెక్సీలో ఎంపీ భరత్ ఫొటో లేపేశారు
తగరపువలస: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ ఎం. శ్రీభరత్ల మధ్య వివాదం ముదురుతోంది. మధురవాడ వి కన్వెన్షన్లో సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా నిర్వహించిన ‘సీ్త్రశక్తి’ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఫొటోలు ఫ్లెక్సీల మీద లేకపోవడం ఈ వివాదానికి కారణమైంది. టీడీపీకి చెందిన ఎంపీ, జిల్లా అధ్యక్షుడి ఫొటోలను ప్రోటోకాల్ ప్రకారం ఫ్లెక్సీలపై వేయకపోవడంపై స్థానిక మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదం కొత్తదేమీ కాదు. ఇటీవల భీమిలి జీవీఎంసీ జోన్ 2, 3 వార్డుల అధ్యక్షుల నియామకంలోనూ స్థానిక నాయకులు గంటా శ్రీనివాసరావుతో విభేదించారు. అప్పట్లో వారంతా ఎంపీ శ్రీభరత్, జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీని కలిసి తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఆ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు కనిపించినా, తాజాగా జరిగిన ఫ్లెక్సీ వివాదం మరోసారి విభేదాలను బహిర్గతం చేసింది. కాగా ఎంపీ శ్రీభరత్ తోడల్లుడు, మంత్రి నారా లోకేష్ శుక్రవారం మధురవాడలో పర్యటించనున్నారు. ఈ ప్రోటోకాల్ వివాదాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని భీమిలి నాయకులు సిద్ధమవుతున్నారు. మరోసారి బయటపడ్డ గంటా–భరత్ మధ్య విభేదాలు -
మంత్రి గారూ.. ఇదీ పంచాయతీ తీరు..!
మహారాణిపేట : జిల్లాలోని పంచాయతీలు తీవ్ర నిధుల కొరతతో కుదేలవుతున్నాయి. ప్రత్యేక నిధులు మంజూరైతే తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేని దయనీయమైన పరిస్థితి నెలకొంది. రోజువారీ నిర్వహణకు కూడా నిధులు లేక సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. కొత్త వీధిదీపాలు, పైప్లైన్ల మరమ్మతులకు అవసరమైన విడి భాగాలు అప్పు చేసి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తక్షణమే జోక్యం చేసుకుని నిధులు విడుదల చేయాలని సర్పంచులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 79 పంచాయతీలు – పద్మనాభం మండలం రెడ్డిపల్లిలోని మేజర్ పంచాయతీతో పాటు పెందుర్తి (15), భీమిలి (16), ఆనందపురం (26), పద్మనాభం (22)లోని పంచాయతీలు – ప్రధానంగా 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్స్పై ఆధారపడి ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసినప్పటికీ, కూటమి ప్రభుత్వం వాటిని మళ్లించిందని తెలుస్తోంది. దీంతో పంచాయతీలకు రావాల్సిన రూ.3.60 కోట్లు ఇంకా అందలేదు. ఈ నిధులను జనాభా ప్రాతిపదికన, ఒక్కో వ్యక్తికి రూ.600 చొప్పున కేంద్రం మంజూరు చేస్తుంది. ఇందులో టైర్డ్ కింద రూ.2.20 కోట్లు (మంచినీరు, పారిశుద్ధ్యం), ఆన్ టైర్డ్ కింద రూ.1.40 కోట్లు (పరిపాలన, సిబ్బంది జీతాలు) కేటాయించారు. ఈ నిధులు రాకపోవడంతో పంచాయతీలు ఎలాంటి ఖర్చులూ చేయలేని స్థితిలో ఉన్నాయి. జనరల్ ఫండ్స్ సైతం అందని ద్రాక్ష జనరల్ ఫండ్స్ కింద జిల్లాకు రావాల్సిన రూ.6.74 కోట్లు కూడా గత కొన్ని నెలలుగా విడుదల కాలేదని సమాచారం. భూముల రిజిస్ట్రేషన్లపై వచ్చే ఆదాయంలో 2 శాతం, పన్నులు, ఇతర మార్గాల ద్వారా లభించే నిధులు ప్రభుత్వం నుంచి తిరిగి పంచాయతీలకు రావడం లేదు. దీంతో గ్రామాల పరిస్థితి దిగజారుతోంది. పాడైన పైప్లైన్లను, వీధి దీపాలను మార్చలేక గ్రామాలు చీకటిలో మగ్గుతున్నాయి. పెండింగ్లో కార్మికుల జీతాలు పంచాయతీ నిర్వహణే కష్టంగా ఉంటే, కార్మికుల జీతాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. క్లాప్ మిత్ర, షెడ్ మిత్రలకు సకాలంలో జీతాలు అందడం లేదు. ఆరు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉండటంతో కార్మికులు అధిక వడ్డీలకు అప్పులు చేసి జీవిస్తున్నారు. తక్షణమే నిధులు విడుదల చేసి తమను ఆదుకోవాలని సర్పంచులు మంత్రి పవన్ కల్యాణ్ని కోరుతున్నారు. పవన్ జోక్యం చేసుకోవాలి ఈ సమస్యపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తక్షణమే నిధులు విడుదల చేయాలని సర్పంచులు కోరుతున్నారు. నిధులు లేక పంచాయతీల నిర్వహణ కష్టంగా మారిందని, తక్షణం నిధులు విడుదల చేసి తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పారిశుధ్యంపై పెను ప్రభావం అడపా దడపా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. చెత్త పేరుకు పోవడంతో దోమలు పెరిగిపోయి, అనేక ప్రాంతాల్లో తాగునీరు కలుషితం అవుతోంది. దీంతో జ్వరాలు ప్రబలుతున్నాయి, ఇందులో డెంగీ కేసులు కూడా ఉండడంతో ప్రజల్లో భయం నెలకొంది. నిధులు లేకపోవడంతో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసి రోడ్లపై చల్లలేని దుస్థితిలో సర్పంచులు ఉన్నారు. -
రికవరీ మొబైల్స్ అప్పగింత
తాటిచెట్లపాలెం : ప్రయాణికులు వివిధ రైళ్లలో, రైల్వేస్టేషన్లలో పోగొట్టుకున్న, మరచిపోయిన మొబైల్ ఫోన్స్ను గురువారం విశాఖపట్నం గవర్నమెంట్ రైల్వే పోలీసులు అందజేశారు. రైల్వేస్టేషన్లో గల గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ వద్ద సుమారు 25 లక్షలు విలువైన మొత్తం 100 ఫోన్లను సంబంధిత ప్రయాణికులకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీసు పి.రామచంద్రరావు సూచనలతో జీఆర్పీ ఇన్స్పెక్టర్ సిహెచ్.ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమంలో జీఆర్పీ ఎస్ఐలు లక్ష్మి, ఎస్.రామారావు, విశాఖ క్రైమ్ టీం హెడ్ కానిస్టేబుల్ ఎల్.ఉదయ్భాస్కర్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులు
డాబాగార్డెన్స్: జర్నలిస్టులు సమాజ ప్రగతికి కృషి చేసే సాధకులని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తమ వంతు సహకారం అందిస్తుందని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ అన్నారు. మంగళవారం ఆశీల్మెట్ట జంక్షన్లోని వేమనమందిరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్పేపర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు, వివిధ రకాల పండ్ల మొక్కలు, మిఠాయిలను పంపిణీ చేశారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నారాయణ్ మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా జర్నలిస్టులకు గణేష్ పూజా సామాగ్రిని అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. -
యువకుడిని రక్షించిన అమనాం వాసులు
తగరపువలస: తగరపువలస–శ్రీకాకుళం జాతీయ రహదారి నుంచి భీమిలి మండలం అమనాం పంచాయతీకి వెళ్లే రహదారిలో ప్రవహిస్తున్న గెడ్డ నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని అమనాం గ్రామస్తులు సాహసం చేసి రక్షించారు. అమనాం రహదారిపై పొండుతున్న గెడ్డ మార్గంలో యువకుడు మంగళవారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రవాహ వేగానికి కొట్టుకుపోతుండగా చూసిన అమనాం ప్రజలు రక్షించారు. ● ఆనందపురం మండలం పందలపాక పంచాయతీ పైలపేటలో డ్రైనేజీల నిర్మాణాల కోసం తవ్విన గోతుల వర్షంతో నిండి ఇళ్లలోకి ప్రవేశించడంతో సుమారు వంద కుటుంబాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
బాలుకి బళ్లారి రాఘవ జాతీయ పురస్కారం
పద్మనాభం: విజయనగరం జిల్లా, మద్ది గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు సామవేదం బాల సుబ్రహ్మణ్యం (బాలు) ప్రతిష్టాత్మకమైన బళ్లారి రాఘవ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అవార్డును కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి రాఘవ కల్చరల్ యాక్టివిటీస్ అసోసియేషన్ తమ 53వ వార్షికోత్సవం సందర్భంగా అందించనుంది. బాల సుబ్రహ్మణ్యం వచ్చే నెల 6న బళ్లారిలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. వృత్తిరీత్యా పురోహితుడైన బాల సుబ్రహ్మణ్యం రంగస్థల కళాకారుడిగా ‘పద్మ’ నాటకాల్లో అనేక ప్రదర్శనలిచ్చి బిరుదులు అందుకున్నారు. ఆయన ‘అనంత పద్మనాభ నాటక కళాకారుల సంఘం’ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ‘తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్’ గౌరవ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ట్రస్ట్ ద్వారా ఉత్తరాంధ్రలోని మారుమూల ప్రాంతాల్లోని ఎందరో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులను ఆయన ప్రోత్సహించారు. -
సీఆర్ఎస్ పోర్టల్లో జనన, మరణ నమోదు తప్పనిసరి
జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలోని జనన, మరణ నమోదుకై అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(సీఆర్ఎస్) పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సీఆర్ఎస్ లాగిన్లో నమోదైనవి మినహా, మిగిలిన వారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ వల్ల జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రజలకు సేవలు అందించేందుకు సౌకర్యంగా ఉంటుందన్నారు. జనన, మరణాలతో సంబంధం ఉన్న ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్లు, క్లినిక్లు సీఆర్ఎస్ పోర్టల్ యూజర్ ఐడీల కోసం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ప్రజారోగ్య విభాగంలో సంప్రదించాల్సిందిగా సూచించారు. 15 ఏళ్లు దాటిన బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రంలో బిడ్డ పేరు నమోదు తప్పనిసరన్నారు. 15 ఏళ్లు దాటిన పిల్లల పేర్లను ఇంకా నమోదు చేయని వారు వచ్చే ఏడాది జనవరి 21లోపు తమ బిడ్డ పేరు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు. లేకుంటే ఆ తర్వాత అలాంటి వారు పేర్లు నమోదు చేసేది లేదని స్పష్టం చేశారు. -
ప్లాస్టిక్ బ్యాట్లలో గంజాయి నింపి..
తాటిచెట్లపాలెం: గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, స్మగ్లర్లు మాత్రం కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. తాజాగా విశాఖ రైల్వే స్టేషన్లో జరిగిన తనిఖీల్లో పోలీసులు కూడా ఊహించని విధంగా గంజాయిని తరలిస్తున్న తీరు వెలుగులోకి వచ్చింది. మంగళవారం జీఆర్పీ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇన్స్పెక్టర్ సిహెచ్. ధనుంజయ నాయుడు నేతృత్వంలో జీఆర్పీ ఎస్ఐ కేటీఆర్ లక్ష్మి, ఆర్పీఎఫ్ ఎస్ఐ పీఆర్ బిశోయి తమ బృందంతో కలిసి ప్లాట్ఫామ్లపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఈసమేతర ఖతున్, ఒడిషాలోని గంజాం జిల్లాకు చెందిన గీత నాయక్గా గుర్తించారు. వారి బ్యాగులు, ఇతర వస్తువులను పరిశీలించగా, పోలీసులు విస్తుపోయారు. ఈ మహిళలు తమ పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బ్యాట్ల హ్యాండిళ్లను కట్ చేసి అందులో గంజాయిని నింపి.. టేప్తో అతికించి, దానిపై రబ్బరు తొడుగును అమర్చారు. కేరళకు గంజాయి తరలించేందుకు వారు ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ విధంగా మొత్తం రూ. 90వేలు విలువైన 18 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్కు తరలించారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన జీఆర్పీ పోలీసులు -
వైఎస్సార్సీపీలో యువజన విభాగం కీలకం
పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మహారాణిపేట: రాష్ట్ర యువజన విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ యువజన విభాగం సభ్యులతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజును పార్టీ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేనలు యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్న హామీలు అమలు చేయలేదన్నారు. యువత పక్షాన నిలిచి, కూటమి హామీల అమలుకు వైఎస్సార్సీపీ యువజన విభాగం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. యువజన విభాగం సమర్థవంతమైన యువకులను పార్టీ పదవుల్లో నియమించి, యువజన విభాగాన్ని పటిష్టం చేయాలన్నారు. పార్టీలో యువజన విభాగం పాత్ర చాలా కీలకమన్నారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్, విశాఖ జిల్లా నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదీప్రాజ్ను కేకే రాజు సన్మానించారు. అదీప్రాజ్ పార్టీ అధ్యక్షుడు కేకే రాజుకు ఆత్మీయ సత్కారం చేశారు.