Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ed Attaches Ed Attaches Siemens Company Assets On Money Laundering Case1
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు

ఢిల్లీ: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) దూకుడు ప్రదర్శిస్తోంది. స్కిల్‌ స్కామ్‌ కేసులో సిమెన్స్ కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై ,పూణేలలోని రూ.23 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.నకిలీ ఇన్ వాయిస్‌ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు తేలింది. డీటీసీఎల్‌ ఎండీ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ ముకుల చండ్ ఆస్తులను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది. స్కిల్‌ కుంభకోణం కేసు..ప్రభుత్వంలో వణుకుస్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో పేరుతో చంద్రబాబు తన హయాంలో రూ. 240 కోట్లను షెల్ కంపెనీలకు తరలించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు గతంలోనే 13 చోట్ల ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు పెట్టినట్టు నిర్ధారించింది.రూ.370 కోట్ల ప్రాజెక్టును రూ.3,300 కోట్లకు పెంచేసి గోల్మాల్ చేసిన చంద్రబాబు ఇదే కేసులో 52 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించారు. తాజాగా, ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ కేసు ఆధారంగా సిమెన్స్ కంపెనీ ఆస్తులను ఈడీ అటాట్ చేసింది. దీంతో స్కిల్ కుంభకోణం కేసులో ఏపీ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఈడీ తాజా అటాచ్‌మెంట్‌తో సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కలవరానికి గురవుతున్నారు.

Rajnath at Foundation Stone Laying of Damagundam VLF Radar Station2
దేశ రక్షణలో రాజీలేదు: రాజ్‌నాథ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశ రక్షణ విషయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా రాజీపడేది లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. అత్యాధునిక పరికరాలు, ఆధునిక సాంకేతికతను సమకూర్చడం ద్వారా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. యుద్ధ రంగానికి సంబంధించిన సవాళ్లలో మార్పుల నేపథ్యంలో కచ్చితమైన, అత్యంత వేగవంతమైన సమాచార వ్యవస్థ ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధంలో బలగాలకు సరైన సమయానికి అందే సమాచారమే గెలుపు, ఓటములను నిర్ణయిస్తుందని అన్నారు. యుద్ధ క్షేత్రంలోని వారికి సరైన సమయంలో కచ్చితమైన సమాచారాన్ని చేరవేస్తేనే శత్రువును దెబ్బకొట్టగలుగుతారన్నారు. అందుకు వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్‌ఎఫ్‌) రాడార్‌ కేంద్రాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 2,900 ఎకరాల్లో రూ.3,200 కోట్ల నిధులతో భారత నావికాదళం నిర్మిస్తున్న వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌కు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సమాచారం, సాంకేతికత కీలకం ‘దేశ భద్రతలో అత్యంత కీలకమైన వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కానుండటంతో సంతోషంగా ఉంది. మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరగడం కూడా ఆనందించాల్సిన విషయం. భారత రక్షణ రంగంలో డాక్టర్‌ కలాం అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. భారత్‌కు కొత్త సైనిక సాంకేతికతను అందించడంతో పాటు, ఒక తరం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఆయన స్ఫూర్తినిచ్చారు. కొత్తగా నిర్మించనున్న రాడార్‌ స్టేషన్‌తో భారత నౌకాదళ సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు సుదూర ప్రాంతాలకు విశ్వసనీయమైన, సురక్షితమైన సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్య, వైద్య రంగాల్లో సాంకేతికత కీలక భూమిక పోషిస్తుంది. కరోనా సమయంలోనూ అత్యవసర సేవలు సాఫీగా నడవడంలో సమాచారం, సాంకేతికత ఎంతో కీలకంగా వ్యవహరించాయి. భారతదేశం తన వాణిజ్య, భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవాలంటే, బలమైన సముద్ర దళంగా ఉండాలంటే పటిష్టమైన సమాచార వ్యవస్థను కలిగి ఉండటం అవసరం..’ అని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. భవిష్యత్తు కోసం నిర్ణయాలు ఉండాలి ‘పర్యావరణంపై ప్రాజెక్ట్‌ ప్రభావం లేకుండా చూస్తాం. పర్యావరణానికి హాని కలుగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తాం. దేశ రక్షణ, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండొద్దు. దేశ భద్రతే ప్రధానం. ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఐదేళ్లే అధికారంలో ఉన్నా..భవిష్యత్తు కోసమే నిర్ణయాలు తీసుకోవాలి. వీఎల్‌ఎఫ్‌ సెంటర్‌ ఏర్పాటులో సంపూర్ణ సహకారం అందించిన సీఎం రేవంత్‌రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. దేశం రక్షణ విషయానికి వస్తే అంతా ఏకమవుతామని ఈ రాడార్‌ కేంద్ర శంకుస్థాపనతో నిరూపితమైంది..’ అని రక్షణ మంత్రి అన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం ‘కొత్త రాష్ట్రమైనా తెలంగాణకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. వ్యవసాయంలో అధునిక పద్ధతులు, అభివృద్ధితో దేశంలో తెలంగాణ కీలక భూమిక పోషిస్తోంది. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సంస్థలతో పాటు రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు గొప్ప పేరుంది. తాజాగా వీఎల్‌ఎఫ్‌ స్టేషన్‌ ప్రారంభమైతే స్థానిక ప్రజలకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుంది..’ అని రాజ్‌నాథ్‌ వివరించారు. అభివృద్ధి తప్ప ప్రకృతి అనర్ధాలు లేవు: సీఎం దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. వీఎల్‌ఎఫ్‌ సెంటర్‌ ఏర్పాటును కొందరు వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ రాడార్‌ కేంద్రం ఏర్పాటుతో దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందని చెప్పారు. ఇప్పటికే అనేక రక్షణ రంగ సంస్థలతో హైదరాబాద్‌ వ్యూహాత్మక ప్రదేశంగా ఉందని గుర్తుచేశారు. తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. రెండో వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ కేంద్రం మన ప్రాంతంలో రావడం గర్వకారణం. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దీనికి భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి నిర్ణయాలన్నీ 2017లో గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం సమంజసం కాదు. ఇక్కడ రామలింగేశ్వరస్వామి దర్శనానికి దారి వదలండి. విద్యా సంస్థల్లో స్థానికులకు అవకాశం కల్పించండి. వీఎల్‌ఎఫ్‌ కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని రక్షణశాఖ మంత్రికి నేను మాట ఇస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నౌకాదళ ముఖ్య అధికారి అడ్మిరల్‌ దినేష్‌ కె.త్రిపాఠి మాట్లాడుతూ.. భారత నావికాదళ కమ్యూనికేషన్‌ సామర్థ్యాలలో కొత్త అధ్యాయానికి ఈ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటు నాంది పలుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, మండలిలో చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజ్‌నాథ్‌కు సీఎం, కేంద్రమంత్రుల స్వాగతం వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేటకు వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శంకుస్థాపనకు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో అంతా రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత రాజ్‌నాథ్‌ సాయంత్రం 4.01 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేటకు చేరుకుని 4.18 గంటలకు విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లారు.

Sakshi Guest Column On Maharashtra Assembly Elections3
‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే సమూలంగా మార్చివేసిన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నిక కోసం ఎప్పుడో సన్నద్ధమైపోయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారానికి తెర పడ్డప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తూ రాజకీయ ప్రసంగం చేయడం ఇందుకు నిదర్శనం. మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్‌లో ఇప్పుడిప్పుడే కద లిక ప్రారంభమయ్యింది. కాంగ్రెస్‌ సన్నద్ధతపై ఆ పార్టీ విజయమొక్కటే ఆధారపడి లేదు. బీజేపీకి, దాని నేతృత్వంలోని ఎన్డీఏకు సవాల్‌ విసురుతున్న ‘ఇండియా’ విపక్ష కూటమి బలం పుంజుకోవడం కూడా కాంగ్రెస్‌ మంచి చెడుల పైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రవర్తన మీద!మహారాష్ట్ర, రెండు కూటములకూ ఎంతో కీలకమైన రాష్ట్రం. ప్రతి కూటమిలోనూ కనీసం మూడేసి ముఖ్య మైన భాగస్వామ్య పక్షాలున్నాయి. బీజేపీతో శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌)లు జట్టుకట్టి ఏర్పడ్డ ‘మహాయుతి’ కూటమి ఎన్డీఏ శిబిరంలో ఉంది.కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న శివసేన (ఉద్దవ్‌ థాక్రే), ఎన్సీపీ (శరద్‌ పవార్‌)ల ‘మహా వికాస్‌ ఆఘాడి’ (ఎమ్‌వీఏ) ఇండియా శిబిరంలో ఉంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర సంక్లిష్ట రాజకీయాల్లో కూటమి విజయాలన్నవి భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తుల సాఫల్యతను బట్టి ఉంటాయి. 2019 ఎన్నికల తర్వాత ఎన్నో రాజకీయ పరిణా మాలు వేగంగా మారుతూ వచ్చాయి. కలిసి ఎన్నికల్లో పోరిన బీజేపీ– శివసేన పార్టీలు గెలిచి కూడా సర్కారు ఏర్పరిచే సఖ్యత కుదరక విడిపోయాయి. ఎన్సీపీ–కాంగ్రెస్‌ జోడీతో చేతులు కలిపి శివసేన ‘ఎమ్‌వీఏ’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త పొత్తులతో ఏర్పడ్డ ఎమ్‌వీఏ ప్రభుత్వం కొంత కాలానికే కుప్ప కూలింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ‘చొరవ’ తీసుకొని, శివసేన చీలికవర్గం (తమదే అసలు శివసేన అంటారు) నేత ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొంత కాలం తర్వాత, ఎన్సీపీ నుంచి చీలి వచ్చిన (వీరిది అదే రాగం) అజిత్‌ పవార్‌ను ఉపముఖ్యమంత్రిని చేసి, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ చీలికలు మహా రాష్ట్ర ప్రజలకు నచ్చినట్టు లేదు, అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాలక కూటమికి చుక్కెదురైంది. 48 లోక్‌సభ స్థానాలకుగాను మహాయుతికి 17 స్థానాలు దక్కితే, ఎమ్‌వీఏ 30 స్థానాల్లో నెగ్గి సత్తా చాటింది.ఇదివరకటిలా కాకుండా, రాహుల్‌గాంధీ రాజకీయంగా కొంత రాటుదేలుతున్నాడనే భావన ప్రజాక్షేత్రంలో వ్యక్తమౌతోంది. పొత్తుల్లో కొన్ని సార్లే కాంగ్రెస్‌ లాభపడ్డా, ఆ సానుకూల వాతావరణం వల్ల మిత్రులకు మేలు కలిగిన సందర్భాలే ఎక్కువ. 2004 తర్వాత మళ్లీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. పొత్తుల్లో పట్టువిడుపులు లేకుండా కాంగ్రెస్‌మొండికేసిన చోట, వారి వల్ల మిత్రులు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు బట్టి ఎక్కువ సీట్లు తీసుకొని, తక్కువ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ కారణంగానే, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కోల్పోయారనే భావన అత్య ధికుల్లో ఉంది. 243 స్థానాల్లో మ్యాజిక్‌ నంబర్‌ 122 అయితే ‘మహా ఘట్‌ బందన్‌’ 110 వద్ద ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు 12 సీట్లు తగ్గాయి. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ 19 చోట్ల మాత్రమే నెగ్గింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇటీవల ముగిసిన జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లో ఒమర్‌ ఫరూక్‌ పరిస్థితి అట్లానే ఉండేది! 90 సీట్లకు, పొత్తుల్లో 51 చోట్ల పోటీ చేసి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 42 చోట్ల నెగ్గితే, 32 స్థానాలు తీసుకొని (మరో 5 చోట్ల స్నేహపూర్వక పోటీలో ఉండి) 6 చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ నెగ్గింది. హరియాణాలో, ‘ఇండియా’ కూటమి పక్షమైన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి పొత్తుల్లో పది స్థానాలు (90లో) ఇవ్వడానికి వెనుకాడిన కాంగ్రెస్, వారు దాదాపు అంతటా పోటీ చేయడానికి పురిగొల్పింది. సమాన ఓటు వాటా (సుమారు 40 శాతం) పొందిన బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య సీట్ల తేడా 11 మాత్రమే! కానీ, ఆప్‌కు సుమారు 2 శాతం ఓటు వాటా లభించింది.క్షేత్రంలోని వాస్తవిక బలం తెలుసుకొని, పొత్తుల్లో కొంచెం తగ్గితే వచ్చే నష్టమేంటి? ఈ సంస్కృతి కాంగ్రెస్‌ మరచిపోతోంది. ఇటువంటి పరిస్థితే లోగడ తలెత్తినపుడు... సోనియాగాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వెనుకంజకు సిద్ధపడింది. ‘బీజేపీని, దాని నేతృత్వపు ఎన్డీఏను గద్దె దించడానికి ప్రతి యుద్ధం ప్రకటించాలి. ప్రతి పోరూ సాగించాలి. ఏ త్యాగానికైనా సిద్ధ పడాలి’ అని బెంగళూర్‌ (2001)లో జరిగిన ప్లీనరీలో నిర్ణ యించారు. ఆ మేరకు రాజకీయ తీర్మానం ఆమోదించారు. 2002 మౌంట్‌ అబూలో జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య మంత్రుల కాంక్లేవ్‌లో, ఈ పంథాకు సోనియాగాంధీ మరింత స్పష్టత ఇచ్చారు. ‘ఛాందసవాదుల్ని గద్దె దించ డానికి లౌకిక శక్తుల్ని ఏకం చేయాలి... మన లక్ష్యం సొంతంగా ప్రభుత్వం ఏర్పరచడమే, కానీ, అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకూ మనం సంసిద్ధంగా ఉండాలి’ అని ఆమె ఉద్బోధించారు. నేను స్వయంగా విని, రిపోర్ట్‌ చేసిన, 1997 కలకత్తా ప్లీనరీలో సీతారాం కేసరి అధ్యక్షోపన్యాసం... ‘ఇది సంకీర్ణాల శకం అనుకోన వసరం లేదు. కాంగ్రెసే ఓ విజయవంతమైన సంకీర్ణం. మనకు ఏ పార్టీలతో పనిలేదు. సొంతంగా సర్కారు ఏర్ప రిచే సత్తా మనకుంది...’ అన్న ఆలోచనాసరళి దిశనే సోనియాగాంధీ పూర్తిగా మార్చేశారు. దీనికి, 1999 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ కొత్త పాఠాలు నేర్చు కోవడమే కారణం. వివిధ రాజకీయ పార్టీల్లో నెలకొన్న ‘కాంగ్రెస్‌ వ్యతిరేక ధోరణి’ తారస్థాయికి చేరి, అప్పుడు తేలిగ్గా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ‘పొత్తు లతో మాత్రమే కాంగ్రెస్‌ గెలువగలదు...’ అని ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ 2003 డిసెంబరులో ఇచ్చిన నివేదికతో సోనియా ఈ దిశలో మరింత క్రియా శీలమయ్యారు. 2004 ఎన్నికల్లో దాన్ని పక్కాగా అమలు పరచి, ఎన్నికలు గెలిచి, కాంగ్రెస్‌ నేతృత్వంలో విజయవంతంగా ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశారు. ‘త్యాగాలు’ అనే మాట ఊరకే రాలేదు. రాజీవ్‌గాంధీ హత్యలో డీఎమ్‌కేకు భాగముందని కాంగ్రెస్‌ స్వయంగా విమర్శించినా... తమిళనాడులో ఆ పార్టీతోనే పొత్తుపెట్టుకున్నారామె. ఆమె జాతీయతనే ప్రశ్నించి కాంగ్రెస్‌ను చీల్చిన శరద్‌పవార్‌ నేతృత్వపు ఎన్సీపీతో మహారాష్ట్రలో ఆమె పొత్తులకు సిద్ధమయ్యారు. సఖ్యతకు తలుపులు తెరచిన కమ్యూనిస్టులతో జతకట్టి యూపీఏను విజయతీరాలకు చేర్చారు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో చేతులు కలిపి గెలి చారు. ఈ పంథాయే ఇప్పుడు కాంగ్రెస్‌కు శరణ్యం.2029 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే రాజకీయ పునరేకీకరణలకు కాంగ్రెస్‌ వ్యూహరచన చేయొచ్చు. బీజేపీతో ముఖాముఖి తలపడే రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమా చల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాలు సరేసరి! మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,పంజాబ్, జార్ఖండ్, కేరళ వంటి రాష్ట్రాల్లో మరింత వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ కూటములను బలోపేతం చేసుకోవచ్చు. ఇతర ‘ఇండియా’ పక్షాలు లేని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిషా వంటి రాష్ట్రాల్లో కొత్త మిత్రుల్ని వెతుక్కోవచ్చు. అయితే వారే పేర్కొన్నట్టు ‘త్యాగాల’కు సిద్ధమైతే తప్ప పొత్తు ధర్మం పొద్దు పొడ వదు, రాజకీయ ఫలం సిద్ధించదు!దిలీప్‌ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్‌ ఎనలిస్ట్,‘పీపుల్స్‌ పల్స్‌’ డైరెక్టర్‌

Tollywood Actress Samantha Comments On Citadel Web Series4
అందుకు భిన్నంగా ఈ సిరీస్‌లో చేశా: సమంత కామెంట్స్

సమంత రూత్ ప్రభు, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ- బన్నీ. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈవెంట్‌లో సమంత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న టాలెంటెడ్ నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపింది. ఇండస్ట్రీలో మహిళల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ప్రశ్నపై సామ్ ఈ విధంగా స్పందించింది.సమంత మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ఇప్పటికే కొంత మార్పులు వచ్చాయి. అందులో నేనూ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అప్పుడే మన ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుంది. స్పై జానర్‌లో సిరీస్‌, సినిమా అయినా సరే ఎప్పటికీ పురుషులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. వారికే యాక్షన్‌, డైలాగ్స్‌ ఉంటాయి. అయితే దానికి భిన్నంగా ఈ సిరీస్‌లో నేను కూడా యాక్షన్‌ చేశా అని తెలిపింది.కాగా.. ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్ కీలక పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ సిరీస్‌ సిటాడెల్‌. దీనికి ఇండియన్‌ వెర్షన్‌ సిటాడెల్‌: హనీ -బన్నీ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్‌కు రాజ్‌, డీకే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit polls create major distortions media should introspect: CEC Rajiv Kumar5
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఈసీ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో నవంబర్‌ 20న, జార్ఖండ్‌కు రెండు విడతల్లో నవంబర్‌ 13న, 20న పోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారుఎగ్జిట్స్ పోల్స్‌తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని, వాటికి ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ భారీ అంచనాలనే సృష్టిస్తాయని చెప్పారు. ఇందువల్ల ప్రజల్లో గంగరగోళం ఏర్పడుతోందని, ఈ విషయంలో మీడియా సహా భాగస్వామ్య పక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి అవసరం ఉందని, స్వీయ నియంత్రణ అవసరమని అన్నారు.అయితే ఈ ఎగ్జిట్‌ పోల్స్‌కు శాంపిల్‌ సైజ్‌ ఏంటి.,? సర్వేలు ఎక్కడ జరిగాయి. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే మన బాధ్యత ఎంతవరకు? అనే విషయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన ఫలితాలు.. తుది ఫలితాలకు మధ్య ఉండే తేడా.. పార్టీలకు, అభ్యర్థులకు, చివరకు ప్రజల్లో కూడా తీవ్ర నిరాశకు దారితీస్తోందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.చదవండి:మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు.. కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. తుది ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా బీజేపీకి పట్టం కట్టిన నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్ గురించి ఎన్నికల కమిషనర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక హర్యానా ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈవీఎంలపై కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలపైనా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. స్పష్టతనిచ్చారు. మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలు ఉంటాయని,ఆరు నెలల ముందే ఈవీఎంలను పరిశీలించి ఎన్నికల నిర్వహణలో ఉపయోగిస్తామని తెలిపారు. నచ్చని ఫలితాలు వచ్చినప్పుడే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని పేర్కొన్నారు.ఈవీఎంలపై వచ్చిన 20 ఫిర్యాదులకు వాస్తవాలతో కూడిన వివరణ ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఓట్ల లెక్కింపు మొదలైన అరగంటలోపే మీడియాల్లో.. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేయడాన్ని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. అంత తొందర్లోనే ఫలితాల గురించి ఒక అంచనాకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఉదయం 9:30 గంటల కంటే ముందు ఇచ్చే ఫలితాలు అంతా బోగస్ అని కొట్టిపారేశారు.

Kommineni Comments On Chandrababu Super Six Promises6
బాబు మాటలు నేతి బీర చందమే!

బీరాలు పలకడం ఎలాగో ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉంటే బెదిరించడం, అధికారంలో ఉంటే దబాయించడం ఈయనగారికి బాగా ఒంటబట్టిన విద్య. ఓటేస్తే అది చేస్తా ఇది చేస్తామని సూపర్‌ సిక్స్‌ పేరుతో హామీలు గుప్పించిన బాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని సాంతం మరచిపోయారు. పైగా హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి బాబు విషయం బాగానే తెలిసినట్లు ఉంది. అందుకే కొన్నేళ్ల క్రితమే ‘యూ టర్న్‌’ బాబు అని పేరు పెట్టారు. చంద్రబాబు కూడా ఆ పేరును ఎప్పటికప్పుడు సార్థకం చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గమనించండి.. ప్రజలు ఆనందంగా ఉంటే వైఎస్సార్‌సీపీ నేతలు భరించలేకపోతున్నారట! కక్ష్యలు కార్పణ్యాలు తనకు అసలే తెలియవట! హద్దుమీరితే ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసట! వైఎస్సార్‌సీపీ తన పాలన కాలంలో వందకు 70 మంది అధికారులను భ్రష్టు పట్టించిందట! అవినీతి కేసులో జైల్లో ఉండగా ఆయన్ను చంపే ఆలోచన చేశారట! ఇవీ బాబుగారి వాక్కులు. వీటితోపాటు.. ‘‘రాష్ట్రానికి వీళ్లు అరిష్టం’’ అంటూ బాబు వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి మాట్లాడారని అనుకూల మీడియా ఓ భారీ కథనాన్ని వండి వార్చింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడం అరిష్టమా? లేక అన్నీ ఎగ్గొట్టడమా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ఈ నాలుగు నెలల కాలంలో ఎప్పుడైనా బాబు చెప్పాడా? కనీసం షెడ్యూలైనా ఇచ్చారా? ఇవ్వలేదే!. వాస్తవాలిలా ఉంటే.. ఆయనేమో.. ప్రభుత్వం చాలా మంచిదని తనకుతాను కితాబిచ్చుకుంటున్నారు. హామీలన్నింటినీ ఉట్టికెక్కించినా తన హయాంలో ప్రజలు ఆనందంగా ఉన్నారట! దబాయించడం అంటే ఇదే మరి!విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలోనూ బాబు తీరు ఇంతే. ప్రతిపక్షంలో ఉండగా.. తామైతే ప్రైవేట్‌పరం కాకుండా రక్షిస్తామని గొప్పలు చెప్పారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక మాత్రం చేతులెత్తేశారు. కుంటిసాకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేశానని తరచూ చెప్పుకునే బాబు ప్రతిపక్షంలో ఉండగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి అవగాహన లేకపోయిందని చెప్పడంతోనే తెలిసిపోయింది ఆయన మాటల్లో డొల్లతనం ఎంత అన్నది! విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ప్రస్తుతం బాబు చేస్తున్న వ్యాఖ్యల్ని గమనిస్తే అది ప్రైవేట్‌ పరం కావడం తథ్యమని అనిపించకమానదు. అదే జరిగితే విశాఖకే కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే అరిష్టం అవుతుంది!తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం విషయం.. లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఒకసారి.. ఎక్కడ వాడారో అప్రస్తుతమని ఇంకోసారి!! ఇది కదా అరిష్టం! విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల విషయంలోనూ ఇంతే. మునుపెన్నడూ లేనంత విధంగా ఉత్సవాలు జరిగాయని ఆయనకు ఆయన కితాబిచ్చుకున్నారు కానీ.. ప్రత్యేక దర్శనం కోసం రూ.500 లు పెట్టి టికెట్ కొన్నవారు కూడా గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చిందని, వీఐపీలు, జత్వానీ వంటి మోసకారి నటీమణులు నేరుగా, దర్జాగా దర్శనానికి వెళ్లారని భక్తులు ఆరోపించారు. ముఖ్యమంత్రి మాత్రం ఆహా, ఓహో అని పొగుడుకుంటున్నారు. తాను అధికారంలో ఉండగా జరిగిన అవినీతి కార్యకలాపాలను ఎండగట్టారని, కేసులు పెట్టి, జైలుకు పంపారన్న అక్కసుతో ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేయడమే కాకుండా దాదాపు పాతికమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తనకు కక్షంటే ఏమిటో తెలియదని అమాయకపు మాటలు చెబుతున్నారు. వరద సాయం జరిగేటప్పుడు 5 - 10 శాతం దుబారా కావచ్చని ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి చెప్పడం రాష్ట్రానికి అరిష్టమో కాదో తేల్చుకోవాలి. రాజమండ్రి జైలులో తనను చంపాలనుకున్నారని ప్రచారం జరిగిందని ఒక సీఎం అంటున్నారంటే అంతకన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉంటుందా? నిజంగా అలాంటిదేమైనా జరిగి ఉంటే ప్రస్తుతం ఆయనే సీఎంగా ఉన్నారు కదా, నిజానిజాలు నిగ్గుదేల్చవచ్చు కదా? జైలులో ఏసీ కూడా పెట్టించుకున్న ఈ నాయకుడు తనకు తగు సదుపాయాలు కల్పించ లేదని చెబుతున్నారంటే ఏమి అనుకోవాలి! ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ అనుకూల మీడియాలో రాసిన పచ్చి అబద్ధాలను ఇప్పటికీ ఆయన వాడుకుంటూనే ఉన్నారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ. 23 కోట్లు ఖర్చుపెట్టినదానికి సమాధానం ఇవ్వకపోగా ఐతే ఏంటట? అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీన్ని కదా అరిష్టపు పాలన అనాల్సింది. ఈవీఎంలు, జమలి ఎన్నికలపై చంద్రబాబు పలు మార్లు మాటమార్చిన సంగతి కొత్తేమీ కాదు. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చని చెప్పిందే ఆయన. ఒంగోలులో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి అక్రమాలు జరగలేదని ఎందుకు ఎన్నికల సంఘం ఎందుకు తేల్చలేదో చంద్రబాబు వివరించి ఉంటే అప్పుడు ఆయన మాటను నమ్మవచ్చు.ఈవీఎం బ్యాటరీ ఛార్జింగులో ఎందుకు తేడా వచ్చిందో చంద్రబాబైనా తెలిపి ఉంటే బాగుండేది. కానీ అలా చేయకుండా 2019లో వైఎస్సార్ సీపీ ఎలా గెలిచిందని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయన ఈవీంలపై సుప్రీం కోర్టు దాకా ఎందుకు వెళ్లారో చెప్పరు. ఈ సంగతులు పక్కన పెడితే ‘‘నీకు 15 వేలు, నీకు 15 వేలు’’ అంటూ పిల్లలనూ, ‘‘నీకు 18 వేలు’’ అంటూ తల్లుల్ని, ‘‘నీకు 48 వేలు’’ అంటూ యాభై ఏళ్లలోపు ఉన్న బీసీలను ఊరించి వారికి మొండి చేయి చూపడం అరిష్టపాలన అవుతుందా కాదా? నిరద్యోగులకు నెలకు రూ. మూడు వేలు ఇస్తామని ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం, వాలంటీర్లను కొనసాగించడమే కాకుండా రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆశపెట్టి, అలా చేయకుండా, వారి బతుకులను రోడ్డు పాలు చేస్తే అది మంచి ప్రభుత్వం అవుతుందా? లేక అరిష్టపు ప్రభుత్వమవుతుందా? కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై మాత్రం చంద్రబాబు ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తుంటారు.జగన్ తాను ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేస్తే అది అరిష్టమట. టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన దాదాపు అన్ని హామీల ఊసే ఎత్తకుండా, జనాన్ని మోసం చేయడం అరిష్టం కాదట? జగన్ సచివాలయాలు, హెల్త్ క్లినిక్కులు, రైతు భరోసా కేంద్రాలు ఇలా అనేక వ్యవస్థలను తీసుకురావడం అరిష్ట పాలన అవుతుందా? వాటిని అన్నిటినీ ప్రస్తుతం ధ్వసం చేయడం అరిష్టపాలన అవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం లోటుపాట్లు లెక్కకు మిక్కిలి. చంద్రబాబు ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా ఎల్లో మీడియా అండతో జనాన్ని మభ్య పెట్టాలని చూడడం అన్నిటికన్నా పెద్ద అరిష్టం కాదా?- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Indias first Test against New Zealand from today7
కివీస్‌ సవాల్‌!

కొన్నేళ్లుగా స్వదేశంలో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న భారత క్రికెట్‌ జట్టు మరో టెస్టు సిరీస్‌ సమరానికి సిద్ధమైంది. సొంతగడ్డపై ఇటీవల బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా మరో సిరీస్‌ విజయం లక్ష్యంగా నేటి నుంచి న్యూజిలాండ్‌తో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా సాగుతున్న రోహిత్‌ శర్మ బృందం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడం లాంఛనమే! ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా భారత జట్టు వ్యూహాలకు పదును పెడుతోంది. బెంగళూరు: వచ్చే నెలలో ఆ్రస్టేలియాతో జరిగే మెగా టెస్టు సిరీస్‌కు ముందు స్వదేశంలో భారత జట్టు సత్తాకు పరీక్ష ఎదురుకానుంది. బంగ్లాదేశ్‌ గట్టి జట్టు కాకపోవడంతో టీమిండియాకు ఇటీవల ఆ జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. కానీ పోరాటపటిమకు మారుపేరైన న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేము. ఐపీఎల్‌ రూపంలో భారత గడ్డపై ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న ఆటగాళ్లు న్యూజిలాండ్‌లో ఉన్నారు. ఫలితంగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ పోటాపోటీగా సాగే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌కు శుభారంభం లభించాలంటే వరుణుడు కూడా కరుణించాలి. నేటి నుంచి మూడు రోజులపాటు బెంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. చివరి రెండు రోజులు ఎండ కాయనుంది. అయితే చిన్నస్వామి స్టేడియంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో వరుణుడు కాస్త తెరిపినిచి్చనా మ్యాచ్‌ సాగడం ఖాయమే. భారత యువ ఆటగాళ్లకు ఈ సిరీస్‌ చక్కటి అవకాశం కానుంది. ముఖ్యంగా శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఇప్పటికే జట్టులో కుదురుకున్న ఈ ఇద్దరూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు గాయాలతో సతమతమవుతోంది. మాజీ కెపె్టన్‌ కేన్‌ విలియమ్సన్‌ తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోగా... తాజాగా పేస్‌ బౌలర్‌ బెన్‌ సియర్స్‌ గాయం కారణంగా ఈ సిరీస్‌కే దూరమయ్యాడు. సమతూకంగా... బ్యాటింగ్‌లో టీమిండియాకు పెద్దగా సమస్యలు లేవు. గిల్, జైస్వాల్, పంత్, కేఎల్‌ రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్, కోహ్లి స్థాయి ప్లేయర్లు లయ అందుకునేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు. మరో 53 పరుగులు చేస్తే కోహ్లి భారత్‌ నుంచి 9 వేల టెస్టు పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా ఘనత వహిస్తాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో అదరగొట్టిన అశ్విన్, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ మరింత బలంగా మారింది. అస్వస్థతతో గిల్‌ మ్యాచ్‌కు దూరమైతే అతడి స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ తుది జట్టులోకి వస్తాడు. బోర్డర్‌–గవాస్కర్‌ సిరీస్‌కు ముందు స్వదేశంలోనూ పేస్‌ పిచ్‌లపైనే ఆడాలని భావించిన టీమిండియా... అందుకు తగ్గట్లే పిచ్‌లను సిద్ధం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో భారత్‌ ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల వ్యూహంతో బరిలోకి దిగి ఫలితం సాధించింది. ఇక్కడ కూడా అదే కొనసాగించవచ్చు. అదనపు స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే ఆకాశ్‌దీప్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ జట్టులోకి రానున్నాడు. కివీస్‌కు గాయాల బెడద ఇటీవలి కాలంలో న్యూజిలాండ్‌ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోతోంది. శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0–2తో కోల్పోయిన న్యూజిలాండ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. భారత్‌తో పర్యటనకు ముందే టిమ్‌ సౌతీ టెస్టు కెప్టెన్సి నుంచి తప్పుకోగా... విలియమ్సన్‌ తొలి టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు యువ పేసర్‌ బెన్‌ సియర్స్‌ కూడా మోకాలి గాయంతో ఈ పర్యటనకు దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో టామ్‌ లాథమ్‌ కివీస్‌ పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించనుండగా... అతడితో పాటు కాన్వే, విల్‌ యంగ్, రచిన్‌ రవీంద్ర, మిషెల్, బ్లండెల్, ఫిలిప్స్‌తో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ మెరుగ్గానే ఉంది. అయితే భారత స్పిన్నర్లను వీరు ఎలా ఎదుర్కొంటారనేది కీలకం. ఇక ఎజాజ్‌ పటేల్, సాన్‌ట్నర్, రచిన్‌ల రూపంలో ఆ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. గత భారత పర్యటనలో ఎజాజ్‌ ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి... టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక సీనియర్‌ సౌతీ, విల్‌ రూర్కె, ఫిలిప్స్‌ పేస్‌ భారం మోయనున్నారు. తుది జట్లు (అంచనా) భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్ ), జైస్వాల్, గిల్‌/సర్ఫరాజ్, కోహ్లి, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్‌దీప్‌/కుల్దీప్, బుమ్రా, సిరాజ్‌. న్యూజిలాండ్‌: లాథమ్‌ (కెప్టెన్ ), కాన్వే, విల్‌ యంగ్, రచిన్‌ రవీంద్ర, మిషెల్, బ్లండెల్, ఫిలిప్స్, సాన్‌ట్నర్‌/బ్రేస్‌వెల్, సౌతీ, ఎజాజ్‌ పటేల్, విల్‌ ఓ రూర్కె. 62 ఇప్పటి వరకు భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన టెస్టులు. ఇందులో 22 మ్యాచ్‌ల్లో భారత్‌... 13 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ గెలుపొందాయి. 27 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.36 స్వదేశంలో న్యూజిలాండ్‌తో భారత్‌ ఆడిన టెస్టులు. ఇందులో 17 మ్యాచ్‌ల్లో భారత్‌ నెగ్గగా... 2 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ (1969లో, 1988లో) గెలిచింది. మిగతా 17 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి.పిచ్, వాతావరణంబెంగళూరు పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. వర్షాల కారణంగా పిచ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. ఆటకు వరుణుడు ఆటంకం కలిగించవచ్చు. ముఖ్యంగా తొలి మూడు రోజులు బెంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిన్నస్వామి స్టేడియంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉండటం అభిమానులకు ఊరటనిచ్చే అంశం.

Sakshi Editorial On diplomatic relations of India and Canada8
మన పాలిట మరో పాకిస్తాన్‌!

ఇరవై నాలుగు గంటల్లో అంతా మారిపోయింది. భారత, కెనడా దౌత్యసంబంధాలు అధఃపాతాళానికి చేరుకున్నాయి. ఏడాది పైగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఘర్షణాత్మక వైఖరి నెలకొని ఉన్నా, తాజా పరిణామాలతో అది పరాకాష్ఠకు చేరింది. అతివాద సిక్కుల నేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి అనుమానితుల జాబితాలో తమ దేశంలోని భారత దూతనూ, ఇతర దౌత్య వేత్తలనూ కెనడా చేర్చేసరికి సోమవారం సాయంత్రం కొత్త రచ్చ మొదలైంది. తీవ్రంగా పరిగణించిన భారత్‌ ఘాటుగా ప్రతిస్పందిస్తూ, కెనడా యాక్టింగ్‌ హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా సైతం ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలతో ఇదే రకంగా వ్యవహరించింది. భారత్‌ ‘ప్రాథమికమైన తప్పు’ చేస్తోందనీ, ఢిల్లీ చర్యలు అంగీ కారయోగ్యం కాదనీ సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో సోమవారం ప్రకటించారు. వెరసి, వ్యవహారం చినికిచినికి గాలివాన నుంచి దౌత్యపరమైన తుపానైంది. రానున్న రోజుల్లో కెనడా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఇరువైపులా మరిన్ని పర్యవసానాలు తప్పవని తేలిపోయింది.ప్రజాస్వామ్య దేశాలైన భారత, కెనడాల మధ్య ఎప్పటి నుంచో స్నేహసంబంధాలున్నాయి. ప్రజల మధ్య బలమైన బంధం అల్లుకొని ఉంది. కెనడాలో 18 లక్షలమంది భారతీయ సంతతి వారే. మరో 10 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు. అలా కెనడా మొత్తం జనాభాలో 3 శాతం మంది భారతీయ మూలాల వారే! ఇక, దాదాపు 5 లక్షల మంది దాకా భారతీయ విద్యార్థులు ఆ దేశంలో చదువుతున్నారు. దానికి తోడు ఉభయ దేశాల మధ్య పటిష్ఠమైన వ్యాపారబంధం సరేసరి. దాదాపు 600కు పైగా కెనడా కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. మరో వెయ్యికి పైగా భారత విపణి లోని వ్యాపార అవకాశాలకు సంబంధించి చురుకుగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి మిత్రదేశాల నడుమ ఈ తరహా పరిస్థితినీ, దౌత్యయుద్ధ వాతావరణాన్నీ ఊహించలేం. తాజా పరిణామాల వల్ల రెండు దేశాల ప్రజలకూ, ప్రయోజనాలకూ దెబ్బ తగలడం ఖాయం. కెనడా గడ్డపై గత జూన్‌లో జరిగిన నిజ్జర్‌ హత్యపై విచారణలో భారత్‌ సహకరించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణ. సహకరించాలని కెనడా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానం. అయితే, ఆ హత్యలో భారత ప్రమేయం గురించి సాక్ష్యాధారాలేమీ లేకుండానే అన్నీ సమర్పించి నట్టు ఒట్టావా అబద్ధాలు ఆడుతూ, అసంబద్ధమైన ఆరోపణలు చేయడం పట్ల ఢిల్లీ తీవ్రంగా స్పందించింది. పైగా, తమ దేశంలోని కెనడా జాతీయులను లక్ష్యంగా చేసుకొని భారత్‌ కోవర్ట్‌ ఆపరే షన్లు చేస్తోందంటూ ట్రూడో ఎప్పటిలానే నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం ఏ రకంగా చూసినా సహించరానిది. భారత ప్రమేయం గురించి గత ఏడాది సెప్టెంబర్‌లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో తొలి సారిగా ప్రకటన చేసినప్పటి నుంచి ట్రూడోది ఇదే వరస. ఒకవేళ ఆయన ఆరోపణల్లో ఏ కొంచె మైనా నిజం ఉందని అనుకున్నా... మిత్రదేశంతో గుట్టుగా సంప్రతించి, వ్యవహారం చక్కబెట్టుకోవా ల్సినది పోయి ఇలా వీధికెక్కి ప్రకటనలతో గోల చేస్తారా? ఇక్కడే ట్రూడో స్వార్థప్రయోజనాలు స్పష్టమవుతున్నాయి. భారత్‌ అన్వేషిస్తున్న తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాక, అవాంఛిత ఆరోపణలకు దిగుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆయన పాల్పడుతున్నారని అర్థమవుతోంది. భారత్‌ వెలుపల సిక్కులు అత్యధికం ఉన్నది కెనడాలోనే! అందులోనూ వేర్పాటువాద ఖలిస్తా నీలూ ఎక్కువే. ఈ అంశంపై ఇందిరా గాంధీ కాలం నుంచి ఇండియా మొత్తుకుంటున్నా ఫలితం లేదు. 1985లో కనిష్క విమానం పేల్చివేతప్పుడు ప్రధానిగా ఉన్న ట్రూడో తండ్రి నుంచి ఇవాళ్టి దాకా అదే పరిస్థితి. సిక్కులను ఓటుబ్యాంకుగా చూస్తూ... వాక్‌ స్వాతంత్య్రపు హక్కు పేరిట ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీలను పెంచిపోషిస్తూ వచ్చింది. ఆ అండ చూసుకొని తీవ్రవాద బృందాలు రెచ్చి పోయి, కొంతకాలంగా అక్కడి భారతీయ దేవాలయాలపై దాడులు చేస్తూ వచ్చాయి. మాజీ ప్రధాని ఇందిర హత్యను సమర్థిస్తూ ఊరేగింపు జరిపాయి. చివరకు భారత వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలకు దిగడమే కాక భారతీయులనూ, భారతీయ సంతతి వారినీ ప్రాణాలు తీస్తామని బెదిరించే దశకు వచ్చాయి. కనీసం 9 ఖలిస్తానీ తీవ్రవాద బృందాలు కెనడాలో ఉన్నాయి. పాకిస్తానీ గూఢచర్యసంస్థ తరఫున పనిచేస్తున్నవారూ అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. నేరాలకు దిగుతున్న ఇలాంటి వారిని మన దేశానికి అప్పగించాలని పదే పదే కోరుతున్నా, ఆ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.ట్రూడో సారథ్యంలోని కెనడా, పొరుగున ఉన్న మన దాయాది దేశం తరహాలో ప్రవర్తిస్తూ వస్తోంది. కశ్మీర్‌ను రాజకీయంగా వాడుకుంటూ, అక్కడ నిప్పు రాజేసి తమ వాళ్ళ మెప్పు పొందా లని పాకిస్తాన్‌ చూస్తే... భారత వ్యతిరేక ఖలిస్తానీలపై ప్రేమ ఒలకబోస్తూ వచ్చే 2025లో జరిగే జన రల్‌ ఎలక్షన్స్‌లో లబ్ధి పొందాలని ట్రూడో ఎత్తుగడ. ప్రస్తుతం ఆయన సారథ్యంలోని సంకీర్ణ సర్కార్‌ సైతం ఖలిస్తానీ జగ్మీత్‌ సింగ్‌ నేతృత్వంలోని న్యూ డెమోక్రాటిక్‌ పార్టీ చలవతోనే నడుస్తోంది. వెరసి, భారత్‌ పాలిట కెనడా అచ్చంగా మరో పాకిస్తాన్‌గా అవతరించింది. 2019 పుల్వామా దాడుల తర్వాత పాక్‌తో దౌత్య బంధాన్ని తగ్గించుకున్నట్టే... దౌత్యవేత్తల బహిష్కరణ పర్వంతో భారత్‌ ఇప్పుడు అధికారికంగా కెనడాను సైతం పాక్‌ సరసన చేర్చినట్లయింది. అసలిలాంటి పరిస్థితి వస్తుందని తెలిసీ, జాగ్రత్త పడకపోవడం మన దౌత్య వైఫల్యమే! అదే సమయంలో తాము పాలు పోసి పెరట్లో పెంచుతున్న పాములైన ఖలిస్తానీలు ఏదో ఒకరోజు తమనే కాటేస్తారని కెనడా గ్రహించాలి. దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలన్న కల సంగతేమో కానీ, అక్షరాలా తీవ్రవాదం, అప్పులు, గృహ వసతి సంక్షోభంతో కెనడాను మరో పాక్‌గా మార్చడంలో ట్రూడో సక్సెసయ్యారు. అదే విషాదం.

Reliance expects to complete merger with Disney India business in Q39
3 నెలల్లో రిలయన్స్‌లో వాల్ట్‌ డిస్నీ ఇండియా విలీనం

న్యూఢిల్లీ: ఇటీవలి ఒప్పందం మేరకు... రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా ఆస్తుల్లో వాల్ట్‌ డిస్నీ ఇండియా ఈ డిసెంబర్‌ త్రైమాసికంలోపు విలీనం కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి విలీనం పూర్తవుతుందంటూ స్టాక్‌ ఎక్స్చేంజ్ లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సమాచారం ఇచ్చింది. రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా విలీనానికి కాంపిటిషన్‌ కమిషన్‌ (సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి అనుమతులు లభించడం గమనార్హం. ‘‘మిగిలిన అనుమతుల కోసం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.విలీన లావాదేవీ 2024–25 సంవత్సరం మూడో త్రైమాసికంలో ముగుస్తుందని అంచనా వేస్తున్నాం’’అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. రిలయన్స్‌ మీడియా విభాగాలైన టీవీ18 బ్రాడ్‌కాస్ట్, ఈ18, నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఇప్పటికే ఆమోదం తెలియజేసిందని.. అక్టోబర్‌ 3 నుంచి విలీనం అమల్లోకి వచ్చిందని సంస్థ పేర్కొంది.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్‌ 18 పరిధిలోని నాన్‌ న్యూస్‌ (వార్తలు కాకుండా), కరెంట్‌ ఎఫైర్స్‌ టీవీ ఛానళ్ల లైసెన్స్‌లను స్టార్‌ ఇండియాకు బదిలీ చేసేందుకు సెపె్టంబర్‌ 27న కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బోధిట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యాపారానికి వయాకామ్‌ 18 హోల్డింగ్‌ కంపెనీగా ఉంది. విలీనం తుది దశలో ఉందని, సీసీఐ ఆదేశాలకు అనుగుణంగా వ్యాపారాల్లో సర్దుబాట్లు చేస్తున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. అతిపెద్ద మీడియా సంస్థ.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మీడియా విభాగాలు, వాల్ట్‌డిస్నీ ఇండియా వ్యాపారాల విలీనంతో రూ.70,000 కోట్ల విలువైన అతిపెద్ద మీడియా సంస్థ అవతరించనుంది. విలీనానంతర సంస్థలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు 63.16 శాతం, వాల్ట్‌ డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలుంటాయి. పోటీ సంస్థలైన సోనీ, నెట్‌ఫ్లిక్స్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా రూ.11,500 కోట్లను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పెట్టుబడిగా పెట్టనుంది.

Accumulated rent arrears of Gurukuls in private buildings10
అద్దె భారం.. గురుకులాలకు తాళం!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు తాళాలు పడ్డా యి. ప్రభుత్వం చెల్లించాల్సిన భవనాల అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో యజమానులు వాటి గేట్లకు తాళాలు వేశారు. బకాయిలు చెల్లిస్తేనే గేట్లు తెరుస్తామని స్పష్టం చేశారు. కొన్నిచోట్ల యజమానులు తాళాలు వేయడమే కాకుండా, ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించలేదంటూ బ్యానర్లు సైతం ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కొన్ని గంటల పాటు హాస్టళ్ల బయటే నిరీక్షించాల్సి వచ్చింది. హాస్టళ్లకు నెలవారీగా చెల్లించాల్సిన అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో గత కొంతకాలంగా భవనాల యాజమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా దసరా సెలవుల నేపథ్యంలో మూతపడిన గురుకులాలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బడులు తెరిచేందుకు వచ్చిన గురుకుల పాఠశాలల సిబ్బంది, గేట్లకు వేరే తాళాలు వేసి ఉండడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయారు. అద్దె బకాయిలు చెల్లించిన తర్వాతే సిబ్బందిని, విద్యార్థులను లోనికి అనుమతిస్తామని యజమానులు స్పష్టం చేశారు. కళాశాలల భవనాలకు సంబంధించి కూడా బకాయిలున్నట్లు సమాచారం. పలు గురుకులాలకు తాళాలు యాదాద్రి జిల్లా మోత్కూరులోని సాంఘిక సంక్షేమ బాలురు గురుకుల పాఠశాలకు యజమాని తాళం వేశారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు 6 గంటల పాటు పాఠశాల ఎదుట నిరీక్షించాల్సి వచ్చి0ది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసిన తర్వాత అందరూ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక్కడి మైనార్టీ గురుకుల పాఠశాల భవనానికి యజమాని బకాయిలు చెల్లించలేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.హుజూర్‌నగర్‌లో గంటపాటు బయటే వేచిచూసిన తర్వాత ప్రిన్సిపాల్‌ రెహనాబేగం విజ్ఞప్తి మేరకు యజమాని తాళం తీశారు. తుంగతుర్తిలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు బయటే ఉండాల్సి వచ్చి09ది. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకులం, మైనార్టీ బాలికల గురుకులం, నాంచారి మడూరులోని బీసీ బాలుర డిగ్రీ గురుకుల కళాశాల గేట్లకు యజమానులు తాళాలు వేశారు. గూడూరు మండలంలోని మర్రిమిట్ట శివారు మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయానికి, ఖానాపురం మండలం ఐనపల్లిలో, దుగ్గొండి మండలం గిరి్నబావిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల గేట్లకు తాళం వేశారు. దుగ్గొండి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల హాస్టల్‌.. చెన్నారావుపేట మండల కేంద్రంలో నిర్వహిస్తుండగా భవనానికి తాళం వేశారు. రేగొండ మండలంలోని లింగాల, వరంగల్‌ ఉర్సు గుట్ట వద్ద మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాల భవనానికి కూడా తాళం వేశారు. మంచిర్యాల జిల్లా తాండూరులోని మహాత్మా జ్యోతిబా పూలె గురుకుల పాఠశాలకు యజమాని తాళాలు వేశారు. కాగా, మంచిర్యాల జిల్లా తాండూరు బీసీ గురుకుల భవనానికి తాళం వేసిన యజమాని శరత్‌ కుమార్‌పై వివిధ సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు. అద్దె భవనాల్లో 625 పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలు సంబంధిత సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతుండగా.. పాఠశాల విద్యాశాఖ పరిధిలో జనరల్‌ గురుకుల సొసైటీ కొనసాగుతోంది. వీటి పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,033 విద్యాసంస్థలున్నాయి. ఇందులో 967 పాఠశాలలు కాగా మిగిలినవి డిగ్రీ కాలేజీలు. అయితే 625 పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాలున్న ప్రాంతాల ఆధారంగా అద్దె నిర్ణయించిన కలెక్టర్లు ఆ మేరకు చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని భవనాలకు ఒక విధమైన అద్దె ఖరారు చేయగా, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో మరో విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకో విధంగా చదరపు అడుగు చొప్పున ప్రభుత్వం అద్దె ఖరారు చేసింది. ఆ మేరకు ప్రతి త్రైమాసికంలో యజమానులకు నేరుగా చెల్లింపులు చేçసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే కొంత కాలంగా ఆయా భవనాలకు అద్దె చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ వస్తోంది. మైనార్టీ స్కూళ్లకు ఏడాదికి పైగా నిలిచిన చెల్లింపులు ఎస్సీ, ఎస్టీ సొసైటీల పరిధిలో నాలుగైదు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. అదేవిధంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 2024–25 వార్షిక సంవత్సరం నుంచి నిధులు విడుదల కాలేదు. ఇక మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో మాత్రం దాదాపు ఏడాదికి పైగా చెల్లింపుల ప్రక్రియ గాడి తప్పింది. దీంతో బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. గురుకుల అద్దె భవనాలకు సంబంధించి మొత్తం రూ.150 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా దసరా సెలవులకు గురుకులాలు ఖాళీ కావడంతో, ఇదే అదనుగా కొందరు యజమానులు భవనాలకు తాళాలు వేశారు.

Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
పాకిస్తాన్‌లో జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం

ఇస్లామాబాద్: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు

title
ఎయిర్‌ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని షికాగో బయలుదేరిన ఎయిర్‌

Default
‘బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు’: కెనడా ఆరోపణలు

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోన్న కెనడా..

title
ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో భారత్‌ కీలక ఒప్పందం

దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేసే దిశగా అమెరికా, భారత్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

title
ట్రంప్‌పై కుట్ర.. ఇరాన్‌కు అమెరికా వార్నింగ్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇటీవల కాలం చోటుచేసుకున్న హత్యాయత్నానికి సంబంధించిన ఘటనలపై అగ్రరాజ్యం తీవ్ర ఆ

NRI View all
title
అయోవాలో ప్రారంభమైన నాట్స్ ప్రస్థానం

అమెరికాలో తెలుగుజాతి ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాన్ని ప్రారంభించి తెలుగు వారికి సేవలందిస్

title
ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ట్రైయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలు అద్భుతంగా ముగిశాయి.

title
పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా TDF బతుకమ్మ సంబరాలు

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ సిటీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ , దసరా ఉత్సవాలు  కన్నుల పండువగా జరిగాయి.

title
Ratan TATA: డాలస్‌లో రతన్ టాటాకు ఘన నివాళి

డాలస్, టెక్సాస్: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు మహాత్మా

title
రాధిక మంగిపూడి రాసిన 'విజయనగర వైభవ శతకం' ఆవిష్కరణ

'విజయనగర ఉత్సవ్ 2024' ప్రారంభోత్సవ సభలో మంగిపూడి రాధిక రాసిన విజయనగర వైభవ శతకం ఆవిష్కరించబడింది.

Advertisement
Advertisement