
మందిర నిర్మాణం కోసం అవసరమైతే భారీ ఆందోళనకు సిద్ధమన్న ఆరెస్సెస్..
సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం అవసరమైతే 1992 తరహాలో భారీ ప్రజా ఉద్యమానికి వెనుకాడబోమని ఆరెస్సెస్ అగ్రనేత స్పష్టం చేశారు. రామ మందిర నిర్మాణం త్వరలో జరుగుతుందని తాము భావిస్తున్నామని, దీని కోసం సుదీర్ఘంగా వేచిచూసే ఓపిక ఇక తమకు లేదని ఆర్సెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి పేర్కొన్నారు. మందిర నిర్మాణం కోసం అవసరమైతే 1992 నాటి ప్రజాందోళనకు సంసిద్ధమవుతామని తేల్చిచెప్పారు.
మందిర నిర్మాణం వంటి సున్నితమైన కేసులను ప్రాధాన్యతాపరంగా కోర్టులు చేపట్టాలని కోరారు. మందిర నిర్మాణానికి ఎదురువుతున్న న్యాయపరమైన అడ్డంకులు సమసిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలన్న ఆరెస్సెస్ డిమాండ్ను ఆయన పునరుద్ఘాటించారు.మరోవైపు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్తో బీజేపీ చీఫ్ అమిత్ షా శుక్రవారం భేటీ అయ్యారు.