Eluru District News
-
శివారు గ్రామాల సంగతి ఏంటి?
దెందులూరు: జూన్ 1 నుంచి అమలు చేస్తున్న రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ అనేక మంది లబ్ధిదారులను ఇక్కట్లకు గురిచేస్తోంది. 90 శాతం శివారు గ్రామాల్లో రేషన్ షాపులు లేవు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గడపగడపకు రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేశారు. రేషన్ షాపులు లేని శివారు గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో ఇంటి ముంగిట రేషన్ సరుకులు అందాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా ముద్ర కనపడకూడదన్న శివారు గ్రామాల్లో రేషన్ షాపు లేకపోవడంతో రేషన్ షాపులు ఉన్న గ్రామాలకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాను పోను రెండు కిలోమీటర్లు దూరంతో పాటు ఒక పూట కూలి పని మానుకొని షాపుకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాలి. శివారు గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో రేషన్ షాపులు లేని చోట ఎవరు తెచ్చి ఇస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .రేషన్ షాపులు లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా కక్షపూరితంగా రద్దు చేసినట్టు ఉందని ప్రశ్నిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో బీసీ ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గ ప్రజలే అధికంగా జీవిస్తున్నారని వారి హక్కులు పరిరక్షించకుండా పథకాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రేషన్ డీలర్ల సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. 60 ఏళ్లు పైబడిన వారందరికీ ఇంటికి వెళ్లి రేషన్ ఎప్పుడు ఇస్తారు.. ఎలా చెల్లిస్తారు అనే విషయంలో లిఖితపూర్వక హామీ ఆదేశాలు లేవు. తమకు స్పష్టమైన ఆదేశాలు లేకపోతే యూనియన్ పరంగా నిర్ణయం తీసుకుంటామని డీలర్ల యూనియన్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరికీ రేషన్ సరుకులు అందకపోయినా, ఏర్పాట్లు చేయకపోయినా దళిత గిరిజన మైనారిటీ బీసీ సంఘాలు ఏకమై భవిష్యత్ ప్రణాళికను ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన : ఏలూరు జిల్లాలో శివారు, అటవీ ప్రాంతాల్లో షాపులు లేకుండా సరుకులు ఎలా ప్రజలకు అందిస్తారని, శివారు గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికంగా రేషన్ షాపులు తక్షణమే ఏర్పాటు చేయాలి అలా జరగని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆదివారం దెందులూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర మాలసేన నాయకులు గంటా పండు నిరసన వ్యక్తం చేశారు. రేషన్ కోసం కిలోమీటర్లు వెళ్లిల్సిన దుస్థితి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక వృద్ధుల అవస్థలు -
వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు
సాక్షి, భీమవరం: వెన్నుపోటు రాజకీయాలకు సీఎం చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి తల్లులు, పిల్లలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాలనూ వంచన చేస్తూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధిత, పీడిత ప్రజల పక్షాన ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఏమైపోయారో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆయన కోసం కాపు కాసిన వారికి న్యాయం చేయలేకపోతున్నారన్నారు. కాపు సామాజికవర్గంలో మెజారిటీ వర్గం పేదవారేనని, వారికి కాపు నేస్తం, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి తదితర ఏ పథకం అందడం లేదన్నారు. ప్రజల కోసం సీఎం చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. అన్ని వర్గాలనూ ఆదుకున్న ఘనత జగన్దే.. అన్ని వర్గాలనూ ఆదుకున్న ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని కారుమూరి చెప్పారు. తమ ప్రభుత్వంలో పేదలకు పథకాలు ఇవ్వబట్టే సంక్షేమం, అభివృద్ధి జరిగిందని తెలిపారు. నేడు వ్యాపారాలే లేవని, టోకుగా సొమ్ము మొత్తం దుబాయికో, సింగపూర్కో తరలించేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం జగన్ హయాంలో రూ.3.31 లక్షల కోట్లు అప్పుచేశారని అసెంబ్లీలో చెప్పిన మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లు అంటూ బయట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనది నోరా? తాటిపట్టా? అని ప్రశ్నించారు. కూటమి పాలనలో మర్డర్లు, ఇళ్లు కూల్చడాలు, ఇష్టానుసారంగా కేసులు పెట్టడాలు, డైవర్షన్ రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తండేల్ సినిమాలో చూపించినట్లు ఇక్కడ జెట్టీలు లేక మత్స్యకారులు గుజరాత్కు వెళుతుంటే.. 6 జెట్టీలు కట్టించిన మంచి మనసున్న వ్యక్తి మాజీ సీఎం జగన్ అన్నారు. ఆరు పోర్టులు, జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కళాశాలలు కట్టారని చెప్పారు. మెడికల్ కాలేజీలకు 750 మెడికల్ సీట్లు వస్తే వద్దని లేఖ రాసిన గొప్ప సీఎం చంద్రబాబునాయుడని కారుమూరి ఎద్దేవా చేశారు. మళ్లీ రేషన్ కోసం గంటల తరబడి క్యూ.. తణుకు అర్బన్: సంపద సృష్టిస్తామని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్నారని, ఉద్యోగాలిస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు తొలగించారని కారుమూరి మండిపడ్డారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎండీయూ ఆపరేటర్లందరినీ రోడ్డుకు ఈడ్చారని, రేషన్ దుకాణాల వద్ద మళ్లీ క్యూలో నిల్చునే పరిస్థితితోపాటు బియ్యం మూటలను ఇంటికి మోసుకుని వెళ్లే రోజులను తీసుకువచ్చారన్నారు. ఒక ఎమ్మెల్యేని మించి మరొక ఎమ్మెల్యే మద్యం, పేకాట, క్రికెట్ బుకీలే ఆదాయ వనరుగా మార్చుకుని మహిళల మంగళసూత్రాలను కూడా అమ్మించే పరిస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. ఇంకా ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయలేదని తప్పుపట్టారు. ఏడాదిలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారన్నారు. 4న వెన్నుపోటు దినం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు ఈనెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా గుర్తించి ఆయా నియోజకవర్గాల పరిధిలో తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి పాలన సాగిస్తున్నారు పవన్కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? మాజీ మంత్రి కారుమూరి ధ్వజం -
ఆపరేషన్ సిందూర్లో నేను సైతం
ఏలూరు టౌన్/పెదపాడు: దేశం తనకేమి చేసిందనేది కాకుండా... దేశానికి తాను సేవ చేయాలనే దృఢ సంకల్పంతో సైన్యంలో చేరిన హవల్దార్ మేకా శివాజీ ఆపరేషన్ సిందూర్లో పాల్గొని స్వగ్రామం వట్లూరు వచ్చారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొని తొలిసారి స్వగ్రామానికి వచ్చిన శివాజీకి వట్లూరు కబడ్డీ యూత్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, స్నేహితులు కలపర్రు టోల్ప్లాజా నుంచి ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీగా గ్రామానికి తీసుకెళ్లారు. వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శివాజీకి సన్మానం చేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మేకా పోతురాజు, రాజ్యం దంపతుల కుమారుడు శివాజీ. ఆయనకు భార్య స్వాతి, కుమార్తె నిత్య, కుమారుడు భరత్ ఉన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో అమృత్సర్ నుంచి యుద్ధంలో పాల్గొన్నానని శివాజీ తెలిపారు. కోట్లాది మంది భారతీయుల తరపున యుద్ధంలో పాల్గొనటం గర్వంగా ఉందన్నారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. -
ఒక టన్నూ పంపలేదు
10 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తోటల వద్దకే వచ్చి ఆర్డర్లు ఇచ్చి వెళ్లేవారు. గత ఏడాది లారీకి పది టన్నులు చొప్పున నాలుగు లారీల మామిడిని ఢిల్లీకి పంపితే పండు ఈగ ప్రభావంతో ఈ ఏడాది ఒక టన్నూ పంపలేకపోయాను. కోత ఖర్చులు రావడం లేదని కొందరు రైతులు కోయకుండానే వదిలేస్తున్నారు. – కొప్పినేని రామకృష్ణ, రైతు, పేరుపాలెం సబ్సిడీపై కవర్లు అందజేయాలి మునుపెన్నడూ లేనివిధంగా ఈ సీజన్లో తీవ్రంగా నష్టపోయాం. ఏడాది పాటు కష్టపడితే కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు. ఎన్నిసార్లు మందులు కొట్టినా ఫలితం లేదు. మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మామిడి కాయలకు కవరుకు రెండు రూపాయలు, కట్టేందుకు కూలీ ఖర్చు రూపాయి అవుతోంది. ప్రభుత్వం కవర్లను సబ్సిడీపై అందజేయాలి. – కూనపురెడ్డి సాంబమూర్తి, వైఎస్ పాలెం ఎప్పుడూ ఇలా లేదు మామిడి కాయల సీజన్లో సీతారామపురం మార్కెట్లో టన్ను రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్మకాలు జరిగేవి. రోజుకు రూ.నాలుగైదు లక్షల వ్యాపారం జరిగేది. ఇప్పుడు టన్ను రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు మాత్రమే ఉంటోంది. రోజువారి వ్యాపారం రూ.లక్ష లోపే ఉంటోంది. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు. – నాగరాజు, వ్యాపారి, సీతారామపురం -
5న భీమవరంలో చెస్ టోర్నమెంట్
భీమవరం: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా చెస్ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 5న రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అనసూయ చెస్ అకాడమీ కోచ్ మాదాసు కిషోర్ చెప్పారు. ఆదివారం టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించారు. ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో నిర్వహించే టోర్నమెంట్లో అండర్–5, 7, 9, అండర్ 11, అండర్ 13, అండర్ 15, బాల, బాలికలకు ప్రత్యేక బహుమతులు అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకోసం 90632 24466 నెంబరులో సంప్రదించాలన్నారు. పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ చల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు రద్దీ ఎక్కువగా కనిపించింది. పవిత్ర కోనేరులో స్నానాలాచరించిన భక్తులు పెద్దింట్లమ్మకు మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ఈవో మాట్లాడుతూ ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, ఇలా అన్నీ కలిపి రూ.85,340 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
మొగల్తూరు మామి‘డీలా’
సాక్షి, భీమవరం: చూడచక్కని రంగు.. మధురమైన రుచితో మనసు దోచే పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మామిడి ప్రతికూల వాతావరణం, పండుఈగ దాడితో ధర లేక వెలవెలబోతోంది. స్థానిక అమ్మకాలు, దేశ విదేశాలకు ఎగుమతులతో ఏటా రూ.32 కోట్లకు పైగా వ్యాపారం జరిగితే, ఈ ఏడాది సగం అమ్మకాలు లేని పరిస్థితి. తోటల లీజు, పెట్టుబడి ఖర్చులు రాక తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని 1800 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఎకరాకు ఐదు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సారవంతమైన నేలలతో ఈ ప్రాంతంలోని మామిడి కాయలు 500 గ్రాముల నుంచి 700 గ్రాములకు పైగా బరువుతో మంచి రంగు, రుచి కలిగి ఉంటాయి. సహజసిద్ధంగా కాయలు పక్వానికి వచ్చాక మాత్రమే కోసి అమ్మకాలు చేయడం వల్ల ఇక్కడి బంగినపల్లి, రసాలు తదితర మామిడి పండ్లకు గిరాకీ ఎక్కువ. ఎంతోమంది వీటిని కొనుగోలు చేసి దేశ విదేశాల్లోని తమ బంధువులు, స్నేహితులకు పంపిస్తుంటారు. పండు ఈగ దాడికి విలవిల ఏటా ఏప్రిల్ మొదటి వారం నుంచి మొగల్తూరు మామిడి పండ్లు మార్కెట్లోకి రావడం మొదలై జూలై రెండు, మూడు వారాలతో ముగుస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే అకాల వర్షాలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు పండు ఈగ ఉద్ధృతి పెంచేందుకు దోహదం చేశాయి. మొదట్లో ఈదురుగాలుల ప్రభావంతో కాయలు రాలిపోయి నష్టపోతే తర్వాత పండు ఈగ తమను కోలుకోలేని దెబ్బతీసిందని రైతులు అంటున్నారు. ఈగల వల్ల కాయలపై మచ్చలు ఏర్పడటం, సకాలంలో వినియోగించకపోతే పండు లోపల పురుగు పడుతుండటం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ఢిల్లీ, రాజస్తాన్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తోటల వద్దకే వచ్చి టన్నుల్లో ఆర్డర్లు ఇస్తే, ఈ ఏడాది మార్కెట్కు తెచ్చినా కోత కూలి, రవాణా ఖర్చులు కూడా రానంతగా అమ్మకాలు దిగజారాయని చెబుతున్నారు. చిరు వ్యాపారులు, కొనుగోలుదారులతో కిటకిటలాడే మొగల్తూరు, నరసాపురం, సీతారామపురం మార్కెట్లు వెలవెలబోతున్నాయి. సాధారణంగా తెల్లవారుజాము మూడు గంటలకు మార్కెట్లు మొదలై తెల్లవారేసరికి ముగిసిపోతుంటాయి. ప్రస్తుతం తెచ్చిన సరుకు ఉదయం 10 గంటల వరకు కూడా అమ్ముడుపోని పరిస్థితి ఉంటోందని వ్యాపారులు అంటున్నారు. నష్టాల్లో రైతులు గతంలో టన్ను మామిడి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్మకాలు చేస్తే ఈ ఏడాది రూ.15 వేల నుంచి రూ.25 వేల లోపే ఉంటోందని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. చెట్ల సైజు, సంఖ్యను బట్టి ఎకరాకు లీజు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండగా, జూలై, ఆగస్టు నెలల్లో చెట్ల మొదలులో మందులు, ఎరువులు పెట్టడం, డిసెంబరులో పూత మొదలైన నాటి నుంచి జూలైలో కాపు పూర్తయ్యేవరకు రేయింబవళ్లు తోటల వద్ద కాపలా, కోత, మార్కెట్కు తరలింపు తదితర రూపాల్లో రూ.లక్ష వరకు ఖర్చులు అవుతున్నాయంటున్నారు. మార్కెట్లోకి తెచ్చి అమ్మితే పెట్టుబడి ఖర్చులు కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. గతంలో నాలుగుసార్లు మందులు పిచికారీ చేస్తే సరిపోయేదని, ఈసారి ఏడు సార్లు పిచికారీ చేసినా ఖర్చులు పెరిగాయే తప్ప ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ప్రతికూల వాతావరణం పండు ఈగ వ్యాప్తికి కారణమైందని ఉద్యాన వన శాఖ అధికారులు తెలిపారు. కొందరు రైతులు మొదట్లోనే కాయలపై ఈగలు వాలకుండా కవర్లు (కవర్ కల్చరింగ్) కట్టే విధానాన్ని పాటించి సత్ఫలితాలు పొందారన్నారు. దాదాపు రెండు లక్షల కవర్లు కట్టినట్టు అధికారి ఒకరు తెలిపారు. పూర్తిస్థాయిలో రైతులు అందరూ ఈ విధానాన్ని అవలంబించేలా కార్యాచరణ చేస్తున్నట్టు వివరించారు. పండు ఈగ కాటుకు రైతులు విలవిల గతంలో టన్ను మామిడికి రూ.40 వేలకు పైగా రాబడి టన్ను రూ.15 వేల నుంచి రూ. 25 వేల లోపే అమ్మకాలు లీజు, పెట్టుబడి ఖర్చులు రావడం లేదని వాపోతున్న రైతులు మొగల్తూరు, నరసాపురం మండలాల్లో 1800 ఎకరాల్లో సాగు -
రద్దు తొందరపాటు నిర్ణయం
వాహనాల ద్వారా సరఫరా రద్దు తొందరపాటు నిర్ణయం. అనేక అంశాలు సమీక్షించి పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తదుపరి రద్దు చర్యలు చేస్తే బాగుండేది. ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రజలందరికీ నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలి. శనిపల్లి వెంకటేశ్వరరావు, వినియోగదారుడు ప్రజా విశ్వాసం కోల్పోయింది సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని, గ్రామాలు మారుస్తామని హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైనా ఏ పథకం అమలు చేయలేదు. రాము, వైఎస్సార్సీపీ నేత, సత్యనారాయణపురం -
రేషన్ తిప్పలు.. మళ్లీ మొదలు
ఏలూరు (మెట్రో): ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అందించే ఎండీయూ వాహనాలకు మంగళం పలికిన కూటమి సర్కారు ప్రజలను రేషన్ దుకాణాలకు రప్పించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆదివారం జిల్లావ్యాప్తంగా రేషన్ దుకాణాలు తెరుచుకోగా పలుచోట్ల సరుకుల కోసం ప్రజలు అవస్థలు పడ్డారు. జిల్లాలో 1,123 రేషన్ డిపోల ద్వారా 6,20,146 కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ చేయాల్సి ఉండగా తొలిరోజు 57,464 మంది కార్డుదారులకు మాత్రమే సరుకులు అందించారు. 18,019 కార్డులకు పోర్టబులిటీ విధానంలో సరుకులు పంపిణీ చేశారు. జిల్లాలో కేవలం 8.92 శాతం మాత్రమే సరుకుల పంపిణీ పూర్తయ్యింది. పలు డిపోల వద్ద కార్డుదారులు సరుకుల కోసం పడిగాపులు కాశారు. గతంలో ఇంటి వద్దకే సరుకులు అందడంతో తమకు శ్రమ తప్పిందని, ఇప్పుడు మళ్లీ రేషన్ కష్టాలు తప్పడం లేదని పలువురు వాపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు బియ్యం మూటలను మోసుకు వెళ్లడం పలుచోట్ల కనిపించింది. చాలాచోట్ల ఈ–పోస్ మెషీన్లు పనిచేయలేదు. మూటలు మోయడం మళ్లీ మొదలు దుకాణాల వద్ద పడిగాపులు తొలిరోజు 8.92 శాతమే సరుకుల పంపిణీ ఇంటి వద్దకే రేషన్కు కూటమి మంగళం -
అన్నదాతా దుఃఖీభవ !
రైతుకు ఏడాదికి రూ.20 వేల సాయం.. ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటుచేసి మద్దతు ధరలకు పంటల కొనుగోలు.. 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా.. ఆక్వాకు విద్యుత్ రాయితీలు.. రైతుసేవా కేంద్రాల ద్వారా సేవలు.. ఇవన్నీ గతేడాది ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. తీరా చూస్తే గద్దెనెక్కి ఏడాది గడిచినా ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. దీనికితోడు ప్రధాన పంటల ధరలు భారీగా తగ్గుతున్నా పట్టించుకోవడం లేదు. కూటమి పాలనలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేయగా.. ప్రస్తుత కూటమి సర్కారు కర్షకులపై నిండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దగాపడ్డ రైతన్న ● కూటమి ఏడాది పాలనలో రైతులకు ఇక్కట్లు ● రూ.471.69 కోట్ల అన్నదాత సుఖీభవ ఎగనామం ● కోకో ధరలు నేలచూపులు ● ధాన్యం కొనుగోళ్లలో దళారులరాజ్యం ● మామిడి రైతుల డీలా ● రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం ● గత ప్రభుత్వంలో రూ.1,830 కోట్ల రైతు భరోసా అందజేత ● సకాలంలో పంట నష్టపరిహారాలు, రాయితీలు గత ప్రభుత్వంలో పెద్దపీట గత జగన్ సర్కారులో అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేశారు. 2.35 లక్షల మంది రైతులకు రూ.1,830 కోట్ల రైతు భరోసా, 97,584 మంది రైతులకు సున్నా వడ్డీ కింద రూ.22.29 కోట్లు అందించారు. జిల్లాలో 70,960 వ్యవసాయ కనెక్షన్లకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు రూ.2,467.25 కోట్లు వెచ్చించారు. తుపానులు, విపత్తులకు సంబంధించి పంట నష్టపరిహారాన్ని రోజుల వ్యవధిలో అందించి అండగా నిలిచారు. -
మామిడి పరిస్థితి దారుణం
ఈ ఏడాది మామిడి పరిస్థితి దారుణంగా ఉంది. తో తాపురి రకం మామిడి ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. టన్ను తోతాపురి రకం రూ.3 వేలు పలకడంతో కోత ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో 50 టన్నుల కాయలను కోయకుండా చెట్లకు వదిలేశా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి 20 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – భూక్య కిషోర్, ఓగిరాల తండా, నూజివీడు మండలం పొగాకు ధరలతో నిరాశ వర్జీనియా పొగాకు కొనుగోళ్లు తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. కంపెనీలు లోగ్రేడ్పై ఆసక్తి చూపడం లేదు. మధ్య రకం పొగాకును సైతం రూ.230కు కొనడం కష్టంగా ఉంది. లోగ్రేడ్ పొగాకు ప్రతి రైతు వద్ద 25 శాతం మేర ఉంది. కంపెనీలు కేవలం గ్రేడ్–1ను మాత్రమే కొంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. బోర్డు అధికారులు స్పందించి కంపెనీలు లోగ్రేడ్ను సైతం కొనుగోలు చేసేలా చూడాలి. – వామిశెట్టి హరిబాబు, వర్జీనియా రైతు సంఘం నాయకులు, పుట్లగట్లగూడెం, జంగారెడ్డిగూడెం మండలం ● -
వంచనకు నిరసనగా వెన్నుపోటు దినం
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని కూటమి ప్రభు త్వం ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రెడ్బుక్ రాజ్యాంగ పాలన సాగిస్తున్న తీరుకు నిరసనగా ప్రజల పక్షాన ఈనెల 4న వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చే యాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో రాష్ట్రమ ంతా అరాచకాలు, దుర్మార్గాలు, తప్పుడు కేసులు, హత్యలు, భయభ్రాంతులకు గురిచేయడం నిత్యకృత్యమయ్యాయన్నారు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లను జైళ్లలో పెట్ట డం బాధాకరమన్నారు. 199 మంది పోలీస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్లో ఉంచారన్నారు. ఏడాది పాలనలో రూ.1,37,540 కోట్ల అప్పులు చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఇసుక, మద్యం, మైనింగ్లలో పారదర్శక విధానాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు ఆదాయం సమకూరిందని, అయితే ప్రస్తుత కూటమి పాలనలో ఇసుక, మ ద్యం, మట్టి మాఫియాలకు తెరతీశారన్నారు. అన్నివర్గాలనూ మోసం కూటమి పాలనలో అన్నివర్గాలనూ మోసం చేశారని ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్కుమార్ అన్నారు. కూటమి నాయకులంతా రెండు చే తులా సంపాదించే పనిలోనే ఉన్నారని ఎద్దేవా చే శారు. ఏడాది పాలనలో ఏలూరు పార్లమెంట్ ని యోజకవర్గంలో ఏం పనులు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిని అటకెక్కించారని, ఫీజు రీయింబర్స్మెంట్ను గాలికి వదిలేశారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డున పడ్డ ఎండీయూ ఆపరేటర్లు రాష్ట్రవ్యాప్తంగా 9 వేలకు పైగా ఎండీయూ వాహనాలను రద్దుచేసి ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం వృథా చేసిందని ఏలూరు జిల్లా పరిశీలకులు, ఎ మ్మెల్సీ వంక రవీంద్ర అన్నారు. దీంతో 18 వేల మ ంది ఆపరేటర్లు, హెల్పర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వెన్నుపోటు దినం వాల్పోస్టర్లను జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, నియోజకవర్గ ఇన్చార్జులు మామిళ్లపల్లి జ యప్రకాష్(జేపీ) (ఏలూరు), కంభం విజయరాజు (చింతలపూడి), పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నౌడు వెంకటరమణ, అనుబంధ సంఘాల నాయ కులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట ఈనెల 4న జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు వెల్లడి -
భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట, నిత్యాన్నదాన సదనం తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. కొండపైన టోల్గేట్, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దాదాపు 10,500 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. -
● నరికినా.. కాసింది
బుట్టాయగూడెం మండలం కామవరంలో గ్రామానికి చెందిన కొమరం వెంకన్న అనే రిటైర్డ్ ఉద్యోగి ఇంటి పెరటిలో నరికేసిన చెట్టు మధ్యలో అరటిగెల వచ్చింది. అయితే అలా రావడం మంచిది కాదని కొందరు చెప్పడంతో వెంకన్న రెండుసార్లు ఆ చెట్టును నరికేసినట్లు తెలిపాడు. అయినప్పటికీ మళ్లీ చెట్టు మధ్యలోనుంచే కాపు వస్తుందంటున్నారు. నరికిన చెట్టు మధ్యలో వచ్చిన అరటిగెలను చూసి పరిసర ప్రాంత ప్రజలు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. – బుట్టాయగూడెం కామవరంలో నరికేసిన చెట్టు మధ్య నుంచి అరటి గెల వచ్చిన దృశ్యం -
నవధాన్యాలతో భూమికి జవసత్వాలు
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో రైతన్నలు ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము, పెసర, మొక్కజొన్న, బొబ్బర్లు వంటి వాటితోపాటు పశుగ్రాసానికి పిల్లిపెసర, జనుము, జొన్న వంటివాటిని పండించేవారు. అయితే కొన్నేళ్లుగా వరిసాగులో జాప్యం కారణంగా దాళ్వా వరి పంట ఏప్రిల్, మే నెలల్లో చేతికి రావడంతో మూడవ పంట వేయడానికి సమయం సరిపోవడం లేదు. మూడవ పంటగా అపరాలు, పశుగ్రాసం పండించడం వల్ల భూమికి సహజంగా పోషక పదార్థాలు లభించేవి. మూడవ పంట లేకపోవడంతో రైతులు కేవలం ఎరువులు వేయడం ద్వారానే పంట దిగుబడి పెంచుకోడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తుంది. అయితే పాత విధానంతో మూడు పంటలు పండించడానికి వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సబ్సిడీపై విత్తనాల పంపిణీ జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా దీనిలో మూడవ పంట పండించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత దాళ్వా సీజన్ ముగింపు దశలో జిల్లాలోని 21,150 ఎకరాల్లో రైతులను అపరాల సాగుతోపాటు పశుగ్రాసం పెంచేందుకు రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేశారు. దీనికిగాను ప్రత్యేకంగా సేకరించిన మినుము, పెసర, జీలుగు, రాగి, సజ్జలు, నువ్వులు, వేరుశెనగ, ఆవాలు, పిల్లిపెసర, జనుము, మొక్క వంటివాటితోపాటు ఆకుకూరలైన తోటకూర, పాలకూర, మెంతుకూర, చుక్కకూర, గొంగూర, బీర, అనప, దోస వంటి సుమారు 15 రకాలు కలిగిన 12 కిలోల విత్తనాలను కిట్లుగా తయారుచేసి పంపిణీ చేశారు. ప్రయోజనం ఏమిటంటే.. భూమిలో సారాన్ని సహజంగా పెంచడానికి వేరు వ్యవస్థ ఎంతగానో దోహదం చేస్తుంది. అందువల్ల వివిధ రకాల విత్తనాలు కలగలిపి చేలలో వేయడం వల్ల రైతులకు కొంతమేరకు ఆదాయంతోపాటు ఇంటి అవసరాలు తీర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా వివిధ రకాల తీగ, ఆకుజాతి మొక్కల వేర్లు వల్ల భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది సహజసిద్ధంగా భూసారం పెరుగుతుంది. దీనితో వరి పండించడానికి ఎక్కువ మోతాదులో ఎరువులు వాడనవసరం లేకపోవడమేగాక తెగుళ్లు కూడా తగ్గే అవకాశముంటుంది. భూమిలో బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల రైతులు పంటలకు కొద్దిమొత్తంలో ఎరువులు వేసినా వాటి సామర్థ్యం పెరిగి పంటకు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం కొద్దిమొత్తం విస్తీర్ణం ప్రయోగాత్మకంగా వేసి నవధాన్యాల సాగు రానున్ను రోజుల్లో జిల్లా మొత్తం విస్తీర్ణం వేయడానికి రైతులను సన్నద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 21 ఎకరాల్లో నవధాన్యాల సాగుకు విత్తన కిట్ల పంపిణీ భూసారం పెరగడంతోపాటు రైతులకు ఆదాయం జిల్లా వ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాల్లో నవధాన్యాల సాగుకు ప్రణాళిక నవధాన్యాల సాగు ఎంతో ప్రయోజనం దాళ్వా అనంతరం నవధాన్యాల సాగు ఏడాది ప్రయోగాత్మకంగా చేపట్టాం. దాదాపు 21 వేల ఎకరాల్లో రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేశాం. దీనివల్ల రైతులకు కొంతమొత్తం ఆదాయం రావడమేగాక భూసారాన్ని సహజసిద్ధంగా పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో జిల్లాలోని దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో నవధాన్యాలసాగు చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తాం. – జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి, భీమవరం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
టి.నరసాపురం: వ్యాన్, మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో మోటార్సైకిలిస్ట్ మృతిచెందాడు. ఎస్సై ఎం జయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపూడి మండలం బట్టువారిగూడెంకు చెందిన జక్కుల ప్రకాష్ (21) టి.నరసాపురం మండలం కె.జగ్గవరంలో ఓ ఫంక్షన్కు వెళ్లి మోటార్సైకిల్పై తిరిగి వస్తున్నాడు. రాజుపోతేపల్లి అడ్డరోడ్డు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న వ్యాన్ మోటార్సైకిల్ను ఢీకొనడంతో ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని తండ్రి జక్కుల నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జయబాబు చెప్పారు. -
నేటినుంచి ప‘రేషన్’!
భీమవరం: రేషన్ కార్డుదారులకు చౌక డిపోల వద్దనే నిత్యావసర సరుకులు తీసుకునే కార్యక్రమాన్ని ఆదివారం కూటమి ప్రభుత్వం ప్రారంభించనుంది. కార్డుదారులు రేషన్ షాపుల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడి మోయలేని బరువుతో ఎక్కువ దూరం తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు పునరావృతం కానున్నాయి. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జ్ఞాపకాలను చెరిపేసే ఉద్దేశంతో రేషన్ డిపోల వద్దనే సరుకుల పంపిణీకి చేస్తున్న ఏర్పాట్లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో 5,67,671 రేషన్ కార్డులకు 1,060 డిపోల ద్వారా ద్వారా నెలకు సుమారు 8,700 టన్నుల బియ్యం, 567 టన్ను కందిపప్పు, 300 టన్నుల పంచదార పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 356 ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఇంటి వద్దకే సరుకులు అందించి వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఊరట కల్పించింది. ఇకపై పడిగాపులే.. సరుకులు పొందాలంటే ఇక నుంచి గంటల పాటు చౌకడిపోల వద్ద పడిగాపులు తప్పవని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ, వేలిముద్రలు పడటం లేదంటూ రోజుల తరబడి చౌక డిపోల చుట్టూ తిప్పుతారని వాపోతున్నారు. బియ్యం మూటలతో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడతామని అంటున్నారు. దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఎంతవరకు సాధ్యమని డీలర్లు పెదవి విరుస్తున్నారు. తాము సరుకులు తీసుకువెళ్లిన సమయంలో కార్డుదారులు వారి ఇంటి వద్ద లేకపోతే సమస్యలు తప్పవని డీలర్లు అంటున్నారు. మొత్తంగా ఎండీయూ వ్యవస్థ రద్దు, చౌక డిపోల ద్వారా రేషన్ పంపిణీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రేషన్ దుకాణాల్లోనే సరుకుల పంపిణీ క్యూలైన్లలో గంటల తరబడి ఎదురుచూపులు తప్పవు దూరాభారమైనా మోయలేని బరువులతో యాతనలే.. సర్వర్ పనిచేయక వేలిముద్రలు పడకపోతే మరింత ఇబ్బందులు -
ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఎన్సీసీ, స్పోర్ట్స్, సైనికోద్యోగుల పిల్లలు, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 28 నుంచి నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నాలుగు రోజుల సర్టిఫికెట్ల పరిశీలనలో ఎన్సీసీ విభాగంలో మొత్తం 1,454 మందికి గాను 1,101 మంది, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 1,032 మందికి గాను 742 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు సంబంధించి 270 మందికి గాను 198 మంది, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కోటాకు సంబంధించి 247 మందికి గాను 185 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన అభ్యర్థులకు, వారితో పాటు వచ్చిన వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏఆర్ అర్జునరావు సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
‘వెన్నుపోటు దినం’ విజయవంతం చేద్దాం
కై కలూరు: ప్రజలకు హామీలిచ్చి, వాటిని గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై ఈనెల 4న జరిగే వెన్నుపోటు దినంను అందరూ విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పిలుపునిచ్చారు. శనివారం కై కలూరు పార్టీ కార్యాలయంలో కార్యక్రమ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. కై కలూరు రైల్వేస్టేషన్ సమీప పార్టీ కార్యాలయానికి ఉదయం 9 గంటలకు నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ గాలిబ్బాబు, ఎంపీటీసీ సభ్యు రాలు పట్టపు బాలమ్మ, పార్టీ నాయకులు సమయం వీరాంజనేయులు, పంజా రామారావు, వైబీఎం.సాంబశివరావు, ఉడ్రమట్ట ఏసుకుమార్, బుర్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నియామక పత్రాల అందజేత గ్రామస్థాయి పార్టీ కమిటీల ఎంపిక స్థానిక పార్టీ కార్యాలయం వద్ద జరిగింది. ముదినేపల్లి మండలం ప్రొద్దువాక, బొమ్మినంపాడు, ములకలపల్లి, దేవపూడి, కొరగుంటపాలెం గ్రామాలు, కలిదిండి మండలం గోపాలపురం, కాళ్లపాలెం, వెంకటాపురం గ్రామ పార్టీ కమిటీలకు నియామక పత్రాలను డీఎన్నార్ అందించారు ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ పిలుపు -
వ్యాధుల కాలం.. పశువులు జాగ్రత్త
ఆగిరిపల్లి: వర్షాకాలంలో పశువులు వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. పశువుల పట్ల పాడి రైతులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన వాటి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చని, పశువులు, గొర్రెలు, మేకల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. జీవాలు ప్రమాదకర పరిస్థితిలో ఉంటే వెంటనే 1962 టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే సంచార పశు ఆరోగ్య సేవ వాహనంతో వైద్యులే ఇంటికి వచ్చి చికిత్స అందిస్తారని తెలిపారు. వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆగిరిపల్లి మండల పశువైద్యాధికారి జి.హనుమంతరావు చేసిన సూచనలు ఇలా ఉన్నాయి. గాలి కుంటు వ్యాధిపై అప్రమత్తం గాలికుంటు వ్యాధి ఎక్కువగా ఆవులు, ఎద్దులు, గేదెలకు సోకుతుంది. వ్యాధి బారిన పడిన పశువు శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 105 డిగ్రీలకు పెరుగుతుంది. పశువునోట్లో, గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. ఆహారం సరిగా తీసుకోలేవు. దీంతో నీరసంగా మారి నడిచేందుకు కూడా కష్టపడతాయి. పాడి పశువుల్లో అయితే పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. వ్యాధి నివారణ కోసం వైద్యులు సూచనల మేరకు యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ మందులను వాడాల్సి ఉంటుంది. కలుషిత నీటితో జలగవ్యాధి మురుగునీరు, కలుషిత నీరు తాగడం వల్ల పశువులకు ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా గేదెలు, దూడలు, గొర్రెలు, మేకలు వంటి జీవాలకు ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి బారిన పడిన పశువులు మేత తినడంలో ఇబ్బందులు పడతాయి. పాల దిగుబడి క్షీణిస్తుంది. జలగ వ్యాధి బారిన పడిన పశువులను మంద నుంచి వేరు చేయాలి. డిస్టోడిన్ 4 మాత్రలు, 100 మిల్లీ లీటర్ల నియోజడ ప్లస్ను అందించాలి. నట్టల వ్యాధితో ఎదుగుదలకు బ్రేక్ పశువులు పచ్చి మేత తిన్నప్పుడు నులిపురుగుల సమస్య వస్తుంది. దీంతో వాటి ఎదుగుదలకు అవకాశం ఉండదు. జీవాలు తిన్న ఆహారం అంతా నులిపురుగులే స్వాహా చేస్తాయి. దీంతో జీవాలు తరచూ రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఎక్కువగా గొర్రెలు ఈ వ్యాధి బారిన పడతాయి. పశుసంవర్థక శాఖ ముందుజాగ్రత్త చర్యగా ఆరు నెలలకు ఒకసారి పశువులకు నట్టల నివారణ మందులు ఉచితంగా అందిస్తుంది. ప్రస్తుతం పశువైద్య సిబ్బంది నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నారు. గొంతు వాపు.. ప్రాణాంతకం పశువులకు సంక్రమించే వ్యాధుల్లో గొంతు వాపు వ్యాధి ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు కంటి నుంచి నీరు కారటం, నోటి నుంచి చొంగకారడం, శ్వాస పీల్చడానికి ఇబ్బందులు పడుతుంటాయి. గొంతు కిందకు నీరు దిగి గొంతు వాపు వస్తుంది. తీవ్రత ఎక్కువైతే పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. వ్యాధి నివారణకు ముఖ్యంగా జూన్, జులై నెలల్లో (హెచ్ ఎస్) టీకాలు వేయించుకోవాలి. వ్యాధి బారిన పడిన పశువును మిగిలినవాటి నుంచి దూరం చేయాలి. ఈటీ వ్యాక్సిన్తో చిటుకు వ్యాధికి చెక్ వర్షాకాలంలో పశువులకు ఎక్కువగా సోకే మరో వ్యాధి చిటుకు వ్యాధి. ఈ వ్యాధి వచ్చినప్పుడు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కోసం జూన్, జూలై మాసంలో ఈటీ వ్యాక్సిన్ వేస్తారు. రైతులు పశువులకు సంబంధించిన వ్యాధులను సకాలంలో గుర్తించి తగిన వైద్యం అందించాలి. జి .హనుమంతరావు. పశు వైద్యాధికారి, ఆగిరిపల్లి -
పింఛన్ల కోసం పడిగాపులు
ఆకివీడు: పింఛన్లు మే 31వ తేదీ నుంచే పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పలు చోట్ల ప్రజలు శనివారం ఉదయం నుంచే వీధుల్లో పింఛన్ల కోసం పడిగాపులు పడ్డారు. స్థానిక వడలి వారి వీధి, సంతపేట ప్రాంతాల్లో పింఛన్ల కోసం లబ్ధిదారులు మధ్యాహ్నం వరకూ వేచి చూసినా పంపిణీ చేసే ఉద్యోగులు రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహం చెందారు. తిండితిప్పలు లేకుండా, ఉక్కబోత వాతావరణంలో చెమటలు కక్కుతూ పడిగాపులు పడ్డామని వృద్ధులు, దివ్యాంగులు వాపోయారు. ఈ విషయాన్ని సాక్షి ద్వారా కమిషనర్కు తెలియజేయగా సంబంధిత ఉద్యోగి సెలవులో ఉన్నారని, అందువల్ల సంతపేట, ఆనాల చెరువు ప్రాంతాల్లోని పింఛన్దారులకు పింఛన్ పంపిణీ చేయలేదని చెప్పారు. కనీసం ఈ విషయాన్ని బాధితులకు తెలియజేసి అక్కడ నుంచి పంపించివేయండని చెప్పినా వారికి సమాచారం ఇవ్వలేదు. కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని 74 ఎకరాల్లో తమకు పట్టాలిచ్చారని, అక్కడే ఇళ్లు కట్టుకున్నామని, ఫించన్, రేషన్కు ఆకివీడు రావాల్సిన దుస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ముగిసిన జిల్లా స్థాయి ఓపెన్ రాపిడ్ చెస్ పోటీలు జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా స్థాయి ఓపెన్ రాపిడ్ చెస్ పోటీలు పట్టణంలోని ప్రతిభ స్కూల్ నందు దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ, శ్రీ హంస చెస్ అకాడమీ, ఏలూరు జిల్లా అడ్హక్ కమిటీ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఓపెన్ కేటగిరీలో చొప్పా వీర వెంకట వివేక్ మొదటి స్థానాన్ని, కన్నా సోనాలి శ్రీమణి కార్తిక రెండవ స్థానాన్ని, తురసం శశి ప్రియాంక మూడవ స్థానాన్ని, సుందరిపల్లి నితిన్ శ్రీసాయి నాల్గవ స్థానాన్ని, పెన్మత్స సాత్విక్ వర్మ 5వ స్థానాన్ని సాధించారని టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ పి.కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతిభా స్కూల్ ప్రిన్సిపాల్ సరోజ రెడ్డి, అయినపర్తి సరళామాధవి, అయినపర్తి చంద్రశేఖర్ మాస్టారు, కన్నా సూర్య నాగేశ్వరరావు, సురేఖ పాల్గొన్నారు. -
ఏలూరులో 6 కరోనా కేసులు
మెల్లగా విస్తరిస్తున్న మహమ్మారి ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో మెల్లగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా యి. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ అధికారులు మాత్రం ప్రజలను అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలెక్టరేట్లో శుక్రవారం నాటికి ముగ్గురు కరోనా బారిన పడగా.. తాజాగా శనివారం మరో ఇద్దరికి కరోనా సోకినట్టు చెబుతున్నారు. అలాగే ఏ లూరు అమీనాపేటలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరికి జీజీహెచ్లో పరీక్షలు చేశారు. నగరంలో ఆరుగురికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు తెలిపారు.రహదారులపై సర్వే కొయ్యలగూడెం: కొయ్యలగూడెంలోని మెయిన్ రోడ్ల లో రెవెన్యూ అధికారులు శనివారం సర్వే చేపట్టారు. గతనెల 29న ‘సాక్షి’లో ‘పీజీఆర్ఎస్ తీరు అపహాస్యం’ శీర్షికన ప్రచురించిన కథనానికి కలెక్టర్ స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సర్వేని ప్రారంభించి మార్కింగ్ చేశారు. దాదాపు మూడు నెలల క్రితం మల్లవరపు శ్రీనివాసు అనే వ్యక్తి కొయ్యలగూడెంలో ప్రధాన జాతీయ రహదారులు ఇరువైపులా ఆక్రమణలకు గురయ్యాయని ఫిర్యాదు చేశారు. అయితే ఆన్లైన్లో సమస్యను పరిష్కరించినట్టు సమాచారం రావడంతో ‘సాక్షి’ ద్వారా కలెక్టర్కి విషయం చేరింది. దీంతో కలెక్టర్ వెట్రిసెల్వి ప్రత్యేక శ్రద్ధతో చర్యలకు ఆదేశాలిచ్చారని అధికారులు తెలిపారు. డిపోల ద్వారా రేషన్ పంపిణీ ఏలూరు(మెట్రో): జిల్లాలోని 1,123 రేషన్ దుకాణాల్లో ఆదివారం నుంచి నిత్యావసర సరు కులు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు జేసీ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో 6,20,146 మంది కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గాల్లో అధికారికంగా ప్రారంభిస్తామన్నారు. ఇకపై ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం, పంచదార పంపిణీ చేస్తామన్నారు. 65 ఏళ్లు పైబడిన కార్డుదారులకు, దివ్యాంగులకు ప్రతినెలా 1 నుంచి 5వ తేదీ వరకు రేషన్ డీలర్ల ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అందిస్తామని పేర్కొన్నారు. పటిష్టంగా ‘20 సూత్రాల’ అమలు ఏలూరు(మెట్రో): వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర–2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యసాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని 20 సూత్రాల కార్యక్రమ కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఉపాధి హామీ పథకం, ఇంటింటికీ సురక్షిత తాగునీరు, జల్జీవన్ మిషన్ అమలు, గ్రామీణ సడక్ యోజన, లాక్పతి దీదీ, గరీబ్ కల్యాణ్ అన్నయోజన, పీఎం సూర్యఘర్, కు సుమ్, పీఎం ఆవాస్ యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం స్వనిధి వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు, ద్వా రకాతిరుమల, కొల్లేరు పర్యాటక రంగం, మత్స్య సంపద అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షించారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్, సీపీఓ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లకు రైస్ కార్డులు 1ఏలూరు(మెట్రో): జిల్లాలో ట్రాన్స్జెండర్లకు రైస్ కార్డుల జారీకి ఈనెల 4న జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. ఈ కేంద్రంలో ట్రాన్స్జెండర్లకు రైస్ కార్డులు, ఆధార్ కార్డుల జారీ, ఆధార్ కార్డులో మార్పులు, రైస్ కార్డులో కుటుంబ సభ్యులు మార్పులు, చేర్పులు, ఆధార్ కార్డులో చిరునామా, తదితర మార్పు లు చేస్తారని చెప్పారు. యోగా రిజిస్ట్రేషన్ వేగిరపర్చాలి జిల్లాలో యోగా అభ్యాసన కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం వరకు 6,16,530 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని జేసీ ధాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో 8.30 లక్షల మందిని భాగస్వాములను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ను వేగిరపర్చాలని ఆదేశించారు. -
పొగాకు సాగులో విప్లవాత్మక మార్పులు అవసరం
బుట్టాయగూడెం: పొగాకు సాగులో విప్లవాత్మక మార్పులు అవసరమని ఐకార్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. జీలుగుమిల్లి ఐకార్ జాతీయ, వాణిజ్య పంటల పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో శనివారం క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పొగాకు సాగులో ఉత్తమ నాణ్యత, అధిక దిగుబడికి ఉత్తమ యాజమాన్య పద్ధతుల్లో పొగాకు బేరన్ల నిర్వహణ గురించి రైతులకు వివరించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశోధనా కేంద్రం ప్రతినిధి కొడవటి వాసుదేవరావు మాట్లాడుతూ ఐకార్– ఎన్ఐర్సీఎ, ఐఓసీఎల్, ఎమినెన్ట్ గ్యాస్ టెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన గ్యాస్ అథారిటీ పొగాకు బేరన్ పనిచేయు విధానాన్ని రైతులకు వివరించారు. గడచిన 30 ఏళ్లుగా పొగాకు రైతులు పొగాకు బేరన్లో కలప వాడటం వల్ల అధికంగా వచ్చే కాలుష్యాన్ని నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ జనరల్ మేనేజర్ వర్నేకర్, సంస్థ చీఫ్ మేనేజర్ లలిత, పొగాకు బోర్డు ఎక్స్టెన్షన్ మేనేజర్ సురేఖ, బోర్డు ఆర్ఎమ్ ప్రసాద్, ప్రాజెక్టు హెడ్ డాక్టర్ ఎల్కే ప్రసాద్, ఎన్ఐఆర్సీఏ ఆర్ఎస్ హెడ్ డాక్టర్ వైవీ సుబ్బయ్య, టి.వెంకటేష్, టి.రమేష్, దేవానంద్, పొగాకు బోర్డు అధికారులు, ట్రేడ్ ప్రతినిధులు, ఎన్ఐఆర్సీఏ శాస్త్రవేత్తలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఐకార్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ -
కూటమి అండదండలతో కబ్జాలు
కొయ్యలగూడెం: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూములే కాకుండా ప్రజల భూ ములు కూడా కబ్జాలకు గురవుతున్నాయని అందు కు ఉదాహరణగా కొయ్యలగూడెంలోని సర్వే నంబర్ 311/2 నిలిచిందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆయన శనివారం కొయ్యలగూడెం వచ్చిన సమయంలో సమయంలో టీటీడీ కల్యాణ మండప ప్రాంతవాసులు తమ భూముల కబ్జాపై ఆయన వద్ద మొరపెట్టుకున్నారు. కోట్ల రూపాయల విలువైన భూమి గురించి ఇప్పటికే సమగ్రంగా విషయాలను సేకరించానని, చిన్నపాటి లొసుగులను భూతద్దంలో చూపించి భూముల కబ్జాకు పన్నాగం నడుస్తోందని బాలరాజు అన్నా రు. ఈ విషయంలో ప్రజలను కంగారు పడవద్దని ఓ పక్క చెబుతూ మరోపక్క ఆక్రమణదారులకు కూటమి నాయకులు వెన్ను కాస్తున్నారని ఆరోపించారు. 40 ఏళ్లకుపైగా నివాసముంటున్న స్థానికుల జోలికి వస్తే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు కూటమి నేతల ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ గంజిమాల రామారావు, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ సహాయ కార్యదర్శి గంటా శీను, పట్టణ కన్వీనర్ సంకుకొండ, ఘంటసాల సాయి, మారిశెట్టి శ్రీను, చిటికెన నాగార్జున, తొంటా వాసు ఉన్నారు. -
సర్కారు వైద్యం నిర్వీర్యం
●పేదలకు వైద్యం దూరం కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ హాస్పిటల్స్కు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో సీఎం జగన్ ఆరోగ్యశ్రీలో 3,225 రోగాలకు వైద్య చికిత్సలు అందిస్తూ పేదల ఆరోగ్యానికి భరోసా క ల్పించారు. ఇక ఇప్పుడు 108 అంబులెన్స్ సేవలు సైతం నామమాత్రంగా అందుతున్నాయి. ఫోన్ చేసినా అత్యవసర సేవలు అందే పరిస్థితి లేదు. – దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రజలకు భంగపాటు కూటమి ప్రభుత్వంలో మరి న్ని సేవలు అందుతాయని ఆశించిన ప్రజలకు భంగపాటు తప్పలేదు. ఆరోగ్య ఆసరా రద్దు చేశారు, ఫ్యామి లీ డాక్టర్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు లేవు. పేదలు ప్రభుత్వాస్పత్రికి వెళితే పట్టించుకునే నాథుడే లేడు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోంది. తమకు చెందిన కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. – కారుమూరి సునీల్కుమార్, వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జిఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాకే తలమానికంగా ప్రభుత్వ వైద్య కళాశాలను ఏలూరులో రూ.525 కోట్లతో ఏర్పాటుచేశారు. యుద్ధప్రాతిపదికన పాతబస్టాండ్ డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద రూ.60 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం రెండో ఏడాది 300 మంది వైద్య విద్యార్థులు ఇక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఏలూరు సర్వజన ఆస్పత్రిని రూ.40 కోట్లతో ఆధునికీకరించారు. జీజీహెచ్ ప్రాంగణంలోనే ఆధునిక సౌకర్యాలతో శాశ్వత మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆరోగ్యశ్రీతో పేదలకు భరోసా 2014–2019 కాలంలో టీడీపీ హయాంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయగా 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి పునరుజ్జీవం తెచ్చారు. ఏకంగా 3,225 వ్యాధులకు ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్సలు అందించారు. 2020లో కరోనా కష్టకాలంలో కూడా కోవిడ్ సేవలను సైతం ఆరోగ్యశ్రీల చేర్చి పేదలను ఆదుకున్నారు. అందరికీ ఆరోగ్య సురక్ష ● జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 498 వైద్య శిబిరాలు నిర్వహించారు. కంటి కాటరాక్ట్ పరీక్షలు 39 వేలకు పైగా నిర్వహించి 2,713 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. ● రెండో విడతలో 551 వైద్య శిబిరాలు నిర్వహించి 61,140 మందికి ఓపీ సేవలు అందించారు. విలేజ్ క్లినిక్లతో.. గత ప్రభుత్వంలో జిల్లాలో 64 పీహెచ్సీలు ఉండగా అదనంగా 78 విలేజ్ క్లినిక్స్ను ఏర్పాటుచేశారు. 105 రకాల మందులు, 14 రకాల వైద్యపరీక్షలు అందించేలా చర్యలు తీసుకున్నారు. బీఎస్సీ నర్సింగ్తోపాటు కమ్యూనిటీ హెల్త్ కోర్సు పూర్తి చేసిన వైద్య నిపుణులలు, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ, ఆశావర్కర్లు ఇక్కడ సేవలందించేవారు. అయితే కూటమి సర్కారులో విలేజ్ క్లినిక్స్ నిర్లక్ష్యానికి గురయ్యాయి. చాలా చోట్ల తాళాలు వేసి కనిపిస్తున్నాయి. తల్లీబిడ్డలకు అండగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తల్లీబిడ్డా ఎక్స్ప్రెస్ వాహనాలతో ఆడబిడ్డలకు సేవలు అందించారు. ప్రసూతి అనంతరం తల్లీబిడ్డను ఈ వాహనాల ద్వారా సురక్షితంగా ఇంటికి చేర్చేవారు. ఇలా 2022 ఏప్రిల్ నుంచి 2023 జూలై వరకూ జిల్లాలో 4,976 మందిని, 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు 5,214 మంది బాలింతలను ఇళ్లకు చేర్చారు. 108కు జవసత్వాలు మాజీ సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత 108 అత్యవసర సేవలకు జవసత్వాలు వచ్చాయి. 2020 జూలై 1న 19 కొత్త అంబులెన్సులను జిల్లాకు కేటాయించారు. అనంతరం మరో 4 అంబులెన్సులు మంజూరు చేశారు. మొత్తంగా 27 మండలాలకు ఒక్కో అంబులెన్స్, జిల్లాకు ఒక నియోనెటల్ అంబులెన్స్ సేవలందించాయి. ప్రస్తుత కూ టమి ప్రభుత్వంలో 108 వాహనాలు అందు బాటులో ఉండటం లేదు. ఫోన్ చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫ్యామిలీ డాక్టర్తో ఇంటికే వైద్యం గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేసేందుకు గత ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేశారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో ఇద్దరు వైద్యులను నియమించటంతోపాటు వారు సిబ్బందితో కలిసి 104 సంచార వైద్యశాలలో గ్రామానికి వెళ్లి ప్రజలకు సేవలందించారు. ఇలా 2022 అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు జిల్లాలో 5,56,039 మందికి, 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకూ 7,13,499 మంది వైద్య సేవలు అందించారు. కరోనాలో అండగా.. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీసుకున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. జిల్లాలో మొదటి డోసుగా 34,79,105, రెండో డోసుగా 33,82,114 వ్యాక్సిన్లు అందించారు. జిల్లాలో 8 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేశారు. నేడుకూటమి సర్కారు అధికారం చేపట్టిన ఏడాది కాలంలో వైద్యరంగాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేశారు. ఆరోగ్య ఆసరాను రద్దు చేశారు. గ్రామాల్లో పేదలకు ఇంటికే వైద్యం అందించిన ఫ్యామిలీ డాక్టర్, 104 సేవలు దూరమయ్యాయి. దీంతో పేదలు జబ్బు చేస్తే అప్పులు చేసి మరీ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి. విలేజ్ క్లినిక్స్కు తాళాలు వేయగా, అర్బన్ హెల్త్ క్లినిక్స్లో నామమాత్రపు సేవలు అందుతున్నాయి. ఏలూరు జీజీహెచ్లో సైతం పూర్తిస్థాయిలో సేవలందడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నాడురూపాయి ఖర్చు లేకుండా పేదలకు కార్పొరేట్ సేవలు అందించేలా మాజీ సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకం, 108, 104కు జవసత్వాలు కల్పించారు. దేశానికే ఆదర్శంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటి వద్దకే వైద్యులను పంపి వైద్యసేవలు అందించారు. తల్లీబిడ్డా ఎక్స్ప్రెస్ సేవలు, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, యూపీహెచ్సీలను ఏర్పాటుచేసి ఆధునిక వైద్యసేవలకు చర్యలు తీసుకున్నారు. ఇలా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ప్రజారోగ్యానికి సుస్తీ ఆరోగ్య ఆసరా రద్దు ఫ్యామిలీ డాక్టర్, 108, 104లపై నీలినీడలు కూటమి పాలనలో వైద్యరంగంపై నిర్లక్ష్యం గత వైఎస్సార్సీపీ పాలనలో వైద్యానికి పెద్దపీట ఆరోగ్యశ్రీలో లక్షలాది మందికి సేవలు విలేజ్ క్లినిక్స్తో పల్లెల్లోనే వైద్యం ఏలూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు ఇలా.. సంవత్సరం వైద్య సేవలు వ్యయం ఆరోగ్య ఆసరా (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) 2020–21 73,314 96.00 5.84 2021–22 72,305 98.00 15.00 2022–23 96,000 84.00 15.80 2023–24 98,000 92.00 6.97 -
ఉద్యోగాల పేరుతో టోకరా
భీమడోలు: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామ ని నమ్మించి మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఓ వ్యక్తిని భీమడోలు పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్ రసూల్ కలకాడను భీమడోలు కోర్టులో హాజరుపర్చారు. ఇదిలా ఉండగా ఇదే ముఠాలోని మరో వ్యక్తి అల్తాఫ్ పరారీలో ఉన్నాడు. భీమడోలులో సీఐ యూజే విల్సన్, ఎస్సై వై.సుధాకర్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని తుక్కుగూడ ప్రాంతానికి చెందిన షేక్ రసూల్ కలకాడ, అతడి రెండో కుమారుడు అల్తాఫ్ రంగారెడ్డి జిల్లా గండిపేటలో నివాసముంటున్నారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ తమకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో సాన్ని హిత్యం ఉందని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. వారి నుంచి లక్షలాది రూపాయలు కాజేసి నకిలీ అపాయింట్మెంట్లతో మోసం చేస్తున్నారు. ఇలా పోలసానిపల్లికి చెందిన దివ్యాంగుడు కుక్కల నాగమల్లేశ్వరరావుకు ఏపీ సచివాలయంలోని వ్యవసాయ విభాగంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. నాగమల్లేశ్వరరావు నుంచి రూ.3 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఇది నకిలీ లెటర్ అని తెలిసి మోసపోయినట్టు గ్రహించిన నాగమల్లేశ్వరరావు గతేడాది మే 26న భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండికోటలో ఉన్న రసూల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు చేధించిన బృందంలోని హెచ్సీ ఎస్.శ్రీనినవాసరావు, ఎస్కే బాజీ, ఎం.వెంకటేశ్వరరావులు సీఐ విల్సన్ అభినందించారు. అలాగే పూళ్లకి చెందిన దూలం సాయిబాబా అనే వ్యక్తికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.20 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడేనికి చెందిన సుంకవల్లి శ్రావణ్కుమార్ అనే వ్యక్తి పొలం కొంటామని నమ్మించి, రెండు చెల్లని చెక్కులు ఇవ్వగా రసూల్, అల్తాఫ్లపై కేసు నమోదైంది. తండ్రి అరెస్ట్.. పరారీలో కుమారుడు -
అప్పుల బాధలు తాళలేక..
జంగారెడ్డిగూడెం: పట్టణానికి చెందిన ఓ కుటుంబం అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ కుటుంబ యజమాని శుక్రవారం మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక లక్ష్మి ఆస్పత్రి సమీపంలోని అపార్ట్మెంట్లో మంగిన సత్యదుర్గాచంద్రరావు (చంద్రం) (40) భార్య, ఇద్దరు పిల్లల తో జీవిస్తున్నారు. గురువారం వీరు కూల్డ్రింక్ లో కలుపు మందు కలిపి సేవించారు. స్థానికు లు వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చంద్రరావు, భార్య కృష్ణజ్యోతి, కుమారుడు దుర్గాచరణ్, కుమార్తె కోమలికి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి గుంటూరు తరలించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ చంద్రరావు శుక్రవారం మృతిచెందారు. భార్య, కుమారుడు, కుమార్తె అక్కడే చికిత్స పొందుతున్నారు. వారికి రక్తం శుద్ధి చేసేందుకు డయాలసిస్ చేస్తున్న ట్టు బంధువులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. డీఎస్పీ యు.రవి చంద్ర మాట్లాడుతూ అప్పుల బాధ తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ప్రాథమికంగా తమకు తెలిసిందన్నారు. విచారణ చేస్తున్నట్టు చెప్పారు. కుటుంబం ఆత్మహత్యాయత్నం కుటుంబ యజమాని మృతి -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పదవులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా కోటగిరి సందీప్ (నూజివీడు), రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులుగా గాదిరాజు వెంకట కిషోర్ మణికంఠ వర్మ (కిట్టు) (కై కలూరు), మద్దుల రాజు (ఉంగుటూరు)ను నియమించారు. రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులుగా ఆచంట యశ్వంత్ చౌదరి (దెందులూరు), దాలి వెంకటేష్ (ఏలూరు), కామెళ్ల ఉదయభాస్కర్ రాజు (ఉంగుటూరు)ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వలంటీర్స్ వింగ్ కార్యదర్శిగా మట్టా ప్రవీణ్ (దెందులూరు), రాష్ట్ర ఐటీ వింగ్ కార్యదర్శిగా లూటుకుర్తి సుభాష్ (ఏ లూరు), రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సె క్రటరీగా నెక్కాటి వెంకటేష్ (ఉంగు టూరు), రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా ఘంటా మోహనరావు (జీఎంఆర్) (ఏలూరు), రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ముగుడురు సూర్యనారాయణ (దెందులూరు)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
నాడు–నేడులో 1,117 బడుల అభివృద్ధి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 1,117 పాఠశాలలను రూ.280.44 కోట్లతో అభివృద్ధి చేశారు. అదనపు తరగతి గదులు నిర్మించడం, శ్లాబులు, గోడల మరమ్మతులు, ప్రహరీ గోడల నిర్మాణం, మరుగుదొడ్ల సౌకర్యం, పరిశుభ్రమైన తాగునీటి సరఫరా, తగరతి గదుల్లో గ్రీన్ చాక్బోర్డుల ఏర్పాటు, చక్కటి వెలుగుల కోసం ట్యూబ్లైట్లు, చల్లని గాలి కోసం ఫ్యాన్లు, తరగతి గదుల్లో రంగులతో గోడలకు పెయింటింగ్, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, ప్రహరీ గోడలపై విజ్ఞానాన్ని పెంచేలా, విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించేలా చూడచక్కని బొమ్మలు వేయించారు. రెండో విడతలో ఏలూరు జిల్లాలో 889 పాఠశాలలను ఎంపిక చేసి వాటి అభివృద్ధికి రూ.295.54 కోట్లు మంజూరు చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 739 పాఠశాలలను ఎంపిక చేసి వాటి అభివద్ధికి రూ.259.19 కోట్లు కేటాయించారు. -
‘గురుకుల’ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్
భీమడోలు: పోలసానిపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో గురుకుల సొసైటీ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ శుక్ర వారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే కౌన్సెలింగ్కు జోన్–2 పరిధిలోని ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లోని గురుకుల బాలురు, బాలికల క ళాశాలలకు చెందిన 438 మంది ప్రిన్సిపాల్స్, జూనియర్ అధ్యాపకులు, పీజీటీలు హాజరుకానున్నారు. గురుకుల సొసైటీ సంయుక్త కార్యదర్శి ఎ.మురళీ సమక్షంలో కౌన్సెలింగ్ చేప ట్టారు. తొలిరోజు 73 మందికి బదిలీ ఉత్తర్వులు అందించారు. టీజీటీ, స్పెషల్ టీచర్లు, సూపరిండెంటెంట్, సీనియర్ అసిస్టెంట్ల కేడర్లలోని ఉద్యోగులకు మంగళవారం కౌన్సెలింగ్ జరుగనుంది. డీసీఓ బీపీ ఉమాకుమారి, ఆయా జిల్లాల డీసీఓలు పాల్గొన్నారు. ప్రైవేట్ బస్సులపై 152 కేసుల నమోదు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని కలపర్రు టోల్గేట్ వద్ద గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై 152 కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. అలాగే రూ.5,01,500 అపరాధ రుసుం, పన్ను విధించినట్లు తెలిపారు. జిల్లాలోని వాహన తనిఖీ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి కేసు లు నమోదు చేశామన్నారు. విశాఖ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖ మధ్య తిరిగే కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పర్మిట్ నిబంధనలను ఉ ల్లంఘించిన బస్సులపై కేసులు నమోదు చే శామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్టీఓలు కేఎస్ఎంఎన్ కృష్ణారావు, ఎండీ మదానీ, వాహన తనిఖీ అధికారులు ఎస్.రంగనాయకులు, జి.ప్రసాదరావు, జి.స్వామి, వై.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్పై మండిపాటు ఏలూరు (టూటౌన్): ఆపరేషన్ కగార్ ఆపా లని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నక్సలైట్ల రహిత భారతదేశాన్ని 2026 నాటికి చూపిస్తామని చెబుతూ అడవి మీద ఆధారపడి జీవిస్తున్న గిరిజనులను అడవి నుంచి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరిట అటవీ ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని మోదీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెసు జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను భారం ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం పెంచిన ఆస్తి పన్ను ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును 20 శాతం పెంచాలని నిర్ణయించి ఆ మేరకు కొలతలు వేసే సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఆస్తి పన్ను పెంచబోమని హామీ ఇచ్చిన ఇప్పుడు తుంగలో తొక్కుతున్నారన్నారు. -
పొగ.. ఆరోగ్యానికి సెగ
కై కలూరు: పొగాకు వినియోగదారులు వ్యసన చక్రంలో బందీ అవుతున్నారు. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమే. దీని వల్ల గొంతు కేన్సర్, ఉపిరితిత్తుల వ్యాధులు, గుండెపోటు వంటి సమస్యలు దాపరిస్తున్నాయి. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఏటా మే 31వ తేదీన ధూమపాన రహిత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది శ్రీపొగాకు ఉత్పత్తుల ఆకర్షణలు తగ్గించడంశ్రీ అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగిస్తున్నారు. ఏలూరు జిల్లాలో డీఎంహెచ్వో కార్యాలయంలో పొగాకు వినియోగ అనర్థాలపై శనివారం అవగాహన కలిగించనున్నారు. ఆకర్షితులవుతున్న యువత యుక్తవయస్సులో సిగరెట్కు యువత ఆకర్షితులవుతున్నారు. పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ ఆనే పదార్థం ఉంటుంది. అందువల్ల వ్యసనం నుంచి త్వరగా బయట పడలేకపోతున్నారు. విద్యార్థి దశ నుంచి కొంతమంది ఫ్యాషన్గా సిగిరెట్కు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ధూమపానం వల్ల పురుషులు, సీ్త్రలలో సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నాయి. కేన్సర్ల ముప్పు.. సిగిరెట్, బీడి, చుట్టా, జరదా, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులకు ప్రజలు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటి బారిన పడిన వారికి తల, మెడ, నోరు, ఉపిరితిత్తులు, రక్త, మూత్రపిండాలు, ఫ్లీహము, పేగు, మూత్రసంచి, గర్భాశయ కేన్సర్లు కలుగుతున్నాయి. అదే విధంగా పక్షవాతము, అంధత్వము, చిగురు వాపు, గుండె వ్యాధులు, నిమ్ము, ఆయాసం, రక్తనాళాలు గట్టిపడటం, సంతానోత్పత్తి తగ్గిపోవడం, ఎముకలు బలహీనపడుట వంటి దీర్ఘకాలిక వ్యాధులతో శరీరంలో ప్రతి అవయవం దెబ్బతింటోంది. పొగాకు వల్ల ప్రపంచంలో ప్రతి ఏటా 8 మిలియన్లు పైగా మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. జిల్లాలో 2,354 మంది పొగాకు వ్యాధిగ్రస్తులు ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,354 మంది పొగాకును వివిధ రూపాల్లో ఉపయోగించిన వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వ్యసనపరులకు ఏలూరు సర్వజన ఆస్పత్రిలో రూం నంబరు 15లో టొబోకో ససైషన్ వైద్యశాల(టీసీసీ)లో చికిత్స అందిస్తున్నారు. మొత్తం వ్యాధిగ్రస్తులలో 146 మంది పూర్తిగా కోలుకున్నారు. మరో 955 మంది కోలుకునే దశలో ఉన్నారు. వ్యసనపరులకు వైద్యులు నికోటీవ్ రీప్లేస్మెంట్ థెరఫీతో వ్యసనాన్ని తగ్గిస్తున్నారు. కార్భన్ మోనాకై ్సడ్ అనలైజర్ అనే పరికరం ద్వారా రక్తంలో లెవల్స్ను పరీక్షించి, అనంతరం సైకాలజిస్టుతో కౌన్సిలింగ్ థెరిఫీ అందిస్తున్నారు. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జిల్లాలో పొగాకు సంబంధ వ్యాధిగస్తులు 2,354 మంది వ్యసనపరులకు టీసీసీ సెంటర్ ద్వారా వైద్య చికిత్స -
చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తున్నారు
ఏలూరు (టూటౌన్): పంచాయతీరాజ్ చట్టాన్ని ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తూ సర్పంచ్ల విధులు, హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సర్పంచ్ల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని ఏలూరు ఎన్ఆర్పేటలోని కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు అధికారులను అడ్డంపెట్టుకుని పంచాయతీల్లో సర్పంచ్లకు ఉన్న హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. పంచాయతీ రాజ్ చట్టాన్ని సక్రమంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సర్పంచ్ చిలకా సుబ్బారావు, నాయకులు నూకపెయ్యి కార్తీక్, కనికెళ్ళ రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల్లో భాగంగా ప్రత్యేక కేటగిరి సీట్ల భర్తీకి గాను ఆయా కేటగిరికి చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడోరోజు శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ నందు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా క్రీడా కోటాకు సంబంధించి 467మందికి గాను 344 మంది, ఎన్సీసీ కోటాకు సంబంధించి 452 మందికి గాను 354 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏఆర్ అర్జునరావు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 31న ఎన్సీసీ కేటగిరికి చెందిన 661మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. 2న అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఏలూరు రూరల్: జూన్ 2న ఏలూరు సీఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్–19 పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు చేపట్టనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏసీఓ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్ఎస్ఆర్ మూర్తి, ఈ ఆశోక్కుమార్, ఎస్కే షాకిర్హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. 2006 సెప్టెంబర్ 1 తర్వాత పుట్టిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని వివరించారు. జట్టుకు ఎంపికై న వారు 2025–2026 సంవత్సరంలో ఏసీఓ నిర్వహించే సెంట్రల్ జోన్ ఇంటర్ డ్రిస్టిక్ట్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. వివరాలకు 70136 33143 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. కాగా శుక్రవారం ఏలూరులో నిర్వహించిన ఎంపిక పోటీల తర్వాత అండర్–23, సీనియర్ క్రికెట్ జట్లును కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ జట్లు త్వరలో మూలపాడులో నిర్వహించే అంతర జిల్లాల పోటీల్లో ఉమ్మడి పశ్చిమ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాయన్నారు. -
మట్టి కోసం టీడీపీలో వర్గపోరు
నూజివీడు: చెరువుల్లో మట్టిని కొల్లగొట్టి జేబులు నింపుకునేందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లుగా ఉంది. చెరువుల్లో మట్టిని తాము తోలుకోవాంటే తాము తోలుకుంటామంటూ నాయకులు పోటీ పడుతున్నారు. పలు గ్రామాల్లో మట్టి కోసం వర్గపోరు తారాస్థాయికి చేరింది. కొన్నిచోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మట్టితోలకాలను యథేచ్ఛగా నిర్వహిస్తుంటే మరికొన్ని చోట్ల చెరువుల్లో మట్టిని అనుమతులు లేకుండా ఎలా తోలతారని టీడీపీ నాయకులే అడ్డుకుంటున్నారు. మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు నూజివీడు పట్టణంలోని పెద్దచెరువులో మాజీ కౌన్సిలర్ టీడీపీ నాయకుడు వేమూరి వెంకట కృష్ణారావు ఇరిగేషన్ అధికారుల నుంచి అనుమతులు తీసుకొని మట్టి తోలకాలను శుక్రవారం చేపట్టగా అదే పెద్దచెరువు సాగునీటి సంఘం సభ్యులు, రైతులు తమ చెరువులో మట్టిని తోలడానికి వీల్లేదని మట్టిని తోలకుండా అడ్డుకున్నారు. వేమూరు వెంకట కృష్ణారావుకు ఆర్ఎస్ నెంబరు 871–3లోని ఎకరం భూమిని మెరక చేసుకొనుటకు గాను వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టిని పెద్ద చెరువు నుంచి తవ్వి తీసుకెళ్లేందుకు గాను ఇరిగేషన్ ఈఈ అనుమతి ఇచ్చారు. దీంతో మట్టి తవ్వకాలను చేపట్టగా సాగునీటి సంఘం సభ్యులు, ఆయకట్టు రైతులు అడ్డుకోవడంతో కొంతసేపు వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చెరువుకు నాలుగు చోట్ల గండ్లు పడి దాదాపు 10నెలలు గడిచినా ఇంత వరకు గండ్లు పూడ్చకుండా చెరువులో మట్టిని వేరే వాళ్లు ఎలా తవ్వుకొని తీసుకెళ్తారని రైతులు ప్రశ్నించారు. అసలు అనుమతుల కోసం దరఖాస్తు పెట్టేటప్పుడు కనీసం నీటి సంఘం అధ్యక్ష, కార్యదర్శులను సంప్రదించకుండా ఎలా మట్టిని తవ్వుతారని నిలదీశారు. సాగునీటి సంఘం సభ్యులు ట్రాక్టర్లను అడ్డుకోవడాన్ని టీడీపీకి చెందిన కొందరు మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారంపై మంత్రి ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది. కొన్నంగుంటలో మట్టి అక్రమ తవ్వకాలు బోర్వంచ శివారు కొన్నంగుంటలోని గోరింత చెరువులో గురువారం అర్ధరాత్రి నుంచి తెల్లవార్లూ అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగాయి. ట్రాక్టర్లలో మట్టి తరలిపోయింది. గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు మట్టి అక్రమ తవ్వకాలకు తెరలేపి ఇష్టారాజ్యంగా కొనసాగించారు. అక్రమ తోలకాలు చేస్తున్నట్లు తెలుసుకున్న బోర్వంచ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు హరికోటి సంగీతరావు ట్రాక్టర్లను ఆపి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని ఎందుకు తోలుతున్నారని నిలదీశారు. అయినప్పటికీ మా ఇష్టం వచ్చినట్లుగా మేము తోలతామని చెప్పి ట్రాక్టర్లలో మట్టిని అడ్డూ అదుపూ లేకుండా తెల్లవార్లు తరలించారు. ఒక వర్గం మట్టి తోలుతుంటే అడ్డుకుంటున్న మరో వర్గం నూజివీడు పెద్దచెరువులో, కొన్నంగుంటలో మట్టి తవ్వకాలు -
యాత్రికుల లగేజీ దోపిడీ
ఏలూరు: టి.నరసాపురం మండలం మక్కినవారిగూడానికి చెందిన యాత్రికులు సోలాపూర్ సమీపంలో దోపిడీకి గురయ్యారు. యాత్రికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మక్కినవారిగూడానికి చెందిన 24మంది ఈ నెల 27న రైలులో షిర్డీ వెళ్లారు. 29వ తేదీ రాత్రి షిర్డీ నుంచి సోలాపూర్కు చెందిన శివ్బాబా ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని బస్సులో సోలాపూర్ బయలుదేరారు. వారి లగేజీ బ్యాగ్లను బస్సు డిక్కీలో ఉంచారు. 30వ తేదీ ఉదయం సోలాపూర్లో బస్సు దిగి డిక్కీ తెరిచి చూడగా, డిక్కీలో పెట్టిన దాదాపు 24 మందికి చెందిన బ్యాగులు మాయమయ్యాయి. వాటిలో దాదాపు విలువైన బట్టలతో పాటు రూ. 70 వేల నగదు ఉంటుందని యాత్రికులు తెలిపారు. బస్సు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ పలు చోట్ల ఆపి కిందకు దిగినట్లు యాత్రికులు చెబుతున్నారు. దీంతో బస్సును సోలాపూర్లో పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి యాత్రికులు ఆందోళన చేశారు. ఈ ఘటనపై మక్కినవారిగూడెంకు చెందిన దొంతు లక్ష్మీనారాయణతో పాటు మరికొందరు కలిసి ఫిర్యాదు చేశారు. సాయంత్రానికి పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని యాత్రికులకు ఇచ్చారు. యాత్రికులంతా సోలాపూర్ చుట్టుపక్కల పర్యటించి జూన్ 1వ తేదీన 8 గంటలకు సోలాపూర్ నుంచి విజయవాడకు రైలు ఎక్కాల్సి ఉంది. రిజర్వేషన్ టిక్కెట్లు సైతం ఆ బ్యాగ్లోనే ఉన్నాయని, తిరుగు ప్రయాణానికి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యాత్రికులు తెలిపారు.శ్రీవారి ఆలయంలో పాము కలకలంద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఒక పాము కలకలాన్ని రేపింది. దాంతో దేవస్థానం సిబ్బంది దాన్ని పట్టుకుని దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. స్థానికుల కధనం ప్రకారం. ఆలయ ఉత్తరగోపురం వైపు ఉన్న రూ. 200 దర్శనం క్యూలైన్లలోకి ఆ పాము ప్రవేశించడంతో అక్కడున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన దేవస్థానం సిబ్బంది ఆ పామును గోనె సంచెలో పట్టి, దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. దాంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పొగాకు బారిన పడవద్దు
పొగాకు వాడకం వల్ల ప్రజల జీవితాలు నాశనం చేసుకొంటున్నారు. ప్రధానంగా నోటి, స్వరపేటిక, ఊపిరితిత్తులు, క్లోమగ్రంధి, మూత్రాశయ కేన్సర్లు సంభవిస్తాయి. గుండె పోటుతో అకాల మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. జిల్లా సర్వజన ఆస్పత్రిలో పొగాకు విరమణ వైద్యశాల(టీసీసీ) అందుబాటులో ఉంది. పొగాకు ఉత్పత్తులకు అందరూ దూరంగా ఉండండి. – డాక్టర్ ఆర్.మాలిని, జిల్లా వైద్యాధికారి, ఏలూరు పీల్చడమూ ప్రమాదమే సిగిరెట్లులను కాల్చడమే కాదు.. ఆ పొగను పీల్చినా ప్రమాదమే. కొందరు సరదాగా పొగాకునకు అలవాటు పడి వ్యసనపరులుగా మారుతున్నారు. ప్రధానంగా యువత వీటికి ఆకర్షితులవుతున్నారు. గుండె పోటు మరణాల్లో ధూమపానం అలవాటు ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారు. పొగాకు రహిత సమాజానికి అందరూ సహకరించాలి. – డాక్టర్ నరేంద్ర, ప్రొగ్రాం ఆఫీసర్, ఎన్సీడీ, ఏలూరు వ్యసనపరుల్లో మార్పు ఏలూరు సర్వజన ఆస్పత్రిలో టొబోకో ససైషన్ క్లీనిక్(టీసీసీ) అందుబాటులో ఉంది. ఈ సెంటర్లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5 వేల మందికి వైద్య సేవలు అందించాం. వ్యసనపరులకు నికోటివ్ రీప్లేస్మెంట్ థెరపీని అందిస్తున్నాం. పూర్తిగా పొగాకు మానివేసిన వాళ్లను ఆరు నెలల వరకు పరిశీలిస్తున్నాం. ధూమపానానికి అలవాటు పడిన వారిని టీసీసీ ద్వారా మామూలు స్థితికి తీసుకొస్తున్నాం. – కె.చిన వీర్రాజు, సైకాలజిస్టు, గవర్నమెంట్ జనరల్ హాస్పటల్, ఏలూరు -
చిన్నపిల్లలపై పిచ్చి కుక్క దాడి
ద్వారకాతిరుమల: గత నాలుగు రోజుల నుంచి క్షేత్రంలోని చెరువు వీధిలో ఒక పిచ్చికుక్క పిల్లలపై దాడి చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 10 మంది పిల్లలపై ఈ కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరచింది. శుక్రవారం సాయంత్రం చెరువు వీధిగుండా శ్రీవారి ఆలయానికి వెళుతున్న లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సాయిల రవి అనే భక్తుడి కుమారుడు యశ్వంత్పై ఈ కుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి కాలికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక వైస్సార్ సీపీ నాయకుడు కొల్లిసుబ్బారావు క్షతగాత్రుడిని హుటాహుటీన పీహెచ్సీకి తరలించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన గుడాల మదన్మోహన్ కుమారుడు నవదీప్పై కుక్క దాడి చేసి, కొంత దూరం ఈడ్చుకెళ్లింది. స్థానికులు వెంటపడటంతో బాలుడిని విడిచిపెట్టి పరారైంది. వైద్య సిబ్బంది చిన్నారులకు యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్ వేశారు. సమాచారం అందుకున్న డిప్యూటీ ఎంపీడీవో ఏవీ సుబ్బరాయన్ పిచ్చి కుక్కను పంచాయతీ పారిశుధ్య కార్మికులతో పట్టించి, దూర ప్రాంతానికి తరలించారు. పోక్సో కేసులో లాడ్జి యజమాని అరెస్ట్ భీమవరం: మైనర్ బాలికలను వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్న నేరంలో భీమవరం టూటౌన్ పరిధిలోని శ్రీనిధి లాడ్జి యజమాని అయితం శ్రీనివాస్ను పోక్సో కేసులో శుక్రవారం అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ జి కాళీచరణ్ చెప్పారు. ఈనెల 12వ తేదీన వ్యభిచారం నేరంపై బాలికలను అరెస్ట్ చేయగా వారికి రూమ్స్ అద్దెకిచ్చిన శ్రీనివాస్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చామని, 14 రోజుల రిమాండ్ విధించడంతో నరసాపురం సబ్జైలుకు తరలించినట్లు సీఐ కాళీచరణ్ చెప్పారు. -
ఆగడాలు భరించలేకే హతమార్చా
కొడుకును చంపిన కేసులో తండ్రి వెల్లడి జంగారెడ్డిగూడెం: కుమారుడిని హత్యచేసిన కేసులో తండ్రిని అరెస్టు చేశారు. గురువారం జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ యు.రవిచంద్ర వివరాలు వెల్లడించారు. సీతంపేటకు చెందిన కొప్పుల నాగేశ్వరరావు చికెన్షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు కాగా, మృతుడు పవన్కుమార్ (24) పెద్ద కుమారుడు. డిగ్రీ చదువు మధ్యలో మానివేసి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ప్రతిరోజు తాగి వచ్చి ఆస్తి ఇవ్వాలంటూ తండ్రి, కుటుంబసభ్యులతో గొడవ పడుతూ, 9 నెలల క్రితం హైదరాబాద్ వెళ్లిపోయాడు. మరలా తిరిగి వచ్చి డబ్బులు కావాలని, లేకపోతే తన ఆస్తి తనకివ్వాలని గొడవ పడేవాడు. ఈ క్రమంలో పవన్కుమార్ తండ్రి నాగేశ్వరరావుపై దాడి చేశాడు. దీంతో విసిగిపోయిన నాగేశ్వరరావు ఈ నెల 26న వీరన్నగుడెం గ్రామంలోని నరసయ్య చెరువు గట్టుపై తన స్నేహితుడుకి చెందిన తాటాకింటికి పవన్కుమార్ను తీసుకువెళ్లి మద్యం పట్టించి మత్తులో గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన సీఐ వి.కృష్ణబాబును, ఎస్సై షేక్ జబీర్ను, ఏఎస్సై ఎన్వీ సందప్కుమార్, పీసీలు రమేష్, దిలీప్లను డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. -
రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి
తాడేపల్లిగూడెం రూరల్ : రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కే.గోపాల్ అన్నారు. గురువారం మండలంలోని పట్టెంపాలెం గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి రైతులు ఏ పంట వేస్తే మేలు చేకూరుతుందనే దానిపై కృషి జరగాలన్నారు. రైతులకు మేలైన వరి వంగడాలను అందించాలని, సాగులో పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి, లాభసాటిగా మార్చాలన్నారు. ఆరోగ్యకరమైన పంటలను పండించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రాంతంలో కోకో ప్రొసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక రైతాంగానికి ఏ పంటలు అనుకూలమో శాస్త్రవేత్తలు సూచించాలన్నారు. ఐసీఏఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జేవీ.ప్రసాద్ మాట్లాడుతూ సాగులో నూతన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శేషు మాధవ్, భారతీయ ఆయిల్పామ్ పరిశోధన సంస్థ (పెదవేగి) డైరెక్టర్ డాక్టర్ కే.సురేష్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ కేటీవీ.రమణ మాట్లాడారు. జిల్లా వ్యవసాయాధికారి జడ్. వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కే.దేవానంద్, ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ బి.గోవిందరాజులు, ఏడీఏ మురళీకృష్ణ, పశు, మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉద్యాన వర్సిటీ ఉప కులపతి డాక్టర్ గోపాల్ -
నేత్రపర్వం.. శివ కల్యాణం
ద్వారకాతిరుమల : క్షేత్రపాలకునిగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం శివదేవుని కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుక భక్తులకు కనువిందు చేసింది. మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను కన్నులపండువగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులిచ్చారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. జేఈఈ మెయిన్స్కు ఉచిత దీర్ఘకాలిక శిక్షణ ఏలూరు (ఆర్ఆర్పేట) : జేఈఈ మెయిన్స్లో అర్హత మార్కులు సాధించి సీట్లు సాధించలేకపోయిన పేద కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్టు స్పృహ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ తెలిపింది. ఈ మేరకు ట్రస్ట్ ప్రతినిధులు అంగులూరు సర్వేశ్వరరావు, టీటీఎఫ్ రూజ్వెల్ట్ ఏలూరులో గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షల లోపు ఉండి అత్యుత్తమ మార్కులు సాధిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు ఆ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి జూన్ 21న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నామని, అందులో ప్రతిభ చూపిన సుమారు 10 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 79816 96481, 93900 59900, 99595 07507 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ద్వారకాతిరుమలలో వర్షంతో ఇక్కట్లు ద్వారకాతిరుమల: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. ద్వారకాతిరుమలలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి తూర్పువీధిలోని డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో రోడ్డుపైకి మురుగు నీరు, చెత్తాచెదారం చేరింది. కాలినడకన రాకపోకలు సాగించిన స్థానికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే టీటీడీ కాంప్లెక్స్ వద్ద ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. గ్రామంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరిలో గల్లంతైన మృతదేహం లభ్యం యలమంచిలి: చించినాడ వశిష్ట గోదావరి వంతెన మీద నుంచి బుధవారం గోదావరిలోకి దూకి గల్లంతైన యువకుడి మృతదేహం గురువారం లభ్యమైనట్లు ఎస్సై కె గుర్రయ్య తెలిపారు. వంతెనపై దొరికిన బైక్, సెల్ ఫోన్ ఆధారంగా అతను భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన షేక్ కాసు (24)గా గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. చించినాడ వచ్చిన తల్లిదండ్రులు బైక్, సెల్ఫోన్ తమ కుమారుడివేనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గోదావరిలో గాలించగా గురువారం మృతదేహం లభ్యమైంది. శవ పంచనామా చేసి, పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు. -
ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు
నిడమర్రు : ఉపాధ్యాయ బదిలీలు ఈనెల 22వ తేదీ నుంచి విద్యాశాఖ ప్రారంభించింది. నేటి వరకూ ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ వేదికగా కొనసాగుతోంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలు పూర్తయింది. నియామక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మిగిలిన 94 ఖాళీలకు గురువారం ఏలూరు డీఈఓ కార్యాలయంలో అర్హతగల ఎస్ఏలకు పదోన్నతులు కల్పించి గ్రేడ్–2 హెచ్ఎంలుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేశారు. తర్వాత పీఎస్ హెచ్ఎంలకు, స్కూల్ అసిస్టెంట్, పండింట్లకు ఆన్లైన్లోనే బదిలీల ప్రక్రియ నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ఎస్జీటీల బదిలీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఎస్జీటీలకు ఆఫ్లైన్లో బదిలీలు చేపడతామని పాఠశాల విద్య ఉన్నత అధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల సమయంలో అంగీకారం తెలిపారు. దీంతో ఎస్జీటీలకు కొంత సౌలభ్యం లభించిందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోల్లో మాత్రం అన్ని వర్గాల ఉపాధ్యాయులతోపాటు ఎస్జీటీలకు ఆన్లైన్లో బదిలీలు పూర్తయ్యేలా మార్గదర్శకాలు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి 10 వరకూ ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని 11వ తేదీన నూతన పాఠశాలల బదిలీ ఆర్డర్స్ విడుదలవుతాయంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఎస్జీటీలు గందరగోళంలో పడ్డారు. ఉన్నత అధికారుల హామీ ప్రకారం మాన్యువల్ బదిలీలే చేపట్టాలని ఎస్జీటీలు పట్టుపడుతున్నారు. కానీ అధికారులు మాన్యువల్ బదిలీల వల్ల అనేక సమస్యలు వస్తాయని ఆన్లైన్ బదిలీలే పరిష్కారం అంటూ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ విషయంపై ప్రభుత్వం ఏవిధమైన జీవో ఇంత వరకూ ఇవ్వలేదని సంఘాలు చెబుతున్నాయి. పోస్టుల ఖాళీల స్పష్టతకే ఆఫ్లైన్ జిల్లా విద్యాశాఖాథికారి కార్యాలయంలో జరిగే ఆఫ్లైన్ బదిలీల ప్రక్రియ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ఎస్జీటీలు అభిప్రాయపడుతున్నారు. అక్కడే ఉపాధ్యాయుడికి వచ్చిన పాయింట్ల ఆధారంగా మండలాల్లోని పాఠశాలలు ప్రదర్శిస్తారు. అక్కడ పాఠశాల వివరాలు తెలుసుకుని ఐచ్ఛికాలు ఎంపిక చేసుకుంటే. ఎక్కడికి బదిలీ అవుతుందనేది స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో అప్పటికే పోస్టులు క్లోజ్ అయిన పాఠశాలల వివరాలు ప్రదర్శిస్తుండటంతో మారాల్సిన పాఠశాలలను ఎంపిక చేసుకునే వీలుంటుంది. దీంతో ఐచ్ఛికాల ఎంపిక సంఖ్య కూడా చాలా వరకూ తగ్గిపోతుంది. తప్పులు చేసే అవకాశం ఉండదని సంఘాలు ముందు నుంచి అధికారులకు చెబుతున్నారు. మాన్యువల్ చేపడితే ఇబ్బందులు ఇలా.. తాజా బదిలీల్లో జిల్లాలో 2,861 మంది ఎస్జీటీలు బదిలీల జాబితాలో ఉన్నారు. వీరంతా ఐచ్ఛికాలు (ఆప్షన్స్) ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ విధానంలో ఐచ్ఛికాలు ఎంపిక చేసుకోవడం కష్టతరంగా ఉంటుందని వీరు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా టీచర్లు, సీనియర్ టీచర్లు ఆన్లైన్ విధానం అలవాటు లేకపోవడం, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఆప్షన్స్ ఎంపిక చేసుకునే క్రమంలో తప్పులు నమోదు చేస్తే దూరంగా పోస్టింగ్ వస్తుందని ఆందోళన వ్యక్త చేస్తున్నారు. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో వందల సంఖ్యలో ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి వస్తుందని ఈ విధానం వల్ల కనీసం ఆయా మండలాల్లోని పాఠశాల స్థితిగతులు కూడా తెలియవని అంటున్నారు. ఎస్జీటీల బదిలీలపై స్పష్టత కరువు! ఆఫ్లైన్లో చేపడతామని అధికారుల హామీ నేటి వరకూ ఉత్తర్వులివ్వని పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో తప్పులు దొర్లుతాయని గురువుల ఆందోళన ఉమ్మడి జిల్లాలో బదిలీల జాబితాలో 2861 ఎస్జీటీలు ఆన్లైన్ వల్ల నష్టపోతున్నాం ఉంగుటూరు మండలం తల్లాపురం యూపీ స్కూల్లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తూ 2023 చేపట్టిన ఆన్లైన్ బదిలీల్లో కుక్కునూరు మండలం కమ్మరిగుడెం ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వరుస క్రమంలో దొర్లిన పొరపాటు కారణంగా అంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ఆన్లైన్ బదిలీల వల్ల అనేక మంది ఎస్జీటీలు నష్టపోతున్నారు. – కె. కమల్కుమార్, ఎస్జీటీ, ఉంగుటూరు ఆఫ్లైన్ బదిలీలపై ఉత్తర్వులు ఇవ్వాలి ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల్లో విద్యాశాఖ ఉన్నత అధికారులు ఎస్జీటీలకు మాన్యువల్ బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాల ఉత్తర్వుల్లో ఎస్జీటీలంతా ఆన్లైన్లోనే దరఖాస్తులు, వెబ్ ఆప్షన్స్, జాయినింగ్ ఆర్డర్స్ అంటూ ఉత్తర్వులు ఇవ్వడం తగదు. వెంటనే జిల్లా కేంద్రాల్లో మాన్యువల్ బదిలీలకు ఉత్వరులు ఇవ్వాలి. – సీహెచ్ శ్రీధర్, యూటీఎఫ్ అధ్యక్షుడు, ఉంగుటూరుఅధికారుల నుంచి స్పష్టత రావాలి ఉన్నత అధికారులు జారీ చేసిన బదిలీల ఉత్తర్వుల్లో జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ ఎస్జీటీలు ఆన్లైన్లోనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ అన్ని కేటగిరి బదిలీలు, వెబ్ ఆప్షన్స్, ఆర్డర్స్ అన్నీ ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతున్నాయి. ఎస్జీటీలకు మాన్యువల్ ట్రాన్సఫర్ విషయంపై ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. – ఏవీఎస్ఎస్ భాస్కరకుమార్, ఎంఈవో, నిడమర్రు -
ట్రిపుల్ ఐటీలో రెండోరోజు సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో రెండోరోజు గురువారం ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. దీనిలో భాగంగా సైనికోద్యోగుల పిల్లల కోటా, ఎన్సీసీ, క్రీడా, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. క్రీడా కోటాకు సంబంధించి 245 మందికి 171 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు సంబంధించి 117 మందికి 79 మంది, ఎన్సీసీ కేటగిరికి సంబంధించి 341 మందికి 277 మంది, భారత్ స్కౌట్స్ గైడ్స్ కేటగిరికి సంబంధించి 247 మందికి 185 మంది హాజరయ్యారు. ఈనెల 30న ఎన్సీసీ, క్రీడా కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ప్రొఫెసర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు పర్యవేక్షించారు. భారత సైన్యం సత్తాకు ప్రతీక సిందూర్తాడేపల్లిగూడెం: దేశ రక్షణలో సైనికుల పాత్ర అమూల్యమని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణరావు అన్నారు. ఏపీ నిట్లో గురువారం జరిగిన తిరంగా యాత్రలో ఆయన మాట్లాడారు. భారత సైన్యం ధైర్య సాహసాలకు, త్యాగనిరతికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక అని అన్నారు. ఈ విజయం భారత జవాన్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. మాతృభూమి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి సైనికుడి జీవితం స్ఫూర్తిదాయకమని, విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కన్నవాళ్లకు, కుటుంబాలకు దూరంగా దేశ సరిహద్దుల్లో రాత్రి పగలూ విధులు నిర్వర్తిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్న సైనికుల పోరాటపటిమకు సెల్యూట్ కొట్టాలన్నారు. దేశభక్తిని చాటే నినాదాలతో త్రివర్ణ పతాకాలతో విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి, నిట్ అధికారులు పాల్గొన్నారు. -
రజకుల చెరువులను సర్వేచేసి హద్దులు నిర్ణయించాలి
జంగారెడ్డిగూడెం:జిల్లాలోని అనేక రజకుల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, దీంతో రజక వృత్తికి ఆటంకం ఏర్పడుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజకజన సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రజక చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట పడాలంటే చెరువులను సర్వేయర్లతో సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో ఆక్రమణలకు గురైన చెరువులను రజక సంఘాలతో కలిసి పరిశీలించి అధికారులతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో రజకులకు సుమారు 50 ఏళ్ల క్రితం కేటాయిచిన 3.11 ఎకరాల కోనేరు చెరువు ఆక్రమణలకు గురవ్వడంతో రజక వృత్తి చేసుకునేందుకు రజకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావుతో మాట్లాడగా చెరువుని రజకులకు ఉపయోగపడే విధంగా చేస్తామని తెలిపారన్నారు. చెరువులో సరిగా నీరు లేనందున లీజు రూ. 11వేలు రద్దు చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లా రజక సంఘ మహిళా అధ్యక్షురాలు మెట్ట లక్ష్మీ ప్రసన్న, గ్రామ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో.. భర్తకు మెసెజ్ పెట్టి గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్యఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. లొకేషన్ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
దళిత యువకులపై పోలీసుల తీరు దారుణం
చింతలపూడి: తెనాలిలో దళిత, మైనార్టీ యువకులపై పోలీసులు జరిపిన దుశ్చర్యపై దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చింతలపూడిలో నిరసన తెలిపారు. దళిత సంఘాల ఐక్య జేఏసీ నాయకులు ఎం.ఇమ్మానియేలు, దారా వీరేంద్ర, బుచ్చిబాబు మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దళితులు, మైనార్టీ యువకులపై దాడులకు దిగడం, ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి లాఠీలతో చితకబాదటంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. పోలీసులపై చర్యలు తీసుకునే వరకూ తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. రాష్ట్రంలో దళితులు మైనార్టీలు అంటే ప్రభుత్వానికి, అధికారులకు ఇంత చిన్నచూపా అంటూ ప్రశ్నించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత నియోజవర్గంలో దళితులను వెలివేసిన సంఘటన మరువక ముందే తెనాలిలో దళిత యువకులపై దాడులు చేయడంపై ప్రభుత్వం స్పందించాలని అన్నారు. పవన్ కల్యాణ్ సొంత ఇలాకాలో దళితులను వెలివేసినా ఆయన ఇంతవరకు స్పందించకపోవడం దారుణం అన్నారు. జేఏసీ నాయకులు సుందరమ్మ, బూసి నాగేశ్వరరావు, జూపూడి వసంత, భాను తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
ద్వారకాతిరుమల: జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మండలంలోని ద్వారకాతిరుమల, గుండుగొలనుకుంట, సూర్యచంద్రరావుపేట గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించి వ్యవసాయ, అనుబంధ రంగాల సాగు పద్ధతులను పరిశీలించారు. ద్వారకాతిరుమలలో ఫార్మ్ పాండ్స్ను, గుండుగొలనుగుంటలోని సుబ్రహ్మణేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో ఈ ఏడాది అదనంగా 10 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు లక్ష్యాన్ని సాధించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. సూర్యచంద్రరావుపేట లో బలుసు వీరభద్రయ్య క్షేత్రాన్ని పరిశీలించారు. కోకో రైతులు ఆందోళన చెందవద్దని, కోకో కిలో రూ.500 చొప్పున కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అనంతరం పశుగ్రాసం విత్తనాలను కలెక్టర్ అధికారులతో కలిసి పొలంలో చల్లారు. అనంతరం భీమడోలు మండలం పొలసానిపల్లిలోని ఎస్ఎంఆర్ జీడిపప్పు ప్రాసెసింగ్ సెంటర్ను కలెక్టర్ సందర్శించారు. యోగాతో ఆరోగ్యం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ద్వారకాతిరుమలలోని ఏపీ టూరిజం హరిత హోటల్ వద్ద గురువారం జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఆర్డీఓ రమణ, ప్రజలతో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా దోహదపడుతుందన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మాలిని, పర్యాటకాభివృద్ధి అధికారి పట్టాభిరామయ్య, తహసీల్దార్ జేవీ సుబ్బారావు, ఎంపీడీఓ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
సినిమా థియేటర్లలో తనిఖీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లావ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు థియేటర్లను పరిశీలిస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో థియేటర్లను గురువారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. థియేటర్ల నిర్వహణ, ప్రజలకు సౌకర్యాల ఏర్పాటు, క్యాంటిన్లలో ధరలు తదితర అంశాలు, రికార్డులను పరిశీలించారు. ఏలూరులో అంబికా థియేటర్, సాయి బాలా జీ థియేటర్, సత్యనారాయణ థియేటర్లలో తహ సీల్దార్ జీవీ శేషగిరి తనిఖీ చేశారు. ఓ థియేటర్లోని క్యాంటిన్లో కూల్ డ్రింకులు, వాటర్ బాటిల్స్ అధి క ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. జంగారెడ్డిగూడెంలో థియేటర్లను అక్కడి తహసీల్దార్ తనిఖీ చేశారు. కై కలూరులో విజయలక్ష్మి, వెంకటరమణ థియేటర్లను తహసీల్దార్ ఎండీ ఇబ్రహీం, భీమ డోలులో శ్రీనివాసా ఽథియేటర్ను తహసీల్దార్ ర మాదేవి తనిఖీ చేశారు. బంద్ పిలుపు కారణంగానే.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎగ్జిబిటర్లు నిర్మాతలతో సమావేశమై థియేటర్ల నిర్వహణపై పలు నిర్ణ యాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా థియేటర్లలో ప్రదర్శనలు అద్దె ప్రాతిపదికన కాకుండా సినిమాకు వచ్చే లాభాల ప్రాతిపదికన ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అలా లాభాల్లో వాటా ఇవ్వని పరిస్థితి వస్తే థియేటర్లను జూన్ 1 నుంచి మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్త సినిమా రిలీజైన వెంటనే ఓటీటీల్లో రిలీజ్ చేయకుండా చూడాలని నిర్మాతల ము ందుకు ప్రతిపాదనలు తీసుకువచ్చినట్టు తెలిసింది. అయితే ఆయా నిర్ణయాల వెనుక కుట్రకోణం ఉందని ఉప ముఖ్యమంత్రి భావించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో థియేటర్ల తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు పలువురు ఎగ్జిబిటర్లు విమర్శిస్తున్నారు. ఇదంతా కేవలం కక్ష సాధింపు చర్యగానే పరిగణిస్తున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రముఖ ఎగ్జిబిటర్ స్పష్టం చేశారు. జిల్లాలో 42 థియేటర్లు జిల్లాలో గతంలో 90 థియేటర్లు ఉండగా ప్రస్తుతం 42 థియేటర్లు నడుస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ఏలూరులో 15, చింతలపూడిలో 9, నూజివీడులో 5, ఉంగుటూరులో 6, కై కలూరులో 4, పోలవరంలో 3 థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. బంద్ పిలుపే తనిఖీలకు కారణమంటున్న ఎగ్జిబిటర్లు ఏలూరు జిల్లాలో 42 థియేటర్లు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న అధికారులు బంద్ విరమించారు సినీ పరిశ్రమలో ఎగ్జిబిటర్ల పాత్ర ఎంతో కీలకం. ఇటీవల థియేటర్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. నిర్వహణ వ్యయం కూడా రాని పరిస్థితి. దీంతో ఎగ్జిబిటర్లు బంద్ నిర్ణయం తీసుకున్నారు. అయితే పరిశ్రమ పెద్దలు మధ్యవర్తిత్వంతో తెలుగు చిత్రసీమ ప్రయోజనాల కోసం వారు బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. – అంబికా కృష్ణ, సినీ నిర్మాత, ఏలూరు నిర్వహణ సంతృప్తికరం ఏలూరులో థియేటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఒకటి రెండు అంశాలు తప్ప అంతా సంతృప్తికరంగా ఉంది. కొన్ని థియేటర్లలోని క్యాంటిన్లలో అధిక ధరలకు కూల్డ్రింక్లు విక్రయంచడాన్ని గుర్తించాం. దీనిపై నిర్వాహకులను హెచ్చరించాం. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – జీవీ శేషగిరి, ఏలూరు తహసీల్దార్ -
గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల పంపిణీ
సంవత్సరం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో) 2019–20 2,47,215 713.14 2020–21 2,59,198 745.25 2021–22 2,60,561 785.44 2022–23 2,70,547 813.62 2023–24 2,81,470 840.40 బియ్యం కోసం కష్టాలు తప్పవు రేషన్ బియ్యం కోసం గిరిజనులు కాలినడకన వెళ్లి కష్టాలు పడక తప్పదు. ఇంటింటికీ రేషన్ విధానం రద్దు వల్ల ప్రజలు అవస్థలు పడతారు. కూలీ పనులు మానుకుని మరీ క్యూలో నిలుచుని రేషన్ సరుకులు తీసుకోవాల్సి వస్తుంది. రేషన్ డోర్ డెలివరీ వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఎండీయూ వాహనాల ద్వారానే రేషన్ బియ్యం అందించాలి. లేకుంటే గిరిజన గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. – కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం -
ఇంటింటికీ సేవలు దూరం
ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల్లో ఎస్జీటీల బదిలీలపై స్పష్టత రాలేదు. వీరికి ఆఫ్లైన్లో బదిలీలు చేపట్టనున్నట్టు సమాచారం. 8లో uగడపగడపకూ సేవలు దూరమయ్యాయి.. రేషన్ కోసం బారులు తీరే క్యూలైన్లు.. పెన్షన్ కోసం అప్పుడప్పుడూ సచివాలయాలకు వెళ్లడం.. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కోసం మండల, జిల్లా కేంద్రాలకు పరుగులు.. పంట విక్రయాలకు మిల్లుల వద్ద పడిగాపులు.. ఇది ఏడాది కూటమి పాలనలో జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటికే పెన్షన్, రేషన్, ఫ్యామిలీ డాక్టర్ పేరిట వైద్యసేవలు, రైతుభరోసా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందగా ప్రస్తుతం ఇవన్నీ మృగ్యంగా మారాయి. అలాగే మరిన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ మళ్లీ ప్రజలను కూటమి ప్రభుత్వం రోడ్డెక్కిస్తోంది. శురకవారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో ఏడాది ప్రభుత్వ పాలనతో ప్రజల స్థితిగతులు తలకిందులయ్యా యి. ప్రతిదానికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, అర్జీలు ఇవ్వడం, పథకం అమలు చేసినప్పుడు అర్హత ఉంటే అమలు చేస్తామని సమాధానం రావడం, ప్రతి పౌర సేవ కోసం నెలలు తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితిని పాలకులు సృష్టించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పౌరసేవలు మొదలు సంక్షేమ పథకాల వరకు అన్నీ ఇంటి ముంగిటకే తీసుకువచ్చారు. ప్రధానంగా ప్రతి 50 కు టుంబాలకు ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి సేవలందించారు. ఇలా కోవిడ్, గోదావరి వరదల వంటి సంక్షోభ సమయంలోనూ సమర్థవంతమైన సేవలు అందించారు. జిల్లాలో 10,800 మంది వలంటీర్లు పనిచేశారు. వలంటీర్లకు జీతాలు పెంచుతాం, ఉద్యోగాలు కొనసాగిస్తాం అంటూ కూటమి నాయకులంతా గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి జిల్లాలో 10,800 మంది పొట్టకొట్టారు. రూ.3,897 కోట్ల పెన్షన్ పంపిణీ గత ప్రభుత్వం పెన్షన్ పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతినెలా 1వ తేదీన వేకువజామునే లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి వలంటీర్ పింఛన్ అందించేవారు. మధ్యాహ్నం 12 గంటలలోపు 95 శాతానికి పైగా పెన్షన్ల పంపిణీ పూర్తయ్యేది. ఎవరైనా తీవ్ర రుగ్మతలతో దూర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఉంటే వారి వద్దకు వెళ్లి మరీ వలంటీర్లు పింఛన్లు అందించి మన్ననలు పొందారు. జిల్లాలో 2,81,470 పెన్షన్దారులకు ప్రతినెలా సగటున రూ.81.75 కోట్ల చొప్పున ఐదేళ్లలో మొత్తంగా రూ.3,897.85 కోట్ల నగదు పంపిణీ చేశారు. అలాగే రెండేళ్ల పాటు గోదావరి వరదల్లోనూ సుమారు 1,000 మంది వరకు వలంటీర్లు పునరావాస సేవలు, తక్షణ నష్టపరిహార పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ వ్యవస్థనే రద్దు చేయడంతో సమస్యలు మొదటికి వచ్చాయి. పారదర్శకంగా ఇంటికే రేషన్ రేషన్ కోసం పడిగాపులు కాయడం, ప్రతినెలా 1 నుంచి 10వ తేదీ వరకూ రేషన్ షాపుల వవద్ద క్యూలైన్లకు స్వస్థి పలికేలా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ (ఎండీయూ) పేరుతో రేషన్ వాహనాలను గత ప్రభుత్వం తీసుకువచ్చింది. జిల్లాలో 395 వాహనాలను మంజూరు చేసి సబ్సిడీపై వాహనాలను సమకూర్చి ప్రతినెలా ఆపరేటర్కు రూ.21 వేలు జీతం ఇచ్చేలా ఏర్పాటు చేసి 395 మందికి ఉపాధి కల్పించారు. 1,123 రేషన్ షాపులకు 395 వాహనాలను అనుసంధానం చేసి జిల్లాలోని 6,31,044 రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా 8,791.03 టన్నుల బియ్యాన్ని, 218.75 టన్నుల పంచదార, కందిపప్పు, గోధుమపిండి, ఆయిల్ ప్యాకెట్లను కార్డుదారుల ఇంటి ముంగిటే పంపిణీ చేసేలా వ్యవస్థను రూపొందించారు. కూటమి ప్రభుత్వం తాజాగా ఈ వ్యవస్థను కూడా రద్దు చేయడంతో ఆపరేటర్లు పోరుబాట పట్టారు. న్యూస్రీల్వ్యవస్థల విధ్వంసం.. ప్రజలకు శాపం పేదింటి తలుపు తట్టిన జగన్ ప్రభుత్వం ఇంటి వద్దకే పథకాలు, రేషన్ సరుకులు, వైద్య సేవలు ప్రజలకు ఈ సేవలను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థ తొలగింపు పత్తాలేని ‘ఫ్యామిలీ డాక్టర్’ రేషన్ సరుకుల డోర్ డెలివరీ వ్యవస్థ రద్దు -
కొల్లేరులో అక్రమ తవ్వకాలు
సాక్షి టాస్క్ఫోర్స్: కొల్లేరు అభయారణ్యంలో ఫారెస్ట్ అధికారుల కళ్లు కప్పి గుట్టుచప్పుడు కాకుండా అక్రమ చెరువుల తవ్వకానికి అక్రమార్కులు మరోసారి తెర తీశారు. గురువారం ఏలూరు రూరల్ మండలం మానూరు శివారు హరిపురంలో చెరువు గట్లు ఏర్పాటుచేశారు. కొల్లేరులో చెరువులు తవ్వటానికి అనుమతి లేదని తెలిసినా పనులు ప్రారంభించారు. విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు ఇక్కడకు చేరుకుని గట్లను యంత్రాలతో ధ్వంసం చేశారు. అయితే గట్లు ఎవరూ వేశారన్నది తెలియదన్నారు. కొల్లేరులో జీఓ 120కు వ్యతిరేకంగా చెరువులు తవ్వితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిట్టుబాటు ధర కల్పించాలి దెందులూరు: నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం రామారావుగూడెంలో నిమ్మ తోటలను ఆయన పరిశీలించారు. నిమ్మ ధరలు తగ్గిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ నిమ్మకాయల సీజన్లో ధరలు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. 31న ‘20 సూత్రాల’పై సమీక్ష ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో శనివారం 20 సూత్రాల కార్యక్రమం అమలుపై ఈ కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ అధికారులతో సమీక్షిస్తారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, మ ధ్యాహ్నం 2.30 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తారని గురువారం కలెక్టరేట్ వర్గాలు ప్రకటనలో తెలిపాయి. ఆస్పత్రిలో పనిచేయని ఫ్రీజర్ నూజివీడు: నూజివీడు ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో ఏడాదిగా ఫ్రీజర్ పనిచేయడం లేదు. దీంతో అద్దె ఫ్రీజర్ను ఏర్పాటుచేశారు. అయితే అద్దె రోజుకు రూ.5 వేలను మృతదేహానికి సంబంధించిన వారే చెల్లించాల్సి వస్తుంది. అసలే కుటుంబసభ్యులు బాధలో ఉండగా వారితో అద్దె కట్టించడం దారుణమని, పాడైపోయిన ఫ్రీజర్కు మరమ్మతులు చేయించడం లేదా కొత్త ఫ్రీజర్ను ఏర్పాటుచేయడం చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. రిటర్నులు దాఖలు చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): సహకార సంఘాలు, సేవా సంఘాలు ఆదాయ పన్ను శాఖకు క్రమం తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాలని ఆ దాయ పన్నుశాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ భూక్యా సూచించారు. గురువారం స్థాని క డీసీఎంఎస్ హాల్లో జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీలు రిటర్నుల దాఖలుపై జిల్లా కో–ఆపరేటివ్ కార్యదర్శులు, పర్సన్ ఇన్చార్జిలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయపన్ను శాఖ లాగిన్ ద్వారానే రిటర్నులు దాఖలు చేయాలన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి ఆరిమిల్లి శ్రీనివాసు మాట్లాడుతూ జిల్లాలో సొసైటీలన్నీ ఆడిటర్ను సంప్రదిచి రిటర్నులు దాఖలు చేయాలని సూచించారు. ఏలూరు ఆదాయ పన్ను శాఖ అధికారి షేక్ అబ్దుల్ ఖయాం, డివిజనల్ కో– ఆపరేటివ్ అధికారి పి.త్రినాథ్, ఆడి టర్ ఆర్.రాధాకృష్ణ పాల్గొన్నారు. వెదురు సాగుకు సన్నాహాలు బుట్టాయగూడెం: డ్వాక్రా సంఘాల మహిళల ద్వారా వెదురు సాగును ప్రోత్సహిస్తున్నట్టు మా నవ వనరుల అభివృద్ధి పథకం జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఈ.వేణుగోపాల్ తెలిపారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో డ్వాక్రా సంఘాల వీఓఏలకు వెదురు సాగుపై శిక్షణ ఇచ్చా రు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాలను వెదురు సాగుకు పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశామన్నారు. 500 గ్రామ సంఘాల సభ్యులను ఎంపిక చేసి ఒక్కొక్కరూ 35 సెంట్లలో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. కుటుంబం ఆత్మహత్యాయత్నం జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో ఓ కు టుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన మంగిన సత్య దుర్గ చంద్రరరావు (చంద్రం), భార్య కృష్ణజ్యోతి, కుమారుడు దుర్గాచరణ్, కు మార్తె కోమలి గురువారం కూల్డ్రింక్లో కలు పు మందు కలిపి తాగారు. చుట్టుపక్కల వారు గమనించి స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి వీరిని మె రుగైన వైద్యం కోసం విజయవాడ తరలించా రు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు కారణంగా తె లుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఒక మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని సూత్రాలతో సహా బంగారు గొలుసుని దోపిడీ చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన మునగాల జానకీ దేవి, ఆమె భర్త శ్రీరామశాస్త్రి ప్రభుత్వ టీచర్లుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఇల్లు మరమ్మతుల నిమిత్తం తాపీ పనివారిని పెట్టుకున్నారు. ఈ నెల 23న తాపీ పనిచేసేందుకు పేరంపేటకు చెందిన చింతపల్లి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు, నక్కా శ్రీను అలియాస్ పండు, యడ్లపల్లి విజయరాజు వచ్చారు. వారు పని ప్రారంభించగా శ్రీరామశాస్త్రి టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ ముగ్గురు జానకీ దేవి కంట్లో కారం కొట్టి నాలుగు కాసుల బంగారు గొలుసు, మంగళసూత్రాలతో సహా దోచుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను సీఐ కృష్ణబాబు అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టుకు సంబంధించి ఎస్సై షేక్ జబీర్ ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.రమేష్, రాజశేఖర్ సహకరించగా, వీరిని డీఎస్పీ రవిచంద్ర అభినందించారు. సమావేశంలో సీఐ కృష్ణబాబు, ఎస్సై షేక్ జబీర్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలి
ఏలూరు(మెట్రో): జీవో 23 ప్రకారం ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీవోస్ నాయకులు కోరారు. బుధవారం కలెక్టర్ వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలుసుకుని బదిలీ ప్రక్రియపై విన్నవించారు. ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్లో ఉన్న ఆఫీస్ బేరర్స్కి అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోల ప్రకారం బదిలీలు చేసేలా ప్రతి శాఖాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు కలెక్టర్ను కోరారు. ఈ మేరకు కలెక్టర్ స్పందిస్తూ జిల్లా రెవెన్యూ అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు నాయకులు తెలిపారు. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రెటరీలకు పదోన్నతులు కల్పించాలని కోరగా, ఏఎన్ఎంల పదోన్నతుల ఫైల్ను ఆమోదించినందుకు కలెక్టర్కు పూలమొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, ఎన్జీవోస్ నాయకులు, హెల్త్ సెక్రటరీలు పాల్గొన్నారు. 14న అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర ఏలూరు (టూటౌన్): భారతీయ రైల్వేస్ అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో జూన్ 14 నుంచి 22 వరకు అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర నిర్వహిస్తున్నట్లు సంస్థ విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. ఈమేరకు ఈ యాత్రకు సంబంధించిన బ్రోచర్ను బుధవారం స్థానిక రైల్వేస్టేషన్ నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ అయోధ్య–కాశీ యాత్రలో భాగంగా వారణాసి, ఆయోధ్య, ప్రయాగ్రా, నైమిశారణ్యం ప్రాంతాల్లోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చునన్నారు. యాత్ర మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగలు సాగుతుందన్నారు. ఈ నెల 14న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే రైలు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా వెళుతుందన్నారు. టిక్కెట్ల బుకింగ్ కొరకు ఐఆర్సీటీసీ, రైల్వే రిటైరింగ్ రూమ్ దగ్గర, విజయవాడ రైల్వే స్టేషన్ నందు గాని ఆన్లైన్ నందుగాని చేసుకోవచ్చునన్నారు. వివరాలకు సెల్ నెం.9281495848 నందు సంప్రదించాలని కోరారు. -
అడుగంటిన మంచినీటి చెరువులు
భీమవరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. దీంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. వేసవి ప్రారంభంలో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా చెరువులను పూర్తిస్థాయిలో నీటితో నింపకపోవడమే సమస్యకు కారణమని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. భీమవరం మండలంలోని గొల్లవానితిప్ప, కొత్తపూసలమర్రు, దొంగపిండి, గూట్లపాడు, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం, పెదగరువు, బేతపూడి తదితర గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. దీంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఫిల్టర్ బెడ్లు పనిచేయకపోవడంతో బురద నీటినే పంచాయతీ సిబ్బంది కుళాయిల ద్వారా అరకొర సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 15 తరువాత ఎప్పుడైనా పంటకాలువలు కట్టేస్తారు. ముందు జాగ్రత్తచర్యగా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో మార్చి నెలాఖరు నుంచే రక్షిత మంచినీటి చెరువులు తాగునీటిని నింపాల్సి ఉంది. అయితే ఈ ఏడాది పెదగరువు, బేతపూడి గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువుల్లోను పూడిక తీత పనులు నిర్వహించడం, మిగిలిన గ్రామాల్లో ఏప్రిల్ చివరి వరకు తాగునీటి చెరువులను నింపకపోవడంతో మే నెల గడవకముందునే రక్షిత మంచినీటి చెరువులు అడుగంటాయి. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో వాడుక చెరువులలో నీటిని సైతం నింపకపోవడంతో అటు తాగునీటికి, ఇటు వాడకానికి నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళాయిల ద్వారా అరకొర సరఫరా పంచాయతీ సిబ్బంది రోజుకు గంట మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని, ఆ నీరు కూడా బురదమయంగా ఉంటోందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో 20 లీటర్ల మినరల్ వాటర్ రూ.30 నుంచి రూ.35కు కొనుగోలు చేసి తాగుతున్నామని, స్థోమత లేనివారు కుళాయిల ద్వారా వచ్చే బురదనీటినే తాగి అనారోగ్యాల పాలవుతున్నామని బాహాటంగానే చెబుతున్నారు. గ్రామాల్లో దాహం కేకలు చెరువులను పూర్తిస్థాయిలో నింపకపోవడంతోనే సమస్య బురద నీరు వస్తుంది కుళాయిల ద్వారా రోజుకు ఒక గంట మాత్రమే తాగునీరు ఇస్తున్నారు. అది కూడా బురదగా వస్తుంది. ఇంటి వాడకానికే తప్ప తాగడానికి ఆ నీరు పనికి రావడం లేదు. డబ్బులుంటే మినరల్ వాటర్ కొనుక్కుని తాగుతున్నాం. లేకుంటే ఆ నీటినే తాగాల్సి వస్తుంది. – మేళం సోమన్న, గ్రామస్తుడు, గొల్లవానితిప్ప గంట మాత్రమే ఇస్తున్నారు గ్రామానికి శివారు కావడంతో రోజుకు గంట మాత్రమే తాగునీటిని ఇస్తున్నారు. ఇంటింటికి కుళాయిలు ఇవ్వలేదు. పంచాయతీ కుళాయిల ద్వారా వచ్చే నీటినే తెచ్చుకుంటున్నాం. అవి మురికిగా వస్తున్నాయి. – దేవిరెడ్డి వెంకటలక్ష్మి, గృహి ణి, హౌసింగ్ కాలనీ, గొల్లవానితిప్ప -
మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
నూజివీడు: గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ధర లేక మామిడి రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. దీంతో మామిడి రైతులు నష్టాల్లో కూరుకుపోయారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారాన్ని చెల్లించి మామిడి రైతులను ఆదుకోవాలన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగినపల్లి, తోతాపురి, రసాలు తదితర రకాలకు ధరలు దారుణంగా పడిపోయాయని, దీంతో కోతకూలి, కిరాయిలు కూడా రాని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయన్నారు. తోతాపురి కాయలు టన్ను కేవలం రూ.3వేల నుంచి రూ.4వేలు ధర మాత్రమే ఉందని, దీంతో కాయలు కోయడానికి ఎదురు పెట్టుబడి అవుతోందని రైతులు కోతలు కూడా కోయడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలు ఇంత వరకు తెరవకపోవడంతో తోతాపురి కాయలను కొనేవారే లేరని పేర్కొన్నారు. అకాల వర్షాల కారణంగా మామిడి రైతులు నిండా మునిగిపోయారన్నారు. పూతలు, పిందెలు నిలుపుకునేందుకే రైతులు పురుగుమందులు పిచికారీ చేసేందుకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారన్నారు. అలాగే ఎరువులు, దుక్కి ఖర్చు, తోటల కాపలా ఖర్చు అన్నీ చూసుకుంటే రూ.50 వేలు పెట్టుబడి అయిందని, ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లిస్తేనే రైతులు గట్టెక్కుతారన్నారు. మామిడి రైతులు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారిని పట్టించుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, విజయవాడ, వరంగల్, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాల్లో నూజివీడు చిన్నరసం పేరుతో బోర్డులు పెట్టి వేరే ప్రాంతాల్లో కాసిన కాయలను విక్రయిస్తున్నారని, దీనిని బట్టే నూజివీడు ప్రాంతం మామిడికి ఎంతో ప్రసిద్ధో అర్ధమవుతుందన్నారు. అంతటి ప్రాధాన్యం ఉన్న మామిడిని సాగు చేస్తున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
చాట్రాయి: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన పరసా ఈశ్వరరావు ఇంటి పక్కన ఉన్న 11 కేవీ వైరు ఇంటి సర్వీస్ వైరుపై పడి ఇల్లంతా విద్యుత్ ప్రసారం అయ్యింది. ఆ సమయంలో గదిలో నిద్రపోతున్న పరసా ప్రభు కిరణ్(18) బోర్డులో స్విచ్ ఆపుతుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఐ రామకృష్ణ తెలిపారు. గోదావరిలో దూకిన యువకుడి గల్లంతు యలమంచిలి: మండలంలోని చించినాడ వశిష్ట గోదావరి వంతెన మీద నుంచి దూకి యువకుడు గల్లంతైనట్లు ఎస్సై కె గుర్రయ్య తెలిపారు. వంతెనపై దొరికిన బైక్, సెల్ఫోన్ ఆధారంగా అతడు భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన షేక్ కాసు (24)గా అనుమానిస్తున్నారు. ఈ మేరకు షేక్ కాసు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఎకై ్సజ్ కేసుల్లో నలుగురి బైండోవర్ భీమవరం: ఎకై ్సజ్ కేసులకు సంబంధించి భీమవరం మండలంలోని నలుగురు వ్యక్తులను బుధవారం భీమవరం తహసీల్దార్ ఆర్ రాంబాబు వద్ద బైండోవర్ చేసినట్లు భీమవరం ఎకై ్సజ్ సీఐ కె బలరామరాజు చెప్పారు. బైండోవర్ చేసిన వారిలో ఇళ్ల శ్రీనివాసరావు, యెలుదూటి నాగన్న, యల్ల శేఖర్, బడుగు రవి ఉన్నారన్నారు. వీరు ఏడాది కాలంలో మరోసారి ఎకై ్సజ్ నేరంలో పట్టుబడితే రూ.లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సీఐ తెలిపారు. చికిత్స పొందుతూమహిళ మృతి భీమవరం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భీమవరం వన్టౌన్ పోలీసులు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 24వ తేదీన వీరవాసరం మండలం పంజావేమవరం గ్రామానికి చెందిన కొడమంచిలి మేరి(35) భర్తతో కలిసి మోటారు సైకిల్పై భీమవరం వస్తుండగా పోలీసుబొమ్మ సెంటర్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో మేరి తీవ్రంగా గాయపడగా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వన్టౌన్ ఎస్సై ఎస్వీవీఎస్ కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్ విగ్రహం పాక్షిక ధ్వంసం
పెంటపాడు: పెంటపాడులోని వెలంపేట కోనేరు చెరువు వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని బుధవారం వేకువజామున గుర్తుతెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం ఎడమ చేయి మోచేతి వరకూ విరిగి కింద పడి ఉంది. గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బర్ల జయ రాంబాబు ఈ విషయాన్ని ముందుగా గుర్తించారు. మంగళవారం రాత్రి వరకూ విగ్రహం బాగానే ఉందని, ఉదయం చూస్తే ఇలా చేయి విరిగి పడి ఉందని వైఎస్సార్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ మహానాడు జరుగుతున్న సమయంలో ఇక్కడ వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కావడం చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్రెడ్డి జిల్లాలో ఓదార్పు యాత్ర చేసిన సమయంలో ఈ విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించారు. విగ్రహం జీవ కళ ఉట్టిపడేలా ఉందని శిల్పిని, నిర్వాహకులను అభినందించారు. అప్పటి నుంచి ఇక్కడ పలు కార్యక్రమాలను వైఎస్సార్ అభిమానులు నిర్వహిస్తున్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య పెదవేగి : అప్పుల బాధ తట్టుకోలేక మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. పెదవేగి మండలం కె కన్నాపురం గ్రామానికి చెందిన కమిలి భాస్కరరావు (35) గృహ నిర్మాణ అవసరాల నిమిత్తం కొంత కాలం క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీంతో రికవరీ ఏజెంట్లు అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయగా మనస్తాపానికి గురైన భాస్కరరావు బుధవారం ఇంటి సమీపంలోని కోకో తోటలో చెట్టుకు కరెంట్ వైరుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు శవపంచనామా నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం పెంటపాడు: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం పాలైన ఘటన బుధవారం తాడేపల్లిగూడెం– భీమవరం రోడ్డులో ముదునూరు వద్ద జరిగింది. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాలివి. ఆరుగొలను గ్రామానికి చెందిన అడ్డగర్ల సాయి రమేష్ (34) కరెంట్ పని చేస్తుంటాడు. బుధవారం పనినిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి మోటార్ సైకిల్పై స్వగ్రామం వస్తుండగా ముదునూరు మలుపు వద్ద భీమవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
ట్రాక్టర్ను ఢీకొన్న లారీ
యలమంచిలి: అడవిపాలెం సచివాలయానికి సమీపంలో ఖాళీ స్థలంలో నిలుపుదల చేసి ఉన్న ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. ఆ శబ్థానికి చుట్టుపక్కల ఇళ్లలోని వారు బయటకు వచ్చి భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగిన సమయానికి ఎవరూ లేకపోవడం వలన పెను ప్రమాదం తప్పింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ విలేకరి ప్రమాద ఘటనను ఫొటో తీయగా లారీ డ్రైవర్ దౌర్జన్యానికి దిగాడు. దీనిపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఆ లారీకి కనీసం నెంబర్ ప్లేట్ లేకపోవడం విశేషం. నంబర్ ప్లేట్ లేని లారీతో కూటమి నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులతో పాటు మైనింగ్, రవాణా శాఖ అధికారులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. -
ధాన్యం మద్దతు ధర కంటి తుడుపే
పెదపాడు: ఖరీఫ్, రబీ పంటలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటి తుడుపు చర్యేనని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. పెదపాడు మండలంలోని వట్లూరు గ్రంథాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో మద్దతు ధరలపై సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్పత్తి ఖర్చులు తక్కువ చూపి కేంద్ర ప్రభుత్వం ధరలు ప్రకటించడం వల్ల రైతులకు కనీస పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు వాస్తవ ఖర్చులు లెక్కకట్టి ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతులు తుమ్మల ధన కోటేశ్వరరావు, కొమ్మన సాంబశివరావు, కొమ్మనేని అచ్యుతరావు, కొల్లిపర కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
బిల్లులు ఇవ్వడం లేదు
నాకు 2014లో ఇల్లు మంజూరైంది. అప్పట్లో ప్రభుత్వం కొంత బిల్లు చెల్లించినప్పటికీ మిగిలిన సొమ్ము ఇంతవరకు ఇవ్వలేదు. నా సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్నాను. నాకు రావాల్సిన ఇంటి బకాయి కోసం నిరీక్షిస్తున్నాను. వెంటనే పెండింగ్ బిల్లు ఇప్పించాలి. –ఒడిత్య భీముడు, నాగిరెడ్డిగూడెం, చింతలపూడి మండలం రైతు భరోసా అటకెక్కించారు ఏటా రూ.20 వేలు సాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు సాయం అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నాం. జగనన్మోహన్్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఆర్ధిక సమస్యలు లేకుండా రైతు భరోసా వంటి పధకాలు అందజేసి అండగా నిలిచింది. – బొమ్మనబోయిన గోకర్ణ యాదవ్, రైతు, మండవల్లి ● -
తణుకులో కోవిడ్ కలకలం!
తణుకు అర్బన్: కోవిడ్ అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్న తణుకుకు చెందిన వృద్ధురాలికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. పట్టణంలోని పైడిపర్రుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు ఇటీవల చార్ధామ్ యాత్రకు వెళ్లి వచ్చాక గత మూడు రోజులుగా అనారోగ్యం బారిన పడ్డారు. ఈ నెల 27న తణుకులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కోవిడ్ అనుమానిత లక్షణాలతో రాజమండ్రికి తరలించగా అక్కడ చేసిన ర్యాపిడ్ కిట్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు సమాచారం. దీంతో మెరుగైన వైద్యసేవలకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ యాత్రలకు పైడిపర్రు నుంచి 15 మంది వరకు వెళ్లారని ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. కోవిడ్ పాజిటివ్ అన్న సమాచారంతో బుధవారం ఉదయం మున్సిపల్ శానిటరీ అధికారులు పైడిపర్రులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ విషయంపై వైద్య శాఖ అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఈ విషయంపై డీఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయిని వివరణ కోరగా కోవిడ్ లక్షణాలున్న వృద్ధురాలికి తణుకులో ఎలాంటి పరీక్షలు చేయలేదని, ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. పరీక్షకు సంబంధించిన రిపోర్టు గురువారం వస్తుందని చెప్పారు. మునిసిపల్ అధికారులు శానిటేషన్ చేయించారు తప్ప.. వైద్యశాఖ నుంచి ఎలాంటి జాగ్రత్తలు, అవగాహన కల్పించకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టని యంత్రాంగం కోవిడ్ పాజిటివ్ వచ్చిందనే సంకేతాలు ఉన్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో జలుబు, దగ్గు, ఆయాసం సమస్యలు ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ పరీక్షలు పశ్చిమగోదావరి జిల్లాలో అందుబాటులో లేవు. పరీక్షలు, సంబంధించిన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో కోవిడ్ కేసు నమోదు కాకుండానే పరీక్షలు నిర్వహించే కిట్లు, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు, వార్డుల్లో బెడ్స్ అందుబాటులో ఉంచారు. ఆక్సిజన్ వంటి ఏర్పాట్లు చకచకా చేశారు. కడప ప్రాంతంలో కూడా కోవిడ్ కేసులు నమోదయ్యాయనే వార్తలు రాగా.. తణుకు నుంచి మహానాడుకు టీడీపీ శ్రేణులు వెళ్లడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వృద్ధురాలికి పాజిటివ్ వచ్చినట్లు ప్రచారం పైడిపర్రులో ప్రత్యేక శానిటేషన్ -
సేంద్రీయ ఉత్పత్తులపై నమ్మకం పెంచాలి
ఏలూరు(మెట్రో): సేంద్రీయ ఉత్పత్తులపై నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీ షేక్ హాబీబ్ బాషా అన్నారు. ఏలూరు వ్యవసాయ కార్యాలయంలో బుధవారం సేంద్రీయ దుకాణాలు, ఎన్పీఎం ఉత్పత్తులపై రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రీయ, ప్రకృతి విధానంలో ఉత్పత్తి చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ పరిధిని విస్తరించే మార్గాలను పరిశీలించాలన్నారు. ఉత్పత్తులు పర్యావరణానికి ఉపయోగకరంగా ఉండేలా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇంటర్ ప్రాక్టికల్స్కు 48 మంది హాజరుఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు బుధవారం 5 కేంద్రాల్లో నిర్వహించారు. ఉదయం 61 మందికి 24 మంది హాజరు కాగా 37 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 34 మందికి 24 మంది హాజరయ్యారు. దూరవిద్య విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్ సప్లిమెంటరీ ప్రయోగ పరీక్షల్లో బుధవారం భౌతిక, రసాయనశాస్త్రాల పరీక్షలకు మొత్తం 55 మందికి 43 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.బాల సదనంలో సౌకర్యాల పరిశీలనదెందులూరు: దెందులూరు ప్రభుత్వ బాలసదనాన్ని బుధవారం న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.రత్న ప్రసాద్ సందర్శించారు. బాలికల విద్య, వసతి, ఆహారం, విద్యుత్, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు పరిశీలించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికై నా ఉచిత న్యాయ సలహాలు, సూచనలు ఇవ్వడానికి న్యాయ సేవ అధికార సంస్థ సేవలందిస్తుందన్నారు.ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ల పరిశీలననూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 2025–26 ప్రవేశాల్లో భాగంగా ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించారు. క్యాంపస్లోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఉన్న ఆడిటోరియంలో ఏర్పాట్లు చేశారు. తొలిరోజు సైనికోద్యోగుల పిల్లల కోటాలో 119 మంది అభ్యర్థులు, క్రీడా కోటాలో 227 మంది హాజరయ్యారు.కూటమి నేతల ప్రాపకం కోసం పాట్లుద్వారకాతిరుమల: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ప్రభుత్వ అధికారులకు కలిసొచ్చాయి. కొందరు అధికారులు ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ద్వారకాతిరుమల తహసీల్దార్ జేవీ సుబ్బారావు ఎన్టీఆర్ జయంతి వేడుకలను తన కార్యా లయంలో ఘనంగా నిర్వహించారు. వీఆర్వోలు, రేషన్ డీలర్లు పాల్గొనేలా చూశారు. ఇదిలా ఉంటే తహసీల్దార్ సుబ్బారావు పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న కొందరు కూటమి నేతలు ప్రస్తుత బదిలీల్లో ఆయనను ఇక్కడి నుంచి సాగనంపాలని భావిస్తున్నారట. ఈ తరుణంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు తహసీల్దార్కు కలిసొచ్చాయని కొందరు అంటున్నారు.ఆక్వాకు పంట విరామంయలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన ఆక్వా రైతు, సొసైటీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు బుధవారం ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల రొయ్య దిగుబడి బాగుంటున్నా ధర పతనం కావడం, మేతలు, మందుల ధరలు పెరిగిపోవడంతో రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. -
నాడు వెలుగులు.. నేడు విధ్వంసం
కై కలూరు మండలం వేమవరప్పాడులో సుమారు 700 ఇళ్లు ఉన్నాయి. ఈ ఒక్క గ్రామంలో ఐదేళ్లలో వైఎస్సార్ పెన్షన్ కానుకగా రూ.4.37 కోట్లు, అమ్మ ఒడిలో 257 మందికి రూ.1.06 కోట్లు, పేదలందరికీ ఇళ్లు పథకంలో 161 మందికి రూ.2.89 కోట్లతో ఇళ్ళ నిర్మించారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25.30 లక్షలు ఖర్చు చేశారు. ఫీజు రియింబర్స్మెంట్ ద్వారా రూ.67.34 లక్షల లబ్ధి చేకూరింది. వైఎస్సార్ ఆసరా, చేయూత ద్వారా రూ.1.17 కోట్లు అందజేశారు. మొత్తంగా ఈ ఒక్క గ్రామానికి రూ.8.77 కోట్ల సంక్షేమ పథకాలు అందగా.. గ్రామంలో రూ. 9.73 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. మొత్తం రూ.18.50 కోట్లు సంక్షేమం, అభివృద్ధి కోసం ఒక్క గ్రామంలో ఖర్చుపెట్టారు. గత ప్రభుత్వంలో ఏలూరు చొదిమెళ్ళలో ఒకే ప్రాంతంలో నిర్మించిన సచివాలయం, ఆర్బీకేగత ప్రభుత్వంలో ప్రజలకు రూ.10 వేల కోట్ల నగదు జమ వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు సంక్షేమ క్యాలెండర్ను ప్రకటించి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేసింది. జిల్లాలో 2,35,847 మంది రైతులకు రైతు భరోసా ద్వారా రూ.1839.24 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశారు. 97,584 మంది రైతులకు రూ.22.29 కోట్ల సున్నా వడ్డీ పంట రుణాలు అందించారు. రైతుభరోసా, అమ్మ ఒడి, డ్వాక్రా రుణాలు, ఇతర పథకాల ద్వారా ఒక్క ఏలూరు జిల్లాలోనే రూ.10 వేల కోట్లకుపైగా నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. పథకం లబ్ధిదారులు చేకూరిన లబ్ధి (రూ.కోట్లలో) రైతు భరోసా 2,35,847 1839.24 సున్నా వడ్డీ రుణాలు 9,7584 22.29 పెన్షన్లు 2,81,470 3,880.09 వైఎస్సార్ ఆసరా 3,55,315 1305.05 డ్వాక్రా రుణాలు 30,917 (సంఘాలు) 702 వైఎస్సార్ సున్నా వడ్డీ 43,765 (సంఘాలు) 221.99 సీ్త్ర నిధి రుణాలు 39,255 546.53 వైఎస్సార్ చేయూత 1,16,491 561.53 సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్ జగన్ పాలనలో గ్రామ సచివాలయాలతో మొదలైన పల్లెల అభివృద్ధి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల వరకు విస్తరించింది. ప్రతి పథకం ఇంటికి అందించేలా వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రేషన్ వాహనాలను నిలిపేశారు. నాడు వెలిగిపోయిన పల్లెటూరు నేడు విధ్వంసానికి గుర్తుగా మారింది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను తెరమరుగుచేసేందుకు ప్రయత్నిస్తోంది. ఏలూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశారు. రూ.వందల కోట్లతో సచివాలయ, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ భవనాలు నిర్మించారు. వీటిని నిరుపయోగం చేసే ప్రక్రియ కూటమి ప్రభుత్వ పాలనలో కొనసాగుతోంది. అంతా విధ్వంసమే ఏలూరు జిల్లాలో 350 ఆర్బీకేలను రూ.83 కోట్లతో నిర్మించారు. 443 గ్రామ సచివాలయాలు రూ.193.15 కోట్లతో, 271 విలేజ్ హెల్త్ క్లినిక్లు రూ.56.37 కోట్లతో నిర్మించారు. కూటమి ప్రభుత్వం క్లస్టర్ల పేరుతో సచివాలయాలు కుదించడం, కోవిడ్, వరదల్లో కీలకంగా పనిచేసిన వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం, 397కు పైగా మొబైల్ రేషన్ వాహనాలను తొలగించడం ఇలా అంతా విధ్వంసమే. గత ప్రభుత్వం సచివాలయాల్లో సుమారు 4701 మందికి ఉద్యోగాలు కల్పించింది. 10,800 మంది వలంటీర్లతో ప్రజలకు సేవలందించింది. నిలిచిన ఇళ్ల నిర్మాణం జిల్లాలో 1,16,431 ఇళ్ల పట్టాలను మంజూరు చేసి 98,874 ఇళ్లను రూ.713.17 కోట్లతో నిర్మించారు. జిల్లా చరిత్రలోనే ఇది కీలక ఘట్టం. కై కలూరు, ఏలూరు, దెందులూరు, చింతలపూడి ఇలా అన్ని నియోజకవర్గాల్లో జగనన్న కాలనీల పేరుతో పెద్ద ఊళ్లు వెలిశాయి. కొత్త ప్రభుత్వం 49 వేల ఇళ్ళను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రకటించినా.. అడుగు ముందుకు పడని పరిస్థితి. జిల్లాలో 2032 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పథకం ద్వారా రెండు విడతల్లో రూ.270.75 కోట్లతో రూపురేఖలు మార్చారు. 206 అంగన్వాడీ కేంద్రాలను రూ.4.5 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. కూటమి పాలనలో గ్రామ వ్యవస్థలు నిర్వీర్యం అలంకారప్రాయంగా సచివాలయాలు, ఆర్బీకేలు సేవలందక ప్రజలు, రైతులకు ఇక్కట్లు గత ప్రభుత్వంలో రూ.193.15 కోట్లతో సచివాలయాలు, రూ.83 కోట్లతో ఆర్బీకేల నిర్మాణం క్లస్టర్ పేరుతో సచివాలయ వ్యవస్థ విధ్వంసానికి కూటమి ప్రభుత్వం కుట్ర లక్ష ఇళ్ల నిర్మాణంతో చరిత్ర సృష్టించిన నాటి సర్కార్ నేడు కాగితాలకే పరిమితం సూపర్ సిక్స్ మొదలు జిల్లా స్థాయి హామీల వరకూ అన్నీ తూచ్ -
మాదకద్రవ్యాల వాడకం అడ్డుకట్టకు చర్యలు
ఏలూరు(మెట్రో): యువత భవిష్యత్ను నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ‘నాషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్లో బుధవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగ నివారణ దినోత్సవం సందర్భంగా జూన్ 1 నుంచి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై 1972 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు రవాణా చేసే వారికి కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.మాలిని తదితరులు పాల్గొన్నారు. 29న ద్వారకాతిరుమలలో యోగాంధ్ర ఈ నెల 29న ద్వారకాతిరుమల హరిత హోటల్ వద్ద, జూన్ 5న పట్టిసీమ రివర్ ఇన్ రిసార్ట్ వద్ద, జూన్ 11న మద్ది ఆంజనేయస్వామి దేవాలయం వద్ద, జూన్ 18న జీలకర్రగూడెం, గుంటుపల్లి బౌద్ధరామాల వద్ద యోగాసనాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. పందుల సంచారంపై చర్యలు తీసుకోవాలి ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనావాసాలలో పందులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పందుల బెడద, నియంత్రణపై జిల్లా స్థాయి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. పందుల పెంపకాన్ని జనావాసాల నుంచి ఊరి చివరకు మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఊరి చివర పశువుల షెడ్లు ఏర్పాటుచేయాలని, పెంపకందార్ల పునరావాసానికి ప్రభుత్వ పథకాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
వైఎస్సార్సీపీ పటిష్టానికి కృషి చేద్దాం
నూజివీడు: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఎవరూ అధైర్య పడొద్దని, పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని మాజీ ఎమ్మెల్యే, నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పిలుపునిచ్చారు. నూజివీడు మండలానికి చెందిన నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధికారాన్ని కోల్పోయాక కొందరు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని, దాని గురించి ఆలోచించాల్సిన పనిలేదన్నారు. పాతనీరు పోతే కొత్తనీరు వస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. చంద్రబాబు పాలన బాగుందని ఒక్కరూ కూడా చెప్పడం లేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీలు మారిన వారందరికీ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన నేపథ్యంలో జూన్ 4న ఏలూరులో నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏడాది కాలంలో ఒక్క పని జరగ లేదని, ప్రతిపనికీ డబ్బులేనని, అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. చెరువుల్లో మట్టిని, గ్రావెల్ను తోలుకొని సహజ సంపదలను దోచుకోవడంపై ఉన్న ఆసక్తి అభివృద్ధిపై లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, మాజీ జెడ్పీటీసీ బాణావతు రాజు, నాయకులు వెలివల నాగేశ్వరరావు, వడ్డాది త్రినాథరావు, కోపూరి సుధాకర్, మందాడ శంకరరావు, పాలడుగు నాని, అక్కినేని ప్రేమసాయి(పసి), నక్కనబోయిన వెంకటేశ్వరరావు, చల్లారి రాఘవ, మేరుగ లెనిన్, బాణావతు కిషోర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు -
గోదావరిలో ముగ్గురు బాలుర గల్లంతు
పెనుగొండ: కోనసీమలో గోదావరిలో ఎనిమిది మంది యువకుల గల్లంతు వార్త మరువక ముందే.. ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద స్నానానికి దిగిన బాలురలో ముగ్గురు గల్లంతవడం తీవ్ర విషాదం నింపింది. మంగళవారం సాయంత్రం ముగ్గురు బాలురు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలానికి చెందిన కేతా ప్రవీణ్(15), సానబోయిన సూర్యతేజ(12), పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలికి మండలం పెదలంకకు చెందిన నీతిపూడి పాల్ కుమార్(15) స్నేహితులతో కలసి గత కొన్ని రోజులుగా గోదావరి స్నానానికి వస్తున్నారు. ఇదే కోవలో మంగళవారం మధ్యాహ్నం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ప్రవీణ్, సూర్యతేజ, పాల్ కుమార్ మునిగిపోవడంతో మిగిలిన ఇద్దరు భయపడి వెంటనే బంధువులకు సమాచారం అందించారు. కేతా ప్రవీణ్, పాల్కుమార్ ఇటీవల పదో తరగతి పరీక్షలు పూర్తిచేశారు. పేద కుటుంబాల్లో పెను విషాదం గల్లంతైన ప్రవీణ్ తండ్రి వెంకటేశ్వరరావు తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సూర్యతేజ తండ్రి ఏడుకొండలు వడ్రంగి మేసీ్త్ర.. పాల్కుమార్ తండ్రి మృతి చెందడంతో తల్లి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లింది. ముగ్గురు బాలురు గల్లంతుతో సంఘటన ప్రాంతంలో విషాదం నెలకొంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం ఆజ్మీ, నర్సాపురం డీఎస్పీ డాక్టర్ వేద, పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన ముగ్గురు బాలుర కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద ఘటన స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిన బాలురు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
భీమవరం (ప్రకాశంచౌక్): విధుల్లో నిర్లక్ష్యం వహి స్తూ సమావేశాలకు గైర్హాజరవుతున్న మున్సిపల్ అధికారుల పై, నిర్ధేశిత లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ రీజనల్ డైరక్టర్ సీహెచ్ నాగ నర్సింహరావు హెచ్చరించారు. మంగళవారం భీమవరం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాలులో జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆయా మున్సిపాలిటీలకు నిర్ధేశించిన లక్ష్యాలను, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఆరా తీశారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై స్థానికంగా ఉన్న కమిషనర్లు సస్పెండ్ వరకూ చర్యలు తీసుకోవాలన్నారు. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపాలిటీలకు సంబంధించి కమిషనర్లు, రెవెన్యూ అధికారులు ప్లానింగ్ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, సెక్షన్ హెడ్స్ పాల్గొన్నారు. -
తణుకులో కోవిడ్ కేసు?
తణుకు అర్బన్: తణుకులో వృద్ధురాలికి కోవిడ్ సోకినట్లు వార్తలు రావడంతో కలకలం రేగింది. ప్రైవేటు ఆస్పత్రిలో ఒక మహిళ కోవిడ్తో చికిత్స పొందుతున్నారన్న వార్త సోషల్మీడియాలో హల్చల్ చేసింది. పైడిపర్రుకు చెందిన వృద్ధురాలు ఇటీవల యాత్రలకు వెళ్లి వచ్చాక అనారోగ్యం బారిన పడ్డారని.. ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా కోవిడ్ లక్షణాలుగా ఉండడంతో ఆస్పత్రి యాజమాన్యం వెంటనే ఏలూరు లేదా కాకినాడ వెళ్లి పరీక్ష చేయించుకోవాల్సిందిగా సూచించినట్లుగా తెలుస్తోంది. -
అన్నదాత సుఖీభవ అర్హులను గుర్తించాలి
ఏలూరు(మెట్రో): అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులైన రైతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం జూన్ నుంచి అమలు జరిగే అవకాశం ఉన్నందున, మండలాల వారీగా అర్హులైన రైతుల జాబితాను నెలాఖరులోగా పంపాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్నదాత సుఖీభవ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఏలూరు జిల్లా జీడీపీని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వర్షాలు ప్రారంభంలోగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకంలో పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పని అడిగిన ప్రతి ఒక్కరికీ కల్పించాలన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ విధానంలో మరింత ఎక్కువగా సాగు జరిగేలా అవగాహన కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా, ఉద్యానవన శాఖ డీడీ రామ్మోహన్, డ్వామా పీడీ సుబ్బారావు పాల్గొన్నారు. స్వచ్ఛ ఓటర్ల జాబితాకు సహకరించాలి జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి కోరారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్కు బూత్ లెవల్ అసిస్టెంట్లను నియమించాలని తెలిపారు. ముందుగానే ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, మార్పులు, చేర్పులు, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వంటి అంశాలపై ఆయా రాజకీయ పార్టీలు తమ సూచనలు, సలహాలు అందించాలని కోరారు. ప్రతి మున్సిపాలిటీలో డోర్ నెంబర్లను సరిచేయాల్సి ఉందని సీపీఎం జిల్లా ప్రతినిధి ప్రసాద్ కోరారు. -
వ్యాన్ను ఢీకొన్న కంటైనర్
జాతీయ రహదారిపై దెందులూరు హెచ్పీ పెట్రోలు బంకు వద్ద మంగళవారం వ్యాన్ను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. 8లో uబకాయిలు తక్షణం చెల్లించాలి ఏలూరు (టూటౌన్):శ్రీ సత్య సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ నిర్వహణ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద బకాయి జీతాలను చెల్లించాలని కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. యూనియన్ గౌరవాధ్యక్షుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. 9 నెలల నుంచి జీతాలు లేవని, తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పథకానికి కలెక్టర్ చైర్మన్గా ఉన్నా కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో ఈ పథకాన్ని దత్తత తీసుకుంటామని ఇచ్చిన హామీని మరిచిపోయారని ఎద్దేవా చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఐటీడీఏ సందర్శనకు వచ్చినప్పుడు కార్మికులు వెళ్లి వినతిపత్రం ఇచ్చి సమస్యను చెప్పుకున్నారు, తక్షణం స్పందించి కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆదేశించినా ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. యూనియన్ అధ్యక్షుడు జి. శివ సత్యనారాయణ, కార్యదర్శి ఎ.సత్యనారాయణ, సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో జిల్లా నాయకులు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల జాబితాను కేటగిరీ వారీగా విడుదల చేయాలని కోరారు. ఎంఈఓలు సూచించిన కేటగిరీ 4 స్థానాలను కాదని, దానికి భిన్నంగా జిల్లా విద్యాశాఖ విడుదల చేసిన కేటగిరీ 4 స్థానాలను సరి చేసి ప్రకటించాలని కోరారు. ఎస్జీటీలకు, పీఈటీలకు బదిలీలు, పదోన్నతులను మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారానే నిర్వహించాలన్నారు.ముగిసిన ఈఏపీ సెట్ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. మంగళవారం మూడు పరీక్షా కేంద్రాల్లో 484 మందికి 467 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం సెషన్లో సిద్ధార్థ క్వెస్ట్ పరీక్షా కేంద్రంలో 161 మందికి గాను 158 మంది హాజరు కాగా, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 144 మంది, సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 173 మందికి 165 మంది హాజరయ్యారు. ఈ కేంద్రాల్లో మధ్యాహ్నం సెషన్లో విద్యార్థులను కేటాయించలేదు. ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల్లో ఏలూరు జిల్లాకు సంబంధించి మూడు పరీక్షా కేంద్రాల్లో ఇంతవరకూ పరీక్షలకు మొత్తం 6,875 మంది విద్యార్థులను కేటాయించగా 6,602 మంది హాజరయ్యారు.ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలనఏలూరు(ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఏలూరు, భీమవరం, రాజమండ్రి జిల్లాల్లోని అన్ని జిల్లా పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న పదోన్నతుల జాబితాలో ఉన్న స్కూల్ అసిస్టెంట్లు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్– 2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందేందుకు అర్హత ఉన్నవారికి సీనియారిటీ జాబితా ప్రకారం స్థానిక సత్రంపాడు సిద్ధార్థ విద్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ యజమాన్యంలో సీనియార్టీ జాబితాలో ఉన్న 282 మందికి 241 మంది హాజరయ్యారు. మునిసిపల్, మున్సిపల్ కార్పొరేషన్ యజమాన్యంలో సీనియార్టీ జాబితాలో ఉన్న 22 మందికి 17 మంది హాజరయ్యారు. జిల్లా పరిషత్ యాజమాన్యం, మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యంలో ఉన్న ఉపాధ్యాయులు మంగళవారం హాజరుకకాపోతే వారికి ఈ నెల 28 ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ధ్రువ పర్రాల పరిశీలన జరుగుతుందని డీఈవో తెలిపారు.గ్రామాల్లో చెత్త తొలగింపుఇరగవరం: ‘గ్రామాల్లో పడ కేసిన పారిశుద్ధ్యం’ శీర్షికన గత సోమవారం సాక్షిలో వచ్చిన కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు. గ్రామాల్లోని చెత్తను ట్రాక్టర్లలో డంపింగ్ యార్డులకు తరలించారు. కార్యదర్శులకు ఈవోపీఆర్డీ నరసింహమూర్తి ప్రత్యేకంగా సమా వేశం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశాలిచ్చారు. గ్రామాల్లో చెత్త తొలగించడంతో ప్రజలు హర్షం చేశారు. -
యోగాను దినచర్యగా చేసుకోవాలి
ఏలూరు (టూటౌన్): ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా చేసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. మంగళవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ర్యాలీని కలెక్టర్ కె.వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు. ఇండోర్ స్టేడియం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు, అక్కడి నుంచి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా చేసుకోవడం వల్ల ఆరోగ్యం సిద్ధించడంతోపాటు మానసిక వికాసం కలుగుతుందన్నారు. జిల్లాలో యోగాభ్యాసనకు సుమారు 400 మంది మాస్టర్ ట్రైనీలను సమకూర్చామన్నారు. జిల్లాలో 5 వేల మందికి యోగా శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 రోజులపాటు ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 4 పర్యాటక ప్రాంతాల్లో ఎంపిక చేసిన నాలుగు రోజులు యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 29న ద్వారకాతిరుమల, జూన్ 5న పట్టిసీమ, జూన్ 11న జంగారెడ్డిగూడెం మద్దిఆంజనేయస్వామి దేవాలయం వద్ద, జూన్ 18న కామవరపుకోట మండలం జీలకరగ్రూడెం, గుంటుపల్లి బౌద్దరామాల వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్ధాయిలో యోగాంధ్ర పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ, వార్డుస్ధాయిలో ఈ నెల 26 నుంచి 30 వరకు మండల స్ధాయిలో జూన్ 2 నుంచి 7 వరకు, జిల్లా స్థాయిలో జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించాలన్నారు. -
నిర్వాసితులను తరలించేందుకు ప్రత్యేక చర్యలు
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్ బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న ఫేజ్ బి పరిధిలో ఉన్న నిర్వాసితులకు పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి వారిని తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ బి.అభిషేక్ తెలిపారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాటాడారు. రెండో దశలో సుమారు 32 గ్రామాల్లో 13,700 మంది నిర్వాసితులు ఉన్నారన్నారు. వీరందరికీ వీఆర్పురం, కూనవరం పరిధితోపాటు కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో నిర్వాసితులకు అనుకూలమైన భూములను సేకరించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. వీరికి నిర్వాసిత గ్రామాలు నిర్మించడంతోపాటు భూమికి భూమిగా కూడా భూసేకరణ చేయడం జరుగుతుందని చెప్పారు. నిర్వాసితులు కోరుకున్న ప్రదేశంలో ఇళ్లు నిర్మించడంతోపాటు వ్యవసాయ భూములను కూడా సేకరించేలా కృషి చేస్తామని చెప్పారు. గిరిజనులకు నివాసాలు కల్పించడంతోపాటు భూములను కూడా సేకరించి ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. వారు కోరుకున్న ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో భూములను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియ నెలరోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ, తహసీల్దార్ పీవీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
జీలుగ సాగుతో పంటలు బాగు
ముసునూరు: నేల స్వభావానికి అనుగుణంగా పచ్చిరొట్ట ఎరువుల సాయంతో భూమిని సారవంతంగా మార్చుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువు పంటల్లో జీలుగ సాగు చక్కటి ఫలితాలనిస్తుండడంతో చాలా ప్రాంతాల్లో రైతులు జీలుగ సాగుకే మొగ్గు చూపుతున్నారు. నత్రజని, భాస్వరం, పొటాష్, మాంగనీస్ వంటి పోషకాలను పంటలకు విరివిగా అందించే జీలుగను సాగు చేసి లాభాలు పొందాలని ముసునూరు మండల వ్యవసాయాధికారి.కె.చిన సూరిబాబు సూచిస్తున్నారు. మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో జీలుగ విత్తనాల పంపిణీ చేస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రయోజనాలు ● పొలంలో జీలుగను కలియ దున్నితే నేలకు సారం, తదుపరి వేసే పంటలకు లాభాలనిస్తుంది. ● నేలలో ఉండే చౌడును నివారిస్తుంది. ● మొక్కలకు రెండు శాతం నత్రజని, సూపర్ ఫాస్ఫేట్ అదనంగా అందుతుంది. ● జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మ ధాతువులను పంటకు అందిస్తుంది. ● నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మారుస్తుంది. ● నేలలో భౌతిక స్థితి మెరుగుపడి, భూమి గుల్లగా మారి, నేలలోకి నీరు ఇంకే గుణాన్ని పెంచుతుంది. ● పంట పొలంలో నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది. ● పంట పొలంలో వానపాముల అధిక ఉత్పత్తికి తోడ్పడుతుంది. ● లెగ్యూం జాతికి చెందిన మొక్క కావడంతో వేర్లలో నత్రజని స్థిరంగా ఉంటుంది. ● పొలంలో తుంగ, గరిక వంటి కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. ● నేలలో ఉండే ప్రయోజనకర సూక్ష్మజీవుల సంఖ్యను మెరుగుపరుస్తుంది. ● వేసవిలో సంభవించే భారీ గాలులు, వర్షాల వల్ల జరిగే నేల కోతను నివారిస్తుంది. ● రసాయనిక ఎరువుల వాడకాన్ని 15 నుంచి 25 శాతం వరకు తగ్గిస్తుంది. ● పంటలపై ఖర్చు ఆదా అవుతుంది. జీలుగ సాగుకు అనువైన సమయాలు ● ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపర్చుకునే విధంగా జీలుగ విత్తనాలు చల్లుకోవాలి. ● తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలోనే దుక్కి దున్ని, తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి. ● నీటి వసతులు గల ప్రాంతాల్లో వేసవిలోనే సాగు చేయడం లాభదాయకం. ● రెండు పంటల మధ్య కాల వ్యవధిలో కూడా విత్తుకొని కలియ దున్నవచ్చు. ● ఏప్రిల్, మే నెలల్లో ఖరీఫ్ పంటలు వేసే ముందు, తొలకరి వర్షాలు కురవగానే జీలుగ విత్తనాలు విత్తుకోవాలి. ● విత్తిన తర్వాత ఏపుగా పెంచి, పంట జీవ పదార్థాన్ని కలపడానికి, కుళ్లిపోవడానికి నేలలో కలియ దున్నాలి. చినబాబు, మండల వ్యవసాయాధికారి (ఫైల్) -
మద్ది అంజన్నకు పూజలు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సందర్భంగా ఆంజనేయస్వామిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు. అంజన్నకు ప్రభాతసేవ, నిత్యార్చనలు అర్చకులు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,82,553 ఆదాయం వచ్చిందని ఈఓ ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో 1500 మంది అన్నప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు. ఏర్పాట్లను కురగంటి రంగారావు పర్యవేక్షించారు. దళితులపై దాడులు దారుణంతాడేపల్లిగూడెం (టీఓసీ): గుంటూరు జిల్లా తెనాలిలో పట్ట పగలు, ప్రజలు చూస్తుండగా ఎస్సీ, మైనారిటీ యువకుల కాళ్లపై సీఐలు రాములు నాయక్, రమేష్ బాబు లాఠీలతో కొట్టడాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు తీవ్రంగా ఖండించారు. సీఐలను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణంలో మంగళవారం మంగరాజు విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో దళిత, ప్రజా సంఘాల తరుఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట విజయ్, ప్రియబాబు, నాగేశ్వరరావు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్ కార్యాలయ అటెండర్ మృతి
నూజివీడు: నూజివీడు సబ్కలెక్టర్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న బలుమూరి సుబ్బారావు(59) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. సబ్కలెక్టర్కు అటెండర్గా పనిచేస్తున్న ఆయన స్వగ్రామమైన కృష్ణాజిల్లా గన్నవరం మండలం గోపవారిగూడెంలో ఉంటున్నారు. నిత్యం అక్కడి నుంచే విధులకు హాజరై మరలా ఇంటికి వెళ్తారు. రోజూ మాదిరిగానే ఇంటి వద్ద నుంచి నూజివీడులోని సబ్కలెక్టర్ కార్యాలయానికి విధి నిర్వహణ నిమిత్తం మంగళవారం ద్విచక్రవాహనంపై వస్తుండగా ఉదయం 7.45 గంటల సమయంలో కొన్నంగుంట రోడ్డులో అమృతనగర్ స్టేజీ వద్ద వ్యాన్ వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అటెండర్ సుబ్బారావు మృతి వార్త తెలుసుకున్న సబ్కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం సుబ్బారావు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రూరల్ ఎస్సై జీ జ్యోతీబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలి బుట్టాయగూడెం: ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి ఆదివాసీ ప్రాంతంలో నూరుశాతం ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారంతో 14వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో డీఎస్సీలో ఉపాధ్యాయుల పోస్టులను మినహాయించి ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఆదివాసీ అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో తెల్లం లక్ష్మి, కలుం వెంకటేశ్వరి, ఎం శాంతికుమారి, పి.భవాని, పి.నాగరత్నం, జి. కృష్ణారెడ్డి, సీహెచ్ మల్లీశ్వరి, కె.మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
కై కలూరు టౌన్ పోలీసు స్టేషన్లో అగ్నిప్రమాదం
కై కలూరు: స్థానిక టౌన్ పోలీసు స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆరుబయట విద్యుత్ మీటరు నుంచి ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలీయక అందరూ ఆయోమయంలో పడ్డారు. మంటలు వ్యాపించిన మీటరు సమీపంలో పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. మరో వైపున పోలీసుశాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు ఉంది. తేరుకున్న పోలీసులు వెంటనే మంటలను ఆదుపు చేశారు. ప్రమాదం విషయమై విద్యుత్శాఖ లైన్మెన్ ఆనందరావును వివరణ కోరగా పోల్ నుంచి వచ్చిన మెయిన్ సర్వీసు వైరులో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఏసీలు వంటివి అధిక లోడ్ తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. విద్యుత్ మీటరు కాలిపోవడంతో స్టేషన్ అంధకారమైంది. సమీప మీటరు నుంచి తాత్కలికంగా విద్యుత్ను పునరుద్ధరించారు. -
ఎర్ర గ్రావెల్ తవ్వేస్తున్నా.. మొద్దు నిద్రే
ద్వారకాతిరుమల: అవినీతి అధికారులు ఉన్నంత వరకు అక్రమార్కులకు అడ్డేలేదు అనడానికి పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలే నిదర్శనం. నామమాత్రపు అనమతులను అడ్డం పెట్టుకుని ఏకంగా క్వారీలు ఏర్పాటు చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా భూమిని తవ్వేస్తూ.. ఎంతో విలువైన ఎర్ర గ్రావెల్ను అమ్మేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని తరలించేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల వద్ద గోతులు తవ్వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నా.. పట్టించుకునే నాధుడు లేడు. ముడుపుల మత్తులో జిల్లా అధికార యంత్రాంగం నిద్ర నటించడమే ఇందుకు కారణమని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. ఇంతటి అరాచక పాలనను, లెక్కలేని అధికారుల తీరును ముందెన్నడూ చూడలేదని వాపోతున్నారు. మళ్లీ పూడ్చేస్తాములే.. కాలువ తవ్విన సమయంలో గట్టుపై వేసిన మట్టిని బయటకు తోలుకునేందుకు మూడు కంపెనీలకు ఇరిగేషన్, మైనింగ్ అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. అయితే గట్టుపై ఉన్న మట్టిని కాకుండా, భూమిని తవ్వి ఎంతో విలువైన ఎర్ర గ్రావెల్ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దాంతో తవ్వకాలు జరిగిన ప్రాంతాలు క్వారీలను తలపిస్తున్నాయి. తమ పొలాలకు వెళ్లే మార్గాల్లో గుంతలు తవ్వేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు జరుపుతున్న వారిని ప్రశ్నిస్తే.. మళ్లీ పూడ్చేస్తాములే అని సమాధానం చెబుతున్నారట. వర్షాలకు గోతులు నిండిపోయి అందులో రైతులు గాని, పశువులు గాని పడి మృత్యువాత పడితే దానికి ఎవరు బాధ్యులు. తవ్వకాలు జరుపుతున్న వారా.. లేక అధికారులా.. అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. మొక్కుబడిగా పూడిక.. గట్టుపై మట్టి తవ్వకాలు ముసుగులో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఇటీవల సాక్షిలో వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. దాంతో ఉలిక్కిపడ్డ అక్రమార్కులు తమ తప్పులను అధికారుల సూచనలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పంగిడిగూడెం వద్ద గ్రావెల్ తవ్వగా ఏర్పడిన గోతులను, గట్టుపై ఉన్న మట్టితో మొక్కుబడిగా పూడ్చుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే గోతులు పూడ్చుతున్నామని చెబుతున్నారు. అసలు గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఎవరిచ్చారు, ఇప్పటి వరకు తవ్విన గోతుల సంగతి ఏమిటన్న ప్రశ్నలకు వారి వద్ద సమాదానం లేదు. ముసుగులతో రవాణా.. కూటమి నేతలు ఎంతో విలువైన గ్రావెల్ను అక్రమంగా అమ్మేస్తున్నారని, అధికారులు వారికి కొమ్ము కాస్తున్నారని జిల్లా వ్యాప్తంగా తెలిసిపోయింది. దాంతో టిప్పర్లలోని గ్రావెల్ బయటకు కనబడకుండా గ్రీన్ క్లాత్లు కట్టి మరీ రవాణా చేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టి ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు తరలిపోతోంది. పోలవరం కుడి కాలువగట్టుపై ఏకంగా గ్రావెల్ క్వారీలు మట్టి ముసుగులో యథేచ్ఛగా ఎర్ర గ్రావెల్ తవ్వకాలు నిద్ర నటిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు పంగిడిగూడెం వద్ద నాకు ఉన్న పొలానికి వెళ్లే దారిలో గోతులు తవ్వేస్తున్నారని ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫోన్లో ఫిర్యాదులు చేశాను. అయినా వారు పట్టించుకోలేదు. కూటమి నేతలకు ఎదురు తిరిగి నిలబడలేను. ఎందుకంటే వారి వెనుక ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. నా కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మిగిలిన రైతుల పరిస్థితి కూడా ఇదే. – భీమడోలుకు చెందిన ఓ రైతు ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు కాలువ గట్టుపై ఉన్న మట్టిని విడిచిపెట్టి, క్వారీలు తవ్వుతూ కూటమి నేతలు కోట్లు గడిస్తున్నారు. ఆ డబ్బుతో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అందుకే అధికారులు సైతం అక్రమార్కులకు తొత్తుల్లా మారారు. ఇంత దారుణాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎం.నాగులపల్లి, పంగిడిగూడెం వద్ద పచ్చ నేతలు, జనసేన నాయకుడి కనుసన్నల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. – ఎం.నాగులపల్లికి చెందిన ఓ రైతు -
ఉపాధి హామీ పనులను తనిఖీ చేయాలి
నూజివీడు: ఉపాధి హామీ పనుల్లో తప్పుడు మస్తర్ నమోదు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మండలాల్లో ప్రోగ్రాం ఆఫీసర్లు ఉపాధి హామీ పనుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించాలని కలెక్టర్ కే వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేసినట్లు డ్వామా పీడీ వెంకట సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మస్తర్లలో మాయాజాలం’ పేరుతో ఉపాధిహామీ పనుల్లో జరుగుతున్న అవకతవకలను ‘సాక్షి’ మంగళవారం ప్రచురించడం జరిగింది. దీనిపై కలెక్టర్ స్పందించి ప్రోగ్రాం ఆఫీసర్లు తప్పనిసరిగా మస్తర్లు తనిఖీ చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. నూజివీడు మండలంలో జిల్లా విజిలెన్స్ అధికారి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంయుక్తంగా విచారణ నిర్వహించారని, వారి నుంచి నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించి ఎక్కువమంది శ్రామికులకు పని కల్పించి వారు ఆశించిన వేతనలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం విజయవంతంగా నిర్వహించబడుతుందని, గతేడాది కోటి 20 లక్షల పని దినాల లక్ష్యానికి కోటి 23 లక్షల 65 వేల పనిదినాలు కల్పించి 103 శాతం పైగా వృద్ధిని సాధించామన్నారు. గతంలో ఉపాధి హామీ వేతనం సరాసరి రూ.300 కాగా దానిని ప్రభుత్వం రూ.307కు పెంచిందన్నారు. ఈ మేరకు గత ఏడాది రూ.300 వేతన సరాసరికి జిల్లాలో రూ.253 సాధించామన్నారు. ఈ ఏడాది పెరిగిన సరాసరి వేతనానికి అనుగుణంగా కనీసం రూ.290 తగ్గకుండా వేతనం కల్పించి ఉపాధి హామీపై మరింత నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టామన్నారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన పనులకు రూ.280 సరాసరి వేతనం చెల్లించడం జరిగిందన్నారు. కలెక్టర్ ఉత్తర్వులు జారీ -
వ్యాన్ను ఢీకొన్న కంటైనర్
దెందులూరు: వ్యాన్ను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై దెందులూరు హెచ్పీ పెట్రోలు బంకు వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పామర్రు నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఒకే కుటుంబానికి చెందిన 15 మంది వ్యాన్లో వెళ్తున్నారు. దెందులూరు హెచ్పీ పెట్రోలు బంకు వద్దకు వచ్చేసరికి గుండుగొలను వైపు వెళ్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి వ్యాన్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న 15 మందిలో ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా మిలిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే దెందులూరు సీహెచ్సీకి 108 అంబులెన్స్లో తరలించారు. కాగా వ్యాన్ను ఢీకొట్టి వెళ్లిపోయిన కంటైనర్ను సత్యనారాయణపురం వద్ద గ్రామస్తులు నిలుపుదల చేసి తాళాలు తీసుకున్నారు. అయితే డ్రైవర్ వద్ద మరో తాళం ఉండడంతో కంటైనర్తో పరారయ్యాడని ఎస్సై శివాజి చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. ఆరుగురికి స్వల్పగాయాలు -
విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి
ఏలూరు (టూటౌన్): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ఉద్యోగాల నుంచి తొలగించిన 2,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే విధులలోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వి కి కార్మిక సంఘ నాయకులు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపులో భాగంగా కలెక్టరు కార్యాలయం వద్ద ఐఎఫ్టీయు, ఏఐటీయుసీ, సీఐటీయు నాయకులు, కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం సమర్పించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, సీఐటీయు అధ్యక్షుడు ఆర్.లింగరాజు, ఐఎఫ్టీయు ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ 2500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తే టీడీపీ, జనసేన పార్టీలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఘోరమైన చర్యగా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కారు చౌకగా విక్రయించడానికి చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, సీఐటీయూ ఉపాధ్యక్షుడు బి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్లపై ‘రెడ్బుక్’ వేధింపులు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కూటమి నేతల రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. తప్పుడు ఫిర్యాదులతో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన సర్పంచ్లపై వేధింపులకు పాల్పడుతున్నారని శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నాని ఆవేదన వ్యక్తం చేశారు. తన చెక్పవర్ రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారని, దీనిపై వారం రోజుల్లో కలెక్టర్కు అప్పీలు చేసుకోవాలని పంచాయతీ అధికారి చెప్పడం కూటమి నాయకులు రాజకీయ కుట్రలో భాగం అన్నారు. ఏలూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం వైఎస్సార్సీపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తప్పుడు ఫిర్యాదులు చేయించి.. సమావేశంలో శ్రీరామవరం కామిరెడ్డి నాని మాట్లాడుతూ... పంచాయతీలో టీడీపీ మెంబర్లు వీఎన్వీ త్రినాథ్, ఆళ్ళ విజయలక్ష్మితో పాటు కొందరితో తప్పుడు ఫిర్యాదు చేయించారని, వాటిపై డీపీవో ఆధ్వర్యంలో 8 నెలల పాటు విచారణ చేయించారని తెలిపారు. విచారణలో ఒక్కరూపాయి దుర్వినియోగం కాలేదని, బిల్లులు ఉన్నాయని చెబుతూనే.. మరోవైపు వేధింపులకు పాల్పడడం దారుణం అన్నారు. 2021 డిసెంబర్లో రూ.20,875 నిధులు దుర్వినియోగం అయ్యాయని చూపిస్తున్నారని, కానీ ఈ నిధులకు సంబంధించి అధికారుల విచారణలో ఓచర్లు, ఎన్ఎంఆర్ ఉన్నాయని తెలిసినా.. రూ.17 వేలకు తీర్మానం లేదని, బిల్లులను ఏఈ సర్టిఫై చేయలేదని, మిగిలిన రూ.4875కు బిల్లులు ఉన్పప్పటికీ స్టాక్ రిజిస్టర్లో నమోదు కాలేదని చెబుతున్నారని తెలిపారు. ఎల్ఈడీ లైట్ల కొనుగోలుకు రూ.1.31 లక్షల నిధులకు సైతం బిల్లులు, తీర్మానం ఉండగా స్టాక్ రిజిస్టర్లో లేవంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కామిరెడ్డి నాని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం సర్పంచ్ విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోకుండా, సర్పంచ్లను ఇబ్బందులకు గురిచేయటం దారుణమని ఎస్సీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మెండెం సంతోష్కుమార్ అన్నారు. కామిరెడ్డి నానిపై వేధింపులు ఆపకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేక లక్ష్మణరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ మాట్లాడుతూ.. దెందులూరు నియోజకవర్గంలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చట్టపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. బిల్లులున్నా.. నిధులు దుర్వినియోగమంటూ చెక్ పవర్ రద్దు న్యాయపోరాటం చేస్తానంటున్న శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నాని ఇవి రాజకీయ వేధింపులు కావా? : నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలో సాధారణ సమావేశం నిర్వహించలేదని, దీని ఆధారంగా ఎందుకు డిస్ క్వాలిఫై చేయకూడదంటూ డీపీవో నోటీస్ జారీ చేయటం రాజకీయ వేధింపులు కాదా? అని నిలదీశారు. సమావేశం పెడితే అధికారపార్టీ నేతల కనుసన్నల్లో ఇతర ప్రాంతాలకు చెందిన రౌడీలు, అసాంఘిక శక్తులను సమావేశాలకు తీసుకువచ్చి గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించటం నిజం కాదా అన్నారు. పోలీస్ రక్షణ కావాలని అడిగితే మీ భద్రత బాధ్యత నాది కాదని డీపీవో చెప్పడం నిజం కాదా అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన 7 మందికి పైగా సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. -
ఏఐ సాయంతో ఫిర్యాదుల స్వీకరణ
ఏలూరు టౌన్ : ఏలూరు జిల్లా పోలీస్ శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రజా ఫిర్యాదుల వేదికను కాగిత రహితంగా చేపట్టేందుకు కొత్త విధానానికి నాంది పలికారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో బాధితులు తమ సమస్యలు చెప్పుకుంటే... నిర్ధేశిత ఫార్మాట్ ఆధారంగా బాధితుల నుంచి ఏఐ మరిన్ని వివరాలు రాబట్టి ఫిర్యాదు తయారుచేస్తుంది. ఈ ఆధునిక విధానాన్ని జిల్లా పోలీస్ శాఖ పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అమలు చేస్తోంది. ఎలాంటి తప్పులు లేకుండా నిబంధనలకు అనుగుణంగా దీనిని రూపొందిస్తారు. పారదర్శకంగా, కాగిత రహితంగా పూర్తి డిజిటల్ విధానంలో ఉండటం దీని ప్రత్యేకత. మరోవైపు ఫిర్యాదుదారులు చెప్పిన వివరాలన్నీ వీడియో రికార్డింగ్ చేయటం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తిగా డిజిటలైజేషన్ కావడంతో అటు పోలీస్..ఇటు ప్రజలకు సులభతరం, పారదర్శకంగా ఉంటుందని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా వ్యాప్తంగా 39 ఫిర్యాదులు పోలీసు అధికారులకు అందాయి. జిల్లా ఎస్పీ శివకిషోర్ వినూత్న ప్రయోగం -
జీఈఏ జాయింట్ సెక్రటరీగా జాన్బాబు
ఏలూరు టౌన్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీగా జీ.జాన్బాబు ఎన్నికయ్యారు. ఈనెల 25న ఏలూరులోని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన్లో జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ, కార్యదర్శిగా బంగారయ్య ఎన్నికయ్యారు. ఈ నూతన కమిటీలో జిల్లా జాయింట్ సెక్రటరీగా జాన్బాబు ఎన్నిక కావటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈఏపీ సెట్కు 934 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పరీక్షకు సోమవారం మూడు పరీక్షా కేంద్రాల్లో 974 మందికి 934 మంది హాజరయ్యారు. ఉదయం సెషన్లో సిద్ధార్థ క్వెస్ట్ పరీక్షా కేంద్రంలో 161 మందికి 153 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 162 మందికి 154 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం సెషన్లో 150 మందికి 147 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 150 మందికి 144 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 178 మందికి 171 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 173 మందికి 165 మంది హాజరయ్యారు. సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలి ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఖరీఫ్ పంటకు సంబంధించి రైతులు, కౌలు రైతులకు విత్తనాలను 75 శాతం సబ్సిడీపై సకాలంలో అందజేయాలని కలెక్టర్కు రైతు సంఘం నాయకులు మెమోరాండం సమర్పించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు మాట్లాడుతూ రైతులకు సంబంధించి ఖరీఫ్ పంటకు విత్తనాలు కొరత లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. సాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కోకో, వరితో పాటు ఇతర వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధరలు అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వరి, వేరుశెనగ, మినుము, పెసర, పత్తి, మిర్చి, కందులు తదితర పంటలకు 75 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని కోరారు. తక్షణమే కోకో పంటకు గిట్టుబాటు ధర ప్రకటించి కోకో గింజలను రైతులు నుంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో రైతు సంఘం జిల్లా నాయకులు కూచిపూడి నాగేశ్వరరావు, చలసాని జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం ఏలూరు (టూటౌన్): పీజీఆర్ఎస్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం కలెక్టర్కు వినతి పత్రం అందజేసారు. దెందులూరు మండలం ముప్పవరం పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్న అధికారులపై ఫిర్యాదు చేసి.. అభివృద్ధిని ముందుకు కొనసాగించాలని కోరారు. సర్పంచ్ హక్కులు, విధులకు ఆటంకాలు కలిగించకుండా చూడాలని, గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పనులు పూర్తి చేయని పక్షంలో మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి అనంతరం న్యాయపోరాటానికి సిద్ధమవుతామన్నారు. శ్రీవారి దేవస్థానానికి ఏఈఓ బదిలీ ద్వారకాతిరుమల: విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఏఈఓగా విధులు నిర్వర్తిస్తున్న మెట్టపల్లి దుర్గారావును మాతృ సంస్థ అయిన ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి బదిలీ చేస్తూ రాష్ట్ర దేవదాయశాఖ అదనపు కమిషనర్ టి.చంద్ర కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ భూమి రీ సర్వేకు వినతి కై కలూరు: జాన్పేట ప్రజలకు ఫిషర్మేన్ కోఆపరేటీవ్ సొసైటీ పేరుతో 1975లో కేటాయించిన భూమిని అటవీశాఖ స్వాధీనం చేసుకుందని, తిరిగి రీసర్వే చేయాలని మాదిగ దండోరా, ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులు కలెక్టర్కు గ్రీవెన్స్లో సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల కార్యకర్త వంగలపూడి విజయ్ మాట్లాడుతూ డీ–ఫాం పట్టాల రూపంలో ప్రభుత్వం జాన్పేట గ్రామస్తులకు భూమిని కేటాయించిందన్నారు. 2006లో కొల్లేరు ఆపరేషన్ సందర్భంగా అటవీశాఖ అధికారులు బౌండరీ పిల్లర్స్ తప్పుగా వేసి ఈ భూమిని కాంటూరు లోపలిగా చూపించి స్వాధీనం చేసుకున్నారన్నారు. -
ఎఫ్ఎల్ఎన్ శిక్షణ వాయిదాకు డిమాండ్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 27 నుంచి తలపెట్టిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణను వాయిదా వేయాలని కోరుతూ యూటీఎఫ్ నాయకులు సమగ్రశిక్ష ఏలూరు జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.పంకజ్ కుమార్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని డీఆర్పీలకు ఓడరేవులో నిర్వహించే శిక్షణకు హాజరుకావాలని.. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకునే పనిలో ఉన్న వారు ఈ శిక్షణకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి రాష్ట్ర ప్రాజెక్టు కోఆర్డినేటర్కు వివరించగా ఆయన స్పందిస్తూ వీలుపడిన వారు మాత్రమే హాజరు కావచ్చని, వీలుపడని వారు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారన్నారు. అయినప్పటికీ జిల్లాలో మండల విద్యాశాఖాధికారులు శిక్షణకు వెళ్ళాలని ఒత్తిడి తెస్తున్నారని, ఈ మేరకు ఎంఈఓలకు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. -
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి
ఏలూరు(మెట్రో): ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 267 దరఖాస్తులను స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కామవరపుకోట మండలం రామన్నపాలెంకు చెందిన వ్యక్తి అంగన్వాడీ సూపర్ వైజర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 3 లక్షలు తీసుకున్నాడని.. నేటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని టి.నర్సాపురం మండలం బొర్రంపాలెంకు చెందిన తోట రమేష్ ఫిర్యాదు చేశాడు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటివారి ప్రలోభాలకు గురై మోసాలకు గురికావద్దని హితవు పలికారు. తమ భూమిలో ఆక్రమణలు తొలగించేందుకు భూమిని సర్వేచేసి అప్పగించాలని ఆగిరిపల్లి మండలం తాడేపల్లికి చెందిన కందుల వెంకటేశ్వరమ్మ కోరారు. కూనలమ్మకుంట చెరువు ఆక్రమణకు గురైందని, సదరు ఆక్రమణలు తొలగించి రైతులకు న్యాయం చేయాలని కామవరపుకోటకు చెందిన ఉప్పలపాటి ఝాన్సీరాణి అర్జీనిచ్చారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, డీఆర్డీఏ పీడీ అర్.విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యం.ముక్కంటి తదితరులు వినతులు స్వీకరించారు. -
మున్సిపల్ టీచర్లపై సవతి తల్లి ప్రేమ
జిల్లా యూనిట్గా ప్రమోషన్లు ఇవ్వాలి మున్సిపల్ ఉపాధ్యాయుల ఎంపిక జిల్లా యూనిట్గా జరుగుతుంది. జిల్లా యూనిట్గా పదోన్నతులు, బదిలీలు జరగాలి. పదోన్నతుల అవకాశాల కోసం మున్సిపల్ ఎడ్యుకేషనల్ యూనిఫైడ్ సర్వీసు రూల్సు విడుదల చేయాలి. మున్సిపల్ ఏరియాలలోని ఇతర యాజమాన్యంలోని పాఠశాలలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో విలీనం చేయాలి. – సోమరౌతు శ్రీనివాసరావు, ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పదోన్నతులు కల్పించాలి మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో ప్లస్ –2 ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలి. 1965 మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ పాఠశాలల పర్యవేక్షణ కోసం మున్సిపల్ స్కూళ్ల సూపర్వైజర్ పోస్టులను గ్రేడు 2 హెచ్ఎం స్థాయిలో మంజూరు చేసి పదోన్నతులు ఇవ్వాలి. – పోలిమెట్ల సుమంత్, ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల త్వరలో జరిగే బదిలీల్లో అర్హతలుండీ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఒకే చోట పని చేస్తూ తమ సొంత ప్రాంతాలకు బదిలీ చేయించకునే అవకాశాలు లేక అల్లాడుతున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ను విస్మరించిన పాఠశాల విద్యాశాఖ విధానాలపై నిరసన గళం వినిపిస్తున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులను జిల్లా పరిషత్ ఉపాధ్యాయులతో సమానంగా పరిగణించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ పాఠశాల విద్యాశాఖ చేస్తున్న చర్యలు, ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022లో మున్సిపల్ పాఠశాలల పరిపాలన, ఉపాధ్యాయుల సేవలను పాఠశాల విద్యాశాఖకు బదలాయిస్తూ జీఓ 84 విడుదల చేశారు. పాఠశాల విద్యా శాఖ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ముసాయిదా తయారుచేసి, ఉపాధ్యాయ సంఘాల సూచనలు, న్యాయశాఖ, జీఏడీ అభిప్రాయాల ఆధారంగా చివరి రూపకల్పన చేయాల్సిఉండగా దానిని ఆమోదించకుండా పాత నియమావళిని కొనసాగిస్తోంది. ఎన్నో సంవత్సరాల నుంచి బదిలీలు లేక వేచి చూస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశనిపాతంగా మారింది. మున్సిపల్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఉమ్మడి సర్వీస్ రూల్స్ వెంటనే ఆమోదించాలని, పదోన్నతులు, బదిలీలల్లో జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వ్యవహరించాలని, అన్ని నియామకాల్లో పారదర్శకత, న్యాయం పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్ను కూడా ఇతర మున్సిపాలిటీలో సమానంగా పరిగణించి, అర్హులైన వారికి ఏలూరు కార్పొరేషన్కు, ఏలూరు కార్పొరేషన్ నుంచి ఇతర మున్సిపాలిటీలకు బదిలీ చేయడానికి వీలుగా నిబంధనలు సడలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకాక నష్టపోతున్న టీచర్లు జెడ్పీ ఉపాధ్యాయులతో సమానంగా పరిగణించాలి జిల్లా యూనిట్గా పదోన్నతులు, బదిలీలకు డిమాండ్ ఉమ్మడి పశ్చిమలో 763 మంది మున్సిపల్ ఉపాధ్యాయులు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మున్సిపల్ పాఠశాలల్లో ప్రస్తుతం 763 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని అన్ని నగరపాలక సంస్థ పాఠశాలల్లో అన్ని కేటగిరీల్లో కలిపి 417 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. -
ఇండోర్ స్టేడియం.. నిండా నిర్లక్ష్యం
ఏలూరు రూరల్: ఏలూరు ఇండోర్ స్టేడియం గత వైభవాన్ని కోల్పోతోంది. ప్రభుత్వం ఉదాసీనత, నిధుల కొరతతో పాటు అధికారుల నిర్లక్ష్యానికి నిలువటద్దంగా మారుతోంది. గతంలో అభివృద్ధి చేసిన మౌలిక వసతులు నేడు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. దీనికి తోడు చినుకు పడితే స్టేడియం చిత్తడిగా మారిపోతోంది. డ్రెయినేజీ వ్యవస్థ పని చేయడం లేదు. ఫలితంగా సాధన చేసే క్రీడాకారుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. నిరుపయోగంగా ఫ్లడ్లైట్లు గతంలో అధికారులు లక్షల రూపాయలు వెచ్చించి స్టేడియం చుట్టూ ఆరు చోట్ల భారీ స్తంభాలతో ఏర్పాటుచేసిన ఫ్లడ్లైట్లు నేడు నిరుపయోగంగా మారాయి. అవసరానికి అనుగుణంగా దిశ మార్చుకునేందుకు, ఎత్తు సైతం పెంచుకుని స్టేడియం మొత్తం వెలుగులు విరజిమ్మేలా లైట్లు ఏర్పాటుచేశారు. ఇందుకోసం స్తంభాల కింద ఒక మోటార్ సైతం బిగించారు. ప్రత్యేక ఫీజ్ బాక్సులు సిద్ధం చేశారు. నేడు ఈ ఫీజు బాక్సులు కానరావడం లేదు. మోటార్లు మరమ్మతు పాలయ్యాయి. వైరింగ్ ప్రమాదకరంగా మారింది. ఈ మొత్తం వ్యవస్థను మరమ్మతులు చేయకుండా వదిలేశారు. స్టేడియం అంతటా చీకట్లు కమ్ముకుంటున్నాయంటూ వాకర్స్, క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. ఫ్లడ్లైట్లు గురించి పట్టించుకోలేదు. మూతబడిన జిమ్ స్టేడియంలో ఇండోర్ కూలిపోవడంతో క్రీడాకారులు సాధన చేసే జిమ్ సైతం మూతపడింది. ఈ జిమ్లో ఏర్పాటుచేసిన తాగునీటి సరఫరా ప్లాంట్ సైతం నిరుపయోగంగా మారింది. దీంతో క్రీడాకారులు జిమ్ కోసం స్టేడియం వదిలి, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. కంపు కొడుతున్న మరుగుదొడ్డి క్రీడాకారులు, వాకర్స్ సౌలభ్యం కోసం గతంలో స్టేడియం పరిసరాల్లో నిర్మించిన మరుగుదొడ్డి సైతం కంపుకొడుతోంది. ఆకతాయిలు దొడ్డి తలుపులు విరగ్గొట్టడంతో బాలికలు ఉపయోగించేందుకు భయపడుతున్నారు. కొన్నిసార్లు వాటర్, కరెంట్ సరఫరా లేకపోవడంతో మరుగుదొడ్డి ఉపయోగించుకోలేక పోతున్నామని క్రీడాకారులు వాపోతున్నారు. చిందరవందరగా స్టేజీ ఆటల పోటీల సమయంలో క్రీడాకారులకు బహుమతులు అందించేందుకు నిర్మించిన స్టేజీ సైతం మరమ్మతులకు నోచుకోలేదు. గతంలో స్టేజీపై విద్యుత్ లైట్లతో పాటు సౌండ్ సిస్టమ్ ఏర్పాటుచేశారు. కొంతకాలంగా స్టేజీ నిర్వహణపై పర్యవేక్షణ కొరవవడంతో సౌండ్ సిస్టమ్, లైట్లు పనికి రాకుండాపోయాయి. ఎక్కడపడితే అక్కడ వైర్లు వేలాడుతూ పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పిల్లలు లేక వెలవెలబోతున్న ఇండోర్స్టేడియం అక్కరకు రాని ఫ్లడ్లైట్లు నిరుపయోగంగా మరుగుదొడ్లు తెరుచుకోని జిమ్, వాటర్ ప్లాంట్ పర్యవేక్షణ కొరవడింది సాయంత్రమైతే స్టేడియం అంతటా చీకట్లు కమ్ముకునేవి. చీకట్లో వాకింగ్ చేసి వెళ్లిపోవడమే. ఇప్పుడు తాత్కాలికంగా లైట్లు ఏర్పాటు చేశారు. కానీ గతంలో మాదిరిగా ఆట స్థలాలు అభివృద్ధి చేయడం లేదు. గతంలో ఉదయం, సాయంత్రం ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటెన్ ఆడుకునేవారు. కూలిపోయిన ఇండోర్ స్థానంలో కొత్తది నిర్మించాలి. మరుగుదొడ్డి, తాగునీరు అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేయాలి. – ఎస్ సత్యనారాయణ ప్రత్యామ్నాయాలు చేస్తున్నాం గతంలో నిర్మించిన ఫ్లడ్లైట్ల మెయింటెనెన్స్ కష్టంగా మారింది. పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. అందుకోసం వాటిస్థానంలో అవసరం మేరకు లైట్లు ఏర్పాటుచేశాం. ఇండోర్ కూలిపోవడంతో వాటర్ప్లాంట్, జిమ్ మూసేశాం. త్వరలో ఎస్బీఐ సౌజన్యంతో వాటర్ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. వెయిట్లిఫ్టింగ్ హాల్లో మంచినీరు ఏర్పాటుచేశాం. మరుగుదొడ్డి మెయింటెనెన్స్ ప్రైవేటు సంస్థకు అప్పగించేలా చూస్తున్నాం. – బి శ్రీనివాసరావు, డీఎస్డీఓ -
అ‘పూర్వ’ ఆత్మీయ కలయిక
భీమవరం: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం .. చదువులమ్మ చెట్టు నీడలో .. అంటూ పూర్వ విద్యార్థులు ఒకే చోట కలిశారు. గడచిన ఆనాటి బాల్యాన్ని గుర్తు చేసుకుని సందడి చేశారు. లూథరన్ హైస్కూల్ 1975 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు 50 ఏళ్ల తరువాత ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించుకున్నారు. ఒకరిని ఒకరు పలరించుకుంటూ చిన్ననాటి మన స్నేహబంధం.. చిరకాలపు మధుర స్మతులుగా పంచుకున్నారు. పూర్వ విద్యార్థులు తటవర్తి భాస్కరరావు, నంబూరి మాధవ, సుజ్ఞానరాజు, బెల్తాజర్, గోపా సత్యనారాయణ కొందరు మిత్రులు కలిసి గత కొన్ని నెలలుగా అందరినీ కలుపుకుని పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించామని తెలిపారు. 20 మంది ఉపాధ్యాయులను సత్కరించినట్లు చెప్పారు. -
పేరుపాలెం బీచ్లో యువకుడి గల్లంతు
నరసాపురం రూరల్: స్నేహితులతో కలసి విహారయాత్రకు వచ్చిన ఒక యువకుడు పేరుపాలెం బీచ్లో గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. దేవరపల్లి మండలం చిన్నాయగూడెంకు చెందిన యాదాల అజయ్ (27) మరో ఆరుగురు స్నేహితులతో కలిసి పేరుపాలెం బీచ్కు వచ్చారు. తీరంలో సరదాగా ఆడుకుంటూ ఉండగా భారీ అలలు రావడంతో అజయ్ గల్లంతైనట్లు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. అజయ్ మేనమామ పాలపాటి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వాసు తెలిపారు. సైబర్ నేరం.. వ్యాపారికి రూ.85 వేలకు టోకరా నరసాపురం రూరల్: సైబర్ నేరగాళ్లు ఓ వ్యాపారికి రూ.85 వేలకు టోకరా వేసిన ఘటన ఆదివారం మొగల్తూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇవి. మామిడిపండ్ల వర్తకుడు దూసనపూడి రాజుకు ఆదివారం మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను మొగల్తూరు ఏఎస్ఐ ఆనందరావునని, తన మేనకోడలుకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆసుపత్రికి డబ్బు అర్జంటుగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయని, కానీ బ్యాంకు ఖాతాలో లేకపోవడంతో ఫోన్ చేసినట్లు వివరించాడు. అయితే తన ఖాతాలో కూడా నగదు లేదని దూసనపూడి రాజు చెప్పడంతో ఇంకా ఎవరికై నా పురమాయించమని ఆ వ్యక్తి కోరాడు. విషయం నిజమనుకున్న రాజు మొగల్తూరు కూరగాయల మార్కెట్ వ్యాపారి ముక్కు పురుషోత్తంకు పురమాయించాడు. పురుషోత్తం స్టేషన్ వద్దకు వెళ్లి బయట నుంచే ఆ వ్యక్తికి ఫోన్ చేయగా నేను సినిమా హాల్ సెంటర్లో ఉన్నాను.. ఈ 7993014578 నంబర్కు రూ.85 వేలు ఫోన్ పే చేయాలని సూచించాడు. పురుషోత్తం వెంటనే రూ.85 వేలను ఆ నంబర్కు ఫోన్ పే చేశాడు. తర్వాత ఎంత సేపటికీ ఆ వ్యక్తి స్టేషన్కు రాకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన పురుషోత్తం పోలీసులకు, సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు. -
మద్దిలో తెప్పోత్సవం
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో నిర్వహిస్తున్న హనుమద్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో ఆఖరి రోజైన ఆదివారం అంజన్నకు ప్రభాత సేవ, నిత్య అర్చన, ప్రధాన హోమాలు, మహాపూర్ణాహుతి, దీక్షా విరమణ కార్యక్రమాలు అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం మద్ది ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకం, ధ్వజావరోహణ, చక్రస్నానం నిర్వహించారు. పెద్దెత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈవో ఆర్వీ చందన పర్యవేక్షించారు. వనదేవతకు జన హారతి బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఆదివారం రోహిణీ కార్తె ప్రారంభం కావడంతో ఉదయం తీవ్రమైన ఎండ ఉన్నా మధ్యాహ్న సమయానికి ఒక్కసారిగా మబ్బులు కమ్మి కొద్దిసేపు వర్షం కురిసింది. భక్తులు వర్షంలోనే అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద భక్తుల రద్దీ కై కలూరు: వేసవి సెలవుల నేపథ్యంలో ఆదివారం సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు అచరించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం ద్వారా రూ.63,261 ఆదాయం వచ్చిందని చెప్పారు. బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్టు తాడేపల్లిగూడెం రూరల్: మాధవరంలో ఆదివారం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెల్టు షాపు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి ఆరు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఇ.స్వరాజ్యలక్ష్మి వివరించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్సైలు మురళీమోహన్, దొరబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
చిరుద్యోగులే బలి!
నూజివీడు: గృహనిర్మాణ శాఖకు సంబంధించి నూజివీడు మండలం సుంకొల్లులో మెటీరియల్ పంపిణీలో చోటు చేసుకున్న అవినీతి, అవకతవకలపై అవుట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవడంపై గృహనిర్మాణశాఖతో పాటు రాజకీయ వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది. సుంకొల్లులో జరిగిన కుంభకోణంపై విచారణ జరపగా 2,450 బస్తాల సిమెంట్, 11,952 కిలోల స్టీలు లబ్ధిదారులకు అందలేదని తేలింది. వీటి విలువ రూ.16,52,895గా ధ్రువీకరించారు. దీంతో ఐదుగురు అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లపై వేటు వేశారు. అయితే లబ్ధిదారుడికి మెటీరియల్ ఇచ్చే విషయంలో వర్క్ ఇన్స్పెక్టర్ల పాత్ర ఏమీ ఉండదనేది అందరికి తెలిసిందే. గృహనిర్మాణ శాఖ అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ అధికారులపై చర్యలు తీసుకోకుండా వర్క్ ఇన్స్పెక్టర్లను బలిపశువులను చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మెటీరియల్ను ఎలా జారీ చేస్తారంటే.. ఇల్లు కట్టుకునే లబ్ధిదారుడికి మెటీరియల్ను అందజేసే విషయంలో ఆ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఈలదే కీలకపాత్ర. అయితే వాళ్లను వదిలేసి ఎలాంటి సంబంధం లేని వర్క్ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవడమేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎంబుక్ నమోదు చేసి సిమెంట్, ఐరన్, ఇసుకకు సంబంధించిన మెటీరియల్ రిలీజ్ ఆర్డర్ జారీ చేసేది సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ కాగా, ఆ కూపన్లను తీసుకొని వచ్చిన లబ్ధిదారులకు రిలీజ్ ఆర్డర్లో పేర్కొన్న మేరకు మెటీరియల్ను హౌసింగ్కు చెందిన స్టాకు పాయింట్ ఇన్చార్జి అందజేస్తారు. స్టాక్ పాయింట్ ఇన్చార్జిగా ఏఈ స్థాయి అధికారి ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులపై చర్యలు తీసుకోకుండా వర్క్ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవడం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. 42 ఇళ్లకు సంబంధించి మెటీరియల్ పక్కదారి సుంకొల్లులో 42 గృహాలకు సంబంధించి ఇళ్లు ప్రారంభించకుండానే మెటీరియల్ను డ్రా చేసేశారు. ఒక్కొక్క గృహానికి ఒక్కో విధంగా మెటీరియల్ను జారీ చేసేశారు. కొన్ని ఇళ్లకు 10 సిమెంట్ కట్టలు, మరికొన్ని ఇళ్లకు 20 సిమెంట్ కట్టలు ఇలా వారిష్టమొచ్చినట్లు రిలీజ్ ఆర్డర్ ఇచ్చేశారు. ఈ 42 గృహాలకు సంబంధించి మెటీరియల్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన ఇంజినీరింగ్ అసిస్టెంట్పైన గాని, పర్యవేక్షణ అధికారులైన ఏఈ, డీఈలపైన గాని ఇంత వరకు చర్యలు లేవు. మెటీరియల్ను జారీ చేసిన తరువాత లబ్ధిదారులు గృహాలను నిర్మిస్తున్నారా, లేదా అనే విషయాన్ని ఏఈ, డీఈలు పర్యవేక్షించాలి. అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దుర్వినియోగం జరిగింది. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ అసలు దోషులపై చర్యలు తీసుకోకుండా దీనికి ఎలాంటి సంబంధం లేని వర్క్ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకొని మమ అనిపించేశారు. ఇళ్ల నిర్మాణ సామగ్రి మాయం అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు అధికారులను వదిలేసి.. వర్క్ ఇన్స్పెక్టర్లపై చర్యలా! హౌసింగ్ ఉన్నతాధికారుల తీరుపై విస్మయం -
ఖరీఫ్కు ఆదిలోనే ఆటంకం
గత 10 నుంచి 15 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ఖరీఫ్ నారుమడి పనులకు ఆటంకంగా మారాయి. విత్తనాలు కొట్టుకుపో తున్నాయని రైతులు వాపోతున్నారు. 8లో uపారిజాతగిరిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఆదివారం స్వామికి జరిగిన ధ్రువమూర్తి విశేషాభిషేకం, సాయంత్రం ద్వాదశ ఆరాధన, ద్వాదశ ప్రదక్షిణలు శ్రీ పుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం నిత్య ఆరాధన అనంతరం స్వామివారి ధ్రువమూర్తికి పంచామృతాలతో, విశేష అభిషేక ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం కల్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని ప్రత్యేక వేదికపై అలంకరించి ద్వాదశరాధన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని తొళక్కం వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఉత్సవ కార్యక్రమం నిర్వహించిన రిత్విక్కులను సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు, సభ్యులు రెడ్డి రంగప్రసాద్, దండు ధనరాజు, కంది బాలకృష్ణారెడ్డి, వాసవి సాయి నగేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఖరీఫ్కు ఆదిలోనే ఆటంకం
తాడేపల్లిగూడెం రూరల్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత 15 రోజులుగా తాడేపల్లిగూడెం మండలంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఖరీఫ్ వరి నారుమడి పనులకు ఆటంకంగా మారింది. ఇప్పటికే ఎల్.అగ్రహారం, పుల్లాయగూడెం, నీలాద్రిపురం, కృష్ణాపురం, మోదుగ గుంట, గొల్లగూడెం, అప్పారావుపేట తదితర గ్రామాల్లో దుక్కి దున్ని ఆకుమడి కోసం సంపద స్వర్ణ, పీఆర్.126 రకాల విత్తనాలను వేశారు. వర్షాలు విస్తారంగా కురవడంతో వేసిన విత్తనాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఎండాకాలంలో వర్షాలు మే నెలలో మెండుగా ఎండలు కాయాల్సింది పోయి వర్షాలు కురవడంతో ఖరీఫ్ ఆకుమడి పనులకు ఆటంకంగా మారాయి. ఏటా ఖరీఫ్ పనులను మే నెలలో ప్రారంభించి, జూన్ నెలాఖరు నాటికి మెట్ట రైతులు పూర్తి చేస్తారు. తద్వారా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసే భారీ వర్షాల నుంచి పంట గట్టెక్కే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఇప్పటికే వేసిన నారుమడి విత్తనాలు కొట్టుకుపోవడంతో వర్షాలు తగ్గిన తర్వాత మరలా విత్తనాలు వేసుకోవలసిన పరిస్థితి తలెత్తింది. దీనివల్ల ఖరీఫ్ సాగు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసే వర్షాల బారిన పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో అయోమయంలో రైతులు ఇప్పటికే వేసిన నారుమడి విత్తనాలు వర్షార్పణం అకాల వర్షాలతో నష్టం మే నెలలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ఖరీఫ్ ప్రారంభంలోనే నష్టాలు తప్పడం లేదు. ఈ వర్షాలకు పోసిన నారు నీటి పాలవుతుంది. దీనివల్ల మరలా విత్తనాలు చల్లుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికై నా వర్షాలు తగ్గుముఖం పడితే విత్తనాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మరలా పెట్టుబడులు తప్పవు. – మైలవరపు చంద్రరావు, రైతు, పుల్లాయగూడెం, తాడేపల్లిగూడెం మండలంమరింత ఆలస్యం ఏడెకరాల విస్తీర్ణానికి విత్తనాలు చల్లి ఇప్పటికే 15 రోజులు కావస్తుంది. మరో ఆరు రోజుల్లో నాట్లు వేయవలసి ఉంది. అయితే, వర్షాల కారణంగా కొంత విత్తనం కొట్టుకుపోగా, మరికొంత నారుమడి తయారై పోగులుగా తయారైంది. దీనివల్ల నారుమడి సరిపోతుందో లేదో అర్థం కాని పరిస్థితి. – మతుకుమిల్లి రామారావు, రైతు, కృష్ణాపురం, తాడేపల్లిగూడెం మండలం -
మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ
భీమవరం: యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడంలో మాస్టర్ ట్రైనర్ల పాత్ర కీలకమని జేసీ టి.రాహుల్ కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం జాయింట్ కలెక్టరు ఎస్ఆర్కెఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో రోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఢిల్లీ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కొనసాగింది. విద్యా, ఆయుష్ శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమంలో మొదటి రోజు సుమారు 100 మంది మాస్టర్ ట్రైనర్లకు యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 200 మంది యోగా ట్రైనర్లకు మెరుగైన శిక్షణ ఇచ్చి నెలరోజులపాటు గ్రామ, వార్డు స్థాయిలోని ప్రజలకు యోగా ప్రాధాన్యత తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందించారు. యోగా గురువులు ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, బీహెచ్ఇ సత్యనారాయణ రాజు, పీఎస్డీ భవాని శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, టూరిజం శాఖ అధికారి ఎ.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన పిల్లల సమాచారంపై ఆరా
ఏలూరు (టూటౌన్): ఆదివారం అంతర్జాతీయ ‘తప్పిపోయిన పిల్లల దినోత్సవం’ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరు ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వలంటీర్లు పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. సంబంధిత అధికారులతో ఎవరైనా బాలబాలికలు ఒంటరిగా, అనుమానాస్పదంగా లేదా ఎలాంటి ఆదరణ లేకుండా కనిపించారా? అని ఆరాతీశారు. అలాంటి సమాచారం తెలిస్తే వారు గాని తారసపడిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ప్రత్యక్షంగా లేదా 08812 22455, 15100 నెంబర్లకు లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో లాయర్లు జి.వి.భాస్కర్, బి.సంగీతరావు, ఏ.గంగాభవాని, పారా లీగల్ వలంటీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు బుట్టాయగూడెం: గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం 9వ రోజు పలు వురు జేఏసీ నాయకులు దీక్షలో కుర్చున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సోదెం ముక్కయ్య మాట్లాడుతూ తమ డిమాండ్లు నెర వేర్చే వరకూ దీక్షలు కొనసాగిస్తామని చెప్పారు. కొల్లేరులో అక్రమ తవ్వకాలు సాక్షి టాస్క్ఫోర్స్: ఏలూరు రూరల్ మండలం మాధవాపురం పక్షుల ఆవాస కేంద్రం వద్ద కొల్లేరులో ఆదివారం ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొందరు తవ్వకాలు చేపట్టారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం మేరకు పక్షుల ఆవాస కేంద్రాలు, జంతువుల ఆవాస కేంద్రాల వద్ద యంత్రాలతో తవ్వడం నిషేధం. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకానికి ఎటువంటి అనుమతులు లేవని యంత్రాలను, పొక్లెయిన్ను అడ్డుకున్నారు. అయినా పనులు ఆపకపోవడంతో ఫారెస్ట్ అధికారులు తవ్వుతున్న వారి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు తవ్వకాలను నిలుపుదల చేశారు. అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ మూర్తి (రాజమండ్రి), ఏలూరు ఫారెస్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి, సిబ్బంది ఉన్నారు. కిటకిటలాడిన రాట్నాలమ్మ దేవస్థానం పెదవేగి: రాట్నా లమ్మ అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి, విశేష రీతిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కుబడులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వారం అమ్మవారికి మొత్తం రూ.1,01,960 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్కుమార్ తెలిపారు. మహిళల క్రికెట్ జట్ల ఎంపికకు సన్నాహాలు ఏలూరు రూరల్: మే 31, జూన్ 1న భీమవరం డీఎన్నార్ కళాశాల గ్రౌండ్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలికల క్రికెట్ జట్ల ఎంపిక చేపట్టనున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అడహక్ కమిటీ సభ్యులు ఆర్ఎస్ఆర్ మూర్తి, ఈ.అశోక్కుమార్, ఎస్కె సాఖీర్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–15 విభాగంలో బాలికలు సెప్టెంబర్ 1, 2010 తర్వాత పుట్టి ఉండాలన్నారు. అండర్–19 విభాగంలో మహిళలు సెప్టెంబర్ 1, 2006 తర్వాత, అండర్–23 విభాగంలో సెప్టెంబర్ 1 2002 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారిణులు తమ వయసు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ఆధార్తో పాటు సొంత క్రికెట్ కిట్తో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. జట్లకు ఎంపికై న వారు ఏసీఓ పర్యవేక్షణ జరిగే అంతర జిల్లా క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. మరింత సమాచారం కోసం 70136–33143 నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. -
శాశ్వత పనులకు నోచుకోని తమ్మిలేరు కాజ్వే
చాట్రాయి: వరద వచ్చినపుడల్లా తరుచూ కొట్టుకుపోతున్న చిన్నంపేట తమ్మిలేరు కాజ్వేతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ద్వారా మండలంలోని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు వరద వచ్చినపుడల్లా చిన్నంపేట కాజ్వే కొట్టుకుపోతుంది. దీంతో రెండు వారాల పాటు మండలంలోని చిన్నంపేట, చింతలపూడి మండలం శివాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ఆయా గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రెండు గ్రామాల వారికి ఇరువైపులా వ్యవసాయ భూములు ఉండడం, నిత్యావసర వస్తువులు కొనుగోలుకు శివాపురం గ్రామస్తులు చిన్నంపేట రావాల్సి ఉంది. అంతేగాక శివాపురం నుంచి చిన్నంపేటకు పాఠశాలలకు విద్యార్థులు వస్తుంటారు. కాజ్వే కొట్టుకుపోయినపుడల్లా మరమ్మతుల కోసం లక్షల్లో నిధులు వెచ్చిస్తున్నారు. తరుచూ ఈ విధమైన మరమ్మతులు చేపట్టి నిధులు ఖర్చు పెట్టడం కన్నా వాగుకు శాశ్వతమైన కాంక్రీట్తో కూడిన కాజ్వే నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక
భీమవరం (ప్రకాశంచౌక్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా యూనిట్ సమావేశం ఆదివారం నిర్వహించారు. జిల్లా యూనిట్ కార్యవర్గ కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా వై.మోహనరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎస్కె ఉమర్ ఆలీ షా, ఉపాధ్యక్షులుగా జీవీ రామనాగు, ఎస్.మానస, ఎంవీ లక్ష్మీనారాయణ, ఎం.సదాశివ ప్రసాద్, కే.కనకరాజు, ఎం.వెంకటేష్, ఎం.సాయిబాబా, వి.రాజేష్ కుమార్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జి.జక్కరయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్వీఎస్ వాసు పులగండం, సహాయ కార్యదర్శులుగా ఎండీ అస్గర్ అలీ, కే మాణిక్యాలరావు, సీహెచ్ రాజేష్, జి.నారాయణ, జి.ప్రసాద్, ఎం.పద్మిని, కోశాధికారిగా పి.నాగభూషణం ఎన్నికయ్యారు. -
లారీ డ్రైవర్ మృతి
ముదినేపల్లి రూరల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లారీ డ్రైవర్ ఆదివారం మృతి చెందాడు. ముదినేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచికచెర్ల గ్రామానికి చెందిన షేక్ నాగూల్ మీరా(29) శనివారం శ్రీహరిపురం గ్రోవెల్స్ ఫ్యాక్టరీ గోడౌన్ వద్దకు లారీ లోడ్ దించడానికి వచ్చాడు. గోడౌన్ ప్రాంగణంలో లారీ నుంచి తలను బయటకు పెట్టి లారీ రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ లారీ, గోడౌన్ గోడ మధ్య అతని తల నలిగిపోయింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం షేక్ నాగూల్ మీరా మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెల్టుషాపులపై 456 కేసులు
ఏలూరు టౌన్: జిల్లాలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఏ.అవులయ్య హెచ్చరించారు. స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకూ 456 కేసులు నమోదు చేయడంతోపాటు బెల్టు షాపులు నిర్వహిస్తున్న 478 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్న ఏలూరు రూరల్, పెదవేగి మండలం, భీమడోలులోని 5 ప్రైవేటు మద్యం షాపులను సీజ్ చేశామని ఆయన తెలిపారు. వీరిపై రూ.5 లక్షల అపరాధ రుసుము విధించామన్నారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ఎమ్మార్పీ కంటే అదనంగా మద్యం అమ్ముతున్న కనకదుర్గ వైన్స్పై కేసు నమోదు చేశామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే 70 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే జిల్లాను నెలాఖరు నాటికి నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అవులయ్య తెలిపారు. జిల్లాలోని 140 గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలు ఉన్నాయని, ఈ గ్రామాల్లో విస్తృతంగా దాడులు చేస్తూ నాటుసారా తయారీని నిరోధించామన్నారు. నవోదయం –2 పథకంలో భాగంగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తున్నామని తెలిపారు. జిల్లాలో మద్యం అక్రమ విక్రయాలు, నాటు సారాపై 14405 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అవులయ్య కోరారు. ఏలూరు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అవులయ్య -
ఆక్వాకు వాతావరణ ముప్పు
గణపవరం: ఆక్వా రైతులు వేసవి పంటపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో చెరువులలో రొయ్య సీడ్ వేస్తే జూన్లో పట్టుబడికి సిద్ధమవుతుంది. ఏప్రిల్, మే నెలల్లో సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతులు ఎక్కువగా వేసవి సాగుపై గంపెడాశలు పెట్టుకుంటారు. ఈ వేసవి ఆక్వా రైతులకు చుక్కలు చూపిస్తుంది. వేసవి ఆరంభం నుంచి ఎండా, వానల సయ్యాటలతో ఆక్వా సాగు దినదినగండంగా సాగుతుంది. ఏప్రిల్ నెలలో సాగు సవ్యంగానే సాగినా మే నెలలో మాత్రం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. వాతావరణంలో విపరీతమైన మార్పులతో వందల ఎకరాలలో సాగు అర్ధాంతరంగా ముగిసిపోయింది. కౌంట్కు రాకుండానే మృత్యువాత పూటకో రకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గండంగా మారింది. ఇరవై రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఒకే రోజులో విపరీతమైన ఎండలు ఒకపక్క, మరోపక్క ఉన్నట్టుండి ఆకాశం మేఘావృత్తమై వర్షాలు కురుస్తూ ఆక్వా సాగును కుదేలు చేస్తున్నాయి. గతంలో లేని విధంగా ఈ వేసవిలో సగం రోజులు వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎండకాస్తే విపరీతమైన వేడి, ఉక్కబోతతో ఆక్వా సాగు తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. పిల్ల వేసిన 30 రోజులలోపుగానే వాతావరణ మార్పులకు వైట్స్పాట్, విబ్రియో వంటి పలు వ్యాధులు వ్యాపించడంతో కౌంట్కు రాకుండానే రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. రాత్రి వర్షం కురుస్తూ, పగలు ఎండలు కాయడంతో పీహెచ్లో హెచ్చుతగ్గుల కారణంగా రొయ్యలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా మందులు చల్లడానికి చెరువుల వద్ద రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. విద్యుత్ కోతలు ఆక్వా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిరగడానికి ఆయిల్ ఇంజిన్ల వినియోగానికి రోజూ వేలల్లో ఖర్చుపెడుతున్నారు. ఆక్సిజన్ కోసం అవస్థలు అప్పటికప్పుడు ఎండ మాయమై, మబ్బులు కమ్మి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పోవడంతో ఆక్సిజన్ సమస్య తలెత్తి చేపలు, రొయ్యలు నీటి ఉపరితలంపై తిరుగాడుతున్నాయి. కొన్ని చోట్ల చనిపోయి నీటిపై తేలుతున్నాయి. ఆక్సిజన్ లోటు పూడ్చడానికి రసాయనాలు చల్లుతున్నారు. ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినలేక నీరసించి పోతుండటంతో రైతులు యుద్ధ ప్రాతిపదికన పట్టేసి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాలలో రొయ్య, మరో 1.50లక్షల ఎకరాలలో చేపల సాగు జరుగుతుంది. వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఉంగుటూరు నియోజకవర్గంలోనే వారం రోజుల వ్యవధిలో దాదాపు 4 వేల ఎకరాల్లో కౌంట్కు రాకుండానే రొయ్యలు పట్టివేసినట్లు అంచనా. దీనికి తోడు రొయ్య ధర కూడా పదిరోజులలో కేజికి రూ.10 నుంచి రూ.15 మేర పడిపోవడంతో రైతులకు నష్టాలు తప్పడంలేదు. మత్స్యశాఖ అధికారుల సూచనలు ఉష్ణోగ్రతలు తగ్గకుండా నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ నీటిని రీసైక్లింగ్ చేయాలి. ఆక్సిజన్ నివారణకు పొటాషియం పర్మాంగనేటు సిద్ధంగా ఉంచుకుని, పీహెచ్ స్థాయిని బట్టి అవసరం మేరకు చెరువులో చల్లుతుండాలి. ఆక్సిజన్ సరిపడా అందకపోవడంతో చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినకపోతే పరిమితంగా మేతలు వేస్తుండాలి. ఆక్సిజన్ సమస్య ఉన్న సమయంలో మేత, సేంద్రీయ ఎరువులు వేయడం పూర్తిగా మానేయాలి. ఎండలు, అకాల వర్షాలతో నష్టాలు -
కిటకిటలాడిన శ్రీవారి ఆలయం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. తూర్పురాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. -
పాలకులారా.. పట్టించుకోరా!
ఈ గుంతల రోడ్లు చూశారా.. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు. ఏలూరు నగరంలో వంగాయగూడెం సెంటరు నుంచి కేన్సర్ ఆసుపత్రి వరకు ఉన్న రోడ్డు ఇలా గోతులతో అధ్వానంగా తయారైంది. ఎన్నికలకు ముందు మైక్ పట్టుకుంటే ఓట్లు వేయండి.. రోడ్లు వేసి చూపిస్తామని అంటూ కూటమి నాయకులు ఊదరగొట్టారు. తీరా ఓట్లు వేశాక రోడ్లు సంగతి మరిచారు. నిత్యం గోతులమయంగా ఉన్న ఈ రోడ్లలో ప్రయాణించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తరోడ్డు దేవుడెరుగు... కనీసం ఆ గుంతలైనా పూడ్చండి అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. – సాక్షి, ఫొటోగ్రాఫర్/ఏలూరు -
జిల్లాలు దాటి మట్టి అక్రమ రవాణా
పోలవరం రూరల్ : జిల్లాలు దాటి మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేట గ్రామ పరిసర ప్రాంతాల నుంచి ఏలూరు జిల్లా పోలవరంలోని ఇటుక బట్టీలకు మట్టిని లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి రవాణా చేయడంపై స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో మార్గమధ్యలో వీఆర్వో మట్టి లారీలను ఆపి తనిఖీలు చేశారు. లారీలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు లారీలను పోలీస్స్టేషన్కు తరలించారు. లారీలను ఆపిన సమయంలో మట్టి రవాణా చేస్తున్న వ్యక్తులు రెవెన్యూ, పోలీసు సిబ్బందిపై కొంత సేపు ఘర్షణకు దిగారు. ఈ ఘటనపై పోలవరం తహసీల్దార్ సాయిరాజును అడగ్గా మట్టి రవాణా చేస్తున్న లారీలకు సంబంధించి జరిమానా విఽధిస్తామన్నారు. చట్టవ్యతిరేకంగా మరోసారి మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడమే కాక కేసులు నమోదు చేస్తామన్నారు. -
పోలీస్ డాగ్ స్క్వాడ్కు నూతన భవనం
ఏలూరు: పోలీస్ డాగ్స్కు నూతన భవనాన్ని నిర్మించడం అభినందనీయమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పోలీస్ డాగ్ స్క్వాడ్ భవనాన్ని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్తో కలిసి ఐజీ అశోక్కుమార్ ప్రారంభించారు. తొలుత పోలీస్ సిబ్బంది ఐజీకి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేరాల దర్యాప్తులో పోలీస్ డాగ్ స్క్వాడ్ పాత్ర కీలమన్నారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే నేరాలకు పాల్పడే వారికి శిక్షలు పడేలా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ఎస్ఎస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలి ఏలూరు(మెట్రో): గృహ నిర్మాణాల బిల్లుల మంజూరులో అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి శనివారం గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు ఎమెనిటిస్తో గృహ నిర్మాణ ప్రగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ వారంలో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై సమీక్షించారు. నూజివీడు డివిజన్లోని మండలాల ప్రగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గృహనిర్మాణ విషయంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లాను 3వ స్థానం నుంచి 2వ స్థానానికి తీసుకురావడానికి మరింత కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్లో గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి జి.సత్యనారాయణ, ఉప కార్య నిర్వాహక ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈఏపీ సెట్ పరీక్షకు 474 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో నిర్వహించిన పరీక్షలకు శనివారం మూడు పరీక్షా కేంద్రాల్లో 489 మందికి 474 మంది హాజరయ్యారు. ఉదయం సెషన్లో సిద్ధార్థ క్వెస్ట్ పరీక్షా కేంద్రంలో 162 మందికి గాను 157 మంది హాజరు కాగా, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం సెషన్లో 150 మందికి 144 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 177 మందికి 173 మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారు. లెదర్ కోర్సుల్లో శిక్షణకు ఆహ్వానం ఏలూరు (టూటౌన్): జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు లిడ్కాప్–సీడ్యాప్ ద్వారా వివిధ కోర్సులలో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఒక ప్రకటనలో తెలిపారు. లెదర్ స్టిచింగ్ ఆపరేటర్–లెదర్ ఫుట్ వేర్, లెదర్ కట్టర్ ఫుట్వేర్లో శిక్షణ ఇస్తారన్నారు. ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని.. అభ్యర్థులు 9494174417, 7981438585, 94944 77597 నెంబర్లలో సంప్రదించాలన్నారు. ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలకు 3,016 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో శనివారం జరిగిన జీవశాస్త్రం పరీక్షకు మొత్తం 4,306 మంది హాజరు కావాల్సి ఉండగా 3,016 మంది హాజరయ్యారు. 1290 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలను జిల్లా విద్యాశాఖాధికారి ఒక పరీక్షా కేంద్రంలో, ఫ్లయింగ్ స్క్వాడ్ 17 పరీక్షా కేంద్రాల్లో, ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ 2 కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఆక్వా క్రాప్ హాలిడేకు సిద్ధమవ్వాలి పాలకొల్లు సెంట్రల్: క్రాప్ హాలిడే దిశగా ఆక్వా రైతులు సమాయత్తమవుతున్నారని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్ రాజు అన్నారు. శనివారం స్థానిక జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం భవనంలో మాట్లాడుతూ జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించనున్న క్రాప్ హాలిడేకు ఇప్పటి వరకూ ఆక్వా పట్టుబడులు చేసిన రైతులు తమ చెరువులను ఎండపెడుతున్నారని చెప్పారు. పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి చెందిన ఆక్వా రైతులందరూ క్రాప్ హాలిడేకు సిద్ధమవుతున్నారని చెప్పారు. -
నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ ఏలూరు టౌన్: జిల్లాలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన వార్షిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిషేదిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, మద్యం, నగదు అక్రమ రవాణాను నియంత్రించేలా నిత్యం వాహన తనిఖీలు చేయాలని ఆదేశించారు. నేరాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, శక్తి పోలీస్ టీమ్స్ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులపై దర్యాప్తును వేగవంతం చేస్తూ కేసులను పరిష్కరించాలని సూచించారు. కార్యాలయం తనిఖీ తొలుత ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్కు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీస్ ప్రధాన కార్యాలయంలోని రిసెప్షన్ కౌంటర్లో ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయో ఆరా తీశారు. ఏఆర్, డాగ్ స్క్వాడ్, కమాండ్ కంట్రోల్ రూమ్, డ్రోన్స్ కెమెరాల నిఘా విభాగం, హోమ్ గార్డ్స్ విభాగాల్లోనూ తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్పెషల్ బ్రాంచ్, ఫింగర్ ప్రింట్స్ విభాగాల్లోనూ తనిఖీలు చేసి ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. జిల్లాలో కేసుల ఛేదనపై ఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఎండీయూ ఆపరేటర్ల పోరుబాట
ఏలూరు (టూటౌన్): ఒక్క కలం పోటుతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లను వీధిన పడేసింది. దీంతో ఎలా జీవించాలంటూ జిల్లాలోని ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు పోరు బాట పట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారనే సాకుతో కక్ష గట్టి అగ్రిమెంట్ మరో 20 నెలలు ఉండగానే తొలగించడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. వాహనాలకు సంబంధించి మరో 20 ఈఎంఐలు ఎలా కట్టాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేసే పక్షంలో తాము చెల్లించాల్సిన మొత్తం బకాయి ఈఎంఐలను రద్దు చేసి, తమకు ఎన్ఓసీ, ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందించాలని కోరుతున్నారు. శనివారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ఎండీయూ ఆపరేటర్లు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వీరి ఆందోళనకు వైఎస్సార్సీపీ, ఏఐటీయూసీ మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలోని ఎండీయూ వ్యవస్థకు సంబంధించి ఆపరేటర్లకు 2027 జనవరి వరకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉంది. దాన్ని పక్కన బెట్టి కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి రేషన్ డీలర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం మోసపూరితమని విమర్శిస్తున్నారు. నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీ, ఈబీసీలకు చెందిన యువత ఉపాధి పొందాని.. ఎండీయూ వ్యవస్థ రద్దుతో వీరంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 394 మంది ఎండీయూ ఆపరేటర్లు, 394 మంది హెల్పర్లు ఉపాధి కోల్పోనున్నారు. కరోనా, వరదల్లో విశేష సేవలు రాష్ట్రంలోని ఎండీయూ ఆపరేటర్లు కరోనా సమయంలో ప్రజలకు విశేష సేవలందించారు. విజయవాడ వరదల్లో బాధిత ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడంలో కీలకంగా పనిచేశారు. విజయవాడలో వరదల సేవలందించినందుకు అదనపు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినా నేటికీ ఒక్క పైసా ఇవ్వలేదు. ఎండీయూ వ్యవస్థ ఏర్పాటైన నాటి నుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం, ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాఢీ కేంద్రాలకు బియ్యం సరఫరా వీరే చేస్తున్నారు. దీనికి ఎలాంటి అదనపు ప్రయోజనాలు కల్పించడం లేదు. ఏలూరులో కదం తొక్కిన సిబ్బంది ఎండీయూ వ్యవస్థనురద్దు చేయడంపై మండిపాటు ఏలూరు జిల్లాలో వీఽధినపడ్డ 800 కుటుంబాలు సంఘీభావం తెలిపిన వైఎస్సార్సీపీ, ఏఐటీయూసీ -
ఎంటీఎస్ టీచర్లు.. బదిలీల ఇక్కట్లు
ఎక్కడికి పంపుతారో తెలియని అయోమయం దెందులూరు: మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయులు దశాబ్దాల పోరాటంతో కొలువు దక్కించుకున్నామనే ఆనందం ఎన్నో రోజులు మిగల్లేదు. కొన్నాళ్ళు ఏజెన్సీలో పనిచేస్తే ఆ తరువాత స్వగ్రామాలకు సమీపంలో పోస్టింగ్ ఇస్తామని చెబితే ఉద్యోగాల్లో చేరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారనే ఏకై క కారణంతో కూటమి ప్రభుత్వం విషం కక్కుతోంది. టీచర్ల బదిలీలకు తెరలేపిన ప్రభుత్వం, ఎంటీఎస్ టీచర్లను గాల్లోపెట్టి, వారు పనిచేస్తున్న స్థానాలను ఖాళీలుగా చూపించారు. దీంతో మళ్ళీ ఎక్కడికి పోవాలో తెలియక సతమతమవుతున్నారు. న్యాయపరమైన సమస్యల్ని పరిష్కరించి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ–98 అభ్యర్థులు 274 మంది సెలెక్ట్ అయ్యారు. వారికి వేలేరుపాడు, కుక్కునూరు, టీ.నర్సాపురం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు వంద మందికి పైగా పోస్టింగులు ఇచ్చారు. మిగిలిన వారికి జిల్లాలో ఇతర ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చారు. జీతం తక్కువ.. పని ఎక్కువ రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.32,470 వేతనం చెల్లిస్తున్నారు. దీంతో సొంత మండలాలు, లేదా సమీప మండలాల్లోని స్కూళ్లలోనే పోస్టింగ్లు ఇవ్వాలని నాటి ప్రభుత్వం ఆదేశించింది. దశలవారీగా వారిని మైదాన ప్రాంతానికి తీసుకురావాలని అప్పటి ప్రభుత్వం విద్యాశాఖాధికారులకు దిశానిర్దేశం చేసింది. ప్రస్తుతం టీచర్ల బదిలీల నేపథ్యంలో 274 ఎంటీఎస్ స్థానాలను ఖాళీలుగా చూపారు. దీంతో రెగ్యులర్ టీచర్లు కోరుకోగా మిగిలిన ఖాళీలు మాత్రమే వీరికి దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో బడులు తెరిచాక.. ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో తెలియని అయోమయంలో ఎంటీఎస్ టీచర్లున్నారు. -
వాహనాలు కొనసాగించాలి
గతప్రభుత్వం రేషన్ డీలర్ల వ్యవస్థను కొనసాగిస్తూనే ఎండీయూ వాహనాలను ఏవిధంగా నడిపిందో ప్రస్తుత ప్రభుత్వం రేషన్ వాహనాలను కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాపంపిణీ వ్యవస్థపై చిత్త శుద్ది ఉంటే కేరళ రాష్ట్రంలో వలే 16 రకాల వస్తువులను ప్రజలకు అందించాలి. – పి.కిషోర్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు కేవలం 244 కేసులు మాత్రమే ఎండీయూ వ్యవస్థ ప్రవేశ పెట్టిన గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు కేవలం 244 మాత్రమే. అదే రేషన్ డీలర్ల వ్యవస్థపై 60 వేల కేసులు ఉన్నాయి. ఒక్క ఎండీయూ ఆపరేటర్ ముగ్గురు రేషన్ డీలర్ల పని చేస్తున్నాడు. ఈ వ్యవస్థ ఉంటేనే ప్రజలకు ఇంటింటికి రేషన్ సక్రమంగా అందుతుంది. – ఎస్.జయరాజు, జిల్లా అధ్యక్షుడు, ఎండీయూ ఆపరేటర్ల యూనియన్, ఉచితంగా బియ్యం సరఫరా 2023–2025 వరకు ఎండీయూ వాహనాల ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా సొంత ఖర్చులతో బియ్యం సరఫరా చేశాం. దీనికి సంబంధించి ఎలాంటి అదనపు వేతనాలు చెల్లించలేదు. ఒక్క కలం పోటుతో రాత్రికి రాత్రి మమ్మల్ని రోడ్డున పడేశారు. – బి.సుబ్బారావు, ఎండీయూ ఆపరేటర్, నాచుగుంట మరో 20 నెలలు కొనసాగించాలి గతంలో ఎండీయూ వ్యవస్థ ప్రారంభమైన రోజుల్లో ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2027 జనవరి వరకు ఎండీయూ వ్యవస్థను కొనసాగించాల్సిందే. లేనిపక్షంలో మేం చెల్లించాల్సిన 20 ఈఎంఐల బకాయిల మొత్తాన్ని రద్దుచేసి ఎన్ఓసీ, ఫిట్నెస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం అందించాలి. – ఘంటా మాధవరావు, వెంకట కృష్ణాపురం, ద్వారకాతిరుమల మండలం ప్రాణాలకు తెగించి సేవలు కరోనా సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు అందించిన ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్ల ఉపాధికి గండి కొట్టడం సిగ్గుచేటు. ఇంటింటికి రేషన్ వద్దు.. మద్యం ముద్దు అన్న చందంగా ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం దుర్మార్గం. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన మంచిపని నేడు కూటమి ప్రభుత్వానికి నచ్చలేదు. – దూలం నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్సీపీ, ఏలూరు జిల్లా ● -
మద్ది క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి కల్యాణం
జంగారెడ్డిగూడెం: మద్ది క్షేత్రంలో ఉపాలయమైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. హనుమద్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆంజన్నకు ప్రభాత సేవ, నిత్యార్చన, నిత్యహోమం, బలిహరణలు నిర్వహించారు. అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక కల్యాణం వైభవంగా జరిపారు. ఆలయ ముఖమండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల నడుమ వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణ క్రతువు నిర్వహించారు. నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్వామి వారి ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించబడునని దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ చందన తెలిపారు. శిథిలావస్థలో ఉన్న హాస్టళ్లకు కొత్త భవనాలు ఏలూరు (టూటౌన్): ఏలూరు జిలాల్లో శిథిలావస్థలో ఉన్న 4 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు రూ.12 కోట్లతో నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్ ఎం.ముక్కంటి చెప్పారు. స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని కై కలూరు, పెదపాడు, గుండుగొలను, ముదినేపల్లిలలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల స్థానంలో రూ.12 కోట్లతో కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలోని 52 భవనాల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.72 కోట్లు మంజూరు చేసిందని, మరమ్మతు పనులను పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం, సర్వశిక్షా అభియాన్, పబ్లిక్ హెల్త్ శాఖలకు అప్పగించడం జరిగిందన్నారు. 90 శాతం మేర పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులు జూన్ మొదటి వారం నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల రక్షణ నిమిత్తం 56 హాస్టళ్లలో 448 సీసీ కెమెరాలు అమర్చామన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 6,900 మంది విద్యార్థుల చేరిక లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గత విద్యా సంవత్సరంలో హాస్టళ్లలో 10వ తరగతిలో 87 శాతం, ఇంటర్మీడియెట్లో 89 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ముక్కంటి వివరించారు. -
జీలుగుమిల్లిలో పట్టపగలే చోరీ
బుట్టాయగూడెం: తాళం వేసిన ఇంట్లో పట్టపగలే చోరీ జరిగిన ఘటన జీలుగుమిల్లిలో జరిగింది. బాధితుడు సాదు చిన్నారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిన్నారావు జీడిగింజలు, పత్తి వ్యాపారం చేస్తుంటాడు. శనివారం అతని భార్య ఇంటికి తాళం వేసి సెంటర్లో షాపునకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపలకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలకొట్టి ఉన్నాయని, అందులో వెండి, బంగారం మాయమైనట్లు గుర్తించినట్లు బాధితులు చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జూదరుల అరెస్ట్ జంగారెడ్డిగూడెం: మండలంలోని లక్కవరంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. రూ.7,380 నగదు స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై శశాంక తెలిపారు. -
పోస్టింగుపై ఆందోళన
పోస్టింగ్ ఏ ప్రాంతంలో ఇస్తారోనని నాతో పాటు కుటుంబం ఆందోళనగా ఉంది. ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో ఉద్యోగంలో చేరాను. ఈ ఏడాది అయినా మంచి ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాను. – రాజ్యలక్ష్మి, టీచర్, కుక్కునూరు రిటైర్మెంట్ సమయంలోనైనా.. రిటైర్మెంట్ సమయంలో నైనా అనుకూలమైన ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడు వెళ్ళాలో.. ఎక్కడికి వెళ్ళాలో.. ఎప్పుడు మకాం మార్చాలో తెలియదు. రిటైర్మెంట్ ముందుగా కూడా బాధలు తప్పేలా లేదు. – ఎస్.రాజకుమార్, టీచర్, ఆకివీడు కుటుంబ పరిస్థితులను పరిగణించాలి ప్రభుత్వం బదిలీలు చేసే ఉపాధ్యాయులను వారి కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. నిబంధన అనేది ఉపాధ్యాయులు, వారి కుటుంబం ఇబ్బందిపడేలా ఉండకూడదు. – స్వర్ణలత, టీచర్ ● -
కారు ఢీకొని దివీస్ ఉద్యోగిని దుర్మరణం
తగరపువలస (విశాఖ జిల్లా): సంగివలస వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లా చాట్రాయి మండలం ఎర్రవారిగూడేనికి చెందిన ఉప్పలపాటి తిరుమలాదేవి (24) అక్కడికక్కడే మృతి చెందింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలివి.. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన పిల్లి వెంకటేష్ కారులో కాకినాడ నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వైపు వెళ్తున్నారు. కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో సంగివలస ముగ్గురు అమ్మవార్ల ఆలయం సమీపంలో అదుపు తప్పి డివైడర్ను దాటి అవతలి వైపునకు దూసుకెళ్లింది. కాగా.. భీమిలి మండలం చిప్పాడలోని దివీస్ లేబొరేటరీలో కెమిస్ట్గా పనిచేస్తున్న తిరుమలాదేవి విధులకు హాజరయ్యేందుకు మరో ముగ్గురు సహోద్యోగినులతో కలిసి అనిట్స్ బస్టాప్ వద్దకు చేరుకుంది. తాము ఎక్కాల్సిన ప్రైవేట్ బస్సు అప్పటికే ఆనందపురం వైపు వెళ్లిపోయింది. ఆనందపురం వైపు నుంచి తిరిగి వస్తున్న అదే బస్సును పట్టుకోవడానికి ఆమె రోడ్డు దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు తిరుమలాదేవిని బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో ఆమె తల ఛిద్రమై తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మిగతా ముగ్గురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుమలాదేవి మూడేళ్లుగా దివీస్లో కెమిస్ట్గా పనిచేస్తున్నారు. సంగివలసలోని ఆరాధ్య హాస్టల్లో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. సమాచారం అందుకున్న భీమిలి ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దివీస్ ఉద్యోగి కడియాల పవన్కుమార్ ఫిర్యాదుతో ఎస్సై రాధాకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పారిజాతగిరిలో వైభవంగా శ్రీచక్రస్నానం
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శనివారం విశేష పూజలు, నిత్య హోమాలు జరిపారు. ఆలయ కల్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సుదర్శన్ పెరుమాళ్లను తోడుకొని వెళ్లి యజ్ఞ బ్రహ్మ పానంగిపల్లి సత్య పవన్, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో వసంతోత్సవం, చూర్ణోత్సవం, నిర్వహించి అనంతరం యాగశాలలో పూర్ణాహుతి జరిపారు. తరువాత భక్తుల గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ సుదర్శన్ పెరుమాళ్లను కోనేరు వద్దకు తీసుకువెళ్లి చక్రస్నానం నిర్వహించారు. భక్తులు సైతం సుదర్శన్ పెరుమాళ్తో సహా స్నానమాచరించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి గజ వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ధ్వజ అవరోహణం గావించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతి రాజు, సభ్యులు అబ్బిన దత్తాత్రేయ, రెడ్డి రంగ ప్రసాద్, దండు ధనరాజు, వాసవి సాయి నగేష్, బూరుగుపల్లి రవీంద్ర, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమాల ఏర్పాట్లను కార్య నిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు. -
విద్యుత్ తీగలు.. యమపాశాలు
ఆదమరిస్తే అంతే! ● ఆక్వా చెరువుల వద్ద అస్తవ్యస్తంగా విద్యుత్ వ్యవస్థ ● నిర్లక్ష్యంగా విద్యుత్ తీగల ఏర్పాటు ● విద్యుదాఘాతాలతో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు ● వర్షాకాలంలో సమస్య మరింత జటిలం ● రెండు రోజుల క్రితం ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2.63 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ఏరి యేటర్లు ద్వారా చెరువుల్లోని చేపలు, రొయ్యలకు నిరంతరంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు త్రీఫేస్ విద్యుత్ను వినియోగిస్తారు. చెరువు చుట్టూ ఉండే ఈ వైర్లను అందరికీ కనిపించేలా కర్రలకు కట్టాలి. ఏరియేటర్ కనెక్షన్ వద్ద టేపు ఎక్కువగా వేయాలి. చెరువుల చుట్టూ ఉండే వైర్లకు ఎక్కువగా జాయింట్లు లేకుండా చూసుకోవాలి. వైర్లను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ కాలం చెల్లిన వాటిని తొలగించి కొత్త వాటిని ఏర్పాటుచేయాలి. ఎలక్ట్రీషియన్ను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. అయితే ఇలాంటి జాగ్రత్తలేమీ తీసుకోవడం లేదు. ఎలాపడితే అలా వైర్లు.. రెండు ఎకరాల నుంచి వంద ఎకరాలకు పైగా ఆక్వా సాగు చేస్తుంటారు. సాగు విస్తీర్ణం పెరిగే కొద్దీ వైర్లు ఎలా పడితే అలా లాగేస్తున్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలు, రహదారులు, కాలువ గట్లపై జాగ్రత్తలు పాటించకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. వైర్లను కొబ్బరి చెట్లకు వేలాడదీయడం, రోడ్డుపైన, చెరువు గట్లపై నుంచి లాగేస్తున్నారు. కొంతకాలానికి మట్టి, గడ్డి కప్పేయడంతో అవి కనిపించని పరిస్థితి. కొత్తగా వచ్చిన కూలీలకు గట్టుపై ఉన్న వైర్లలో జాయింట్లు ఎక్కడ ఉన్నాయో తెలియక షాక్కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఏరియేటర్లు, మెటార్లు మొరాయిస్తుంటాయి. ఎలక్ట్రీషియన్ అందుబాటులో లేక కూలీలే మరమ్మతులు చేసే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఎందరో.. జిల్లావ్యాప్తంగా ఏటా చెరువుల వద్ద ఎందరో విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండగా వారి కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. కొన్ని కేసులు వరకు వస్తే మరికొన్ని గుట్టుచప్పుడు కాకుండా సర్దుబాటు చేస్తున్నారు. చెరువుల వద్ద పనిచేసే వారిలో ఒడిసా, పశ్చిమ బెంగాళ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఎక్కువ. స్థానిక పరిస్థితులపై అవగాహన లేక ప్రమాదాలు బారిన పడే వారిలో వారే అధికంగా ఉంటున్నారు. చెరువుల వద్ద విద్యుత్ వ్యవసపై తనిఖీలు చేసేందుకు విద్యుత్శాఖ చర్య లు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా ట్రాన్స్ఫార్మర్లు వరకే తమకు బాధ్యత అనే ధోరణిలో విద్యుత్ అధికారులు ఉంటున్నారు.అప్రమత్తత అవసరం వర్షాకాలం దృష్ట్యా ఇళ్ల వద్ద కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు, గాలులు వీచే సమయంలో విద్యుత్ లైన్ల కింద నిల్చోకూడదు. ఇంటి గృహోపకరణాల స్విచ్లను ఆఫ్ చేసుకోవాలి. తడి చేతులతో స్విచ్చ్లను ఆన్, ఆఫ్ చేయకూడదు. చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు వెళ్లనివ్వకూడదు. ఇంటి సర్వీసు వైరు తెగినా, జాయింట్లు కట్ అయినా వెంటనే విద్యుత్ సిబ్బందికి స మాచారం ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని తాకకూడదు. వర్షం పడుతున్నపుడు విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లను తాకరాదు. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడినా, వాలినా, కరెంటు వైర్లు తెగినా వెంటనే విద్యుత్ సిబ్బంది లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలి. మోటార్లు తడిసి షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉన్నందున రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలి. మృత్యు ఘంటికలు గతంలో భీమవరం రూరల్ గొల్లవానితిప్పలో ఒక రైతు తమ చెరువులో మేత వేసేందుకు వెళుతుండగా హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. గూట్లపాడు రేవులో రొయ్యల చెరువు వద్ద విద్యుత్ వైరు తగిలి మరో రైతు మృతిచెందాడు. తాడేరులో రొయ్యల చెరువు వద్ద గట్టుపై గడ్డి కోస్తుండగా కొడవలికి విద్యుత్ వైరు తగిలి కూలీ కన్నుమూశాడు. దొంగపిండిలో చెరువు వద్ద పనిచేసే వ్యక్తి చెరువులో ఏరియేటర్ను రిపేరు చేసేందుకు దిగి మృత్యువాత పడ్డాడు. ఉండి మండలం వెలిపర్రులోని ఆక్వా చెరువుల వద్ద బుధవారం బోదెలో చేపలు పట్టేందుకు దిగిన యువకుడు పక్కనే విద్యుత్ స్తంభం నుంచి వేలాడుతున్న వైరు తగిలి విద్యుత్ షాక్తో మృతిచెందాడు. అదే రోజున ఏలూరు రూరల్ లింగారావుగూడెం చెరువు వద్ద విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. రొయ్యలు, చేపలకు ఆక్సిజన్ అందించేందుకు ఆక్వా చెరువుల వద్ద విద్యుత్ వైర్లు ఏర్పాటులో అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం అమాయకుల ఉసురు తీస్తోంది. వర్షాకాలంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. -
ఉపాధ్యాయుల బదిలీలపై అవగాహన
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని యూటీఎఫ్ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఉపాధ్యాయుల బదిలీలు, సర్దుబాట్లపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ హనుమంతరావు పాల్గొని బదిలీల జీఓలపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయుల సందేహాలు, సమస్యలపై పరిష్కారాలు తెలిపారు. కార్యాలయంలో హెల్ప్డెస్క్ను ప్రారంభించారు. హెల్ప్డెస్క్లో ఉపాధ్యాయులతో ఆన్లైన్ దరఖాస్తులు చేయించడంలో జిల్లా సాంకేతిక బృందం పనిచేస్తుందని నాయకులు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్షి రవికుమార్ మాట్లాడుతూ ప్రధాన నాయకులు జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ఉపాధ్యాయుల సమస్యలను డీఈఓ కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారన్నారు. రాష్ట్రస్థాయిలో సమస్యలపై రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళుతున్నామన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయ్యే వరకూ హెల్ప్డెస్క్ కొనసాగుతుందన్నారు. జిల్లా అధ్యక్షుడు షేక్ ముస్తఫా ఆలీ, రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, జిల్లా కోశాధికారి జీవీ రంగమోహన్, జిల్లా కార్యదర్శులు నంబూరి రాంబాబు, జి.అంజన, కె.కమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హర్షిత కళాశాల గుర్తింపు రద్దు
ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాన్ వెల్లడి కామవరపుకోట: ఏపీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నిబంధనలు–1987 అతిక్రమించిన కారణంగా కామవరపుకోట మండలం తడికలపూడిలోని హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హర్షిత జూనియర్ కళాశాల గుర్తింపును 2025–26 విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కళాశాలను సందర్శించి కళా శాల సిబ్బందికి గుర్తింపు రద్దు విషయంపై నోటీసు అందజేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కళాశాల గుర్తింపు రద్దు చేసిన విషయాన్ని తెలియజేసేలా కరపత్రాన్ని కళాశాల నోటీస్ బోర్డులో అంటించారు. కళాశాల గుర్తింపు రద్దు చేసినందున ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎవరూ చేరవద్దని, అలాగే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టీసీ తీసుకుని మరో కళాశాలలో చేరాలని ఆయన సూచించారు. -
నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి
బుట్టాయగూడెం: షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ ని యామక చట్టం చేయాలని కోరుతూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరింది. శుక్రవారం దీక్షా శిబిరాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జి.గోపిమూర్తి సందర్శించి సంఘీభావం తెలిపారు. అలాగే దీక్షా శిబిరాన్ని ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర బాబు ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉండాలన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు 4297 మంది విద్యార్థులకు 3,026 మంది హాజరయ్యారు. 22 కేంద్రాల్లో తనిఖీలు చేయగా ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఓపెన్ పరీక్షలకు.. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు 302 మందికి 259 మంది హాజరయ్యారు. ఇంటర్ గణితం పరీక్షకు 75 మందికి 62 మంది, చరిత్ర పరీక్షకు 62 మందికి 47 మంది హాజరయ్యారని డీఈఓ చెప్పారు. ఈఏపీసెట్కు 949 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో శుక్రవారం జరిగిన ఏపీఈఏపీ సెట్ పరీక్షలకు 977 మంది విద్యార్థులకు గాను 949 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 161 మందికి 161 మంది, మధ్యాహ్నం 161 మందికి గాను 152 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 148 మంది, మధ్యాహ్నం 150 మందికి గాను 143 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 177 మందికి 171 మంది, మధ్యాహ్నం 178 మందికి 174 మంది హాజరయ్యారు. కోవిడ్పై అప్రమత్తం దెందులూరు: కోవిడ్ బారిన పడకుండా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని దెందులూరు సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ సుందర్కుమార్ అ న్నారు. శుక్రవారం దెందులూరులో ఆయన మాట్లాడుతూ కోవిడ్ నివారణకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు. ప్రార్థనా, సామాజిక సమావేశాలు, పార్టీలు వంటివి వాయిదా వేసుకోవాలని, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, చలి జ్వరం, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు, శరీర నొప్పులు, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరేచనాలు ఉంటే డాక్టర్ను సంప్రదించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు తాడేపల్లిగూడెం (టీఓసీ): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం వేకువ జామున పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తాడేపల్లిగూడెం, పెంటపాడు, భీమడోలు, ద్వారకాతిరుమల, దెందులూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు మూడు దుక్కుల వర్షం కురిసిందని, ఇటీవల కాలంలో ఇంత భారీ వర్షం కురియలేదని స్థానికులు తెలిపారు. తాడేపల్లిగూడెంలో 19.8 మి.మీ, పెంటపాడులో 28.2 మి.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలి పాలకొల్లు సెంట్రల్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడుతున్నారని, జీతాలు పెంచాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడుకు పాలకొల్లు మున్సిపల్ వాటర్ సప్లయ్ వర్కర్స్ వినతిపత్రం అందజేశారు. ఔట్ సోర్సింగ్ లో పదేళ్లుగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలన్నా రు. నాన్ పీహెచ్ (వాటర్ సప్లయ్ వర్కర్స్)కు వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని కోరారు. -
జ్యూయలరీ షాపుల్లో తనిఖీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): రీజినల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి వి.శ్రీరాంబాబు ఆదేశాల మేరకు శుక్రవారం విజిలెన్స్, జీఎస్టీ, తూనికలు–కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా బంగారం, వెండి దుకాణాల్లో తనిఖీలు చేశారు. నగరంలోని సరస్వతి సిల్వర్ ప్యాలెస్, శుభం జ్యూయలరీ షాపుల్లో తనిఖీ చేయగా.. సరస్వతి సిల్వర్ ప్యాలెస్లో 160 గ్రాముల బంగారం, 5,400 గ్రాముల వెండి స్టాక్ రిజిస్టర్ కన్నా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించి జీఎస్టీ అధికారులు రూ.1,15,468 అపరాధ రుసుం విధించారు. అలాగే సరస్వతి సిల్వర్ ప్యాలెస్లో ఎటువంటి ధ్రువీకరణ లేని రెండు ఎలక్ట్రానిక్ కాటాలు గు ర్తించి తూనికలు కొలతల శాఖ అధికారులు కేసు న మోదు చేశారు. విజిలెన్స్ సీఐ పి.శివరామకృష్ణ, ఎస్సై కె.సీతారాము, తహసీల్దార్ బి.కన్యాకుమారి, తూనికలు, కొలతల శాఖ అధికారి ఈశ్వరరామ్, జీఎస్టీ అధికారి వినోదరావు పాల్గొన్నారు. -
1 నుంచి డిపోల వద్దే రేషన్
ఏలూరు(మెట్రో): జిల్లాలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణతోపాటు ఏడు రకాల సేవలను పారదర్శకంగా పునః ప్రారంభించినట్టు జిల్లా పౌర సరఫరాల అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.శివరామ్మూర్తి తెలిపారు. శుక్రవారం ఏలూరులో సివిల్ సప్లయీస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల సేవలు ప్రారంభించామని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. రైస్ కార్డు సేవలపై సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ నం. 1800 425 6453లో సంప్రదించాలని కోరారు. ఎండీయూ వాహనాలను రద్దు చేసి జూన్ 1 నుంచి చౌకధరల దుకాణాల వద్దే రేషన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అలాగే జిల్లాలో ధాన్యం కొనుగోలు పారదర్శకంగా నిర్వహించా మని శివరామ్మూర్తి తెలిపారు. రబీలో 20,416 మంది రైతుల నుంచి రూ.579 కోట్ల విలువైన 2.51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.502 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. -
అనధికార మద్యం విక్రయాలపై చర్యలు
ఏలూరు టౌన్: జిల్లాలోని మద్యం దుకాణాల్లో నిర్దేశిత సమయాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత హెచ్చరించారు. ఏలూరులోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో 144 మద్యం దుకాణాల యజమానులు నిబంధనల మేరకు సమయాన్ని పాటించాలన్నారు. షెడ్యూల్ బిజినెస్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే మద్యం షాపులు తెరిచి ఉంచాలని, అప్పుడు మాత్రమే మద్యం విక్రయాలు చేయాలని చెప్పారు. ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రాత్రి 10 గంటల అనంతరం మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. దుకాణాలు మూసివేసి పక్కనే బడ్డీ కొట్లు, ఇతర ప్రాంతాల వద్ద అనధికార మద్యం విక్రయాలు చేస్తే సంబంధిత షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజూ రాత్రి వేళల్లో తనిఖీలు, నిఘా ఉంచాలని అధికారులకు డీసీ శ్రీలత సూచించారు. -
ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటం
భీమడోలు: కూటమి ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటమాడుతుందని, ఎండీయూ వాహనాలకు కాలపరిమితి ఉన్నా ఇంటింటికీ రేషన్ అందించే వ్యవస్థను రద్దు చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండీఎం ఆపరేటర్ల యూనియన్ పిలుపు మేరకు గురువారం భీమడోలు మండల ఎండీయు ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యులంతా భీమడోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల ప్రతినిధులు పాము రాజు, చేబత్తిన అనిల్కుమార్ మాట్లాడుతూ 2027 జనవరి వరకు అగ్రిమెంట్లు ఉన్నప్పటికి రద్దు చేసి ప్రభుత్వం కక్ష సాఽధింపు చర్యలకు పూనుకుందన్నారు. 2021లో కరోనా వంటి ఉపద్రవంలో మా జీవితాలను పక్కన పెట్టి ఫ్రంట్లైన్ వారియర్స్గా విధులను నిర్వహించి ప్రజలకు రేషన్ అందించి దేశ స్థాయిలో గుర్తింపు పొందామన్నారు. ఎండీయు వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. కొయ్యలగూడెంలో.. ఎండీయు వాహనాల వ్యవస్థ అమలుకు కుదుర్చుకున్న అగ్రిమెంటును ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని ఎండీయూ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమని పక్కన పెట్టడంతో 19 వేల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. కరోనా సమయంలో సమర్ధవంతంగా విధులు నిర్వహించామని ఇంటింటికి తిరుగుతూ వికలాంగులకు వృద్ధులకు రేషన్ సరఫరా చేశామని అన్నారు. ఎండీయు వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఇప్పుడు రద్దు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఎండీయు వాహనాలను రద్దు చేయాల్సి వస్తే వాటిపై ఉన్న రుణాలను ప్రభుత్వమే భరించాలని, వాహనాలను నిర్వాహకులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కె.చెలన్నదొరకు వినతిపత్రం సమర్పించారు. తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద తణుకు అర్బన్: ఎండీయూ వాహనాల ఆపరేటర్లు తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకోవాలని, ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎండీయూ వాహనాల సంఘ నాయకుడు జగన్ మాట్లాడుతూ రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా 20 వేల కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. గత ఐదేళ్లకు పైగా ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి గుమ్మంలోకే రేషన్ సరుకులను అందించి ఎండీయూ వ్యవస్థ ప్రజల మన్ననలు పొందిందని చెప్పారు. కోవిడ్ సమయంలో సైతం ప్రాణాలకు తెగించి సరుకుల పంపిణీ చేశామని, విజయవాడ వరదల్లో సైతం ఏ వ్యవస్థ వెళ్లలేని ప్రాంతానికి వెళ్లి బాధితులకు ఆహార పదార్థాలు, ఇతర సామగ్రిని అందజేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఆలోచించి పునరుద్ధరించాలని కోరారు. -
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో సింగిల్ విండో కింద పరిశ్రమల స్థాపనకు, ఇతర ప్రోత్సాహకాల మంజూరు విషయంలో ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ ప్రాధాన్యతను అనుసరించి పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. సింగిల్ విండో కింద అందిన 84 దరఖాస్తుల్లో ఇప్పటికే 51 దరఖాస్తులు ఆమోదం పొందగా మిగిలిన 33 దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రపంచ ఫ్రీ–ఎక్లంప్సియా దినోత్సవం సందర్బంగా ఫ్రీ–ఎక్లంప్సియా వ్యాధిపై అవగాహన కలిగించే పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఫ్రీ–ఎక్లంప్సియా తల్లి, శిశువు ఇద్దరికి ప్రమాదకరమని.. ఈ వ్యాధిపై అవగాహన కల్పించడంతోపాటు వ్యాధిని నివారించడానికి అవసరమైన చర్యలను తీసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. యోగాంధ్రలో భాగస్వాముల్ని చేయాలి యోగాంధ్రలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గురువారం యోగాంధ్ర కార్యక్రమంపై జిల్లా, మండల స్థయి అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 21 వరకు యోగా ప్రాముఖ్యతను ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. జిల్లాలో మాత, శిశు మరణాలు సంభవించకుండా కృషిచేయాలని, గత మరణాలను సమగ్రంగా విళ్లేషించి పూర్తిస్థాయిలో మరణాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. -
సొసైటీలు ఆడిట్ చేయించుకోవాలి
తణుకు అర్బన్: కో–ఆపరేటివ్ సొసైటీలు ఐటీ చట్టం నిబంధనల ప్రకారం అకౌంట్స్ను సరైన సమయానికి ఆడిట్ చేయించుకోవాలని, క్రమం తప్పకుండా ఐటీ రిటన్లు దాఖలు చేయాలని ఇన్కమ్ ట్యాక్స్ రాజమండ్రి రేంజ్ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ భుక్యా అన్నారు. తణుకు రోటరీ క్లబ్లో గురువారం సొసైటీల సభ్యులకు అకౌంట్స్ ఆడిట్ తదితర విషయాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిర్ణీత సమయానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయడం వలన ఐటీ చట్టం 1961 ప్రకారం సెక్షన్ 80పి డిడక్షన్ పొందవచ్చని స్పష్టం చేశారు. అనంతరం సీఏ కారుమూరి ధనసాయి ఆదాయపు పన్ను చట్టంలో నూతన నిబంధనలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను అధికారి సీపీకే దొర, జిల్లా ఆడిట్ అధికారి మానేపల్లి సాయిబాబా, డీసీవో శ్రీనివాస్, డీసీఏవో అంబేడ్కర్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు, సొసైటీల సభ్యులు పాల్గొన్నారు. -
ఏలూరు రైల్వేస్టేషన్లో మొబిలైజేషన్ డ్రిల్
ఏలూరు (టూటౌన్): ఏలూరు రైల్వేస్టేషన్లో గురువారం సాయంత్రం రైల్వే ఎస్పీ పి.సైమన్, ఏలూరు ఆర్పీఎఫ్ సీఐ, ఎస్సై ఇతర సిబ్బందితో మొబిలైజేషన్ డ్రిల్ నిర్వహించారు. బెదిరింపులు, ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు వంటి అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తత, ప్రతిస్పందనను తనిఖీ చేయడం ఈ డ్రిల్ లక్ష్యం అని వివరించారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రస్తుత భద్రతా పరిస్థితులపై కూడా సిబ్బందికి వివరించారు. ఆంజనేయస్వామికి లక్ష తమలపాకుల పూజ జంగారెడ్డిగూడెం: హనుమద్ జయంతిని పురస్కరించుకుని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో గురువారం ఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి లక్ష తమలపాకులతో ప్రత్యేక పూజ జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం విశేష పూజల అనంతరం శ్రీ సువర్చలా హనుమద్ కల్యాణం, సాయంత్రం గుర్వాయిగూడెం, చక్రదేవరపల్లి గ్రామాల్లో స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ చందన తెలిపారు. నిందితుడికి రిమాండ్ భీమవరం: భీమవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయలంలో కర్రి మాణిక్యం (79) అనే వృద్ధురాలిని కొట్టడంతో మృతి చెందిన కేసులో నిందితుడైన మృతురాలి మనవడు తోట మధును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండు విధించి తణుకు ఉప కారాగారానికి పంపించారని సీఐ జి.కాళీచరణ్ తెలిపారు. -
బ్లడ్బ్యాంక్ సౌకర్యం అందని ద్రాక్షేనా!?
నూజివీడు: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడులోని 100 పడకల ఏరియా ఆసుపత్రిలో బ్లడ్బ్యాంకు సదుపాయం అందని ద్రాక్షగా తయారైంది. శస్త్రచికిత్సలు, కాన్పులు, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు చికిత్స చేసే సమయంలో రక్తం అవసరం ఎంతో ఉంటుంది. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో ప్రథమ చికిత్స చేసి విజయవాడకు తరలించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయమనే డిమాండ్ గత రెండు దశాబ్దాల కాలంగా ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. గుడివాడ, విజయవాడ నుంచి తెస్తున్నారు నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, విస్సన్ననపేట, రెడ్డిగూడెం, మైలవరం, బాపులపాడు తదితర మండలాల నుంచి నూజివీడు ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజూ 450 మంది వరకు రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. ప్రతినెలా కాన్పులతో పాటు జనరల్ సర్జన్స్, ఆర్ధోతో పాటు ఇతర శస్త్రచికిత్సలు 320 వరకు జరుగుతాయి. కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలైన క్షతగాత్రులకు ఎక్కించేందుకు రక్తం అందుబాటులో లేకపోవడంతో విజయవాడకు రిఫర్ చేయాల్సి వస్తోంది. అలా కాకుంటే విజయవాడ, గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్బ్యాంకు నుంచి రక్తాన్ని తెప్పించి ఆ తరువాత ఆపరేషన్లు చేస్తున్నారు. బ్లడ్బ్యాంకు వస్తే ఎన్నో లాభాలు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్బ్యాంకు ఏర్పాటు చేసినట్లయితే ఎన్నో లాభాలు చేకూరతాయి. కాన్పులకు సంబంధించిన శస్త్రచికిత్సలు గాని, జనరల్ శస్త్రచికిత్సలు గాని, ప్రమాదాల్లో తీవ్ర గాయాలైన వారికి సంబంధించిన చికిత్సను గాని ఇక్కడ నిర్వహించడానికి వీలుంటుంది. అంతేగాకుండా రక్తదాతల నుంచి రక్తాని ఇక్కడే స్వీకరించవచ్చు. అలాగే పట్టణంలో, చుట్టుపక్కల గ్రామాల్లో, కళాశాలల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించి రక్తాన్ని అందుబాటులో ఉంచుకోవచ్చు. పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అవసరమైన రక్తాన్ని ఇవ్వడానికి సైతం వీలుంటుంది. బ్లడ్బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలు సైతం ఇక్కడ సిద్ధంగా ఉన్నప్పటికీ బ్లడ్బ్యాంక్ను మాత్రం ఏర్పాటు చేయడం లేదు. నూజివీడు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజీ సెంటర్కే పరిమితం రక్తం కావాలంటే విజయవాడ, గుడివాడలకు పరిగెత్తాల్సిందే ప్రతిపాదనలు పంపాం బ్లడ్బ్యాంకు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అధికారులు తనిఖీలు పూర్తి చేసిన అనంతరం బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజీ సెంటర్ మాత్రమే ఉంది. రక్తం కావాలంటే గుడివాడ ఏరియా ఆసుపత్రి బ్లడ్బ్యాంకు నుంచి, విజయవాడలోని రెడ్క్రాస్కు చెందిన బ్లడ్బ్యాంకు నుంచి తీసుకొస్తున్నాం. – డా.ఆర్ నరేంద్రసింగ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
భూముల కబ్జా యత్నంపై మహిళల నిరసన
భయాందోళనలో వైద్య సిబ్బంది తణుకు ప్రభుత్వ ఆస్పత్రిలో రాత్రి వేళల్లో రోగులు, క్షతగాత్రుల కోసం వచ్చేవారు గొడవలు చేయడంపై వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. 10లో uకొయ్యలగూడెం: పరింపూడి పంచాయతీ సర్వే నంబర్ 311/2 లో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ ఆ ప్రాంత మహిళలు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సుమారు 40 ఏళ్ల నుంచి ఉంటున్న వందలాది కుటుంబాలకు చెందిన వారి స్థలాలను కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వారి నుంచి రక్షణ కల్పించడంతోపాటు ఇప్పటికే ఉంటున్న వారికి స్థలాలను కొనుగోలు చేసిన వ్యక్తులకు ఆ సర్వే నంబర్ లోని భూములను కేటాయిస్తూ న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కె.చెల్లన్నదొరకు వినతి పత్రం సమర్పించారు. -
పశువుల్లో గురక వ్యాధి నివారణ ఇలా..
చింతలపూడి: వర్షాకాలంలో గేదెలు, గేదె దూడలు, గొర్రెలు, మేకల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి గురక వ్యాధి. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైనది. గురకవ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్సను గురించి పశుసంవర్థక శాఖ ఏడీ డా జె. లింగయ్య వివరించారు. ఎలా సంక్రమిస్తుంది పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియ వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ఎడతెరపి లేని ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకు ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూడా దోహదపడతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థ, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను ధ్వంసం చేసి రక్తం ప్రాణవాయువు ప్రక్రియను దెబ్బ తీస్తుంది. దీంతో ప్రాణ వాయువు సరిగా అందక పశువులు గురక పెట్టడం, రొప్పడం, ఆయాశపడటం వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 ఫారిన్ హీట్ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత నెమరు నిలిచి పోవడం, మెడ గొంతు వాయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటలకు వ్యాధి లక్షణాలు కనిపించి, సకాలంలో సరియైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణిస్తుంది. గురక వ్యాధికి చికిత్స వ్యాధిని గుర్తించిన మరుక్షణం రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిల్లిన్, క్లోక్సా సిలిన్, జెంటా మైసిన్, సెఫలాక్సిన్ వంటి యాంటి బయోటిక్ మందుల్ని సరియైన మోతాదులో అవసరాన్ని బట్టి రక్తంలోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్ ఇంజక్షన్లు, బి–కాంప్లెక్స్ ఇంజక్షన్లు బాగా నీరసించిన పశువుౖకైతే డెక్ట్స్రోజ్ సైలెన్లు అవసరం కూడా ఉంటుంది. నివారణ ఇలా.. గురకవ్యాధి సోకిన పశువులకు రోగ క్రిములను కలిగిన కలుషిత మేత, నీరు, కళేబరాలను దూరంగా తరలించాలి. కళేబరాలను లోతుగా పూడ్చి వేయడం మంచిది. పరిసరాల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డీడీటీ, గమాక్సిన్, సైపర్ మెధ్రిన్, కార్పొరిల్ వంటి క్రిమి సంహారకాలతో క్రిమి రహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన పశువులను కనీసం వారం రోజులన్నా వేరుగా ఉంచి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాక మిగిలిన పశువులతో కలవనివ్వాలి. గురకవ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తుంది. ప్రస్తుతం గురకవ్యాధి, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పశువైద్యుల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందు వేయిస్తే మంచిది. పాడి–పంట -
ఏజెన్సీలో భద్రత కట్టుదిట్టం
కుక్కునూరు: చత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు, కీలక నేత నంబాల కేశవరావు మృతి చెందడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏజెన్సీలో కుక్కునూరు పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. గురువారం కుక్కునూరు మండల కేంద్రంలోని బ్యాంకుల్లో బాండ్ స్క్వాడ్ డిటెక్టర్లతో, పోలీస్ డాగ్లతో తనిఖీ చేశారు. కుక్కునూరు, బూర్గంపాడు ఆర్ అండ్ బీ రహదారిపై వచ్చిపోయే వాహనాలను పోలీస్ సిబ్బంది తనిఖీ చేశారు. కుక్కునూరు మండలం అటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉండడం, గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పోలవరంలో తనిఖీలు పోలవరం రూరల్: పోలవరం మండలంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. చత్తీస్గఢ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్లు పోలవరం ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. -
ఈఏపీ సెట్కు 941 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో భాగంగా ఇంజినీరింగ్ ప్రవేశాలకు గురువారం మూడు పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 976 మంది విద్యార్థులకు గాను 941 మంది హాజరయ్యారు. ఉదయం సిద్ధార్థ క్వెస్ట్ పరీక్షా కేంద్రంలో 160 మందికి 153 మంది, మధ్యాహ్నం 161 మందికి 152 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 148 మంది, మధ్యాహ్నం 150 మందికి 143 మంది హాజరు కాగా, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 177 మందికి 171 మంది, మధ్యాహ్నం 178 మందికి 174 మంది హాజరయ్యారు. మెడికల్ సర్టిఫికెట్లకు మరో అవకాశం ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, రాజమండ్రి జిల్లాల పరిధిలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ యాజమాన్యాల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు మెడికల్ సర్టిఫికెట్లు పొందడానికి మరో అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖా ధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న ఉదయం 9 గంటలకు ఏలూరులోని జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో నిర్వహించే ప్రత్యేక మెడికల్ క్యాంపునకు తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుందన్నారు. గతంలో ఏప్రిల్ 24 నుంచి 26 వరకు నిర్వహించిన మెడికల్ క్యాంపులో అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయిన ఉపాధ్యాయులకు మరో అవకాశం కల్పించినట్టు స్పష్టం చేశారు. అర్హులైన వైద్యులనే సంపద్రించాలి పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వ ఆదేశాల మేరకు గర్భిణులు అర్హులైన వైద్యులనే సంప్రదించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జి.గీతాబాయి అన్నారు. గురువారం లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎంపీలు గర్భిణులకు ఆల్ట్రా సౌండ్ స్కౌనింగ్లు రిఫర్ చేయకూడదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందడం వల్ల మాతృ మరణాలు, శిశు మరణాలు నియంత్రించవచ్చన్నారు. 9 నెలల గర్భిణీ సమయంలో కనీసం రెండు సార్లు స్కానింగ్ తప్పనిసరని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ జనరల్ హాస్పటల్ తణుకులో ఉచితంగా అల్ట్రా స్కానింగ్ చేస్తారన్నారు. ‘పది’ పరీక్షలకు 3,483 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): పది సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం గణితం పరీక్షకు 4,799 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,483 మంది హాజరయ్యారు. 1,316 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. దూరవిద్యావిధానంలో నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఇంటర్ భౌతిక శాస్త్రం పరీక్షకు 142 మందికి 122 మంది హాజరు కాగా, రాజనీతి శాస్త్రం పరీక్షకు 133 మందికి 110 హాజరయ్యారు. పదో తరగతి గణితం పరీక్షకు 364 మంది విద్యార్థులకు 308 హాజరు కాగా 56 మంది గైర్హాజరయ్యారు. 76 శాతం హాజరు భీమవరం: పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షాలో భాగంగా గురువారం నిర్వహించిన గణితం పరీక్షకు 76.87 శాతం విద్యార్థులు హాజరయ్యా రని డీఈవో ఇ.నారాయణ చెప్పారు. 3,856 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావల్సివుండగా 2,964 మంది హాజరయ్యారన్నారు. ఎస్ఎస్సీ(ఏపీఓఎస్ఎస్) పబ్లిక్ పరీక్షకు 378 మందికి 294 మంది విద్యా ర్థులు హాజరుకాగా ఇంటర్మీడియట్(ఏపీఓఎస్ఎస్) పరీక్షకు 620 మందికి 528 విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. పెనుమంట్ర పోలీస్ స్టేషన్ కార్యాలయం ప్రారంభం పెనుమంట్ర: పెనుమంట్ర మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రీ మోడల్ చేసిన పోలీస్స్టేషన్ భవనాన్ని గురువారం మధ్యాహ్నం ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రారంభించారు. ఇంతవరకు పోలీస్ స్టేషన్ నిర్వహించిన విద్యా శాఖ భవనం శిధిలావస్థకు చేరడంతో మండల పరిషత్కు చెందిన పాత భవనాన్ని రీమోడల్ చేసి పోలీస్ స్టేషన్కు ఇచ్చారు. ఈ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, నర్సాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, పెనుగొండ సీఐ ఆర్.విజయ్కుమార్, పెనుమంట్ర, పెనుగొండ, ఆచంట ఎస్సైలు కె.స్వామి, గంగాధర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
భయాందోళనలో ఆస్పత్రి వర్గాలు
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని వైద్యవర్గాలు విధి నిర్వహణ చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విధులంటే హడలెత్తిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసర విభాగానికి రాత్రి వేళల్లో రోగులు, క్షతగాత్రుల కోసం వచ్చేవారు అలజడి సృష్టిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ రాత్రి చిన్నపాటి గాయంతో ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చిన పాతవూరుకు చెందిన ఇద్దరు సోదరులు వైద్యవర్గాలను అసభ్యపదజాలంతో విరుచుకుపడడమే కాకుండా దాడికి సైతం ప్రయత్నించి భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ సత్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల ఇటువంటి చిన్నాపెద్దా ఘటనలు చోటుచేసుకుంటుండగా పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను వేడుకున్నా పట్టించుకోవడంలేదని వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నారు. 100 గ్రామాలకు పెద్దాసుపత్రి తణుకు నియోజకవర్గానికి సంబంధించి సుమారు 10 కిలోమీటర్లుపైగా జాతీయ రహదారి ఉండడంతో ఇటు అలంపురం నుంచి సిద్ధాంతం పైవరకు జరిగే రోడ్డు ప్రమాదాలన్నీ తణుకు ఆస్పత్రికే తరలిస్తుంటారు. అంతేకాకుండా చుట్టుపక్కల 100 గ్రామాలకు పెద్దాసుపత్రిగా సేవలందిస్తుండడంతో అధికశాతం ఈ ఆస్పత్రికి వైద్యసేవల కోసం వస్తుంటారు. నిత్యం 150 పడకలు నిండి ఉండగా, 600పైగా ఓపీ సంఖ్య ఇక్కడ నమోదవుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఈ ఆస్పత్రికి ఉండడంతో పగలు, రాత్రి కూడా రోగులు, సహాయకులతో రద్దీగానే ఉంటుంది. అటువంటి ఆస్పత్రిలో వైద్యవర్గాలకు రక్షణ కల్పించకపోగా పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటుచేయమంటే ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా అత్యవసర విభాగం జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి ప్రతిరోజూ రాత్రి సమయంలో వివిధ కారణాలతో వైద్యంకోసం వస్తుంటారు. ముఖ్యంగా ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, కొట్లాటల్లో గాయపడిన వారు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆ సమయంలో వారితోపాటు సహాయకులు, బంధువులు మద్యం మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారని సిబ్బంది వాపోతున్నారు. రాత్రి సమయంలో అత్యవసర విభాగంలో ఉండే ఒక వైద్యుడితోపాటు సిబ్బంది, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉంటారు. అయితే వారికి నచ్చినట్లుగా వైద్యం చేయకపోయినా, లోపలకు అనుమతించకపోయినా దాడులకు దిగే పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులతోపాటు పదుల సంఖ్యలో లోపలకు రావడం వలన వైద్యసేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందరూ లోపలకు రావద్దంటున్న సిబ్బందిపై మందుబాబులు బీభత్సం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో మహిళా వైద్యులు విధుల్లో ఉండాలంటనే భయంతో వణికిపోతున్నారని వైద్యవర్గాలు చెబుతున్నారు. ముఖ్యంగా ఏరులై పారుతున్న మద్యానికి బానిసలైన మందుబాబులు ఆస్పత్రికి వస్తే చాలు వైద్యవర్గాల గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి ఇక్కడ నెలకొంది. అత్యవసర విభాగమా అమ్మ బాబోయ్.. రాత్రి వేళల్లో మందుబాబుల వీరంగంతో హడల్ నైట్ డ్యూటీ అంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ -
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ను 22 శాతానికి పెంచాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ) : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ను 22 శాతానికి పెంచాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 60 లక్షల మంది మాలలు ఉన్నారని తెలిపారు. మాలలకు 7.5 శాతం రిజర్వేషన్ సరికాదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. హైకోర్టులో మాల సంఘాలు పిల్ వేయడం, కోర్టు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని తీర్పు రావడం ఖాయమన్నారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మాల సంఘాల జేఏసీ నాయకులు గంటా సుందర్ కుమార్, కేసీ రాజు, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. అద్యశ్యమైన యువకుడి హత్య..? భీమవరం: భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని ఓ యువకుడు హత్యకు గురైనట్లు తెలిసింది. ఈనెల 4వ తేదీన కనిపించకుండా పోయిన యువకుడిని పట్టణానికి చెందిన ఒక కుటుంబం హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ ప్రాంతంలో విడిచినట్లు సమాచారం. యువకుడి కుటుంబ సభ్యులకు ఆకాశరామన్న ఉత్తరం ద్వారా హత్య జరిగినట్లు తెలియడంతో యువకుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా యువకుడిని హత్య చేసినట్లు ఆ కుటుంబం అంగీకరించినట్లు తెలిసింది. దీనితో జొన్నాడ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు గోనె సంచిలో ఉన్న మృత దేహాన్ని గుర్తించి హత్యకు కారణమైన వ్యక్తులను విచారిస్తున్నట్లు సమాచారం. కన్నాయగూడెంలో చోరీ కొయ్యలగూడెం : మండలంలోని పొంగుటూరు పంచాయతీ పరిధిలోని కన్నాయగూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. బాధితురాలు గద్దే రాణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గద్దే రాణికి చెందిన పాత పెంకుటిల్లును రేకుల షెడ్డుగా మారుస్తున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న పూరి గుడిసెలో సామాన్లు పెట్టుకుని కుటుంబసభ్యులతో అక్కడే నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెలకువ వచ్చి చూసినప్పుడు, పెట్టెను కోసి ఉండటాన్ని గుర్తించింది. వెంటనే పెట్టెను పరిశీలించగా, ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన రూ.5 లక్షల నగదు, 9 కాసుల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, చోరీపై ఆధారాలు సేకరిస్తున్నారు. -
ఆదివాసీ గిరిజనులపై అమానుషం
భీమవరం: ఆదివాసీ గిరిజనులను కగార్ పేరుతో ఊచకోత కోస్తున్నారని నక్సలైట్లు పేరుతో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం సీపీఐ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ జిల్లా సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే వంకతో నక్సలైట్లను నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపడం దుర్మార్గమన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇచ్చిన అర్జీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదిన తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ముప్పాళ్ళ చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ సీపీఐ జిల్లా మహాసభలు ఆగస్టు 6, 7 తేదీల్లో ఉండిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముందుగా పహల్గాం ఘటనలో మృతులకు, ఇటీవల మృతి చెందిన సీపీఐ నాయకులు జక్కంశెట్టి నాగేశ్వరరావు, మొల్లేటి చినవెంకటరెడ్డి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పాల్గొన్నారు. రొయ్యల పట్టుబడికి వెళ్లనివ్వడం లేదు సాక్షి టాస్క్ఫోర్స్: తన రొయ్యల చెరువులో రొయ్యల పట్టుబడికి వెళ్లనీయకుండా టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో వారితో ఏర్పడిన ఘర్షణలో స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యాడు పెదపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన ఘంటసాల సుబ్బారావు. దీంతో అతడిని ఏలూరులోని ఆయుష్ ఆసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులమనే నెపంతోనే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సుబ్బారావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షల నేపథ్యంలో చెరువుల్లో చేపలు, రొయ్యలు పట్టనీయకుండా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సుబ్బారావుకు చెందిన చెరువుల్లో చేపలను పట్టనీయలేదు. దీనిపై అధికారులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు చెరువులో చేపలు పట్టుకున్నారు. మరలా రొయ్యలను పట్టుకోనివ్వకుండా అడ్డుకోవడంతో సుబ్బారావు ఆందోళనకు లోనై ఆస్పత్రిపాలయ్యాడని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విరమించుకోవాలి భీమవరం: రేషన్షాపుల నుంచి మొబైల్ డిస్సెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ) ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేసే వ్యవస్థను రద్దు చేయకుండా మరింత మెరుగుపర్చి ఇంటింటికీ రేషన్ సరుకులు సరఫరా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేవీ గోపాలన్ డిమాండ్ చేశారు. గురువారం భీమవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి వద్ద బియ్యం అందించడంతోపాటు వాహనాల వద్ద రేషన్న్ తీసుకోలేకపోయనవారికి రేషన్న్ డిపో వద్ద సరుకులు తీసుకునేట్లుగా ఏర్పాటు చేయాలన్నారు. -
రెండో మత్స్యకార సంఘం వద్దు
టి.నరసాపురం: బొర్రంపాలెంలో రెండో మత్స్యకార సంఘాన్ని ఏర్పాటు చేయవద్దు అంటూ అమలులో ఉన్న మత్స్యకార సహకార సంఘ నాయకులు బత్తుల రమేష్, గుండె చిన్న చిట్టయ్య పలువురు సభ్యులు బుధవారం ఉన్నతాధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్, నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా బొర్రంపాలెంలో ఒకే మత్స్యకార సంఘం ఉందన్నారు. ఆ సంఘంలో 300 మంది సభ్యులు ఉండి కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలవ జలాశయంలో బొర్రంపాలెం రేవులో చేపల వేటకు వెళ్లి జీవనోపాధి సాగిస్తున్నామన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మరో మత్స్యకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక మత్స్యకార సంఘం అమలులో ఉండగా మరో సంఘం ఏర్పాటు చట్ట ప్రకారం తప్పని వివరించారు. కొత్త సంఘం ఏర్పాటును వ్యతిరేకిస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, మత్స్య శాఖ జెడీ, పంచాయతీరాజ్ కమిషనర్లకు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులను సమర్పించామని వివరించారు. -
హడలెత్తిన భీమడోలు
భీమడోలు: మంగళవార అర్ధరాత్రి భీమడోలు హడలిపోయింది. క్షతగాత్రులు, ప్రయాణికుల ఆర్తనాదాలతో, అంబులెన్స్లు, పోలీసుల సైరన్లతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. వరుస ప్రమాదాలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆగి ఉన్న వ్యాన్ను మరో వ్యాన్ ఢీకొనడంతో తణుకుకు చెందిన కోడూరి వెంకట రామచరణ్ (17) అనే యుడకుడు అక్కడికక్కడే మృతి చెందగా గుంటూరు జిల్లా తిమ్మలపాలెంకు చెందిన వ్యాన్ డ్రైవర్ మామిడి జయరామ్, భార్య మామిడి ప్రశాంతి క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ఎస్సై వై.సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్లో ఇరుక్కున దంపతులను బయటకు తీసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఢీకొన్న మూడు ప్రైవేట్ బస్సులు అదే సమయంలో వస్తున్న ట్రావెల్ బస్సు ట్రాఫిక్ కోన్లను గుర్తించకుండా సడన్ బ్రేక్ కొట్టి ఢీకొంది. దాని వెనుక మరో రెండు బస్సులు రాగా మొత్తం మూడు బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. మధ్యలో ఉన్న బస్సు డ్రైవర్తో పాటు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యలో ఇరుక్కున్న బస్సు ముందు, వెనుక భాగాలు నుజ్జయ్యాయి. మూడో బస్సుల్లోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు పెదపట్నం బాపన్న, అదే జిల్లాలోని ద్రాక్షారామలోని వనుం రామారావు, రావులపాలెంలోని లక్ష్మీపురంనకు చెందిన కొట్టింగ నాగరాజు, కొట్టింగ మీరమ్మలకు గాయాయ్యాయి. మరో బస్సులో అమలాపురంలోని నడిపూడి విత్తనాల నాగరాజు, హైదరాబాద్కు చెందిన కేసినకుర్తి చంటిబాబు, విత్తనాల పవన్కుమార్, పీసకాయల మోగవల్లిక, శ్రీపూర్ణ దీప్తి గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్లో భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో భార్యాభర్తలు కొట్టింగ నాగరాజు, కొట్టింగ మీరమ్మలు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి వరుస ప్రమాదాలు యువకుడి మృతి, పది మందికి తీవ్ర గాయాలు అన్నకు బై చెబుదామని వచ్చి.. తణుకుకు చెందిన కోడూరి దుర్గాలోకేష్, వెంకట రామచరణ్ (17) అన్నదమ్ములు. వీరు అమ్మమ్మ ఊరైన పోలసానిపల్లి వచ్చారు. తండ్రి లేకపోవడంతో దుర్గాలోకేష్ చేపల ప్యాకింగ్ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వెంకట రామచరణ్ ఇంటర్ చదువుతున్నాడు. లోకేష్ గుంటూరు జిల్లా వినుకొండలోని చేపల ప్యాకింగ్కు రాత్రి బయలుదేరాడు. అన్నను భీమడోలు రైల్వేగేటు వద్ద డీసీఎం వాహనం ఎక్కించి రామచరణ్ బై చెబుతుండగా వెనుక నుంచి అశోక్ లేలాండ్ వ్యాన్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామచరణ్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. తన కళ్లముందే తమ్ముడు మృతి చెందడంతో దుర్గాలోకేష్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: స్థానిక లింగయ్య చెరువు వద్ద పడిపోయిన గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాలు ప్రకారం. లింగయ్య చెరువు వద్ద సుమారు 50 సంవత్సరాల వయస్సుగల వ్యక్తి మంగళవారం ఉదయం పడిపోయాడు. వెంటనే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని స్థానిక పీహెచ్సీకి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సెల్ నెంబర్ 94407 96653కు సమాచారం అందించాలని ఆయన కోరారు. చికిత్స పొందుతూ జట్టు కూలీ మృతి భీమడోలు: గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద తవుడు లారీ బోల్తా ఘటనలో జట్టు కూలీ గొర్జి శ్రీనివాసరావు(52) బుధవారం మృతి చెందాడు. ఈనెల 20వ తేదీ సాయంత్రం రత్నాపురంలోని ఆక్వా చెరువుల వద్దకు తవుడు బస్తాలను దిగుమతి చేసేందుకు ఏడుగురు జట్టు కూలీలు లారీ ఎక్కారు. గుండుగొలను నుంచి రత్నాపురం వెళ్తుండగా మార్గమధ్యమైన గుండుగొలను బీసీ కాలనీ వద్ద లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. వారిలో తీవ్ర గాయాలైన గొర్జి శ్రీను ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి దెందులూరు: విద్యుత్ షాక్తో ఒక వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఎలా ఉన్నాయి. బుధవారం ఏలూరు రూరల్ మండలం లింగారావు గూడెం చెరువు వద్ద పనికి వచ్చిన పెరుమాళ్ళ తాతారావు (50) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఈ ప్రమాదంలో చెరువు యజమాని మార్త శివకుమార్ కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. మనవడి దాడి.. అమ్మమ్మ మృతి భీమవరం: మనవడు కొట్టడంతో అమ్మమ్మ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఇది. భీమవరం టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్రి మాణిక్యం (79) అనే వృద్ధురాలు రాయలం ప్రాంతానికి చెందిన భూదేవి తోటలో తన కుమార్తె ఇంట్లో ఉంటుంది. కాగా ఆమె కుమార్తెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద మనవడికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి ఇంటి ఆవరణలోని పూల మొక్కలు లాగేస్తుండగా మృతురాలు ఆగ్రహం వ్యక్తం చేసి తిట్టింది. అమ్మమ్మ తీరుపై ఆమె రెండో మనవడు తోట మధు ప్రశ్నించగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశానికి గురైన మధు కొట్టడంతో అమ్మమ్మ మాణిక్యం కింద పడి మృతి చెందింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. తాతారావు మృతదేహం వద్ద రోదిస్తున్నబంధువులు -
ఐరన్, సిమెంట్ బస్తాల చోరీ వాస్తవమే
దెందులూరు: జిల్లాలో పేదల గృహ నిర్మాణ కాలనీల్లో ఇళ్ల నిర్మాణ సామగ్రి దొంగతనాలు, దుర్విని యోగం జరిగాయని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.సత్యనారాయణ చెప్పారు. బుధవారం ఏలూరులో తన కార్యాలయంలో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై స్పందిచారు. దెందులూరు గృహ నిర్మాణ శాఖ గొడౌన్ నుంచి స్టీల్ దొంగతనం జరిగిందని, నూజివీడు గోడౌన్లో డోర్స్, కిటికీలు, స్టీల్, ఎలక్ట్రికల్ సామాన్లు చోరీకి గురయ్యాయాన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసు ఫిర్యాదు చేశామన్నారు. గత సంవత్సరం ఆడిట్లో పెదవేగి, అగిరిపల్లి మండలాల్లో ఇళ్లనిర్మాణ సామాగ్రి దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామన్నారు. -
కడుపు కొట్టిన సర్కారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సర్కారు బడుగుల ఉపాధికి గండికొడుతుంది. వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడటంతో ప్రారంభమైన సర్కారు కక్షపూరిత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి చూపుతున్న రేషన్ డోర్ డెలివరీ వాహనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లాలో 395 మంది ఆపరేటర్లు ఉపాధి కోల్పోనున్నారు. వచ్చే నెల నుంచి వాహనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లాలో ఎండీయూ ఆపరేటర్లు ఆందోళన బాట పడుతున్నారు. రేషన్ షాపుల్లో అవకతవకలకు చెక్ పెట్టడం.. గంటల తరబడి క్యూలైన్లలో అవస్థలకు పరిష్కారంగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాలు ప్రవేశపెట్టింది. జిల్లాలో ప్రతి మూడు రేషన్షాపులకు ఒక డోర్ డెలివరీ వాహనాన్ని కేటాయించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఈ వాహనాలను అందించింది. 395 వాహనాలను జిల్లాలోని 1123 రేషన్ షాపులకు అనుసంధానం చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,31,044 రేషన్కార్డుదారులకు ప్రతి నెల 8,791.03 టన్నుల బియ్యం, 218.75 టన్నుల పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్లను ఇంటి ముంగిటే పంపిణీ చేసేలా వ్యవస్థను రూపొందించారు. ఒక్కొక్క వాహ నాన్ని రూ.5.80 లక్షల ఖర్చుతో కొనుగోలు చేస్తే.. 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లించింది. మిగిలిన 50 శాతం వాహన ఆపరేటర్ నెలకు రూ.3 వేల చొప్పున చెల్లించుకునేలా వాహనాలను పంపిణీ చేశారు. 2021 జనవరిలో ప్రారంభమైన ఈ వ్యవస్థ 72 నెలల పాటు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 72 వాయిదాలు చెల్లించారు. మరో 20 వాయిదాలు పెండింగ్లో ఉన్నాయి. నాడు వలంటీర్లు.. నేడు ఆపరేటర్లు కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే జిల్లాలో సుమారు 10,800 మంది వలంటీర్ల కడుపుకొట్టింది. ఎన్నికల సమయంలో వలంటీర్ల వ్యవస్థ కొనసాగించి నెలకు రూ.10 వేల జీతం ఇస్తామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. తాజాగా 395 మంది ఎండీయూ ఆపరేటర్లను తొలగించేశారు. ఆపరేటర్కు నెలకు రూ.21 వేలు జీతం ఇస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కాగా అమలయ్యేలా చేసింది. దీని కోసం జిల్లాలో 82.95 లక్షలు ప్రతి నెల ఖర్చు చేస్తోంది. ఉపాధి కల్పించాల్సింది పోయి ఉన్న ఉపాధి అవకాశాలకు గండికొట్టారు. మళ్ళీ రేషన్ షాపుల వద్దకు జనాలు వెళ్ళి క్యూ లైన్లో గంటల తరబడి నిలబడే పరిస్థితులు తెస్తున్నారు. ఉపాధిపై దెబ్బకొట్టారు నా జీతంతో నా కుటుంబం జీవిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం మా అవసరం లేదంటూ రద్దు చేసింది. ఇప్పుడు మా పరిస్థితి అర్థం కావడం లేదు. ప్రభుత్వం ప్రత్యా మ్నాయం చూపించాలని కోరుతున్నాం. – కుంచే నాగిరెడ్డి, ఎండీయూ డ్రైవర్, అయ్యవారిరుద్రవరం, మండవల్లి మండలం మా పరిస్థితి అగమ్యగోచరం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మాపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల పోషణ భారం కానుంది. కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందని ఊహించలేదు. మా భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. – ధనికొండ దుర్గారావు, డ్రైవర్ జిల్లాలో నిలిచిపోనున్న 395 ఎండీయూ వాహనాలు దశలవారీగా వ్యవస్థ నిర్వీర్యం నాడు వలంటీర్లు, నేడు రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్లు -
చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.3.92 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. లెక్కింపులో శ్రీవారికి భారీగా ఆదాయం సమకూరింది. గత 34 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ. 3,92,94,035 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 556 గ్రాముల బంగారం, 8.100 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.66,500 లభించినట్టు చెప్పారు. ఈఏపీ సెట్కు 938 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో భాగంగా ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలకు బుధవారం మూడు పరీక్షా కేంద్రాల్లో 973 మంది విద్యార్థులకు 938 మంది హాజరయ్యారు. ఉదయం సిద్ధార్థ క్వెస్ట్ పరీక్షా కేంద్రంలో 160 మందికి గాను 155 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 160 మందికి 150 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 149 మందికి 145 మంది హాజరు కాగా.. మధ్యాహ్నం 150 మందికి 146 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 177 మందికి 171 మంది హాజరు కాగా మధ్యాహ్నం 177 మందికి 171 మంది హాజరయ్యారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు 1504 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): పది సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 2,356 మంది విద్యార్థులకు 1504 మంది హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. దూరవిద్యావిధానంలో నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా రసాయన శాస్త్రం పరీక్షకు 69 మందికి 60 మంది హాజరయ్యారు. ఆర్థిక శాస్త్రం పరీక్షకు 146 మందికి 118 హాజరయ్యారు. పదో తరగతి తెలుగు పరీక్షకు 150 మందికి 125 హాజరయ్యారు. ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నూజివీడు: ఏలూరులో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని త్వరలో ఏర్పాటు చేయనుండటం ఈ ప్రాంతానికి వరమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడులో బుధవారం మాట్లాడుతూ చదువును మధ్యలోనే మానేసిన వారి కోసం దూరవిద్య ద్వారా చదువుకునేలా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 32 కేసులు నమోదు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా వ్యాప్తంగా బుధవారం మోటారు వాహనాల తనిఖీ అధికారులు 32 కేసులు నమోదు చేసి రూ.1.42 లక్షల అపరాధ రుసుం విధించినట్లు జిల్లా ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో హెల్మెట్లు ధరించని, లైసెనన్స్ లేని కేసులు ఉన్నాయన్నారు. టీచర్స్ బదిలీల హెల్ప్ డెస్క్ ఏర్పాటు భీమవరం: యూటీఎఫ్ భీమవరం కార్యాలయంలో బుధవారం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి హెల్ప్డెస్క్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్ విజయ రామరాజు, ఏకేవీ రామభద్రం మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ విషయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రంలో ఉపాధ్యాయులు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉచితంగా చేయించుకోవడమేగాక అనుమానాలు ఉంటే నివృతి చేసుకోవచ్చనన్నారు. -
కోకోకు మద్దతు ధర కల్పించాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఏలూరు అన్నే భవనంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ్ణ అధ్యక్షతన బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోండలీజ్ కంపెనీ ఎదుట చేసిన మహాధర్నా, దీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈనెల 23న ఏలూరు కలెక్టరేట్కు చర్చలకు పిలవడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతులకు మద్దతు ధర ఇచ్చి కోకో రైతులను ఆదుకోవాలని కోరారు. కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతవరకు కంపెనీలు, ట్రేడర్లు కొనుగోలు చేసిన కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపజేసి వ్యత్యాసపు ధర చెల్లించాలన్నారు. కోకో రైతుల సంఘం గౌరవాధ్యక్షుడు సింహాద్రి గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులు గుదిబండి వీరారెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, ఉప్పల కాశీ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో మెరుగైన జీవనం
ఏలూరు (టూటౌన్): యోగా మెరుగైన జీవనానికి దోహద పడుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. వట్లూరు టీటీడీసీలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగా ఓరియెంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన పెంచేందుకు శ్రీయోగాంధ్రశ్రీ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రతీ మండలంలో మాస్టర్ ట్రైనర్ల ద్వారా యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శ్రీయోగాంధ్రశ్రీ కార్యక్రమం నిర్వహణలో భాగంగా రూపొందించిన యాప్ను కలెక్టర్ ఆవిష్కరించారు. వేముల ధర్మారావు ఆధ్వర్యంలో యోగా శిక్షణా జరిగింది. కార్యక్రమంలో డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సుబ్రహ్మణ్యేశ్వ రరావు తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర 2025పై అవగాహన కల్పించాలి ఏలూరు(మెట్రో): జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర 2025పై జిల్లాలో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది!
కై కలూరు: మానవ మనుగడలో ‘జీవ వైవిధ్యం’ అనే పదాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. జీవ వైవిధ్యం అంటే భూమిపై ఉండే.. జన్యువులు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులుసహా పలు జాతులు, పర్యావరణ వ్యవస్థల సముదాయం. భవిష్యత్ తరాలకు అపారమైన విలువలను అందించే ప్రపంచ ఆస్తిగా ఈ అంశాన్ని పరిగణిస్తారు. ఏటా మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాష్ట్రానిది జీవ వైవిధ్యంలో కీలక స్థానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు (ఏపీఎస్బీబీ) బయోడైవర్సటీపై అవగాహన కల్పిస్తోంది. రాష్ట్రం ప్రత్యేకతలు రాష్ట్రంలో 37,258 చదరపు కిలోమీటర్లలో అటవీ విస్తీర్ణం ఉంది. తూర్పుతీరంలో రెండో అతిపెద్ద మడ అడవులు ఉన్నాయి. జీవ వైవిధ్య హాట్స్పాట్లుగా చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు వినతికెక్కాయి. మొట్టమొదటి బయోస్పియర్ రిజ ర్వ్గా శేషాచలం కొండలను గుర్తించారు. నల్లమల ఏపీలో అతిపెద్ద అడవి. జీవ వైవిధ్యపరంగా ఏపీలో 2,800కంటే ఎక్కువ మొక్కల జాతులు, 5,757కంటే ఎక్కువ వివిధ జాతుల జంతువులు ఉన్నాయి. రాష్ట్రంలో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలు (బీఎంసీ) 14,157 ఉండగా, వీటిలో 1,800 కమిటీలకు అంతరించిపోతున్న జాతులు, ఔషద మొక్కల నర్సరీలను పెంచడానికి ఏపీఎస్బీబీ హోమ్ హెర్బల్ గార్డెన్ పైలెట్ ప్రాజక్టును మంజూరు చేసింది. అంతరిస్తున్న అరుదైన జాతులు అడవుల నరికివేత, రసాయనాల వాడకం, కాంక్రిట్ జంగిల్, ఆహార, ఆవాసాల కొరత వల్ల అరుదైన జాతులు అంతరించిపోతున్నాయి. ఈ పరిణామాలను 1964 స్థాపించిన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్ వెల్లడిస్తోంది. రాష్ట్రానికి చెందిన దాదాపు 65 రకాల జాతులకు చెందిన మొక్కలు, పక్షులు, క్షీరదాలు, చేపలు, సరిసృపాలు రెడ్ జాబితాలో ఉన్నాయి. ఆరుదైన జీవ వైవిధ్యం.. మన సొంతం పర్యాటకులను కట్టిపడేసే పర్యావరణ అందాలతో పాటు జీవ వైవిధ్య ఏపీ సొంతం. కొల్లేరు సరస్సు, రోళ్లపాడు, కోరింక, నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్, పాపికొండలు, శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, శేషాచల కొండలు, పులులు, చిరుతలు, ఏనుగులు, పక్షులు ఆకట్టుకుంటాయి. రాష్ట్రంలో ఆంజియో స్పెర్మ్స్ మొక్కల జాతులు 3,000, జిమ్నోస్పెర్మ్స్ జాతి మొక్కలు 3, ప్టెరిడోఫైట్ జాతులు 72, బ్రయోఫైట్స్ జాతులు 100 మొక్కలతో పాటు 550 చెట్ల జాతులు, 285 పొదలు, 1,765 మొక్కలు ఉన్నాయి. కొల్లేరు అభయారణ్య పరివాహక ప్రాంతాలో 185 జాతుల పక్షులు విహరిస్తాయి. కొత్త జీవులను గుర్తించండి ప్రజా నివాస పరిసరాలలో కొత్త జీవులు, మొక్కలను ప్రతి ఒక్కరూ నిశితంగా గమనించి గుర్తించండి. భావితరాలకు వాటిని అందించవచ్చు. – ఫరిదా టంపాల్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, తెలుగు రాష్ట్రాల డైరెక్టర్, హైదరాబాద్ జీవ వైవిధ్యం ప్రమాదంలో ఉంది మానవ తప్పిదాల వల్ల జీవ వైవిధ్యం ప్రమాదంలో ఉంది. అడవుల నరికివేత, అధిక కాలుష్యం, వాతావరణ మార్పులు ఇందుకు కారణం. – డాక్టర్ ఎం.విజయ్కుమార్, జంతుశాస్త్ర అధ్యాపకులు, వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కై కలూరు. జీవ వైవిధ్యం.. జిందగీ నేస్తం ఈ విషయంలో రాష్ట్రానిది కీలక స్థానం మీకు తెలుసా..? ఒక ఎకరం వరి పొలాన్ని కీటకాలు లేకుండా కాపాడడానికి సుమారు 50 కప్పలు అవసరం. ఒకప్పుడు జరిగిన కప్పమాంసం ఎగుమతులను భారత్ నిషేధించింది. 1990 నుంచి రాష్ట్రంలో రాబందుల సంఖ్య 95 శాతం తగ్గింది. మడ అడవులు ఏటా వాతావరణం నుంచి కార్బన్డయాకై ్సడ్ ఉద్గారాల్లో 15 శాతం తొలగించగలవు. అమెజాన్ రెయిన్ ఫారెస్టు మాత్రమే ఏటా వాతావరణానికి 8 ట్రిలియన్ టన్నుల నీటి ఆవిరిని విడుదల చేస్తుంది. ఈ కారణంగానే ఎర్త్ లంగ్స్గా అమెజాన్ను పిలుస్తారు. ప్రపంచంలో 53 శాతం అడవులు కేవలం బ్రెజిల్, చైనా, కెనడా, రష్యా, అమెరికా ఉన్నాయి. -
అక్రమ కేసులకు బెదరం
ఏలూరు (టూటౌన్): అక్రమ కేసులు, వేధింపులు, బెదిరింపులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడరని, పార్టీ మూల స్తంభాలు కార్యకర్తలే అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు క్రిస్టల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ ఏలూరు జిల్లా సర్వ సభ్య సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. పార్టీ పరంగా ఒక్క పిలుపు ఇవ్వగానే వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చి ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారన్నారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ పరంగా అండగా ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే తమ ధ్యేయమని చెప్పారు. హామీలు అమలు చేయలేక సతమతం ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ.. పాలక ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను వేధిస్తోందని తప్పుపట్టారు. అక్రమ కేసులు పెడుతున్నారని, కొన్ని చోట్ల చంపడం వంటి నీచమైన పనులు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అనేక కేసులు పెట్టి హింసించారని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను మానసిక క్షోభకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. ‘పేదలకు మూడు సెంట్లతో పాటు.. నాలుగు లక్షలు ఇస్తామన్నారు.. ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఎంతమందికీ ఇళ్లు కట్టారో చెప్పే దమ్ముందా.. జగనన్న కాలనీ బోర్డులు మార్చడమే వీరి అభివృద్ధి. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక సతమతమవుతున్నారు. అరెస్టులు, అక్రమ కేసులు తప్ప ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేదు’ అని దూలం నాగేశ్వరరావు విమర్శించారు. జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ పిలుపు నిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పార్టీ శ్రేణుల ఎంపికలో నియమ నిబంధనలకు పెద్ద పీట వేశారన్నారు. వైఎస్సార్సీపీకి మూల స్తంభాలు కార్యకర్తలే జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడటమే ధ్యేయం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా సర్వసభ్య సమావేశంలో డీఎన్నార్ -
వంకా రవీంద్రకు సత్కారం
జిల్లా పార్లమెంట్ పరిశీలకులుగా నియమితులైన ఎమ్మెల్సీ వంక రవీంద్ర జిల్లా సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయనను సత్కరించి కార్యకర్తలు, నాయకులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వంకా రవీంద్ర మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే ధ్యేయంగా ప్రతీ కార్యకర్త ,నాయకుడు పనిచేయాలని పిలుపు నిచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, ఏ కష్టం వచ్చినా ముందుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్, నియోజకవర్గాల ఇన్చార్జులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మామిళ్ళపల్లి జయప్రకాష్(జేపీ), కంభం విజయ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు. నగర పార్టీ అధ్యక్షుడు గుడిదేశీ శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి గాదిరాజు సుబ్బరాజు, రాష్ట్ర కార్యదర్శులు చిత్తూరు మురళీకృష్ణ, దాసరి రమేష్, సూర్య బలిజ విభాగం అధ్యక్షుడు శక్తి త్యాగరాజు, వడ్డీల విభాగం అధ్యక్షుడు ముంగర సంజీవ్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షులు జగ్గవరపు జానకి రెడ్డి, చేబోయిన వీర్రాజు, జెడ్పీటీసీలు ములుగుమాటి నీరజ, కడిమి రమేష్, పోల్నాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం బకాయిలు చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో రైతులు, కౌలు రైతులకు చెల్లించాల్సిన రబీ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. స్థానిక అన్నే భవనంలో ధాన్యం బకాయిల సమస్యలపై మంగళవారం ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చివరి దశలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి దాదాపు రూ.89 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. గత 15 రోజులుగా ధాన్యం సొమ్ములు చెల్లింపులు నిలిచిపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ పంటకు తెచ్చిన పెట్టుబడి అప్పులు తీర్చి ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాల్సిన దశలో ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం తగదన్నారు. చివరి దశలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు కూడా చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ధాన్యం సొమ్ము అందాల్సిన బైరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ ఏలూరు శివారు సుంకరి వారి తోటకు చెందిన తనకు గత 15 రోజులు క్రితం తోలిన ధాన్యానికి సొమ్ములు అందలేదన్నారు. ధాన్యం బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. -
అలరించిన నాటిక పోటీలు
ఉద్యాన పంటల సాగుపై శ్రద్ధ ఉద్యాన పంటల సాగుపై వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో అధికారులు, రైతులతో ఏపీఎంఐపీ పీడీ, ఉద్యాన శాఖ జేడీ సమీక్షించారు. 8లో uఏలూరు (ఆర్ఆర్పేట): అంబికా సంస్థల వ్యవస్థాపకుడు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలు మంగళవారంతో ముగిశాయి. నాలుగో రోజు కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శించిన జనరల్ బోగీలు, రెండో ప్రదర్శనగా వీరన్నపాలెం కళానికేతన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన రుతువు లేని కాలం నాటికలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అద్భుతమైన కథాంశాలతో నటీనటుల హృద్యమైన నటనతో నాటికలు రక్తికట్టించాయి. అంబికా సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కళారత్న కేవీ సత్యనారాయణ, ఎగ్జి క్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఇరదల ముద్దుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ఏలూరు (టూటౌన్): కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్వీడి ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస, ఐఎఫ్టీయు నాయకుడు గడసాల రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొని నిరసన తెలియజేయాలని కోరారు. కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్ పేరుతో కాలరాస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను కార్పొరేట్లకు, ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా మోదీ ప్రభుత్వం అప్పగిస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, బి.సోమయ్య, వీవీఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఐసెట్లో 794 మంది ఉత్తీర్ణత ఏలూరు (ఆర్ఆర్పేట): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ నెల 7న నిర్వహించిన ఐ సెట్ పరీక్షల ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షల్లో ఏలూరు జిల్లా నుంచి 794 మంది అర్హత సాధించారు. 414 మంది బాలురు హాజరు కాగా వారిలో 399 మంది అర్హత సాధించారు. 412 మంది బాలికలు హాజరు కాగా వారిలో 395 మంది అర్హత సాధించారు. -
ఏలూరు జిల్లాలో భారీ వర్షం
కై కలూరు:ఏలూరు జిల్లాలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో అత్యధికంగా 81.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లాలో 444.8 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదవగా.. సరాసరి వర్షపాతం 16.08 మిల్లీమీటర్లుగా నమోదైంది. ముదినేపల్లి మండలంలో 80.4 మి.మీ, మండవల్లి మండలంలో 72.4 మి.మీ, కై కలూరు మండలంలో 51.6 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు కై కలూరు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. టౌన్హాలు, హైవే, రైల్వే స్టేషన్ రోడ్డు, బస్టాండ్ ప్రాంతాలలో వర్షపు నీరు చేరింది. ఆక్వా రంగం హడల్ : ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు కురిస్తే చేపల చెరువుల్లో ఆక్సిజన్ సమస్య ఉత్నన్నమవుతుంది. వాతావరణంలో మార్పుల కారణంగా చేపలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆక్సిజన్ సమస్య కారణంగా ప్రతీ ఏటా రూ. కోట్లలో ఆక్వా రైతులు నష్టపోతున్నారు. జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదు -
102 ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
ఏలూరు (టూటౌన్): తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ 102 ఉద్యోగుల వేతన బకాయిలు విడుదల చేయా లని, కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఏలూరులో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్వీడి ప్రసాద్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని రోజుకి 10 గంటలు పని చేస్తున్నా ఉద్యోగులకు కేవలం రోజుకు రూ.280 మాత్రమే జీతం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల నుంచి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గత నాలుగు నెలల బకాయిలను విడుదల చేయాలని, కనీస వేతనం రూ.18,500కి పెంచాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈఏపీ సెట్కు 949 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలకు మంగళవారం మూడు పరీక్షా కేంద్రాల్లో 999 మంది విద్యార్థులకు 949 మంది హాజరయ్యారు. ఉదయం సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో 161 మందికి 149 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 161 మందికి 152 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 141 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 147 మందికి 141 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 190 మందికి 181 మంది, మధ్యాహ్నం 190 మందికి 185 మంది హాజరయ్యారు. రేషన్ పంపిణీకి చర్యలు బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామాల మధ్య నిర్వాసితుల కోసం నిర్మించిన నిర్వాసిత కాలనీకి తరలివచ్చిన నిర్వాసితులు రేషన్ బియ్యం కోసం సుమారు 335 కిలోమీటర్ల దూరం వెళ్ళి బియ్యం తెచ్చుకుంటూ పడుతున్న అవస్థలపై సాక్షి పత్రికలో మంగళవారం ‘రేషన్ కోసం అవస్థలు’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ శీర్షికపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించారు. దీనిపై విచారణ జరిపారు. కార్డుదారుల జాబితాను సేకరించి పోర్టబిలిటీ విధానంలో వచ్చే జూన్ నుంచి రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సివిల్ సప్లయిస్ మేనేజర్ పీఎస్ఆర్ శివరామమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలకు 599 మంది గైర్హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): పది సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన హిందీ పరీక్షకు మొత్తం 754 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా కేవలం 155 మంది మాత్రమే హాజరయ్యారు. 599 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. దూరవిద్యావిధానం సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఇంటర్ తెలుగు పేపర్కు మొత్తం 86 మందికి 71 మంది హాజరయ్యారు. హిందీ పరీక్షకు ముగ్గురుకు ముగ్గురూ హాజరయ్యారు. పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 112 మందికి 89 మంది హాజరు కాగా 23 మంది గైర్హాజరయ్యారు. సర్పంచ్ చెక్ పవర్ రద్దు టి.నరసాపురం: టి.నరసాపురం మండలం బొర్రంపాలెం పంచాయతీ సర్పంచ్ కలపర్తి వెంకటేశ్వరమ్మ చెక్ పవర్ను రద్దు చేస్తూ పంచాయతీ అధికారి కె.అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగమయ్యాయని అదే గ్రామానికి చెందిన పాండురంగ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. నివేదిక ఆధారంగా సర్పంచ్ చెక్పవర్ను రద్దు చేశారు. ఇదే అభియోగంపై బొర్రంపాలెంలో గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి కేఎస్ కృష్ణను ఇప్పటికే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన ముగ్గురు కార్యదర్శులు, సర్పంచ్ వెంకటేశ్వరమ్మ నుంచి దుర్వినియోగమైన నిధులు రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో జి.మణికుమారి తెలిపారు. -
హౌసింగ్లో ఇంటి దొంగలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా గృహ నిర్మాణ శాఖలో దొంగలు పడ్డారు. నిరుపేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే హౌసింగ్ సామగ్రి చోరీకి గురైంది. టన్నుల కొద్దీ ఐరన్, వందల సిమెంట్ బస్తాలు మాయమయ్యాయని గృహనిర్మాణ శాఖ అధికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఇంటి దొంగలే పనేనని అనుమానం వ్యక్తమవుతుండగా మరికొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లతో అధికార యంత్రాంగం మౌనం వహించింది. మొత్తంగా జిల్లాలోని దెందులూరు, పెదవేగి, ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో చోటు చేసుకున్న ఈ చోరీ ఘటనలు తీవ్ర సంచలనంగా మారాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గంలోనూ చోరీ ఘటనలు జరగడం గమనార్హం.వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఐదేళ్ళ పాలనలో 1,16,431 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో రూ.713.17 కోట్లతో 98,874 ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత పేదలందరికీ ఇళ్లు పథకం పేరు మార్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి సబ్సిడీతో కూడిన రుణం ఇచ్చేవారు. ప్రతి ఇంటికి 500 కేజీల ఐరన్, 90 బస్తాల సిమెంట్, డోర్లు, ఎలక్ట్రికల్ సామగ్రి ఇలా రూ.1.80 లక్షలు ఖరీదు చేసే మెటీరియల్ను పూర్తి సబ్సిడీతో అందించేవారు. దీంతో ఇళ్ళ నిర్మాణ పురోగతి వేగంగా ఉండేది. కొత్త ప్రభుత్వం జిల్లాలో ఈ ఏడాది 49,381 గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 33,522 అర్బన్, 15,859 గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మంజూరైన ఇళ్ళనే గుర్తించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోగా ఇంతవరకు 25,729 ఇళ్ల పనులు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి విరుద్ధంగా ఉందిరూ.కోటికిపైగా సొత్తు మాయంప్రతి మండలంలో గృహనిర్మాణ శాఖ ఏఈ పర్యవేక్షణలో గొడౌన్ ఏర్పాటు చేశారు. సిమెంట్, ఐరన్, ఎలక్ట్రిల్ సామాన్లు, ఇతర నిర్మాణ సామగ్రి అంతా గొడౌన్లలో ఉంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇంతవరకు దెందులూరు మండలంలో 16 టన్నుల స్టీల్, పెదవేగి మండలంలో 16 టన్నుల స్టీల్, 300 సిమెంట్ బస్తాలు, ఆగిరిపల్లిలో 42 టన్నుల స్టీల్, 500 సిమెంట్ బస్తాలు, నూజివీడులో 600 ఇళ్ల విద్యుత్ మీటర్లు, ఇతర మెటీరియల్ చోరీకి గురైంది. వీటిపై సంబంధిత అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదు చేసి.. హౌసింగ్ పీడీకి నివేదిక పంపారు. స్థానిక అధికార పార్టీ ఒత్తిళ్లతో వ్యవహారం ముందుకు సాగడం లేదు. మరోవైపు కొందరు స్థానిక అధికారులు 70 శాతం ధరకు బయట మార్కెట్లో విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఈ తరహా చోరీలు జరిగి ఉండొచ్చనే వాదన వినిపిస్తుంది. స్థానికంగా పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు విచారణను పూర్తిగా పక్కనపెట్టారు. టన్ను ఐరన్ ధర రూ. 60 వేల నుంచి 65 వేలు, సిమెంట్ బస్తా ధర రూ.350గా ఉంది. ఈ క్రమంలో రూ.48.10 లక్షల ఐరన్, రూ. 2.80 లక్షల సిమెంట్, రూ.42 లక్షల ఎలక్ట్రికల్ సామగ్రి చోరీకి గురైనట్లు నిర్ధారించారు.దర్యాప్తు చేస్తున్నాంచోరీ ఘటనలు మా దృష్టికి వచ్చాయి. దీనిపై శాఖపర విచారణ నిర్వహిస్తున్నాం. పూర్తి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించి బాధ్యులపై చర్యలతో పాటు కేసు నమోదు చేస్తాం.– జీ.సత్యనారాయణ, హౌసింగ్ పీడీ -
మంత్రిగారూ.. మెడికల్ కాలేజీ గుర్తుందా?
సాక్షి, భీమవరం: వైద్య విద్యను పేద విదార్థులకు చేరువ చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని దగ్గులూరులో రెండేళ్ల క్రితమే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీఇక్కడ బురద తప్ప మెడికల్ కళాశాల పనులేమి జరగడం లేదుశ్రీ అంటూ ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడు ఎంతో హడావుడి చేశారు. పనుల వేగం పెంచాలంటూ పార్టీ పెద్దలను సైతం తీసుకువచ్చి నిరసనలు తెలిపారు. కూటమి వచ్చాక ఆయన్ను మంత్రి పదవి వరించడంతో ఏడాదిలోనే పనులు పూర్తవుతాయని అంతా ఆశించారు. ఇంతవరకూ ఆయన కళాశాల వైపు కన్నెత్తి చూడలేదు. పాలకొల్లు మండలం దగ్గులూరులోని సుమారు 60 ఎకరాల్లో రూ.475 కోట్లతో కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కళాశాల నిర్మాణంతో జిల్లా వాసులకు మేలు జరుగుతుందని, ఎంతో మందికి ఉపాది లభిస్తుందని స్థానికులు ఆశించారు. నిధుల లేక నిలిచిన పనులు 2023 ఆగస్టులో నిర్మాణ సంస్థ పనులు ప్రారంభించింది. ఇనన్పేషెంట్, అవుట్ పేషెంట్, ఎమర్జన్సీ సేవల బ్లాకులకు సంబంధించి రూ.75 కోట్ల విలువైన పునాది పనులు దాదాపు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల పనులకు బ్రేక్ వేసింది. ఈ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది. సైట్లోని ఐరన్, ఇసుక, కంకర, ఇతర నిర్మాణ సామగ్రిని తరలించుకుపోతోంది. పనులు ఆగిపోవడంతో స్థానికుల ఆశలపై నీళ్లు చల్లారు. కాలేజీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవనుంది. కళాశాల వైపు చూడని మంత్రి నిమ్మల గత ప్రభుత్వంలో ఒకపక్క పనులు జరుగుతుంటే.. బురద తప్ప ఇక్కడ నిర్మాణాలు ఏమీ చేయడం లేదంటూ పలుమార్లు సైట్ వద్దకు వచ్చి నిమ్మల హడావుడి చేశారు. మాజీ మంత్రి నిమ్మ కాయల రాజప్ప, తదితర పార్టీ పెద్దలను తీసుకొచ్చి నిరసనలు తెలిపి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. అప్పట్లో వైద్య కళాశాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేసిన నిమ్మల మంత్రిగా ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా ఇటు వైపు వచ్చి చూసిన దాఖలాలు లేవు. పబ్లిసిటీ కోసమే గతంలో హడావుడి చేశారని అంటున్నారు. గత ప్రభుత్వంలో పనులు ప్రారంభం.. రూ.75 కోట్ల విలువైన పనులు పూర్తి గతంలో పలుమార్లు సైట్ వద్దకు వచ్చి హడావుడి చేసిన నిమ్మల కూటమి వచ్చాక కన్నెత్తి చూడని వైనం -
మట్టి తవ్వకాల అడ్డగింత
చాట్రాయి: చనుబండ గ్రామంలోని పెద్ద చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను అధికారులు అడ్డుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మట్టి తవ్వకాలు చేస్తున్నారని సమాచారం రావడంతో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని ఒక పొక్లయిన్, జేసీబీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నాలుగు రోజల క్రితం మట్టి తవ్వకాలకు అనుమతి కావాలంటూ కొందరు అధికారులకు అర్జీ ఇచ్చారు. అర్జీ ఇచ్చినందుకు ఇచ్చిన రసీదుని చూపించి మూడు రోజులపాటు అక్రమంగా మట్టిని తరలించారు. సోమవారం రాత్రి సమాచారం అందుకున్న అధికారులు రెండు యంత్రాలను సీజ్ చేశారు. పారిజాతగిరీశుడికి శేష వాహన సేవ జంగారెడ్డిగూడెం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. రాజమండ్రికి చెందిన పండితులు పాండంగిపల్లి దుర్గా రామ సత్య పవన్ కుమార్ ఆచార్యులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ధ్వజరోహణం, అగ్ని ప్రతిష్ట, కుంభ స్థాపన, నిత్య హోమాలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు అత్యంత వైభవంగా శేష వాహన సేవ జరిపారు. సంతానం లేని భక్త దంపతులు స్వామివారి గరుడ ప్రసాదం స్వీకరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మద్ది క్షేత్రంలో విశేష పూజలు జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,87,132 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1600 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారన్నారు. ఈవో చందన మాట్లాడుతూ క్షేత్రంలో హనుమద్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 21 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం స్వామి వారి నిజరూప సందర్శనం (సింధూరం వలుపు) అనంతరం విశేష దర్శనములు ఉంటాయన్నారు. -
శ్రమజీవులకు ఎంత కష్టం..
ద్వారకాతిరుమల: వేర్వేరుగా జరిగిన రెండు ప్రమాదాల్లో 20 మంది కూలీలు, ఒక డ్రైవర్ గాయపడ్డారు. ద్వారకాతిరుమల మండలంలోని లైన్గోపాలపురం జాతీయ రహదారిపై ఎండు కొబ్బరి కాయల లోడుతో వెళుతున్న బొలేరో వాహనం వెనుక టైరు పేలడంతో అదుపు తప్పి బోల్తా పడగా 14 మంది గాయాలపాలయ్యారు. గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద చేపల చెర్వులకు మేత తరలిస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఏడుగురు కూలీలు గాయపడ్డారు. టైరు పేలి బోల్తా పడ్డ వ్యాన్ ద్వారకాతిరుమల మండలం కప్పలకుంట నుంచి ఎండు కొబ్బరి కాయల లోడుతో బొలేరో వాహనం దెందులూరు మండలం గోపన్నపాలెంకు వెళుతోంది. లైన్ గోపాలపురం జాతీయ రహదారిపైకి వచ్చేసరికి వాహనం వెనుక టైరు పేలింది. ఈ ప్రమాదంలో 5 గురు తీవ్రంగా, 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్ వాన కిషోర్తో పాటు, వాహనంపై ఉన్న గోపన్నపాలెం, వేగవరంనకు చెందిన 13 మంది కూలీలు కొండేటి గంగాధరరావు, కాసగాని ఆంజనేయులు, బెజవాడ రత్తయ్య, వాన తిరుపతి, మోర్ల రాము, ఆరే రామకృష్ణ, తాడి సత్యవతి, తాడి సంతోష్, అప్పల నాయుడు, ఒగ్గుల చరణ్, బి.అప్పన్న, ఐక రాంబాబు, రెగాన రామ్మూర్తి, బోణె అప్పమ్మ తదితరులు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108, హైవే ఆంబులెన్స్లో హుటాహుటీన భీమడోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం తీవ్రంగా గాయపడ్డ ఆంజనేయులు, సంతోష్, అప్పలనాయుడు, సత్యవతి, గంగాధరరావు లను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ బోల్తా.. కూలీలకు గాయాలు భీమడోలు: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి గుండుగొలను శివారు రత్నాపురంలోని ఆక్వా చెర్వులకు మేత తవుడు దిగుమతి చేసేందుకు లారీ వచ్చింది. లారీ డ్రైవర్ సత్తార్ తవుడు దించేందుకు జట్టు కూలీలను పురమాయించుకుని ఆక్వా చెరువుల వద్దకు వెళుతుండగా గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద గల మలుపు వద్దకు వచ్చేసరికి లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీ కేబిన్లో ఉన్న కూలీలు బూరి తిరపతయ్య, పెద్దింటి కృష్ణ, మంత్రి పాపారావు, చిగడాపు వెంకన్న, గొర్జి శ్రీను, నేలబుల్లి సూర్యానారాయణలతో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమడోలు పోలీసులు తెలిపారు. ద్వారకాతిరుమలలో వ్యాన్ బోల్తా పడి 14 మందికి గాయాలు గుండుగొలనులో లారీ అదుపు తప్పి ఏడుగురు కూలీలకు గాయాలు -
ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ
తాడేపల్లిగూడెం రూరల్: ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సీ.వెంకటరమణ, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ జిల్లాలకు చెందిన ఉద్యాన శాఖ అధికారులు, రైతులతో ప్రాంతీయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం సహాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ డి.వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ టమాట, మిరపలో ప్రొసెసింగ్ టెక్నాలజీలను పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కోత అనంతరం పండ్ల తోటల్లో నష్టాన్ని అంచనా వేయడం, తద్వారా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అరటి దిగుబడిలో కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమ ముందంజలో ఉందని, దానికి కారణాలు వెతకాలన్నారు. ఏఐని ఉపయోగించి తెగుళ్ల ఉద్ధృతిని అరికట్టాలి రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ విదేశీ పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పంటల సాగుపై రైతులకు కావలసిన సూచనలను, సలహాలను శాస్త్రవేత్తలు అందించాలన్నారు. ఆయిల్ పామ్లో అంతర పంటగా సాగు చేసే కోకోలో కొత్త రకాలను తీసుకురావాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను ఆధారం చేసుకుని పురుగు, తెగుళ్ల ఉధృతిని, ఉనికిని కనిపెట్టడం, అవసరాన్ని బట్టి ఎరువులు, నీటి యాజమాన్యం చేపట్టాలన్నారు. వాతావరణ మార్పులకనుగుణంగా పంటల్లో పురుగు, తెగుళ్ల ఉద్ధృతిపై విస్తారంగా పరిశోధనలు జరగాలన్నారు. ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జమదగ్ని, ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ కే.టి.వెంకటరమణ, యూనివర్సిటి డీఐపీ అధికారి డాక్టర్ కే.ధనుంజయరావు, విస్తరణ పంచాలకులు డాక్టర్ బి.గోవిందరాజులు, పరిశోధన సహాయ సంచాలకులు కోస్టల్ జోన్–1 డాక్టర్ డి.వెంకటస్వామి, కోస్టల్ జోన్–1 డాక్టర్ సి.వెంకటరమణ గత ఏడాదికి గాను అధికారులు, రైతులు అడిగిన సమస్యలకు పరిష్కారాలపై చేపట్టిన పరిశోధనలు తెలిపారు. శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్బీవీ.చలపతిరావు, డాక్టర్ ఇ.కరుణశ్రీ, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త విజయలక్ష్మి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన ఉద్యాన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఏపీఎంఐపీ పీడీ డాక్టర్ వెంకటరమణ