ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ | ACB raids: Medak Additional Collector Nagesh caught for demanding Rs 1 crore bribe | Sakshi

ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్

Sep 9 2020 2:15 PM | Updated on Sep 9 2020 5:07 PM

ACB raids: Medak Additional Collector Nagesh caught for demanding Rs 1 crore bribe - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కీసర మాజీ తాహసీల్దార్‌ నాగరాజు ఉదంతం మరవకముందే ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్  అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఆడియో టేపులతో సహా ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో అడిషనల్ కలెక్టర్ నగేష్‌ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. మెదక్ జిల్లా    నర్సపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు రూ. కోటి 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. దీంతో బుధవారం ఉదయం మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లపై ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. (మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్‌రెడ్డి)

అడిషనల్ కలెక్టర్ నగేష్‌.. ఒక ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. 15 రోజులుగా తిరుగుతున్నా పని కాకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన మూర్తి ఏసీబీని ఆశ్రయించాడు.  దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ లంచం తీసుకుంటుండగా నగేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెదక్ మాచవరంలో లక్ష రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ బోయినపల్లిలో లాకర్ ను గుర్తించారు. బ్లాంక్‌ చెక్కులు, అగ్రిమెంట్‌ పేపర్లు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.  ఈ రోజు మొత్తం ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.ఏసీబీ తనిఖీల్లో ఇంకా ఎన్ని ఆస్తులు బయటపడతాయనేది ఆసక్తిగా మారింది. (రూ.కోటి 10 ల‌క్ష‌లు ఎవ‌రివని ఏసీబీ ఆరా)

అయితే, నర్సాపూర్ మండలం చిప్పలకుర్తిలో 113 ఎకరాల ల్యాండ్ ఎన్‌వోసీ కోసం.. ఏకంగా అడిషనల్ కలెక్టర్ నగేష్‌ రూ.కోటి 40 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎకరాకు లక్ష చొప్పున రూ.కోటి 12 లక్షలకు డీల్ కుదిరింది. రూ.40 లక్షల నగదుతో పాటు తన పేరిట రూ.72 లక్షల విలువైన భూములు రిజిస్ట్రేషన్‌కు ఒప్పందం కుదిరింది. ఇక, ఏసీబీ తనిఖీల్లో నగేష్‌ ఇంట్లో బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవో బండారు అరుణా రెడ్డి,  ఎమ్మార్వో సత్తార్, విఆర్వో, విఆర్ఏ,జూనియర్ అసిస్టెంట్‌ల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నగేష్ భార్యను విచారణ నిమిత్తం బోయిన్‌పల్లికి తరలించారు.ఇతర రెవిన్యూ సిబ్బంది నివాసాలపై సోదాలు జరుపుతున్నారు. చౌదరిగూడా ఆర్డీవో నివాసం, కొంపల్లి జేసీ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున నగలు, నగదు స్వాదీనం చేసుకున్నారు. (పాసు పుస్తకాలకెళ్తే.. ఆర్‌ఐకి రూ. 35 లక్షల అప్పు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement