ప్రజావాణికి 21 వినతులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 21 వినతులు

Apr 29 2025 12:09 AM | Updated on Apr 29 2025 12:09 AM

ప్రజా

ప్రజావాణికి 21 వినతులు

నాగర్‌కర్నూల్‌: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 21 వినతులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టరేట్‌ ఏఓ చంద్రశేఖర్‌ వినతులు స్వీకరించి ఆయా విభాగాల సిఫారస్‌ చేసి మాట్లాడారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని.. ప్రజల వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పోలీసు ప్రజావాణికి 12..

నాగర్‌కర్నూల్‌ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 12 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించి 4, భార్యాభర్తల గొడవలకు సంబంధించి ఒకటి, వేర్వేరు ఫిర్యాదులు 7 వచ్చినట్లు వివరించారు.

నేడు మద్యం బార్‌ల

కేటాయింపు

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లాలోని అచ్చంపేటలో లైసెన్స్‌ రెన్యూవల్‌ కాని రెండు మద్యం బార్‌ల స్థానంలో కొత్త వాటి ఏర్పాటుకు 18 దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ సమక్షంలో లాటరీ విధానంలో కొత్త వారిని ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ గాయత్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఉదయం 10 గంటలలోగా వారికి కేటాయించిన ఎంట్రీ పాసులు తీసుకొని హాజరుకావాలని పేర్కొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కందనూలు: హైదరాబాద్‌లోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ప్రభుత్వ మహిళా టెక్నికల్‌ శిక్షణ సంస్థలో 2025–26 విద్యాసంవత్సరానికిగాను పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి పూర్తి చేసిన అనాథ బాలికలు, ఎలాంటి ఆధారం లేని బాలికలు మాత్రమే అర్హులని.. ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి బాలరక్షా భవన్‌, రూం.నం. 308, పాత కలెక్టర్‌ కార్యాలయం, నాగర్‌కర్నూల్‌లో మే 17లోగా అందజేయాలని సూచించారు.

కాంగ్రెస్‌లో సంస్థాగత నియామకాల సందడి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమవుతోంది. ఎన్నికలలోపే మండల, బ్లాక్‌, డీసీసీ అధ్యక్షులు, ఇతర కార్యవర్గాల ఎంపిక కోసం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఇటీవలే జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా పీసీసీ పరిశీలకులను నియమించింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు దొమ్మాటి సాంబయ్య, గజ్జి భాస్కర్‌యాదవ్‌లను పీసీసీ పరిశీలకులుగా నియామకం చేసింది. ఈ మేరకు పీసీసీ పరిశీలకుల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు, పీసీసీ, డీసీసీ కార్యవర్గంతోపాటు మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు హాజరుకానున్నారు. మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌, డీసీసీ కార్యవర్గం నియామకంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించి సంస్థాగత నియామకాల కోసం వచ్చేనెల 4 నుంచి 10 వరకు నియోజకవర్గ స్థాయిలో, 13 నుంచి 20 వరకు మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. మండల స్థాయిలో ఐదుగురు, బ్లాక్‌ కాంగ్రెస్‌కు నలుగురు, డీసీసీ అధ్యక్షుడికి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను టీపీసీసీకి నివేదించనున్నారు. వచ్చే నెల చివరి వారంలో మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌, డీసీసీ అధ్యక్షుల పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది.

ప్రజావాణికి 21 వినతులు 
1
1/1

ప్రజావాణికి 21 వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement