మద్యం మత్తులో బీభత్సం.. కేసు నుంచి అధికార పార్టీ నేత కుమారుణ్ని తప్పిస్తున్నారా? | Bmw Car Hit And Run Case In Mumbai Update | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో బీభత్సం.. కేసు నుంచి అధికార పార్టీ నేత కుమారుణ్ని తప్పిస్తున్నారా?

Published Sun, Jul 7 2024 6:54 PM | Last Updated on Sun, Jul 7 2024 7:08 PM

Bmw Car Hit And Run Case In Mumbai Update

ముంబై అధికార శివసేన పార్టీ నేత రాజేష్‌ షా కుమారుడు మిహిర్‌ షా (24) హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం మిషిర్‌ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్‌ కారు ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. అయితే ఈ కేసులో మిషిర్‌ షాను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మిహిర్‌ షా ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్‌ కారు ముంబై వర్లిలోని సాసూన్ డాక్ ఫిష్‌ మార్కెట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న భార్య కావేరీ నక్వా,ఆమె భర్త పార్థిక్‌‌ నక్వా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాధితురాలు కావేరీ నక్వా మరణించగా.. భర్త పార్థిక్‌ నక్వా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుడున్నాడు.

అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగే సమయంలో కారులో కారు డ్రైవర్‌ రాజేంద్ర సింగ్‌ బిజావత్‌తో పాటు మిహిర్‌ షా ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన మిహిర్‌ షా కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. డ్రైవర్‌ను బిజావత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

అధికార పార్టీ నేత కుమారుడికి అనుకూలంగా
హిట్‌ అండ్‌ రన్‌ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై వివాదం నెలకొంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద అంటే హత్యతో సమానం కాని నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సాధారణంగా నేరపూరిత నరహత్య, ర్యాష్ డ్రైవింగ్,సాక్ష్యాలను ధ్వంసం చేయడం మొదలైన వాటిపై కేసు నమోదు చేస్తారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మద్యం సేవించిన కారు డ్రైవర్‌ బిజావత్ నుంచి రక్త నమోనాలకు సేకరించారు.రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది.

వాళ్లు సమాజంలో పేరున్న పెద్దోళ్లు.. మనమేం చేయలేం
రోడ్డు ప్రమాదంపై తన భార్య కావేరీ నక్వా మరణంపై ఆమె భర్త పార్థిక్‌‌ నక్వా కన్నీరు మున్నీరవుతున్నారు. ‘‘ఫిష్‌ మార్కెట్‌ నుంచి తిరిగి వస్తున్న తమ వెహికల్‌ను బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. నా భార్య ఎగిరి 100 మీటర్ల అవతల పడింది. నాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో  నా భార్యను కోల్పోయా. నాకు ఇద్దరు పిల్లలు. వారి సంరక్షణ ఎవరు చూసుకోవాలి. వాళ్లంటే సమాజంలో పేరున్న పెద్ద మనుషులు. వారిని ఎవరు ఏం చేయలేరు. చివరికి బాధపడాల్సి మనమే  అంటూ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ప్రధాన కారకుడైన మిహిర్‌ షా‘‘ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

పోలీసులు వెర్షన్‌ ఎలా ఉందంటే?  
బీఎండబ్ల్యూ కారు మిహిర్ షా పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మిహిర్ షా, డ్రైవర్ ఇద్దరు కారులో ఉన్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మిహిర్ షా గత రాత్రి జుహులోని ఓ బార్‌లో మద్యం సేవించాడు. ఇంటికి వెళుతుండగా, డ్రైవర్‌ని లాంగ్ డ్రైవ్ చేయమని అడిగాడు. వర్లీ ప్రాంతంలో కారు డ్రైవ్‌ చేస్తున్న మిహిర్‌ షా.. కావేరీ నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. 

సీఎం ఏక్‌ నాథ్‌ షిండ్‌ ఏమన్నారంటే?
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండ్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసుపై స్పందించారు.  ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమే దేశంలో చట్టం ముందు అందరూ సమానమేనని, ఆ విషయంలో ఎవరి పట్ల వివక్ష చూపబోమని, ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా.. నిందితులకు శిక్షపడేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏక్‌ నాథ్‌ షిండ్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement