31 నుంచి ఏప్రిల్‌ సెషన్‌ దరఖాస్తులు | JEE Main Session 2 Application Date Announcement | Sakshi
Sakshi News home page

31 నుంచి ఏప్రిల్‌ సెషన్‌ దరఖాస్తులు

Jan 30 2025 4:08 AM | Updated on Jan 30 2025 4:08 AM

JEE Main Session 2 Application Date Announcement

జేఈఈ మెయిన్‌ సెషన్‌–2 దరఖాస్తుల తేదీ ప్రకటన 

ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు రెండు షిఫ్టులలో పరీక్షలు 

బుధవారంతో ముగిసిన జనవరి సెషన్‌  

పేపర్‌ కఠినత్వాన్ని బట్టి మార్కులు– పర్సంటైల్‌ 

‘కీ’ని చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దు 

జేఈఈ శిక్షణ నిపుణుడు ఎంఎన్‌ రావు

సాక్షి, ఎడ్యుకేషన్‌: జేఈఈ–మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ పరీక్షలకు ఈ నెల 31 (శుక్రవారం) నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. విద్యార్థులు ఫిబ్రవరి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు ప్రతి రోజు రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. 

ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటన విడుదల చేసింది. జనవరి సెషన్‌ బీటెక్‌ ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. వీటికి సంబంధించి రెస్పాన్స్‌ షీట్, ‘కీ’లను ఫిబ్రవరి 1 లేదా 2వ తేదీన ఎన్‌టీఏ విడుదల చేసే అవకాశం ఉంది. 

సులభమైన ప్రశ్నలే.. 
బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ మొదటి షిఫ్ట్‌ పరీక్ష సులభంగా ఉందని విద్యార్థులు చెప్పారు. ఫిజిక్స్‌లో గడిచిన నాలుగు రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలే ఎక్కువగా అడగడం గమనార్హం. ఈ సబ్జెక్ట్‌లో అధిక శాతం ప్రశ్నలు కాన్సెప్ట్‌లు, ఫార్ములా ఆధారితంగా ఉన్నాయి. ఎక్కువ ప్రశ్నలు ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం సిలబస్‌ నుంచే వచ్చాయి. 

మ్యాథమెటిక్స్‌ ఓ మాదిరి క్లిష్టతతో ఉందని, కెమిస్ట్రీ విభాగం సులభంగా ఉందని సబ్జెక్ట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ విభాగంలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫిజికల్‌ కెమిస్ట్రీ టాపిక్స్‌ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. రెండో షిఫ్ట్‌లో ఫిజిక్స్‌ క్లిష్టంగా న్యుమరికల్‌ ఆధారిత ప్రశ్నలతో ఉందని, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలో డైరెక్ట్‌ ప్రశ్నలు అడిగారని విద్యార్థులు చెప్పారు. 

మార్కుల మధ్య వ్యత్యాసం 
జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ పరీక్షల్లో క్లిష్టత స్థాయిని బట్టి విద్యార్థులు పొందే మార్కుల్లో 35 నుంచి 60 మార్కుల వరకు వ్యత్యాసం ఉండొచ్చు. ఉదాహరణకు 2024లో క్లిష్టంగా ఉన్న పేపర్‌లో 176 మార్కులు వచ్చిన విద్యార్థికి 99 పర్సంటైల్‌ రాగా, ఓ మాదిరి క్లిష్టంగా ఉన్న పేపర్‌లో 224 మార్కులకు 99 పర్సంటైల్‌ వచ్చింది.

దీంతో జనవరి సెషన్‌లో క్లిష్టమైన పేపర్స్‌ విషయంలో 170 నుంచి 150 మార్కులతో 99 పర్సంటైల్, ఓ మోస్తరు పేపర్‌లో 180–195 మార్కులతో 99 పర్సంటైల్‌ పొందే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు రెస్పాన్స్‌ షీట్స్, ‘కీ’లను చూసి ఆందోళన చెందవద్దు. మొత్తం పది షిఫ్ట్‌లలో 25, 29 తేదీల్లో షిఫ్ట్‌–1 పేపర్లు, 28వ తేదీ షిఫ్ట్‌–2 పేపర్లు కఠినంగా ఉన్నాయి.  – ఎం.ఎన్‌.రావు, జేఈఈ శిక్షణ నిపుణుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement