
ఏప్రిల్ 2 నుంచి జరగాల్సిన పరీక్ష.. అదే రోజు సీబీఎస్ఈ పరీక్ష
రెండూ ఎలా రాస్తామంటున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్–2 పరీక్ష తేదీలు మారే అవకాశం కన్పిస్తోంది. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. వాస్తవానికి ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో రెండో విడత జేఈఈ మెయిన్స్ జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం విడుదల చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. అయితే ఇదే రోజు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్ష ఉంటుంది. సీబీఎస్ఈ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 2న లాంగ్వేజెస్, 3న హోం సైన్స్, 4న ఫిజియాలజీ ఉంటుంది.
సీబీఎస్ఈ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగుతుంది. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరో షిఫ్ట్ సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది.
దీంతో సీబీఎస్ఈ పరీక్ష రాసే విద్యార్థులు జేఈఈ మెయిన్స్కు హాజరయ్యే అవకాశం లేకుండా పోతుంది. లేదా మెయిన్స్ రాసే విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షను వదిలేయాల్సి ఉంటుంది. పలువురు విద్యార్థులు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్ష మార్పు లేదా ప్రత్యామ్నాయాలపై నిర్ణయం ప్రకటించాలని కేంద్రం ఎన్టీఏకి సూచించింది.