ప్రధాన వార్తలు

డెత్ ‘స్పిరిట్’.. కబళిస్తున్న కల్తీ మద్యం...!
అప్పటిదాకా అలవాటైన ‘సరుకే’..! కాస్త పడగానే ‘కిక్’ ఇచ్చేదే..! కానీ.. ఇప్పుడెందుకో హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం.. ఏమైందో తెలుసుకునేలోపే మృత్యు కౌగిట్లోకి!!ఇదేదో కోవిడ్ మహమ్మారి కాదు... కొత్త వైరస్ అంతకంటే కాదు..!!టీడీపీ మద్యం సిండికేట్ ముఠాలు తయారు చేస్తున్న కల్తీ మందు ఎఫెక్ట్ ఇదీ!ప్రమాదకర స్పిరిట్లో కారమిల్, రంగునీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు!రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం దందా గుప్పుమంటోంది..కల్తీ మద్యాన్ని తాగడంతో ఇటీవల పలువురు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తప్పనిసరిగా నిర్వహిస్తున్న దాడులతో అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప తదితర జిల్లాల్లో కల్తీ మద్యం దందా ఇప్పటికే బహిర్గతమైంది. కల్తీ మద్యం తయారీకి కీలకమైన స్పిరిట్ను అక్రమంగా సరఫరా చేస్తున్న టీడీపీ పెద్ద తలకాయల జోలికి వెళ్లేందుకు ఎక్సైజ్ శాఖ సాహసించడం లేదు. కల్తీ మద్యం రాకెట్ దందా వెనుక టీడీపీ కీలక నేతలు, ప్రజాప్రతినిధుల కుటుంబాలే ఉండటంతో వెనకడుగు వేస్తోంది!(సాక్షి, అమరావతి): బాటిల్ మీద ఏసీ బ్లాక్ విస్కీ అని ఉంటుంది... లోపల సరుకు మాత్రం కల్తీ..! సీసా మీద ఓల్డ్ అడ్మిరల్ అని అందంగా కనిపిస్తుంది... మూత తీస్తే కల్తీ మద్యం గుప్పుమంటుంది..! ఏస్పీవై 999 అనే ఆకర్షణీయమైన బ్రాండ్... అది తాగితే కల్తీ నరనరాల్లోకి పాకుతుంది...! రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి మూడు మద్యం సీసాల్లో ఒకటి కల్తీ మద్యమే అన్నది నిఖార్సైన నిజం! దీనికి సూత్రధారులు టీడీపీ కీలక నేతలు అన్నది నగ్న సత్యం...!! మద్యం ప్రియుల ప్రాణాలను ఫణంగా పెట్టి టీడీపీ మద్యం సిండికేట్ ఒక్క ఏడాదిలో రూ.వేల కోట్ల దోపిడీని సాగించింది!రాష్ట్రాన్ని కల్తీ మద్యం కబళిస్తోంది. అత్యంత హానికరమైన స్పిరిట్లో రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యంగా విక్రయించేస్తున్నారు. టీడీపీ పెద్దల అండదండలతో కల్తీ మద్యం రాకెట్ వ్యవస్థీకృతమైంది. కల్తీ మద్యం తయారీ యూనిట్లను నెలకొల్పి మద్యం ప్రియుల ప్రాణాలను హరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆదేశాలను వక్రీకరిస్తూ బరి తెగించి స్పిరిట్ అక్రమ రవాణాకు పాల్పడుతోంది. టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న దుకాణాలు, బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రాణాలను బలిగొంటున్న వైనం ఇదిగో ఇలా ఉంది..! కేంద్రం ఆదేశాల వక్రీకరణ.. భారీగా స్పిరిట్ అక్రమ సరఫరా కల్తీ మద్యం రాకెట్ నిర్వహణకు టీడీపీ సిండికేట్ వేసిన పన్నాగం విస్మయపరుస్తోంది. కోవిడ్ సమయంలో దేశంలో శానిటైజర్లను అత్యధికంగా ఉత్పత్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో శానిటైజర్ల తయారీ కోసం అవసరమైన ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు) భారీగా కొనుగోలు చేసేందుకు అప్పట్లో డిస్టిలరీలను అనుమతించారు. సాధారణంగా స్పిరిట్ కొనుగోలుపై నియంత్రణ ఉంటుంది. పరిశ్రమలు కూడా ఓ పరిమితికి మించి కొనుగోలు చేయకూడదు. అయితే కోవిడ్ వ్యాప్తి సమయంలో శానిటైజర్ల తయారీ కోసం ఆ పరిమితిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు ఏవీ లేనప్పటికీ స్పిరిట్ను భారీగా కొనుగోలుకు అనుమతిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. సరిగ్గా దీన్ని టీడీపీ మద్యం సిండికేట్ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఆసరాగా చేసుకుని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. అలా సేకరించిన స్పిరిట్ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల కుటుంబాలకు చెందినవే కావడంతో కల్తీ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయాలు.. సిండికేట్ దుకణాలు, బెల్టు షాపులకు సరఫరా టీడీపీ సిండికేట్ రాష్ట్రంలో దాదాపు డజను కల్తీ మద్యం యూనిట్లను నెలకొల్పి దందా కొనసాగిస్తోంది. రెండు మూడు జిల్లాలకు ఒక యూనిట్ను స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ఏరులై పారిస్తోంది. యానాంతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడుకు కూడా కల్తీ మద్యాన్ని సరఫరా చేయడం గమనార్హం. కల్తీ సరుకును బ్రాండెడ్ మద్యంగా విక్రయించేందుకు టీడీపీ సిండికేట్కు అధికారిక నెట్వర్క్ఉండటం కలసి వస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ గుప్పిట్లోనే ఉన్నాయి. ఇక వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను కూడా సిండికేట్ నిర్వహిస్తోంది. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఏడాదిలో రూ.5,280 కోట్ల దందా 48 కోట్ల కల్తీ మద్యం బాటిళ్ల విక్రయం..! కల్తీ మద్యం దందాను టీడీపీ సిండికేట్ యథేచ్ఛగా కొనసాగిస్తోంది. డిస్టిలరీలు, కల్తీ మద్యం తయారీ యూనిట్లు, దుకాణాలు, బెల్ట్ షాపులు.. అన్నింటినీ సిండికేటే నిర్వహిస్తోంది. ఇదే అదనుగా బ్రాండెడ్ మద్యం పేరిట కల్తీ మద్యాన్ని బరితెగించి విక్రయిస్తోంది. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనని ఎక్సైజ్ శాఖ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024–25లో మద్యం అమ్మకాల ద్వారా రూ.28,500 కోట్ల ఆదాయం వచ్చిoది. 2025–26లో రూ.35 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 2024–25లో 4.26 కోట్ల ఐఎంఎల్ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 4.26 కోట్ల ఐంఎఎల్ మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్లే విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి. దీన్నిబట్టి 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించినట్లు వెల్లడవుతోంది. మొత్తం క్వార్టర్ బాటిళ్లలో మూడోవంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు స్పష్టమవుతోంది. ఒక్కో క్వార్టర్ బాటిల్ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు. అత్యంత హానికరం... ఇటీవల పలువురు హఠాన్మరణం.. టీడీపీ సిండికేట్ సాగిస్తున్న కల్తీ దందా మద్యం ప్రియులకు ప్రాణాంతకంగా మారింది. కల్తీ మద్యం తాగడం అత్యంత హానికరం, తీవ్ర అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (స్పిరిట్)లో వంద శాతం ఆల్కహాల్ ఉంటుంది. అది మనుషులు వినియోగించకూడదు. పరిశ్రమల్లో వివిధ ఉత్పత్తుల (ఆహార ఉత్పత్తులు కాదు) తయారీలో ఉ్రత్పేరకంగా మాత్రమే వాడతారు. స్పిరిట్ను బాగా డైల్యూట్ చేసి ఆల్కహాల్ను 42 శాతానికి తగ్గించాలి. అనంతరమే బ్రాండెడ్ మద్యం తయారీలో వాడాలి. అంతకంటే ఎక్కువ శాతం ఆల్కహాల్ ఉంటే అది ఆరోగ్యానికి తీవ్ర హానికరం. టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న కల్తీ మద్యం యూనిట్లలో ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదు. ప్రమాదకర స్పిరిట్లో కారమిల్, రంగునీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. అది తెలియని పేద, సామాన్య వర్గాలకు చెందినవారు ఆ కల్తీ మద్యాన్ని సేవించడంతో వారి ఆరోగ్యాన్ని కబళిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల పలువురు మద్యం ప్రియులు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలే దీనికి నిదర్శనం. టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ ఈ చావులకు కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. సిండికేట్కు స్పిరిట్ సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో బయటపడిన కల్తీ మద్యం దందాను కప్పిపుచ్చాలని ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్, పోలీసు శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా కొమరగిరిపట్నం, పశ్చిమ గోదావరి పాలకొల్లు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటతోపాటు కడప, అనంతపురంలో కల్తీ మద్యం తయారీ యూనిట్లపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎక్సైజ్శాఖ దాడులు జరిపింది. కల్తీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామగ్రిని జప్తు చేసి కొందరిని అరెస్టు చేశారు. ఆ వెంటనే టీడీపీ పెద్దలు రంగంలోకి దిగడంతో దర్యాప్తు అటకెక్కింది. కల్తీ మద్యం సిండికేట్కు అక్రమంగా స్పిరిట్ను ఎవరు సరఫరా చేస్తున్నారన్నది ఈ కేసులో అత్యంత కీలకం. దీన్ని ఛేదిస్తే మొత్తం సిండికేట్ దందా బయటపడుతుంది. టీడీపీ కీలక నేతల కుటుంబాల ఆధ్వర్యంలో ఉన్న డిస్టిలరీల గుట్టు రట్టు అవుతుంది. అందుకే ప్రభుత్వ పెద్దలు దర్యాప్తునకు బ్రేకులు వేశారు. టీడీపీ నేతల డిస్టిలరీల జోలికి వెళ్లకుండా ఈ కేసును పక్కదారి పట్టించాలని హకుం జారీ చేశారు. కల్తీ మద్యం తయారీ ఇలా... భారీగా స్పిరిట్ తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత టీడీపీ సిండికేట్ కల్తీ మద్యం తయారీ చేపడుతోంది. అందుకోసం కల్తీ మద్యం యూనిట్లలో యంత్ర సామగ్రిని తెప్పించి పక్కాగా వ్యవస్థను నెలకొల్పారు. అక్రమంగా సేకరించిన స్పిరిట్ను డైల్యూట్ (పలుచన) చేసి అందులో కారమెల్, కలర్డ్ ఫ్లేవర్లు (రంగు నీళ్లు) కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పిస్తున్నారు. ఆ కల్తీ మద్యాన్ని బాట్లింగ్ చేసి బ్రాండెడ్ మద్యంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇలా కల్తీ దందా సాగిపోతోంది. కల్తీ మద్యంతో తీవ్ర దుష్ప్రభావాలు ఇలా... » కల్తీ మద్యంలో ఉండే మెటబాలిజ్డ్ యాసిడ్ మిథనాల్ వల్ల నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది. న్యూరోసిస్ లాంటి తీవ్ర వ్యాధుల బారిన పడటంతోపాటు కంటి నరాలు దెబ్బతిని అంధత్వం సోకుతుంది. » ఉదర సంబంధిత జబ్బుల పాలవుతారు. » శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. » హృద్రోగ సమస్యల బారిన పడతారు. » కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంది. » తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. కల్తీ మద్యం దందా సూత్రధారుల పాత్రపై ష్...గప్చుప్» ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎక్సైజ్ శాఖ వెనకడుగు » గుడ్లూరు కేంద్రంగా మూడు జిల్లాల్లో రాకెట్.. » ఎక్సైజ్శాఖ దాడుల్లో ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు లభ్యం.. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందకూరు మండలం గుడ్లూరు కేంద్రంగా కల్తీ మద్యం రాకెట్ బట్టబయలైంది. టీడీపీ సిండికేట్ సభ్యుడైన వీరాంజనేయులు గుడ్లూరులోని మిట్టపాలెంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కల్తీ మద్యం తయారీ మిషన్, ఇతర సామగ్రితో పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేశాడు. చీరాలలో స్వాదీనం చేసుకున్న కల్తీ మద్యం కేసులో కూపీ లాగితే గుడ్లూరు కేంద్రంగా సాగుతున్న దందా డొంక కదిలింది. ఎక్సైజ్శాఖ అధికారుల దాడుల్లో 6,200 ఖాళీ క్వార్టర్ బాటిల్స్తో పాటు 3,500 ఏసీ ప్రీమియం క్వార్టర్ బాటిల్ లేబుళ్లు బయటపడ్డాయి. కల్తీ మద్యం క్వార్టర్ బాటిల్ను రూ.120 చొప్పున విక్రయిస్తూ ఏడాదిగా ఈ రాకెట్ భారీగా కొల్లగొట్టింది. నెల్లూరులో రొట్టెల పండుగను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యాన్ని భారీగా తరలించినట్లు వెల్లడైంది. అందుకోసం 400 లీటర్ల స్పిరిట్ను తెప్పించడం గమనార్హం. వీరాంజనేయులను అరెస్టు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు కల్తీ మద్యం రాకెట్ అసలు సూత్రధారుల గురించి దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. ఉన్నతస్థాయి ఒత్తిళ్లతోనే ఎక్సైజ్ శాఖ అధికారులు వెనక్కి తగ్గినట్టు సమాచారం. టీడీపీ సీనియర్ నేత కుటుంబమే రింగ్ లీడర్అనకాపల్లి కేంద్రంగా టీడీపీ సిండికేట్ కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న టీడీపీ సీనియర్ నేత కుటుంబం దీనికి రింగ్ మాస్టర్గా వ్యవహరిస్తోంది. ఆ కుటుంబానికి డిస్టిలరీల వ్యాపారంతో సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. డిస్టిలరీల నుంచి అక్రమంగా స్పిరిట్ను సరఫరా చేస్తూ కల్తీ మద్యం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. పరవాడలో ఇటీవల కల్తీ మద్యం విక్రయాలపై ఎక్సైజ్శాఖ దాడులు నిర్వహించడంతో ఈ రాకెట్ గుట్టు రట్టైంది. టీడీపీ నాయకుడు రుత్తల రాము, యలమంచిలి వెంకటేశ్వరరావు నుంచి 72 లీటర్ల స్పిరిట్, 180 మిల్లీ లీటర్ల 455 ఖాళీ బాటిళ్లు, 1,389 మూతలు, బాటిళ్లపై అతికించేందుకు ముద్రించిన ఏసీ బ్లాక్ స్టిక్కర్లు, కారామిల్ రసాయనం, యంత్ర సామగ్రిని స్వా«దీనం చేసుకున్నారు. కల్తీ మద్యాన్ని టీడీపీ సిండికేట్కు చెందిన బెల్ట్ దుకాణాల ద్వారా క్వార్టర్ బాటిల్ రూ.130 చొప్పున విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. కల్తీ మద్యం దందాకు రింగ్ లీడర్గా ఉన్న టీడీపీ సీనియర్ నేత కుటుంబ సభ్యులను విచారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు సాహసించకపోవడం గమనార్హం. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా సాగుతున్న దందాపై దృష్టి పెట్టలేదు. గోదావరి జిల్లాల్లో పాలకొల్లు స్థావరంగా... నాలుగు జిల్లాల్లో యథేచ్ఛగా సరఫరా.. గోదావరి జిల్లాల్లో కల్తీ మద్యం రాకెట్ పాలకొల్లును స్థావరంగా చేసుకుంది. పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ యూనిట్ను నెలకొల్పి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పారిస్తోంది. ఇటీవల పాలకొల్లులో కల్తీ మద్యం తయారీ యూనిట్పై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించడంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. నాలుగు జిల్లాల్లో మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాల ద్వారా ఏకంగా 25 శాతం వరకు కల్తీ మద్యాన్నే విక్రయిస్తున్నట్టు సమాచారం. దీని వెనుక పశ్చిమ గోదావరి జిల్లాలో చక్రం తిప్పుతున్న ముఖ్య నేతతోపాటు ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ప్రజా ప్రతినిధి ఉన్నట్లు తెలియడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు వెనక్కి తగ్గారు. కేవలం పాలకొల్లులో అదుపులోకి తీసుకున్న పులి శీతల్ అరెస్టుతో సరిపెట్టారు.

వర్షం లోటు..సాగు తడబాటు!
పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.. ఈ ఏడాది వ్యవసాయానికి తగ్గట్టుగా వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నం. నాతో పాటు చాలామంది రైతులు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి పత్తి పంట వేశారు. కానీ వర్షాలు సరిగా లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. నేను మూడున్నర ఎకరాల్లో రెండుసార్లు గింజలు పెడితే ఎకరన్నరలోనే ఓ తీరుగా మొలిచినయ్. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – మురావత్ రాంసింగ్, లోక్యతండా, వేలేరు మండలం, హనుమకొండ జిల్లాసాక్షి ప్రతినిధి, వరంగల్: ఈ వానాకాలం సీజన్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో రైతాంగం సతమతమవుతోంది. ముఖ్యంగా జూలైలో పది రోజులు దాటినా ఇప్పటివరకు సరైన వర్షాలు లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మేలో వర్షాలు కురవడంతో మురిసిపోయిన రైతాంగం.. గతేడాదిలా ఈసారి కూడా సాగు సాఫీగా సాగుతుందని భావించారు. కానీ వానాకాలం సీజన్ ముగింపు దశకు చేరుకున్నా ఇంకా లోటు వర్షపాతమే ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 42.48 శాతం విస్తీర్ణంలోనే పంటల సాగు జరిగింది.ఈ సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 56,26,243 (42.48 శాతం) ఎకరాల్లోనే రైతులు వివిధ పంటలు వేశారు. అయితే సరైన వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టుబడి సైతం దక్కే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. లోటు వర్షపాతంతో కష్టకాలం గత సీజన్లో ఈ సమయానికి రాష్ట్ర సగటు వర్షపాతం 191.90 సె.మీ.లు ఉండాల్సి ఉండగా..అంతకు మించి 224.90 సె.మీ.లు నమోదు అయ్యిది. అయితే ఈ సీజన్లో మాత్రం అతి తక్కువగా కేవలం 165.5 సె.మీ.లే నమోదు కావడం గమనార్హం. గత సీజన్లో కరీంనగర్, ములుగు, ఖమ్మం, బి.కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 20 నుంచి 59 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాలలలో 60 శాతానికి పైగా (లార్జ్ ఎక్సెస్) వర్షం పడగా, 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.అయితే ఈసారి మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సూర్యాపేట, యాదగిరి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షాపాతం ఉంది. తక్కిన 23 జిల్లాల్లో 19 శాతం వరకు లోటు వర్షం ఉంది. ఈ నేపథ్యంలోనే సాగు నెమ్మదించిందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఒక్క ఆదిలాబాద్లోనే 95% మించి సాగు ఈ వానాకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో సాగు అంచనా 5,77,255 ఎకరాలు అయితే 5,51,573 (95.55 శాతం) ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. అంటే ఆదిలాబాద్లో దాదాపు అంచనాలకు తగినట్టుగా సాగు జరిగిందన్న మాట. ఆ తర్వాతి స్థానాల్లో కేబీ ఆసిఫాబాద్ (76.33 శాతం), సంగారెడ్డి (66.81 శాతం), నిజామాబాద్ (65.36 శాతం), బి.కొత్తగూడెం (61.85 శాతం) జిల్లాలు ఉన్నాయి. ఇక అతి తక్కువ విస్తీర్ణంలో సాగైన జిల్లాల్లో వనపర్తి 2,46,582 ఎకరాలకు గాను 17,879 (7.25 శాతం) ఎకరాల్లో సాగుతో మొదటి స్థానంలో ఉంది.ఇక సూర్యాపేటలో 5,81,915 ఎకరాలకు 44,195 (7.59 శాతం) ఎకరాలలో, మెదక్లో 3,37,641 ఎకరాలకు 32,789 (9.71 శాతం) ఎకరాలలో, ఎం.మల్కాజిగిరిలో 23,430 ఎకరాలకు గాను 2,583 (11.02 శాతం) ఎకరాల్లో, ములుగులో 1,26,973 ఎకరాలకు 19,877 (15.65 శాతం) ఎకరాల్లో పంటలు వేశారు. కాగా ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు పత్తి పంటపైనే ఆసక్తి చూపారు. పత్తి సాగు అంచనా 48,93,016 ఎకరాలకు గాను 36,30,988 (74.21 శాతం) ఎకరాలలో సాగయ్యింది. వరిసాగు అంచనా 62,47,868 ఎకరాలకు గాను కేవలం 5,01,129 (8.02 శాతం) ఎకరాల్లోనే సాగయ్యింది. వర్షాలు లేకపోవడం వరిసాగుపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ప్రత్యామ్నాయంగా తృణ ధాన్యాలు, ఆహారేతర పంటలు... వర్షాభావం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం ఈసారి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపింది. ముఖ్యంగా ప్రధాన తృణ ధాన్యాలు (మిల్లెట్స్), ఆహారేతర పంటలపై దృష్టి పెట్టినట్లు సాగు విస్తీర్ణాన్ని బట్టి అవగతమవుతోంది. మేజర్ మిల్లెట్స్ (జొన్న, మొక్కజొన్న, రాగులు) 5,73,643 ఎకరాల్లో సాగవచ్చని అంచనా వేయగా అంచనాలకు తగినట్టుగా 5,61,240 (97.84 శాతం) ఎకరాల్లో ఈ పంటలు వేశారు. మొక్కజొన్న 5,21,206 ఎకరాలకు గాను 5,34,318 (102.52 శాతం) ఎకరాలలో సాగైంది. ఆహారేతర పంటలు 1,02,576 ఎకరాలు అంచనా వేయగా రెట్టింపునకు మించి 2,35,614 (229.70 శాతం) ఎకరాల్లో రైతులు దైంచా, పిల్లిపెసర, సన్ హెంప్, పారాగ్రాస్, మేత జోవార్లు సాగు చేశారు. నారు పోసిననప్పటి నుంచి వానలు లేవు.. మే నెలలో వానలు పడితే ఈసారి కాలం మంచిగనే అయితది అనుకున్నం. ఆ వానలు తప్ప మల్ల చినుకు పడలేదు. ఆలస్యంగనైన వరి ఏద్దమని ఆగినం. పది రోజుల కింద మబ్బులు చేసి తుంపురు తుంపురు వానలు పడ్డయి. కాలం మంచిగైతే నాట్లు వేసుకోవచ్చని నమ్మి నారు పోసినం. ఇగ వర్షాలు పడుతలేవు. చెరువులు, కుంటలల్ల కూడా నీళ్లు లేవు. ఎటూ తోస్తలేదు. – యెడబోయిన పద్మ, మహిళా రైతు, గ్రామం బేతోల్, మహబూబాబాద్ జిల్లా వానాకాలం 2025 సాగు ప్రణాళిక.. సాగైన విస్తీర్ణం (ఎకరాలలో) – ఈ వానాకాలం సాగు అంచనా ః 13244305 – ఇప్పటివరకైన సాగు విస్తీర్ణంః 5626243 – పత్తి సాగు అంచనాః 4893016 – సాగైన పత్తి విస్తీర్ణంః 3630988 – వరిసాగు అంచనాః 6247868 – సాగైన వరి విస్తీర్ణంః 501129 – మొక్కజొన్న సాగు అంచనాః 521206 – సాగైన మొక్కజొన్న విస్తీర్ణంః 534318

కాయలు పారబోశారని.. అక్రమ కేసులు
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ కూటమి సర్కారు మోసాలను ఎండగడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జనంలోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అంతటితో ఆగడం లేదు! వైఎస్ జగన్ పర్యటనల్లో పాల్గొన్న వారిని, పార్టీ కార్యక్రమాలకు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకుని వెంటాడుతోంది. ప్రధానంగా రైతులు, యువత, వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్ అక్కడకు వెళ్లగా తాజాగా కూటమి ప్రభుత్వం పలువురు రైతులపై అక్రమ కేసులు మోపింది. మామిడికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై కాయలు పారబోసినందుకు బంగారుపాళ్యంలో రైతులపై పోలీసులు శుక్రవారం అక్రమ కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా తుంబపాళ్యానికి చెందిన రైతు దేవేంద్ర, తిమ్మోజుపల్లెకు చెందిన రైతులు ప్రకాష్రెడ్డి, భగత్రెడ్డి, తుంబపాళ్యానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు అక్బర్, ఉదయ్పై కేసులు బనాయించారు. మామిడికి గిట్టుబాటు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ బంగారుపాళెం మార్కెట్యార్డును సందర్శించిన విషయం తెలిసిందే. గిట్టుబాటు ధరలేక నష్టపోతున్న మామిడి రైతన్నలు తమ గోడు చెప్పుకునేందుకు పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైఎస్ జగన్ పర్యటనకు లభించిన స్పందన చూసి ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు పోలీసులను ప్రయోగించి సరికొత్త నాటకానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది.పిలవని పేరంటానికి హాజరై...!ఈనెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారు. అక్కడకు వేలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరాగా, ఆహ్వానం లేకున్నా ఎల్లో మీడియా కూడా దూరిపోయింది! అసలు ఈ కార్యక్రమానికి తాము ఎల్లో మీడియాను పిలవలేదని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో బంగారుపాళ్యం చేరుకున్న పచ్చ మీడియాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. మామిడికి గిట్టుబాటు ధర దక్కడం లేదని కాయలను కింద పోసి నిరసన వ్యక్తంచేస్తున్న రైతులను ఉద్దేశించి.. ‘మీకు బుద్ధుందా..? ఏం చేస్తున్నారు..? అన్నం తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా...?’ అంటూ దుర్భాషలాడి రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో మాటామాట పెరిగి తోపులాట చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ ఫోటోగ్రాఫర్ బంగారుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి. తమ అనుకూల మీడియాకు చెందిన ప్రతినిధి కావడంతో సీఎం చంద్రబాబు నుంచి ఆయన తనయుడు, మంత్రులు వరుస ట్వీట్లు పెడుతూ ఆగమేఘాలపై స్పందించారు. నిందితులను వదిలేది లేదని, చట్టరీత్యా చర్యలు తప్పవంటూ మామిడి రైతుల సమస్యను డైవర్ట్ చేశారు. చిత్తూరుకు చెందిన చక్రి తనపై దాడి చేయలేదని, తన కెమెరాను అతడే కాపాడాడని ఫోటోగ్రాఫర్ చెబుతున్నా ఖాకీలు పరిగణలోకి తీసుకోలేదు. ‘కేసు ఇప్పుడు మా పరిధిలో లేదు...! సీఎం వరకు వెళ్లిపోయింది.. నువ్వు ఏదిపడితే అది మాట్లాడొద్దు.. మేమేం చెబితే అది చెయ్.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టు.. ఏం జరిగిందో కూడా మేమే చెబుతాం.. అందరికీ అలాగే చెప్పు..’’ అంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా..ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఫోటోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకుండా ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు అనుమానితుల పేరిట వైఎస్సార్సీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి నుంచే పలువురు కార్యకర్తలను అక్రమంగా నిర్భందించారు. గంగాధర నెల్లూరుకు చెందిన వైఎస్సార్సీపీ మండల ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు కె.మోహన్, మండల సోషల్ మీడియా కో–కన్వీనర్ వినోద్, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి అనుచరుడు చక్రవర్తి (చక్రి), పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అనుచరుడు ఆచార్య, పూతలపట్టుకు చెందిన మరికొంత మందిని అక్రమంగా నిర్భందించి అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులుగా బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో నిర్భందించి శుక్రవారం చిత్తూరులోని పోలీసు శిక్షణా కేంద్రానికి (డీటీసీ) తరలించారు. అక్కడకు వెళ్లిన న్యాయవాదులను లోపలకు అనుమతించలేదు. ఫొటోగ్రాఫర్ను కులం పేరు చెప్పాలంటూ బెదిరించి ఆయుధాలతో దాడి చేశారంటూ అట్రాసిటీ, హత్యాయత్నం కింద నాన్ బెయిలబుల్ సెక్షన్లు బనాయించి కేసు నమోదు చేశారు. దాదాపు 20 మందికి పైగా వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అక్రమంగా నిర్భందించగా మరి కొందరి కోసం ఓ బృందం బెంగళూరుకు వెళ్లినట్లు చెబుతున్నారు.హెబియస్ కార్పస్ పిటిషన్.హెబియస్ కార్పస్ పిటిషన్.!తమ శ్రేణుల అక్రమ నిర్భందంపై వైఎస్సార్సీపీ నాయకులు హైకోర్టు తలుపు తట్టడానికి సిద్ధమవుతున్నారు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన వారి పేర్లను సేకరించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.ఎల్లో మీడియాపై రైతన్న కన్నెర్ర..బంగారుపాళ్యంలో మామిడి రైతుల ఆవేదనను ‘సాక్షి’ ప్రచురించిన నేపథ్యంలో ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. ‘సాక్షి’ మీడియాకు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమేనా..? మీతో బలవంతంగా చెప్పించారా..? అంటూ రైతులను ఆరా తీస్తోంది. అయితే మామిడి రైతులను రౌడీలు, గొంతులు కోసే ఉన్మాదులతో ఎల్లో మీడియా పోల్చడం, దండుపాళ్యం బ్యాచ్గా అభివర్ణించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న అన్నదాతలు వారిపై మండిపడుతున్నారు.తప్పుడు ఫిర్యాదుతో అక్రమ నిర్భందం..సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు బంగారుపాళ్యం ఘటన మరో నిదర్శనం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు తరలి వచ్చిన జన సముద్రాన్ని చూసి జీర్ణించుకోలేని కూటమి నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో మా పార్టీ కార్యకర్తలను అక్రమంగా నిర్భందించారు. కుప్పంలో ఓ వార్త రాసినందుకు అక్కడి సాక్షి విలేకరిపై తప్పుడు కేసు పెట్టారు. వాట్సాప్ గ్రూపులో ఎవరో ఏదో పెడితే మరో టీవీ ఛానల్ రిపోర్టర్పై కేసు పెట్టారు. వారిని సీఎం స్థాయిలో చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు? మీడియాలో మీకు అనుకూలంగా ఉన్నవారికి ఒక న్యాయం, నిజాలు నిర్భయంగా ఎలుగెత్తే వారికి మరో న్యాయమా..? పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తున్న పోలీసులను చట్టం ముందు నిలబెడతాం. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షుడుఅక్రమ కేసులు బనాయించారు..మా కార్యక్రమానికి రావాలని మేమేమైనా పచ్చ మీడియాను ఆహ్వానించామా..? గొడవ చేసి దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులకు శ్రీకారం చుట్టారు. ఆ ఫోటోగ్రాఫర్ను ఎవరు కొట్టారు..? నాపేరు ఎలా చెబుతారు..? కుప్పంలో పని చేస్తున్న సాక్షి రిపోర్టర్, మరి కొంతమందిపై టీడీపీ నేతలు తప్పుడు ఫిర్యాదు ఇస్తే.. ఎస్పీ అక్రమ కేసులు బనాయించారు. జిల్లావ్యాప్తంగా మావారిని 25 మందికిపైగా రెండు రోజులుగా అదుపులోకి తీసుకుని వేధిస్తున్నా ఎస్పీ నోరు మెదపడంలేదు. హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టాలని కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పోలీసులకు చెబుతున్నారు. మా నియోజకవర్గానికి చెందిన ఎస్సీ యువకులను అక్రమంగా నిర్బంధించారు. దీనికంతటికీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – కె.నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి. కాపాడినందుకు కేసా..? ఆ ఫోటోగ్రాఫర్ను ఎవరో తోస్తా ఉంటే మా ఆయనే కాపాడారని చెప్పారు. కెమెరా ఎక్కడ విరిగిపోతుందోనని కెమెరాను పట్టుకున్నారు. కాపాడిన పాపానికి మా ఆయన్ను ఇరికించాలని చూస్తున్నారు. చక్రి నన్ను కాపాడాడు అని ఆసుపత్రిలో ఆ ఫోటోగ్రాఫరే చెప్పారు. ఇప్పుడు ఓ డీఎస్పీ స్ట్రిప్టు రాసిచ్చి, దీని ప్రకారం ఇవ్వాలని ఫోటోగ్రాఫర్తో అబద్ధపు ఫిర్యాదు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం యూనిఫామ్ వేసుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఇంట్లో అన్నం తింటా ఉన్న నా భర్తను ఇప్పుడే పంపిస్తామని తీసుకెళ్లారు. ఇప్పటివరకు నా భర్త ఆచూకీ చెప్పలేదు. చిత్తూరు డీటీసీ వద్ద ఉన్నారని తెలిసి అక్కడకు వెళితే లోపలకు కూడా పంపలేదు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నా. పోలీసులు తప్పుడు కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారా..? – కవిత, చక్రవర్తి (చక్రి) భార్య, చిత్తూరు.నా భర్తకు ఏదైనా జరిగితే ఎస్పీదే బాధ్యతజగన్పై అభిమానంతో చూడడానికి మా ఇంటాయన అక్కడికి పోయినాడు. ఫోటోగ్రాఫర్ను ఎవరో తోస్తా ఉంటే మా ఆయన పక్కన నిలబడి ఉన్నాడు. అంతే.. ఇంట్లో ఉన్నోడిని ఇప్పుడే పంపిస్తామని పోలీసులు తీసుకుపోయినారు. ఇంతవరకు పంపలేదు. నా భర్తకు ఒక కన్ను కనిపించదు. షుగర్ కూడా ఉంది. రోజూ మూడుసార్లు మాత్రలు వేసుకోవాలి.చిత్తూరు డీటీసీలో ఉండానని చెబితే అక్కడి పోయినాము. ఆ అడవిలో నా భర్తను చూపీకుండా పోలీసులు తరిమేసినారు. ఇపుడు కేసులు పెడతామంటా ఉండారు. మేమే ఎస్సీలైతే మాపైనే ఎట్లా అట్రాసిటీ కేసు పెడతారు..? నా భర్తకు జరగరానికి ఏదైనా జరిగితే ఎస్పీనే బాధ్యత వహించాలి. – రాసాత్తి, మోహన్ భార్య, గంగాధరనెల్లూరు.

ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.విదియ సా.6.23 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.7.25 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.11.29 నుండి 1.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.32 నుండి 7.17 వరకు, అమృతఘడియలు: రా.9.14 నుండి 10.53 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35.మేషం: అప్రయత్న కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. నూతన విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.వృషభం: రాబడికి మించిన ఖర్చులు. వ్యయప్రయాసలు. మిత్రులు, బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు.మిథునం: కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.కర్కాటకం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కొత్త పరిచయాలు. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది.సింహం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో పురోగతి. కొన్ని వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.కన్య: బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. పనులలో తొందరపాటు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.తుల: కుటుంబంలో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.వృశ్చికం: వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.ధనుస్సు: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.మకరం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల ద్వారా కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.కుంభం: ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.మీనం: రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు కీలక సమాచారం రావచ్చు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

బుమ్రా కూల్చాడు... ఇక బ్యాటర్లే నిలబెట్టాలి
మూడో టెస్టు రెండో రోజు రసవత్తర ఆటకు తెరలేచింది. తొలిరోజంతా కష్టపడినా బుమ్రా ఒక వికెట్ మాత్రమే తీస్తే... రెండో రోజు తొలి సెషన్లోనూ వైవిధ్యమైన బంతులతో ఇంగ్లండ్ ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కూల్చేశాడు. అయితే భారత బ్యాటింగ్ మాత్రం తడబడింది. ఆరంభంలోనే విలువైన వికెట్లను కోల్పోయింది. మొదటి రోజు 4 వికెట్లు పడితే... రెండో రోజు ఆటలో 9 వికెట్లు కూలాయి. ఇరుజట్లు బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్తోనే సత్తా చాటుకున్నాయి. లండన్: భారత ప్రీమియర్ బౌలర్ బుమ్రా తానెంత విలువైన ఆటగాడో మరోసారి చాటుకున్నాడు. తొలిరోజు శ్రమించినా దక్కని సాఫల్యం రెండో రోజు ఆరంభంలోనే సాధ్యమైంది. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లను తొలి సెషన్ మొదలైన కొద్దిసేపటికే అవుట్ చేశాడు. భారత్ పట్టుబిగించేలా చేశాడు. నింపాదిగానే పరుగులు చేద్దామనుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లపై నిప్పులు చెరిగాడు. ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాట వేసినా... బుమ్రా బాధ్యతగా అడ్డుకట్ట వేశాడు. అయితే టీమిండియా ఇన్నింగ్సే సానుకూల దృక్పథంతో మొదలవలేదు.ఆతిథ్య బౌలర్లు కీలక వికెట్లను తీసి మ్యాచ్ను రసపట్టుగా మార్చేశారు. ముందుగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 112.3 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ జో రూట్ (199 బంతుల్లో 104; 10 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... వికెట్ కీపర్ జేమీ స్మిత్ (56 బంతుల్లో 51; 6 ఫోర్లు), బౌలర్ బ్రైడన్ కార్స్ (83 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత స్పీడ్స్టర్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (113 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు), కరుణ్ నాయర్ (62 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. ఆర్చర్, వోక్స్, స్టోక్స్ తలా ఒక వికెట్ తీశారు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 242 పరుగుల దూరంలో ఉంది. బుమ్రా పేస్... స్టోక్స్, రూట్ క్లీన్బౌల్డ్ రెండో రోజు ఆరంభాన్ని భారత పేస్ స్టార్ బుమ్రా దెబ్బతీశాడు. ఓవర్నైట్ స్కోరు 251/4తో శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ కాసేపటికే కెప్టెన్ స్టోక్స్ (44) వికెట్ను కోల్పోయింది. సెంచరీ మురిపెం పూర్తవగానే రూట్ వికెట్ పడింది. ఈ ఇద్దరూ క్లీన్ బౌల్డయ్యారు. రూట్ అవుటైన మరుసటి బంతికే క్రిస్ వోక్స్ (0) డకౌట్ అయ్యాడు! ముగ్గుర్ని బుమ్రానే అవుట్ చేశాడు. బుమ్రా పేస్కు విలవిలలాడిన ఇంగ్లండ్కు స్మిత్ క్యాచ్ నేలపాలవడం వరమైంది. సిరాజ్ బౌలింగ్లో రాహుల్ క్యాచ్ చేజార్చినపుడు అతని స్కోరు 5 మాత్రమే.ఈ లైఫ్లైన్తో కార్స్తో కలిసి ఇంగ్లండ్ పోటీ స్కోరుకు స్మిత్ బాట వేశాడు. ముందుగా ఇద్దరు జట్టు స్కోరును 300 దాటించారు. తర్వాత క్రీజులో పాతుకుపోయి ఎనిమిదో వికెట్కు 84 పరుగులు జోడించారు. ఫిఫ్టీ పూర్తయ్యాక మళ్లీ సిరాజ్కే అతని వికెట్ దక్కింది. బుమ్రా... ఆర్చర్ (4)ను ఎక్కువసేపు నిలువనీయలేదు. అయితే కార్స్ అడపాదడపా బౌండరీలు, ఓ భారీ సిక్సర్తో అర్ధసెంచరీ చేసుకున్నాడు. 387 వద్ద సిరాజ్ అతన్ని అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.యశస్వి, గిల్ విఫలం ఆరంభం నుంచే దూకుడుగా ఆడుదామనుకున్న యశస్వి జైస్వాల్ (13; 3 ఫోర్లు) జోరుకు ఆర్చర్ ఆదిలోనే అడ్డుకట్ట వేశాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్తోనే అంతర్జాతీయ టెస్టుల్లో పునరాగమనం చేసిన ఆర్చర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్తో సత్తా చాటుకున్నాడు. ఈ దశలో రాహుల్కు కరుణ్ నాయర్ జతయ్యాడు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్ని నింపాదిగా పరుగులు రాబట్టారు. ఈ జోడీ క్రీజులో పాగా వేస్తున్న సమయంలోనే నాయర్ వికెట్ తీసిన స్టోక్స్ రెండో వికెట్కు 61 పరుగులు భాగస్వామ్యానికి తెరదించాడు.తర్వాత ఈ సిరీస్లో భీకరమైన ఫామ్లో ఉన్న భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 16; 2 ఫోర్లు)ను వోక్స్ అవుట్ చేసి ఇంగ్లండ్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఇలా 107 పరుగులకే టీమిండియా కీలకమైన 3 వికెట్లు కోల్పోంది. దీంతో రాహుల్ బాధ్యతగా ఆడి అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా... గాయంతో కీపింగ్ చేయలేకపోయినా రిషభ్ పంత్ (19 బ్యాటింగ్; 3 ఫోర్లు) బ్యాటింగ్లో కుదురుగా ఆడాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ 23; పోప్ (సి) సబ్–జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బి) బుమ్రా 104; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బి) బుమ్రా 44; స్మిత్ (సి) సబ్–జురేల్ (బి) సిరాజ్ 51; వోక్స్ (సి) సబ్–జురేల్ (బి) బుమ్రా 0; కార్స్ (బి) సిరాజ్ 56; ఆర్చర్ (బి) బుమ్రా 4; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 31; మొత్తం (112.3 ఓవర్లలో ఆలౌట్) 387.వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172, 5–260, 6–271, 7–271, 8–355, 9–370, 10–387.బౌలింగ్: బుమ్రా 27–5–74–5, ఆకాశ్దీప్ 23–3–92–0, సిరాజ్ 23.3–6–85–2; నితీశ్ కుమార్ 17–0–62–2, జడేజా 12–1–29–1, సుందర్ 10–1–21–0. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 13; రాహుల్ (బ్యాటింగ్) 53; కరుణ్ (సి) రూట్ (బి) స్టోక్స్ 40; గిల్ (సి) స్మిత్ (బి) వోక్స్ 16; పంత్ (బ్యాటింగ్) 19; ఎక్స్ట్రాలు 4; మొత్తం (43 ఓవర్లలో 3 వికెట్లకు) 145.వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107.బౌలింగ్: వోక్స్ 13–1–56–1, ఆర్చర్ 10–3–22–1, కార్స్ 8–1–27–0, స్టోక్స్ 6–2–16–1, బషీర్ 6–1–22–0. ⇒ 37 టెస్టుల్లో జో రూట్ సెంచరీల సంఖ్య. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్వస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.⇒ 211 టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు తీసుకున్న ఫీల్డర్గా జో రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 210 క్యాచ్లతో రాహుల్ ద్రవిడ్ (భారత్) పేరిట ఉన్న రికార్డును రూట్ సవరించాడు.⇒ 11 భారత్పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా స్టీవ్ స్మిత్ (11) పేరిట ఉన్న రికార్డును జో రూట్ (11) సమం చేశాడు.⇒ 4 లార్డ్స్ మైదానంలో వరుసగా మూడు సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్గా రూట్ గుర్తింపు పొందాడు. గతంలో మైకేల్ వాన్, జాక్ హాబ్స్, దిలీప్ వెంగ్సర్కార్ ఈ ఘనత సాధించారు.

మారక నిల్వలు కరిగిస్తేనే కదలిక!
మోదీ ప్రభుత్వం చెప్పుకొనే గొప్పల్లో తరచూ వినిపించేవి... విదేశీ మారక ద్రవ్య నిల్వలు! ఆయన వచ్చిన తర్వాత ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 700 బిలి యన్ డాలర్లకు పెరిగాయి (2025 జూన్ నాటికి). ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనా వద్ద 3 ట్రిలియన్ (3,000 బిలియన్లు లేదా 3 లక్షల కోట్లు) డాలర్లు ఉన్నాయి. గతంలో చైనా ఫారెక్స్ నిల్వలు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉండేవి. చైనా తర్వాత జపాన్ (1.25 ట్రిలియన్ డాలర్లు), స్విట్జర్లాండ్ (800 బిలియన్ డాలర్లు) ఆగ్రస్థానంలో నిలుస్తాయి. మారక ద్రవ్య నిల్వలు ఇంత అధికంగా ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో లేదు. ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక చక్ర వ్యూహంలో చిక్కుకుంది. ఎలా బయట పడాలో తెలియడం లేదు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఉత్తేజపరచడానికి కొత్త పెట్టుబడులు ఇబ్బడి ముబ్భడిగా రావాలి. కానీ ప్రభుత్వం వాటిని ఆకర్షించలేక పోతోంది. 2004–14 మధ్య మన ఎకానమీ అసాధారణ వృద్ధి సాధించింది. తర్వాత ఆ ఊపు కనబడటం లేదు. యూపీఏ పాలన సాగిన పదేళ్లలో సాధించిన ప్రగతికి 7.7 శాతం సగటు వృద్ధి రేటే నిదర్శనం. గడచిన పదేళ్లలో ఈ సగటు అంతకంటే తక్కువగా 6.2 గానే నమోదైంది.ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు!అయితే, యూపీఏ హయాం చివరి రెండేళ్లలో ఎకానమీ మంద గించింది. పెట్టుబడుల వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్ – క్యాపెక్స్) భారీగా క్షీణించడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొ నాలి. దురదృష్టవశాత్తూ అదే ట్రెండ్ ఎన్డీయే హయాంలోనూ కొన సాగుతోంది. భారత ఆర్థిక వృద్ధి నేటికీ చాలావరకు ప్రభుత్వ పెట్టు బడి మీదే ఆ«ధారపడుతోంది. పెట్టుబడులు ఎందుకు పడిపోతు న్నాయి? ప్రభుత్వం దగ్గర కాసులు లేవు. యూపీఏ పాలన నాటి అధిక సబ్సిడీలను ఎన్డీయే ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. దీనికి తోడు, ఏడో వేతన సంఘం సిఫారసులు అమలు వల్ల వేతనాలు 23 శాతం (రూ. లక్ష కోట్లు) పెరిగాయి. తనకు ముందు సంవత్సరాల మందగమనాన్నుంచి ఎకానమీని గట్టెక్కించి పరుగులు తీయిస్తానని మోదీ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచుతానన్నారు. 100 కొత్త సిటీలు, హైస్పీడ్ రైళ్ల నేషనల్ నెట్వర్క్, దేశ వ్యాప్త నదుల అనుసంధానం, ఇంకా ఇలాంటి పలు భారీ ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్టు వాగ్దానం చేశారు. 100 కొత్త నగరాల నిర్మాణం కాస్తా 100 స్మార్ట్ సిటీలకు పరిమితమైంది.స్మార్ట్ సిటీలంటే ఉచిత వైఫై నెట్వర్కులు ఏర్పాటు చేయడమే. ఇక దేశవ్యాప్త హైస్పీడ్ రైళ్ల నెట్వర్క్ కాస్తా అహ్మదాబాద్ – ముంబాయి బుల్లెట్ ట్రెయిన్గా రూపాంతరం చెందింది. అది కూడా ఆర్థికంగా ఓ గుదిబండ అయ్యేట్లుంది. ఇతర వాగ్దానాలు సైతం ‘ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షల రూపాయల జమ’ లాంటి జుమ్లాల జాబితాలో చేరాయి. దెబ్బ మీద దెబ్బఆ తర్వాత రెండు అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో ఒకటైన పెద్దనోట్ల రద్దు (డీమానిటైజేషన్) చర్య అసంఘటిత రంగపు దినసరి వేతన జీవులను చావుదెబ్బ తీసింది. దేశ జీడీపీలో 40 శాతం ఈ రంగం నుంచే సమకూరుతుంది. ఉపాధి పరంగా చూసినా, మొత్తం 45 కోట్ల మందిలో 90 శాతం మంది ఈ రంగం నుంచే ఉపాధి పొందుతున్నారు. రెండో చర్య జీఎస్టీ తొందరపాటు అమలు. ఈ రెండు చర్యల వల్ల కచ్చితంగా ఎంత మంది ఉపాధి కోల్పోయారో ఇప్పటికీ గణాంకాలు లభ్యం కావడం లేదు. అంచ నాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా నిర్మాణ రంగం, ఫుడ్, రిటెయిల్ రంగాల్లో ఉపాధి నష్టం భారీగా జరిగింది. ఈ నిర్ణ యాలు 2–3 కోట్ల మంది పొట్ట గొట్టి ఉంటాయని అంచనా. సరైన ఆలోచన లేకుండా జీఎస్టీని తొందరపడి అమలు చేయడం వల్ల ఉత్పత్తిపై ప్రభావం పడింది. తుది గడువు తక్కువగా ఉండటంతో డీలర్లు స్టాక్స్ తగ్గించుకున్నారు. దాంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించాయి. జీఎస్టీ ఇన్పుట్, ఔట్పుట్ రేట్లు పొంతన లేకుండాఉండటం వల్ల గందరగోళం మరింత పెరిగింది. మొదటి నెల రూ. 95 వేల కోట్ల వసూళ్లు ఉన్నా, అందులో రూ. 65 వేల కోట్లు తర్వాత రీఫండ్ చేయాల్సి వచ్చింది. కానీ అన్ని నిధులు ప్రభుత్వం వద్ద లేవు. దాదాపు రూ. 50 వేల కోట్ల వ్యయానికి నిధులు సమకూర్చు కునేందుకు వీలుగా జీడీపీలో 3.2 శాతం మించకూడదన్న ద్రవ్య లోటు లక్ష్యాన్ని సడలించుకోవలసి వచ్చింది. ఈ స్వయంకృత అపరా ధాలకు కోవిడ్ వైపరీత్యం తోడైంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. వినియోగం తగ్గింది. దాంతో ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా వినియోగం మరింత తగ్గింది. ఈ విషవలయం నుంచి ఆర్థిక వ్యవస్థను తిరిగి ఒడ్డున పడేయాలంటే, ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరగాలి. తద్వారా ప్రజల చేతికి డబ్బు వస్తుంది. తిరిగి వినియోగం, ఉత్పత్తి పెరుగుతాయి. ప్రభుత్వం సబ్సిడీలను అర్థవంతంగా తగ్గిస్తే తప్ప పెట్టుబడి వ్యయం పెంచలేదు. రాజకీయంగా ఇది సాధ్యం కానిది. కానీ ఎలాగైనా పెట్టుబడులు పెంచాలి. వాస్తవికతను విస్మరించకుండానే సృజనాత్మక ప్రణాళికలు రూపొందించుకోవాలి. పెట్టుబ డులు పెంచాలి. తద్వారా వినియోగం పెరగాలి. ఈ పెట్టుబడుల ప్రణాళిక కోసం నిధులు అవసరం. ఈ డబ్బు సమ కూర్చుకోడానికి మోదీ అటూ ఇటూ పరుగులు తీయాల్సిన పని లేదు. డబ్బే డబ్బు!ప్రభుత్వం డబ్బు పాతర మీద కూర్చుని ఉంది. దశాబ్దాలుగా పోగుపడిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు (ఇందులో అమెరికాబ్యాంకుల్లో మూలుగుతున్నవి 135 బిలియన్ డాలర్లు) కొండంతఅండగా కలిసి వస్తాయి. ఈ రిజర్వులు మన విదేశీ రుణాల్లో(736 బిలియన్ డాలర్లు) సుమారు 95 శాతానికి సమానం. ఫారెక్స్ రిజర్వుల్లో నాలుగో వంతు హాట్ మనీ (అంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థల స్వల్ప కాలిక పెట్టుబడులు) ఉపసంహ రణల కోసం పక్కన పెట్టినా, మన దగ్గర ఇంకా చాలా డబ్బు చేతిలోఉంటుంది. ఇందులో ఎంత వాడుకోగలమన్నది ఇప్పుడు ఆలోచించాలి. కౌశిక్ బసు (ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త) ప్రకారం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సిఏడీ)కి సరిపడా ఉంటే చాలు. (ప్రస్తుత కరెంట్ ఖాతా లోటు 11 బిలియన్ డాలర్లు – వస్తుసేవల ఎగుమతులు, విదేశీ పెట్టుబడుల మీద వచ్చే ఆదాయం కంటే దిగుమతులకు చేసే చెల్లింపులు, విదేశీ పెట్టుబడుల మీద వెనక్కు పోయే ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు). సింపుల్గా చెప్పాలంటే, కనీసం 6 నెలల దిగుమతులకు సరి పడా మారక ద్రవ్యం నిల్వ పెట్టుకుంటే చాలని ‘వాషింగ్టన్ కన్సెన్సస్’ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా దేశీయ వినియోగదారుల కోసం తాము ఎందుకు చౌకగా నిధులు సమకూర్చాలన్న భావనతో చైనా తన విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఒక ట్రిలియన్ డాలర్లు తగ్గించుకుంది. మనం కూడా దాన్ని 100 బిలియన్ డాలర్లకు తగ్గించుకునే యోచన చేయాలి. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నెలకొల్పి, దానిలోకి అదనపు ఫారెక్స్ రిజర్వులను కొంచెంకొంచెంగా తరలిస్తూ పోవాలి. ఇది ఇండియాలో పెట్టుబడి పెట్టేఇండియా సావరిన్ ఫండ్ అవుతుంది. దీని ద్వారా పెట్టుబడులు సమ కూర్చుకునే సంస్థలు తమకు అవసరమైన వాటిని దేశీయంగా సమ కూర్చుకోవాలన్న నిబంధన పెట్టాలి. తద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఆచరణలోకి వస్తుంది. పెట్టుబడులు ఊపందుకుని ఆర్థిక వ్యవస్థ ఒడ్డున పడేందుకు ఇదొక అత్యుత్తమ మార్గం.-వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com-మోహన్గురుస్వామి

ఘోరం... ఇది దారుణం!
‘గర్భ’ గుడిలో జీవం పోసుకోవటంతో మొదలై కడదాకా అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటున్న ఆడపిల్లకు మృత్యువు తరచు తారసపడుతుంటుంది. అది పుట్టినిల్లా, మెట్టినిల్లా, నడివీధా, జనసమ్మర్ధం లేని ప్రాంతమా అనే తారతమ్యం లేదు. హంతకులు ఏ రూపంలో వుంటారో, ఎక్కడ కాపుగాస్తారో తెలియదు. తండ్రా, సోదరుడా, కట్టుకున్నవాడా, అపరిచితుడా అనే తేడా కూడా లేదు. ఉసురు తీసేవాడు ఎవడైనా కావొచ్చు. కారణం ఏదైనా ఉండొచ్చు. హరియాణాలోని గురుగ్రామ్లో కన్నతండ్రే కాలయముడై నిష్కారణంగా తన కంటిపాపను చిదిమేసిన ఈ ఉదంతం దిగ్భ్రాంతికరమైనది. తండ్రి దీపక్ యాదవ్ తుపాకి గుళ్లకు బలైపోయిన టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ చేసిన ‘నేరం’ ఏమీ లేదు. చిన్న వయసులోనే ఆ క్రీడలో రాణించి, ప్రతిభా పాటవాలు సొంతం చేసుకుని, అంచెలంచెలుగా ఎదగటమే ఆమె నేరం. కేవలం ఇరవై అయిదేళ్లకే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ సర్క్యూట్లో ఆమె ర్యాంకు 113. ఆ విధంగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా కూడా నిరూపించుకుంది. సొంతంగా టెన్నిస్ అకాడెమీ నెలకొల్పింది. తన వంటి బాలికలకు శిక్షణనిస్తున్నది. వారు ఎదగటానికి ఆసరాగా నిలు స్తున్నది. అటువంటి రాధిక, కన్నతండ్రికి కంట్లో నలుసుగా మారిందంటే నమ్మగలమా? ఆమెను కాల్చిచంపటం తప్ప మరో దారిలేదని విశ్వసించాడంటే ఊహించగలమా? యువతరంలో చాలా మందికి ఆ వయసుకల్లా ఏం ఎంచుకోవాలో, ఎటుపోవాలో తెలియని అయోమయం ఆవరిస్తుంది. సంకోచం వెనక్కు లాగుతుంది. కింకర్తవ్య విమూఢత కాటేస్తుంది. ఆశించిన ఉద్యోగం అందక, ఇష్టంలేని కొలువుతో సరిపడక నిస్పృహలో కూరుకుపోతారు. కానీ రాధిక అలా కాదు. టెన్నిస్ రంగంలో ఎదిగి ఒక సానియా మీర్జాలా, ఒక సెరెనా విలియమ్స్లా మెరిసిపోవాలనుకుంది. ఇప్ప టికే రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి ఎన్నో అవార్డులూ, రివార్డులూ సాధించింది. జాతీయ స్థాయి టెన్ని స్లో సైతం స్థానం సంపాదించుకోవాలని తపన పడుతోంది. కన్నవారికే కాదు... దేశానికే పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలదన్న భరోసానిచ్చింది. ఇవన్నీ ఆమె తండ్రి దృష్టిలో నేరాలయ్యాయి. రాధికా యాదవ్ ఉదంతం మనందరం నమ్ముతున్న విలువల్ని ప్రశ్నార్థకం చేస్తోంది. చిన్ననాటి నుంచీ టెన్నిస్లో ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించినవాడే హఠాత్తుగా ఎలా హంతకుడయ్యాడు? మెచ్చిన నోటితోనే దుర్భాషలాడే స్థితికి అతగాడు చేరటం వెనకున్న పరిణామాలెలాంటివి? పోలీ సులకిచ్చిన వాంగ్మూలంలో అతను ప్రస్తావించిన అంశాలు వింటే ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న మన సమాజం నిజస్వరూపం బట్టబయలవుతుంది. అంతా సవ్యంగా వుందని ఆత్మవంచనతో బతికేవారిని నిలదీస్తుంది. అందరూ దీపక్లాగే స్పందించక పోవచ్చుగానీ ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల్లో చాలామందికి కన్నకూతురు గురించి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడటం, ఆమెను చిన్నచూపు చూడటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కనబడుతూనే వుంటుంది. ఇలాంటి దుర్మార్గ ధోరణులను ప్రతిఘటించాల్సిన దీపక్ యాదవ్ తానూ ఆ తానులో ముక్కయ్యాడు. వారు ప్రవచిస్తున్న విలువల పరిధిలో, పరిమితిలో వుండకుండా కుటుంబాన్ని రాధిక వీధిన పడేస్తున్నదని అపోహపడ్డాడు. టెన్నిస్ క్రీడ గురించీ, తానిస్తున్న శిక్షణలో పాటించే ప్రమాణాల గురించీ ఆమె చేసిన వీడియోపై వచ్చిన కామెంట్లు తట్టుకోలేక సోషల్ మీడియా ఖాతాను అప్పటికే తీయించేశాడు. అకాడెమీని సైతం మూసేయాలన్న సలహా కూడా పాటించాలని కోరుకున్నాడు. దాన్ని తిర స్కరించిందన్న ఉన్మాదంతో మానవత్వాన్ని మరిచాడు. కూతురి సంపాదనపై బతుకుతున్నావని ఛీత్కరించిన మృగాల్లో కనీసం ఒక్కరికి తన లైసెన్స్ రివాల్వర్ను గురిపెట్టివుంటే ఆ బాపతు నోళ్లు మూతబడేవి. స్వయంశక్తితో ఎదుగుతున్న కన్నకూతురి కోసం దృఢంగా నిలబడిన ఒక మంచి నాన్నగా నిలిచేవాడు. ఏమైంది ఇవాళ? యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి హంతకుడిగా మిగిలాడు! ఆడపిల్లను పెంచటం, ఆమె అభీష్టానికి అనుగుణంగా ఎదగనివ్వటం, ఇష్టపడిన చదువు చది వించటం, కోరుకున్న వాడికిచ్చి పెళ్లిచేయటం వర్తమానంలో పెను సవాలుగా మారిందన్నది వాస్తవం. తల్లిదండ్రులు విద్యావంతులైనా, ఉన్నతోద్యోగాలు చేస్తున్నా, సమాజం పెట్టిన ప్రమాణా లను ఆడపిల్ల మీరితే ఎలా అన్న విచికిత్సలో పడుతున్నవారు చాలామందే తారసపడతారు. వారిలో అనేకులు చుట్టూవున్నవారి ఒత్తిళ్లకు లొంగి ఇంటి ఆడపిల్లను అదుపు చేయటానికి ప్రయ త్నించేవారే. ఆ క్రమంలో అనేకమంది పిల్లలు తమ ఇష్టాలను వదులుకుని బతుకులు వెళ్లదీస్తు న్నారు. అసలు బయటికెళ్లిన ఆడపిల్ల సురక్షితంగా ఇంటికొస్తుందో లేదో తెలియని ఆందోళనతో నిత్యం భయంభయంగా బతుకుతున్న తల్లిదండ్రులకు మేమున్నామంటూ భరోసానిచ్చే వ్యవస్థలు న్నాయా? సామాజిక కట్టుబాట్ల పేరుతో రూపొందుతున్న తప్పుడు విలువలు ఇళ్లల్లోకి చొరబడకుండా, వాటి దుష్ప్రభావాలు కుటుంబాలపై పడకుండా నివారించే సంస్కృతి ఆచూకీ ఏది? మన ప్రభుత్వాలు తీసుకుంటున్న కనీస చర్యలేమిటి?ఆడవాళ్లను కించపరిచే సినిమాలనూ, ఇతరేతర మాధ్యమాలనూ ఏ మేరకు కట్టడి చేయగలుగుతున్నాం? ఎటువంటి వివక్షకూ తావు లేకుండా దేశ పౌరులందరికీ సమాన అవకాశాలు లభించాలన్న మన రాజ్యాంగం సక్రమంగా అమలవు తున్నదా? ఇవన్నీ సరిగా లేనప్పుడు దీపక్లాంటివారు రూపొందుతారు. వారికి నారూ నీరూ పోస్తున్నవారు ఎప్పటికీ పదిలంగా వుంటారు. రాధికా యాదవ్ వంటి మణిపూసలు నిస్సహాయంగా నేల రాలుతారు.

హైదరాబాద్లో తగ్గిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఢీలాపడ్డాయి. మొత్తం రూ.1,025 యూనిట్ల విక్రయాలు (రూ.5 కోట్లు అంతకు మించిన ధర) నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలు 1,140 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం విలాసవంతమైన గృహ విక్రయాలు (రూ.6 కోట్లు, అంతకుమించి) మూడింతలు పెరిగి 3,960 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఢిల్లీ ఎన్సీఆర్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 1,280 యూనిట్లుగా ఉండడం గమనార్హం. సీబీఆర్ఈ, అసోచామ్ సంయుక్త నివేదిక ఈ వివరాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జనవరి–జూన్ మధ్య కాలంలో అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 85 శాతం పెరిగి 6,950 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 3,750 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 200 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 80 యూనిట్లుగానే ఉన్నాయి. → చెన్నైలోనూ మూడు రెట్లు పెరిగి 220 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 65 యూనిట్లుగా ఉన్నాయి. → పుణెలో అమ్మకాలు 120 యూనిట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 160 యూనిట్లుగా ఉన్నాయి. → కోల్కతాలో అమ్మకాలు రెట్టింపై 190 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 70 యూనిట్లుగానే ఉండడం గమనార్హం. → ముంబైలో 1,240 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 950 యూనిట్లుగా ఉన్నాయి. → పుణె, చెన్నై, కోల్కతా నగరాల్లో రూ.4కోట్లు అంతకుమించిన విలువైన ఇళ్లను లగ్జరీ ఇళ్ల కింద పరిగణనలోకి తీసుకున్నారు. బెంగళూరులో రూ.5 కోట్లు అంతకుమించిన ధరల శ్రేణిని లగ్జరీ ఇళ్ల కింద ఈ నివేదిక పరిగణించింది. స్థిరమైన డిమాండ్.. ‘‘దేశ ఇళ్ల మార్కెట్ వ్యూహాత్మక స్థిరమైన దశలోకి ప్రవేశించింది. స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నాయి. లగ్జరీ, ప్రీమియం ఇళ్ల మా ర్కెట్లో స్థిరమైన వృద్ధి అన్నది వినియోగదారుల విశ్వాసం పెరుగుదలను జీవనశైలి ఆకాంక్షలను సూచిస్తోంది’’అని సీబీఆర్ఈ ఇండియా ఎండీ (భూమి) గౌరవ్ కుమార్ తెలపారు. డెవలపర్లు నాణ్యత, పారదర్శకత, ఈ రంగం తదుపరి దశకు ఇవి కీలకంగా పనిచేస్తాయన్నారు. హౌసింగ్ బూమ్కు అనుగుణంగా సులభతర అనుమతులు, పట్టణాల్లో అందుబాటు ధరల ఇళ్లను ప్రోత్సహించేలా విధానపరమైన సంస్కరణలు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్ ఈ నివేదిక విడుదల సందర్భంగా సూచించారు.

అమెరికాను హడలెత్తిస్తున్న ఈగ
న్యూ వరల్డ్ స్క్రూవార్మ్.. అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈగ. ముఖ్యంగా పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ ఎగిరే జీవుల సంతతిని నియంత్రించడానికి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్ చేసిన మగ ఈగలను వదలడానికి ఏర్పాట్లు చేస్తోంది. న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ను సైన్స్ పరిభాషలో కొష్లియోమియా హొమినివోరక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్న జీవులు. అంటే ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై ఆవాసం ఏర్పర్చుకుంటాయి. వాటి శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని భక్షిస్తాయి. దాంతో ఆయా జంతువులకు ప్రాణాపాయం సంభవిస్తుంది. అమెరికాతోపాటు దక్షిణ అమెరికా దేశాల్లో ఈగలు పెద్ద సమస్యగా మారిపోయాయి. 2023 నుంచి సెంట్రల్ అమెరికాలో వీటి వ్యాప్తి పెరిగిపోయింది. పనామా, కోస్టారికా, నికరాగ్వా, హోండూరస్, గ్యాటెమాలా, ఎల్సాల్వెడార్ తదితర దేశాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు చేరుకున్నాయి. అటునుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. వీటి దెబ్బకు అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసివేయాల్సి వచ్చింది. మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపివేశారు. పాలు ఇచ్చే ఆవులు, గేదెలు మరణిస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు 35,000 న్యూవరల్డ్ స్క్రూవార్మ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి మరెన్నో ఉన్నాయి. ఎలా నియంత్రిస్తారు? స్క్రూవార్మ్ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు. మగ ఈగలను సేకరించి, ప్రయోగశాలలో స్టెరిలైజ్ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అవి గుడ్లు పెట్టలేవు. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే, అమెరికాలో స్టెరిలైజేషన్ కేంద్రం ప్రస్తుతం ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు జూన్ 17న ప్రభుత్వానికి లేఖ రాశారు. అమెరికా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించింది. ‘ఫ్లై ఫ్యాక్టరీ’ ప్రారంభిస్తామని ప్రకటించింది. టెక్సాస్–మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. పశువుల రక్తమాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం చెప్పినంత సులువు కాదు. ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలు ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. ఇందుకోసం జాగిలాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మనుషులకు ముప్పు స్వల్పమే పూర్తిగా ఎదిగిన స్క్రూవార్మ్ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. పశువుల పుండే వాటికి ఆవాసం. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి. అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు. 1960, 1970వ దశకంలో విపరీతంగా బాధించాయి. అప్పట్లో పాడి పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. మగ ఈగల ద్వారా అతికష్టంమీద, ఎంతో ఖర్చుతో వీటిని నియంత్రించగలిగారు. స్క్రూవార్స్మ్ మృత పశువుల కంటే బతికి ఉన్న పశువులపై ఉండడానికే ఇష్టపడతాయి. ఇంట్లో పెంచుకొనే శునకాలు, పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. మనుషులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ అది చాలా స్వల్పమే. – సాక్షి, నేషనల్ డెస్క్

గతి తప్పిన వాతావరణం
న్యూఢిల్లీ: దేశంలో సాధారణం కంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత నెలలో ఈ పరిణామం స్పష్టంగా కనిపించినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. చల్లగా ఉండే హిమాలయ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వేడిగా ఉండే మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకొని, ఈ అంశం నిగ్గుతేల్చారు. ‘వాటర్ టవర్ ఆఫ్ ఆసియా’గా భావించే హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయి. హిమానీనదాలు కరిగిపోతున్నాయి. మంచు చరియలు విరిగిపడుతున్నాయి. మొత్తంగా వాతావరణమే గతి తప్పుతోంది. ఎడారి రాష్ట్రమైన రాజస్తాన్ రాజధాని జైపూర్లో గత నెలలో 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే 78 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ సాధారణం కంటే 1.3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాగా, 36 మిల్లీమీటర్ల అధిక వర్షం కురిసింది. హిమాలయాల్లో భాగమైన సిమ్లాలో 0.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 186 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఏకంగా 2.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 55 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. ఎందుకీ పరిస్థితి? వాతావరణం గతి తప్పడానికి కాలుష్యం, వాతావరణ మార్పులే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. హిమాలయాలు వేగంగా కరిగిపోతే దిగువ ప్రాంతాలకు పెనుముప్పు తప్పదు. వరదలు ముంచెత్తుతాయి. ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ ముప్పు కూడా అదే స్థాయిలో పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాలు, టిబెట్ పీఠభూమిలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 2015 నుంచి 2024 దాకా హిమాలయాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలే రికార్డయ్యాయి. 2016 నుంచి ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 2024లో 19.99 డిగ్రీల వార్షిక సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇది సాధారణం కంటే 0.77 డిగ్రీలు అధికం. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం చూస్తే.. 1901 నుంచి 2020 దాకా ఇండియాలో సగటు ఉష్ణోగ్రత 0.62 డిగ్రీలు పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రత 0.99 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 0.24 డిగ్రీలు పెరిగాయి. అడవులను నరికివేయడం, పట్టణీకరణ, శిలాజ ఇంధనాల వాడకం ఇలాగే పెరిగిపోతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత భయానకంగా మారుతుందనడంలో సందేహం లేదు.
జోరు సాగనీ...
హైదరాబాద్లో తగ్గిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు
స్వింగ్ 'స్టార్క్' సెంచరీ
వర్షం లోటు..సాగు తడబాటు!
స్వల్పంగా తగ్గిన నికర పన్ను వసూళ్లు
ఎల్ఐసీలో మరింత వాటా అమ్మకం
సెమీస్లో జొకోవిచ్కు షాక్
టి20 ప్రపంచకప్ టోర్నీకి ఇటలీ అర్హత
జీ ప్రమోటర్లకు వాటాదారుల చెక్
సినియకోవా–వెర్బీక్ జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్!
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
‘ది 100’ మూవీ రివ్యూ
పెట్రోబాదుడులో ఇండియా టాప్
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
ఫిష్ వెంకట్కు సాయం చేసిన మరో హీరో..
సార్! ఇప్పుడిక్కడున్నది మన ప్రభుత్వమే! కేజ్రీవాల్ది కాదు!!
రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం చకచకా
..మనం ఇక ముందుకు పోలేం సార్! మీరు ప్రారంభించాల్సిన రోడ్డు ఇదే!
49వేల కోట్ల కుంభకోణం.. వెలుగులోకి దేశంలో అతిపెద్ద స్కాం
జస్ప్రీత్ బుమ్రా సూపర్ డెలివరీ.. వరల్డ్ నెం1 బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఒక రోజు ముందుగానే ఓటీటీకి వచ్చిన సూపర్ హిట్ మూవీ
ట్రంప్ తిరుగుబాట!
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ చిరంజీవి - రామ్ చరణ్ మూవీ
జోరు సాగనీ...
హైదరాబాద్లో తగ్గిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు
స్వింగ్ 'స్టార్క్' సెంచరీ
వర్షం లోటు..సాగు తడబాటు!
స్వల్పంగా తగ్గిన నికర పన్ను వసూళ్లు
ఎల్ఐసీలో మరింత వాటా అమ్మకం
సెమీస్లో జొకోవిచ్కు షాక్
టి20 ప్రపంచకప్ టోర్నీకి ఇటలీ అర్హత
జీ ప్రమోటర్లకు వాటాదారుల చెక్
సినియకోవా–వెర్బీక్ జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్!
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
‘ది 100’ మూవీ రివ్యూ
పెట్రోబాదుడులో ఇండియా టాప్
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
ఫిష్ వెంకట్కు సాయం చేసిన మరో హీరో..
సార్! ఇప్పుడిక్కడున్నది మన ప్రభుత్వమే! కేజ్రీవాల్ది కాదు!!
రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం చకచకా
..మనం ఇక ముందుకు పోలేం సార్! మీరు ప్రారంభించాల్సిన రోడ్డు ఇదే!
49వేల కోట్ల కుంభకోణం.. వెలుగులోకి దేశంలో అతిపెద్ద స్కాం
జస్ప్రీత్ బుమ్రా సూపర్ డెలివరీ.. వరల్డ్ నెం1 బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఒక రోజు ముందుగానే ఓటీటీకి వచ్చిన సూపర్ హిట్ మూవీ
ట్రంప్ తిరుగుబాట!
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?
'ఐ లవ్ యూ' చెబితే ఓకే చెప్పేశాను: అనుష్క
సినిమా

కన్నప్ప సినిమాలో మసాలా.. అది లేకుంటే రెండోసారి చూసేవాళ్లం!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా (Kannappa Movie) ప్రకటించినప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి. టీజర్ విడుదలైనప్పుడు వచ్చిన విమర్శలకైతే లెక్కే లేదు. కానీ ఆ వెంటనే రిలీజ్ చేసిన పాటతో ట్రోలింగ్ అంతా మట్టికొట్టుకుపోయింది. ట్రైలర్ కూడా బాగుండటంతో నెగెటివిటీ కాస్తా పాజిటివిటీగా మారిపోయింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సాధువులతో సినిమా చూసిన మోహన్బాబుకన్నప్ప మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటించగా అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ కన్నప్ప సినిమాను జూలై 8న విజయవాడలో ప్రదర్శించారు. అఘోరాలు, సాధువులు, నాగసాధువులు, పీఠాధిపతులతో కలిసి మోహన్బాబు సినిమా చూశారు.కొంచెం మసాలా పెట్టినప్పటికీ..అనంతరం స్వామీ సదానందగిరి మాట్లాడుతూ.. ఆంధ్రలో తిరిగినప్పుడు అప్పుడెప్పుడో లవకుశ, శంకరాభరణం చూశాం. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత ఒక నిజమైన కథ చూశాం. భక్త కన్నప్ప, అర్జునుడి గురించి మాకు తెలుసు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని కన్నప్ప సినిమా తీశారు. ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా పెట్టినప్పటికీ.. నిజమైన భక్తిని దర్శకుడు, రచయిత అద్భుతంగా చూపించారు.ఆ పాటల వల్లే..సన్యాసులమైన మాకు కన్నప్ప రెండోసారి చూడాలనిపించింది. ఆ రెండు పాటలు లేకుంటే మరోసారి చూసేవాళ్లం. అది మా సన్యాసి బుద్ధి. అయితే ఆ పాటల్లోనూ ఎటువంటి అసభ్యత లేదు. ఆ కాలపు నాగరికత ఆధారంగానే తీశారు అని పేర్కొన్నారు. ఆ కామెంట్లు ప్రస్తుతం వైరల్గా మారాయి.చదవండి: ఆ హీరో నా కొడుకే.. తనతో గొడవపడ్తూ ఉంటా: సవతి తల్లి

జీన్ ప్యాంటు బుల్లెమ్మ మీనాక్షి.. పచ్చబొట్టుతో నిహారిక
జీన్ డ్రస్సుతో రచ్చ లేపుతున్న మీనాక్షి చౌదరివీపుపై పచ్చబొట్టుతో మరింత అందంగా నిహారికబీచ్లో తల్లితో కలిసి ఎంజాయ్ చేస్తున్న సుప్రీతసన్ కిస్ ఫొటోలు పోస్ట్ చేసిన వైష్ణవి చైతన్యఇంటికి పెయింట్ వేసుకున్న 'పుష్ప' ఫేమ్ పావనియూకేలో అందాల జాతర చేస్తున్న పూజిత పొన్నాడవింటేజ్ లుక్స్తో ఆకాంక్ష క్లాస్ ఫొటోషూట్ View this post on Instagram Shared post on Timeporn stars free porn.boxes3{height:175px;width:153px;} #n img{max-height:none!important;max-width:none!important;background:none!important} #inst i{max-height:none!important;max-width:none!important;background:none!important} View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Pavani Karanam (@livpavani) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial)

నన్ను వేస్ట్ చేశాడు.. లోకేశ్ కనగరాజ్పై చాలా కోపం
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే ఖైదీ, విక్రమ్ లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే స్టార్ దర్శకుల్లో ఇతడు ఒకడు. ప్రస్తుతం రజినీకాంత్తో 'కూలీ' తీస్తున్నాడు. ఈ మూవీపై హైప్ మామూలుగా లేదు. సరే ఇదంతా పక్కనబెడితే లోకేశ్పై తాను చాలా కోపంగా ఉన్నానని, తనని వేస్ట్ చేశాడని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ)స్వతహాగా బ్యాంక్ ఉద్యోగి అయిన లోకేశ్ కనగరాజ్.. 'మా నగరం' మూవీతో దర్శకుడిగా మారాడు. 'ఖైదీ'తో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023లో దళపతి విజయ్తో 'లియో' సినిమా తీశాడు. కాకపోతే ఇది సరిగా వర్కౌట్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా నటించాడు. ఇప్పుడు దాని గురించే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో సంజయ్ దత్ మాట్లాడాడు.'కేడీ ద డెవిల్' అనే సినిమా టీజర్ని రిలీజ్ చేశారు. ఇందులో సంజయ్ కీలక పాత్ర చేశాడు. దీని ప్రమోషన్లో భాగంగా మూవీ టీమ్ అంతా తాజాగా చెన్నైలో ల్యాండ్ అయింది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన సంజయ్ దత్.. 'రజినీకాంత్, కమల్, అజిత్ సినిమాలు నేను చూస్తుంటాను. రజినీ సర్తో కలిసి అప్పట్లో హిందీ చిత్రాలు కూడా చేశాను. దళపతి విజయ్తోనూ 'లియో' చేశా. అయితే లోకేశ్పై నాకు చాలా కోపం. ఎందుకంటే చిన్న రోల్ ఇచ్చి నన్ను వేస్ట్ చేశాడు(నవ్వుతూ)' అని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)"I worked with #VijayThalapthy & I loved it. I'm angry with #LokeshKanagaraj, because he didn't give me a big role in #LEO. He wasted me.- #SanjayDutt pic.twitter.com/zzPaeqfEub— Movies4u Official (@Movies4u_Officl) July 11, 2025

పాక్ యువ నటి మృతి.. పోస్ట్మార్టం రిపోర్టులో సంచలన విషయాలు!
పాక్ నటి హుమైరా అస్గర్ మృతి కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. కరాచీలోని తన నివాసంలో హుమైరా విగతజీవిగా కనిపించింది. ఈ నెల 9న ఆమె మృతదేహన్ని ఫ్లాట్లో గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే హుమైరా పోస్టుమార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయం బయటపడింది. ఆమె మరణించి దాదాపు తొమ్మిది నెలలు అయిందని అక్కడి స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఆమె నివసిస్తోన్న అపార్ట్మెంట్లోని ఫ్లోర్లో ఎవరూ లేకపోవడంతో ఈ విషయం బయటికి రాలేదని తెలుస్తోంది.కాగా.. నటి చివరిసారిగా ఫోన్ కాల్ అక్టోబర్ 2024లో చేసిందని పోలీసులు గుర్తించారు. అదే ఆపార్ట్మెంట్లో నివసించేవారు కూడా ఆమెను చివరిసారిగా గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లో చూశామని పోలీసులకు తెలిపారు. అంతేకాకుండా హుమైరా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదు.. చివరిసారి సెప్టెంబర్ 2024లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ఈ లెక్కన ఆమె గతేడాదిలోనే మరణించినట్లు తెలుస్తోంది.మరోవైపు నటి భౌతికకాయాన్ని తీసుకునేందుకు ఆమె కుటుంబసభ్యులు నిరాకరించారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని తండ్రి, రిటైర్డ్ ఆర్మీ వైద్యుడు డాక్టర్ అస్గర్ అలీ పోలీసులకు తెలిపారు. చాలా రోజుల క్రితమే తనతో సంబంధాలు తెంచుకున్నామని ఆయన అన్నారు. పోలీసులు మొదట హుమైరా సోదరుడిని ఆమె ఫోన్ ద్వారా సంప్రదించగా.. తన తండ్రితోనే మాట్లాడాలని చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీంతో సింధ్ సంస్కృతి విభాగం హుమైరా అంత్యక్రియల ఏర్పాట్లు చేసేందుకు ముందుకొచ్చింది.హుమైరా రియాలిటీ షో తమషా ఘర్లో నటించింది. ఆ తర్వాత 2015 యాక్షన్-థ్రిల్లర్ చిత్రం జలైబీలో కూడా కనిపించింది. ఆమె పాకిస్తానీ చిత్రంలో మోడల్గా కనిపించింది. హుమైరా జస్ట్ మ్యారీడ్, చల్ దిల్ మేరే, ఎహ్సాన్ ఫరామోష్, గురు వంటి పాకిస్తాన్ సీరియల్స్లో నటించింది. హుమైరా చివరిసారిగా ఫర్హాన్ సయీద్, సోన్యా హుస్సిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ వ్యాక్సిన్ చిత్రంలో కనిపించింది. ఈ మూవీ 2021లో విడుదలైంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

సినియకోవా–వెర్బీక్ జోడీకి మిక్స్డ్ డబుల్స్ టైటిల్
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)–సెమ్ వెర్బీక్ (నెదర్లాండ్స్) జోడీ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సినియకోవా–వెర్బీక్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/3)తో లూసియా స్టెఫానీ (బ్రెజిల్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. సినియకోవా–వెర్బీక్ జంటకు 6,80,000 పౌండ్లు (రూ. 7 కోట్ల 88 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. సినియకోవా కెరీర్లో ఇది 11వ గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్కాగా... ‘మిక్స్డ్’లో మాత్రం తొలి టైటిల్. మహిళల డబుల్స్లో సినియకోవా మూడుసార్లు చొప్పున ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలలో... ఒకసారి యూఎస్ ఓపెన్లో టైటిల్స్ సాధించింది. అంతేకాకుండా టోక్యో ఒలింపిక్స్లో మహిళల డబుల్స్లో... పారిస్ ఒలింపిక్స్లో మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. మరోవైపు వెర్బీక్ తొలి గాండ్స్లామ్ టైటిల్ నెగ్గాడు.

బుమ్రా కూల్చాడు... ఇక బ్యాటర్లే నిలబెట్టాలి
మూడో టెస్టు రెండో రోజు రసవత్తర ఆటకు తెరలేచింది. తొలిరోజంతా కష్టపడినా బుమ్రా ఒక వికెట్ మాత్రమే తీస్తే... రెండో రోజు తొలి సెషన్లోనూ వైవిధ్యమైన బంతులతో ఇంగ్లండ్ ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కూల్చేశాడు. అయితే భారత బ్యాటింగ్ మాత్రం తడబడింది. ఆరంభంలోనే విలువైన వికెట్లను కోల్పోయింది. మొదటి రోజు 4 వికెట్లు పడితే... రెండో రోజు ఆటలో 9 వికెట్లు కూలాయి. ఇరుజట్లు బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్తోనే సత్తా చాటుకున్నాయి. లండన్: భారత ప్రీమియర్ బౌలర్ బుమ్రా తానెంత విలువైన ఆటగాడో మరోసారి చాటుకున్నాడు. తొలిరోజు శ్రమించినా దక్కని సాఫల్యం రెండో రోజు ఆరంభంలోనే సాధ్యమైంది. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లను తొలి సెషన్ మొదలైన కొద్దిసేపటికే అవుట్ చేశాడు. భారత్ పట్టుబిగించేలా చేశాడు. నింపాదిగానే పరుగులు చేద్దామనుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లపై నిప్పులు చెరిగాడు. ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాట వేసినా... బుమ్రా బాధ్యతగా అడ్డుకట్ట వేశాడు. అయితే టీమిండియా ఇన్నింగ్సే సానుకూల దృక్పథంతో మొదలవలేదు.ఆతిథ్య బౌలర్లు కీలక వికెట్లను తీసి మ్యాచ్ను రసపట్టుగా మార్చేశారు. ముందుగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 112.3 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ జో రూట్ (199 బంతుల్లో 104; 10 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... వికెట్ కీపర్ జేమీ స్మిత్ (56 బంతుల్లో 51; 6 ఫోర్లు), బౌలర్ బ్రైడన్ కార్స్ (83 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత స్పీడ్స్టర్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (113 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు), కరుణ్ నాయర్ (62 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. ఆర్చర్, వోక్స్, స్టోక్స్ తలా ఒక వికెట్ తీశారు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 242 పరుగుల దూరంలో ఉంది. బుమ్రా పేస్... స్టోక్స్, రూట్ క్లీన్బౌల్డ్ రెండో రోజు ఆరంభాన్ని భారత పేస్ స్టార్ బుమ్రా దెబ్బతీశాడు. ఓవర్నైట్ స్కోరు 251/4తో శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ కాసేపటికే కెప్టెన్ స్టోక్స్ (44) వికెట్ను కోల్పోయింది. సెంచరీ మురిపెం పూర్తవగానే రూట్ వికెట్ పడింది. ఈ ఇద్దరూ క్లీన్ బౌల్డయ్యారు. రూట్ అవుటైన మరుసటి బంతికే క్రిస్ వోక్స్ (0) డకౌట్ అయ్యాడు! ముగ్గుర్ని బుమ్రానే అవుట్ చేశాడు. బుమ్రా పేస్కు విలవిలలాడిన ఇంగ్లండ్కు స్మిత్ క్యాచ్ నేలపాలవడం వరమైంది. సిరాజ్ బౌలింగ్లో రాహుల్ క్యాచ్ చేజార్చినపుడు అతని స్కోరు 5 మాత్రమే.ఈ లైఫ్లైన్తో కార్స్తో కలిసి ఇంగ్లండ్ పోటీ స్కోరుకు స్మిత్ బాట వేశాడు. ముందుగా ఇద్దరు జట్టు స్కోరును 300 దాటించారు. తర్వాత క్రీజులో పాతుకుపోయి ఎనిమిదో వికెట్కు 84 పరుగులు జోడించారు. ఫిఫ్టీ పూర్తయ్యాక మళ్లీ సిరాజ్కే అతని వికెట్ దక్కింది. బుమ్రా... ఆర్చర్ (4)ను ఎక్కువసేపు నిలువనీయలేదు. అయితే కార్స్ అడపాదడపా బౌండరీలు, ఓ భారీ సిక్సర్తో అర్ధసెంచరీ చేసుకున్నాడు. 387 వద్ద సిరాజ్ అతన్ని అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.యశస్వి, గిల్ విఫలం ఆరంభం నుంచే దూకుడుగా ఆడుదామనుకున్న యశస్వి జైస్వాల్ (13; 3 ఫోర్లు) జోరుకు ఆర్చర్ ఆదిలోనే అడ్డుకట్ట వేశాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్తోనే అంతర్జాతీయ టెస్టుల్లో పునరాగమనం చేసిన ఆర్చర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్తో సత్తా చాటుకున్నాడు. ఈ దశలో రాహుల్కు కరుణ్ నాయర్ జతయ్యాడు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్ని నింపాదిగా పరుగులు రాబట్టారు. ఈ జోడీ క్రీజులో పాగా వేస్తున్న సమయంలోనే నాయర్ వికెట్ తీసిన స్టోక్స్ రెండో వికెట్కు 61 పరుగులు భాగస్వామ్యానికి తెరదించాడు.తర్వాత ఈ సిరీస్లో భీకరమైన ఫామ్లో ఉన్న భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 16; 2 ఫోర్లు)ను వోక్స్ అవుట్ చేసి ఇంగ్లండ్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఇలా 107 పరుగులకే టీమిండియా కీలకమైన 3 వికెట్లు కోల్పోంది. దీంతో రాహుల్ బాధ్యతగా ఆడి అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా... గాయంతో కీపింగ్ చేయలేకపోయినా రిషభ్ పంత్ (19 బ్యాటింగ్; 3 ఫోర్లు) బ్యాటింగ్లో కుదురుగా ఆడాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ 23; పోప్ (సి) సబ్–జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బి) బుమ్రా 104; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బి) బుమ్రా 44; స్మిత్ (సి) సబ్–జురేల్ (బి) సిరాజ్ 51; వోక్స్ (సి) సబ్–జురేల్ (బి) బుమ్రా 0; కార్స్ (బి) సిరాజ్ 56; ఆర్చర్ (బి) బుమ్రా 4; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 31; మొత్తం (112.3 ఓవర్లలో ఆలౌట్) 387.వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172, 5–260, 6–271, 7–271, 8–355, 9–370, 10–387.బౌలింగ్: బుమ్రా 27–5–74–5, ఆకాశ్దీప్ 23–3–92–0, సిరాజ్ 23.3–6–85–2; నితీశ్ కుమార్ 17–0–62–2, జడేజా 12–1–29–1, సుందర్ 10–1–21–0. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 13; రాహుల్ (బ్యాటింగ్) 53; కరుణ్ (సి) రూట్ (బి) స్టోక్స్ 40; గిల్ (సి) స్మిత్ (బి) వోక్స్ 16; పంత్ (బ్యాటింగ్) 19; ఎక్స్ట్రాలు 4; మొత్తం (43 ఓవర్లలో 3 వికెట్లకు) 145.వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107.బౌలింగ్: వోక్స్ 13–1–56–1, ఆర్చర్ 10–3–22–1, కార్స్ 8–1–27–0, స్టోక్స్ 6–2–16–1, బషీర్ 6–1–22–0. ⇒ 37 టెస్టుల్లో జో రూట్ సెంచరీల సంఖ్య. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్వస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.⇒ 211 టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు తీసుకున్న ఫీల్డర్గా జో రూట్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 210 క్యాచ్లతో రాహుల్ ద్రవిడ్ (భారత్) పేరిట ఉన్న రికార్డును రూట్ సవరించాడు.⇒ 11 భారత్పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా స్టీవ్ స్మిత్ (11) పేరిట ఉన్న రికార్డును జో రూట్ (11) సమం చేశాడు.⇒ 4 లార్డ్స్ మైదానంలో వరుసగా మూడు సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్గా రూట్ గుర్తింపు పొందాడు. గతంలో మైకేల్ వాన్, జాక్ హాబ్స్, దిలీప్ వెంగ్సర్కార్ ఈ ఘనత సాధించారు.

లార్డ్స్ టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్..
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. చేతి వేలి గాయం కారణంగా ఫీల్డింగ్కు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్.. తిరిగి బ్యాటింగ్కు రానున్నాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చేందుకు పంత్ ప్యాడ్స్ కట్టుకుని సిద్దంగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా తొలి రోజు ఆట సందర్భంగా బుమ్రా బౌలింగ్లో పంత్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో ఆట మధ్యలోనే మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రెండో రోజు ఆటలో కూడా పంత్ ఫీల్డింగ్ రాలేదు. అతడి స్దానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు.నెట్స్లో ప్రాక్టీస్ చేసిన పంత్..అయితే రెండో రోజు ఆట ఆరంభానికి ముందు రిషబ్ పంత్.. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్, ఫిజియో యోగేష్ పర్మార్ పర్యవేక్షణలో ద్దరు త్రోడౌన్ స్పెషలిస్టులతో కలిసి పంత్ నెట్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్బంగా అతడు కాస్త ఆసౌక్యర్యంగా కన్పించాడు.ఇంకా అతడికి ఇంకా పూర్తిగా చేతి వేలి నొప్పి తగ్గనట్లు తెలుస్తోంది. అయినప్పటికి జట్టు అవసరం దృష్ట్యా అతడు బ్యాటింగ్కు రావాలని అతడి నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా రిషబ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో సెంచరీల మోత మ్రోగించిన పంత్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో మెరిశాడు.

జో రూట్ ప్రపంచ రికార్డు..
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ ఇంగ్లండ్ వెటరన్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక అవుట్ఫీల్డ్ క్యాచ్లు అందుకున్న ప్లేయర్గా వరల్డ్ రికార్డు సృష్టించాడు.భారత తొలి ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ క్యాచ్ను తీసుకున్న తర్వాత ఈ ఫీట్ను రూట్ సాధించాడు. సెకెండ్ స్లిప్లో రూట్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. రూట్ ఇప్పటివరకు ఔట్ ఫీల్డ్లో 211 క్యాచ్లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్(210) పేరిట ఉండేది.తాజా మ్యాచ్తో ద్రవిడ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. అటు బ్యాటింగ్లోనూ రూట్ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్లో అద్బుతమైన సెంచరీతో రూట్(104) మెరిశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.టెస్ట్ క్రికెట్లో అత్యధిక అవుట్ఫీల్డ్ క్యాచ్లు అందుకున్న ప్లేయర్లు వీరే..211*జో రూట్210 రాహుల్ ద్రావిడ్205 మహేల జయవర్ధనే200 స్టీవెన్ స్మిత్200 జాక్వెస్ కాలిస్196 రికీ పాంటింగ్
బిజినెస్

టెస్లా కారు వచ్చేస్తోంది.. 15న ముంబైలో మొదటి స్టోర్ ప్రారంభం
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా వచ్చే వారం భారత మార్కెట్లో లాంఛనంగా అడుగుపెట్టనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో జూలై 15న దేశీయంగా తొలి స్టోర్ ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఎంపిక చేసిన ప్రముఖులకు టెస్లా పంపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తొలి కార్ల సెట్ను తమ చైనా ప్లాంటు నుంచి కంపెనీ ఎగుమతి చేసినట్లు వివరించాయి. ఇవి మోడల్ వై రియర్–వీల్ డ్రైవ్ ఎస్యూవీలై ఉంటాయని తెలిపాయి. టెస్లా ఇండియా గత నెలలో ముంబైలోని లోధా లాజిస్టిక్స్ పార్క్లో 24,565 చ.అ. వేర్హౌస్ స్థలాన్ని అయిదేళ్లకు లీజుకు తీసుకుంది. యూరప్, చైనా మార్కెట్లలో తమ కార్ల విక్రయాలు నెమ్మదిస్తున్న తరుణంలో భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏఐ ఆధారిత వైద్య సేవలు
ముంబై: అంతర్జాతీయ ప్రమాణాలతో, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటు ధరలకే అందించే ప్రణాళికలను అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రకటించారు. భారత్లో ఆరోగ్యం సంరక్షణ రంగాన్ని మార్చేసే స్వప్నాన్ని ఆయన ఆవిష్కరించారు. సొసైటీ ఫర్ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ – ఆసియా పసిఫిక్ (ఎస్ఎంఐఎస్ఎస్–ఏపీ) 5వ వార్షిక సమావేశం శుక్రవారం ముంబైలో జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడారు. భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కంటే.. వ్యవస్థ వ్యాప్తంగా పునర్నిర్మాణం అవసరమన్నారు. మూడేళ్ల క్రితం తన 60వ పుట్టిన రోజు సందర్భంగా హెల్త్కేర్, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం రూ.60,000 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘హెల్త్కేర్ రంగంలో తగినంత వేగం లేకపోవడం వల్ల మేము ఇందులోకి ప్రవేశించలేదు. ఇప్పుడు ఆ వేగం సరిపడా లేకపోవడంతో అడుగు పెట్టాం’’అని అదానీ తెలిపారు. 1,000 పడకల ఇంటిగ్రేటెడ్ మెడికల్ క్యాంపస్లను తొలుత అహ్మదాబాద్, ముంబైలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్టు గతంలో చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ.. కరోనా మాదిరి మహమ్మారి, విపత్తు సమయాల్లో వేగంగా సదుపాయాలను విస్తరించేలా ఇవి ఉంటాయన్నా రు. వైద్య చికిత్సలు, పరిశోధన, శిక్షణకు అత్యుత్తమ కేంద్రాలుగా పనిచేస్తాయంటూ.. మయో క్లినిక్ అంతర్జాతీయ అనుభవం ఈ దిశగా తమకు సాయపడుతుందని అదానీ చెప్పారు. నేడు గుండె జబ్బులు, మధుమేహం కంటే కూడా వెన్నునొప్పి ఎక్కువ మందిని వేధిస్తుందన్న విషయాన్ని ప్రస్తావించారు.నచ్చిన చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్ ‘నాకు బాగా నచి్చన చిత్రం మున్నా భాయ్ ఎంబీబీఎస్. నవ్వుకోవడానికే కాదు, సందేశం ఇవ్వడానికి కూడా. మున్నాభాయ్ మందులతో కాకుండా, మానవత్వంతో రోగుల బాధలను నయం చేశాడు. నిజమైన వైద్యం సర్జరీలకు అతీతమైనదని ఇది మనందరికీ గుర్తు చేసింది’ అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.

అమెజాన్లోనే కొంటున్నారా? అమ్మో జాగ్రత్త!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో ప్రస్తుతం ప్రైమ్ డే సేల్ 2025 నడుస్తోంది. జూలై 12-14 వరకు అమ్మకాలు జరుగుతుండగా దీనికి సంబంధించిన హడావుడి నాలుగు రోజుల ముందు హడావుడి ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 కోసం ఓ వైపు కొనుగోలుదారులు సిద్ధమవుతుండగా, ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కూడా వినియోగదారులను మోసం చేసేపనిలో పడ్డారు.అమెజాన్ లానే 1000 సైట్లుమెరుపు డీల్స్, డిస్కౌంట్ల కోసం లక్షలాది మంది లాగిన్ అవుతారని భావిస్తున్న నేపథ్యంలో ఈ షాపింగ్ ఉత్సుకత ఆన్లైన్ మోసాలకు తెరలేపుతుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెక్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, అమెజాన్ను పోలిన 1,000 కొత్త వెబ్సైట్లు 2025 జూన్లో నమోదయ్యాయి. వీటిలో 87% అనుమానాస్పదమైనవి లేదా పూర్తిగా హానికరమైనవిగా గుర్తించారు. ఈ సారూప్య డొమైన్లు చిన్న అక్షర తేడాలు లేదా ".టాప్" లేదా ".ఆన్వైన్" వంటి అసాధారణ ఎక్స్టెన్షన్లను కలిగి ఉంటాయి. ఇలా వినియోగదారులను నమ్మించి మోసగించడానికే వీటిని రూపొందించినట్లు కనిపిస్తోంది.వినియోగదారులను మోసగించడానికి స్కామర్లు సాధారణంగా రెండు ప్రధాన ట్రిక్స్పై ఆధారపడతారు. అవి ఒకటి నకిలీ వెబ్సైట్లు, రెండోది ఫిషింగ్ ఈమెయిల్స్. అమెజాన్ చెక్అవుట్ లేదా లాగిన్ పేజీలను అనుకరించడానికి నకిలీ డొమైన్లు సృష్టిస్తున్నారు. అవి మొదటి చూసినప్పుడు అసలైన వెబ్సైట్ల లాగానే అనిపిస్తాయి. దీంతో వీటి ద్వారా కొనగోళ్లకు ప్రయత్నిస్తే మొత్తానికి మోసం వస్తుంది. పాస్వర్డ్లు, ఇతర వివరాలు కూడా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది.ఇక మరో మార్గంలో "రీఫండ్ డ్యూ" లేదా "అకౌంట్ ప్రాబ్లమ్" వంటి విషయాలతో ఫిషింగ్ ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ సందేశాలు మామూలుగా అమెజాన్ సపోర్ట్ టీమ్ నుండే వచ్చినట్లు అనిపిస్తాయి. అక్కడ కనిపించిన లింక్లను క్లిక్ చేస్తే స్కామ్ వెబ్సైట్లకు దారితీసే అవకాశం ఉంది. ప్రైమ్ డే సందర్భంగా కొనుగోలుదారులు హడావుడిగా ఉంటారని సైబర్ నేరగాళ్లకు తెలుసు. వారు మీ అత్యవసరతను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు.కొన్ని జాగ్రత్తలుసురక్షితంగా ఉండటానికి నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. ఇవి సాధారణమైనవే కానీ శక్తివంతమైనవి. అవి..అధికారిక అమెజాన్ యాప్ లేదా వెబ్సైట్లో మాత్రమే షాపింగ్ చేయండిమీ ఖాతాను అప్డేట్ చేయమని లేదా రీఫండ్ క్లెయిమ్ చేయమని కోరే ఈమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.ఆకర్షణీయంగా అనిపించే ఫ్లాష్ డీల్స్ జోలికి పోవద్దు.టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి.మీ సాఫ్ట్వేర్, బ్రౌజర్లను అప్డేట్ చేసుకోండి.

అమెరికాలో అపర కుబేరులు మనవాళ్లే..
విదేశాల్లో పుట్టి అమెరికాలో అపర కుబేరులుగా ఎదిగినవాళ్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ 2025 ర్యాంకింగ్స్లో 12 మంది భారత సంతతి బిలియనీర్లు చోటు దక్కించుకోవడంతో అత్యధిక మంది విదేశీ అమెరికన్ కుబేరులకు జన్మస్థానంగా భారత్ నిలిచింది. 2022లో కేవలం ఏడుగురు భారత సంతతి బిలియనీర్లు ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగారు.అమెరికాలో విదేశీ సంతతి సంపన్నుల తాజా జాబితాలో భారత్.. ఇజ్రాయెల్, తైవాన్లను అధిగమించింది. ఈ రెండు దేశాలకు చెందినవారు చెరో 11 మంది ఈ జాబితాలో ఉన్నారు. స్వయం కృషితో ఎదిగిన ఈ భారత సంతతి కుబేరులు.. విదేశాలలో జన్మించిన యూఎస్ బిలియనీర్ల మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల సంపదలో గణనీయ వాటాను అందిస్తున్నారు.ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి కొత్తవారు ఇటీవల ఈ జాబితాలో చేరినప్పటికీ అంతగా గుర్తింపు లేని దిగ్గజాలతో పోలిస్తే వారు ఆశ్చర్యకరంగా తక్కువ ర్యాంకులో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ దిగ్గజం జెడ్ స్కేలర్ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల సంపదతో భారత సంతతి అమెరికన్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. విద్యుత్తు, నీరు లేని మారుమూల హిమాలయ గ్రామం పనోహ్ లో జన్మించిన చౌదరి గ్రాడ్యుయేట్ చదువుల కోసం 1980లో తొలిసారి అమెరికా వెళ్లారు.భారత సంతతి అపర కుబేరులు వీళ్లే..జే చౌదరి (17.9 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (జెడ్ స్కేలర్)వినోద్ ఖోస్లా (9.2 బిలియన్ డాలర్లు) - సన్ మైక్రో సిస్టమ్స్, వెంచర్ క్యాపిటల్రాకేష్ గంగ్వాల్ (6.6 బిలియన్ డాలర్లు) - ఎయిర్లైన్స్ (ఇండిగో సహ వ్యవస్థాపకుడు)రోమేష్ టి.వాధ్వానీ (5.0 బిలియన్ డాలర్లు) - సాఫ్ట్వేర్ - సింఫనీ టెక్నాలజీ గ్రూప్రాజీవ్ జైన్ (4.8 బిలియన్ డాలర్లు) - ఫైనాన్స్ (జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్)కవితార్క్ రామ్ శ్రీరామ్ (3.0 బిలియన్ డాలర్లు) - గూగుల్, వెంచర్ క్యాపిటల్రాజ్ సర్దానా (2.0 బిలియన్ డాలర్లు) - టెక్నాలజీ సేవలు (ఐటీ సంస్థ టీసీజీఐ)డేవిడ్ పాల్ (1.5 బిలియన్ డాలర్లు) - వైద్య పరికరాలు (వెల్క్వెస్ట్ / న్యూరోసిగ్మా)నికేష్ అరోరా (1.4 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ)ఫోర్బ్స్ తాజా డేటా ఆధారంగా అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి బిలియనీర్లు వీరే. టెక్ దిగ్గజాలు సుందర్ పిచాయ్ (1.1 బిలియన్ డాలర్లు), సత్య నాదెళ్ల (1.1 బిలియన్ డాలర్లు) 10, 11వ స్థానాల్లో నిలిచారు.
ఫ్యామిలీ

అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ వాయిస్గా ఆమె..! వన్ అండ్ ఓన్లీ..
యూట్యూబ్ నుంచి నటిగా మారిన ప్రజక్తా కోలి మోస్ట్లీ సేన్ అనే యూట్యూబ్ ఛానెల్తో దేశంలోనే తొలి మహిళా కామెడీ కంటెంట్ క్రియేటర్గా పేరుతెచ్చుకుంది. రోజువారీ జీవితంలోని పరిస్థితుల గురించి మంచి టైమింగ్ కామెడీ వీడియోలతో యువతను ఆకర్షించింది. అంతేగాదు నెట్ఫ్లిక్స్ సిరీస్ మిస్మాచ్డ్ లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. దాంతోపాటు జగ్ జగ్ జీయో" చిత్రంలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె టైమ్స్ 100 అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ వాయిస్లో చోటు దక్కించుకుంది. ఇలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంటెంట్ క్రియేటర్ కూడా ఆమెనే కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మకమైన జాబితాలో జిమ్మీ డోనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్), ఖబానే లేమ్, కై సెనాట్, మెల్ రాబిన్స్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ మేరకు ఈ ప్రజక్తా కోలి తన ఆనందాన్ని ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు. ఈ అత్యున్నత గౌరవం లభించినందుకు ముందుగా ప్రేక్షకులకు, నా కుటుంబ సభ్యులకు ధన్యావాదాలు. ఎలాంటి సపోర్టు లేకుండా కేవలం కథల పట్ల ఉన్న అవగాహనతో సంపాదించుకున్న స్టార్ డమ్ ఇది. మీ అందరి సహకారం వల్ల ఇదంతా సాధించానని పోస్ట్లో రాసుకొచ్చింది.కెరీర్ మొదలైంది ఇలా..పుట్టిపెరిగింది ముంబైలో. మనోజ్ కోలి, అర్చన కోలి .. ఆమె తల్లిదండ్రులు. ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తవగానే రేడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టింది. ఆర్జేగా ఆమె చేసిన హృతిక్ రోషన్ ఇంటర్వ్యూ చాలా పాపులర్ అయింది. అదివిన్న ‘వన్ డిజిటల్’ యూట్యూబర్ సుదీప్ ఆమెను యూట్యూబ్ చానెల్ పెట్టమని ప్రోత్సహించాడు. అలా 2015లో ‘మోస్ట్లీ సేన్’ను లాంచ్ చేసింది. ‘10 హిలేరియస్ వర్డ్స్ దట్ డిల్లీ పీపుల్ యూజ్’ అనే వీడియోతో ఆ చానెల్ క్లిక్ అయింది. యూట్యూబ్ చానెల్స్ తొలినాళ్లలోనే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్తో ప్రజక్త.. దేశంలోనే ఫస్ట్ ఫిమేల్ కామెడీ క్రియేటర్ అనే పేరు సంపాదించుకుంది. సాధించింది. సమకాలీన పరిస్థితులు, ఒరవడుల మీద ఆమె చేసే కామెడీ వీడియోలు దేశీ ప్రేక్షకులనే కాదు విదేశీ వీక్షకులనూ కడుపుబ్బ నవ్విస్తాయి. ఆ ప్రతిభ యునైటెడ్ నేషన్స్ వరకు చేరింది. ఆ హాస్యచతురతను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రజక్త వీడియోలను యూఎన్ స్క్రీన్ చేసింది. ప్రజక్తా కేవలం ఈ వీడియోలే కాదు. ఆమె స్త్రీల పక్షపాతి. అమ్మాయిలు బాగా చదవాలని దాదాపుగా అన్ని వీడియోల్లో చూపుతూ చెబుతూ ఉంటుంది. హేట్ టాక్, బాడీ షేమింగ్, సైబర్ బుల్లీయింగ్ తదితర దుర్లక్షణాల మీద కటువైన వ్యంగ్యంతో చేసిన వీడియోలు ఆమెకు గౌరవం తెచ్చి పెట్టాయి. ‘ఐ ప్లెడ్జెడ్ టు బి మీ’ అనే పేరుతో ఆమె చేసిన కాంపెయిన్ చాలామంది అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఇవన్నీ ఆమెకు అవార్డులు, పెద్ద పెద్ద సంస్థల సోషల్ కాంపెయిన్లో భాగస్వామ్యాలు తెచ్చి పెట్టాయి. అంతేగాదు న్యూఢిల్లీలో ఆమె మిషేల్ ఒబామాతో కాఫీ తాగి కబుర్లు చెప్పే స్థాయికి ఎదిగింది. అలాగే యూట్యూబ్ సిఇఓ సుజేన్ వూను ఇంటర్వ్యూ చేయగలిగే ఏకైక భారతీయ యూట్యూబర్గా ఎదిగింది. ఇవన్నీ ఆమె కేవలం తన ఆకర్షణీయమైన మాటతోనే సాధించింది.ఇటీవలే యూట్యూబ్ ‘గ్లోబల్ ఇనిషీయేటివ్ క్రియేటర్స్ ఫర్ చేంజ్’కి ఇండియన్ అంబాసిడర్గా ఎన్నికైంది కూడా. ఆమె హావభావాలు, చక్కటి టైమింగ్కు ఎంటర్టైన్మెంట్ మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రజక్తకు చలనచిత్ర, వెబ్పరిశ్రమలో అవకాశాలను కల్పించాయి. ముందుగా తన నటనా నైపుణ్యాన్ని ‘ఖయాలీ పులావ్’ అనే షార్ట్ ఫిల్మ్తో పరీక్షించుకుంది. సూపర్ హిట్ అయిందిఈ ఏడాద ప్రారంభంలో, ఆమె తన తొలి నవల టూ గుడ్ టు బి ట్రూ విడుదలతో కథకురాలిగా ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది. ఇక ప్రజక్తా కోలి ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ, జీక్యూ ఇండియా అత్యంత ప్రభావవంతమైన యువ భారతీయుల జాబితా 2025 వంటి వాటిల్లో కూడా చోటు దక్కించుకున్నారు. (చదవండి: డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...)

రూ. 1.6 కోట్ల జీతం, అయినా అమెరికాలో ఇండియన్ టెకీ జీవితం ఇదీ!
అమెరికాలో కొలువు, అదీ ఐటీ కంపెనీలో ఉద్యోగం అనగానే ఏడంకెల జీతం... లైఫ్ సెట్ అనుకుంటాం. కోట్ల రూపాయలు, తక్కువలో తక్కువ లక్షల రూపాయల ప్యాకేజీ, లగ్జరీ లైఫ్ అని భావిస్తాం కదా. కానీ న్యూయార్క్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక భారతీయ యువతి అనుభవం వింటే మాత్రం ‘అవునా.. నిజమా’అని ఆశ్చర్యపోక తప్పదు. ప్రముఖ సెర్చి ఇంజీన్ కంపెనీ గూగుల్లో న్యూయార్క్ నగరంలో టెకీగా పనిచేస్తోంది ఇండియాకు చెందిన మైత్రి మంగళ్. ఆమె జీతం ఏడాదికి రూ.1.6 కోట్లు. పాడ్కాస్టర్, రచయిత కుశాల్ లోధాతో, మంగళ్ అమెరికాలో జీతం, నెలవారీ ఖర్చుల గురించి చేసిన చర్చ ఇపుడు నెట్టింట వైరల్గా మారింది. నెల ఖర్చులు, తిండి, ఇంటి అద్దె ఖర్చులతో పోలిస్తే ఇది ఎంత అంటూ తన గోడును వెళ్లబోసుకుంది.ఈ వివరాలను లోధా సోషల్ మీడియాలో షేర్ చేశారు. "Googleలో సగటు ప్యాకేజీ ఎంత? అని Googleలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైత్రిని అడిగాను. సాధారణంగా రూ.1.6 కోట్లు ఉంటుందని పంచుకుంది" అని లోధా చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం న్యూయార్క్లో అపార్ట్మెంట్ అద్దె సుమారు రూ.2.5 లక్షలు. నెలవారీ ఖర్చురూ.4.2 లక్షలు. ఇది కాకుండా బయట తినడం, కిరాణా సామాగ్రి , ఎంటర్టైన్మెంట్ సహా ఇతర ఖర్చులు సుమారు రూ. 85,684-రూ. 1,71,368 వరకు ఉంటాయి. ప్రయాణ ఖర్చులు మరో రూ. 8,568-రూ. 17,136 దాకా అవుతాయి. View this post on Instagram A post shared by Kushal Lodha (@kushallodha548) ఇది చూసిన నెటిజన్లు ఔరా అంటూ నోరెళ్ల బెట్టారు. భారీ జీతం, న్యూయార్క్లాంటి గ్లోబల్ నగరాల్లో అసలైన జీవితం అంటూ కమెంట్స్ చేశారు.అన్నట్టు ఈ వీడియోనుమైత్రి మంగళ్కు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆమెకు 173 వేల మంది అనుచరులు ఉన్నారు.

డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...
మాతృత్వపు మధురిమ ఎవరికైనా అపురూపం. ఆ క్షణాలు కాబోయే తల్లులందరికీ భావోద్వేగభరితంగా ఉంటాయి. క్షణం క్షణం ఉత్కంఠ.. ఒకపక్క భరించలేని ప్రసవ వేదన..మరోవైపు వచ్చే బుడతడు కోసం ఆస్పత్రి బయట బంధువుల పడిగాపులు..అదంతా ఓ అపురూపమైన క్షణం. మర్చిపోలేని ప్రసవానుభవం కూడా. అలాంటి మధుర క్షణాలను చాలా రియలిస్టిక్గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ని త్వరగా చదివేయండి మరీ..మలయాళ నటుడు, బిజేపీ నాయకుడు కృష్ణ కుమార్ కుమార్తె దియా కృష్ణ నెట్టింట తన ప్రసవ అనుభవానికి సంబంధించిన వీడియోని షేర్ చేసుకున్నారు. అది కేవలం డెలివరీ సమయంలోని పరిస్థితులు కాదు..మొత్తం ఆస్పత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి నొప్పులు మొదలు..బిడ్డను కని డిశ్చార్జ్ అయ్యి వచ్చే వరకు మొత్తం తతంగాన్ని ఆమె చాలా చక్కగా రికార్డు చేశారు. ప్రతి దృశ్యం కదిలించేలా ఉంటుంది. ప్రసవ సమయంలో ఇలా ఉంటుందా అనే ఫీల్ని తెప్పిస్తుంది. ఇక్కడ దియా డెలివెరికి వెళ్లే క్షణంలో అందంగా మేకప్ వేసుకుని మరీ వెళ్తుంది. ఎందుకంటే మొటిమలతో ఉన్న ముఖంతో నా బిడ్డకు స్వాగతించడం ఇష్టం లేదంటూ చెప్పడం వీడియోలో చూడొచ్చు. అయితే ఆమె మొటిమలు చెడ్డవి కావు గానీ..నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకే ఇలా అని చెబుతుంది వీడియోలో. ఆ వీడియోలో భర్త, ఆమె తల్లిదండ్రులు ప్రసవ వేదన సమయంలో ఓదార్చడం, వైద్య సిబ్బంది మద్దతు తదితర దృశ్యాలన్ని భావోద్వేగానికి గురయ్యేలా చేస్తాయి. చివర్లో ఆమె చేతుల్లో బిడ్డను పెట్టే అపురూపమైన క్షణం అత్యంత అద్భుతంగా ఉంటుంది. దియా ఇందులో ఆధునిక వైద్య విధానం ఎలా ఉందో తెలియజేసేందుకే ఇదంతా షూట్ చేసినట్లు చెప్పుకొచ్చారామె. ఇక ఇక్కడ దియాకి సుఖ ప్రసవం అయ్యింది. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఈ వీడియో క్లిప్ షేర్ చేసిన మూడు రోజుల్లోనే ఆరు మిలయన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కాగా, నెటిజన్లు మాత్రం అందరిలా కాకుండా ప్రతీది రియలిస్టిక్గా ప్రసవ సమయంలో ఉండే ఉద్విగ్న స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారని ఆమెని ప్రశంసించగా, మరికొందరు మాత్రం ఇలాంటివి ఎందుకు చిత్రీకరిస్తారని మండిపడుతూ పోస్టులు పెట్టారు. (చదవండి: 71 ఏళ్ల వయసులో సీఏ అయ్యాడు..! మనవరాలి కోసం..)

ఆ శకం ముగిసింది : రూ. 183 కోట్ల డీల్, రూ. 3వేల కోట్ల లగ్జరీ ప్రాజెక్ట్
బాలీవుడ్లో 100 ఏళ్లకు పైగా చరిత్ర, భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన ఒక ఐకానిక్ స్టూడియో శకం ముగియనుంది. 1943లో శషధర్ ముఖర్జీ స్థాపించిన ఫిల్మిస్తాన్ స్టూడియోస్ (Filmistan Studios) ఇపుడిక కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా మారబోతోంది. దీన్ని ఆర్కేడ్ డెవలపర్స్ జూలై 3న రూ. 183 కోట్లకు కొనుగోలు చేసిందని టైమ్స్ నౌ డిజిటల్ నివేదించింది. ఈ మార్పు బాలీవుడ్ స్వర్ణయుగానికి మూలస్తంభం, ఐకానిక్ స్టూడియో శకం ముగింపును సూచిస్తుందని పలువురి సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.బ్రిటీష్ పాలనలో భారతదేశంలో ఏర్పడిన స్టూడియోలలో ఒకటి ఫిల్మిస్తాన్ స్టూడియో. దీన్ని ఏర్పాటు చేసిన శశధర్ ముఖర్జీ మరోవ్వరో కాదు బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, రాణి ముఖర్జీల తాత. ముంబైలోని గోరేగావ్ వెస్ట్లో ఉన్న ఈ స్టూడియోను నటుడు అశోక్ కుమార్, జ్ఞాన్ ముఖర్జీ , రాయ్ బహదూర్ చునిలాల్ వంటి దిగ్గజ వ్యక్తులతో కలిసి స్థాపించారు. బాంబే టాకీస్ను విడిచిపెట్టిన వీరంతా హైదరాబాద్ నిజాం సహాయంతో దీన్నిస్థాపించారు. అప్పటినుంచి అనేక ప్రతిష్టాత్మక సినిమాలకువేదికైంది. ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదిక ప్రకారం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్ దీన్ని కొనుగోలు చేసింది. 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టూడియో స్థానంలో విలాసవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కు సన్నాహాలు చేస్తోంది. 2026లో షురూ కానున్నఈ ప్రాజెక్ట్కు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రీమియం 3, 4 , 5 BHK అపార్ట్మెంట్లతో కూడిన రెండు ఎత్తైన 50-అంతస్తుల భవనాల సముదాయంగా నిర్మించనుంది. ఆర్కేడ్ డెవలపర్స్ ఛైర్మ, ఎండీ అమిత్ జైన్ లింక్డ్ఇన్లో ఈ విషయాన్ని ధృవీకరించారు. పట్టణ,విలాసవంతమైన జీవనానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు.చదవండి: Akhil Anand చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ కుమారుడు 14 ఏళ్లకే!మరోవైపు ఫిల్మిస్తాన్ స్టూడియోను విక్రయంపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేష్ ((AICWA) స్పందించింది. ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది కార్మికులు,కార్మికులు, కళాకారులు రోడ్డున పడతారని వాదిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జోక్యం చేసుకుని స్టూడియో కూల్చివేతను ఆపాలని కోరింది.ఈ స్టూడియో కేవలం ఒక నిర్మాణ మైలురాయి మాత్రమే కాదు, వేలాది మంది తెరవెనుక నిపుణుల అవిశ్రాంత అంకితభావంపై నిర్మించిన గొప్ప సాంస్కృతిక వారసత్వ వేదిక అని పేర్కొంది. ఇలాంటి అనేక ఇతర చారిత్రాత్మక చలనచిత్ర స్టూడియోలు ఇదే దశలో ఉన్నాయనీ, వినోద రంగంలో ఉపాధికి విస్తృత ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ అసోసియేషన్ నేతలు సీఎంకు ఒక లేఖ రాశారు. ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
ఫొటోలు
అంతర్జాతీయం

నా ప్రాణాలకు ముప్పు నిజమే: ట్రంప్
వాషింగ్టన్: తన ప్రాణాలకు ముప్పు ఉన్న మాట నిజమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డ్రోన్ దాడి చేసి ట్రంప్ను అంతం చేస్తామంటూ ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహితుడొకరు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మర్–ఎ–లాగో రిసార్ట్లో ట్రంప్ సన్ బాత్ చేస్తున్న సమయంలో డ్రోన్ ప్రయోగిస్తామని, అదే అనువైన ప్రదేశమని చెప్పారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఇది తనకు వచి్చన బెదిరింపుగానే భావిస్తున్నానని తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయంలో సందేహం లేదన్నారు. వాస్తవానికి ఏడేళ్ల వయసు నుంచి తాను సన్ బాత్ చేయడం లేదని వివరించారు. ఖమేనీ అనుచరుడి హెచ్చరికలను పరోక్షంగా ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు.

రూ.70 కోట్లు పలికిన హ్యాండ్ బ్యాగ్
పారిస్: అక్కడక్కడా చిరిగిపోయి, మరకలు పడి, బాగా వాడేసిన నల్లని బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్. కానీ అది అలాంటిలాంటి బ్యాగ్ కాదు. అలనాటి అందాల హాలీవుడ్ నటి వాడిన బ్యాగ్. ఆ క్రేజ్ వల్లేనేమో, ప్రఖ్యాత ఫ్రెంచ్ నటి దివంగత జేన్ బిర్కిన్ వాడిన హ్యాండ్ బ్యాగ్ ఏకంగా 82 లక్షల డాలర్లకు, అంటే దాదాపు రూ.70 కోట్లకు అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక హ్యాండ్ బ్యాగ్కు ఇంతటి ధర పలకడం వేలంపాటల చరిత్రలో ఇదే తొలిసారి. ప్రఖ్యాత సోత్బీ వేలం సంస్థ దీనిని గురువారం ఆన్లైన్లో విక్రయించింది. 10 లక్షల డాలర్ల బిడ్డింగ్తో మొదలైన వేలం పాట క్షణాల్లో కోట్లు దాటేసి కొత్త రికార్డ్ను కొట్టేసింది. ఎట్టకేలకు జపాన్కు చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి ఈ బ్యాగును సొంతం చేసుకున్నారు. ఎవరీ బిర్కిన్? తన అందం, అభినయంతో ఫ్రెంచ్ సినిమాలను ఒక ఊపు ఊపిన అలనాటి ప్రఖ్యాత బ్రిటిష్ నటి జేన్ బిర్కిన్. నేపథ్య గాయనిగా, ఫ్యాషన్ డిజైనర్గా, సామాజిక కార్యకర్తగా... ఇలా పనిచేసిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశారామె. నాటి సినీ, ఫ్యాషన్ ప్రపంచ ఐకాన్గా వెలిగిపోయారు. 1946 డిసెంబర్ 14న లండన్లోని మేరీలీబాన్లో జన్మించారు. 76వ ఏట పారిస్లో తుదిశ్వాస విడిచారు. హెర్మ్స్ లగ్జరీ వస్తువుల సంస్థ ప్రత్యేకంగా బిర్కిన్ కోసమే 1984లో ఈ బ్యాగును తయారుచేసింది. పారిస్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో బిర్కిన్ పక్క సీటులో హెర్మ్స్ సంస్థ చైర్మన్ జీన్ లూయిస్ డ్యూమస్ ప్రయాణించారు. ‘‘విమానం ఎక్కినప్పుడు వస్తువులు పెట్టుకోవాలంటే వాంతి చేసుకునే కవర్లో పెట్టుకోవాల్సి వస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యాండ్ బ్యాగులన్నీ చిన్నగా ఉన్నాయి. అల్లిన బుట్టను వాడడం ఇబ్బందిగా ఉంది. కాస్తంత పెద్ద బ్యాగు తయారు చేయొచ్చుగా!’’ అని అతడిని బిర్కిన్ కోరింది. అడిగిందే తడవుగా సంస్థలోని నిష్ణాతులను పురమాయించి అత్యంత నాణ్యమైన తోలుతో, ప్రత్యేకతలతో పెద్ద బ్యాగ్ను తయారు చేయించి 1985లో ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ బ్యాగులను ఇకపై మీ పేరుతో అమ్ముకోవచ్చా అని అడిగితే ఆమె సరేనన్నారు. ఆమె చాన్నాళ్లపాటు అంటే 1985 నుంచి 1994 దాకా రోజూ ఆ బ్యాగును వెంట తీసుకెళ్లేది. అందాల నటి చేతిలో మరింత అందంగా కనిపించిన ఆ బ్యాగుకు ఫ్యాషన్ ప్రపంచం ఫిదా అయింది. తర్వాత మరో నాలుగు బ్యాగులను కూడా కంపెనీ నుంచి ఆమె బహుమతిగా అందుకున్నారు. కానీ ఈ బిర్కిన్ బ్యాగు మాత్రం ఫ్యాషన్ చిహ్నంగా స్ధిరపడింది. దాంతో హెర్మ్స్ తయారీ బిర్కిన్ బ్యాగుల ధర సైతం అమాంతం పెరిగిపోయింది. కేవలం అత్యంత సంపన్నులు మాత్రమే కొనగలిగే బ్యాగ్గా మారిపోయింది.బ్యాగుతో పాటు గోళ్ల కత్తెర బిర్కిన్కు గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం అలవాటు. అందుకే ఆమెకు బహూకరించిన బ్యాగుకు కంపెనీ వెండి గోళ్ల కత్తెరనూ జతచేసింది. జిప్ లాక్ చేయడానికి బుల్లి తాళం కూడా ఇచ్చింది. బ్యాగుకు యూనిసెఫ్, మెడిసిన్స్ డ్యూ మోండే వంటి మానవీయ సంస్థల గుండ్రని స్టిక్కర్లను అతికించారామె. బిర్కిన్ 2023లో చనిపోయారు. అంతకు కొద్ది రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ, ‘నా నటన, గానం, ఫ్యాషన్, సమాజసేవతో పాటు నేను చనిపోయాక నా బ్యాగ్ గురించి కూడా జనం మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో!’ అని అన్నారు. ఆమె ఊహించినట్లే లగ్జరీ వస్తువుల ప్రపంచంలో ఇప్పుడా బ్యాగు ప్రత్యేక స్థానం ఆక్రమించుకుందని సోత్బీ హ్యాండ్బ్యాగులు, యాక్సెసరీల గ్లోబల్ హెడ్ మోర్గాన్ హ్యాలిమీ వ్యాఖ్యానించారు. ఒరిజినల్ బ్యాగును ఎయిడ్స్ ఛారిటీ నిధి కోసం వేలం పాట సంస్థకు ఆమె 1994లోనే ఇచ్చేశారు. 2000లో అది మరోసారి వేలానికి వచి్చంది. తర్వాత పాతికేళ్లుగా ఎవరికీ కనిపించలేదు. ఇన్నాళ్లకు సోత్బీ దాన్ని దక్కించుకుని గురువారం ఇలా రికార్డు స్థాయిలో విక్రయించింది. ఈ బ్యాగు మోడల్ అంటే తమకెంతో ఇష్టమని పలువురు సెలెబ్రిటీలు, ఆరి్టస్టులు, స్టైలిస్టులు గతంలో చెప్పారు.

ట్రంప్ పొగిడినా కష్టాలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనుషుల్ని మెచ్చడం అత్యంత అరుదు. అందునా తనకు నచ్చని దేశాల అధ్యక్షులను వైట్హౌజ్కు పిలిపించుకుని మరీ అవమానించడం ఆయనొక అలవాటుగా మార్చుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఓ దేశ అధ్యక్షుడ్ని మెచ్చుకుంటే.. అది కూడా బెడిసి కొట్టింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ , దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీని తన ఓవెల్ ఆఫీస్లో మీడియా సమక్షంలోనే డిక్టేటర్(నియంత) అంటూ తిట్టిపోశారు. అలాగే.. రామఫోసా ముందు ఓ వీడియో ప్రదర్శించి.. సౌతాఫ్రికాలో తెల్లవాళ్లను ఊచకోతలు కోస్తున్నారంటూ ఏకంగా ఓ తప్పుడు వీడియోను ప్రదర్శించి మరీ విమర్శలు గుప్పించారు.ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మినహా ఆయన ప్రత్యేకంగా ఎవరినీ ప్రశంసించింది లేదు. తాజాగా లిబీరియా అధ్యక్షుడు జోసెఫ్ బొకాయ్పై ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. ఇప్పటిదాకా వైట్హౌజ్కు వచ్చిన ఏ నేత కూడా ఇంత అందంగా ఆంగ్లంలో మాట్లాడలేదంటూ.. Such good English అని ట్రంప్ వ్యాఖ్యానించారు. Where did you learn to speak so beautifully? అంటూ ఆరా తీశారు. తనకు తెలిసిన అమెరికన్ల కంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడారంటూ కితాబిచ్చారు.Trump to Liberia’s President “Your English is beautiful better than some Americans I know.” 🇱🇷😂FYI: English is Liberia’s official language.#Trump #Liberia #JosephBoakai #Politics pic.twitter.com/WidIjSWA3N— A.S (@DHAS013) July 10, 2025అయితే ఈ పొగడ్త వివాదాస్పదంగా మారింది. లిబీరియా అధికార భాష ఆంగ్లమే. పైగా బొకాయ్ లిబీరియాలోనే విద్యనభ్యసించారు. దీంతో ఆఫ్రికా అంతటా ట్రంప్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఆఫ్రికన్ యూత్ యాక్టివిస్ట్ ఆర్చీ హారిస్ స్పందిస్తూ.. మా దేశం ఆంగ్ల భాష మాట్లాడే దేశం. ఈ ప్రశ్నను ప్రశంసగా కాక, అవమానంగా భావించాను అని అన్నారు.దక్షిణాఫ్రికా రాజకీయ నాయకురాలు వెరోనికా మెంటే స్పందిస్తూ.. ట్రంప్ అలా అన్నాక కూడా బొకాయ్ ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోలేదు? అని ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యను హృదయపూర్వక ప్రశంసగా, ట్రంప్ ఆఫ్రికా దేశాలకు మిత్రుడిగా అభివర్ణించింది. లిబీరియా.. 1822లో అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ ద్వారా స్థాపించబడింది. 1847లో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆంగ్ల భాష అధికార భాషగా ఉంది, కానీ అనేక స్థానిక భాషలు కూడా మాట్లాడబడతాయి.

అమెరికాలో కూలిన సొరంగం.. కార్మికులకు తప్పిన ప్రమాదం
లాస్ ఏంజిల్స్: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లాస్ ఏంజిల్స్ పరిధిలోని విల్మింగ్టన్ లో నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కూలిపోయింది. ఈ ఘటనలో రెస్క్యూ సిబ్బంది 31 మంది కార్మికులను రక్షించారు. సొరంగం యాక్సెస్ పాయింట్ నుండి దాదాపు ఆరు మైళ్ల దూరంలో అది కూలిపోయిందని అధికారులు తెలిపారు. 🚨🇺🇸#BREAKING | NEWS ⚠️LIVE Over 20 people trapped after an industrial tunnel collapses in Wilmington Los Angeles over 100 LAFD firefighters on site trying to rescue the workers… pic.twitter.com/rlRQQfmgkz— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) July 10, 2025సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు 100 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి తరలివెళ్లారు. వీరు 31 మంది కార్మికులను రక్షించారు. సొరంగంలోని ఒక భాగం కూలిపోవడంతో, పలువురు కార్మకులు అందులో చిక్కుకున్నారు. సమాచారం అందగానే లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక విభాగం సంఘటనా స్థలానికి చేరుకుంది. సమన్వయంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా, 31 మంది కార్మికులను సొరంగం నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 18 అడుగుల వెడల్పు కలిగిన ఈ సొరంగాన్ని నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్నారు. మురుగునీటిని మళ్లించేందుకు ఇది ఉపయుక్తం కానుంది. లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్ ఈ సంఘటనను ‘ఎక్స్’లో తెలిపారు. The City of Los Angeles has mobilized resources to the tunnel collapse in Wilmington.More than 100 LAFD responders have been deployed, including Urban Search and Rescue teams.Thank you to all of those who are acting immediately to respond to this emergency.— Mayor Karen Bass (@MayorOfLA) July 10, 2025
జాతీయం

పప్పు పంచాయితీ.. ఎమ్మెల్యేపై కేసు నమోదు
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్పై కేసు నమోదైంది. పాడైపోయిన పప్పు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఓ జాతీయ మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకోవైపు తీవ్ర దుమారం రేపుతున్నాయి.బుల్దానా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్.. ముంబైలోని తన అధికారిక నివాసంలో పనిచేస్తున్న క్యాంటీన్ కాంట్రాక్టర్ను తీవ్రంగా కొట్టారు. పాచిపోయిన ఆహారం ఇచ్చారంటూ పప్పు ఉన్న కటోరాను కాంట్రాక్టర్ ముక్కు వద్ద పెట్టిన గైక్వాడ్.. ఆ వెంటనే అతనిపై ముష్టిఘాతాలు కురిపించారు. సదరు కాంట్రాక్టర్ కింద పడిపోయి.. లేవలేని స్థితిలో ఉన్నా.. తన దాడిని ఆపలేదు. ఈ దాడికి సంబంధించిన వీడియో బుధవారం నెట్టింట వైరల్ అయ్యింది.అధికార పార్టీ ఎమ్మెల్యే తీరును ప్రతిపక్షాలతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢ్నవిస్, శివసేన బాస్.. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్రంగా ఖండించారు. అయినా కూడా గైక్వాడ్ తన నోటి దురుసును ఆపలేదు. తన చర్యను సమర్థించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత.. శుక్రవారం ఆయనపై కేసు నమోదైనట్లు సమాచారం. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు చేశారో స్పష్టత రావాల్సి ఉంది.గురువారం రాత్రి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణ భారతీయులపై శివసేన(శిందే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతీయులు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ.. మహారాష్ట్ర సంస్కృతిని నాశనం చేస్తున్నారు. శెట్టి అనే దక్షిణాది వ్యక్తికి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? మహారాష్ట్ర స్థానికుడికి ఇవ్వాలి కదా? ఏం తినాలో మాకు తెలుసు. దక్షిణాదివారు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ.. పిల్లల్ని చెడగొడుతుంటారు. అలాంటి వారు మంచి ఆహారం ఎలా అందిస్తారు? అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక్క సాక్ష్యమైనా ఉందా?
చెన్నై: ఆపరేషన్ సిందూర్ విషయంలో విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని జాతీయ భద్రతా సలహాదారు అజిద్ దోవల్ మండిపడ్డారు. ఈ ఆపరేషన్లో భారత్కు నష్టం వాటిల్లినట్లు కనీసం ఒక్క ఫొటో అయినా చూపించగలరా? కనీసం ఒక గాజు ముక్క అయినా పగిలినట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత్కు గర్వించదగ్గ ఘట్టమని అభివర్ణించారు. ఈ ఆపరేషన్లో భారత్ సైతం భారీగా నష్టపోయిందంటూ అంతర్జాతీయ మీడి యాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం ఐఐటీ–మద్రాసు 62వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి అజిత్ దోవల్ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భూభాగంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఒక్క టార్గెట్ కూడా గురి తప్పలేదని స్పష్టంచేశారు. ఎవరు(ఉగ్రవాదులు) దాక్కున్నారో తమకు తెలుసని, మే 7వ తేదీన కేవలం 23 నిమిషాల్లో తొమ్మిది శిబిరాలు నేలమట్టం అయిపోయాయని పేర్కొన్నారు. సరిహద్దుకు దూరంగా సరిగ్గా ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేశామని తెలిపారు. అవన్నీ పాకిస్తాన్ ఫొటోలే.. ‘‘పాకిస్తాన్లో 13 ఎయిర్బేస్లు ధ్వంసమైనట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. మే 10వ తేదీకి ముందురోజు, తర్వాతి రోజు ఫొటోలను ప్రచురించింది. అవి పాకిస్తాన్లోని సర్గోధా, రహీంయార్ఖాన్, చాక్లాలా ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలే. వాటిలో భారత్కు సంబంధించిన ఫొటో ఒక్కటైనా ఉందా? అలాంటప్పుడు భారత్కు నష్టం జరిగిందని ఎలా అంటారు? పాకిస్తాన్ సైన్యం ఇండియాకు వ్యతిరేకంగా అది చేసింది, ఇది చేసింది అంటూ అంతర్జాతీయ మీడియా చెబుతున్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇండియాకు నష్టం జరిగినట్లు ఒక్క సాక్ష్యం ఉన్నా చూపించాలి. పాకిస్తాన్పై దాడులు చేసి వెనక్కి వస్తుండగా ఒక్క గాజు ముక్క కూడా పగిలిపోలేదు. పాక్ ప్రయోగించిన క్షిపణులను మన గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చివేసింది. ఆపరేషన్ సిందూర్లో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించినందుకు గర్వపడుతున్నాం. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేయగలమని ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం నిరూపించింది. మన సైన్యం శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది’’ అని అజిత్ దోవల్ వివరించారు. ఏఐ ఒక గేమ్ చేంజర్ యుద్ధ తంత్రానికి టెక్నాలజీ అనుసంధానించడం చాలా కీలకమని అజిత్ దోవల్ చెప్పారు. మన అవసరాలకు తగ్గట్టుగా దేశీయంగానే టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్లో బ్రహ్మోస్ క్షిపణులు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కంట్రోల్, కమాండ్ సిస్టమ్ ఉపయోగించామని, ఇవి దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నవేనని గుర్తుచేశారు. కృత్రిమ మేధ(ఏఐ) ఒక గేమ్చేంజర్ అని తెలియజేశారు. దానిని కేంద్ర బిందువుగా చేసుకోవాలన్నారు.

49వేల కోట్ల కుంభకోణం.. వెలుగులోకి దేశంలో అతిపెద్ద స్కాం
బిగ్ బుల్ హర్షద్ మెహతా.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకే కాదు.. మార్కెట్ గురించి ఎలాంటి పరిజ్ఞానం లేనివారికి కూడా పరిచయం అక్కర్లేని పేరు. స్టాక్ బ్రోకర్గా కెరియర్ను ప్రారంభించి.. బ్యాంకుల్లో ఉన్న లొసుగులతో బ్యాంక్ రిసిప్ట్స్ (BRs) ద్వారా రూ.5 వేల కోట్లకు పైగా దుర్వినియోగంతో భారత ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపేసిన ఉదంతం. 1992లో జరిగిన ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మూడు దశాబ్దాల తర్వాత, పౌంజీ స్కాం రూపంలో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. రూ.49వేల కోట్ల స్కాంతో హర్షద్ మెహతా స్కాం తరువాత దేశంలో అత్యంత ఆర్థిక నేరాల్లో ఒకటిగా నిలిచింది. ఏంటి ఈ స్కామ్? ఎవరు చేశారు?నిర్మల్ సింగ్ భాంగూ. పంజాబ్లోని బర్నాలా నివాసి. 1970లలో ఓ వైపు ఇంటింటికి తిరిగి పాలమ్ముతూ పొలిటికల్ సైన్స్లో పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగం కోసం కోల్కతాకు వెళ్లారు. అక్కడ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ పెర్ల్స్లో చేరాడు. ఆ తరువాత అంచలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ సంస్థ ఈ సంస్థ పెట్టుబడిదారులను మోసం చేసింది. దివాళా తీయడంతో భాంగూ ఉద్యోగం కూడా పోయింది.అప్పుడే తనకున్న అనుభవంతో 1996లో నిర్మల్ సింగ్ భంగూ.. గుర్వాంత్ ఆగ్రో టెక్ లిమిటెడ్తో సంస్థను ప్రారంభించారు. అలా 30ఏళ్లుగా అంటే 1996లో గుర్వాంత్ ఆగ్రో టెక్ నుంచి పెర్ల్స్ అగ్రో టెక్ మారిన ఈ సంస్థ దాదాపు రూ.49,000 కోట్ల పౌంజీ కుంబకోణానికి తెరతీసింది. దేశం మొత్తం మీద 5 కోట్ల మంది అమాయకులను మోసం చేసి ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసింది. చివరికి ఆసంస్థ చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఆ సంస్థ కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని అరెస్ట చేసింది. తాజాగా ఆ సంస్థ డైరెక్టర్ గుర్నాసింగ్ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో పెట్టుబడిదారులు గతంలో పోలీస్ కేసు ఫైల్ చేశారు, ఆ తర్వాత ఈ విషయం CBIకి చేరింది. ఈ కేసులో పేరున్న 10 మంది నిందితుల్లో నలుగురిని CBI ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపింది. గుర్నామ్ సింగ్ అరెస్టు తర్వాత పెట్టుబడిదారులు తమ డబ్బు తిరిగొస్తుందని ఆశతో ఉన్నారు. EOW సహా ఇతర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఈ ఫ్రాడ్ నెట్వర్క్ మూలాలను లోతుగా విచారిస్తున్నాయి.

బెంచీల ఐడియా భలే!
ఇది ఇట్లాగే ఉండాలి.. అది అట్లాగే ఉండాలని అందరూ అనుకుంటే..మనిషి, సమాజపు ప్రగతి కూడా అక్కడికక్కడే స్తంభిస్తుంది!అయితే.. ఎవరో ఒకరు.. ఎప్పుడో అపుడు..యథాతథ స్థితిని ప్రశ్నిస్తారు.. ముందడుగు వేస్తూంటారు.చరిత్ర తెరచి చూస్తే ఇందుకు బోలెడన్ని ఉదాహరణలు..వర్తమానంలో కనిపిస్తున్న తాజా ఉదాహరణ ఇది..మీ క్లాస్ రూమ్లో బెంచీలుండేవా? ఉంటే.. అవన్నీ వరుసల్లోనే ఉండి ఉంటాయి. ముందు వరుసలో కూర్చున్న విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పేది శ్రద్ధగా వినే అవకాశం దొరికేది. వెనుక వరుసల వారు తమదైన ఆకతాయి పనులు చేసేందుకు... అప్పుడప్పుడూ టీచర్ల ఆగ్రహానికి గురయ్యే ఇబ్బంది కూడా ఏర్పడేది. టీచర్లు చెప్పేది వినలేక.. అర్థం కాక వెనుక బెంచీల వాళ్లు ఆకతాయిలుగా మారిన సందర్భాలూ ఉండే ఉంటాయి. ఇది యథాతథ స్థితి.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలోని దాదాపు ప్రతి పాఠశాలలోనూ బెంచీలు ఇలాగే వరుసల్లోనే ఉండి ఉంటాయి. అయితే మళయాళం సినిమా ఒకటి ఈ యథాతథ స్థితిని సవాలు చేసింది. ‘‘బెంచీలన్నీ ఇలా వరుసల్లోనే ఎందుకు ఉండాలి’’ అని ప్రశ్నించింది. బదులుగా చతురస్రపు గదిలో గోడల వెంట ‘సీ’ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేసి తన సినిమాలో చూపింది. విద్యార్థులందరి దృష్టి టీచర్లపై ఉండేందుకు అవకాశం ఏర్పడిందన్నమాట. ఉపాధ్యాయులు కూడా అందరి దృష్టి పాఠాలపైనే ఉండేలా చూసుకునేందుకూ వీలేర్పడింది.భలే ఉందే ఈ ఐడియా అనుకున్నారు కేరళలోని కొందరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ఒట్టిగా అనుకోవడం ఎందుకు మనమూ అలా వాడేస్తే పోలా అన్నారు ఇంకొందరు.. ఇది ఒక ట్రెండ్కు దారి తీసింది. ప్రస్తుతం కేరళలోని పలు పాఠశాలల్లో ఇప్పుడు కుర్చీల అమరిక ‘సీ’ ఆకారంలోకి మారిపోయాయి. కొసమెరుపు ఏమిటంటే... చాలా ఆడిటోరియమ్స్లో, యూనివర్శిటీల్లో.. మరీ ముఖ్యంగా పాశ్చాత్యదేశాల్లో తరగతి గదుల కూర్పు ఇదే విధంగా ఉండటం!.No more frontbenchers vs backbenchers?In most classrooms, your seat says it all—frontbenchers shine, backbenchers get sidelined.But what if a film could help us unlearn the narrative? In Kerala, it just did.A Malayalam movie scene sparked a real-life shift, replacing rigid… pic.twitter.com/LU7YEogMWG— The Better India (@thebetterindia) July 11, 2025అందరినీ కలుపుకుపోతూ...‘‘ఆ.. ఏమంది.. వరుసగా ఉన్న బెంచీలను చుట్టూ పెట్టేశారు. అంతే కదా? దీంతో ఏమవుతుంది?’’ అని చాలామంది అనుకోవచ్చు కానీ.. ఈ డిజైన్ మార్పుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయులతో మసిలే విధానం, వారి ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యాలపై ప్రభావం చూపుతాయి. పాఠం చెబుతున్న సమయంలో టీచర్ను నేరుగా చూడగలగడం వల్ల విద్యార్థులు వారితో మాట్లాడేందుకు అవకాశం ఎక్కువవుతుంది. ఇది ఏకాగ్రత ఎక్కువవుతుంది. బోధనలో విద్యార్థులూ భాగస్వాములవుతారు. వరుస బెంచీల్లో కూర్చొన్నప్పుడే వెనుక ఉన్న వారితో కలుపుగోలుగా ఉండొచ్చు. క్లాసులో ఏదైనా యాక్టివిటీ చేయాలంటే సులువుగా ఉంటుంది. విద్యార్థులందరినీ కలుపుకుని పాఠం చెప్పేందుకు టీచర్లకు వెసలుబాటు ఏర్పడుతుంది.-గిళియారు గోపాలకృష్ణ మయ్యా.
ఎన్ఆర్ఐ

నృత్యంతో అలరించిన నేహారెడ్డి
నేహా రెడ్డి ఆళ్ల .. అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి.. తల్లిదండ్రులు శివరామి రెడ్డి, నాగ మల్లేశ్వరి. తన తల్లి నాగ మల్లేశ్వరికి ఉన్న కళాపేక్ష వల్ల చిన్నప్పుడే వర్జీనియాలోని కళామండపం నృత్య పాఠశాలలో గురు మృణాళిని సదానంద గారి దగ్గర చేరి, కూచిపూడిలో మెలకువలు నేర్చుకుంది. గురువు మృణాళిని సదానంద గారి శిష్యరికంలో యెన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది.. అంతేకాకుండా నేహా చదువులో కూడా అత్యంత ప్రతిభను కనపరుస్తూ ఎన్నో బహుమతులను తెచ్చుకుంది. మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేహ నృత్యప్రదర్శన ఇచ్చింది. అంతేకాకుండా అమెరికాలో జరిగే పండుగ కార్యక్రమాలలో తన నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుని ప్రసంశలు పొందింది. నృత్యంలోనే కాదు చదువులోనూ రాణిస్తున్న నేహాకు డాక్టర్ కావాలనేది లక్ష్యం. శనివారం, జూలై 5న తన గురువు గారు కళారత్న శ్రీమతి మృణాళిని సదానంద గారి అధ్వర్యం లో నృత్య సంభావన (అరంగేట్రం)చేసింది నేహా రెడ్డి ఆళ్ల.. గురు మృణాళిని సదానంద గారు అన్ని నృత్యములకు కొరియోగ్రఫీ చేయగా నేహ తన నృత్యప్రదర్శనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి గురు సత్యప్రియ రమణ చీఫ్ గెస్ట్గా ఇండియా నుండి వచ్చారు.. కవిత చీడల ప్రవక్తగా వ్యవహారించారు. నట్టువంగం శ్రీ కమల్ కిరణ్ గారు, వాయిలిన్ విద్వాన్ శ్రీ వింజమూరి సుభాష్ గారు, గాత్రం శ్రీమతి కృపా లక్ష్మి మరియు శ్రీ శశాంక గారు, శ్రీ విజయ్ గణేష్ గారి మృదంగం, శ్రీ సౌమ్య నారాయణన్ గారు ఘటం, వాయిలిన్ సపోర్టింగ్ ఎంఎస్ పద్మిని గారు, స్పెషల్ ఎపెక్ట్స్ శ్రీ రామకృష్ణ గోపినాథ్ తదితరులు సంగీతాన్ని అందించారు. కార్యక్రమానంతరం అందరినీ నేహా రెడ్డి ఆళ్ల తల్లితండ్రులు శ్రీ శివరామి రెడ్డి మరియు శ్రీమతి నాగ మల్లేశ్వరి దంపతులు మరియు సోదరుడు చేతన్ రెడ్డి ఆళ్ల సత్కరించారు..అమెరికాలో అందెల సవ్వడి, డాక్టర్ కావాలనేది కల

న్యూజిలాండ్లో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు
న్యూజిలాండ్లోని ప్రధాన నగరాల్లో కూడా ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి జయంతి వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఆక్లాండ్లోని పిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరి, కో–కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, డేగపూడి సమంత్, సభ్యులు బాలశౌర్య, రాజారెడ్డి, పిళ్లా పార్థ, జిమ్మి, గీతారెడ్డి, ఆళ్ల విజయ్, రమేష్ పనటి, సంకీర్త్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.భారతదేశం నుండి గౌరవ అతిథులుగా అలూరు సంబ శివ రెడ్డి , ఆరే శ్యామల రెడ్డి, జి. శాంత మూర్తి , నందమూరి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూజిలాండ్ మాజీ మంత్రి మైకేల్ ఉడ్ హాజయ్యారు. ఎన్నారైలు బీరం బాల, కళ్యాణ్రావు, కోడూరి చంద్రశేఖర్, అర్జున్రెడ్డి, మల్లెల గోవర్ధన్, జగదీష్ రెడ్డి, ఇందిర సిరిగిరి తదితరులు పాల్గొన్నారు.

లండన్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో లండన్లోనిని ఈస్టమ్లో దివంగత నేత వైఎస్ రాజశే ఖరరెడ్డి 76వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.యూకే నలుమూలల నుంచి వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆన్ లైన్ లో పాల్గొని వేడుకల్లో భాగస్వాములైన వారిని అభినందించారు. వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా మాట్లాడుతూ.. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని రాజశేఖరరెడ్డి జీవి తాన్ని, వారు సాధించిన విజయాలను స్మరించుకో వడం సంతోషంగా ఉందన్నారు. మహానేత ఆశయ సాధనకు వైఎస్ జగన్ శ్రమిస్తున్నార న్నారు. నేతలందరూ వైఎస్ జగన్ వెంట నడవాలని, ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ ఓబుల్ రెడ్డి, వైఎస్సార్సీపీ యూకే కో-కన్వీనర్ మలిరెడ్డి కిశోర్రెడ్డి, కీలక కమిటీ సభ్యులు శ్రీనివాస్ దొంతిబోయిన, ఎస్ఆర్ నందివెలుగు, సురేందర్ రెడ్డి అలవల, బీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ కల్చరల్ సొసైటీ 12వ సర్వ సభ్య సమావేశం
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) / TCSS పన్నెండవ వార్షిక సర్వ సభ్య సమావేశం జూన్ 29వ తేదీన స్థానిక ఆర్య సమాజం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 30 మందికిపైగా సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పదకొండవ సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2024-2025 ఆర్థిక సంవత్సరపు రాబడి, ఖర్చుల వివరాలను సభ్యులకు వివరించిన తరువాత పద్దులను ఉపాధ్యక్షులు భాస్కర్ గుప్త నల్ల ఆమోదించారు. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు ముద్దం విజ్జేందర్ , గర్రెపల్లి శ్రీనివాస్, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల కోశాధికారి నంగునూరి వెంకట రమణ వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి మోడరేటర్గా ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.2024‐2025 ఆర్థిక సంవత్సరానికి గానూ పద్దుల తనిఖీ దారులుగా సేవలు అందించిన కైలాసపు కిరణ్, తెల్లదేవరపల్లి కిషన్ రావు గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సొసైటీ రాజ్యాంగానికి ప్రతిపాదించిన కొన్ని ముఖ్యమైన సవరణలకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు. 2025 నుంచి 2026 గాను పద్దుల తనిఖీ దారులుగా నీలం సుఖేందర్, కిరణ్ కుమార్ ఎర్రబోయిన గార్లను ప్రతిపాదించి ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు సాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీ ని ఆస్వాదించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ గార్ల తోపాటు ఇతర జీవితకాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి)
క్రైమ్

14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి
తమిళనాడు: చెంగల్పట్టు సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో నివసిస్తున్న ఓ 10వ తరగతి బాలుడు రోజూ సాయంత్రం వేళల్లో ట్యూషన్కు వెళ్లేవాడు. ఈనేపథ్యంలో చెంగల్పట్టులో మెకానిక్గా పనిచేస్తున్న పాండిచ్చేరి వాసి అమితు అబ్దుల్ ఖాదర్ 13.04.2024న ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఆ బాలుడిని తన ద్విచక్ర వాహనం ఎక్కమని అడిగాడు. అతను ఎక్కనని చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా, అబ్దుల్ ఖాదర్ ఆ బాలుడిని కత్తితో బెదిరించి తన బైకుపై తీసుకెళ్లి తిరుమణి రైల్వే గేట్ సమీపంలోని ఒక పొదలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.నేను పిలిచినప్పుడల్లా రాకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తానని కూడా బెదిరించాడు. భయంతో ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఈ సందర్భంలో, గత 03.05.2024న, ట్యూషన్ పూర్తి చేసుకుని, రాత్రి 8.30 గంటలకు కాంచీపురం హై రోడ్కు తిరిగి వస్తున్న బాలుడిని కిడ్నాప్ చేసి, చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ముళ్ల పొదలో బంధించి కత్తితో బెదిరించి మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధను భరించలేక, ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో షాక్ కు గురైన ఆ బాలుడి తల్లిదండ్రులు చెంగల్పట్టు నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అమీద్ అబ్దుల్ ఖాదర్పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అంతేకాకుండా, చెంగల్పట్టు పోక్సో కోర్టు ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. బుధవారం ఈ కేసును విచారించిన ప్రభుత్వ న్యాయవాది లక్ష్మి అమీద్ అబ్దుల్ ఖాదర్కి యావజ్జీవ శిక్షను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కల్తీ కల్లు కల్లోలం!
సాక్షి, మేడ్చల్ జిల్లా: రాజధాని నగరంలో కల్తీ కల్లు కల్లోలం రేపింది. ఆరుగురి అమాయకుల ప్రాణాలను బలిగొంది. మోతాదుకు మించిన రసాయనాలు కలిపి తయారు చేసిన కల్లు తాగి నిరుపేదలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మంగళవారం నగరంలోని కేపీహెచ్బీ కాలనీలో ఉన్న కల్లు కాంపౌండ్లలో హైదర్నగర్, సాయిచరణ్ కాలనీలకు చెందిన పలువురు కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వివిధ ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించగా.. బుధవారం వరకు ఆరుగురు మృతి చెందారు. మరో 32 మంది నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తనిఖీలు నామమాత్రం.. నగరం సహా శివారులోని పలు కాంపౌండ్లలో కల్లు అమ్మకాలపై తనిఖీలు చేయాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో కల్తీ కల్లు విక్రయాలకు అడ్డే లేకుండా పోయింది. ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు కల్లు కాంపౌండ్లపై నిఘా ఉంచకపోవడంతోనే వాటి యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. మోతాదుకు మించి రసాయనాలు కలిపి కల్తీ కల్లును తయారు చేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన ఎక్సైజ్శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వల్లే కూకట్పల్లి విషాదాంతం జరిగినట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా కల్లు కాంపౌండ్లు.. ప్రకృతి సిద్ధమైన తాటి, ఈత చెట్ల నుంచి తీసిన కల్లు ఆరోగ్యకరమైంది. స్వచ్ఛమైన ఈ కల్లును తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తొలగుతాయి. సాధారణంగా చెట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల కల్తీ కల్లు ఉండదని చెప్పవచ్చు. డిమాండ్ మేరకు కల్లు ఉత్పత్తి లేకపోవడం, అప్పటి వరకు ఈ వృత్తిపై ఆధారపడిన గీత కార్మికులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఫలితంగా కల్లుకు కొరత ఏర్పడింది. మద్యం ధరలు భారీగా ఉండటంతో రోజువారీ కూలీలు కృత్రిమంగా లభించే కల్లుతో సేదతీరుతున్నారు. వీరి బలహీనతను కొంత మంది కల్లు వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్ఫాజోలమ్ వంటి ప్రమాదకర రసాయపాలను వినియోగించి కల్లు తయారు చేస్తున్నారు. తయారీలో మోతాదుకు మించి రసాయనాలను వినియోగిస్తుండటంతో.. ఈ కల్లు తాగినవారు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గ్రేటర్తో సహా శివారుల్లోని పలు ప్రాంతాలు, బస్తీలు, పురపాలక సంఘాల్లో కల్తీ కల్లు విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కల్లు కాంపౌండ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, నమూనాలు సేకరించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమీ çపట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కల్తీ జరుగుతోందనే ఆరోపణలుతున్నాయి. ఒకే లైసెన్స్తో.. ఎన్నో కాంపౌండ్లు.. నగరంతో సహా పలు చోట్ల ఒకే కల్లు దుకాణం లైసెన్సు పొంది ఎక్కువ దుకాణాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఒక లైసెన్స్ ఒకటే దుకాణం నడిపించాల్సి ఉంటుంది. అయినా వ్యాపారులు మాత్రం ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వీరిపై ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంగానే మారుతోంది. నాడీ వ్యవస్థపై ప్రభావం.. డైజోఫాం ఇతర రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లు తాగిన వారిలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒంటి నొప్పులతో పాటు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని, మానసిక విచక్షణ కోల్పోయి పిచి్చగా ప్రవర్తిస్తుంటారని చెబుతున్నారు. ఈ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్షతగాత్రులకు సర్జరీల సమయంలో నొప్పి నివారణ కోసం ఇచ్చే మత్తు ఇంజక్షన్లు కూడా పని చేయవని, మోతాదుకు మించిన డోసు ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. సాధ్యమైనంత వరకు ఈ కల్లు తాగకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు.

నైట్ డ్యూటీకి వెళ్లి.. మిస్టరీగా నర్స్ మృతి
అనంతపురం: నగరంలోని సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు దివ్య (22) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన వడ్డె దివ్య.. మూడేళ్లుగా సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అదే ఆస్పత్రికి చెందిన హాస్టల్లోనే ఉంటున్నారు. ఆరోగ్యం బాగోలేదని మంగళవారం రాత్రి తోటి నర్సులకు తెలిపి ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రించారు. బుధవారం మధ్యాహ్నమైనా ఆమె లేవలేదు. మధ్యాహ్నం షిఫ్ట్ నర్సులు వచ్చి పలుకరించినా స్పందన లేకపోవడంతో పల్స్ పరిశీలించారు. నాడి చిన్నగా కొట్టుకుంటుండడంతో వెంటనే సవేరా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, దివ్య మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

తండ్రిని చంపేసి.. సెకండ్ షో సినిమాకు వెళ్లి..
మల్కాజ్గిరి జిల్లా: భర్త దగ్గరికి వెళ్లాలని మందలించాడని, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత తన తండ్రినే హత్య చేయించింది. తల్లి, ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా నమ్మించాలని యతి్నంచి కటకటాలపాలైంది. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరి«ధిలో జరిగింది. హత్య వివరాలను బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలి్పన మేరకు..ముషిరాబాద్ పరిధిలోని ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతులు. లింగం సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తుండగా, శారద జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికురాలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ నెల 6న లింగం విధులు నిర్వహించడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించగా ఆ రోజు విధులకు రాలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న మధ్యాహ్నం పెద్ద కుమార్తె మనీషాకు పోలీసులు వాట్సాప్లో ఓ ఫోటో పంపి గుర్తించాలని కోరారు. మృతుడ్ని తండ్రిగా గుర్తించి..తల్లి శారదతో కలిసి ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్దకు వెళ్లారు. లింగం శవాన్ని చూసి బోరున విలపించారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతకోసి చంపారని శారద పీఎస్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ముగ్గురూ కలిసి ... లింగం పెద్ద కూతురు మనీషా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో వీరి ఇంటి సమీపంలో ఉంటుంది. మహ్మద్ జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై లింగం కోపగించి..అతనితో సంబంధం మానేయాలని హెచ్చరించాడు. భర్త దగ్గరకు కాపురానికి వెళ్లిపోవాలని మనీషాను ఒత్తిడిచేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా తండ్రిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె తల్లి శారద, మహ్మద్ జావీద్ సహకరించారు. ఈమేరకు హత్య చేసిన తర్వాత శవాన్ని ఎక్కడ వేయాలో అని చర్చించి 15 రోజుల క్రితమే ఏదులాబాద్ చెరువును పరిశీలించి వెళ్లారు.కల్లులో నిద్ర మాత్రలు కలిపి... లింగంకు కల్లు తాగే అలవాటు ఉండడంతో అందులో నిద్రమాత్రలు కలపాలని జావీద్ ఈ నెల 5న శారదకు టాబ్లెట్లు అందించాడు. లింగం కల్లు తాగి ఇంట్లో పడుకోగా.. విషయాన్ని శారద..కుమార్తె మనీషా, జావీద్లకు సమాచారం ఇచి్చంది. మనీషా సమీపంలోని వైన్స్లో మద్యం కొనుగోలు చేసి వచి్చ..మరోసారి లింగంకు తాగించారు. అనంతరం శారద, మనీషాల సహకారంతో లింగం కాళ్లు చేతులు కట్టేసిన జావీద్..అతడి ముఖంపై దిండుతో అదిమి..పిడికిలితో గుండెపై మోది, గొంతు కోసి చంపేశారు. శవాన్ని ఇంట్లో వేలాడదీశారు. సినిమాకు వెళ్లి..క్యాబ్లో శవాన్ని తరలించి.. హత్య అనంతరం ముగ్గురు జావీద్ ఉండే ఇంటికి బైక్పై వెళ్లి.. అటునుంచి సెకెండ్ షో సినిమాకు వెళ్లారు. తిరిగొచ్చి శవాన్ని ఎదులాబాద్ చెరువులో పడేయడానికి క్యాబ్ బుక్ చేసుకున్నారు. లింగం అపస్మారక స్థితిలో ఉండడంతో డ్రైవర్ అనుమానించి కారు బుకింగ్ రద్దు చేసుకున్నాడు. మద్యం సేవించాడని, ఎదులాబాద్లో కుటుంబ సభ్యులకు అప్పగించాలని డ్రైవర్కు నచ్చజెప్పి ఒప్పించారు. కారులో శవంతో మనీషా, శారద ఉండగా..జావీద్ బైక్పై వెనుక అనుసరించి.. శవాన్ని చెరువు కట్టపై దించారు. క్యాబ్ వెళ్లగానే శవాన్ని చెరువులో పడేసి ముగ్గురు బైక్పై ఇంటికి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కుటుంబ సభ్యుల పైనే అనుమానం కలగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచి్చంది. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.