‘బ్లాక్’బలి | black balli | Sakshi
Sakshi News home page

‘బ్లాక్’బలి

Published Fri, Jul 10 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

black balli

 ‘రిలీజ్ రోజు సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా..’ సగటు తెలుగు ప్రేక్షకుడి మనసులో మాట ఇది. ఆ కిక్కు కావాలంటే ముందు టికెట్ దొరకాలి..! అదంత ఈజీ ఏం కాదు.. సాహసం సేయాలి మరి...! అయినా రెడీ., అదే అభిమానం అంటే..! ఈ క్రేజ్‌నే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.  సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక చిత్రంగా‘బాహుబలి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 ఈ సినిమా టికెట్ల కోసం అభిమానుల ఎదురుచూపులు ఫలించలేదు. యాభై శాతం టికెట్లు బ్లాక్‌కు తరలడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు.
 
 నగరంపాలెం(గుంటూరు) :  జిల్లావ్యాప్తంగా ‘బాహుబలి’ సందడి నెలకొంది. గుంటూరు నగరంలో శుక్రవారం 16 థియేటర్లలో ఈ చి త్రాన్ని ప్రదర్శించనున్నారు. ఇం దుకు గురువారం ఉదయం 8.30 గంటలకు పోలీసుల పర్యవేక్షణలో అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఇచ్చారు. అయితే 11 గంటటకే 4 ఆటలు, అన్ని క్లాసుల టికె ట్లు అయిపోయినట్లు బోర్డుపెట్టారు. తెల్లవారుజాము నుంచి టికెట్ కోసం క్యూలో నిలుచున్న వారికి ఒక్కో టికెట్ అందింది.
 
  క్యూలైన్‌ల్లో ఉన్నవారికి 40 శాతం అందించి, మిగిలినవి సిఫార్సులు, అధిక ధరలకు అమ్మకానికి యాజమాన్యాలు సిద్ధమయినట్లు సమాచారం. అధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల పంపిణీ బాధ్యత స్థానిక సీఐలకు అప్పగించనట్లు తెలుస్తోంది. తొలుత ఈ బాధ్యతను తీసుకోడానికి సీఐ అంగీకరించకపోవడం.. తర్వాత మంత్రి ఆదేశాల మేరకు ఆ పనిని చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. సినిమా సంబంధించి పెట్టిన పెట్టుబడి సాధ్యమైనంత మొదటి రోజే సంపాదించేందుకు అనధికార బెనిఫిట్ షో లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
 
 ఆన్‌లైన్‌లోనూ అందని టికెట్లు.. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తూ థియేటర్ల యజమానులు రకరకాల పద్ధతులు అవలంబిస్తుంటే.. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్ దొరక డం లేదు. గుంటూరు నగరంలో పది థియేటర్లకు టికెట్ దాదాగా పేరున్న జస్ట్ టికెట్స్ సైట్‌లో ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. సినిమాతో సంబంధం లేకుండా ఈ థియేటర్లలో బుకింగ్ చేసుకోవచ్చు.  మంగళవారం సాయంత్రానికి ఆరు థియేటర్లలో 14వ తేదీ వరకు పూర్తి బుకింగ్‌తో కనిపిసుతన్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టికెట్ల కోసం కంప్యూటర్ల ముందు కూర్చున్నా ఫలితం లేదని అభిమానులు వాపోతున్నారు. ఆన్‌లైన్ సేవలు కలెక్షన్ లేని సినిమాలకే తప్ప క్రేజ్ ఉన్న సినిమాకు కాదని అభిప్రాయపడుతున్నారు.
 
 దళారులను ఏర్పాటు చేసి..
 మాచర్లటౌన్ :  బాహుబలి చిత్రానికి వచ్చిన క్రేజ్‌ను సినిమా థియేటర్ క్యాష్ చేసుకుంటున్నారు. పట్టణంలోని రెండు థియేటర్లలో పోటాపోటీగా టికెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బాల్కనీ, కుర్చీ, బెంచీలతో సంబంధం లేకుండా అన్ని తరగతుల టికెట్ ధర రూ.200గా నిర్ణయించి ముందుగానే టికెట్లను అమ్ముకున్నారు. వీరు విక్రయించే టికెట్లపై ఎక్కడా ధరను ప్రచురించటం లేదు. రెండు థియేటర్ల నిర్వాహకులు సిండికేట్ అయి సగం టికెట్లు మిగిల్చి వాటిని అమ్మేందుకు కొంతమంది దళారులను నియమించినట్లు తెలిసింది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement