
15న నింగిలోకి 104 ఉపగ్రహాలు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ప్రయోగాన్ని ఈనెల 15న ఉదయం 9.32 నిమిషాలకు నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు.
పీఎస్ఎల్వీ సీ37 ప్రయోగానికి సన్నద్ధమవుతున్న ఇస్రో
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ప్రయోగాన్ని ఈనెల 15న ఉదయం 9.32 నిమిషాలకు నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. ఈ రాకెట్ ద్వారా దేశ విదేశాలకు చెందిన 104 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్ట నున్నారు. స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలన్నీ శనివారం నాటికి షార్కు చేరుకున్నాయి. ప్రస్తుతం షార్లోని క్లీన్రూంలో ఉపగ్రహాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షలను పూర్తి చేసి ఈనెల 9న ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చే ప్రక్రియ చేపడతారు. 10, 11 తేదీలలో రాకెట్కు తుది విడత తనిఖీలు నిర్వహించిన అనంతరం 12న మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించి ప్రయోగతేదీని, సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఎంఆర్ఆర్ కమిటీ రాకెట్ను ప్రయోగానికి సిద్ధం చేసి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగిస్తుంది. ఈ బోర్డు ఛైర్మన్ పి. కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో ప్రయోగానికి 36 గంటల ముందు కౌంట్డౌన్ నిర్వహిస్తారు.